కోదండరామ్ వ్యాఖ్యలపై టి కాంగ్రెస్ నేతల ఆగ్రహం

మంత్రి శ్రీధర్ బాబుపై తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయ్. ఆగ్రహావేశాలతో ఊగిపోయిన కాంగ్రెస్ కార్యకర్తలు కోదండరామ్ ఇంటిని ముట్టడించారు. కాంగ్రెస్ విద్యార్థి సంఘం ఎన్ఎస్ యుఐ కార్యకర్తలు ఉస్మానియాలో కోదండరామ్ దిష్టిబొమ్మను తగలబెట్టారు. ఆయనపై వెంటనే పోలీస్ కేసు పెట్టాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. కోదండరాం చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఏదైనా జరిగితే కోదండరాందే బాధ్యతని జగ్గారెడ్డి హెచ్చరించారు. కోదండరామ్ వెంటనే శ్రీథర్ బాబుకి క్షమాపణ చెప్పాలని మంత్రి సారయ్య వ్యాఖ్యానించారు. తక్షణం కోదండరామ్ క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ మార్చ్ పూర్తిగా విఫలమౌతుందని మాజీ మంత్రి జానారెడ్డి హెచ్చరించారు. మంత్రి శ్రీథర్ బాబుపై కోదండరామ్ చేసిన వ్యాఖ్యలు మొత్తం కాంగ్రెస్ నేతల్లో కదలికను తెప్పించాయి. 

 

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.