గుజరాత్ లో టెర్రర్ అలర్ట్ : రంగంలోకి దిగిన గార్డ్స్

గుజరాత్ లో టెర్రర్ ఎలర్ట్ ప్రకటించారు. జైషే మహ్మద్, లష్కర్ తోయిబా సంస్థలకు సంబంధించిన ఉగ్రవాదులు పదిమంది మిలిటెంట్లు, రాష్ట్రంలోకి ప్రవేశించినట్టు ఇంటిలెజన్స్ హెచ్చరించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సెక్యూరిటీని భారీగా పెంచారు. ముఖ్యంగా సముద్రతీరప్రాంతమంతా కోస్టల్ గార్డ్స్ గస్తీ తిరుగుతున్నారు. కుచ్ తీరం వద్ద గత మూడు నెలల్లో ఐదు పడవలు వదిలేసి వెళ్లడంతో అనుమానం బలపడింది.   పాకిస్థాన్ సెక్యూరిటీ అడ్వైజర్ నాసిర్ జంజువా 10 మంది గుజరాత్ లోకి ప్రవేశించారని కన్ఫామ్ చేశారు. ఈ నేపథ్యంలో గుజరాత్ అడిషనల్ సిఎస్ శనివారం, త్రివిధ దళాల అధిపతులతో భేటీ అయ్యారు. గుజరాత్ లో సోమ్ నాథ్ ఆలయం, ద్వారకేశ్వర ఆలయం, అక్షర్ థాం, సర్దార్ సరోవర్ డ్యాం లాంటి కీలక ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేశారు. పోలీసులు బస్ట్ స్టాప్ లు, రైల్వే స్టేషన్లను జల్లెడ పడుతున్నారు. అనుమానం వచ్చిన వారందరినీ చెకింగ్ చేస్తున్నారు. శివరాత్రి రోజున దేశంలో విధ్వంసానికి, ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నాయి.

మంత్రి గారి కొడుకు కుక్కపిల్ల కోసం వెళ్లాడా..?

ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ తనయుడు రావెల సుశీల్ పై పోలీసులు నిర్భయ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా దీనిపై తన ఫేస్ బుక్ లో సుశీల్ వివరణ ఇచ్చారు. తాను ఏ తప్పూ చేయలేదని, కేవలం కుక్కపిల్లను కాపాడే ప్రయత్నం చేశానని, ఆ మహిళ అడ్డొచ్చి స్థానికులతో కలిసి తనపై దాడి చేసిందని, ఇదంతా కేవలం రాజకీయమేనంటూ ఆరోపించారు.   కానీ సంఘటనా స్థలం దగ్గర ఒక షాపుకు సంబంధించిన సీసీ క్యామ్ ఫుటేజ్ లో చూస్తే, అక్కడ ఎలాంటి కుక్కపిల్లా లేదు. పైగా, కారు స్లో అవడం, కారును చూసి మహిళ వేగంగా నడిచివెళ్లిపోవడం మాత్రమే సీసీ ఫుటేజ్ లో ఉంది. న్యూస్ ఛానళ్లలో ప్రసారమైన ఈ ఫుటేజ్ కు, సుశీల్ తన ఫేస్ బుక్ లో చెబుతున్న దానికి పొంతన లేదు. ఫుటేజ్ ను ఆధారంగా తీసుకుని పోలీసులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. మరో వైపు నిందితుణ్ని శిక్షించాలంటూ మహిళా సంఘాలు పట్టుబడుతున్నాయి.

