యుపిఎకు మమతా షాక్
posted on Sep 19, 2012 @ 10:42AM
మంగళవారం మమతా బెనర్జీ యూపీఏకు పెద్ద షాకిచ్చారు, యూపీఏకు మద్దతు ఉపసంహరిస్తున్నామని ప్రకటించారు. డీజిల్ ధర పెంపు, వంటగ్యాస్ సిలిండర్లపై నియంత్రణ, అసోంలో అల్లర్లు, రిటైల్ రంగంలో ఎఫ్డీఐలు, ఈ నిర్ణయాలు తమకు ఏమాత్రం నచ్చలేదన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు తృణమూల్ కాంగ్రెస్ మంత్రులు తమ రాజీనామాలను ప్రధాని మన్మోహన్కు సమర్పిస్తారని చెప్పారు. నిర్ణయం తీసేసుకున్నాం, ఇక వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు. అయితే నాలుగు రోజులుగా కాంగ్రెస్కు హెచ్చరికలు పంపిస్తున్నట్లు మమత పేర్కొన్నారు. నాలుగు రోజుల క్రితమే సోనియాకు సందేశం పంపాను. సర్కారు నిర్ణయాలు ఆమోద యోగ్యం కాదని చెప్పాను. కానీ పరిస్థితిని ఆమె మార్చలేకపోయారని తెలిపారు. అలాగే మమతకు మూడు రోజుల క్రితం ప్రధాని మన్మోహన్ స్వయంగా ఫోన్ చేసినట్లు సమాచారం. ఆయన బుజ్జగింపులను మమత పట్టించుకోలేదని తెలిసింది.
542 మంది సభ్యులున్న లోక్సభలో మేజిక్ మార్కు 272. యూపీఏ బలం 273. ఇందులో తృణమూల్ కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 19. వీరిని తీసేస్తే యూపీఏ బలం 254కు పడిపోయింది. అంటే సర్కారు మైనారిటీలో పడింది. అయినప్పటికీ యూపీఏకు మద్దతు ఇచ్చేందుకు బీఎస్పీ (21) లేదా సమాజ్వాదీ (22) ముందుకు వస్తే మన్మోహన్ సర్కారుకు ముప్పేమీ ఉండదు. అయితే తృణమూల్తోపాటు 18 మంది సభ్యులున్న డీఎంకే కూడా సర్కారు నుంచి తప్పుకొంటే మాత్రం బీఎస్పీ, సమాజ్వాది పార్టీలు రెండూ కలిసి కాంగ్రెస్ను ఆదుకోవాల్సి వస్తుంది.