జగన్ పార్టీ బుద్ధి మరోసారి బయటపడింది!

  ఎంత దాచుకుందామని, బయటపడకుండా వుందామని ప్రయత్నించినా కొంతమంది బుద్ధి ఇట్టే బయటపడిపోతూ వుంటుంది. ప్రస్తుతం జగన్ పార్టీ అలాంటి స్థితిలోనే వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నా్రు. ప్రస్తుతం జగన్ పార్టీకి చంద్రబాబును ఏదోరకంగా ఇరకాటంలో పెట్టి తాను రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఆలోచనలోనే వుంది. తాను కోరుకుంటున్నదాన్ని సాధించడం కోసం ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల క్షేమాన్ని కూడా ప్రమాదంలోకి నెట్టడానికి వెనుకాడటం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ఉదాహరణగా హైదరాబాద్‌లో శాంతిభద్రతలకి సంబంధించిన అధికారాలను గవర్నర్‌కి అప్పగించే విషయంలో వైసీపీ నాయకుల స్పందనను చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా వున్న హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలకు సంబంధించిన అధికారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఒక్కడానికే ఇవ్వడం వల్ల హైదరాబాద్‌లో స్థిరపడిన సీమాంధ్రులకు ఇబ్బందులకు ఎదురయ్యే అవకాశం వుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. చంద్రబాబు రాసిన ఈ లేఖ అటు ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఇటు తెలంగాణలో వున్న సీమాంధ్రులలో కూడా సంతోషాన్ని కలిగించింది. పోలీసు వ్యవస్థపై గవర్నర్‌కి అధికారాలు కల్పించడం ద్వారా తమకు భద్రత వుంటుందని హైదరాబాద్‌‌లోని సీమాంధ్రులు భావిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష హోదాలో వున్న వైసీపీ మాత్రం దీనికి పెడార్ధాలు తీస్తోంది. గవర్నర్‌కి అధికారాలు ఇవ్వాలంటే చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం పెద్ద తప్పని, కేంద్రం కూడా ఆ దిశగా అడుగులు వేయడం అంతకంటే ఘోరమైన తప్పు అన్నట్టుగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌లో వున్న తెలుగువారికి ఏ సమస్య వచ్చిందని గవర్నర్‌కి అధికారాలు ఇవ్వాలని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. తమ రాష్ట్రంలో ప్రతిపక్షంగా వున్న వైసీపీ నాయకులు తమకు నష్టం కలిగించే రకంగా మాట్లాడుతూ వుండటం చూసి సీమాంధ్ర ప్రజలు ఆవేదన చెందుతున్నారు. పోనీలే కదా అని వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఈరకంగా వ్యవహరిస్తోంది, పొరపాటుగా అధికారాన్ని ఇచ్చి వుంటే ఇంకెంత దారుణంగా వ్యవహరించేదో అని అనుకుంటున్నారు. చంద్రబాబు నిర్ణయాన్ని విమర్శించడం మానుకుని, హైదరాబాద్‌లో శాంతిభద్రతలు గవర్నర్ చేతిలోకి వెళ్ళేలా సహకరిస్తే మంచిదని అంటున్నారు.

రియల్ ఎస్టేట్ రాబందులకు చెక్!

  ఎక్కడ అభివృద్ధి జరుగుతూ వుంటే అక్కడ రియల్ ఎస్టేట్ రాబందులు వాలిపోతూ వుంటాయి. ప్రస్తుతం అభివృద్ధికి అపారమైన అవకాశాలున్న ఆంధ్రప్రదేశ్ మీద రియల్ ఎస్టేట్ రాబందుల దృష్టి పడింది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పాటు అంశాన్ని ఈ రాబందులు క్యాష్ చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. రాజధాని ఏర్పడే ప్రాంతంలో భూముల ధరలు విపరీతంగా పెంచేసి సదరు భూములు అటు ప్రభుత్వానికి, ఇటు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా చేసే ప్రయత్నాలు ఎప్పుడో ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు పరిసరాల్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటడానికి ప్రధాన కారణం రియల్ ఎస్టేట్ వ్యాపారులే. విజయవాడ, గుంటూరు పరిసరాల్లో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలలో రాజధాని వస్తుందంటూ వదంతులను వ్యాపింపజేసి చాపకింద నీరులాగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ దగ్గర వున్న భూములను చల్లగా అమ్ముకుని కోట్లు గడిస్తున్నారు. నిజంగా సదరు ప్రాంతంలో రాజధాని వచ్చేస్తుందేమోనన్న ఆశతో చాలామంది సామాన్యులు తక్కువ ధర వుండే భూములను ఎన్నో రెట్లు ఎక్కువ ధరకు కొనుగోలు చేసి మోసపోతున్నారు. రియల్ఎస్టేట్ వ్యాపారులు ఎలాగైతే హైదరాబాద్‌లో సామాన్యుడికి సొంత ఇల్లు లేకుండా చేశారో అదే వ్యూహాన్ని కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అనుసరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల పుణ్యమా అని భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ ధోరణికి కళ్ళెం వేయడానికి, రియల్ ఎస్టేట్ రాబందులకు చెక్ పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. విజయవాడ పరిసరాల్లో భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించింది. అయితే ఈ నిషేధం చట్టపరంగా కుదరదన్న అభిప్రాయాలు వినిపిస్తూ వుండటంతో ఈ మార్గం కాకపోతే మరో మార్గంలో అయినా భూముల ధరలకు కళ్ళెం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

ఏపీ, తెలంగాణ విషయంలో కేంద్రం వ్యూహాత్మకం!

  కేంద్రంలో అధికారంలో వున్న భారతీయ జనతాపార్టీకి సంపూర్ణ మెజారిటీ వుంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, ఏం చేయదలచుకున్నా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చేసే అవకాశం పూర్తిగా వుంది. తాను చేయదలచుకున్న ఏ పనికైనా ఏ పార్టీ నుంచి అయినా మద్దతు కోరాల్సిన పరిస్థితి లేదు. నిజానికి సంపూర్ణ మెజారిటీ లభించిన భారతీయ జనతాపార్టీ సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే శక్తి వున్నా తన మిత్రపక్ష పార్టీలన్నిటినీ కలుపుకుని ఎన్డీయే ప్రభుత్వాన్నే ఏర్పాటు చేసింది. ఇలా అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తున్న కేంద్ర ప్రభుత్వం అదే సమయంలో తాను ఎవరికీ దొరికిపోకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా వివేకంతో వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన రెండు కీలక అంశాలు కేంద్ర ప్రభుత్వం ముందు వున్నాయి. అవి ఒకటి పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ జారీ చేసిన ఆర్డినెన్స్‌కి బిల్లు రూపంలో పార్లమెంట్ ఆమోదం పొందేలా చేయడం. రెండోది హైదరాబాద్‌లో పోలీసు వ్యవస్థకి సంబంధించిన అధికారాలు గవర్నర్‌కి అప్పగించడం. ఈ రెండు అంశాలనీ తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మరోవైపు ఈ రెండు అంశాలూ సీమాంధ్రులకు చాలా కీలకమైన అంశాలు. తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నప్పటికీ ఈ రెండు అంశాలనూ కచ్చితంగా అమలులోకి తేవాలన్న కృతనిశ్చయంతో మోడీ ప్రభుత్వం వుంది. మోడీ ప్రభుత్వం చేయదలచుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాగైతే నిర్దాక్షిణ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిందో, అంతే నిర్దాక్షిణ్యంగా తన నిర్ణయాలను మోడీ ప్రభుత్వం అమలు చేయవచ్చు. అయితే ఆ మార్గంలో వెళ్ళడానికి ఎన్డీయే ప్రభుత్వానికి ఇష్టం లేనట్టు కనిపిస్తోంది. ఈ రెండు అంశాలలో ఆచి తూచి వ్యవహరించి తాను ఇబ్బంది పడకుండా, ఇరుక్కుపోకుండా, విమర్శలు ఎదుర్కోకుండా వుండేలా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే పోలవరం ఆర్డినెన్స్‌కి సంబంధించిన బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. శంఖంలో పోస్తేనే తీర్థమవుతుందన్నట్టుగా రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతే లోక్‌సభలో బిల్లును ఆమోదించాలని భావిస్తోంది. అదేవిధంగా గవర్నర్‌కి అధికారాల విషయంలో కూడా తాను తీసుకున్న నిర్ణయానికి ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా వుండేలా కూడా కేంద్రం కసరత్తు చేస్తోంది. మొత్తమ్మీద కేంద్రం సేఫ్ గేమ్ ఆడుతోంది.

