సుష్మా స్వరాజ్ పై పొగడ్తల వర్షం కురిపించిన విపక్షాలు..

  పార్లమెంట్ సమావేశాల్లో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా సమావేశాల్లో అధికార పక్షాలు.. విపక్షాల మధ్య గొడవలు జరుగుతుంటాయి. అందునా ఇక ఆప్ బీజేపీ సంగతైతే చెప్పనవసరం లేదు.. నిప్పూ, ఉప్పులా ఉండే ఈ రెండు పార్టీలు ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని ఎదురుచూస్తుంటాయి.. అలాంటిది ఇప్పుడు నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో అందుకు భిన్నంగా విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ పై విపక్షాలు పొగడ్తల వర్షం కురిపించారు. ఆప్ ఎంపీ భగవంత్ మాన్ సుష్మా గురించి మాట్లాడుతూ.. మన దేశ ప్రజలు విదేశాల్లో ఇబ్బందులు పడ్డ వేళ.. సుష్మా చూపిన చొరవ అభినందనీయం అంటూ.. తమ నియోజక వర్గానికి చెందిన 13 మంది సౌదీలో బానిసలుగా బతుకుతూ ఇబ్బందులు పడుతున్నారని సుష్మా దృష్టికి తీసుకెళ్లామని.. అందుకు ఆమె స్పందిచిన తీరు అద్భుతమని కొనియాడారు. ఆయన ఒక్కడే కాదు ఇంకా పలువురు ఎంపీలు కూడా సుష్మాపై పొగడ్తలు కురిపించారు. మరో ఎంపీ ధరమ్ వీర్ గాంధీ మాట్లాడుతూ..నేను మిమ్మల్నీ ఏ ప్రశ్నా అడగను.. మీకు కృతజ్ఞతలు చెప్పడానికి లేచా అని అన్నారు. బిజూ జనతా దళ్ నేత బైజయంత్ పాండా మాట్లాడుతూ.. ఓ మంత్రిగా ఆమె స్పందించే తీరు అత్యద్బుతమని అన్నారు. ఆర్జేడీ సభ్యుడు రాజేష్ రంజన్ కూడా మాట్లాడుతూ.. నేతలు ఇంగ్లీషులో ప్రశ్నలు వేసినా.. ఆమె మాత్రం హిందీలో సమాధానం చెప్పడం గొప్ప విషయమని చెప్పుకొచ్చారు. ఇక వీరందరి పొగడ్తలకు ఉబ్బితబ్బిబైన సుష్మా తనను అభినందించిన వారందరికి చేతులెత్తి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఏది ఏమైన ప్రతిపక్షనేతలతో పొగిడించుకోవడం ఎంతైనా గొప్ప విషయమే.

ముస్లిం చట్టాలపై న్యాయమూర్తి వివాదాస్పద వ్యాఖ్యలు

  ముస్లింలు అనుసరించే నిబంధనలు (షరియా) గురించి కేరళ హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు, అక్కడ పెనుదుమారాన్ని సృష్టిస్తున్నాయి. కమాల్‌ పాషా అనే సదరు న్యాయమూర్తి ఒక సమావేశంలో మాట్లాడుతూ... షరియాలోని అనేక అంశాలు స్త్రీల పట్ల పక్షపాతం కలిగి ఉన్నాయనీ, అందుకని దేశంలోని మిగతా ప్రజలందరి కోసం నియమించి ‘ఏకరీతి పౌర నిబంధన’ (యూనిఫాం సివిల్ కోడ్‌)ను వ్యతిరేకించడం మంచిది కాదని పేర్కొన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవడం లేదని పాషా వాపోయారు. కమాల్ పాషా వ్యాఖ్యలు కేరళలో సంచలనం సృష్టించాయి. కేరళలో ఉన్న ముస్లిం సంస్థలు అన్నీ కూడా ఏకతాటిన ఆయన వ్యాఖ్యలను ఖండించాయి. కమాల్‌ మాట్లాడిన మాటలు హిందూ అతివాద సంస్థల ప్రకటనల్లా ఉన్నాయని మండిపడుతున్నాయి. ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న కేరళలో, ఈ ప్రకటన మరింత వివాదాన్ని రాజేసే ప్రమాదం లేకపోలేదు.

ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ ప్రసంగం..

  తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ నరసింహన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆశలు ఆశయాలతో తెలంగాణ ఏర్పడింది.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుంది.. ప్రభుత్వ కార్యక్రమాలు జాతీయదృష్టిని ఆకర్షిస్తున్నాయని అన్నారు. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామి అన్నారు.. ఇంకా పలు అంశాల గురించి గవర్నర్ ప్రస్తావించారు అవి.. *  కాలేజీ విద్యార్ధులకు కూడా సన్న బియ్యం అమలు చేస్తాం *  వ్యవసాయం 0.8, పరిశ్రమలు 8.3 *  డబుల్ బెడ్ రూం పథకానికి భారీ కేటాయింపులు చేశాం *  మిషన్ ఇంద్రధనస్సులో దేశంలో తెలంగాణ అగ్రస్థానం.. మిషన్ బగీరథకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం *  స్వచ్చ భారత్ ను పెద్ద ఎత్తున చేపడతాం *  ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 11.7 శాతం అభివృద్ధి సాధిస్తాం *  ఈ ఏడాది నుండి బీసీలకు కల్యాణలక్ష్మీ పథకం అమలు చేస్తాం *  సేవారంగం 14.9 వృద్ధి సాధిస్తాం *  ములుగులో ఉద్యానవన యూనివర్శిటీ నెలకొల్పుతాం *  గోదావరి జలాల సమస్యను సామరస్యంగా పరిష్కరించాం..

పవన్ కళ్యాణ్, రామోజీరావు సీక్రెట్ మీటింగ్.. ఎందుకో..?

  సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మీడియా మొగల్ రామోజీరావుతో సీక్రెట్ గా మీటింగ్ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ భేటీపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న గబ్బర్ సింగ్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న నేపథ్యంలో పవన్ రామోజీరావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి.. తమ పార్టీకి సంబంధించిన విషయాల గురించి.. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నడుస్తున్న భూదందాపై చర్చించినట్టు తెలుస్తోంది.   కాగా 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. మార్చిలో ఆడియో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆడియో వేడుక అమరావతిలో జరిపే అవకాశం ఉంది. ఇక ఏప్రిల్‌ 8న 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు.

తెలంగాణ టీడీపీ.. ఆఖరికి మిగిలింది వీరే

  తెలంగాణ టీడీపీ దాదాపు ఖాళీ అయినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ పార్టీ నుండి మొత్తం 15 మంది ఎమ్మెల్యేలలో పదిమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి చేరారు. ఇప్పుడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు.. అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్‌ తెరాస గూటికి చేరారు. ఈ సందర్బంగా వారు స్పీకర్ కార్యలయానికి చేరి..తమను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలని స్పీకర్ కు లేఖ అందించారు. దీంతో ఇప్పటివరకూ 12 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కు లేఖలు అందించారు. ఇదిలా ఉండగా వీరి చేరికతో తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు పడిపోయింది. టీడీపీలో మిగిలిన ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర, ఆర్ కృష్ణయ్య.

భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వేదిక ఫిక్స్.. ఈడెన్ గార్డెన్స్ లోనే

  ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నమెంట్‌ భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఈనెల 19 న జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ జరగాల్సిన వేదిక గురించి మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ధర్మశాలలో జరగాల్సి ఉంది. అయితే ధర్మశాల నుండి వేరే ప్రాంతానికి మార్చాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్టు ఐసీసీని కోరింది. దీంతో ఇప్పుడు వేదిక మార్పుపై పలు ప్రాంతాలు పరిశీలించిన ఐసీపీ ఇప్పుడు ధర్మశాలకు బదులు కోల్‌కత్తాలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. భారత్-పాక్ మ్యాచ్ కోసం కోల్‌కత్తాతో పాటు మొహాలీ, బెంగుళూరు వేదికలను కూడా బీసీసీఐ పరిశీలించింది. కానీ ఆఖరికి కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లోనే మ్యాచ్ నిర్వహించాని నిర్ణయం తీసుకుంది.

ఉమెన్స్ డే రోజు న్యూడ్ ఫొటో.. కావాలనే..

హాలీవుడ్ టీవీ రియాల్టీ స్టార్ కిమ్ కర్దాషియన్ ఇటీవల న్యూడ్ సెల్పీ ఒకటి దిగి ట్విట్టర్లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో కిమ్ కావాలనే ఇలా చేసిందని.. నగ్నంగా దేహాన్ని చూపిస్తూ క్రేజ్ తెచ్చుకోవాలని ఇలాంటి ఫొటోలు తీసి పోస్ట్ చేస్తుందంటూ ఆమెపై పలువురు విమర్శనాస్త్రానాలు విసిరారు. ముఖ్యంగా బెట్‌ మిడ్లర్, క్లోహి మోరెట్జ్, పీర్స్ మోర్గాన్ తదితరులు కిమ్ పై విరుచుకుపడ్డారు. దీంతో ఆమె వాళ్ల విమర్శలకు రివర్స్ కౌంటర్ గా మరో న్యూడ్ ఫొటో తీసి దాన్ని ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేసి ప్రత్యర్థులకు సవాల్ విసిరింది. అది కూడా ఉమెన్స్ డే రోజు కావడం గమనార్హం. మరి కిమ్ కౌంటర్ కు ప్రత్యర్దులు ఎలా స్పందిస్తారో చూడాలి..