దిల్లీ పోలీసుకు ఇక నుంచి పెళ్లిరోజు సెలవులు

పోలీసు ఉద్యోగమంటేనే తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. దానికి తోడు ఎప్పుడు మొదలవుతాయో, ఇంకెప్పుడు పూర్తవుతాయో తెలియని పనివేళలు ఉంటాయి. ఒకోసారి రోజుకి 18గంటల పాటు డ్యూటీలో ఉండాల్సి వస్తుంది. దానివల్ల సమాజానికి రక్షణని అందించే పోలీసులకే ప్రశాంతత లోపించే సందర్భాలు ఏర్పడుతున్నాయి. అలాంటప్పుడు వారు మానసికంగా కుంగిపోవడం, ఉన్నతాధికారుల మీద సైతం తిరగబడటం సాధారణమైపోతోంది.   దీనికి దిల్లీ పోలీసు ఉన్నతాధికారులు ఒక ఉపాయాన్ని ఆలోచించారు. దిల్లీ పోలీసులు తమ పెళ్లిరోజునాడు, పిల్లల పుట్టినరోజునాడు సెలవు తీసుకోవచ్చని ఉత్తర్వు జారీ చేశారు. మరీ అత్యవసరం అయితే తప్ప ఈ వెసులుబాటుకి అభ్యంతరం చెప్పకూడని నిబంధన పెట్టారు. దీనివల్ల 70,000కి పైగా ఉన్న దిల్లీ పోలీసులు తమకి ఇష్టమైన రోజున తమ మనసుకి దగ్గరైన కుటుంబసభ్యులతో గడపవచ్చునన్నమాట. అయితే ఈ ఆలోచన దిల్లీ పోలీసులదే అనుకుంటే పొరపాటే! మహారాష్ట్ర ప్రభుత్వం 2014 సంవత్సరం నుంచే ఇలాంటి పద్ధతిని అమలు చేస్తోంది.  

ధోనీ తల నరికిన పోస్టర్లు!

రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్‌ జరిగే ముందు, మాటల యుద్ధం సాధారణమే! కానీ భారత్‌-బంగ్లాదేశ్‌ల మధ్య ఆసియాకప్‌ ఫైనల్ జరగనున్న నేపథ్యంలో వచ్చిన ఒక పోస్టరు పెను వివాదాన్నే రాజేస్తోంది. టాస్కిన్‌ అహ్మద్‌ అనే బంగ్లా ఫాస్ట్‌ బౌలరు, ధోనీ తలను నరికి చేత్తో పట్టుకున్న ఈ పోస్టరు సోషల్‌ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. భారత్‌ క్రికెట్‌ అభిమానులంతా ఈ చిత్రాన్ని చూసి అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నారు. అయితే ఇలాంటి పోస్టర్లను సృష్టించడం బంగ్లా క్రికెట్‌ అభిమానులకు కొత్తేమీ కాదు. 2015లో ఆ దేశ బౌలర్ ముస్తాఫిజుర్‌, భారతీయ బ్యాట్స్‌మెన్లను ఇబ్బందిపెట్టిన సందర్భంగా ఒక బంగ్లా పత్రిక, భారతీయ బ్యాట్స్‌మెన్‌ అందరికీ ముస్తాఫిజుర్‌ అరగుండు కొట్టినట్లుగా ఓ చిత్రాన్ని రూపొందించింది. క్రికెట్లో బంగ్లాదేశ్‌, భారత్ జట్ల మధ్య ఉన్న వివాదం ఈనాటిది కాదు. 2015 ప్రపంచ కప్ సందర్భంగా క్వార్టర్‌ ఫైనల్స్ ఆడుతున్నప్పుడే ఈ వైరానికి బీజం పడింది. ఆ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ ఔటైనా కూడా అంపైర్‌ అతణ్ని నాటౌట్‌గా ప్రకటించాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ శతకాన్ని సాధించి ఇండియాని గెలిపించాడు. అదిగో! అప్పటి నుంచి... బంగ్లా క్రికెట్‌ అభిమానులు ఇండియా అంటేనే విరుచుకుపడిపోతున్నారు. ఒకోసారి ఆ ఆవేశం హద్దులను, సభ్యతను కూడా దాటుతున్నట్లుంది!

రెండేళ్ల పాప పోలీసులకి ఫోన్‌ చేసింది... ఎందుకంటే...

