స్వశక్తిని నమ్మే చంద్రబాబుకి స్వామీజీలతో పనేంటి?

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు ఎవరూ ఊహించని, కనీవినీ ఎరుగని పని పనిచేశారు. చంద్రబాబు నాయుడేంటి.. ఈ పని చేయడమేంటని అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతకీ అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసిన పని ఏమిటంటే, ఆయన ఒక స్వామీజీ హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమానికి వెళ్ళారు. అక్కడ చంద్రబాబు ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. సదరు స్వామీజీ చంద్రబాబు చేత ప్రత్యేక పూజలు చేయించారు. ఆ స్వామీజీ మరెవరో కాదు.. ప్రకాశం జిల్లాకు చెందిన వివాదాస్పద స్వామీజీ రామదూత స్వామి. రామదూత స్వామీజీ మీద భూ కబ్జాలకు సంబంధించిన ఎన్నో ఆరోపణలున్నాయి. అలాంటి స్వామీజీ నిర్వహించిన కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు వెళ్ళడం వింతల్లోకెల్లా వింత! రాజకీయ నాయకులు స్వామీజీల దగ్గరకి వెళ్ళడం, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం మామూలే. అయితే చంద్రబాబు నాయుడు లాంటి ప్రాక్టికల్ వ్యక్తి ఇలా స్వామీజీ దగ్గరకి వెళ్ళడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తెలుగు ప్రజలకు చంద్రబాబు నాయుడి మీద కొన్ని నిశ్చితాభిప్రాయాలు వున్నాయి. చంద్రబాబు నాయుడు స్వశక్తిని నమ్ముకుంటారు. ఏ పనినైనా శ్రమశక్తి ద్వారానే సాధిస్తారు. స్వామీజీలు, బాబాల దగ్గరకి ఆయన వెళ్ళరు.. వారిని ఆయన దగ్గరకి రానివ్వరు. కానీ, ఆదివారం జరిగిన సంఘటన ప్రజల నమ్మకానికి విరుద్ధంగా వుంది. తొమ్మిదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపినప్పటికీ ప్రజలు ఆయన్ని పదేళ్ళపాటు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అయినప్పటికీ ఆయన నిరాశపడకుండా తన శక్తిని తాను నమ్మకున్నారు. ప్రజల్లో తనమీద వున్న నమ్మకాన్ని నమ్మకున్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నారంటే దానికి కారణం ప్రజలకు ఆయన మీద వున్న నమ్మకం, తెలుగుదేశం కార్యకర్తల శ్రమే తప్ప స్వామీజీలు కాదు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సింది చంద్రబాబు నాయుడి శ్రమే తప్ప స్వామీజీల ఆశీస్సులు కాదు.   ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ క్షేమం కోరుకుని రామదూత స్వామీజీ ఆశీస్సుల కోసం వెళ్ళారని కాసేపు అనుకుందాం. ఆ కోణంలో చూసినా రామదూత స్వామీజీకి అంత సీను లేదు. ఎందుకంటే గతంలో ఆయన్ని సందర్శించుకుని ఆశీస్సులు తీసుకున్న చాలామంది రాజకీయ నాయకులు, సినిమావాళ్ళు బావుకుందేమీ లేదు. వాళ్ళెవరిమీదా సదరు స్వామీజీ ఆశీస్సులు ఫలించలేదు. వాళ్ళంతా ఫెయిల్యూర్స్ బాటలోనే నడిచారు. ఉదాహరణకి గాలి జనార్దన‌రెడ్డిని తీసుకుందాం. ఆయన గతంలో చాలాసార్లు రామదూత స్వామీజీని సందర్శించడానికి ఆయన ఆశ్రమానికి హెలికాప్టర్లో వెళ్ళేవారు. హెలికాప్టర్లో పెట్రోలు అయిపోయేలా ఎన్నిసార్లు స్వామీజీ చుట్టూ తిరిగినా గాలి జనార్దనరెడ్డికి, ఆయన తమ్ముడికి జైల్లోపడే రాత తప్పలేదు. ఇంకా మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు డి.శ్రీనివాస్, టి.సుబ్బరామిరెడ్డి, జయప్రద, అమర్‌సింగ్, మురళీ మనోహర్ జోషి, కేంద్ర మాజీ మంత్రి మునియప్ప... ఇలాంటి రాజకీయ నాయకులందరూ రామదూత స్వామీజీ ఆశ్రమాన్ని సందర్శించుకుని ఆశీస్సులు అందుకున్నవారే. స్వామీజీ అశీస్సులు అందుకోకముందు అందరూ బాగానే వున్నారు. ఆశీస్సులు అందుకున్న తర్వాత అదేం చిత్రమోగానీ ఎవరూ బాగాలేరు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప నాలుగైదుసార్లు స్వామీజీ ఆశ్రమానికి వచ్చి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ ఆశీస్సుల పుణ్యమా అని ఆ తర్వాత ఎడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి ఊడిపోయింది. ఆయన ఇంతవరకూ రాజకీయంగా నిలదొక్కుకోలేక అల్లాడుతున్నారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ జూనియర్ ఎన్టీఆర్‌తో ‘శక్తి’ సినిమా తీసే సమయంలో చీటికి మాటికి రామదూత స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళి ఆశీస్సులు అందుకునేవారు. ఆయన ఎన్ని ఆశీస్సులు అందుకున్నా ‘శక్తి’ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇలాంటి ఉదాహరణలన్నీ చూస్తే రామదూత స్వామీజీ ఆశీస్సులకు అంత పవర్ లేదని అర్థమవుతోంది. పవర్ లేని సంగతి అలా వుంచితే, సదరు స్వామీజీ ఆశీస్సులు అందుకున్న అందరి కెరీర్లూ రివర్స్ గేర్‌లో నడిచాయి. చదివిస్తే ఉన్నమతి పోయిందన్నట్టు, ఈ స్వామీజీ ఆశీస్సులు తీసుకున్న తర్వాతే కింగుల్లాంటి వాళ్ళు కూడా డంగైపోయారు.   అందువల్ల మేమెంతో గౌరవించే చంద్రబాబు నాయుడు గారూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీమీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మీరు మీ స్వశక్తితో ఒక సైనికుడిలా పనిచేసి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు స్వామీజీల సందర్శనానికి వెళ్ళడాన్ని ప్రజలు ఎంతమాత్రం జీర్ణించుకోలేదు. కాబట్టి మీరు ఇలాంటి స్వామీజీల చుట్టూ తిరగడం మానేయండి. ఆ తిరిగేదేదో ప్రజల చుట్టూ తిరగండి. ప్రజల్ని, తెలుగుదేశం విజయానికి తోడ్పడిన కార్యకర్తల్ని ఆదుకోండి. ఒక్కమాటలో చెప్పాలంటే.. తెలుగు ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ మీతోనే వుంటాయి.. మీకు ఏ స్వామీజీలు.. బాబాజీల ఆశీస్సులు అవసరం లేదు.

ఆంధ్ర-తెలంగాణా వివాదాలకు పరిష్కారాలే లేవా?

