Dawood Ibrahim

దావూద్ ఇబ్రహీం పాక్ లో లేడు కానీ తరచూ వచ్చి పోతుంటాడుట!

  అనేక నేరాలలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లో ఉంటున్నట్లు భారత నిఘావర్గాలు ఆధారాలను చూపుతుంటే, పాక్ ప్రభుత్వం అతను తమ దేశంలో నివసించడం లేదని వాదిస్తోంది. పాక్ ప్రభుత్వం చెపుతున్నది నిజమే కాని పాక్షికంగా మాత్రమేనని పాకిస్తాన్ కి చెందిన ప్రముఖ 'డాన్' మీడియా గ్రూప్ సి.ఈ.ఓ. హమీద్ హరూన్ మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఆయన ఈరోజు సాయంత్రం “భారత్-పాకిస్తాన్ మధ్య మెరుగుపడిన సంబంధాలను స్థిరీకరించడానికి ఎటువంటి చర్యలు చేప్పట్టాలి” అనే విషయం చర్చించేందుకు ముంబై ప్రెస్ క్లబ్ మరియు అబ్సర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థలు సంయుక్తంగా ముంబైలో ఏర్పాటు చేసిన ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నపుడు దావూద్ ఇబ్రహీం గురించి కొన్ని ఆసక్తికరమయిన విషయాలు తెలియజేసారు.   హమీద్ హరూన్ ఆ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ “దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లో స్థిరనివాసం ఏర్పరచుకోలేదనే విషయం నేను ఖచ్చితం చెప్పగలను. కానీ అతను తరచూ పాకిస్తాన్ వచ్చి పోతుంటాడనే సంగతి విషయం నేను చాలా సార్లు విన్నాను. అతను దుబాయ్, దక్షిణాఫ్రికా దేశాల మధ్య తిరుగుతూ అక్కడే ఉంటున్నట్లు నేను విన్నాను. అతనిని నేను ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. అతను ఒక హంతకుడు. పాక్ ప్రభుత్వం అటువంటి హంతకులను పట్టుకొని కటినంగా శిక్షించాలని కోరుకొంటున్నాను. అటువంటి వ్యక్తులను ఉపేక్షించరాదు,” అని అన్నారు.   భారత్ మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన జవాబు చెపుతూ “ఒకవేళ భారత్-పాకిస్తాన్ దేశాల ప్రభుత్వాలు తమ చర్చలను ముందుకు తీసుకువెళ్ళడంలో విఫలమయితే, ఇరు దేశాల ప్రజలే చొరవ తీసుకొని రెండు దేశాల మధ్య సహృద్భావ వాతావరణం ఏర్పడేందుకు కృషి చేయాలి,” అని అన్నారు.   భారత్-పాకిస్తాన్ దేశాల మత్స్యకారులను ఇరు దేశాల ప్రభుత్వాలు విడుదల చేస్తూ ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనేందుకు దోహదపడుతున్నాయి. మత్య్సకారులను దేశభద్రత, రక్షణ కారణాలతో ఇబ్బందిపెట్టకూడదని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే వారు రెండు దేశాలలో సమాజంలోని అతి పేద వర్గానికి చెందినవారు,” అని హమీద్ హరూన్ అన్నారు.

Lal Krishna Advani

బీజేపీ సీనియర్లు మళ్ళీ ఏమి బాంబు ప్రేలుస్తారో?

  బీజేపీ సీనియర్ నేతలు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా, శాంత కుమార్ ఈరోజు డిల్లీలో మురళీ మనోహర్ జోషి ఇంట్లో సమావేశం అవడం అందరినీ ఆకర్షిస్తోంది. ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీపై ఆరోపణల నేపధ్యంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలపై వారు నలుగురు చర్చించి ఉండవచ్చని తెలుస్తోంది. వారు తమ సమావేశ వివరాలను మీడియాకు తెలియజేయకపోవడంతో వారు ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలపై తమ అసమ్మతిని బహుశః లేఖ ద్వారా పార్టీ అధిష్టానానికి తెలియజేవచ్చని పార్టీలో నేతలు భావిస్తున్నారు.   అరుణ్ జైట్లీని విమర్శించినందుకు ఎంపి కీర్తి ఆజాద్ ని పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని అద్వానీ శిష్యుడుగా చెప్పుకోబడుతున్న శత్రుఘన్ సిన్హా తప్పు పట్టారు. బహుశః ఆయన వారి ఆభిప్రాయన్నే వ్యక్తం చేసి ఉండవచ్చని అందరూ భావిస్తున్నారు. ఒకవేళ రేపు అద్వానీ తదితరులు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లయితే, బీజేపీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవలసివస్తే కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు జవాబు చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడవచ్చును.