నెత్తీనోరూ బాదుకున్నా ప్రతిపక్ష హోదా దక్కదు!

  దేశంలో కాంగ్రెస్ పార్టీకి పట్టినంత దరిద్రపు దుస్థితి భవిష్యత్తులో మరేపార్టీకీ పట్టదేమో! ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ ఒక వెలుగు వెలిగి, ఆడింది ఆటగా పాడింది పాటగా హవా నడిపించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు దేశవ్యాప్తంగా అంకఛండాలంగా తయారైంది. కేంద్రంతోపాటు అనేక రాష్ట్రాల్లో పవర్ పోయింది. అయిదేళ్ళపాటు పనికిమాలిన రాజకీయాలు చేసి బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం కూడా లేకుండా పోయింది. ఇంకా చెప్పాలంటే, లోక్‌సభలో ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి రావడం దేశ ప్రజలందరికీ ఆనందాన్ని కలిగించే విషయమే. సాధారణంగా లోక్‌సభలో ఏ పార్టీకైనా ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 52 లోక్‌సభ స్థానాలు సాధించి తీరాలి. కాంగ్రెస్ పార్టీ 44 స్థానాలతో సరిపెట్టుకోవడంతో 16వ లోక్‌సభలో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కకుండా పోయింది. అయితే తాము చేసిన ఘోర తప్పిదాల ఫలితమే ఈ పరిణామమని కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ సరిపెట్టుకోకుండా ఈ అంశం విషయంలో నానా రాద్ధాంతం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మొదట్లో ప్రతిపక్ష హోదా ఇవ్వరూ అంటూ బీజేపీని బతిమాలే ధోరణిలో వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఈ అతి వినయాలకు లొంగకపోవడంతో స్వరం పెంచింది. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ నాయకులు ఎంత గొంతు చించుకున్నా బీజేపీ ఎంతమాత్రం పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ అహం దెబ్బతింది. దాంతో ఆమే స్వయంగా రంగంలోకి దిగి తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని మొత్తుకున్నారు. సీట్ల బలాబలాలను ఎంతమాత్రం పట్టించుకోకుండా తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఎంతమాత్రం సిగ్గుపడకుండా అడిగేశారు. అలా ఇవ్వకపోతే మర్యాదగా వుండదని కూడా బీజేపీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఎన్నికల ముందే తమ పార్టీ తమలాంటి దరిద్రపు భావాలున్న పార్టీలతో జతకట్టాం కాబట్టి, అన్ని పార్టీలకూ వచ్చిన సీట్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆమె కాకమ్మ లెక్కలు చెప్పారు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే పార్లమెంటుని సాగనివ్వమని కూడా బెదిరింపు సెక్షన్‌లోకి ఆమె దిగారు. ఈ బెదిరింపులను చూస్తుంటే అధికారం కోల్పోయినా కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నాయకులకు ఎంతమాత్రం బుద్ధిరాలేదన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. చూడమ్మా సోనియమ్మా.. మీరెంత అరిచి గీపెట్టినా, నెత్తీనోరూ బాదుకున్నా మీకు ప్రతిపక్ష హోదా దక్కదు.

అంబానీ అందుకు రాలేదా?

  రిలయన్స్ అధిపతి అనిల్ అంబానీ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయినపుడు, ఆయన రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు స్థాపన కోసం మాట్లాడేందుకే వచ్చారని అందరూ భావించారు. కానీ, ఆయన తూర్పు గోదావరి జిల్లాలో సామర్లకోట వద్ద ఏర్పాటు చేసిన 7000మెగా వాట్స్ సామర్ధ్యం గల గ్యాస్ ఆధారిత రిలయన్స్ పవర్ ప్లాంటుకు కృష్ణ-గోదావరి బేసిన్ నుండి సరిపోయినంత గ్యాస్ అందజేయవలసిందిగా కోరేందుకే వచ్చారని స్పష్టమయింది.   సామర్లకోటలో ఏర్పటు చేసిన రిలయన్స్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ గత అనేక సంవత్సరాలుగా ఆశించిన మేర గ్యాస్ సరఫరా లేకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోతోంది. తమ ప్లాంటుకు అధనంగా గ్యాస్ కేటాయించవలసిందిగా రిలయన్స్ సంస్థ యూపీఏ ప్రభుత్వాన్ని కోరినప్పటికీ నిరాకరించడంతో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పతి జరగడంలేదు. చంద్రబాబు నాయుడుకి ప్రధాని మోడీ మరియు కేంద్రమంత్రులతో సత్సంబంధాలున్నందున, చంద్రబాబు ద్వారా తమ సంస్థకు అదనపు గ్యాస్ సంపాదించుకొనే ప్రయత్నంలోనే ఆయనను అంబానీ వచ్చి కలిసారు.   అందుకు చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందిస్తూ, తాను కేంద్రంతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాక ఇటువంటి గ్యాస్ ఆధారిత ప్లాంట్లు భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులను నివారించేందుకు కేజీ బేసిన్ లో ఫ్లోటింగ్ గ్యాస్ స్టోరేజ్ మరియు రీగ్యాసిఫికేషన్ ప్లాంటును కూడా ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే అనిల్ అంబానీ మాత్రం రాష్ట్రంలో కొత్త పరిశ్రమలేవీ స్థాపిస్తానని ఎటువంటి హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. కానీ ఆ తరువాత ఆయన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసినప్పుడు మాత్రం అక్కడ కొత్తగా పరిశ్రమలు స్థాపించేందుకు ఆసక్తి కనబరచినట్లు వార్తలు వచ్చాయి.   అన్నివిధాల క్లిష్ట పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపనకు ముందుకు రావాలంటే తప్పనిసరిగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా పొందవలసి ఉంటుంది. ప్రత్యేకహోదా కోసం గట్టి ప్రయత్నాలు చేయకుండా క్లిష్టపరిస్థితుల్లో ఉన్న రాష్ట్రానికి పరిశ్రమలు రావాలనుకోవడం అత్యాసే అవుతుంది. అందువల్ల రాష్ట్ర యంపీలు, కేంద్రమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం అందరూ కలిసి కట్టుగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం గట్టిగా ప్రయత్నించాలి.

నగరం లాంటి నరకాన్ని మళ్ళీ సృష్టించొద్దు!

  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కోనసీమలో గెయిల్ గ్యాస్ పైప్ లైన్ అనకొండ రెండు పదులకు పైగా ప్రాణాలను పొట్టన పెట్టుకున్న దుర్ఘటన రాష్ట్ర ప్రజల స్మృతిపథం నుంచి ఇంకా తొలగిపోలేదు. పల్లె ప్రజల మీద పగబట్టిన తాచులాగా విషాగ్నిని చిమ్మిన గ్యాస్ పైప్ లైన్ ప్రమాదం ఎప్పటికీ మరచిపోలేని విషాదం. ఇలాంటి విషాద సంఘటన మరోసారి జరగకుండా చూడాల్సిన బాధ్యత మన రాష్ట్రం నుంచి గ్యాస్‌ని తరలించుకపోతున్న సంస్థల మీద వుంది. సదరు సంస్థలను నియంత్రించాల్సిన ప్రభుత్వాల మీద కూడా వుంది. ఇప్పుడు కోనసీమ ప్రజలు పల్లెపల్లెలో విస్తరించి వున్న గ్యాస్ పైప్ లైన్లను చూస్తేనే భయంతో వణికిపోతున్నారు. ఏ పైప్ లైన్ ఎప్పుడు పగులుతుందో, మళ్ళీ ఏ విధ్వంసాన్ని సృష్టిస్తుందోనని భయపడుతున్నారు. వారి భయానికి తగ్గట్టుగానే కోనసీమలోని అనేక గ్యాస్ పైప్ లైన్లు తుప్పుపట్టి అవసానదశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. అలాంటి పైపులను వెంటనే మార్చాల్సిన గ్యాస్ కంపెనీల యాజమాన్యాలు ఇప్పటికీ స్పందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే, కోనసీమ ప్రజలు భయపడుతున్నట్టుగానే అక్కడ అడపా దడపా గ్యాస్ లీకేజీ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కాకినాడ సమీపంలోని సర్పవరం ప్రాంతంలో ఒక గ్యాస్ పైప్ లైన్ లీక్ అయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు గ్యాస్ సంస్థ అధికారులకు సమాచారం అందించడంతో సదరు సంస్థ సిబ్బంది హుటాహుటిన వచ్చి గ్యాస్‌ని ఆపినట్టు సమాచారం. ఇక్కడ గ్యాస్ లీక్ అవడాన్ని స్థానికులు గమనించడం వల్ల మరో పెద్ద ప్రమాదం తప్పింది. ఇలాంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అయినా గ్యాస్ కంపెనీల యాజమాన్యాలు స్పందించాలి. కాలం చెల్లిన గ్యాస్ పైప్‌లైన్లను మార్చాలి. మరోసారి ‘నగరం’ గ్రామం లాంటి నరకాలను సృష్టించకుండా వుండాలి. ‌

భూములు.. కేసీఆర్‌కి షాకులు..!

  ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారాలు చేసే ముహూర్తాలు మంచివి కాకపోతే సదరు ముఖ్యమంత్రులు ఇబ్బంది పడాల్సి వస్తుందని జ్యోతిషులు చెప్పే మాట నిజమే అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ముహూర్తంలో ఏదో తేడా వున్నట్టే. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తీసుకున్న అనేక నిర్ణయాలు బెడిసికొట్టాయి. ముఖ్యంగా భూముల విషయంలో తీసుకున్న నిర్ణయాలు రివర్స్ అవుతున్నాయి. భూమిని నమ్మున్న రైతుల రుణాలను మాఫీ చేస్తానని ఆయన ఇచ్చిన ఎన్నికల వాగ్దానం అమలులో జాప్యం చేయడం తెలంగాణ రైతాంగంలో ఆయనకి గౌరవాన్ని సన్నగిల్లేలా చేసిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలాగే కేసీఆర్ రావడం రావడం గురుకుల్ ట్రస్ట్ భూముల మీద తన ప్రతాపం చూపించారు. నిర్మాణంలో వున్న కొన్ని భవంతులను కూలగొట్టించారు. ప్రతిపక్షంలో వుండగా గురుకుల్ ట్రస్ట్ భూములు కొనుగోలు చేసిన వారి పక్షాన నిలబడిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తమ పార్టీ గత విధానానికి వ్యతిరేకంగా పనిచేయడం తీవ్ర విమర్శలకు కారణమైంది. అలాగే లగడపాటి రాజగోపాల్‌కి చెందిన ల్యాంకో హిల్స్ మీద కేసీఆర్ దృష్టి పడింది. లాంకోహిల్స్ మీద తన ప్రతాపం చూపించడానికి కేసీఆర్ సర్వ సన్నాహాలు చేసుకున్నప్పటికీ చట్టరీత్యా లాంకో హిల్స్‌ను తాను ఏమీ చేయలేనని అర్థం చేసుకున్న ఆయన వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. అలాగే హైదరాబాద్‌లోని గోకుల్ ఫ్లాట్స్ మీద కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం దాడి ప్రారంభించింది. దీని మీద కూడా విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే ఏపీ ఎన్జీవోలకు చెందిన హౌసింగ్ సొసైటీ భూములు నిరుపయోగంగా ఉన్నాయనే సాకు చూపించి ఆ భూములను తెలంగాణ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ స్థలానికి సంబంధించిన వివాదాలు కోర్టులో వున్న కారణంగా ఇక్కడ ఎపీ ఎన్జీవోలు ఇళ్ళు నిర్మించుకోలేదు. అంతే తప్ప హౌసింగ్ సొసైటీ భూములు నిరుపయోగంగా వుండటానికి మరే ఇతర కారణాలూ లేవు. ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా కేసీఆర్ ప్రభుత్వం ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం వివాదంగా మారింది. కేసీఆర్ ఏపీ ఎన్జీవోల విషయంలో కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వినిపించాయి. తాజాగా ఏపీ ఎన్జీవోలు ఈ అంశం మీద హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ భూముల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని, దీనిమీద నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. ఈరకంగా కూడా కేసీఆర్ ప్రభుత్వం షాక్ తిన్నది. దీన్నిబట్టి మనకి అర్థం అవుతున్నదేమిటంటే, కేసీఆర్ ప్రభుత్వం భూముల గొడవల్లో తల దూర్చకపోవడం మంచిది.

పారిశ్రామిక ప్రగతిపథంలో ఆంధ్రప్రదేశ్!

  గడచిన ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక తెలివైన నిర్ణయం తీసుకున్నారు. తాము తీసుకున్న నిర్ణయం ద్వారా తమను తామే అభివృద్ధి పథం వైపు నడిపించుకుంటున్నారు. ఆ నిర్ణయమే తెలుగుదేశం పార్టీకి అధికారం అప్పగించడం, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడం అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా వుంది. రాష్ట్రాన్ని పునాదుల నుంచి పునర్నిర్మించుకోవాల్సిన పరిస్థితి వుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి సమర్థమైన నాయకత్వం చాలా అవసరం. ఆ అవసరాన్ని గుర్తించే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడికి నాయకత్వం అప్పగించి తమ విజ్ఞతను చాటుకున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రజలు చూపించిన విజ్ఞతకు తగిన ప్రతిఫలం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు దేశ పారిశ్రామిక రంగం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అభివృద్ధే ఏకైన నినాదంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన చంద్రబాబు నాయుడు దార్శనికత మీద దేశ వ్యాప్తంగా సదభిప్రాయం వుంది. ఆ సదభిప్రాయమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ని పారిశ్రామికంగా అగ్రస్థానంలో నిలిపే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. దేశంలోనే అగ్రగాములుగా వున్న పలు కార్పొరేట్ సంస్థలు, మల్టీ నేషనల్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో తమ పరిశ్రమలను విస్తరించడానికి ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ ఆంధ్రప్రదేశ్‌లో తన పరిశ్రమలను విస్తృత స్థాయిలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి చంద్రబాబుతో సూత్రప్రాయంగా చర్చలు కూడా జరిగినట్టు సమాచారం. శ్రమించే తత్వం వున్న ప్రజలున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిశ్రమల స్థాపనకు, సమర్థవంతంగా వాటి నిర్వహణకు పూర్తి అనుకూలమైన రాష్ట్రమన్న అభిప్రాయం దేశ పారిశ్రామిక వర్గాలలో ఇప్పటికే ఏర్పడింది. దానితోపాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా వుండటం కూడా రాష్ట్రానికి ఒక వరంగా మారింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే, ఏడాది తిరిగేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికంగా కళ్ళు చెదిరే అభివృద్ధి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పుడు నొప్పిగా వుందా జగన్ బాబూ?

  వైసీపీ నాయకుడు జగన్‌కి, ఆయన అనుయాయులకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కంటే ఏదో ఒక హడావిడి చేస్తూ వార్తల్లో నిలిచే అంశమే ప్రధానంగా వున్నట్టు కనిపిస్తోంది. గత నాలుగైదు రోజులుగా వైసీపీ నాయకులు కొత్త పాయింట్ పట్టుకుని ఊరేగుతున్నారు. అది మునిసిపల్ స్థానాలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకునే విషయంలో తెలుగుదేశం పార్టీ వైసీపీ నాయకులను ప్రలోభ పెట్టిందని, వారిని తనవైపు లాక్కుందని వారు తాజాగా లేవనెత్తిన పాయింట్. ఈ విషయం మీద వైసీపీ నాయకుడు జగన్ గవర్నర్ని కూడా కలసి మొత్తుకున్నారు. పాపం జగన్ బ్యాచ్ లోపాలన్నీ తమవైపు పెట్టుకుని తెలుగుదేశాన్ని ఆడిపోసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులలో జగన్ నాయకత్వం మీద అసంతృప్తి బాగా పెరిగిపోయింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత జగన్ పార్టీలోనే ఆయన మీద వ్యతిరేకత పీక్‌కి చేరుకుంది. ఈ నేపథ్యంలో అనేకమంది పార్టీ మారుతున్నారు. అలాగే స్థానిక ఎన్నికల అధ్యక్ష పీఠాల ఎన్నికలు జరిగిన సందర్భంలో కూడా చాలామంది వైసీపీకి స్వచ్ఛందంగా గుడ్ బై కొట్టి తెలుగుదేశం పార్టీలో చేరారు. అనేక స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకోవడానికి కారణమయ్యారు. జగన్ మీద వున్న వ్యతిరేకత, తెలుగుదేశం పార్టీ అధికారంలో వుండటం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో కృషి చేస్తూ వుండటం వల్ల వైసీపీ నాయకులు అనేకమంది తెలుగుదేశం వైపు ఆకర్షితులయ్యారు. వైసీపీ నాయకులు ఎన్ని బెదిరింపులు చేసినా చాలామంది తెలుగుదేశం వైపు వచ్చేశారు. తమ పార్టీ నాయకులు తనకు గుడ్ బై కొట్టడం వెనుక వున్న అసలు విషయాలను జగన్ పరిగణనలోకి తీసుకోకుండా ఆయన తెలుగుదేశం పార్టీని ఆడిపోసుకోవడంలో బిజీగా వున్నారు. పాపం జగన్‌ బాబుకి తన పార్టీ నుంచి చాలామంది నాయకులు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళేసరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయినట్టుంది. అందుకే ఫ్లాష్‌బ్యాక్‌ని మరచిపోయి మాట్లాడుతున్నారు. గతంలో అనేకమంది తెలుగుదేశం నాయకుల మీద, శాసనసభ్యుల మీద ఆకర్ష మంత్రాన్ని ప్రయోగించి, వారిని వైసీపీలోకి లాక్కుని తెలుగుదేశం పార్టీని ఏకాకిని చేయడానికి తీవ్రంగా ప్రయత్నించిన విషయాన్ని ఆయన మరచిపోయినట్టున్నారు. అప్పుడు తాను చేసింది న్యాయం.. ఇప్పుడు జరిగింది అన్యాయం అన్నట్టు మాట్లాడుతున్న జగన్‌ని ఏమనాలని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తెలుగుదేశం నాయకులను తన పార్టీలోకి లాక్కున్నప్పుడు ఎగిరి గంతులేసిన జగన్‌కి ఇప్పుడు తన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీలోకి చేరుతూ వుండేసరికి ఆ నొప్పేమిటో తెలిసొచ్చిందని చెబుతున్నారు.