  ఆంధ్ర-తెలంగాణా వివాదాలకు పరిష్కారాలే లేవా? ఏపీ, తెలంగాణా రాష్ట్రాల మధ్య జల, విద్యుత్ వివాదాలు నిత్య ప్రహసనంగా మారాయి. అందువల్ల నిత్యం కేంద్రం జోక్యం కూడా అనివార్యమవుతోంది. కానీ ఒక సమస్యను పరిష్కరించగానే మరొకటి తయారవుతుండటంతో కేంద్రం కూడా తలపట్టుకోవలిసివస్తోంది.   రెండు ప్రభుత్వాలు తమ హక్కులను కాపాడుకోవాలని ప్రయత్నించడంలో తప్పు లేదు. కానీ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు ప్రయత్నించే బదులు ఘర్షణ వైఖరి అవలంభిస్తుండటంతో కేంద్రం జోక్యం చేసుకోవలసివస్తోంది. ఈ గొడవలు ఇలా ఇంకా ఎంతకాలం కొనసాగుతాయి? వీటికి ఎప్పటికయినా శాశ్విత పరిష్కారం దొరుకుతుందా? అనే ప్రజల ప్రశ్నలకు జవాబు ఇచ్చేవారు లేరు. ఈ జల, విద్యుత్ సమస్యలకు ఒక శాశ్విత పరిష్కారం కనుగొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించనంత కాలం ఇవి పునరావృతం అవుతూనే ఉంటాయి. దానివలన రెండు రాష్ట్రాల అభివృద్ధి కుంటుపడటమే కాకుండా ప్రజలు, ప్రభుత్వాల మధ్య మరింత ఘర్షణ వాతావరణం ఏర్పడి చివరికి అది శాశ్విత శత్రుత్వంగా మారే ప్రమాదం ఉంది.   వీటికి కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో పరిష్కారాలు చూపడం సాధ్యం కాదా? అని ఆలోచిస్తే సాధ్యమేనని చెప్పవచ్చును. అవేమిటంటే 1. రెండు రాష్ట్రాలు నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసుకోవడం. 2. ప్రజాభిప్రాయాలను కోరి వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవడం. 3. నదీ జలాల పంపకాలలో డ్యాముల నిర్మాణం, ఎత్తు పెంచడం వంటివాటితో సంబంధం లేకుండా దిగువ రాష్ట్రాలకు న్యాయబద్దంగా సకాలంలో నీళ్ళు విడుదలయ్యే విధంగా కేంద్రం మార్గదర్శకాలు రూపొందించడం. 4. నీళ్ళు, విద్యుత్ మరియు ఇతర వనరుల పంపిణీ కోసం ప్రస్తుతం ఉన్న వ్యవస్థలకు సంపూర్ణ హక్కులు కల్పించి, దేశంలో అన్ని రాష్ట్రాలు వాటికి లోబడి ఉండేలా కటిన చట్టాలు ఏర్పాటు చేయడం.   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వన్నీ తెలియవని కాదు. కానీ, రాజకీయ ప్రభావంతో ఇటువంటి వాటిని అమలు చేయలేకపోతున్నాయి. రాష్ట్ర విభజనపై ఎటువంటి నిర్ణయమూ తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ పదేళ్ళపాటు నాన్చిన కారణంగా రాష్ట్రం అల్లకల్లోలం అయింది. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాలలో శాంతి ఏర్పడకపోగా ఈ సమస్యల వలన క్రమంగా మళ్ళీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అందువల్ల ఇప్పుడు అధికారం చేప్పట్టిన ఎన్డీయే ప్రభుత్వం ఈ సమస్యలకు తాత్కాలిక ఉపాయాలు కాకుండా వీలయినంత త్వరగా శాశ్విత పరిష్కారాలు కనుగొనాలి. ఈ సమస్యలను ఇలాగే నానుస్తూపోతే ఏదో ఇది కూడా తీవ్ర సమస్యగా మారే ప్రమాదం ఉందనే సంగతి గ్రహించి అవసరమయితే ఆంధ్ర-తెలంగాణాల కోసం నిపుణులతో కూడిన ప్రత్యేక వ్యవస్థలు ఏర్పాటు చేయాలి.

నాగార్జున తప్పు ఒప్పుకొన్నట్లేనా?

  నాగార్జున తప్పు ఒప్పుకొన్నట్లేనా? సినీ నటుడు నాగార్జునకు చెందిన యన్ కన్వెన్షన్ సెంటర్ కోసం 3 ఎకరాల 12 గుంటల ప్రభుత్వభూమిని ఆక్రమించినట్లు నిర్దారిస్తూ జీ.హెచ్.యం.సి. అధికారులు మార్కింగ్స్ వేసారు. దానిపై నాగార్జున అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషను వేసారు కూడా. కానీ కోర్టు నాగార్జున పిటిషనుపై మరో విధంగా స్పందించింది. ఇటువంటి చర్యలు తీసుకొనే ముందు సంబంధిత వ్యక్తులకు తప్పనిసరిగా నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది తప్ప కూల్చివేతలు వద్దని వారించలేదు. అంటే ఈరోజు కాకపోయినా రేపయినా జీ.హెచ్.యం.సి. అధికారులు నోటీసులు జారీ చేయడం, ఆ వెనువెంటనే వారు గునపాలు, సమ్మెట్టలు పట్టుకొని తన కట్టడాలను కూల్చివేయడం అనివార్యమని గ్రహించిన నాగార్జున, అటువంటి అవమానకర పరిస్థితులనే చేజేతులా కోరితెచ్చుకోవడం కంటే, జీ.హెచ్.యం.సి. అధికారులు గుర్తించి మార్క్ చేసిన కట్టడాలను స్వయంగా తొలగించడం మంచిదని భావించినందునేమో, నిన్నటి నుండి తన యన్ కన్వెన్షన్ సెంటర్ లో కట్టడాలను కూల్చివేయిస్తున్నారు.   అయితే ఈవిధంగా చేయడం వలన జీ.హెచ్.యం.సి. అధికారులు ఆరోపిస్తున్నట్లు యన్ కన్వెన్షన్ సెంటర్ కోసం కోసం ప్రభుత్వభూమిని ఆక్రమించినట్లు స్వయంగా నాగార్జున అంగీకరించినట్లయింది. తను చట్టబద్దంగానే భూములను కొని వాటిలో నిర్మాణాలు చేసుకొని ప్రభుత్వానికి పన్నులు కూడా చెల్లిస్తున్నానని, వాటిని అక్రమ కట్టడాలని జీ.హెచ్.యం.సి. అధికారులు మార్కింగ్స్ వేయడం తప్పని నాగార్జున ఇంతవరకు కోర్టులో చేసిన వాదనలు కూడా పసలేనివేనని ఆయనే స్వయంగా ద్రువీకరించినట్లయింది. అందువల్ల బహుశః రేపటి నుండి చాలామంది నాగార్జునపై విమర్శలు గుప్పిస్తే అందుకు కూడా ఆయన సిద్దంగా ఉండాలేమో!

డిల్లీ వెళ్లేందుకు అదొక సాకు అంతే!

