కూటమి ఏడాది పాలన.. అన్నీ మంచి శకునములే!
సరిగ్గా ఏడాది క్రితం అంటే గత ఏడాది జూన్ 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేనాటికి రాష్ట్ర పరిస్థితి అస్తవ్యస్థంగా ఉంది. అరాచక పాలనతో, విధ్యాంసాలతో జగన్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఆ పరిస్థితిని గ్రహించిన ఏపీ ఓటరు కూటమికి అఖండ మెజార్టీ ఇచ్చాడు. అంతటి అనుభవశాలి అయిన చంద్రబాబుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవగాహన రావడానికి నెలల సమయం పట్టిందంటే.. వైపీసీ హయాంలో ఎంత విధ్వంసం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా కూటమి ఎన్నికల హామీలను కూడా వెంటనే అమలు చేయలేకపోయింది. వ్యవస్థలను గాడిలో పెట్టి ఆంధ్రప్రదేశ్ను విధ్వంసం నుంచి వికాసం వైపు పరుగులు పెట్టించడానికి ఏడాది పట్టింది. ఆంధ్రులు గర్వించేలా అమరావతి, జలసిరులు నింపేలా పోలవరం, జెట్ స్పీడ్ అందుకున్న జాతీయ రహదారులు, అభివృద్ధికి నిచ్చెనల్లా ఫ్లైఓవర్లు.. ఇలా ఏడాది కాలంలో ఎన్నెన్నో పనులు పట్టాలెక్కి పురోగతితో సాగుతున్నాయి.
గత ఏడాది జూన్ 12న చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో వేడుకలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుపరిపాలన- స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో వేడుకలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాది పాలన సందర్భంగా సాయంత్రం సుపరిపాలన- స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్ర స్థాయి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారులతో కార్యక్రమం నిర్వహించనున్నారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 175 స్థానాలకు 164 స్థానాలను కూటమి కైవసం చేసుకుంది.11 సీట్లకు పరిమితమైన వైసీపీ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. ఈ ఏడాది పాలనలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ.. అమరావతి అభివృద్ధి పనులకు తొలి ప్రాధాన్యం ఇస్తోంది. ఏ ఫర్ అమరావతి, పీ ఫర్ పోలవరం అంటూ తమ ప్రభుత్వం ప్రాధాన్యాలను సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం నాడే క్లారిటీ ఇచ్చారు.
అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేశారు. డీఎస్సీ పరీక్షలు కూడా నిర్వహించారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు దీపం 2 కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తున్నారు. అలాగే అన్నా క్యాంటీన్ల ఏర్పాటు చేసి, ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పెంచి ప్రతినెలా ఒకటో తేదీనే పంపిణీ చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ఈ నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను ప్రారంభిస్తామని ప్రకటించారు. తల్లికి వందనం మార్గదర్శకాల జీఓ కూడా జారీ అయింది. రేపటి నుంచే నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయనుంది.
పార్టీల సంగతికి వస్తే మూడు కూటమి పార్టీల మధ్య మంత్రిత్వ పదవుల దగ్గర నుంచి నామినేటెడ్ పదవుల వరకూ.. పరస్పర అవగాహనతో పాలన సాగుతోంది. అలాగే ప్రభుత్వం డిజిటల్ పాలనపై ఎక్కువ దృష్టి పెడుతోంది. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలను ప్రజలకు చేరువ చేశారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం పరిశ్రమలకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తున్నారు.
మొదటినుంచి చంద్రబాబు తీరు తెలిసిన వాళ్ళకి ఈసారి ఆయనలో ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ కనిపిస్తున్నది. ఆయన తన మొఖంలోని ఫీలింగ్స్ కనిపించకుండా రాజకీయాల్లో చాలా జాగ్రత్తగా ఉండేవారు. కానీ ఈసారి ఆయన వీలైనంత ఎక్కువగా నవ్వుతూ.. ఏమాత్రం అవకాశం దొరికినా సామాన్యులతో కలిసి పోవడానికి ప్రయత్నిస్తున్నారు. తను బయటికి వస్తుంటే వీలైనంత తక్కువగా ఆర్భాటం ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.