కేసీఆర్ జీ... రైతుల ఆత్మహత్యలు ఆపండి!

ప్రస్తుతం తెలంగాణలో రైతుల సంక్షేమాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక్కటే కోరుతున్నారు... అదే.. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆపండని! అసలే తెలంగాణ ప్రజలు.. ముఖ్యంగా యువకులు, రైతులు చాలా సున్నిత హృదయం కలవారు. మొన్నటి వరకూ తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ వచ్చేసింది. అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయి, ఇక రాష్ట్రంలో ఆత్మహత్యలనేవే వుండవని అందరూ ఆశించారు. అయితే ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మొన్నటి వరకూ యువకులు.. ఇప్పుడు రైతులు. ఈ ఆత్మహత్యల పర్వం తెలంగాణ తల్లికి కడుపు కోతను మిగులుస్తోంది. ఎంతో ఆత్మ గౌరవంతో స్వపరిపాలనను సాధించుకున్న ఈ సమయంలో కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ వుండటం అత్యంత విచారకరమైన విషయం. ఎన్నికల సందర్భంగా రైతు రుణాలు మాఫీ చేస్తామని రైతులకు కేసీఆర్ ఇచ్చిన హామీ తెలంగాణ రైతుల్లో ఆనందాన్ని కలిగించింది. కేసీఆర్ మాటని నమ్మిన తెలంగాణ రైతులు కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని అప్పగించారు. కేసీఆర్ ప్రభుత్వం రుణాల మాఫీకి సంబంధించిన అన్ని అంశాలనూ పరిశీలిస్తున్న సమయంలోనే రైతులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటూ వుంటడం తెలంగాణ రైతుల సున్నిత మనస్తత్వానికిమరోసారి అద్దం పడుతోంది. రైతు రుణాల మాఫీ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం వెనకడుగు వేస్తోందన్న అపోహకి గురైన ఇద్దరు రైతులు కేసీఆర్ అధికారం చేపట్టిన తొలినాళ్ళలోనే ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు అన్నదాతలు, నల్లగొండ జిల్లాలో ఒక అన్నదాత ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నలుగురు రైతులూ అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని చెబుతూ వున్నప్పటికీ రైతన్నలు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత విచారకరమైన అంశం. అయితే రుణ మాఫీ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం మాట తప్పుతున్న దారిలో వెళ్తున్నందువల్లే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని విమర్శకులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో రైతుల ఆత్మహత్యలను ఆపాల్సిన బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద వుంది. రైతు రుణాల మాఫీ విషయంలో రైతులలో ఏర్పడిందని భావిస్తున్న అపనమ్మకాన్ని తొలగించాల్సిన బాధ్యత కూడా ఆయన మీదే వుంది. రుణాల మాఫీకి సంబంధించి తెలంగాణ రైతుల్లో అపోహలు తొలగించేలా చేయడం టీఆర్ఎస్ ప్రభుత్వం ముందు వున్న తక్షణ కర్తవ్యం. ఇప్పటికే రైతు రుణ మాఫీ విషయంలో మనసులు కష్టపెట్టుకున్న ఆరుగురు తెలంగాణ రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇకముందు మరొక్కరు ఆత్మహత్య చేసుకున్నా అది కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యంగానే భావించాల్సి వస్తుంది. ఈ పరిస్థితి రాకుండా కేసీఆర్ తగిన చర్యలు తీసుకుంటారని పలువురు ఆశిస్తున్నారు.

గంగా ప్రక్షాళనకు సిద్దమవుతున్న మోడీ సర్కార్

  హిందువులందరికీ పరమ పవిత్రమయినది గంగానది. జీవితంలో ఒక్కసారయినా గంగా నదిలో స్నానం చేసి పూజిస్తే చాలనుకోనేవారు కోకొల్లలు. తమ జీవిత అంతిమ యాత్ర గంగానదిలోనే పూర్తిచేయాలని అక్కడికి తరలివెళ్ళేవారూ చాలా మంది ఉన్నారు. ఆ నదిని ఆనుకొని ఉన్న అనేక నగరాలు, పరిశ్రమలు గత అనేక దశాబ్దాలుగా మురికి నీటిని, పారిశ్రామిక వ్యర్ధాలను, ప్రమాదకరమయిన రసాయనాలను పవిత్రమయిన గంగానదిలోకి విడిచి పెడుతూ పూర్తిగా కలుషితం చేసాయి. తత్ఫలితంగ నదిలో అనేక జీవరాసులు చనిపోతున్నాయి. వాటిపై ఆధారపడిన వారు ఉపాధి కోల్పోతున్నారు. ఆ నీటిని త్రాగిన వారు రోగాల పాలవుతున్నారు. గంగలో మునిగితే పాపాలు పోవచ్చునేమో కానీ కొత్త రోగాలు రావడం తధ్యం అని ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది.   ఈ సమస్య పరిష్కారం కోసం గంగానదిని సమూల ప్రక్షాళన చేయాలని చాలా ఏళ్లుగా ప్రజలు కోరుతున్నారు, మీడియాలో చర్చలు కూడా జరుగుతున్నాయి. కానీ దానిపై వందల కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వాలు ఇంతకాలం వెనుకాడుతున్నాయి. కానీ, నరేంద్ర మోడీ తన ప్రభుత్వంలో జలవనరుల శాఖా మంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన ఉమా భారతికి, గంగా ప్రక్షాళణా కార్యక్రమం కూడా ప్రత్యేకంగా అప్పజెప్పారు. ఆమె ఈరోజు ‘గంగా మదన్’ (నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా) (ఎన్‌ఎంసీజీ) అనే ఒక జాతీయ స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. అందులో మేధావులు, పర్యావరణవేత్తలు, ఎన్జీవో సంఘాల ప్రతినిధులు, జల వనరుల శాఖ, షిప్పింగ్ అండ్ టూరిజం శాఖ, గంగా నది ప్రవహించే రాష్ట్రాలకు చెందిన అధికారులు మరియు మరికొన్ని ఇతర శాఖలకు చెందిన అధికారులు పాల్గొననున్నారు. వారి నుండి సలహాలు, సూచనలు తీసుకొన్న తరువాత, ఈ ప్రక్షాళన కార్యక్రమానికి అధికారులు, నిపుణులు, మేధావులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీ లేదా సంఘాన్ని ఒక దానిని ఏర్పరచి దాని ఆధ్వర్యంలో పని మొదలుపెట్టే అవకాశం ఉంది.   ఈ సమావేశానికి సాధువులను కూడా ఆహ్వానించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం చెపుతోంది. గంగా మదన్ కార్యక్రమాన్ని ఒక జాతీయ కార్యక్రమంగా నిర్వహించాలి తప్ప ఒక హిందూ కార్యక్రమంగా నిర్వహించడం సరికాదని కాంగ్రెస్ అభిప్రాయ పడింది. ఏమయినప్పటికీ గత అరవై ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని, చేయని పనిని బీజేపీ ప్రభుత్వం చేస్తోంది. గంగా నదితో బాటు యమునా నదిని కూడా ప్రక్షాళన చేస్తామని మంత్రి ఉమాభారతి తెలిపారు.