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీరు చాలా విచిత్రంగా ఉంటుంది. ఆంద్ర రాష్ట్రాన్ని ముప్పతిప్పలు పెడుతున్న తెలంగాణా ప్రభుత్వాన్ని పల్లెత్తు మాటనరు, కానీ స్వంత రాష్ట్ర ప్రభుత్వంపై మాత్రం నిప్పులు చేరుగుతుంటారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలలో చులకన చేయడానికి చేయగలిగినంతా చేస్తుంటారు. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పనిని తానే చేస్తున్నట్లు కేంద్రం వద్దకు వెళ్లి రాష్ట్రానికి అన్ని విధాల సహాయం చేయాలని కోరుతుంటారు. రాష్ట్రంలో ప్రభుత్వంతో నిత్యం కయ్యానికి కాలు దువ్వుతూ, మొగుడుని చితకబాది వీధినపడి ఏడ్చినట్లు, తెదేపా, బీజేపీకి మిత్రపక్షమని తెలిసి ఉన్నప్పటికీ డిల్లీ వెళ్లి దానిపై పిర్యాదులు చేస్తుంటారు.   ఇదంతా రాష్ట్ర ప్రజల మెప్పు పొందేందుకా? లేక ఈ వంకతో డిల్లీ వెళ్లి తన సీబీఐ కేసులు మాఫీ చేసుకోవడానికా? లేక నిత్యం ఇటువంటి హడావుడి ఏదో చేస్తూ మీడియా దృష్టిని ఆకర్షిస్తూ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికా? అనేది ఆయనే చెప్పాల్సి ఉంటుంది. కానీ ఏది ఏమయినప్పటికీ తరచూ ఏదో సాకుతో డిల్లీ పర్యటనలు చేస్తూ కేంద్ర మంత్రులను కలుస్తూనే ఉంటారు.   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా రాష్ట్రాభివృద్ధి, పునర్నిర్మాణం కోసం అనేక చర్యలు చేపడుతున్న సంగతి అందరికీ కనబడుతున్నా, ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రం కనబడక పోవడం విచిత్రం. నిన్న ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి ఐఐటీ, ఎయిమ్స్, విశాఖ నుండి చెన్నై వరకు పారిశ్రామిక కారిడార్, కాకినాడలో హార్డ్ వేర్ పరిశ్రమల ఏర్పాటు వంటివి ప్రకటించడమే కాకుండా, రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరచిన ప్రతీ అంశానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఈరోజు పోలవరం ప్రాజెక్టు క్రింద ముంపుకు గురవుతున్న గ్రామాలను ఆంధ్రాలో విలీనం చేస్తూ లోక్ సభలో బిల్లు ఆమోదింపజేశారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకొని డిల్లీ వెళ్లి ఆర్ధిక మంత్రిని కలిసి రాష్ట్ర విభజన సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అన్నిటినీ అమలు చేయాలని, రాష్ట్రానికి ఉదారంగా ఆర్ధిక సహాయం చేయాలని కోరడం చాలా హాస్యాస్పదం.   ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కూడా గత యూపీయే ప్రభుత్వం లాగే రాష్ట్రం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, తప్పకుండా ఆయన వెళ్లి గుర్తుచేసినా అర్ధం ఉంటుంది. కానీ అడగకుండా కేంద్రమే అన్నిటినీ అమలు చేస్తున్నపుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకొని డిల్లీ వెళ్లి జైట్లీకి మళ్ళీ బొట్టు పెట్టి చెప్పాల్సిన అవసరం ఏముంది? అని ఆలోచిస్తే, ఆయన పర్యటనకు, కేంద్ర మంత్రుల కలవడం వెనుక పరమార్ధం వేరే ఉందని స్పష్టమవుతోంది. తాటి చెట్టు క్రింద కూర్చొని పాలు త్రాగుతున్నా, అది కల్లే అని అందరూ భావించినట్లే, పది సీబీఐ ఛార్జ్ షీట్లు పోగేసుకొన్న జగన్ డిల్లీ వెళ్ళినా అది కేసుల మాఫీకేనని జనాలు అనుమానించడంలో అసహజమేమీ లేదు.   ఒకసారి సీబీఐ కేసులు గనుక తిరిగి మొదలయితే ఆయనకు మళ్ళీ కష్టాలు తప్పవు. గనుక బహుశః ఆయన ముందే జాగ్రత్తగా కేంద్రం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నట్లున్నారు. కానీ అవినీతి భూతాన్ని అంతం చేస్తానని ఎన్నికల ప్రచార సమయంలోనే విస్పష్టంగా ప్రకటించిన నరేంద్ర మోడీ, జగన్ కేసులను ఉపేక్షిస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది.

నిద్రపోకుండా వుండటం ఎలా? రాహుల్‌గాంధీకి సలహాలు!

  బాబూ రాహుల్ గాంధీ... నువ్వు ఈమధ్య ఎక్కడపడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు గుర్రుకొడుతున్నావంటగా? మొన్నీమధ్య పార్లమెంటులో అధిక ధరలు అనే పాయింట్ మీద చర్చ జరుగుతుంటే, నువ్వు ఆ చర్చని ఎంతమాత్రం పట్టించుకోకుండా హాయిగా నిద్రపోయావంటగా! నువ్వు పార్లమెంటులో నిద్రపోతున్న ఫొటోలు చూశాలే. నువ్వు నిద్రపోతున్నప్పుడు మహా అందంగా, అమాయకంగా వుంటావు సుమీ! పార్లమెంటులో నువ్వు హాయిగా నిద్రపోయినా నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం నిన్ను వెనకేసుకొస్తున్నారు. నువ్వు నిద్రపోవడం లేదని, కళ్ళుమూసుకుని ఆలోచిస్తున్నావని, స్పీచ్ వింటున్నావని, మెడిటేషన్ చేస్తున్నావని, తపస్సు చేస్తున్నావని... ఇలాంటి అతకని రీజన్స్ చాలా చెప్పారు, కానీ, నువ్వు నిద్రపోయిన విషయం నీకు తెలుసు... మాకు తెలుసు! అప్పా రాహులప్పా.. నువ్వు సింహం లాంటోడివి.. అది పగలు నిద్రపోతుంది. నువ్వూ పగటిపూటే నిద్రపోతావ్. నిద్ర విషయంలో మాత్రమే మీరిద్దరూ సేమ్ టు సేమ్. అయినా పార్లమెంటులో నిద్రపోవటమేంటీ? ఏబ్బే! సర్లే, నువ్వు పార్లమెంటులో నిద్రపోయావ్.. తర్వాత అడ్డంగా దొరికిపోయావ్.. ఆ విషయం ఇక వదిలేద్దాం. ముందు ముందు నిద్రపోకుండా వుండాలంటే ఏం చేయాలో చెబుతా విను. ఎక్కడైనా భార్యాభర్తలైన రెండు నల్లుల్ని సంపాదించు. వాటిని నీ సీట్లో వదిలిపెట్టు. అవి పిల్లాపాపలతో వర్ధిల్లి నీకు నిద్రపట్టకుండా చేస్తాయి. సమావేశాలకు వెళ్ళే ముందు నీ జుబ్బా జేబులో గుప్పెడు కరెంటు చీమల్ని వేసుకెళ్ళు. నీకు నిద్రనేదే పడితే అప్పుడు అడుగు! నీ రెండు కళ్ళనీ పత్తికాయల్లా తెరిచి అవి మూసుకుపోకుండా టేప్ వేయి. ఇలా చేస్తే సాధారణంగా నిద్ర రాదు. ఒకవేళ అలా కూడా నిద్రపోగలిగే టాలెంట్ నీకు వుంటే ఆ విషయం ఎవరూ కనిపెట్టలేరు. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ పాటిస్తావా? సమాధానం చెప్పవేంటి? ఓయ్ రాహుల్ గాంధీ... ఓ మై గాడ్.. మళ్ళీ నిద్రపోయాడు. ఇప్పుడు నేను చెప్పిందంతా వేస్ట్!

