జగన్ గ్రేట్ ఎస్కేప్.. దసరా తరువాత యూకే ట్రిప్!
వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్, కుమార్తె షర్మిల మధ్య చాలా కాలంగా తగాదా నడుస్తోంది. తొలుత ఆస్తుల తగాదాగా మొదలైనా.. చివరకు వైఎస్ రాజకీయ వారసత్వ యుద్ధంగా మారింది. దీంతో అన్నాచెళ్లెళ్ల మధ్య వైరం విమర్శలు, ప్రతి విమర్శల యుద్ధంగా పరిణమించింది. అన్నను విమర్శించి, ఎండగట్టడంతో షర్మిల రెండాకులు ఎక్కువే చదివారు. పైగా వైఎస్ ఆకస్మిక మరణం తరువాత అన్నకు అండగా నిలిచి, ఆయన జైలులో ఉన్నప్పుడు పార్టీ భారమంతా ఒంటిచేత్తో మోసి, సుదీర్ఘ పాదయాత్ర కూడా చేసిన షర్మిల అప్పట్లో జగనన్న విడిచిన బాణాన్ని అంటూ జనానికి చేరువ అయ్యారు.
జగన్ అంగీకరించినా, అంగీకరించకపోయినా.. 2019 ఎన్నికలలో జగన్ పార్టీ వైసీపీ ఘన విజయంలో సంహభాగం వాటా షర్మిలకు కూడా ఉందంటారు పరిశీలకులు, వైఎస్ అభిమానులు. అయి తే జగన్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత జగన్ సొంత చెల్లిని దూరం పెట్టారు. దీంతో ఇప్పుడు అన్నా చెళ్లెల్ల మధ్య జరుగుతున్న వారసత్వ పోరులో సానుభూతి షర్మిల వైపే ఉందని చెప్పాలి. దానికి తోడు తల్లిని కూడా జగన్ దూరం పెట్టడం వైఎస్ అభిమానులకు పెద్దగా రుచించలేదు. దీంతో కుటుంబపరంగా, వైఎస్ అభిమానుల అండ పరంగా జగన్ దాదాపు ఏకాకి అనే చెప్పాలి. ఇందుకు ఉదాహరణగా.. నాడు అంటే వైఎస్ ఆకస్మిక మరణం తరువాత, 2019 ఎన్నికల సమయంలోనూ వైఎస్ కుటుంబం మొత్తం ఐక్యంగా నిలిచి జగన్ కు మద్దతు పలికింది. అలాగే.. నాడు జగన్ కు అనుకూలంగా సానుభూతి వెల్లువెత్తడానికి కారణమైన వివేకా హత్య, కోడికత్తి దాడి కేసుల్లో ఇప్పుడు వెళ్లన్నీ ఆయనవైపే చూపిస్తున్నాయి. అలాగే నాడు జగన్ కు కొండంత అండగా నిలిచిన చెల్లి వైఎస్ షర్మిల ఇప్పుడు ఆయనకు ప్రత్యర్థిగా మారారు. నాడు జగనన్న వదిలిన బాణాన్ని అంటూ జనంలోకి వచ్చిన షర్మిల ఇప్పుడు తాను జగన్ కు గురిపెట్టిన బాణం అంటూ ఊరూవాడా చుట్టేస్తున్నారు. జగన్ ను నియంత అంటున్నారు. అలాగే వైఎస్ ఆత్మ అని గుర్తింపు పొందిన కేవీపీరామచంద్రరావు సైతం షర్మిల పక్కన నిలబడ్డారు.
ఇక 2024 ఎన్నికలలో జగన్ పార్టీ ఘోర పరాజయం తరువాత షర్మిల విమర్శల పదును మరింత పెరిగింది. తన కుమారుడే వైఎస్ రాజకీయ వారసుడని ప్రకటించడమే కాకుండా, వైఎస్ ఆజన్మాంతం వ్యతిరేకించిన బీజేపీతో జగన్ కుమ్మక్కు అయ్యారని సోదాహరణంగా వివరిస్తున్నారు. ఇక అన్నిటికీ మించి జగన్ ప్రస్తుతం పీకల్లోతు కష్టాలలో ఉన్నారు. పార్టీ పరాజయం, అలాగే చుట్టుముడుతున్న కేసులు, అధికారంలో ఉన్నప్పుడు అండగా నిలిచి.. తనను విమర్శించిన వారిపై బూతులతో చెలరేగిపోయిన ఫైర్ బ్రాండ్ లీడర్లంతా ఇప్పుడు సైలంట్ అయిపోరారు.
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలంటూ అడపాదడపా జగన్ ఆందోళనలకు పిలుపు నిచ్చినా లీడర్లు కానీ, క్యాడర్ కానీ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక ఇంత కాలం కోర్టు కేసుల విషయంలో ఉన్న వ్యక్తిగత మినహాయింపు ఇకపై ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ఈ దశలో జగన్ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయినట్లు కనిపిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. ఆ కారణంగానే దసరా వరకూ బెంగళూరు ప్యాలెస్ కే పరిమితమై, ఆ తరువాత యూకే పర్యటన అంటూ తాడేపల్లి ప్యాలెస్ ను, అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కొంత కాలం పాటు స్కిప్ చేసే యోచనలో ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.