చనిపోయేముందు భర్తకు మెయిల్ పెట్టిన నీలిమ

ఇన్ఫోసిస్ ఉద్యోగిని నీలిమ చనిపోయే ముందు తన భర్తకు పంపిందని తెలుస్తోంది. నీలిమ పంపిన మెయిల్ లో నా దారి వేరు.. నీదారి వేరని..నువ్వు చాల మంచివాడివని.. నాది సహజ మరణంగా భావించి ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని నీలిమ పంపించింది. నీలిమ అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తులో భాగంగా రాయదుర్గం పోలీసులు ఆమె ఈ-మెయిల్‌ను బ్రేక్ చేశారు. శనివారం ఓ ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సాయంతో దాన్ని ఓపెన్ చేసి అందులోని వివరాలు తెలుసుకున్నారు. నీలిమ తన ఆఖరి ఈ-మెయిల్‌లను భర్తతోపాటు విశాఖపట్నానికి చెందిన స్నేహితుడు ప్రశాంత్ అలియాస్ పండుకు పంపినట్లు.. చివరి ఫోన్‌కాల్ ప్రశాంత్‌కే చేసినట్లు నిర్ధారించారని తెలుస్తోంది.

నీలిమ గచ్చిబౌలి ఇన్ఫోసిస్ కి ఎందుకు వెళ్ళింది?

నీలిమ హైదరాబాద్ ఇన్ఫోసిస్ కార్యాలయానికి ఆమె ఎందుకు వెళ్లింది? మూడు వారాలు సెలవు పెట్టి అమెరికా నుంచి హైదరాబాదుకు వచ్చిన నీలిమ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఏమి లేదు. అమెరికా నుంచి వచ్చిన పది రోజుల తరువాత ఇన్ఫోసిస్ కార్యాలయానికి వచ్చిన ఆమె పాత మిత్రులను ఎవరినీ కలుసుకోలేదని అంటున్నారు. హైదరాబాదులో నీలిమ చేసిన ప్రాజెక్టుకు సంబంధించిన పని ఏదీ లేదని, ఆమె ప్రాజెక్టులో పనిచేస్తున్నవారు అమెరికాకు, పూణేకు చెందినవారేనని తెలుస్తోంది.   సిసిటివీ కెమెరా చిత్రాలను బట్టి చూస్తే 9.30 నిమిషాలకు కంపెనీలోని బిల్డింగ్ నెంబర్ 18, 19లోకి వెళ్లినట్టు గుర్తించామని పోలీసులు అంటున్నారు. బిల్డింగ్ నెంబర్ 18, 19లో ఆమె చేస్తున్న ప్రాజెక్టుకు సంబంధించిన పని కూడా ఏమీ లేదని చెబుతున్నారు. అయితే ఆమె వెంట తెచ్చుకున్న హ్యాండ్‌బ్యాగ్ పదో అంతస్థులో పడి ఉంటే, ఏడో అంతస్థులో ఆమె కాలి చెప్పును గుర్తించామని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ ఇన్ఫోసిస్ కార్యాలయానికి ఆమె ఎందుకు వెళ్లిందనేది తెలిస్తే మృతి మిస్టరీ విడిపోతుందని అంటున్నారు.

భర్తపై భార్య పోరాటం

భర్తకోసం ఓ ఎన్‌ఆర్‌ఐ భార్య పోరాటం చేస్తోంది. కానీ ఆయన మాత్రం ఆమె పేరున ఉన్న కోట్ల విలువైన ఆస్తిపై కన్నేసాడు.  చెన్నైకి చెందిన యామిని.. హైదరాబాద్‌ కి చెంది కార్తిక్ మూడేళ్ల క్రితం మాట్రిమోనీ ద్వారా ఒక్కటయ్యారు. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. చాలా ఏళ్లు ఆస్ట్రేలియాలో ఉండి కోట్లరూపాయలు సంపాదించిన యామిని ఆస్తిని తన పేరుపై మార్చాలని కార్తీక్‌ పోరు మొదలుపెట్టాడు. దీంతో వీరిద్దరి మధ్య గొడవ మొదలైంది. చెన్నై.. హైదరాబాద్‌ కోర్టులలో వీరిద్దరి మధ్య కేసులు కూడా నడుస్తున్నాయి. అయితే భర్త కోసం యామిని నిన్న హైదరాబాద్‌కి రాగా... ఇంటికి తాళంవేసి ఉండటంతో ఆమె భర్తకోసం పోలీసులను ఆశ్రయించింది.