ఫలితం తెలిసి జరుగుతున్న యుద్ధం-పోలవరం

  ఈరోజు లోక్ సభలో పోలవరం ప్రాజెక్టు బిల్లుపై చర్చ జరగనుంది. బీజేపీ, తెదేపాలు బిల్లుకి మద్దతు ఇవ్వాలని తమ సభ్యులకు విప్ జారీ చేయడం గమనిస్తే ఎట్టి పరిస్థితుల్లో బిల్లును ఆమోదింపజేయాలని ధృడ నిశ్చయంతో ఉన్నట్లు అర్ధమవుతోంది. లోక్ సభలో ఎన్డీయేకు పూర్తి మెజార్టీ ఉంది గనుక, తెరాస తదితర ప్రతిపక్షాలు ఎంత వ్యతిరేఖించినప్పట్టికీ, బిల్లు ఆమోదం పొందడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక రాజ్యసభలో కాంగ్రెస్ మిత్రపక్షాలకు ఆధిక్యత ఉన్నప్పటికీ, గత యూపీయే ప్రభుత్వమే పోలవరం ప్రతిపాదన చేసింది గనుక అక్కడ కూడా బిల్లు ఆమోదం పొందడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ వేయబడిన అనేక పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించడం గమనించినట్లయితే, ఇప్పుడు కూడా రాష్ట్రపతి, పార్లమెంటు ఆమోదించబోయే పోలవరం బిల్లును తిరస్కరించే ఆలోచన చేయదనిస్పష్టం అవుతోంది. అంటే పోలవరం ప్రాజెక్టుకు ప్రతిపక్షాల నుండి ఎదురవుతున్న వ్యతిరేఖత వల్ల కొద్దిగా ఇబ్బందే తప్ప ఎటువంటి ఆటంకమూ ఉండదని స్పష్టమవుతోంది. ఈరోజు పోలవరంపై పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద యుద్దమే జరుగబోతోంది. కానీ ఆ యుద్ధంలో ఎవరు విజయం సాధించనున్నారో అందరికీ ముందే తెలిసి ఉన్నప్పటికీ యుద్ధం చేయడమే విశేషం.

పోలవరంపై కాంగ్రెస్ ద్వంద వైఖరితో మరింత నష్టపోనుందా?

    పోలవరం విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరి అవలంబిస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలో గత యూపీయే ప్రభుత్వమే పోలవరం ప్రతిపాదనను విభజన బిల్లులో చేర్చి, ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలిపేందుకు ఆర్డినెన్స్ కూడా తయారుచేసినప్పటికీ, ఆ పార్టీకి చెందిన వీ.హనుమంత రావు వంటి సీనియర్లు, ఒడిష, ఛత్తిస్ ఘర్ మరి కొన్ని ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ యంపీలు తెరాసతో చేతులు కలిపి బిల్లును వ్యతిరేఖించేందుకు సిద్దపడుతుంటే వారిని కాంగ్రెస్ అధిష్టానం వారించే ప్రయత్నం చేయడం లేదు. అదేవిధంగా పార్లమెంటులో పోలవరం బిల్లుకి మద్దతు తెలుపకుండా అలాగని వ్యతిరేఖించకుండా వ్యవహరించాలని కాంగ్రెస్ నిర్ణయించుకొని ద్వంద వైఖరి అవలంభిస్తోంది. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం అనుసరించిన వైఖరి వల్ల రెండు ప్రాంతాలలో తీవ్రంగా నష్టపోయింది.అందుకు ఇప్పుడు తాపీగా పశ్చాతాపపడుతోంది కూడా. అయినప్పటికీ పోలవరం విషయంలో కూడా మళ్ళీ అదే విధంగా ద్వందవైఖరి అవలంభిస్తూ ఆంధ్ర, తెలంగాణా ప్రజల ఆగ్రహానికి గురికాబోతోంది. కాంగ్రెస్ పార్టీ పోలవరానికి సభలో మద్దతు తెలుపకపోతే, తెలంగాణాలో తెరాస ప్రభుత్వం కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేయడం తధ్యం. దానివల్ల అక్కడి ప్రజలకు కాంగ్రెస్ తెలంగాణా ప్రయోజనాలు కాపాడటం లేదనే అభిప్రాయం మరింత బలపడవచ్చును. అదేవిధంగా పోలవరం ప్రతిపాదనను  స్వయంగా విభజన బిల్లులో పొందుపరిచి, దానిని ఆమోదింపజేసి, తీరా చేసి ఇప్పుడు మద్దతు తెలుపకుండా సభలో వెనుకడుగు వేస్తే కాంగ్రెస్ పార్టీపై ఆంద్ర ప్రజలు మరింత ఆగ్రహించడం ఖాయం. 125సం.ల సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ పోలవరం విషయంలో నిశ్చితాభిప్రాయం ప్రకటించ లేకపోవడం వలన తనకు రెండు ప్రాంతాలలో మరింత నష్టం జరుగాబోతోందనే విషయం గ్రహించలేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.

తెలంగాణకీ వరాలిస్తే బాగుండేది!

  నరేంద్రమోడీ ప్రభుత్వం తాను సమర్పించిన మొదటి బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద వరాల జల్లు కురిపించింది. ఆంధ్రప్రదేశ్‌కి విషయంలో చాలా ఉదారంగా వ్యవహరించి వరాల జల్లుకు కురిపించిన కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పొరుగునే వున్న తెలుగు రాష్ట్రం తెలంగాణ మీద మాత్రం ఒక్క చినుకు మాత్రమే కురిపించింది. అది కూడా తెలంగాణలో ఉద్యానవన విశ్వవిద్యాలయం ఏర్పాటు. అయితే ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన ప్రస్తావన విభజన చట్టంలోనే వుంది. అంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రస్తావించిన తెలంగాణకు ఉద్యానవన విశ్వవిద్యాలయం పాతదే తప్ప కొత్త వరం కాదు. అయితే, కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఆ ప్రాంత నాయకులకు బాధని కలిగిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆవేదనను మీడియాతో పంచుకున్నారు. తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా నిర్దయగా వ్యవహరించిందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ప్రతిపక్షంలో వున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ నాయకులు నమ్మినా నమ్మకపోయినా తెలుగుతల్లికి రెండు కళ్ళలో ఒక కన్ను ఆంధ్రప్రదేశ్ అయితే మరో కన్ను తెలంగాణ రాష్ట్రం. మరి ఇప్పుడు తెలుగుతల్లి పరిస్థితి ఒక కంట పన్నీరు, ఒక కంట కన్నీరు అన్నట్టుగా వుంది. ఒక రాష్ట్రంలోని తన బిడ్డలు బడ్జెట్‌లో లభించిన ప్రోత్సాహంతో ఉత్సాహంగా ఉరకలు వేస్తుంటే, మరో రాష్ట్రంలో వున్న తెలుగు బిడ్డలు బడ్జెట్‌లో ఎలాంటి ప్రోత్సాహకాలు లేక బాధపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ, తెలంగాణ నాయకులు సీమాంధ్ర ప్రజలను ఎంతగా తిట్టిపోస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణకు కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని వరాలు ప్రకటిస్తే బాగుండేదన్న అభిప్రాయాలు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతి ఖాయం!

