తెలంగాణకు పుష్కర పాట్లు..
posted on Jul 14, 2015 @ 11:49AM
ఆంధ్రరాష్ట్రంలోనూ.. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ గోదావరి మహా పుష్కరాలు మొదలయ్యాయి. ఆంధ్రరాష్ట్రంలో ఈ పుష్కరాలకు ఎలాంటి నీటి కొరత లేదు కానీ పాపం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నీటి కష్టాలు వచ్చిపడ్డాయి. గోదావరి మహా పుష్కరాలలో స్నానం చేద్దామంటే భక్తులకు నిరాశేమిగిలింది. తెలంగాణలో కొన్ని చోట్ల గోదావరి జలాలు ఉన్నా.. కొన్ని చోట్ల మాత్రం నీళ్లు లేక నేల ఎండిపోయి ఉండటం గమనార్హం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసరలోనూ, గోదావరి, మంజీర, హంద్రీ నదుల త్రివేణీ సంగమస్థలి అయిన నిజామాబాద్ జిల్లా కుందకుర్తిలోనూ గోదావరి నీరు లేక బోసిపోయి కనిపిస్తోంది.
మరోవైపు సీఎం కేసీఆర్ పుష్కరాలు సమయం కాబట్టి వాటికోసమైనా నీటిని విడుదల చేయాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ను కోరారు. ఇదే విషయం పై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా ఫడ్నవిస్ కు చెప్పరు కానీ.. నీరు వదలాల్సిన చోట తగినంత నీరు నిల్వ లేదని అందువల్ల తాము ఏమీ చేయలేని పరిస్థితి ఉన్నదని.. నీటిని విడుదల చేయలేమని చెప్పారు. ఒకవేళ పుష్కరాలు పూర్తయ్యే లోపు తగిన నిల్వ లభిస్తే జలాలను విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో తెలంగాణ ప్రభత్వానికి ఏం చేయాలో తెలియక ప్రత్యేకంగా ఘాట్ లు.. షవర్లు ఏర్పాటు చేసి భక్తులు స్నానం చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ పరిధిలోని చిన్న రిజర్వాయర్లలో ఉన్న కొద్దిపాటి నీటినే రాష్ట్ర ప్రభుత్వం పుష్కరఘాట్లకు మళ్లిస్తోంది. ఈ పుష్కరాల కోసం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి ప్రతి రోజూ 3 వేల క్యూసెక్కుల చొప్పున పుష్కరాలు పూర్తయ్యేంత వరకు మొత్తం 6 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. అలాగే కడెం ప్రాజెక్టు నుంచి, ఎల్లంపల్లి నుంచీ నీటిని విడుదల చేయనున్నారు.