రహస్యంగా పెళ్లి చేసుకున్న సినీ నటుడు తారకరత్న

నందమూరి కుటుంబానికి చెందిన సినీ నటుడు తారకరత్న రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ శివార్లలోని సంఘీ టెంపుల్‌లో గురువారం రాత్రి.. అలేఖ్య రెడ్డిని వివాహమాడారు. మహానటుడు ఎన్టీ రామారావు నాలుగో కుమారుడైన మోహన కృష్ణ తనయుడే.. తారకరత్న. ఇక, వధువు అలేఖ్య.. మాజీ హోం మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి మాజీ కోడలు. దాదాపు ఏడాదిన్నరగా తారకరత్న నందమూరి కుటుంబం నుంచి బయటికి వచ్చేసి విడిగా ఉంటున్నారు. అప్పట్నుంచీ వీరిరువురూ సహజీవనం చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన 'నందీశ్వరుడు' సినిమాకు అలేఖ్య తారకరత్న వ్యక్తిగత కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించారు. ఈ పెళ్లికి వధువు తల్లి, వరుడి సన్నిహితులు నలుగురైదురు మాత్రమే హాజరయ్యారు.

నీలిమ మృతి కేసులో సెల్‌ఫోన్ ఆధారంగా విచారణ

అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫోసిస్ ఉద్యోగిని నీలిమ సెల్‌ఫోన్ ఆధారంగా విచారణ జరుగుతోందని డీసీపీ యోగానంద్ తెలిపారు. ఈరోజు ఆయన నీలిమ మృతికి సంబంధించిన కొన్ని వివరాలను విలేకరులకు వివరించారు. ఆయన తెలిపిన ప్రకారం పోలీస్‌స్టేషన్‌కు 11గంటలకు సమాచారం వచ్చింది. 9 గంటలకు 18-19 నెంబర్ గల భవనంలోకి నీలిమ వెళ్లింది. 9.36నిమిషాల వరకు విజువల్స్ లభించాయి. 9.36నిమిషాలకు పార్కింగ్ భవనంలోకి నీలిమ వెళ్లింది. నీలిమ భవనంపై నుంచి పడిపోయిన తర్వాత సెక్యూరిటీ గార్డు రమేష్ గమనించారు. కంపెనీ ఉద్యోగులు ముగ్గురు నీలిమను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. నీలిమ పడిపోయే సమయలో ఒక చెప్పు ఏడో అంతస్తులో పడింది. సమాచారం ఆలస్యమవడానికి కారణం సరైన ఫోన్‌ నెంబర్లు లేకపోవడమేనని డీసీపీ తెలిపారు. 10వ ఫ్లోర్‌లో నీలిమ హ్యాండ్‌బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగ్‌లో దొరికిన చీటీ ఆధారంగా కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. ఏడో అంతస్తుపై నుంచి పడిపోయిందనడానికి పైపులపై మరకలున్నాయని ఆయన చెప్పారు.   నీలిమ మొబైల్ స్క్రీన్ లాక్ అయింది. ఓపెన్ చేసేందుకు నిపుణుల ద్వారా ప్రయత్నిస్తున్నారు. నీలిమ ఈ-మెయిల్‌ను కూడా ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నీలిమ మృతికి సంబంధించి ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. 9.30 సమయంలో నీలిమ సెల్ నుంచి ఒక నెంబర్‌కు ఫోన్ కాల్ వెళ్లింది. ఆ వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని డీసీపీ చెప్పారు. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే కొంత సమాచారం అభించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.  