  కేంద్రంలో నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టగానే దేశ ప్రజలకి, రాజకీయ వర్గాలకి, పారిశ్రామిక వర్గాలకి ఒక విషయం చాలా క్లారిటీగా అర్థమైపోయింది. ఆ విషయం మరేదో కాదు.. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతి ఖాయం! రాష్ట్రం ముక్కలు కావడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా చాలా వెనుకబడిపోయినప్పటికీ, ప్రగతిశీలి, మంచి విజన్ వున్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల దేశానికి నమ్మకం కుదిరింది. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ని వ్యవసాయం పరంగా మాత్రమే కాకుండా పారిశ్రామికంగా కూడా ముందుకు తీసుకువెళ్ళే విషయంలో కృతనిశ్చయుడిగా వుండటంతో దేశంలోని బడా పారిశ్రామిక సంస్థలన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రామిక ప్రగతి బాగా జరుగుతుందన్న నమ్మకం ఇప్పుడు దేశ పారిశ్రామికవర్గాల్లో ఏర్పడింది. అందుకే అనేకమంది బడా పారిశ్రామికవేత్తలు చంద్రబాబు నాయుడితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోని అంశాలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం భవిష్యత్తులో పారిశ్రామికంగా ఎంత ముందడుగు వేస్తుందో చెప్పకనే చెప్పాయి. కాకినాడలో హార్డ్ వేర్ పార్కు, కృష్ణపట్నం రేవు అభివృద్ధి, అక్కడే ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు, ఇంకా విశాఖ పట్టణం నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్... ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందడుగు వేయడానికి ఎంతో సహకరిస్తాయి.

వైసీపీ గొంతులో బడ్జెట్ వెలక్కాయ!

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పని చేసినా విమర్శించడమే తక్షణ కర్తవ్యంగా పెట్టుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన బీజేపీ కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో వ్యతిరేకంగా వ్యాఖ్యానించడానికి వీల్లేని పరిస్థితుల్లో వుంది. తన పాత అలవాటు ప్రకారం బడ్జెట్‌ని విమర్శించాలని మనసులో వున్నప్పటికీ ఆ పని చేయలేకపోతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం పూర్తయిన తర్వాత తెలుగుదేశం ఎంపీలు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం బడ్జెట్ చాలా బాగుందని, ఆంధ్రప్రదేశ్‌కు వరాలు కురిపించడం సంతోషాన్ని కలిగించిందని అన్నారు. ఇంకా కొన్ని వరాలు ఇస్తే బాగుండేదని, అయితే ఒకేసారి అన్నీ అడగటం కూడా భావ్యం కాదని అభిప్రాయపడ్డారు. వైసీపీ పద్ధతి ఏమిటంటే, తెలుగుదేశం పార్టీ ఎడ్డెం అంటే తాను తెడ్డెం అనడం. టీడీపీ బడ్జెట్ బాగుందని అన్నది కాబట్టి వైసీపీ బాగాలేదని అనాలి. టీడీపీ ఎంపీలు బడ్జెట్ బాగుందని అన్నారు కాబట్టి వైసీపీ ఎంపీలు బాగాలేదని చెప్పాలి. కానీ వారు ఆ పని చేయలేదు. వైసీపీ ఎంపీలు, నాయకులు కేంద్ర బడ్జెట్ పర్లేదన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు జగన్ వున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించి లేనిపోని శత్రుత్వం తెచ్చుకోవడం కంటే, పూర్తి స్వింగ్‌లో వున్న కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడి సేఫ్‌గా వుండటమే మంచిదని భావిస్తున్నట్టున్నదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అందుకే కేంద్ర బడ్జెట్‌ మీద వైసీపీ నాయకులు వ్యతిరేకతను ప్రదర్శించడం లేదని భావిస్తున్నారు. మొత్తమ్మీద వైసీపీ నాయకులకు బడ్జెట్‌ని విమర్శించాలని వున్నా, విమర్శించలేకపోతున్నారు. నరేంద్రమోడీ ప్రభుత్వం బడ్జెట్ వైసీపీ నాయకుల గొంతుల్లో వెలక్కాయ మాదిరిగా తయారైంది.

ఇది అందరి బడ్జెట్.. ఆంధ్రుల బడ్జెట్!

  కేంద్రంలో అధికారం చేపట్టిన నరేంద్రమోడీ ప్రభుత్వ ప్రతినిధిగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను దేశ ప్రజలందరి బడ్జెట్‌గా చెప్పుకోవచ్చును. ముఖ్యంగా ఈ బడ్జెట్‌ను ఆంధ్రుల బడ్జెట్‌గా మరీ మరీ చెప్పుకోవచ్చును. రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతగానో నష్టపోయింది. ఆ నష్టాన్ని పూడ్చడానికి, ఆంధ్రుల ఆవేదనను తగ్గించడానికి తాను కట్టుబడి వున్నానని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్నో సందర్భాలలో మాట ఇచ్చారు. ఆయన తన మాటకు కట్టుబడి ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం ముదావహం. ముఖ్యంగా ఈ బడ్జెట్‌నందు ప్రకటించినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ఐఐటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయము, ఎయిమ్స్ ఆస్పత్రి, కాకినాడలో హార్డ్ వేర్ పార్కు, కృష్ణపట్నం రేవు అభివృద్ధి, అక్కడే ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు, ఇంకా విశాఖ పట్టణం నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్, అనంతపురం జిల్లా హిందూపూర్‌లో నేషనల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అకాడమీ ఏర్పాటు... ఈ అంశాలన్నీ ఆంధ్రప్రదేశ్‌కి సంతోషాన్ని కలిగించేవే. విశాఖ - చెన్నై మధ్య 20 పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటు అంటే, ఒకటీ రెండు తప్ప అన్నీ మన రాష్ట్రంలోనే ఏర్పాటయ్యే అవకాశం వుంది. దేశంలో ఇంతవరకు ప్రవేశపెట్టిన ఏ బడ్జెట్‌లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత విరివిగా వరాలు ఇచ్చిన సందర్భాలు లేవని చెప్పవచ్చు. సాధారణంగా ఒకే రాష్ట్రానికి ఒకేసారి ఇన్ని వరాలు ఇచ్చిన సందర్భంలో ఇతర రాష్ట్రాల వారు నొచ్చుకునే అవకాశాలు వుంటాయి. అయితే ప్రత్యేక పరిస్థితులలో వున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఇన్ని వరాలు ఇవ్వడం పట్ల ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం హర్షణీయం. మొత్తమ్మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోవడానికి ఈ బడ్జెట్‌లో లభించిన వరాలు శుభారంభాన్ని ఇస్తాయని భావించవచ్చును.

మోడీ ప్రభుత్వం మొదటి బడ్జెట్ అద్భుతం!