modi putin

మోడీకి కత్తి + కత్తిలాంటి గిఫ్ట్

  భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రస్తుతం రష్యా పర్యటనలో వున్న విషయం తెలిసిందే. మోడీ గురువారం నాడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పుతిన్ మోడీకి అరుదైన కానుకను అందజేశారు. మహాత్మాగాంధీ తన స్వహస్తాలతో రాసిన డైరీలోని ఒక పేజీని గాంధీ చిత్రపటంతో కలిపి మోడీకి కానుకగా పుతిన్ అందజేశారు. ఈ కానుకతోపాటు 18వ శతాబ్దం కాలం నాటి ఒక కత్తిని కూడా పుతిన్‌ మోడీకి అందజేశారు. ఈ విషయాన్ని మోడీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. తనకు అరుదైన కానుకలు ఇచ్చినందుకు మోడీ పుతిన్‌కి ట్విట్టర్ ద్వారా కూడా ధన్యవాదాలు తెలిపారు.  

ayuta chandi yagam

చండీయాగంలో రెండో రోజు...

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో నిర్వహిస్తున్న అయుత మహా చండీయాగం గురువారం నాటికి రెండో రోజుకు చేరుకుంది. చండీయాగంలో భాగంగా గురువారం నాడు నిర్వహించే కార్యక్రమాలు ఇవి... గురుప్రార్థన, గోపూజ, ఏకాదశ న్యాసపూర్వక ద్వి సహస్ర చండీ పారాయణ, నవావరణ పూజ, యోగినీ బలి, మహా ధన్వంతరీ యాగం, రాజశ్యామల చతుర్వేద మహారుద్ర పునశ్చరణ, మహాసౌరం, ఉక్తదేవతా జపాలు, కుమారి - సువాసినీ - దంపతి పూజ, మహ మంగళహారతి, విశేష నమస్కారాలు, మధ్యాహ్నం మూడు గంటల నుంచి ధార్మిక ప్రవచనం, సాయంత్రం కోటి నవాక్షరి పునశ్చరణ, ఉపచార పూజ, విశేష నమస్కారాలు, శ్రీచక్ర మండలారాధనం, అష్టావధాన సేవ, ప్రసాద వినియోగం, రాత్రి ఏడున్నరకు శ్రీరామలీల హరికథా కాలక్షేపం.  

MP

కీర్తి ఆజాద్ పై బీజేపీ సస్పెన్షన్ వేటు

  ఊహించినట్లే బీజేపీ తన ఎంపి కీర్తి ఆజాద్ పై సస్పెన్షన్ వేటు వేసింది. ఢిల్లీ డిస్ట్రిక్‌ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) కుంభకోణంలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అవినీతికి పాల్పడ్డారని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనతో పోటీగా కీర్తి ఆజాద్ కూడా అరుణ్ జైట్లీపై విమర్శలు గుప్పించారు. దాని వలన పార్టీకి మరింత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పాడ్డాయి. పార్టీ అధిష్టానం ఎంతగా హెచ్చరిస్తున్నా వినకుండా జైట్లీపై విమర్శలు గుప్పిస్తుండటంతో కీర్తి ఆజాద్ ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ బుధవారం సాయంత్రం ప్రకటించింది.   ఈ విషయం తెలియగానే కీర్తి ఆజాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి “నేను అవినీతికి వ్యతిరేకంగానే పోరాడాను తప్ప వ్యక్తులకు వ్యతిరేకంగా కాదు. డీడీసీఏలో అవినీతి జరిగిన మాట నూటికి నూరుపాళ్ళు వాస్తవం. దాని గురించి మాట్లాడినందుకే నాపై ఇటువంటి చర్య తీసుకోవడం దురదృష్టకరం. డీడీసీఏలో గుండు సూది మొదలుకొని పెద్ద పెద్ద నిర్మాణాల వరకు ప్రతీ కొనుగోలులో, పనిలో అవినీతి జరిగింది. ఈ అవినీతి చివరికి ‘వికీ లీక్స్’ వరకు చేరుకొంది అంటే ఎంత బారీ స్థాయిలో అవినీతి జరిగిందో అర్ధం చేసుకోవచ్చును. వికీ లీక్స్ సంస్థ విడుదల చేసిన జాబితాలలో ఆ అవినీతి బాగోతాలు చూడవచ్చును,” అని కీర్తి ఆజాద్ అన్నారు. ఆ వివరాలున్న వీడియోని ఆయన మీడియా ప్రతినిధులకు ప్రదర్శించి చూపారు. పార్టీలో ఉన్నా లేకపోయినా అవినీతిపై తన పోరాటం కొనసాగిస్తానని అన్నారు.

గవర్నరు సదాశివంను అవమానించిన ఎయిరిండియా..!

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి..కేరళ గవర్నరు సదాశివంకు చేదు అనుభవం ఎదురైంది. నిన్న రాత్రి ఆయన కోచి నుండి త్రివేండ్రంకు వెళ్లేందుకు విమానాశ్రయానికి వెళ్లగా.. ఆయన వెళ్లే సరికి అక్కడ విమానం లేకపోయేసరికి ఆయన షాకయ్యారు. వివరాల ప్రకారం.. అసలు సదాశివం వెళ్లవలసిన విమానం 9.20కి బయలుదేరాల్సి ఉంది. అయితే అది కాస్త ఆలస్యమై షెడ్యూలు 11.40కి మారింది. అయితే గవర్నరు కూడా 11.28కే వచ్చేశారు. కానీ అప్పటికే విమానం ఎక్కేందుకు ఉపయోగించే నిచ్చనను తొలగించేశారు. గవర్నరుకు ఎలాంటి చెకింగ్ లేకుండా పంపించొచ్చు కాబట్టి ఆయన్ను 11.28కి కూడా అనుమతించొచ్చు. అయినా ఆయన్ను వదిలేసి 11.40కి విమానం గాలిలోకి ఎగిరింది. దీంతో షాక్ కు గురయిన సదాశివం చాలాసేపు మాట్లాడకుండా ఎయిర్ పోర్టులోనే అలా ఉండిపోయారు. ఎయిరిండియాపై కేసు వేసేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు సమాచారం.

అయుత చండీయాగం... సంప్రదాయ దుస్తుల్లో గవర్నర్

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయుత మహా చండీయాగం నిర్వహిస్తున్న ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్ ప్రాంతమంతా సందడిగా వుంది. రుత్విక్కులు, వేద పండితులు, యాగాన్ని తిలకించడానికి వచ్చిన ప్రజలతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా వుంది. యాగానికి వస్తున్న ప్రముఖులకు స్వాగతం పలకడానికి కేసీఆర్ కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు సిద్ధంగా వున్నారు. ఏ అతిథి వచ్చినా సాదర స్వాగతం పలుకుతున్నారు. ఇంతలో గవర్నర్ నరసింహన్ వస్తు్నారన్న సమాచారం అందింది. కాసేపట్లో గవర్నర్ కారు వచ్చి కేటీఆర్, హరీష్ రావు ముందు ఆగింది. అందులోంచి దిగిన గవర్నర్ నరసింహన్‌ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన సూటూ బూటులో దిగలేదు. నూటికి నూరుశాతం సంప్రదాయమైన దుస్తుల్లో సతీ సమేతంగా ఆయన యాగానికి వచ్చారు. అసలు గవర్నర్ నరసింహన్ శైలే అది.. ఆయన దేవాలయానికి వెళ్తే చొక్కా వేసుకోరు. ఆధ్మాత్మికవేత్త అయిన ఆయనకు ఎక్కడకి ఎలా రావాలో బాగా తెలుసని అక్కడున్నవారు అనుకోవడం వినిపించింది.