అమెరికాలోని గ్రీన్‌విల్లే అనే ప్రాంతం. అక్కడ మొన్న బుధవారం పోలీసులకి ఒక ఫోన్‌ వచ్చింది. తీరా చూస్తే అవతలివైపు ఎవరో చిన్న పాప మాట్లాడుతోంది. ఇంతకీ ఆ పాపకి వచ్చిన అవసరం ఏంటనుకుంటున్నారా... తనకి ప్యాంట్ వేసుకోవడం చేతకావడం లేదనీ, వచ్చిన కాస్త ప్యాంట్ వేసిపెట్టమని ఫోన్‌ చేసిందట. అసలు విషయం ఏంటో కనుక్కుందామని బయల్దేరిన ‘మార్తా లోన్స్’ అనే మహిళా అధికారి, సదరు ఇంటిని చేరుకునేసరికి ఓ రెండేళ్ల పాప కనిపించింది. తను ఓ ప్యాంటు వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాననీ, కానీ చేతకావడం లేదనీ కాస్త సాయం చేయమనీ అడిగిందట ఆలియా అనే ఆ పాప. ప్యాంట్ వేసుకోవడం కూడా చేతకాని పిల్లలు సైతం పోలీసులకు ఫోన్ చేయగలుగుతున్నారంటే... వాళ్లు ఎంత చురుకుగా తయారవుతున్నారో చెప్పేదేముంది! ఆ సాయంత్రం పని నుంచి ఇంటికి తిరిగివచ్చిన ఆలియా వాళ్లమ్మ, పాప చేసిన ఘనకార్యం విని తెగ మురిసిపోయిందట. ‘ఇంకా మా పాప మున్ముందు ఏం చేస్తుందో చూడాలి’ అంటూ ఎదురుచూస్తోంది ఆలియా వాళ్లమ్మ!

వాడేసిన ఫోన్లను ఇండియాలో అమ్ముతాం : ఆపిల్ సంస్థ

బయటి దేశాల్లో వాడేసిన యాపిల్ ఫోన్లను ఇండియాలో అమ్మడానికి పర్మిషన్ ఇవ్వాలంటూ భారత ప్రభుత్వాన్ని కోరుతోంది యాపిల్ సంస్థ. ఇక్కడి జనాలకు సెకండ్ హ్యాండ్ ఫోన్లు అమ్మడం ద్వారా, భారత్ లో తమ మార్కెట్ ను మరింత విస్తృతపరుకోవాలని యాపిల్ భావిస్తోంది. ఐఫోన్ ఖరీదు చాలా ఎక్కువ కావడంతో, చాలా మంది భారతీయులు ఎక్కువగా సెకండ్ హ్యాండ్ ఐఫోన్లకే మొగ్గు చూపుతున్నారు. దీన్నే తమకు అనుకూలంగా మార్చుకోవాలనేది యాపిల్ ప్లాన్. టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్, రాజ్యసభకు లిఖిత పూర్వకంగా దీన్ని తెలిపారు. అయితే ప్రభుత్వం, ఈ విషయం మీద ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు.

కన్నయా నాలుక తెగ్గోస్తే 5 లక్షలు...ఓ యువనేత ప్రకటన!

  ఉత్తర్‌ప్రదేశ్‌లోని భాజపాకు చెందిన ఓ యువనేత చేసిన ప్రకటన ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ రాష్ట్రంలోని బదావ్ జిల్లాకు చెందిన కుల్‌దీప్‌ అనే నాయకుడు, కన్నయాకుమార్‌ నాలుకను తెగ్గోస్తే 5 లక్షలు బహుమతిగా ఇస్తానంటూ ప్రకటించేశాడు. కన్నయాకుమార్‌ జైలు నుంచి వచ్చిన దగ్గర్నుంచీ కూడా భాజపాకు, మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడనీ అందుకని అతనికి తగిన శిక్ష విధించాలంటూ కుల్‌దీప్‌ ఈ ప్రకటన చేశాడు. కుల్‌దీప్‌ ప్రకటన వివాదాస్పదం కావడంతో భాజపా అతణ్ని ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. కన్నయాకుమార్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో తీవ్రవాది అఫ్జల్‌గురుకి అనుకూలంగా ఒక సమావేశాన్ని నిర్వహించిని విషయం తెలిసిందే! ప్రస్తుతం కన్నయాకుమార్‌ దేశద్రోహం కేసులో విచారణను ఎదుర్కొంటున్నాడు.