  కేంద్రంలో అధికారంలో వున్న నరేంద్రమోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తన మొదటి బడ్జెట్‌నే చాలా అద్భుతమైన బడ్జెట్‌గా ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌లో ఎక్కువ అంశాలు ప్రజలకు ఆనందాన్ని కలిగించేవే వున్నాయని భావించవచ్చును. కొన్ని విషయాలలో ప్రజలకు కొంత భారం కలిగించే అవకాశం వున్నప్పటికీ అవి చిరునవ్వుతో భరించేవిగానే వుండటం చెప్పుకోదగ్గ విషయం. మొత్తం బడ్జెట్ కలిగించిన ఆనందం ముందు చిన్నచిన్న భారాలు పెద్ద లెక్కలోనివి కావు. మొత్తంమీద కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రజామోదాన్ని పొందే బడ్జెట్‌నే రూపొందించారని చెప్పవచ్చును. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టే మొదటి బడ్జెట్ మీద దేశవ్యాప్తంగా అందరి చూపులు నిలిచి వున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వ బడ్జెట్‌ని చీల్చి చెండాడటానికి సిద్ధంగా వున్నది. గురువారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించినప్పుడు పార్లమెంటు సభ్యులు, టీవీల్లో బడ్జెట్ ప్రసంగాన్ని చూస్తున్న చాలామంది చాలా ఉత్కంఠను అనుభవించారు. అరుణ్ జైట్లీ బడ్జెట్ మోదంగా వుంటుందా, ఖేదంగా వుంటుందా అన్న ‘సస్పె్న్స్’ వారిని ఎంతో ఉత్కంఠకి గురిచేసినది. అయితే జైట్లీ ప్రసంగం ముందుకు వెళ్తున్న కొద్దీ అందరి మనసులు తేలిక అవడం ప్రారంభమైనది. జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో దేశ ప్రజల మీద వరాల జల్లులు కురిపించారు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్న వేళ జైట్లీ బడ్జెట్ ప్రసంగం దేశ ప్రజల మీద చల్లటి జల్లులు కురిపించిందనుటలో ఎంతమాత్రము అతిశయోక్తి లేదని భావించవచ్చును. రైల్వే బడ్జెట్ దేశ ప్రజలకు ఎంత ఆహ్లాదాన్ని కలిగించిందో, సాధారణ బడ్జెట్ అంతకంటే ఎక్కువ ఆహ్లాదాన్ని కలిగించింది. ఎక్కువ వడ్డింపులు లేకుండా వరాల ప్రవాహంలా సాగిన నరేంద్రమోడీ ప్రభుత్వ మొదటి బడ్జెట్ దేశ ప్రజలకు మోదాన్నే కలిగించింది. ప్రతిపక్ష పార్టీలు విమర్శించడానికి కూడా వీలు లేని విధంగా బడ్జెట్ వుంది. అయితే ఈ బడ్జెట్ విషయంలో ప్రతిపక్షాలు చేసే విమర్శలన్నీ ప్రతిపక్షంలో వుండి విమర్శించాలి కాబట్టి విమర్శించినట్టుగా భావించవచ్చును.

మళ్ళీ ఎన్నికలు జరపాలా? పద్ధతేనా?

  మొన్నీమధ్య దేశంలో ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల సందర్భంగా జరిగిన వ్యయం, ప్రలోభాలు, హింస, అధికార దుర్వినియోగం... ఇలాంటివన్నీ చూసి దేశ ప్రజలు.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా విసిగిపోయి వున్నారు. మరో ఐదేళ్ళ వరకూ ఎన్నికల ఊసే లేకుండా వుండాలని కోరుకుంటున్నారు. అయితే వైసీపీ అధినేత జగన్ మాత్రం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అర్జెంటుగా ఎన్నికలు వస్తే బాగుందని అనుకుంటున్నారు. అది అసాధ్యమైన విషయమని తెలిసినా, ఆయన మనసులో మాత్రం మళ్ళీ ఎన్నికలు వస్తే మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చని అనుకుంటున్నారు. ఆయన మనసులో వున్న ఈ విషయం ఆయన మాటల్లో బయటపడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుటికప్పుడు మళ్ళీ ఎన్నికలు పెడితే ఇప్పుడు 67 అసెంబ్లీ స్థానాలు వున్న వైకాపా 167 స్థానాలకు ఎగబాకుతుందట. ఈమధ్య ఒక సందర్భంలో జగన్ నోట్లోంచి ఈ మాట వచ్చింది. అంటే, మరోసారి ఎన్నికలు పెడితే జగన్‌కి హ్యాపీయే అన్నమాట! అసలు మళ్ళీ ఎన్నికలు ఎందుకు పెట్టాలి? చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టి నెల రోజులు కూడా కాకుండానే అంత కొంపలు మునిగిపోయే అంశాలు ఏం జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా వుండే పని ఒక్కటయినా చేసిందా? లేదే? మరి అలాంటప్పుడు రాష్ట్ర ప్రజలందరూ జగన్ ప్రదర్శించిన ఏ ప్రతిభను చూసి మురిసిపోయి 67 సీట్లున్న ఆయనకి 167 సీట్లు ఇస్తారు? అయినా వెంటనే ఎన్నికలు జరగాలన్న కుళ్ళు ఆలోచన వచ్చిన జగన్ని అసలు ఏమనాలి? ఎన్నికల రూపంలో ప్రజాధనం ఎంత వృధా అయిపోయినా పర్లేదు.. తనక మాత్రం అధికారం దక్కాలి. ఇదీ జగన్ మనసులో వున్న ఆలోచన. జగన్ కోరుకున్నట్టు నిజంగా ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగితే జగన్ పార్టీకి ఇప్పుడున్న 67 స్థానాలకు బదులు 7 స్థానాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని జగన్ గ్రహిస్తే మంచిదని రాజకీయ పరిశీకులు భావిస్తున్నారు.

తెలంగాణ కత్తికి ఎటైనా పదునే!

  తెలంగాణ రాజకీయ నాయకుల కత్తికి రెండు వైపులా పదును వుంటుంది. వాళ్ళ నాలుకలకు ఏ తరహాలో అయినా మాట్లాడే శక్తి వుంటుంది. ఈ విషయం తాజాగా మరోసారి రుజువైంది. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తెలంగాణ బిల్లు అసెంబ్లీకి రాకపోయినా పర్లేదని, ఒకవేళ బిల్లు అసెంబ్లీకి వచ్చినా కేవలం అభిప్రాయం తెలుసుకోవడానికే తప్ప అసెంబ్లీ చెప్పినట్టు చేయడానికి కాదని, ఒకవేళ అసెంబ్లీ బిల్లును తిప్పి పంపినా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి వుందని తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులు వాదించారు. మొత్తానికి తెలంగాణ బిల్లును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ తిరస్కరించినప్పటికీ కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేసింది. ఇది ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు వర్తమానంలో సేమ్ ఇలాంటి అంశం మీదే తెలంగాణ నాయకులు మరోలా మాట్లాడుతూ, వినేవాళ్ళ కళ్లు తెరిపిస్తున్నారు. పోలవరం ముంపు మండలాల ఆర్డినెన్స్ విషయంలో కేంద్రం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు తెలంగాణ నాయకులు తాము గతంలో చేసిన వాదనకు పూర్తి రివర్స్‌గా వుండే వాదనలు చేస్తున్నారు. వారి తాజా వాదన ఏంటంటే, ఏ రాష్ట్రానికైనా సరిహద్దులు మార్చే బిల్లును పార్లమెంటు ఆమోదించాలంటే మొదట ఆ బిల్లును సదరు రాష్ట్ర శాసనసభకు పంపాలట. ఆ రాష్ట్ర శాసనసభ ఒప్పుకుంటేనే సరిహద్దులు మార్చాలట, శాసనసభ ఒప్పుకోకపోతే సరిహద్దులు మార్చడానికి వీల్లేదట. ఇప్పుడు చెప్పండి.. తెలంగాణ రాజకీయ నాయకుల నాలుకలకు రెండువైపులా పదునే కదూ!

