ఇన్ఫోసిస్ నీలిమ మృతిపై వీడని మిస్టరి

ఇన్ఫోసిస్ ఉద్యోగిని నీలిమ మృతిపై వివిధ కథనాలురావడంతో, డిసిపి యోగానంద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతు నీలిమ మృతిపై తాము ప్రస్తుతానికి ఏ నిర్ధారణకు రాలేదని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. ఆమె హ్యాండ్ బ్యాగులో చిన్న స్లిప్ దొరికిందని, అందులో ఓ అడ్రస్ ఉందని చెప్పారు. ఈ కేసులో ఆమె భర్త, తల్లితో పాటు అందరినీ విచారిస్తామని చెప్పారు.


నీలిమ మృతి చెందిన రోజు రాత్రి 8.39 నిమిషాలకు ఆఫీసులోనికి వెళ్లిందని నీలిమ కదలికలు సిసి కెమెరాలో లభ్యమయ్యాయని చెప్పారు. 10.30 గంటలకు ఓ శబ్దం రావడంతో వాచ్ మెన్ రమేష్ నీలిమ లాన్ లో పడి ఉండటాన్ని చూశాడని, ఈ విషయం తెలుసుకున్న కంపెనీ ఉద్యోగులు ముగ్గురు ఆమెను ఆసుపత్రికి తరలించారని చెప్పారు. వైద్యులు ఆమె మృతి చెందినట్లుగా చెప్పారని అన్నారు.


అయితే ఆమె ఏడో అంతస్తు నుండి పడిపోయినట్లుగా ప్రాథమికంగా అంచనాకు వచ్చామని, అక్కడ పైపులకు రక్తం మరకలు ఉన్నాయని చెప్పారు. నీలిమ లాన్ లో పడిపోవడం వల్లనే పెద్దగా గాయాలు కాలేదన్నారు. ఇన్ఫోసిస్ కంపెనీలో 14 సిసి కెమెరాలు ఉన్నాయని, ఉద్యోగులు విచారణకు సహకరిస్తున్నారని, ఈ కేసులో ఎవరైనా దోషిగా తేలితే తప్పని సరిగా పట్టుకుంటామని, కేసుని నిష్పక్షపాతంగా దర్యాఫ్తు చేస్తున్నామని చెప్పారు.


     

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.