తమిళనాడులో 11మంది తెలుగువాళ్ళు మృతి

  హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనలో 24మంది విద్యార్ధులు మరణించినప్పటి నుండి తెలుగువాళ్ళను ఒకదాని తరువాత మరొక విపత్తులు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రాణాలు బలిగొంటూనే ఉన్నాయి. ఆ ప్రమాదం నుండి కోలుకోకముందే తూర్పుగోదావరి జిల్లాలో నగరం గ్రామంలో గ్యాస్ పైప్ లైన్ అగ్ని ప్రమాదంలో 17మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇది జరిగిన కొద్ది రోజులకే తమిళనాడులో 11అంతస్తుల భవనం కూలినపుడు 63మంది మరణించారు. మళ్ళీ ఈ రోజు ఉదయం తమిళనాడులో తిరువళ్ళూరు జిల్లాలో ఉపరవలయం అనే ప్రాంతంలో కూలీలు ఉంటున్న గుడిసెలపై గోడ కూలి ఒక పసిపాపతో సహా 11మంది తెలుగు వాళ్ళు మరణించారు. వారందరూ ఉత్తరాంధ్రాకు చెందినవారు. శిధిలాల క్రింద మరికొంత మంది చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ విషయం తెలియగానే సంబంధిత అధికారులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని, పొక్లేయిన్ల సహాయంతో శిధిలాలను తొలగిస్తున్నారు. శిదిలాల క్రింద నుండి తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఒక కంపెనీ కోసం 20అడుగుల ఎత్తున్న ప్రహారీ గోడ నిర్మిస్తుంటే, మొన్న కురిసిన వానలకి నాని కూలిపోయినట్లు అనుమానిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు బాధితులకు తగిన సహాయ సహకారాలు అందించేందుకు నెల్లూరు నుండి రాష్ట్రానికి చెందిన ఒక అధికారుల బృందం ఈరోజు ఉదయం తిరువళ్ళూరుకు బయలుదేరింది.

మోడీ ప్రభుత్వం చేత కంట తడిపెట్టిస్తున్న ఉల్లి

  వర్షాభావ పరిస్థితుల వలననో లేక బ్లాక్ మార్కెట్ వ్యాపారుల కారణంగానో మొత్తం మీద మళ్ళీ ఉల్లి ధరలు సామాన్యులు కొనలేనంతగా పెరిగిపోయాయి. ఉల్లి ధరల అదుపు చేసేందుకు మోడీ ప్రభుత్వం ఎగుమతి ధరను టన్నుకి 300 డాలర్ల నుండి ఒకేసారు 500 డాలర్లకు పెంచింది. ఉల్లిని అత్యవసర వస్తువుల జాబితాలో చేర్చింది. హోల్ సేల్ వ్యాపారులు ఉల్లిని నిర్దిష్ట పరిమితికి మించి గోదాములలో నిలువచేయరాదని, చేస్తే కటిన చర్యలు తీసుకొంటామని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బ్లాక్ మార్కెటర్లపై కటిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయినా కూడా ఈ చర్యలేవీ ఆశించిన ఫలితాలు ఈయలేదు. అందువల్ల బ్లాక్ మార్కెట్ వ్యాపారులపై కటినచర్యలు తీసుకొనేందుకు వీలుగా నిత్యావసర సరుకుల చట్టానికి మరింత పదునుపెడుతూ, ఉల్లిని అక్రమంగా గోదాములలలో నిలువచేసిన వారిని నాన్ బెయిలబుల్ కేసుల క్రింద బుక్ చేయాలని నిశ్చయించింది. త్వరలో జరుగబోయే కేంద్రమంత్రి వర్గ సమావేశంలో దీని కోసం ఒక ఆర్డినెన్స్ జారీ చేస్తామని కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.   ప్రతీ ఏట ఎదురయ్యే ఈ ఉల్లి మరియు ఇతర కూరగాయల ధరల పెరుగుదలను స్థిరీకరించేందుకు, శాశ్వితప్రాతిపాదికన ‘ధరల స్థిరీకరణ నిధి’ ని కూడా ఏర్పాటు చేయాలని నిశ్చయించుకొంది. కూరలు ఇతర నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నపుడు, ఈ నిధి నుండి రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమయిన మేరకు డబ్బు వాడుకొని ధరలను స్థిరీకరించవలసి ఉంటుంది. త్వరలో ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ లో కేంద్రప్రభుత్వం ఇందుకు అవసరమయిన సొమ్మును కేటాయిస్తుంది. నిన్న కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో డిల్లీలో జరిగిన 26రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రుల సమావేశంలో ఈ విషయం ప్రకటించారు.   అయితే కేవలం కేంద్ర ప్రభుత్వం ఒక్కటే ఎన్ని చర్యలు చెప్పట్టినా, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం లేనంతవరకు దాని వలన ఎటువంటి ఫలితమూ ఉండదు. అంతేకాక వివిధ రాష్ట్రాలలో ఉల్లి, దుంపలు ఇతర నిత్యావసర సరుకుల మార్కెట్లను బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు నియంత్రిస్తున్నారు. అటువంటివారిని గుర్తించి వారిపై కటిన చర్యలు చేప్పట్టనంత కాలం ఈ సమస్యకు శాశ్విత పరిష్కారం సాధ్యం కాదు.

ఆ రెండు శాతం పన్నే ఆంధ్రాకు వరంగా మారనుందా?

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధికపరిస్థితి గురించి పాలకులే కాక ప్రజలు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. అది చాలదన్నట్లుగా వేలకోట్ల రైతుల రుణాల మాఫీ కూడా ఒకటుంది. ఈ సమస్యలకు కనుచూపు మేర ఎటువంటి పరిష్కారం కనబడటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సమస్యల నుండి బయటపడటానికి శతవిధాల ప్రయత్నిస్తోంది. కానీ ఎటువంటి ఫలితము కనబడటం లేదు. కానీ ప్రభుత్వానికి చిన్న ఉపశమనం కలిగించే విషయం ఒకటి వినబడుతోంది.   రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్ర, తెలంగాణాలు ఇప్పుడు ప్రత్యేక రాష్టాలుగా విడిపోయాయి గనుక, దేశంలో మిగిలిన రాష్ట్రాల మధ్య ఏవిధంగా 2శాతం అంతర్ రాష్ట్ర సెంట్రల్ సర్వీస్ పన్ను (సెంట్రల్ సర్వీస్ టాక్స్ లేదా సీ.యస్.టీ) ఇప్పుడు ఆంధ్రా-తెలంగాణా రాష్ట్రాల మధ్య జరిగే వ్యాపార లావాదేవీలలో కూడా 2శాతం పన్ను వసూలు చేయబడుతుంది. ఇంతవరకు సమైక్య ఆంద్ర రాష్ట్రంలో మొత్తం 3లక్షల మంది వ్యాపారులు ఈ సీ.యస్.టీ టాక్స్ ను చెల్లిస్తున్నారు. వారిలో చాలా మంది హైదరాబాదు కేంద్రంగా చేసుకొని రాష్ట్రంలో, ప్రధానంగా ఆంధ్రప్రాంతంలో వివిధ జిల్లాలలో వ్యాపారాలు చేస్తున్నారు. కానీ ఇంతవరకు రాష్ట్రం సమైక్యంగా ఉండటం వలన ఆ మూడు లక్షలమంది వ్యాపారులు చెల్లించే 2 శాతం పన్ను మొత్తం రాష్ట్రప్రభుత్వానికే జమా అయ్యేది. కానీ ఇప్పుడు ఆంద్ర, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయినందున, హైదరాబాదు కేంద్రంగా చేసుకొని ఆంధ్రాతో వ్యాపారాలు చేస్తున్నవారు అదనంగా 2శాతం సీ.యస్.టీ. పన్ను చెల్లించవలసి వస్తుంది. అది కొన్ని లక్షల్లో ఉంటుంది గనుక, ఆ భారం తగ్గించుకొనేందుకు వారిలో చాలా మంది వ్యాపారులు ఆంధ్రాలో తమ రిటర్న్స్ సమర్పించినట్లు సమాచారం.   జూన్ రెండు (అపాయింటడ్ డే) మొదలుకొని జూన్ 30వరకు ఆంద్రతో జరిపిన వ్యాపార లావాదేవీల రిటర్న్స్ జూలై20లోగా రిటర్న్స్ సమర్పించవలసి ఉంటుంది. ఇంతవరకు దాదాపు ఒకటిన్నర లక్షల మంది వ్యాపారులు ఆంధ్రాలో తమ పేర్లను నమోదు చేయించుకొని రిటర్న్స్ సమర్పించినట్లు సంబందిత అధికారులు తెలుపుతున్నారు.   గతేడాది ఈ మూడు లక్షల మంది వ్యాపారుల వద్ద నుండి దాదాపు రూ.55,000 కోట్లు పన్ను వసూలు అయిందని, ఈసారి అది మరి కొంచెం పెరిగి దాదాపు రూ.60, 000కోట్లు వరకు చేరుకోవచ్చని అధికారులు తెలుపుతున్నారు. అంటే మూడు లక్షల మంది వ్యాపారులలో సగం మంది ఆంధ్రాలో పన్ను చెల్లించు తున్నారంటే ఆ ఆదాయంలో దాదాపు సగం అంటే దాదాపు రూ.30, 000 కోట్లు ఆంధ్రా ఖాతాలోనే జమా అవబోతోందని స్పష్టమవుతోంది.   రాష్ట్ర విభజన తరువాత ఆంధ్ర, తెలంగాణాల ఈ ఆదాయ శాతాలు ఇంచుమించు 18:82 నిష్పత్తిలో ఉండవచ్చనే అంచనాలకు విరుద్దంగా రెండు రాష్ట్రాలకు సరిసమానంగా అంటే 50:50 శాతం ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఈనెల 20వ తేదీ సాయంత్రంతో వ్యాపారులు రిటర్న్స్ సమర్పించడం పూర్తవుతుంది గనుక అప్పుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ పన్ను ద్వారా ఎంత ఆదాయం సమకూరిందనే విషయంపై మరింత స్పష్టత వస్తుందని సంబంధిత అధికారులు చెపుతున్నారు. ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది చాలా మంచి కబురే కదా!