అవి కక్ష సాధింపు చర్యలేనట!

   కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీకి ఆదాయపన్ను శాఖ నోటీసులు పంపింది. వారిరువురి అధ్వర్యంలో నడిచిన నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక మూతపడిన తరువాత, దాని ఆస్తులను ఇతర సంస్థలకు అప్పుగా ఇవ్వడం వ్యాపారపరమయిన లావాదేవీగానే భావిస్తూ, ఆ లావాదేవీలపై వచ్చిన ఆదాయంపై పన్నుఎగవేసినందుకు ఆదాయపన్ను శాఖా నోటీసులు జారీ చేసింది.   దీనిపై సోనియా గాంధీ స్పందిస్తూ మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టిందని, అటువంటి వాటికి తాను భయపడేది లేదని, తమను ఎంతగా ఇబ్బందిపెడితే తాము అంత శక్తివంతంగా తయారయ్యి మళ్ళీ అధికారంలోకి వస్తామని అన్నారు. అయితే ఇంతకాలం మిత్ర పక్షాలను, ప్రతిపక్షాలను వేదించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఇప్పుడు తనవంతు రాగానే దానిని కక్ష సాధింపు చర్యలని వర్ణించడం హాస్యాస్పదం.   కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె తన రాజకీయ ప్రత్యర్ధులను లొంగదీసేందుకు సీబీఐను ఏవిధంగా వాడుకొందో అందరికీ తెలుసు. కాంగ్రెస్ ఎంతగా తెగించిందంటే చివరికి తనకు బయట నుండి మద్దతు ఇస్తున్న సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ నేతలపై కూడా సీబీఐని ప్రయోగించి, తనకు మద్దతు కొనసాగించేలా చేసుకొంది. ఆ విషయాన్ని స్వయంగా సమాజ్ వాదీ పార్టీ నేతలే చెప్పుకొన్నారు కూడా. కాంగ్రెస్ వైఖరితో చివరికి సుప్రీం కోర్టు సైతం విసుగెత్తిపోయి, “కాంగ్రెస్ చేతిలో సీబీఐ పెంపుడు చిలకలా మారిపోయిందని, దానికి అనేకమంది యజమానులున్నారని” చురకలు వేసింది. తన కుమారుడు రాహుల్ గాంధీ పట్టాభిషేకానికి సైంధవుడిలా అడ్డుపడుతున్ననరేంద్ర మోడీపై కూడా సీబీఐ చిలుకలను ప్రయోగించింది. కానీ సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు సంస్థ-సిట్ మోడీకి క్లీన్ చిట్ ఇవ్వడంతో ఆయన కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి తప్పించుకోగలిగారు. ఆవిషయాలన్నీ మరిచిపోయిన సోనియాగాంధీ, ఇప్పుడు తనకు ఆదాయపన్ను శాఖ నోటీసులు అందగానే అది మోడీ ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్యలని గగ్గోలు పెట్టడం హాస్యాస్పదం.

భ్రమలు కలిగించని రైల్వే బడ్జెట్!

  నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ఇటీవలి కాలంలో అత్యుత్తమ రైల్వే బడ్జెట్‌లలో ఒకటిగా నిలిచే బడ్జెట్ అని పేర్కొనవచ్చని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రతిపక్ష పార్టీలయిన యుపిఎ పక్షాలు పైకి ఈ బడ్జెట్‌లో ఏమీ లేదని పెదవులు విరిచినప్పటికీ మనసులలో మాత్రం ఇలాంటి చక్కని బడ్జెట్ తాము ఎప్పుడూ ప్రవేశపెట్టలేకపోయామే అని అసూయపడక తప్పదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ అత్యుత్తమ బడ్జెట్ అని చెప్పడానికి ఈ బడ్జెట్‌లో ఆకర్షణీయమైన అంశాలు ఏమి వున్నాయి? గత బడ్జెట్‌లతో పోలిస్తే కొత్త రైల్వే లైన్లు ఎన్నిటిని ఓకే చేశారు? ఎన్ని కొత్త రైళ్ళు ప్రకటించారు అనే సందేహాలు కలగవచ్చు. కానీ అలాంటి భ్రమలేవీ దేశ ప్రజలకు కల్పించకపోవడమే ఈ బడ్జెట్ అత్యుత్తమ బడ్జెట్ అని చెప్పడానికి గత ఒక ప్రధాన అంశం. గత ప్రభుత్వాలు రైల్వే బడ్జెట్‌లను ప్రవేశపెట్టినప్పుడు కొత్త రైల్వే లైన్ల విషయంలో, కొత్త రైళ్ళ విషయంలో, రైల్వే అభివృద్ధి పనుల విషయంలో పుంఖాను పుంఖాలుగా హామీలను, ప్రణాళికలను బడ్జెట్ ప్రతిపాదనలలో పెట్టాయి. ఆ క్షణంలో అవి ప్రజల్లో విపరీతమైన ఆనందాన్ని కలిగించి వుండొచ్చు. అయితే సదరు బడ్జెట్‌లలో పేర్కొన్న హామీలలో ఎన్ని కార్యరూపం దాల్చాయన్న విషయాన్ని పరిశీలిస్తే ఒక భ్రమలాగా ప్రజల్ని ఆవరించిన ఆ ఆనందం ఆవిరైపోవడం ఖాయం. ఎందుకంటే గత రైల్వే బడ్జెట్‌లలో ప్రకటించిన అనేక హామీలు, వరాలు ఎన్నో మూలనపడిపోయాయి. అలాంటి మూలన పడిపోయే హామీలు గుప్పించకుండా, దేశ ప్రజల్ని భ్రమల్లో ముంచకుండా వాస్తవ రూపంగా వున్న రైల్వే బడ్జెట్‌గా సదానంద గౌడ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌ని రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.

రాహుల్ గాంధీ ఓవరాక్షన్ చూతము రారండీ!