మంత్రి కుమారుడి మీద నిర్భయ చట్టం

  అసలే మంత్రి కుమారుడు, ఆపై తాగి ఉన్నాడు. దారిన పోతూ ఉన్న ఒక మహిళ మీద అసభ్యంగా ప్రవర్తించాడు. ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్‌బాబు కుమారుడు సుశీల్‌పై నిన్న వచ్చిన ఈ ఆరోపణతో రాజకీయ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రి కుమారుడు కావడంతో ఈ వివాదం మరింత రాజుకుంది. తెలంగాణకు చెందిన నేతలు స్వయంగా రంగంలోకి దిగి సుశీల్‌ మీద చర్యలు తీసుకోవాలంటూ పోలీసుల మీద ఒత్తిడిని తీసుకువచ్చారు. దాంతో సుశీల్ మీద నిర్భయ చట్టం కింద కేసు నమోదయ్యింది. ప్రస్తుతం పరారీలో ఉన్న సుశీల్‌ మాత్రం, తాను ఎలాంటి అఘాయిత్యానికీ పాల్పడలేదనీ, చిన్నపాటి గొడవను పెద్దది చేస్తున్నారంటూ తన ఫేస్‌బుక్‌లో వివరణ ఇచ్చుకున్నాడు. ఒక రాష్ట్ర మంత్రి కుమారుడి మీద నిర్భయం చట్టం కింద కేసు నమోదు కావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ కేసులో సుశీల్‌ కనుక దోషిగా తేలితే ఏడు సంవత్సరాల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయ నేతలు గారాల బిడ్డలు ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం కొత్త కాదు. కానీ ప్రతిసారీ ఏదో ఒక వివరణలతో వారు తప్పించుకుపోయేవారు. కానీ ఈసారి పరిస్థితి ఏమంత అనుకూలంగా ఉన్నట్లు కనిపించడం లేదు. మరి ఈ విషయంలో రావెల ఎలా స్పందిస్తారో వేచి చూడాలి! కానీ ఇలాంటి ఘటనల వల్ల ప్రజల్లో మాత్రం రాజకీయ యువ నేతల పట్ల మరింత విముఖత ఏర్పడే అవకాశం ఉంది.

సెక్యూరిటీ గార్డే చంపడం మొదలుపెడితే....

  అది ముంబైలోని ఒక గృహ సముదాయం! ఆ సముదాయంలో ఓ ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏజన్సీ రక్షణ బాధ్యతలను నిర్వహిస్తోంది. సదరు సెక్యూరిటీ ఏజన్సీ తరఫున రఫీక్‌ చౌదరీ అనే వ్యక్తి పనిచేస్తూ ఉండేవాడు. కొద్దిరోజుల క్రితం సదరు గృహ సముదాయం ఒక సమావేశాన్ని నిర్వహించి, ఇకమీదట తమకు ప్రైవేటు సెక్యూరిటీ ఏజన్సీ అవసరం లేదనీ తేల్చిచెప్పింది. మరికొద్ది రోజులలో రఫీక్‌ చౌదరీని పని నుంచి తీసేయాల్సిందిగా కూడా నిర్ణయించుకుంది. దీంతో రఫీక్ మనసులోకి ఒక భయంకరమైన ఆలోచన వచ్చింది. ‘అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉండంటం వల్లే కదా, సెక్యూరిటీ ఏజన్సీని పీకిపారేస్తోంది! ఒకవేళ అక్కడ ఏదన్నా హత్య జరిగితే, జనం తిరిగి రక్షణ కోసం తమని నియమించుకుంటారు కదా!’ అనుకున్నాడు. అంతే! అదను చూసి ముంతాజ్‌ అనే వృద్ధురాలిని చంపిపారేశాడు. గృహసముదాయంలో ఎక్కడెక్కడ సీసీ టీవీ కెమెరాలు ఉంటాయో రఫీక్‌కు తెలుసు కాబట్టి, చాలా జాగ్రత్తగా తన పనిని కానిచ్చేశాడు. ఈ కేసుని విచారించే పోలీసులు అతడిని ప్రశ్నించిన ప్రతిసారీ, ఏవో పొంతన లేని జవాబులు చెప్పడంతో, అధికారులకు రఫీక్‌ మీద అనుమానం వచ్చింది. తమదైన శైలిలో వారు ‘గట్టిగా’ ప్రశ్నించడంతో అతను నేరాన్ని ఒప్పుకోక తప్పలేదు!

భోపాల్- అక్కడి ఇళ్లు పేలిపోతున్నాయి

  భోపాల్‌లోని దమోహ్‌ జిల్లాలో నిన్న ఒక ఇల్లు పేలిపోయిన సంఘటనలో ఓ వృద్ధురాలు మరణించగా, ఆ ఇంట్లో నివసిస్తున్న జంట తీవ్రంగా గాయపడింది. ఇంట్లో ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ పేలడం వల్ల ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని అధికారులు మొదట అనుమానించారు. కానీ ప్రమాదానికి అసలు కారణం తెలిసేసరికి వారికి దిమ్మ తిరిగిపోయింది. పేలుడు సంభవించిన ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు సహజమేననీ, నీటి కోసం తవ్విన బోర్ల నుంచి విషపూరిత వాయువులు నీళ్ల పైపుల్లోకి ప్రవేశించి, తరచూ ఇలాంటి పేలుళ్లు సంభవిస్తూ ఉంటాయని స్థానికులు చెప్పడంతో అధికారులు బిత్తరపోయారు. అధికారుల పిలుపుతో అక్కడికి చేరుకున్న భూగర్భ శాస్త్రవేత్తలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. శాస్త్రవేత్తల మాటల ప్రకారం మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో ఉండే నేల కాస్త విభిన్నమైనది. ఇక్కడి భూగర్భంలో రెండురకాల భూమి పలకలు ఉన్నాయి. ఆ రెండు రకాల పలకల మధ్యకీ బోరు వేసినప్పడు, వాటి మధ్య ఉన్న వాయువులు బయటకు వెలువడుతుంటాయి. అవే ఈ పేలుళ్లకి కారణమవుతుంటాయి! ఎడాపెడా బోర్లని వేసేయడం, వాటి నుంచి నీటి పైపులను నేరుగా ఇళ్లలోకి మళ్లించడం చేసినన్నాళ్లూ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

మోదీకి ‘రాహుల్ ఫోబియా’ పట్టుకుంది- కాంగ్రెస్‌

  కొంతమందికి ఎంత వయసు వచ్చినా వారి బుద్ధి వికసించదనీ, అలాంటివారు బాదం పప్పులు తిన్నా ఉపయోగం ఉండదనీ.... రాహుల్‌ గాంధిని మోదీ పార్లమెంటులో పరోక్షంగా ఏకేసిన విషయం తెలిసిందే! అంతకుముందు రాహుల్‌ తనని వ్యక్తిగతంగా విమర్శించినందుకు మోదీ ఇలా ఘాటుగా సమాధానం చెప్పారు. కానీ మోదీ మాటలు కాంగ్రెస్‌ పెద్దలను బాగానే నొప్పించినట్లున్నాయి. అందుకనే ఆ పార్టీ ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వీ మాట్లాడుతూ, మోదీ వ్యక్తిగత దూషణలకు దిగారని విమర్శించారు. 70 ఏళ్ల పార్లమెంటు చరిత్రలో ఎవరూ ఇలాంటి ఉపన్యాసం ఇచ్చి ఉండరని వాపోయారు. మోదీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారనీ, ఆయనకు రాహుల్‌ ఫోబియా అనే జబ్బు పట్టుకుందనీ విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధి అడిగిన ప్రశ్నలకు తట్టుకోలేక, మోదీ ఇలాంటి విమర్శలు చేశారన్నది అభిషేక్ ఆవేదన. రాహుల్‌గాంధికి వీరవిధేయులైన కాంగ్రెస్‌ నేతలు ఇంకెన్ని మాటల తూటాలు పేలుస్తారో చూడాలి మరి!

ముందు జాగ్రత్తలో ఉత్తర కొరియా.. సిద్దంగా అణ్వాయుధాలు

తాము బలహీనులమని ప్రత్యర్ధులకు తెలియకుండా ఉండాలంటే.. తాము బలమైన వాళ్లమని నిరూపించుకోవాల్సి వస్తుంది. అప్పుడే అవతలి వ్యక్తి మనపై దాడి చేయడానికి ఆలోచిస్తాడు. ఇప్పుడు ఉత్తర కొరియా పరిస్థితి చూస్తుంటే అలానే అనిపిస్తుంది. శత్రుదేశాల నుండి తమను కాపాడుకోవాడానికి ముదు జాగ్రత్తగా అణ్వాయుధాలను సిద్దంగా ఉంచుకోవాలని చూస్తుంది. దీనికి సంబంధించి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనికి ఐక్యరాజ్యసమితి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలోనే ఆణ్వాయుధాలు తయారు చేసి ప్రయోగించిన నేపథ్యంలో ఐకాస ఆభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పుడు మరోసారి కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాలతో కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉత్తర కొరియా నూతనంగా తయారు చేసిన రాకెట్ లాంచర్ ను పర్యవేక్షించిన సందర్బంగా..  అణ్వాయుధాల సంఖ్యను, నాణ్యతను పెంచాలని, ఇది దేశ రక్షణకు అత్యవసరం అని కిమ్ జోంగ్ చెప్పారు. అయితే ఈవిషయంపై అమెరికా రక్షణ శాఖ అధికారి బిల్ అర్బన్ స్పందించి.. ఉద్రిక్త పరిస్థితులలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటానికి బదులుగా అంతర్జాతీయ ఒప్పందాలు, బాధ్యతలకు కట్టుబడి ఉండాలని కోరారు.

బాలకృష్ణ కోరిక తీర్చిన కేసీఆర్..

  నందమూరి బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి ఉన్న కొన్ని సమస్యల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కలిసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అలా విన్నపాలు చేశారో లేదో.. కేసీఆర్ వెంటనే ఆయన కోరికను తీర్చేశారు. దీనిలో భాగంగానే ఆ ఆస్పత్రి నిర్మాణాల్లో బీపీఎస్‌ కింద విధించవలసి ఉన్న 5.73 కోట్ల రూపాయలను మినహాయించేస్తూ ఉత్తర్వులు ఇచ్చేశారు. కాగా ఆ ఆస్పత్రిలో ఇటీవలి కాలంలో సరైన అనుమతులు లేకుండా నిర్మాణాలు, కొత్తబ్లాకులు చేసేశారు. వాటిని రెగ్యులరైజ్‌ చేయడం గురించి కొన్ని నెలల కిందట బాలకృష్ణ ప్రత్యేకంగా వెళ్లి కేసీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో కేశినేని కూతురు

  అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల్లో డెమోక్రాట్ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్.. రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్‌లు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సూపర్ ట్యూజ్ డే ప్రైమరీల్లో వారిద్దరూ తమ తమ పార్లీల్లో భారీ విజయాలు సాధించారు. అధ్యక్ష పదవి అభ్యర్ధిత్వానికి పార్టీ నామినేషన్లు పొందేందుకు తమ తమ పార్టీల్లో ప్రత్యర్ధుల కన్నా చాలా ముందుకు దూసుకొచ్చారు. అయితే ఇప్పుడు హిల్లరీ క్లింటన్ తరుపున ప్రచార బాధ్యతలు చూసుకునే అవకాశం ఓ తెలుగు అమ్మాయికి దక్కడం విశేషం. అది కూడా విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ కూతురు శ్వేత. ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ ప్రచార బాధ్యతలు నిర్వహించే బృందంలో శ్వేతను చేర్చుకున్నారు హిల్లరీ క్లింటన్. కేశినేని శ్వేత అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో విజయవాడలో నాని తరపున శ్వేత ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.