అగస్టా కుంభకోణంలో నిందితులపై కేసులు నమోదు

  గత పదేళ్ళ యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు, కుంభకోణాల గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏమీలేదు. కాంగ్రెస్ పాలనలో ఇటువంటివన్నీ చాలా సహజమని ప్రజలు కూడా భావించే స్థాయికి ఆ పార్టీ దిగజారింది. మాటలకు, చేతలకు పొంతనలేని పరిపాలన సాగించి, దేశాన్ని అన్ని విధాల భ్రష్టు పట్టించి చివరికి తనే బలయిపోయింది. అయితే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది గనుక ఆ పార్టీ హయాంలో జరిగిన లక్షల కోట్ల కుంబకోణాలను మాఫీ అయిపోవు. వాటి సూత్రధారులను విడిచిపెట్టేందుకు లేదు. కానీ దురదృష్టవశాత్తు మనదేశంలో అటువంటి అవినీతిపరులు, నేరస్తులు అందరూ చట్టసభలలో సభ్యులుగా ఉండటం, ఉన్నత పదవులలో కొనసాగుతుండటం చాలా కలవరం కలిగిస్తోంది.   రూ.3600 కోట్ల అగస్టా హెలికాఫ్టర్ల కుంభకోణంలో భారత మాజీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ యస్.పీ. త్యాగి, గోవా గవర్నర్ బీవీ.వాంచూ వంటివారు కూడా ఉన్నారు. అందువల్లే గత యూపీఏ హయంలో ఈకేసుపై విచారణ నత్త నడకన సాగించారు. ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీయే కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే ఇటువంటి కుంభకోణాలన్నీ తుడిచిపెట్టుకోనిపోయేవి. కానీ కాంగ్రెస్ దురదృష్టమో లేక భారత దేశ ప్రజల అదృష్టమో కానీ సమర్దుడైన నరేంద్ర మోడీ ప్రభుత్వ పగ్గాలు చేప్పట్టి, ఈ అవినీతి రాబందులపై చర్యలకు ఉపక్రమించారు. ఇంతకాలం కాంగ్రెస్ హస్తంలో పావులుగా మిగిలిపోయిన ఎన్ఫోర్సుమెంటు డైరెక్టరేట్ మరియు సీబీఐలు, ఇప్పుడు అదే కాంగ్రెస్ అవినీతిని వెలికి తీసేపనిలో పడ్డాయి.   ఎన్ఫోర్సుమెంటు డైరెక్టరేట్ అధికారులు అగస్టా హెలికాఫ్టర్ల కుంభకోణంలో ప్రదాన నిందితులుగా అనుమానింపబడుతున్న భారత మాజీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ యస్.పీ. త్యాగి, ఆయన బందువులు కొందరిపై, యురోప్ కు చెందిన కార్లో క్రీష్టియన్ మైఖేల్, గిడో హస్చ్ఇద్దరు వ్యక్తులపై విదేశీమారక చట్టాలు మరియు మనీ లాండరింగ్ చట్టాలను అతిక్రమించి నేరాలకు పాల్పడినట్లుగా రెండు వేర్వేరు కేసులు నమోదుచేసారు. వారితో బాటు చండీఘర్ కు చెందిన ఐ.డీ.యస్.ఇన్ఫోటెక్ మరియు ఏయిరో మాట్రిక్స్ అనే సంస్థలపై, ఇటలికీ చెందిన ఫైన్మెకానిక, ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆగస్ట వెస్ట్ ల్యాండ్ సంస్థలపై కూడా కేసులు నమోదు చేసారు. ఈ హెలికాఫ్టర్ కొనుగోలు వ్యవహారాలలో ప్రధాన సాక్షిగా ఉన్న బీ.వీ వాంచూను కూడా నిన్న సీబీఐ అధికారులు విచారణ చేసారు. ప్రస్తుతం గోవా గవర్నర్ గా చేస్తున్న ఆయన విచారణ అనంతరం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.   మన దేశంలో వీవీఐపీలు ప్రయాణించేందుకు రూ. 3600 కోట్ల ఖరీదు చేసే 12 హెలికాఫ్టర్లను కొనేందుకు యూపీఏ ప్రభుత్వం ఆమోదించిన తరువాత ఆ కాంట్రాక్టును దక్కించుకొనేందుకు ఇంగ్లాండ్ కు చెందిన ఆగస్ట హెలికాఫ్టర్ల సంస్థ భారతదేశంలో అనేకమంది ఉన్నతాధికారులు, వారి బంధువులు, రాజకీయ నాయకులకు ఏకంగా రూ.360కోట్లు లంచాలుగా చెల్లించినట్లు ఇటలీకి చెందిన ఒక ప్రభుత్వ విచారణ సంస్థ బయటపెట్టిన తరువాత కానీ దీని గురించి దేశంలో దర్యాప్తు సంస్థలకు సైతం తెలియలేదంటే ఈ అవినీతి వ్యవహారం ఎంతా ఎంత పకడ్బందీగా జరిగిందో అర్ధం చేసుకోవచ్చును. ఇప్పుడు ఈ.డీ. మరియు సీబీఐ అధికారులు ఈ అవినీతి వ్యవహారంపై విచారణ మొదలుపెట్టారు. మరి ఇప్పుడు మోడీ ప్రభుత్వం హయాంలోనయినా దోషులకు శిక్షలు పడి, వారి నుండి ఆ డబ్బు తిరిగి వసూలు చేయగలిగితే ప్రభుత్వ సమర్ధతపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. అలాకాక ఇప్పుడు కూడా ఏళ్ల తరబడి కేసును సాగదీసి చివరికి చెత్తబుట్టలో పడేస్తే ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పోతుంది.

జగన్మోహన్ రెడ్డి మౌనమేల?

  జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల తరువాత ప్రజా సమస్యలపై ప్రభుత్వాలను నిలదీస్తానని ప్రజలకు హామీ ఇచ్చి ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆంధ్ర, తెలంగాణాలలో ప్రభుత్వాలు ఏర్పడి ఇంకా నెలరోజులు కూడా పూర్తికాక మునుపే వాటిని నిలదీయలనుకోవడం సబబు కాదు. కానీ అవి తప్పుడు నిర్ణయాలు తీసుకొంటుంటే తప్పకుండా ఎవరయినా విమర్శించవచ్చును. తను రోజూ మీడియా ముందుకు వచ్చి ఏవో రాజకీయ వ్యాఖ్యలు లేదా విమర్శలు చేయబోనని ఆయన ముందే తెలిపారు. అంతేకాక ఆయన ఇంతవరకు కనీసం పార్టీ నిర్మాణం కూడా చేసుకోలేదు.   కానీ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నప్పటికీ కృష్ణా జలాల విడుదల, ఫీజు రీయింబర్సుమెంటు, ఇంకా అనేక ఇతర అంశాలపై తెలంగాణా ప్రభుత్వం అనుసరిస్తున్న అనుచిత వైఖరిని ఎందుకు ఖండించడం లేదో ఎవరికీ తెలియదు. రాష్ట్ర ప్రజల తరపున ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్దమని భుజాలు చరుచుకొంటున్న వైకాపా, తెలంగాణా ప్రభుత్వం పట్ల ఎందుకు అంత ఉదాసీనంగా వ్యవహరిస్తోందో? అసలు ఇంతవరకు ఏ విషయంలో కూడా వారు ఎందుకు నోరు మెదపడం లేదో వైకాపా నేతలే చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వానికి ఎంత బాధ్యతా ఉందో, 67అసెంబ్లీ, 9యంపీ సీట్లు గెలుచుకొన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైకాపాపై కూడా అంతే ఉంటుంది.   ఒకవేళ వైకాపాయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం దక్కించుకొని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినట్లయితే, అప్పుడు తెలంగాణా ప్రభుత్వం ఇదేవిధంగా నాగార్జున్ సాగర్ నుండి నీళ్ళువిడుదల చేయకుండా పేచీలు పెడితే, జగన్ ఇలాగే మౌనంగా ఊరుకోనేవారా? లేక నీళ్ళు విడుదల చేయమని కేసీఆర్ ని నిలదీసేవారా? అనే ప్రశ్నకు వైకాపా నేతలు వారి అధ్యక్షుడు జగన్ జవాబు చెప్పగలిగితే, వారిప్పుడు ఏవిధంగా స్పందించాలో వారికే తెలుస్తుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ పని కేవలం రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం చేయడం మాత్రమే కాదు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఎవరితోనయినా పోరాడవలసి ఉంటుంది.   తెలంగాణాకు మద్దతు, రాష్ట్రవిభజన, సమైక్యాంధ్ర ఉద్యమం, కాంగ్రెస్, తెరాసలతో రహస్య అనుబందం వంటి విషయాలలో జగన్ ద్వంద వైఖరి అవలంబించినందునే, ప్రజలు వైకాపాను తిరస్కరించారు. కానీ ఆయన ఇంకా అదే వైఖరి కొనసాగిస్తే వైకాపా విశ్వసనీయతను పూర్తిగా కోల్పోవడం తధ్యం.

ఆంద్ర ప్రజలపై తెరాస ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు?

  తెరాస ప్రభుత్వం భూముల స్వాధీనం విషయంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. అయితే ఇంతవరకు చట్ట విరుద్దంగా ఆక్రమింపబడిన భూములపైనే దాడులకు అనుమతి ఈయడంతో, సంబందిత వ్యక్తులు తప్ప ఇతరులెవరూ పెద్దగా అభ్యంతరాలు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఏపి.ఎన్.జి.ఓ. సంఘానికి గోపన్న పల్లె వద్ద గతంలో ప్రభుత్వం కేటాయించిన 189 ఎకరాల భూమిని ఎటువంటి నోటీసులు లేకుండా స్వాధీనం చేసుకోవడంతో వారిని కోరుండి రెచ్చగొట్టినట్లయింది.   శేరీలింగంపల్లి తహశీల్దార్ విద్యాసాగర్ మరియు రాజేంద్రనగర్ ఆర్డిఓ సురేష్ తమ సిబ్బందితో కలిసి వెళ్లి ఏపీయన్జీవోలకు చెందిన స్థలాన్ని స్వాధీనం చేసుకొంటున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం వారికి ఇల్లు కట్టుకోనేందుకు భూమి కేటాయించినప్పటికీ ఇంతవరకు అక్కడ ఎటువంటి నిర్మాణాలు జరుగనందున భూమిని స్వాదీనం చేసుకొంటున్నట్లు వారు ప్రకటించారు. అయితే ఈ భూమిని ప్రభుత్వం తన ఉద్యోగులకు ఇల్లు కట్టుకోనేందుకు ఇచ్చింది తప్ప, ప్రైవేటు వ్యక్తులకు లేదా సంస్థలకు రాయితీ మీద పరిశ్రమలో, వ్యాపార సంస్థలో పెట్టుకొనేందుకు అమ్మలేదు. ప్రభుత్వం ఏపీ యన్జీవో సంఘం సభ్యులందరికీ భూమిపై హక్కులు కల్పిస్తూ పట్టాలు కూడా ఇచ్చింది. కానీ ఆ భూమి తమదంటూ వేరే కొందరు వ్యక్తులు కోర్టులో కేసు వేయడం వలన, ఇతరత్రా కారణాల వలన ఉద్యోగులు అక్కడ ఇల్లు నిర్మించుకోలేదు. కానీ దానిని సాకుగా చూపి ఆంద్ర ఉద్యోగులకు కేటాయించిన భూములను తెరాస ప్రభుత్వం స్వాదీనం చేసుకోవాదం కవ్వింపు చర్యే అవుతుంది.   వారం రోజుల క్రితం జీ.హెచ్.యం.సి. అధికారులు సినీ నటుడు నాగార్జునకు చెందిన యన్.కన్వెన్షన్ సెంటర్ లోకి జొరబడి కొలతలు తీసి, అది ఆక్రమింపబడిన స్థలంగా గుర్తులు వేయడంతో, వారి చర్యలను ఖండిస్తూ నాగార్జున హైకోర్టులో పిటిషను వేసారు. దానిపై కోర్టు స్పందిస్తూ ముందుగా నోటీసులు జారీ చేయనిదే ఎవరిపై చర్యలకు పాల్పడవద్దని ఖచ్చితంగా ఆదేశాలు జారీ చేసింది. కానీ, శేరీలింగంపల్లి తహశీల్దార్ మరియు రాజేంద్రనగర్ ఆర్డిఓలు ఎటువంటి నోటీసులు జారీ చేయకుండానే ప్రభుత్వోద్యోగులకు కేటాయించిన భూమిని స్వాధీనం చేసుకొంటున్నామని ప్రకటించడంతో, ఏపీ యన్జీవోలు న్యాయ పోరాటానికి సిద్దమవుతున్నారు. ఒకవేళ వారు భూమిపై తమ హక్కులను కోర్టులో నిరూపించుకోగలిగి, వారి వాదనలతో కోర్టు కూడా ఏకీభవించినట్లయితే తెరాస ప్రభుత్వం అభాసు పాలవవచ్చును.   రెండు మీడియా చాన్నాళ్ళపై నిషేధం, నాగార్జునకు చెందిన యన్.కన్వెన్షన్ సెంటర్ పై చర్యలు, నాగార్జున సాగర్ నుండి ఆంధ్రాకు నీటి విడుదలకు అభ్యంతరాలు, ఇప్పుడు ఎన్జీజీవోల భూములు స్వాధీనం వంటి తెరాస ప్రభుత్వం చర్యలన్నీ ఆంద్ర ప్రజలపై చాలా కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నట్లే ఉన్నాయి. రాజకీయ నేతలు ప్రభుత్వ పగ్గాలు చేప్పట్టిన తరువాత కూడా రాజకీయ నేతల్లాగే వ్యవహరిస్తే దాని వలన వారే అప్రదిష్ట పాలవుతారు.