తెలుగుదేశం రాజకీయ మొత్తం ప్రస్తుతం లోకేష్ చుట్టూనే నడుస్తుంది. అటు పార్టీపైనా ఇటు ప్రభుత్వంలోనూ లోకేష్ తనదైన మార్క్ చూపిస్తున్నారు. లోకేష్ నాయకత్వ లక్షణాలు ప్రధాని మోడీని సైతం ఆకట్టుకుంటున్నాయి. అందుకే మోడీ స్వయంగా లోకేష్ దంపతులను ఢిల్లీకి ఆహ్వానించి ప్రాధాన్యత ఇచ్చారు. లోకేష్ మంగళగిరిలో జరుపుతున్న ప్రజా దర్బార్ సక్సెస్ అవ్వడంతో ఆయన జిల్లాల పర్యటనల్లోనూ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. 2014 -19 మధ్య లోకేష్ను ప్రధానంగా పారిశ్రామిక వర్గాలే కలుస్తూ ఉండేవి. ఈసారి సామాన్య ప్రజల్ని కలవడానికి కూడా ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీ కూడా చంద్రబాబు కంటే ఎక్కువగా లోకేష్ను టార్గెట్ చేస్తుందంటే లోకేష్ ఏ స్థాయిలో పవర్ సెంటర్గా మారుతున్నారో అర్థమవుతుంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తనదైన మార్క్ చూపిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు అభివృద్ధి చేయడం, అటవీ శాఖలో కుంకీ ఏనుగులను ప్రత్యేకంగా రప్పించడం వంటి కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. పొలిటికల్గా పూర్తిస్థాయిలో తన స్టాండ్ మార్చుకున్న జనసేనాని పూర్తి స్థాయిలో సనాతన ధర్మాన్ని అజెండాగా పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు అధికారంలో కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రంలో తెలుగుదేశం కీలకంగా మారడంతో రాజధాని అమరావతికి తగినన్ని ఫండ్స్ తెచ్చుకోగలుగుతున్నారు. గత ఐదేళ్లూ అడవిలా మారిన అమరావతికి కొత్త కళ వస్తోంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలని కష్టపడుతోంది కూటమి ప్రభుత్వం. పోలవరం పూర్తి చేయడంతో పాటుగా బనకచర్లతో అనుసంధానం చేయాలని కొత్త ప్రాజెక్ట్ ని చంద్రబాబు అనౌన్స్ చేశారు. అది పూర్తయితే రాయలసీమ కూడా సస్యశ్యామలం అవుతుందని నిపుణులు అంటున్నారు.
గత వైసిపి ప్రభుత్వం దెబ్బ తినడానికి అతి పెద్ద కారణం రోడ్ల దుస్థితి. ఆ పరిస్థితి అర్థం చేసుకున్న కూటమి అధికారంలోకి వచ్చీ రాగానే రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని అభివృద్ది చేస్తూ ప్రజల మన్ననలు అందుకుంటోంది. అలాగే అమరావతిలో క్వాంటం వ్యాలీ ప్రాజక్ట్ భవిష్యత్తు గేమ్ చేంజర్ గా చెబుతున్నారు సీఎం చంద్రబాబు. అలాగే అమరావతి, వైజాగ్ మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలను త్వరలోనే అమలులో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తమ్మీద గత ఐదేళ్లు ప్రజలకు లేని స్వేచ్ఛను తాము ఇచ్చామని అంటున్నారు కూటమి నేతలు. స్వయంగా సీఎం చంద్రబాబు సహా ప్రభుత్వంలో ఉన్న నేతలందరూ ఇదే మాట చెబుతూ వస్తున్నారు. గ్రామీణ ప్రజల్లో కూడా ఇదే భావన వ్యక్తమవుతోంది.
అయితే తెలుగుదేశం శ్రేణులపై వైసీపీ హయాంలో పెట్టిన అక్రమ కేసులు ఇంకా కొనసాగుతుండటం, రైతులకు గిట్టుబాటు ధర దక్కకపోతుండటం వంటి అంశాలపై ప్రజల్లో ఒకింత అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఆ దిశగా చంద్రబాబు ప్రభుత్వం దృష్టిసారిస్తే.. ఏపీ వాసులకు అన్నీ మంచి శకునములే అంటున్నారు.