తండ్రితో కలిసి కిడ్నాప్‌ డ్రామా ఆడిన యువతి

  స్నాప్‌డీల్ సంస్థలో పనిచేసే దీప్తి అనే యువతి, గత నెల ఒక కిడ్నాప్‌ ప్రమాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే! చివరకు దీప్తిని పీకల్లోతు ప్రేమించిన వ్యక్తే ఆమెను కిడ్నాప్‌ చేయడానికి ప్రయత్నించాడని తెలియడంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. ఈ సంఘటనను మరువక ముందే, నోయ్‌డాకు చెందిన శిప్రా మలిక్‌ అనే 29 ఏళ్ల ఫ్యాషన్‌ డిజైనర్‌ కిడ్నాప్ అయిన వార్త సంచలనం సృష్టిస్తోంది . ఈ సోమవారం నుంచి కనిపించకుండా పోయిన శిప్రా నిన్న గుర్‌గావ్ వద్ద క్షేమంగా దొరికింది. ఒక ముగ్గురు వ్యక్తులు తనను నోయ్‌డాలో కిడ్నాప్ చేశారనీ, నాలుగు రోజుల తరువాత వారు గుర్‌గావ్‌ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయాననీ ఆమె చెబుతోంది. కానీ పోలీసులు శిప్రాను విచారించిన ప్రతిసారీ ఒకోరకంగా మాట్లాడుతూ ఉండటంతో, శిప్రా చెబుతున్న విషయాలు ఎంతవరకు నిజమో అని పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో శిప్రాని కిడ్నాప్ చేశారని చెప్పిన సమయం దగ్గరనుంచి ఆమె కదలికలను విచారించిన పోలీసులకు, శిప్రా చెబుతున్నదంతా అబద్ధం అని తేలిపోయింది. శిప్రాను మరోసారి కటువుగా విచారించడంతో తను పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయి ఉన్నాననీ, వాటి నుంచి బయటపడేందుకు ఈ కిడ్నాప్‌ నాటకం ఆడేందుకు ప్రయత్నించాననీ ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ నాలుగు రోజులూ రాజస్థాన్‌లోని ఒక ఆశ్రమంలో తలదాచుకున్నట్లుగా కూడా శిప్రా చెప్పుకొచ్చిందట. శిప్రా ఆడిన ఈ కిడ్నాప్‌ నాటకంలో ఆమె సోదరుడు, తండ్రి కూడా పాలుపంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శిప్రా కనిపించకుండా పోవడాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకోవడంతో, ఆమె తన నాటకాన్ని చాలించి తిరిగి వచ్చేసి ఉంటుందని భావిస్తున్నారు.

ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. మే 19 కౌంటింగ్

  కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ నసీం జైదీ ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేశారు.  పశ్చిమ్‌బంగాలే, తమిళనాడు, కేరళ, అస్సాం మరియు పుదుచ్చేరికి ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదలైంది. అసోంలో 126, తమిళనాడులో 234, బంగాల్‌లో 294, పుదుచ్చేరిలో 30శాసనసభా స్థానాలకు ఎన్నికల నిర్వహించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్‌ అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. మొత్తం 5 రాష్ట్రాల్లో 1070 మిలియన్ల ఓటర్లు ఉన్నట్లు తెలిపారు.   అస్సాం అస్సాంలో రెండు దశల్లో ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 4 న మొదటి దశ ఏప్రిల్ 11న రెండో దశ   పశ్చిమ్‌బంగాల్ పశ్చిమ్‌బంగాల్ లో 6దశల్లో ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 4, 11న మొదటి దశ, 17 న రెండో దశ, 21 న మూడో దశ, 23 నాలుగు, 30 ఐదు, మే 5న అఖరి దశ తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో మే 16న పోలింగ్ ఐదు రాష్ట్రాల్లో మే 19 న ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది.

77 ఏళ్ల వయస్సులో పది పరీక్షలు.. 47వసారి

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 77 ఏళ్ల నుండి పదో తరగతి పాసవడానికి ప్రయత్నిస్తున్నాడు ఓ వ్యక్తి. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా అది నిజం. ఈ విచిత్రమైన ఘటన రాజస్థాన్ లో జరిగింది. రాజస్థాన్ లోని శివరాజన్ అనే వ్యక్తి 1968లో మొదటిసారి పదో తరగతి పరీక్షలు రాశాడు. అయితే ఆ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. అలా అప్పటినుండి ఇప్పటి వరకూ రాస్తూనే ఉన్నాడు. కానీ రాసిన ప్రతి సంవత్సరం ఏదో ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పదో తరగతి పాసయ్యేంతవరకు పెళ్లి చేసుకోనని పట్టుబట్టాడు. ఇప్పుడు అతనికి 77 ఏళ్లు. ఒంటరిగా ఉంటూ.. ప్రభుత్వం తరఫున వచ్చే పింఛను, గుడిలో పెట్టే ప్రసాదంతో బతికేస్తున్నాడు.. ఈ 77 ఏళ్లలో 46 సార్లు పరీక్షరాశాడు..ఇప్పుడు 47వ సారి పరీక్ష రాయడానికి సిద్దపడుతున్నాడు. దీనికోసం ప్రత్యేకంగా ట్యూషన్‌ కూడా పెట్టించుకున్నాడట. మరి ఇప్పుడైనా తను పరీక్ష పాసవాలని కోరుకుందాం..