మున్సిపాలిటీ కబుర్లు

  ప్రజాసేవ అంటే ప్రజలకు సేవ చేయడమని ప్రజలు అపోహపడుతుంటారు. కానీ ప్రజల చేత సేవ చేయించుకోవడమని రాజకీయనాయకుల అభిప్రాయం. ఎవరి అపోహలు వారివి, ఎవరి అభిప్రాయలు వారివి. గనుకనే ప్రతీ ఐదేళ్ళకోసారి వచ్చే ప్రజాస్వామ్య పుష్కరాలంటే అందరికీ ఉత్సాహం, ఆనందం పొంగి పొరలుతుంటాయి . ఈ మధ్యనే చాలా అట్టహాసంగా ముగిసిన ఆ పుష్కరాలలో ఓడలు బళ్లయ్యాయి బళ్ళు ఓడలయ్యాయి. అందువలన మధ్యలో మినీ పుష్కరాల వంటి ఏ మునిసిపల్ ఎన్నికలో వస్తే తప్ప అధికారంలో ఉన్నా లేకున్నా మరో ఐదేళ్ళవరకు అందరూ పంటి బిగువున ప్రజాసేవ చేసుకొంటూపోవలసిందే. తప్పదు మరి.   పెద్ద పుష్కరాలలో ప్రజాసేవకు చాలా గట్టి పోటీ ఉంటుంది గనుక ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా తప్పనిసరిగా కొందరితో బహిరంగంగా శత్రుత్వం, రహస్యంగా మిత్రత్వం పాటించవలసి వస్తుంటుంది. దానిని రాజకీయ ప్రత్యర్ధులు అపార్ధం చేసుకొన్నప్పటికీ, ప్రజలు మాత్రం సరిగ్గానే అర్ధం చేసుకోగలరు. కనుకనే ఆ పెద్ద పుష్కరాలు అలా ముగిసిపోయాయి. అయితే పంచాయితీ, మునిసిపల్ ఎన్నికలలో అటువంటి ఇబ్బందులుండవు. వీధిలో ప్రజల ముందు ఒకరినొకరు బండబూతులు తిట్టుకొన్నప్పట్టికీ, అవసరమయితే మళ్ళీ ఆ తిట్టినవాళ్ళకే నిర్లజ్జగా మద్దతు ఇచ్చుకోవచ్చును, పుచ్చుకోవచ్చును. అప్పుడు కూడా ప్రజలేమీ అపార్ధం చేసుకోరు పాపం. ఎందుకంటే ప్రజాసేవ చేసేందుకు ఆ మాత్రం ఇచ్చిపుచ్చుకొనే ధోరణి చాలా అవసరమని అందుకే వాటిలో కొన్నిటికి సహకార ఎన్నికలని పేరు పెట్టారని దృడంగా నమ్ముతుంటారు. అందుకే కాంగ్రెస్, వై.కాంగ్రెస్, తెదేపా, తెరాసలు ఒకదానికొకటి సహకరించుకొంటూ రెండు రాష్ట్రాలలో మునిసిపాలిటీలు, కార్పోరేషన్లు, మేయర్ పదవులు తలా ఇన్నీ అంటూ పంచేసుకొన్నాయి.   ఇక ఇంతబాగా ఒకరికొకరు సహకరించుకొని పంపకాలు చాలా సజావుగా పూర్తి చేసేసుకొన్నారు గనుక రేపటి నుండి రాముడు-భీముడు, రామ్ ఔర్ శ్యామ్ లాగా ఒకరు భుజాల మీద మరొకరు చేతులు వేసుకొని తిరుగుతూ ప్రజాసేవ...కాదు.. ప్రజలకి సేవ చేస్తారనుకొంటే అపోహే అవుతుంది. ముందుగా ‘మునిసిపాలిటీ జమా ఖర్చులపై చర్చ’ అంటూ చిన్నపాటి యుద్ధం మొదలుపెడతారు. జీవనదుల వంటి మురికి కాలువలు గురించి, గతుకుల మద్య అక్కడక్కడ కనబడే రోడ్ల గురించి, కరెంటు ఉన్నప్పటికీ వెలగని వీధి దీపాల గురించి ఏసి గదుల్లో కూర్చొని చర్చించమని ప్రజలు కోరితే, అంతసేపు కూర్చోలేక స్టాండింగ్ కమిటీలు వేసుకొని అందులో చేరిపోతుంటారు.   కమిటీలో సభ్యులయ్యాక వీధిలో దీపం ఎందుకు వెలగడం లేదు? కాలువలో ప్రవహించాల్సిన మురుగు నీరు రోడ్ల మీద ఎందుకు ప్రవహిస్తోంది? అంటూ ఎవరయినా పిచ్చిపిచ్చి ప్రశ్నలు వేస్తే జవాబు చెప్పలేకపోతే చాలా నామోషీగా ఉంటుంది గనుక అధ్యయనం చేసేందుకు ఏ గోవాకో వీలయితే సింగపూరుకో శ్రమ అనుకోకుండా వెళ్లిరాక తప్పదు. ఎలాగు అంతేసే దూరాలు రోజూ వెళ్లి రాలేరు గనుక పనిలోపనిగా పెళ్ళాం బిడ్డలను కూడా తోడు తీసుకువెళితే అధ్యయనం ఆహ్లాదంగా సాగుతుంది. కానీ ఈవిషయంలో మాత్రం ప్రజలు అస్సలు సహించారు ఎందుకో మరి? “టాట్! మా డబ్బుతో విలాస యాత్రలు చేస్తారా?” అంటూ ఒంటికాలి మీద లేస్తుంటారు. కానీ ప్రజలకి గజినీలా షార్ట్ మెమొరీ లాస్ ఉంది గాబట్టి ఆ విషయాన్ని ఇట్టే మరిచిపోతారు గనుక వారితో పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. ఇలా కడుపులో చల్ల కదలకుండా ఏసి గదుల్లో కూర్చొని వాడులాడుకొంటూ రోజులు దొర్లించేసినందుకు, చివారఖరు రోజున ఏ ల్యాప్ టాపో, మరొకటో బహుమానంగా పుచ్చుకొని ఇంటికి వెళ్లిపోవచ్చును. ఇప్పుడు చైర్ మ్యానులు, ఉమనుల ఎన్నిక కూడా పూర్తింది గనుక ఇక ఈ వ్యవహారాలన్నీ చక్కబెట్టుకోవచ్చును.

కాంగ్రెస్ మార్క్ సమీక్ష

  కాంగ్రెస్ పార్టీ నేతలు ఎప్పుడు సమావేశమయినా పార్టీ గురించే ఆలోచిస్తారు. పార్టీ గురించే మాట్లాడుకొంటారు. ఎన్నికలలో ఓడిపోయినా ప్రతీసారి ‘పార్టీ ఓటమికి నువ్వే కారణమంటే...కాదు..నువ్వేనని’ కీచులాడుకొంటారు. ఆ తరువాత మనమెవరమూ కాదు ప్రతిపక్షాలే కారణమని ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించుకొంటారు. పనిలోపనిగా పార్టీ ప్రక్షాళన గురించి కూడా మాట్లాడుకొంటారు. మంగళవారం డిల్లీలో జరిగిన పార్టీ సమావేశానికి వెళ్ళిన టీ-కాంగ్రెస్ నేతలు కూడా ఇవే విషయాలు మాట్లాడుకొన్నామని మీడియాకు తెలిపారు.   తెలంగాణా ఇచ్చినా పార్టీని గెలిపించలేకపోయినందుకు సిగ్గుతో తలదించుకొంటున్నామని వీ. హనుమంత రావు స్వయంగా తెలిపారు. తెలంగాణా ఇచ్చినపుడే పార్టీని గెలిపించలేని వారు, ఐదేళ్ళలో తెరాస ప్రభుత్వం అభివృద్ధి సాధించి చూపిస్తే, అప్పుడు కాంగ్రెస్ పార్టీని ఈ వయసుడిగిన నేతలు ఏవిధంగా గెలిపిస్తారో, సోనియా గాంధీ కనుగొన్నారో లేదో తెలియదు. కానీ షరా మామూలుగానే ఆంధ్రా, తెలంగాణాలలో ప్రతిపక్ష పార్టీలు భూటకపు హామీలు గుప్పించడం వలనే ప్రజలు కాంగ్రెస్ ను కాదని వారికి ఓటేయడంతో ఓడిపోయామని సర్ది చెప్పుకొన్నారు. అంతేగాక టీ-పీసీసీ అధ్యక్షుడు పొన్నాల శల్యసారధ్యం కారణంగా కూడా పార్టీ ఓడిపోయిందని అందరూ అభిప్రాయపడిపోయారు. అందువల్ల పొన్నాలను ఇప్పటికయినా ఆ పదవిలో నుండి తప్పించి తమవంటి సీనియర్లకు అవకాశం ఇస్తే, ‘నైవేద్యం పెట్టు నా మహిమ చూపిస్తా!’నన్నట్లు వచ్చే ఎన్నికలలో పార్టీని తప్పకుండా గెలిపించుకొంటామని అందరూ సోనియా గాంధీకి హామీ ఇచ్చినట్లు సమాచారం. శాసనమండలిలో 15మంది సభ్యులున్నప్పటికీ, తమ అభ్యర్ధిని మండలి చైర్మన్ గా గెలిపించుకోలేనివారు, పార్టీ సభ్యులు గోడదూకి వెళ్లిపోతుంటే ఆపలేనివారు, ఐదేళ్ళ తరువాత వచ్చే ఎన్నికల వరకు పార్టీని బ్రతికించి ఉంచగలరా? అని సోనియాగాంధీ ప్రశ్నించారో లేదో కూడా తెలియదు. కానీ పార్టీ ఓటమిపై సమీక్ష జరిగింది.