జగన్ పై గోరంట్ల కామెంట్స్.. కుర్రవాడైన జగన్ కు అర్ధం కావడంలేదు..

  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. ముఖ్యంగా రాజధాని భూదందాపై ఇరు పార్టీల వాగ్వాదాలతో సభ దద్దరిల్లిపోతుంది. భూదందాపై జగన్ చేసిన ఆరోపణలకు టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ జగన్ పై విరుచుకుపడ్డారు. మన సభకు కొన్ని రూల్స్ ఉన్నాయంటూ.. మన దురదృష్టం ఏంటంటే.. ఈ విషయం కుర్రవాడైన జగన్ కు అర్ధం కావడంలేదు.. రెండేళ్ల నుండి ఉంటున్నాడు.. ఈ కుర్రాడికి జ్ఞానోదయం కావడంలేదు అని వ్యాఖ్యానించారు. అయితే గోరంట్లు వ్యాఖ్యానిస్తుండగా.. స్పీకర్ అతని మైక్ కట్ చేసి సీనియర్ సభ్యుడైన మీరు అలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. అనంతరం ఆయన ప్రసంగం కొనసాగిస్తూ.. తమపై చేసిన ఆరోపణలు నిరూపించాలని... చంద్రబాబు సవాల్ కి కనుక కట్టుబడినట్టయితే ఆరోపణలు నిరూపించాలి.. లేకపోతే క్షమాపణలన్నా చెప్పాలని డిమాండ్ చేశారు.

జగన్, చంద్రబాబు.. సవాళ్ల మీద సవాళ్లు..

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికార పక్ష, ప్రతి పక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీ నవ్యాంధ్ర రాజధాని భూదందా ఆరోపణలపై రెండు పక్షాల మధ్య వాగ్వాదాలు తలెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రతిపక్షనేత జగన్ సవాళ్లు మీద సవాళ్లు విసురుకుంటున్నారు. మంత్రులపై చేసిన ఆరోపణలు నిరూపించిన తరువాతే సభ జరుగుతుందని.. ఆరోపణలు నిరూపించాలని.. చంద్రబాబు జగన్ కు సవాల్ విసిరారు. దీనికి జగన్ రాజధానిలో భూదందాపై సీబీఐ విచారణకు సిద్దమా అంటూ ప్రతి సవాల్ విసిరారు. అంతేకాదు చంద్రబాబే ఇన్ సైడ్ ట్రేడింగ్ .. దీనిపై సీబీఐ ఇంక్వైరీ చేయించాలి అని అన్నారు. దీనికి చంద్రబాబు ఇందులో ఇన్ సైడ్ ట్రేడింగ్ ఏముందో నాకు అర్ధంకావడం లేదు.. ల్యాండ్ పూలింగ్ ఇన్ సైడ్ ట్రేడింగ్ ఎలా అవుతుంది.. రైతులు స్వచ్చందంగానే భూములు ఇచ్చారని అన్నారు.

విజయ ఢంకా మోగించిన టీఆర్ఎస్.. ఇదే రిపీట్ అవుతుందంటున్న కవిత

  తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ పలు ఎన్నికల్లో ఇప్పటికే విజయ ఢంకా మోగించింది. ఈరోజు వెలువడిన వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లో కూడా కారు జోరు సాగించింది. దీంతో టీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక దీనిపై కేసీఆర్ కూతురు.. ఎంపీ కవిత మాట్లాడుతూ.. ఇంతటి ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ అభివృద్ధి చూసే ప్రజలు తమను ఎన్నుకుంటున్నారని.. కేసీఆర్ చేపట్టిన పనులను ప్రజలు అభినందిస్తున్నారని.. దాని ఫలితాలే ఎన్నికల్లో గెలుపులు అని అన్నారు. ఎప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగినా ఇదే రిపీట్ అవుద్దని.. 2019 ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ దే గెలుపని జోస్యం చెప్పారు. మరి ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కవిత చెప్పింది నిజమే అవుతుందని చెప్పడంలో ఆశ్చర్యం లేదనిపిస్తుంది.