  వంద సంవత్సరాల వయసు దాటిన కాంగ్రెస్ పార్టీకి దేశంలో నూరేళ్ళూ నిండేలా చేసిన ఘనత శ్రీమతి సోనియాగాంధీకి, మాస్టర్ రాహుల్ గాంధీకి దక్కింది. రాజీవ్ గాంధీ భార్య, కొడుకు కావడం మినహా ఎలాంటి రాజకీయ పరిపక్వత లేని వీళ్ళిద్దరి చేతిలో చిక్కుకుపోయిన కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో కూరుకుపోయి, మొన్న జరిగిన ఎన్నికలలో దిక్కూదివాణం లేకుండా పోయింది. ఈ ఎన్నికలలో భవిష్యత్తులో కూడా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, ఆమాటకొస్తే కాంగ్రెస్ పార్టీ కొన్నేళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ అడ్రస్ కూడా లేకుండా పోయే అవకాశం వుందన్న క్లారిటీ రాజకీయ పరిశీలకులకు వచ్చేసింది. అందరికీ వచ్చిన క్లారిటీ రాహుల్ గాంధీకి రాకుండా వుంటుంది. ఈ క్లారిటీ ఆయనకి కూడా వచ్చే వుంటుంది. కానీ ఏమీ రానట్టే కనిపిస్తున్నారు. మూడు రోజుల క్రితం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంటులోనూ, పార్లమెంటు ఆవరణలోనూ రాహుల్ గాంధీని చూస్తున్న జనం బిత్తరపోతున్నారట. ఎందుకంటే ఆయన ఈ మూడు రోజులుగా చాలా ఉత్సాహంగా కనిపిస్తూ వున్నారు. ఎప్పుడు చూసినా అందర్నీ నవ్వుతూ పలకరిస్తున్నారట. అధికారంలో ఉన్నప్పటికంటే చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారట. భారత ప్రజలు తమని, తమ పార్టీని ఇంటికి సాగనంపారన్న దిగులు ఏ కోశానా ఆయన ముఖంలో కనిపించడం లేదట. తన జీవితంతో ఎప్పుడూ ఎవరినీ పలకరించి ఎరుగని వాళ్ళని కూడా పేరు పెట్టి మరీ పిలిచి పలకరిస్తూ చాలా ఉల్లాసంగా మాట్లాడుతున్నారట. రాహుల్ గాంధీ ఈ యవ్వారమంతా చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయన గారి మాతృమూర్తి సోనియాగాంధీ మురిసిపోతూ వుండొచ్చేమోగానీ, మిగతా రాజకీయ వర్గాలు మాత్రం రాహుల్ గాంధీ చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఓటమి తెచ్చిన అవమాన భారంలో పీకలదాకా కూరుకుపోయి వున్న రాహుల్ గాంధీ తన బాధ బయటకి తెలియకుండా వుండటం కోసం ఇలా అతి ఉల్లసాన్ని ప్రదర్శిస్తున్నారని భావిస్తున్నారు. రాహుల్ గాంధీ దిగులుగా ఓ మూలన కూర్చుని వుంటే చూసేవాళ్ళకి పెద్దగా ఇబ్బందేమీ వుండదని, అయితే ఇలా అతి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ప్రదర్శించడాన్నే చూడలేకపోతున్నామని అంటున్నారు. అంచేత రాహుల్ గాంధీ తన ఓవర్ యాక్షన్ని ఆపితే మంచిదని భావిస్తున్నారు.

ఏపీలో వుండాలంటేనే భయమా? అబ్బ ఛా!

  వైసీపీ నాయకుడు జగన్ గారు నిన్నగాక మొన్న ఒక సూపర్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. స్థానిక సంస్థల అధ్యక్ష పీఠాల ఎన్నికలు ముగిసిన తర్వాత వైసీపీ నెత్తిన తెల్లగుడ్డ పడింది. చాలామంది వైసీపీ నాయకులు సదరు పార్టీకి గుడ్‌బై చెప్పేసి తెలుగుదేశం అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. వైపీసీ మనుషుల్ని పెట్టి వాళ్ళని ఆపాలని ప్రయత్నించినప్పటికీ జగన్ ధోరణికి విసిగిపోయి వున్న చాలామంది ఆ పార్టీ నాయకులు టీడీపీ అధ్యక్ష అభ్యర్థలకు మద్దతు ప్రకటించారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని జగన్ గవర్నర్ దగ్గరకి వెళ్ళి తన బాధని మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా జగన్ గారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వుండాలంటేనే భయం వేస్తోందనే మాట వాడారు. జగన్ ఈ మాట వాడటం దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక సమస్యల్లో కూరుకుపోవడానికి ప్రధాన కారణం జగన్. రాష్ట్ర విభజన జరగడానికి కూడా ఆయనే ప్రధాన కారణం. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం తన పని తాను చేసుకోనివ్వకుండా అడ్డు పడుతున్న వ్యక్తి జగన్. మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని భయపెడుతున్న జగన్ తాను భయపడిపోతున్నానని అనడం చాలా కామెడీగా వుందని పరిశీలకులు అంటున్నారు. ఇలాంటి విచిత్రమైన కామెంట్లు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ పరువు జాతీయ స్థాయిలో పోయేలా చేయకుండా, ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తనవంతు సహకారాన్ని అందిస్తే బాగుంటుందని అంటున్నారు.

నరసింహన్ ఇంటికి వెళ్ళక తప్పదా?

  అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కుంభకోణానికి సంబంధించి సీబీఐ జరుపుతున్న విచారణ ప్రక్రియలో భాగంగా సీబీఐ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ని కూడా ప్రశ్నించింది. అగస్టా హెలికాప్టర్ల కొనుగోలు అంశంతో ప్రమేయం వున్న నారాయణన్, వాంగ్ ఛూలను సీబీఐ ఇప్పటికే ప్రశ్నించడం, మొన్నటి వరకూ గవర్నర్ పదవులను వెలగబెట్టిన వారిద్దరూ తమ పదవుల నుంచి తప్పుకోవడం తెలిసిందే. ఇప్పుడు సీబీఐ నరసింహన్‌ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో నరసింహన్ గవర్నర్‌ గిరీకి రాజీనామా చేయక తప్పదా అనే సందేహాలు కలుగుతున్నాయి. అయితే సీబీఐ నరసింహన్‌ని ప్రశ్నించింది. స్కామ్‌లో భాగస్వామి రూపంలో కాదు.. కేవలం ఒక సాక్షిగా మాత్రమే కావడంతో ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలు మరోవైపు వినిపిస్తున్నాయి. యుపిఎ హయాంలో నియమితులైన గవర్నలను తొలగించే ప్రయత్నాల్లో భాగంగా పావులు కదుపుతున్న ఎన్డీయే ప్రభుత్వం నరసింహన్‌ని కూడా సాగనంపడానికే సీబీఐ ఆయనని ప్రశ్నించేలా చేసిందా అనే సందేహాలు వున్నప్పటికీ, ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నరసింహన్‌ని పదవి నుంచి తప్పుకోవాలని కోరుతూ ఎలాంటి సూచనా చేయలేదు. యుపీఏ హయాంలో నియమితులైన గవర్నర్లలో ‘పర్లేదు కొనసాగించవచ్చు’ అని భావిస్తున్న వారిలో నరసింహన్ పేరు కూడా వుందన్న అభిప్రాయాలు ఇంతవరకూ వ్యక్తమవుతూ వచ్చాయి. నరసింహన్‌ పదవికి ఇప్పట్లో ఇబ్బందేమీ లేదన్న సంకేతాలే ఇంతవరకూ అందుతూ వచ్చాయి. అయితే అకస్మాత్తుగా నరసింహన్‌ని కూడా కేంద్రం ముగ్గులోకి లాగడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి లోను చేసింది. ఈ నేపథ్యంలో గవర్నర్ల తొలగింపు కార్యక్రమాన్ని, అగస్టా స్కామ్‌ విచారణను ఒకే గాటన కట్టాలా, వద్దా, ఈ విచారణ గవర్నర్లను తొలగించడానికే చేస్తున్నారా అనే సందేహాలు కూడా జనాన్ని కన్ఫ్యూజన్‌కి గురి చేస్తున్నాయి. అయినా ఈ విషయం మీద అతి తక్కువ వ్యవధిలోనే క్లారిటీ వచ్చే అవకాశం వుంది. సీబీఐ ప్రశ్నించిన నరసింహన్ త్వరలో ఈ విషయం మీద ప్రతిస్పందించే అవకాశం వుంది. అప్పుడే నరసింహన్ భవితవ్యం ఏమిటో స్పష్టంగా అర్థమవుతుంది.