ఇన్ఫోసిస్ నీలిమ మృతిపై వీడని మిస్టరి

ఇన్ఫోసిస్ ఉద్యోగిని నీలిమ మృతిపై వివిధ కథనాలురావడంతో, డిసిపి యోగానంద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతు నీలిమ మృతిపై తాము ప్రస్తుతానికి ఏ నిర్ధారణకు రాలేదని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. ఆమె హ్యాండ్ బ్యాగులో చిన్న స్లిప్ దొరికిందని, అందులో ఓ అడ్రస్ ఉందని చెప్పారు. ఈ కేసులో ఆమె భర్త, తల్లితో పాటు అందరినీ విచారిస్తామని చెప్పారు. నీలిమ మృతి చెందిన రోజు రాత్రి 8.39 నిమిషాలకు ఆఫీసులోనికి వెళ్లిందని నీలిమ కదలికలు సిసి కెమెరాలో లభ్యమయ్యాయని చెప్పారు. 10.30 గంటలకు ఓ శబ్దం రావడంతో వాచ్ మెన్ రమేష్ నీలిమ లాన్ లో పడి ఉండటాన్ని చూశాడని, ఈ విషయం తెలుసుకున్న కంపెనీ ఉద్యోగులు ముగ్గురు ఆమెను ఆసుపత్రికి తరలించారని చెప్పారు. వైద్యులు ఆమె మృతి చెందినట్లుగా చెప్పారని అన్నారు. అయితే ఆమె ఏడో అంతస్తు నుండి పడిపోయినట్లుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చామని, అక్కడ పైపులకు రక్తం మరకలు ఉన్నాయని చెప్పారు. నీలిమ లాన్ లో పడిపోవడం వల్లనే పెద్దగా గాయాలు కాలేదన్నారు. ఇన్ఫోసిస్ కంపెనీలో 14 సిసి కెమెరాలు ఉన్నాయని, ఉద్యోగులు విచారణకు సహకరిస్తున్నారని, ఈ కేసులో ఎవరైనా దోషిగా తేలితే తప్పని సరిగా పట్టుకుంటామని, కేసుని నిష్పక్షపాతంగా దర్యాఫ్తు చేస్తున్నామని చెప్పారు.      

ఒలింపిక్స్ సెమీఫైనల్లో సైనా నెహ్వాల్ ఓటమి

ఒలింపిక్స్‌లో సెమీఫైనల్స్కు చేరి చరిత్ర సృష్టించిన హైదరాబాదీ బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ ఫైనల్ చేరడంలో మాత్రం విఫలమైంది. ప్రపంచ నంబన్‌ వన్‌ చైనా ప్లేయర్‌ యిహాన్‌ వాంగ్‌తో జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లో సైనా 13-21, 13-21 తేడాతో ఓడిపోయింది. దీంతో కాంస్య పతకం కోసం ఆమె రేపు మరో మ్యాచ్‌ ఆడాల్సి ఉంటుంది. గతంలో వాంగ్‌తో అయిదు మ్యాచులాడిన సైనా అన్నింట్లోనూ ఓడిపోయింది. ఆరోసారి కూడా ఆమెకు అదృష్టం కలిసిరాలేదు. ఈ ఏడాది టాప్‌ ఫామ్‌లో ఉన్న సైనా వరసగా 14 మ్యాచులు గెలిచినా ప్రపంచ నంబర్‌ వన్‌ ముందు మాత్రం తలవంచక తప్పలేదు. మ్యాచ్‌ మొదలవగానే కాస్త దూకుడుగా కనిపించిన సైనా తర్వాత యిహాన్‌ జోరుకు వెనకబడిపోయింది.

అమెరికాలో హెర్గ్యున్ యూనివర్సిటీ మోసం

అమెరికాలో మరో యూనివర్సిటీ మోసానికి పాల్పడింది. కాలిఫోర్నియాలోని హెర్గ్యున్ యూనివర్సిటీ మూత పడింది. యూనివర్సిలో మొత్తం 450 మంది విద్యార్థులు ఉండగా అందులో అధికంగా తెలుగు విద్యార్థులే ఉన్నారు. హెర్గ్యున్ యూనివర్సిటీకి అధికారులు నోటీసులు జారీ చేసి సీఈవో వాంగేను అరెస్ట్ చేసింది. దీంతో విద్యార్థులు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. విద్యార్థులు క్లాసులకు హాజరుకాలేని పక్షంలో టెక్నికల్ ట్రైనింగ్ జాబ్ కంటిన్యూ చేయాలి లేదా, మరో యూనివర్సిటీకి బదిలీ కావాల్సి ఉంటుంది. రెండింటిలో ఏదో ఒకటి జరగకపోతే వారం రోజుల్లో దేశం విడిచి పోక తప్పక పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. అటు నాన్ ఇమ్మిగ్రెంట్ విద్యార్థుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది.