వచ్చే ఎన్నికల నాటికి వైకాపా జెండా మారుతుందేమో?

  ఆంధ్రలో చంద్రప్రభుత్వం రెండేళ్ళు మహా అయితే నాలుగేళ్ళు ఉంటుందని, ఆ తరువాత తానే ముఖ్యమంత్రి అవుతానని జగన్మోహన్ రెడ్డి ఘంటాపదంగా చెపుతున్నారు. అందుకే తుళ్ళూరు రైతులను అధైర్యపడవద్దని, తను ముఖ్యమంత్రి అవగానే ఎవరి భూములు వారికి ఇచ్చేస్తానని హామీ కూడా ఇస్తున్నారు. ఆ భూముల మీద రాజధాని నిలబడిన తరువాత అదెలా సాధ్యపడుతుందో ఆయనే చెప్పి పుణ్యం కట్టుకొంటే బాగుండేది.   ఇదివరకు ఒకపక్క రాష్ట్ర విభజన జరిగిపోతుంటే, నాకు ముప్పై మంది యంపీలను, ఓ 115 మంది శాసనసభ్యులను ఇచ్చినట్లయితే డిల్లీలో చక్రం తిప్పి అడ్డేస్తానని ఆయన హామీ ఇచ్చినప్పుడూ జనాలు ఇలానే చాలా కన్ఫ్యూస్ అయిపోయారు. ఆ కన్ఫ్యూస్ లోనే ఆయనకి ఓటేయడం మరిచిపోయినట్లున్నారు. అయినప్పటికీ గతం గతః కనుక మళ్ళీ వచ్చే ఎన్నికల తరువాత ఆంధ్రాలో ఆయనే ముఖ్యమంత్రి అయిపోదామని డిసైడ్ అయిపోయారు. చాలా సంతోషం.   ఇక ఆ మధ్యన ఎప్పుడో ఆయన హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి వచ్చే ఎన్నికల తరువాత తెలంగాణాలో కూడా తమ పార్టీయే అధికారంలోకి రాబోతోందని ప్రకటించేశారు. వైకాపా, కాంగ్రెస్, బీజేపీలు తప్ప అధికార తెరాసతో సహా అన్ని పార్టీలు కూడా తెలంగాణా నుండి ఊడ్చిపెట్టుకుపోతాయని ఆయన జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికలకి ఇప్పటి నుండే ప్రిపేర్ అవ్వాలనే ఆలోచనతో, తనకు బాగా అచ్చి వచ్చిన బాణాన్ని తెలంగాణాపైకి వదిలారు. ఆ బాణం అంటే మన షర్మిలమ్మ తెలంగాణాపైకి రివ్వున అలా దూసుకువెళ్లి నలుగురినీ ఓసారి పరామర్శించేసి తిరిగి వెనక్కి వచ్చేశారు. మళ్ళీ ఇప్పుడప్పుడే వెళ్ళేలాలేరు. ఎందుకంటే పరిస్థితులు అనుకూలించడం లేదు.   మొన్నటి వరకు వైకాపా గట్టు మీద కూర్చొని అందరి మీద విరుచుకుపడ్డ రామచంద్ర రావు ఎవరికీ చెప్పాపెట్టకుండా గట్టు దూకేశారు. అంతకు ముందు మరో ఇద్దరు ముగ్గురు జంప్ అయిపోయారు. మళ్ళీ మరో పెద్దాయన శూన్యమాసం అని కూడా చూడకుండా ఈరోజు పార్టీలో నుండి జంప్ చేసేసారు. ఆయన మరెవరో కాదు అశ్వారావుపేట యం.యల్యే. తాటి వెంకటేశ్వర్లు. ఆయన ఉండేది వైకాపాలో అయినా తెదేపా నేత తుమ్మలతో మంచి దోస్తీ ఉండేది. అందుకే ఆయన వెంటే నేనూ సైతం అంటూ తెరాసలోకి వెళ్లిపోయేందుకు బ్యాగ్ సర్దేసుకొని వెళ్ళిపోతున్నారు.   గమ్మతయిన విషయం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం పార్టీకి చెందిన వైరా యం.యల్యే. మదన లాల్ తెరాసలోకి దూకేసినప్పుడు, అయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఈయనే ఓ లేఖ వ్రాసి పట్టుకొని వెళ్లి స్పీకర్ మధుసూధనాచారి చేతిలో పెట్టి వచ్చేరు. కానీ ఇప్పుడు ఈయనే ఆ పార్టీలోకి దూకేస్తున్నారు. ఇక వైకాపాకు తెలంగాణాలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఒక్కరే మిగిలారు. కనుక ఇప్పుడు ఆయన వెళ్లి తాటి మీద అనర్హత వేటు వేయమని స్పీకర్ ని కోరుతారేమో. కానీ ఆయన కూడా బ్యాగ్ సర్దేసుకొన్నారని, కాకపోతే కాస్త వారం వర్జ్యం చూసుకొని వెళదామని ఆగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన కూడా వెళ్ళిపోతే ఇక వైకాపాకు తెలంగాణా శాసనసభతో పనుండదు. ప్చె! ఏమిటో...వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో అన్ని పార్టీలు తుడిచిపెట్టుకుపోతాయని జోస్యం చెపితే అన్నిటి కంటే ముందుగా వైకాపాయే తుడిచిపెట్టుకుపోతోంది. కానీ తెలంగాణాలో వైకాపా ఖాళీ అయిపోతున్నా, జగనన్న కానీ ఆ పార్టీ నేతలు గానీ ఏనాడూ కించిత్ బాధపడినట్లు లేదు. బహుశః వైకాపాను తెరాసలో విలీనం చేస్తున్నామని భావిస్తున్నారో ఏమో?   ఆంధ్రాలో కూడా సేమ్ టు సేమ్ పరిస్థితే కనబడుతోంది. కొంత మంది బీజేపీ తీర్ధం పుచ్చుకొని తరిస్తుంటే మరికొంతమంది తెదేపా కండువాలు కప్పుకోవాలని తహతహలాడుతున్నారు. బహుశః ఇదంతా చూసే కాబోలు ఎక్కడో మధ్యప్రదేశ్ లో ఉండే అజిత్ జోగీ అనే కాంగ్రెస్ పెద్దాయన జగన్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేస్తే బాగుంటుందని ఒక ఉచిత సలహా ఇచ్చేరు. నిప్పులేనిదే పొగరాదు కనుక తెర వెనుక అటువంటి ప్రయత్నాలు ఏమయినా జరుగుతున్నాయేమోనని అనుమానించక తప్పడం లేదు. ఇలాగయితే వచ్చేఎన్నికల తరువాత జగనన్న ముఖ్యమంత్రి అవడం, రాజన్న రాజ్య స్థాపన చేయడం, స్వర్ణ యుగం తీసుకురావడం ఎలాగో అర్ధం కావడం లేదు.

అవును మళ్ళీ వాళ్ళు పార్టీ మారారు

  కడప జిల్లాలో కందుల సోదరులుగా పేరొందిన కందుల శివానందరెడ్డి, రాజమోహన్ రెడ్డి ముచ్చటగా మళ్ళీ మరోసారి పార్టీ మారారు. ఒకసారి తెదేపాలోకి మరోసారి కాంగ్రెస్ పార్టీలోకి మారుతుండే వారిరువురు ఎన్నికల సమయంలో వైకాపాలో చేరారు. కానీ వారు ఊహించినట్లు ఆ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో, వారిరువురూ చెట్టాపట్టాలేసుకొని మళ్ళీ బీజేపీలోకి దూకేశారు. పోతూపోతూ వారిరువురూ వైకాపాకు ఒక సర్టిఫికేట్ కూడా జారీ చేసారు. ఆపార్టీకి భవిష్యత్ లేదనే ఉద్దేశ్యంతోనే తామిరువురం పార్టీని విడిచిపెట్టేస్తున్నామని చెప్పారు. కానీ ఎన్ని పార్టీలు మారినా తమ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. అందువలన ఇప్పుడు బీజేపీలో చేరితే తమకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందనే వారి నమ్మకాన్ని మెచ్చుకోక తప్పదు. కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీలో చేరిన పురందేశ్వరి, కావూరి సాంబశివరావు వంటి సీనియర్ నేతలను ఆ పార్టీ పక్కనబెట్టి ఆర్.యస్.యస్. నుండి రామ్ మాధవ్ ను పార్టీలోకి రప్పించి ఆయనకు పార్టీ కార్యదర్శి వంటి కీలకపదవిని కట్టబెట్టింది. అటువంటప్పుడు అనేక పార్టీలు మారి బీజేపీలోకి వచ్చిపడిన కందుల సోదరులు ఆ పార్టీ నుండి ఏమి ఆశించగలరు? ఏమీ దక్కకపోతే వారు ఆ పార్టీని అంటిపెట్టుకొని ఎంతకాలం ఉంటారు?

తెలంగాణా సెంటిమెంటు-సర్వ రోగ నివారిణి?

  రాష్ట్ర విభజన తరువాత తెలంగాణాకు మిగులు బడ్జెట్ ఉన్నప్పటికీ నిత్యం అది డబ్బుకి కటకటలాడుతూనే ఉంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం వాణిజ్య పన్నుల విభాగం ఆంధ్రాకు చెందిన అధికారులు, ఉద్యోగులతో నిండి ఉండటమేనని తెలంగాణా అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. కీలకమయిన పదవులలో ఉన్న ఆంద్ర అధికారులు ప్రాంతీయ భేదభావం చేత, పన్నుల వసూళ్ళలో అశ్రద్ధ చూపుతున్నారని, ఆ కారణంగానే గత ఏడాది ఇదే సమయానికి 28,000 కోట్లు వసూలు కాగా, ఈ సారి కేవలం రూ 14,000 కోట్లు మాత్రమే వసూలు అయ్యిందని, మరొక మూడు నెలలలో మిగియనున్న ఈ ఆర్ధిక సం.లో ఆ లక్ష్యాన్ని అధిగమించడం మాటెలాఉన్నా, దానిని చేరుకోవడం చాలా కష్టమని ఆ శాఖలో గల తెలంగాణా అధికారులు భావిస్తున్నారు.   డిపార్టుమెంటులో ఆంద్ర అధికారుల అశ్రద్దను అలుసుగా తీసుకొని వ్యాపారస్తులు కూడా పన్ను ఎగవేస్తున్నారని, కనుక ఆంద్ర అధికారుల స్థానంలో వీలయినంత త్వరగా తెలంగాణాకు చెందిన అధికారులను నియమించాలని, ఆ శాఖకు చెందిన టీ-జేయేసి సభ్యులు కొత్తగా వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా నియమితులయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కోరారు.   వారు చెప్పిన వివరాల ప్రకారం తెలంగాణాలో మొత్తం 12 రెవెన్యూ డివిజన్లు ఉండగా వాటిలో 10 డివిజన్లకు ఆంధ్రాకు చెందినవారే డిప్యూటీ కమీషనర్లుగా ఉన్నారు. వాటిలో అత్యంత కీలకమయిన హైదరాబాద్ పరిధిలో ఏడు డివిజన్లు ఉండగా వాటిలో ఆరింటికి ఆంద్ర డిప్యూటీ కమీషనర్లుగా ఉన్నారు. తెలంగాణా రాష్ట్రంలో మొత్తం 92 మంది వాణిజ్య పన్ను అధికారులలో అధిక శాతం మంది ఆంధ్రాకు చెందిన వారే. రాష్ట్రానికి ప్రధాన ఆదాయవనరు అయిన హైదరాబాదులో 57 మంది వాణిజ్య పన్ను అధికారులుంటే వారిలో ఆంధ్రాకు చెందినవారు 24 మంది ఉన్నారు.   ఈ ఆంధ్రాకు చెందిన అధికారులు ప్రాంతీయ భేదభావం కారణంగా పన్నుల వసూళ్ళలో అశ్రద్ధ చూపడం వలననే ఆదాయం తగ్గిందని తెలంగాణా నాన్ గజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్ యస్. దేవీప్రసాద్, ఆ శాఖకు చెందిన టీ-జేయేసి చైర్మన్ వెంకటేష్ తదితరులు ఆరోపిస్తున్నారు. వారు మంత్రి తలసాని యాదవ్ ని కలిసి తక్షణమే ఆంద్ర అధికారుల స్థానంలో తెలంగాణా అధికారులను నియమించాలని కోరారు. కానీ ఇప్పటికిప్పుడు అంతమందిని నియమించడం అసాధ్యం కనుక పదోన్నతి కల్పించడం ద్వారా ఆ స్థానాలలో తెలంగాణా అధికారులని నియమించాలని వారు మంత్రిని కోరారు.   ప్రభుత్వం కమలనాధన్ కమిటీ నివేదిక కోసం ఎదురు చూస్తున్నందున వారి ప్రతిపాదన అమలు చేయడం సాధ్యం కాదని మంత్రి తేల్చి చెప్పారు. అధికారులు అందరూ సమిష్టిగా కృషి చేసినట్లయితే ఈ సమస్యను అధిగమించవచ్చని ఆయన వారికి సూచించారు.   తెలంగాణా అధికారులు సంఘాల నేతలు ఆరోపిస్తున్నట్లుగా ఆంద్ర అధికారుల అశ్రద్ధ కారణంగానే ఇంత భారీ ఆదాయం నష్టపోయినట్లయితే, అందుకు భాధ్యులయినవారిని ప్రభుత్వం ఉపేక్షించనవసరం లేదు. ఎందుకంటే వారికి తెలంగాణా ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తోంది. తన క్రింద పనిచేస్తున్న ఉద్యోగులు ఏ ప్రాంతానికి చెందినవారయినా వారిని ప్రభుత్వం సంజాయిషీ కోరవచ్చును. అలసత్వం ప్రదర్శించారని నిరూపితమయితే వారిపై కటిన చర్యలు కూడా చేప్పట్టవచ్చును.   మంత్రిని కలిసిన తెలంగాణా సంఘ ప్రతినిధులు, అధికారులు ఆదాయం తగ్గినందుకు సదరు ఆంధ్రా అధికారులను పిలిపించి వారి సంజాయిషీ కోరమనకుండా, తమకు పదోన్నతులు కల్పించమని కోరడంలో మర్మమేమిటి? తెలంగాణా సెంటిమెంటుతో రాష్ట్ర విభజన జరిగింది. అనేక శాఖల విభజన కూడా జరిగింది. చివరికి పదోన్నతుల కోసం కూడా తెలంగాణా సెంటిమెంటునే సర్వరోగనివారిణిలాగ ఉపయోగించుకోవాలనుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అందుకే మంత్రి వారికి కలిసిపనిచేయమని సూచించారేమో?

బైరెడ్డి అందుకే తెదేపాలో చేరాలనుకొంటున్నారా?

  రాయలసీమకు చెందిన తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ముగ్గురూ కూడా సీమకు ద్రోహం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించిన రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు చంద్రబాబు నాయుడుపై ప్రశంశలు కురిపిస్తున్నారు. చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి చాలా కృషిచేస్తున్నారని, ఆయన అనుమతిస్తే తాను తెదేపాలో చేరేందుకు సిద్దమని మొన్న కర్నూలు పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. రాయలసీమ అభివృద్ధి కోసమే తను తెలుగుదేశంలో జేరాలనుకొంటున్నట్లు ఆయన తెలిపారు.   కానీ ఇదే బైరెడ్డి సార్వత్రిక ఎన్నికలలో తన అభ్యర్ధులను నిలబెట్టి రాయలసీమకు అన్యాయం చేస్తున్న అన్ని రాజకీయపార్టీలకు గట్టిగా బుద్ధి చెపుతానని ప్రగల్భాలు పలికారు. కానీ ఆయనపై పోలీసులు ఒక హత్యానేరం క్రింద కేసు నమోదు చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ చాలా కాలం తరువాత అజ్ఞాతంలో నుండి బయటకు వచ్చిన ఆయన ఇప్పుడు రాయలసీమ అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరుతానని చెప్పడం హాస్యాస్పదం. ఆయన పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నా, చంద్రబాబు నాయుడు అటువంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను పార్టీలో చేర్చుకొంటారా? అంటే అనుమానమే. ఒకవేళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే, ఆయన అందులో జేరెందుకే మొగ్గు చూపేవారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్ అగమ్యగోచరంగా ఉండటంతో, వైకాపాలో జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేమనే ఆలోచనతోనే ఆయన తెదేపాను ఎంచుకొన్నారని చెప్పవచ్చును. ఒకవేళ చంద్రబాబు ఆయనను పార్టీలో చేర్చుకోకపోతే అప్పుడు ఆయన చంద్రబాబుని నిందిస్తూ బీజేపీ వైపు పరుగు తీయవచ్చును.

ఒక్క ఐఏఎస్.. మూడు పదవులు...

  ఒక్క ఐఏఎస్ ఆఫీసర్‌ ఒక్క పదవి అయితే సమర్థంగా నిర్వహిస్తారు. తనకు అప్పగించిన పదవీబాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. అయితే ఒక్క ఐఏఎస్ ఆఫీసర్‌కి ఒకేసారి మూడు పదవులను అప్పగిస్తే ఏమవుతుంది? ఆ ఆఫీసర్‌ ఆ పదవులకు న్యాయం చేయలేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఆ ఆఫీసర్ తనకు అప్పగించిన బాధ్యతలను ఛాలెంజ్‌గా తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి నడిమెట్ల శ్రీధర్ తనకు అప్పగించిన మూడు బాధ్యతలను అలా ఛాలెంజింగ్‌గా తీసుకుని నిర్వర్తిస్తారని ఆశిద్దాం. ప్రస్తుతం ఆయన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కలెక్టర్‌గా వున్నారు. ఒక వ్యక్తి రెండు జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేయడం అంటే అది తలకు మించిన భారమే అవుతుంది. అయితే ఆ రెండు బాధ్యతలను శ్రీధర్ ప్రశంసనీయంగా నిర్వర్తిస్తున్నారు. ఆయన ప్రతిభను గుర్తించారో ఏమోగానీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు శ్రీధర్ భుజస్కంధాల మీద మరో భారాన్ని మోపారు. అది సింగరేణి కాలరీస్ కంపెనీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యత. ఇప్పటి వరకూ ఈ పదవిలో వున్న భట్టాచార్య కోల్ ఇండియా లిమిటెడ్ సీఎండీ బాధ్యతలను నిర్వర్తించడానికి బదిలీ అయి వెళ్ళారు. దాంతో ఏర్పడిన ఖాళీలో శ్రీధర్‌ని నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ శ్రీధర్‌కి మంచి టార్గెట్ కూడా ఇచ్చారు. గతంలో కంటే ఉన్నతమైన స్థానికి సింగరేణి కాలరీస్ కంపెనీని తీసుకురావాలని కోరారు. మరి మూడు బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీధర్ తన లక్ష్యాన్ని ఎలా చేరుకుంటారో చూడాలి.

జనవరిలో నారా లోకేష్ తెలంగాణా పర్యటన?

  ఇంతవరకు తెర వెనుకనే ఉంటూ తెదేపాను బలోపేతం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్న నారా లోకేష్, ఇకపై నేరుగా ప్రజలలోకి వచ్చి పార్టీని వారికి మరింత దగ్గర చేయాలని భావిస్తున్నాట్లు తెలుస్తోంది. ఆ ప్రయత్నంలోనే ఆయన వచ్చే నెలలో తెలంగాణాలో పర్యటించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకొంటున్నట్లు తాజా సమాచారం.   తెలంగాణ ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్న సమయంలో కూడా ఎంతో పటిష్టంగా ఉన్న తెదేపా, తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత తెరాస ఆకర్షణకులోనయి కొంతమంది సీనియర్ నేతలు, యం.యల్యేలు. వారి అనుచరులు పార్టీని వీడి తెరాసలో జేరిపోవడంతో తెలంగాణాలో తెదేపా చాలా బలహీనపడింది. కానీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టడంతో తెలంగాణాలో పార్టీ కోసం సమయం కేటాయించలేకపొతున్నారు. బహుశః అందుకే ఆయన కుమారుడు నారా లోకేష్ ఇకపై తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసేందుకు చొరవ తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.   ఒకవేళ ఆయన తెలంగాణాలో పర్యటనలు ప్రారంభిస్తే, అప్పుడు తెరాస నేతలు ఏవిధంగా స్పందిస్తారో చూడవలసి ఉంది. ఒకవైపు నారా లోకేష్ తెదేపాను బలపరుచుకొనే ప్రయత్నాలు చేస్తుంటే, మరో వైపు షర్మిల కూడా వైకాపాను బలోపేతం చేసుకొనేందుకు ఇప్పటికే పరామర్శ యాత్రల పేరిట తెలంగాణాలో పర్యటించారు. కనుక ఒకవేళ నారా లోకేష్ కూడా తెలంగాణాలో యాత్రలు మొదలుపెట్టినట్లయితే అప్పుడు తెరాస, తెదేపా, వైకాపాల మధ్య మాటల యుద్ధం అనివార్యమవవచ్చును.   అయితే, షర్మిల పరామర్శ యాత్రపై స్పందించని తెరాస, నారా లోకేష్ తెలంగాణా పర్యటనలపై విరుచుకుపడినట్లయితే, అది తెరాస-వైకాపాల మధ్య ఉన్న రహస్య అవగాహన గురించి ప్రశ్నించేందుకు తెదేపాకు అవకాశం కల్పించినట్లవుతుంది కనుక తెరాస వెంటనే స్పందించకపోవచ్చును.

ఏపీ రాజధాని అభివృద్ధి మండలి బిల్లుకు గవర్నర్ ఆమోదం

    ఏపీ రాజధాని అభివృద్ధి మండలి బిల్లుకు గవర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేసి, ఈరోజు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి ఆరు జీవోలు విడుదల చేసింది. వాటిలో మొదటి జీఓ ద్వారా విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థను రద్దు చేసారు. రెండవ జీఓ ద్వారా రాజధాని యొక్క ఖచ్చితమయిన ఎల్లలను నిర్దారించారు. మొత్తం 122కిమీ పరిధిలో రాజధాని నగరం ఏర్పాటవుతుంది. కానీ 7068 కిమీకు విస్తరించి ఉండే రాజధాని అభివృద్ధి మండలి పరిధిలోకి గుంటూరు జిల్లాలోని 29 మండలాలు, కృష్ణా జిల్లాలోని 29 మండలాలు కలిపి మొత్తం 58 మండలాలు వస్తాయి.   ఈ మండలి పరిధిలోకి కృష్ణా జిల్లాలోని విజయవాడ రూరల్, విజయవాడ అర్బన్, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, ఉయ్యూరు, జి.కోండూరు, కంచికచర్ల, వీర్లుపాడు, పెనుగంచిప్రోలు, నందిగామ, చందర్లపాడు, మైలవరం, ఆగిరిపల్లి, బాపులపాడు, నూజివీడు, పామిడిముక్కల, తోట్లవల్లూరు, పెదపారపూడి మండలాలు పూర్తిగా వస్తాయి. మొవ్వ, చల్లపల్లి, ఘంటశాల, పామర్రు, గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ, మోపిదేవి మండలాల్లోని చాలా గ్రామాలు వస్తాయి.   గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు, పెదకూరపాడు, ముప్పాళ్ల మండలాలు పూర్తిగా వస్తాయి. అచ్చంపేట, క్రోసూరు మండలాలలోని కొన్ని గ్రామాలు వస్తాయి.భట్టిప్రోలు, పొన్నూరు, ప్రత్తిపాడు, పెదనందిపాడు, ఎడ్లపాడు, నాదెండ్ల మండలాలలో సగానికిపైగా గ్రామాలు వస్తాయి.   రాజధాని అభివృద్ధి మండలికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చైర్మన్ గా, మునిసిపల శాఖ మంత్రి నారాయణ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. వీరిరువురితో కలిపి మండలిలో మొత్తం 11మంది సభ్యులు ఉంటారు. మునిసిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖ్య కార్యనిర్వాహక మండలి చైర్మన్ గా, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మండలి కమీషనర్ సభ్యులుగా ఉంటారు. ఈ కార్యనిర్వాహక మండలి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూసేకరణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. త్వరలో మిగిలిన సభ్యుల నియామకాలు కూడా జరుగుతాయి.   ఇప్పటికే రెవిన్యూ శాఖ 20 బృందాలకు అన్ని విధాల శిక్షణ ఇచ్చిసిద్దంగా ఉంచింది. రాజధాని అభివృద్ధి మండలి లాంఛనంగా ఏర్పాటయింది గనుక ఇక ఒకటి రెండు రోజుల్లో భూసేకరణ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టే అవకాశం ఉంది.

రేపటి నుండి రాజధాని కోసం తుళ్ళూరు భూసేకరణ మొదలు

  రేపటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖకు చెందిన 20 బృందాలు తుళ్ళూరు మండలంలో రాజధాని కోసం భూసేకరణ కార్యక్రమం మొదలుపెట్టబోతున్నాయి. తుళ్ళూరు మండలంలో చాలా గ్రామాల ప్రజలు ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా తమ భూమిని ప్రభుత్వానికి ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేసినప్పటికీ కొన్ని గ్రామాల ప్రజలు భూమిని ఇచ్చేందుకు నిరాకరిస్తున్నందున ఆ ప్రాంతాలలో భూసేకరణ సందర్భంగా ఉద్రిక్తతలు ఏర్పడవచ్చును. అందువలన రెవెన్యూ శాఖ డిప్యూటీ కలెక్టరు, తసిల్దారు, సర్వేయర్లతో కూడిన బృందాలను ఏర్పాటు చేసి వారికి భూసేకరణ విధివిధానాలు, ప్రభుత్వం అందజేస్తున్న నష్టపరిహారం వంటి అంశాలపై ముందుగానే శిక్షణ కూడా ఇచ్చింది.   ఒక్కో బృందానికి సుమారు 1400 ఎకరాల భూసేకరణ బాధ్యత అప్పగించడం ద్వారా ఈ ప్రక్రియలో ఒక ప్రాంతంలో ఆటంకాలు ఎదురయినప్పటికీ ఆ ప్రభావం మరో ప్రాంతం పడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకొంది. ఆ విధంగా అత్యధిక భాగంలో భూసేకరణ పూర్తయినట్లయితే, అవరోధాలు ఎదురయ్యే ప్రాంతాలలో సమస్యలు పరిష్కరించుకొనేలోగానే నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టే అవకాశం ఉంటుంది.   ఇక రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు పూనుకొంటున్న ఈ సమయంలోనే, కేంద్ర ప్రభుత్వం ఇదివరకు యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన కటినమయిన షరతులతో కూడిన భూసేకరణ చట్టంలో అటువంటి నిభంధనలను సరళతరం చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసేందుకు ఆమోదముద్ర వేసింది. ముఖ్యంగా ఇదివరకు చట్టంలో ఉన్న ‘భూసేకరణకు భూయాజమాని ఆమోదం తప్పనిసరి’ అనే షరతును తొలగించేందుకు ఆమోదముద్ర వేసింది. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అవసరమయితే సవరించిన కొత్త చట్ట ప్రకారం రైతులకు ఇష్టం ఉన్నా లేకున్నా భూసేకరణ చేసే వెసులుబాటు ఏర్పడింది. కానీ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులకు మంచి ప్యాకేజీ ఇస్తోంది గనుక ఆ చట్టం ప్రయోగించవలసిన అవసరం ఉండకపోవచ్చును. ప్రభుత్వం నిర్దేశించుకొన్న మొత్తం 30,000 ఎకరాల భూసేకరణలో ఎక్కడయినా అవరోధాలు ఏర్పడినచోటనే ఈ చట్టం ప్రయోగించవచ్చును.

తుళ్ళూరులోఆ పాడు పని చేసిందెవరో?

  తుళ్ళూరు మండలంలో లింగాయపాలెం, పెనుమాక, ఉండవల్లి, మందడం గ్రామాల ప్రజలు రాజధానికి భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నన సంగతి అందరికీ తెలిసిందే. నిన్న రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు ఆ గ్రామాలలో అరటి తోటలను, షెడ్లను, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలకు నిప్పు పెట్టడంతో ఆ గ్రామస్తులలో తీవ్ర ఆందోళనకు గురయ్యారు.   ఈ సంగతి తెలిసిన వెంటనే జిల్లా అర్బన్ యస్పీ రాజేష్ కుమార్ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. వెంటనే దర్యాప్తుకు ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ ఘటనపై చాలా ఆగ్రహం వ్యక్తం చేసారు. తక్షణమే దీనిపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని ఆయన జిల్లా కలెక్టర్ ని ఆదేశించారు. ఇటువంటి ఘటనల వలన ప్రజలలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగే అవకాశం ఉన్నందున బాధ్యులను గుర్తించేందుకు తక్షణమే చర్యలు చెప్పట్టాలని అధికారులను ఆదేశించారు. సీఆర్‌డీఏ అథారిటీ సి.ఈ.ఓ.గా నియమితులయిన శ్రీకాంత్‌ తక్షణమే స్పందిస్తూ పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యి పరిస్థితిని సమీక్షించారు. దీనిపై విచారణ జరిపి ఇందుకు బాధ్యులయిన వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.   రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు ఆ గ్రామాల ప్రజలు నిరాకరిస్తున్నారు కనుక, సహజంగానే అందరూ తెదేపా నేతల హస్తం ఉందని అనుమానించవచ్చును. అయితే అధికారంలో ఉన్న తెదేపా ఇటువంటి పనులకు పాల్పడుతుందని భావించలేము. ఎందుకంటే దానివల్ల అందరూ దానినే అనుమానించే అవకాశం ఉంది. బహుశః ఇదే ఆలోచనతోనే దానిని వ్యతిరేకిస్తున్న వారెవరయినా చేసి ఉండవచ్చు. ఏమయినప్పటికీ పోలీసులు అసలయిన నిందితులను పట్టుకొని కోర్టులో నిలబెడితే తప్ప ఎవరినీ అనుమానించడానికి లేదు.

కాకినాడ నుండి చెన్నైకి బోట్ జర్నీ!

  కేరళ, బెంగాల్, గోవా వంటి కొన్ని రాష్ట్రాలలో నేటికీ ఒక ఊరు నుండి మరొక ఊరికి పడవల ద్వారా ప్రయాణించేందుకు తగిన కాలువలు, మరబోట్లు వాడకంలో ఉన్నాయి. ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలలో కూడా భద్రాచలం వెళ్లేందుకు గోదావరి మీద చాలా లాంచీలు తిరుగుతున్నాయి. అయితే 1980 వరకు కూడా కాకినాడ నుండి చెన్నై వరకు ఉండే కాలువల ద్వారా సరుకు రవాణా చాలా జోరుగా సాగుతుండేది. కానీ ప్రభుత్వాలు కూడా అశ్రద్ధ చూపడంతో అది మూలపడింది. క్రమంగా కొన్ని చోట్ల ఆ కాలువలు భూకబ్జాదారుల చేతిలో పడి చిక్కి ఒకప్పుడు 32మీటర్ల వెడల్పు ఉండే కాలువలు ఇప్పుడు 6 మీటర్లకు కుచించుకుపోయాయి.   అంతర్గత జలరవాణ వ్యవస్థను అభివృద్ధి చేయడం కూడా మోడీ ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటి. కనుక కేంద్రం అంతర్గత జలరవాణ అధికార సంస్థ, రాష్ట్రంలో యానం-కాకినాడ-రాజమండ్రి-ఏలూరు-విజయవాడ-తెనాలి-నెల్లూరు మీదుగా చెన్నైకి ఉన్న 1100 కిమీ పొడవున్న అంతర్గత జలరవాణ వ్యవస్థను మళ్ళీ అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో కొద్ది రోజుల క్రితమే విజయవాడలో కార్యాలయం ఏర్పాటు చేసింది.   బకింగ్ హం కాలువగా ప్రసిద్ధి పొందిన ఈ కాలువను పునరుద్దరించి మళ్ళీ జలరవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఆంధ్రాలో వివిధ వస్తు ఉత్పత్తులను చెన్నైకి అదేవిధంగా చెన్నై నుండి ఆంధ్రాకి అతి తక్కువ ఖర్చుతో రవాణా చేయవచ్చని కేంద్రం భావిస్తోంది. అంతా అనుకొన్నట్లుగా సవ్యంగా సాగితే దీనిని ప్రజా రవాణా వ్యవస్థగా తీర్చి దిద్దే అవకాశం ఉంది. ఇది రెండు రాష్ట్రాలకు ఒక ప్రత్యేక టూరిస్ట్ ఆకర్షణగా నిలిచే అవకాశం కూడా ఉంది. కనుక ఈ ప్రాజెక్టును పునరుద్దరించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా పట్టుదలగా ఉంది. ఈ కాలువను పునరుద్దరించి రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కేంద్రం రూ.2000కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టుపై ఆరు నెలలలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని కేంద్రం స్థానిక అధికారులను ఆదేశించడంతో చీఫ్ ఇంజనీర్ సుభాకర్ దండపత్ నేతృత్వంలో వారు ఈ మధ్యనే సర్వే బకింగ్ హం కాలువను సర్వే చేయడం మొదలుపెట్టారు.   వారి ప్రాధమిక సర్వేలో ఆ కాలువ పలు ప్రాంతాలలో ఆక్రమణలకు లోనయినట్లు గమనించారు. అదేవిధంగా చాలా చోట్ల పూడికతీసి కాలువ లోతును పెంచవలసి ఉంటుందని గుర్తించారు. సాధారణంగా మరపడవలు తిరిగేందుకు కనీసం 32 మీటర్ల వెడల్పు 2.5 మీటర్ల లోతు ఉండాలి. కానీ ఇప్పుడది చాలా చోట్ల కేవలం ఆరు మీటర్ల వెడల్పు, ఒక్క మీటరు లోతు మాత్రమే ఉంది. అదేవిధంగా ఇదివరకు పరిస్థితులలో కాలువలో చిన్న చిన్న పడవలు మాత్రమే తిరిగేవి కనుక కాలువను దాటేందుకు అనేక చోట్ల తక్కువ ఎత్తులో వంతెనలు నిర్మించబడి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆధునిక మర పడవలు, భారీ సరుకు రవాణా చేసే లాంచీలను ఈ కాలువలో నడపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నందున ఆ పాత వంతెనల స్థానంలో మరింత ఎత్తున కొత్త వంతెనలు నిర్మించవలసి ఉంటుంది.   ప్రస్తుతం కాకినాడ కెనాల్-50కిమీ, ఏలూరు కెనాల్-139కిమీ, గుంటూరు జిల్లాలో కొమ్మమూరు కెనాల్-119కిమీ, బకింగ్ హం కెనాల్-316కిమీ, దక్షిణ బకింగ్ హం కెనాల్-116కిమీ మరియు పాండిచేరి కెనాల్-22కిమీ పొడవున్న కాలువలున్నాయి. వాటిలో ఆక్రమణలు తొలగించి, పూడికలు తీసి, వాటిపై అవసరమయిన చోట కొత్తగా వంతెనలు నిర్మించాల్సి ఉంది. కేంద్రమే ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నందున బహుశః రానున్న రెండు మూడేళ్ళలో ఈ పనులన్నీ పూర్తవవచ్చును. ఆంద్ర-తమిళనాడు రాష్ట్రాల మధ్య మళ్ళీ ఈ అంతర్గత జలరవాణ వ్యవస్థ పునరుద్దరించబడినట్లయితే, అది రాష్ట్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాకుండా ఆర్ధికంగా కూడా ఎంతో వెసులుబాటు కల్పించవచ్చును.

దేవినేని - కేశినేని వార్ వెనుక కథేంటి?

  విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని ఈమధ్య ఓ సమావేశంలో విజయవాడలో పోలీసు అధికారుల ఓవర్ యాక్షన్ మీద ఆ మాటా ఈ మాటా మాట్లాడి, పనిలోపనిగా రాష్ట్ర మంత్రి, కృష్ణాజిల్లాలో బలమైన తెలుగుదేశం నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు మీద కామెంట్లు కూడా చేశారు. ‘తెలుగుదేశం పార్టీ దేవినేని ఉమ జాగీరు కాదు’ లాంటి భారీ కామెంట్ కేశినేని నాని నోటి వెంట రావడం తెలుగుదేశం వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేశినేని నానిని పిలిపించి క్లాసు ఇవ్వడం, ఒక్క క్లాసుతోనే తనకు జ్ఞానోదయం కలిగిపోయినట్టుగా పొరపాటైపోయిందని కేశినేని నాని ప్రకటించడం ఒకదాని వెంట మరొకటి చకచకా జరిగిపోయాయి. ఈ వ్యవహారాన్ని చూసిన వారికి ఇదేదో టీకప్పులో తుఫానులా అనిపిస్తుందిగానీ, దీని వెనుక భారీ రాజకీయ చదరంగ ఎత్తుగడ వుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీకి సుప్రీంగా కొనసాగుతున్న దేవినేని ఉమ ప్రాబల్యాన్ని, ప్రాధాన్యాన్ని తగ్గించే ఎత్తుగడలో భాగంగానే ఈ తతంగమంతా జరిగిందని అంటున్నారు.   కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీలో దేవినేని ఉమ సుప్రీం అయ్యారు. ఆయన్ని జిల్లాలో ‘చిన్న చంద్రబాబు’ అని పిలిచే స్థాయికి ఆయన ఎదిగారు. కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీలో ఆయన ఒక మహావృక్షంలా ఎదిగారు. ఆ మహా వృక్షం నీడలో తాము ఎదగలేకపోతున్నామన్న భావన పార్టీలోని ఇతర నాయకులలో వుంది. జిల్లాకి చెందిన ఏ విషయాన్నయినా చంద్రబాబు నాయుడు డైరెక్ట్‌గా దేవినేనితోనే చర్చిస్తూ వుండటం, ప్రతి విషయంలోనూ దేవినేని చురుకుగా అల్లుకునిపోతూ వుండటంతో ఒక్క కేశినేని నాని మాత్రమే కాకుండా అనేకమంది ఇతర నాయకులకు పార్టీలో, ప్రభుత్వంలో తమకు ప్రాధాన్యం లభించడం లేదన్న ఆవేదన పెరిగిపోయింది. అయితే ఈ విషయాన్ని పార్టీ అధినేతకు స్పష్టంగా తెలియజేయాలన్న భావన అందరిలోనూ వుంది. అయితే పిల్లిమెడలో గంట కట్టే ధైర్యం ఇంతకాలం చేయలేకపోయారు. ఇప్పుడిక లాభం లేదని అందరి తరఫున కేశినేని నానిని రంగంలోకి దించారని తెలుస్తోంది. నాని చేసిన ఘాటు కామెంట్లతో కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులలో ఉన్న ఆవేదన బయటపడింది. అది చంద్రబాబు నాయుడి దృష్టికి వెళ్ళింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చంద్రబాబు రంగంలోకి దిగేలా చేసింది. కేశినేనికి క్లాసు తీసుకోవడంతోపాటు కృష్ణాజిల్లాలోని పరిస్థితులను పరిశీలించడానికి సుజనాచౌదరిని నియమించే వరకూ వెళ్ళింది. ఒక దశలో లోకేష్ కూడా రంగంలోకి దిగారు.   ఇప్పటి వరకూ కృష్ణాజిల్లాకు సంబంధించినంత వరకు దేవినేని చెప్పిందే వేదం. అలాంటిది ఇప్పుడు ఆ జిల్లాలో పార్టీ పరిస్థితులను పరిశీలించడానికి మరొకరిని నియమించారంటే అది దేవినేని ప్రాధాన్యతని తగ్గించడంగానే భావించాలని దేవినేనిని వ్యతిరేకిస్తున్న వర్గాలు అంటున్నాయి. ఈ పరిణామాల ద్వారా తాము దేవినేని మీద విజయం సాధించినట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. ఏది ఏమైనా కేశినేని నాని ఉదంతం కృష్ణాజిల్లాలో ఇప్పటి వరకూ నివురుగప్పిన నిప్పులా వున్న విభేదాలను బయటపడేసిందని పరిశీలకులు భావిస్తున్నారు. దేవినేని వ్యతిరేక వర్గంలో వున్న అసంతృప్తిని తగ్గించడంతోపాటు మరోవైపు దేవినేని వర్గం హర్టవ్వకుండా వుండేలా చంద్రబాబు ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం వుందని పరిశీలకులు అంటున్నారు.

సత్య నాదెళ్ళ మనోడే...ఆయనను పూర్తిగా వాడేసుకోక తప్పదు

  దేశాన్ని అన్ని విధాల భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోవడం, దాని స్థానంలో సమర్దుడయిన నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో దేశానికి మళ్ళీ మంచి రోజులు వస్తాయనే ఆశ అందరిలో చిగురించింది. అదే సమయంలో ప్రపంచ ప్రసిద్ద మైక్రోసాఫ్ట్ సంస్థకు భారతీయుడయిన సత్య నాదెళ్ళ సి.ఈ.ఓ.గా నియమితులవడం భారత్ కు మరో శుభ పరిణామంగా చెప్పుకోవచ్చును.   ప్రధాని మోడీ, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మరియు ఐ.టి.శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ లతో నిన్న సమావేశమయిన ఆయన తమ మైక్రోసాఫ్ట్ సంస్థ తరపున దేశంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉందని తెలిపారు. దేశంలో క్రమంగా పెరుగుతున్న పరిశ్రమల, వ్యాపార సంస్థల మరియు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని నిలువచేసేందుకు తమ సంస్థ క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు అందించేందుకు భారీ పెట్టుబడులతో డాటా సెంటర్లు నెలకొల్పేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందని తెలిపారు. మైక్రోసాఫ్ట్ భారతీయ విభాగంలో ప్రధాని మోడీ ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా మరియు డిజిటాల్ ఇండియా పధకాలను కూడా ఒక భాగంగా చేసుకొని తదనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకొంటామని ఆయన తెలిపారు. భారత్ లో వివిధ అవసరాలకు తగిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందజేసేందుకు తమ సంస్థ సిద్దంగా ఉందని ఆయన తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్ ఐటీ రంగంలో ఇప్పటికే మంచి పేరు తెచ్చుకొంది. కానీ ఇంకా ఎలక్ట్రానిక్స్ మరియు హార్డ్ వేర్ ఉత్పత్తి రంగంలో వెనుకబడే ఉంది. ఐ.టి. శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఆ రెండు రంగాలను కూడా అభివృద్ధి చేసేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ భారత్ కు సహాయం చేయాలని కోరారు. భారతీయుడయిన ఆయన తన సంస్థ ద్వారా భారతదేశ అభివృద్ధిలో పాలుపంచుకొనేందుకు ముందుకు రావడం చాలా అభినందనీయం.    భారతీయుడయిన సత్య నాదెళ్ళ మైక్రోసాఫ్ట్ సంస్థకు సి.ఈ.ఓ. కావడం అటు ఆ సంస్థకు ఇటు భారత్ కు రెంటికీ చాలా ప్రయోజనం చేకూర్చబోతోంది. ఆయన వలన భారత్ కు భారీ పెట్టుబడులు, ఆ సంస్థ సేవలు లభ్యమవుతాయి. భారత్ లో మైక్రోసాఫ్ట్ సంస్థ తన కార్యాలయాలను మరిన్నిటిని తెరిచినట్లయితే, దానిని అనుసరించి అనేక చిన్నా పెద్ద సంస్థలు కూడా భారత్ కు తరలిరావడం తధ్యం. మైక్రోసాఫ్ట్ తో సహా ఆ సంస్థలన్నీ భారత్ లో తమ కార్యకలాపాలు మొదలుపెట్టినట్లయితే, దానివలన భారత ఆర్ధిక పరిస్థితి కూడా మరింత మెరుగుపడుతుంది.   సత్య నాదెళ్ళ భారతీయుడయిన కారణంగానే, మైక్రోసాఫ్ట్ సంస్థ 125 కోట్ల మంది జనాభా ఉన్న ప్రపంచంలోకెల్లా అతి పెద్ద మార్కెట్ ద్వారా లబ్ది పొందగలుగుతుంది. భారతీయుల అవసరాల గురించి, వారి ఆలోచనా విధానం గురించి, వారి జీవన శైలి గురించి భారతీయుడయిన సత్య నాదెళ్ళకు తెలిసినంతగా మరే సంస్థకి తెలియక పోవచ్చును. అది ఆ సంస్థకు ఒక పెద్ద వరంగా మారబోతోంది. భారతీయ అవసరాలకు అనుగుణంగా తన సంస్థ సేవలను, టెక్నాలజీని అందించగలిగితే, మైక్రోసాఫ్ట్ సంస్థ ఊహించనంతగా భారత్ నుండి లాభాలు ఆర్జించగలదు. దేశంలో నానాటికి పెరుగుతున్న కంప్యూటర్స్, ల్యాప్ టాప్స్, టాబ్లెట్ పీసీలు, మొబైల్ ఫోన్స్, మొబైల్ అప్లికేషన్స్, ఇంటర్ నెట్, వైఫీ వినియోగం ద్వారా ఆ సంస్థ ఊహించనంత లాభాలు పొందే అవకాశం ఉంది.   అందువలన భారత ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ సంస్థ రెండూ కూడా ఈ సువర్ణావకాశాన్ని ఓడిసిపట్టుకొనే ప్రయత్నాలు గట్టిగా చేయాలి. సత్య నాదెళ్ళ తెలుగువాడయ్యి ఉండటం ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలకు మరింత కలిసివచ్చే అంశమని చెప్పవచ్చును. అందువలన దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పెద్దల మాటను గుర్తుంచుకొని ఆయన ఆ పదవిలో ఉండగానే ఆయన ద్వారా రెండు రాష్ట్రాలలో భారీ పెట్టుబడులు, ఆ సంస్థ శాఖల ఏర్పాటుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా ప్రయత్నించడం చాలా అవసరం. ఇటువంటి సువర్ణావకాశం మళ్ళీ వస్తుందని ఆశించలేము.

జమ్మూ కాశ్మీరులో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకి మార్గం సుగమం?

  జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రంలో మూడు ప్రధాన రాజకీయ పార్టీలు-బీజేపీ, పీపుల్స్ డెమోక్రిటిక్ పార్టీ మరియు నేషనల్ కాన్ఫరెన్స్ ల మధ్య జరుగుతున్న చర్చలు కీలక దశకు చేరుకొన్నాయి. ఎన్నికలలో ఓడిపోయిన అధికార నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు మరియు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తాము ప్రతిపక్షంలో కూర్చొంటామని మొదట అన్నప్పటికీ, తమ పార్టీకి ఉపముఖ్యమంత్రి పదవి, ఒక కేంద్ర మంత్రి పదవి, రాజ్యసభలో ఒక సీటు ఇచ్చేమాటయితే బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. నిన్న లండన్ వెళ్ళవలసిన ఆయన ఇందుకోసం తన పర్యటనను రద్దు చేసుకొని కాశ్మీర్ లో మకాం వేసిన కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీతో నిన్న సమావేశమయినట్లు వార్తలు వచ్చేయి. కానీ బీజేపీ ఆ వార్తలను ఖండించింది. అయితే తమకంటే బలమయిన పీపుల్స్ డెమోక్రిటిక్ పార్టీకి మద్దతు ఇచ్చి దానికి అధికారం కట్టబెట్టడం కంటే, తమకంటే బలహీనంగా ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ మద్దతు తీసుకొని తామే అధికారం చెప్పట్టడం మంచిదనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. అందువలన నేషనల్ కాన్ఫరెన్స్ మద్దతు తీసుకొని బీజేపీ జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. అయినప్పటికీ బీజేపీ నేతలు ఒకవైపు ఒమర్ అబ్దుల్లాతో చర్చలు జరుపుతూనే మరోవైపు పీపుల్స్ డెమోక్రిటిక్ పార్టీతో కూడా చర్చలు జరుపుతుండటం చాలా ఆసక్తికరంగా ఉంది. ఈరోజు సాయంత్రం లేదా రేపటిలోగా అక్కడ ఏ పార్టీ దేనితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందో తేలిపోవచ్చును.

త్వరలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు

  గత అనేక దశాబ్దాలుగా ఎక్కడవేసిన గొంగళి అక్కడేనన్నట్లుగాపడున్న పోలవరం ప్రాజెక్టుని వచ్చే నాలుగేళ్లలో పూర్తిచేయాలని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారు. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు మరియు ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో నిన్న హైదరాబాద్ లో సమావేశమయిన ఆయన త్వరలోనే కేంద్రం నుండి పోలవరం ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ అనుమతులు రాబోతున్నాయని తెలిపారు. కనుక ఈలోగానే ప్రాజెక్టుకు అవసరమయిన భూసేకరణ, పునరావాస కార్యక్రమాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుతో సహా ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలలో మరియు రాయలసీమలో నాలుగు జిల్లాలలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల పనులన్నిటినీ కంప్యూటరించాలని కోరారు. ఈ ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించేందుకు రాష్ట్ర ఆర్ధిక, భారీ నీటి పారుదల మరియు విద్యుత్ శాఖల ముఖ్య కార్యదర్శులతో కూడిన ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని సూచించారు. ఆ కమిటీ ప్రతీ పదిహేను రోజులకీ ఒకసారి సమావేశమవుతూ ప్రాజెక్టు పనులపై పురోగతిని సమీక్షించాలని ఆయన ఆదేశించారు. తను కూడా స్వయంగా ప్రాజెక్టు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటానని ఆయన తెలిపారు.   రాష్ట్ర విభజన సందర్భంగా పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కేంద్రప్రభుత్వమే దాని పూర్తి బాధ్యత తీసుకొంటుందని విభజన బిల్లులో స్పష్టంగా హామీ ఇవ్వబడింది. అందుకే మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన వెంటనే ఖమ్మం జిల్లాలో పోలవరం ప్రాజెక్టు క్రింద ముంపుకు గురయ్యే ఏడు మండలాలను ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేసారు. ఈ ప్రాజెక్టు గురించి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఏమీ మాట్లాడకపోయినప్పటికీ, దానికి అవసరమయిన అటవీ, పర్యావరణ అనుమతులు మంజూరు చేసేందుకు కసరత్తు పూర్తి చేస్తోంది. ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేయడం అంటే ప్రాజెక్టు కోసం నిధుల విడుదలకు ఆర్ధిక శాఖ నుండి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతునట్లేనని చెప్పవచ్చును. బహుశః అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు తొందరపడుతున్నారు. ఈసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ప్రాజెక్టు పూర్తి చేయాలని ద్రుడసంకల్పంతో ఉన్నందున, మధ్యలో ఎటువంటి ఆటంకాలు కలుగకపోతే బహుశః 2018నాటికి పోలవరం పూర్తయి, రాష్ట్రంలో మరింత భూమి సాగులోకి రావచ్చును.

జమ్మూ, కాశ్మీర్ లో బీజేపీ-పి.డి.పి. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం?

  జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడం, బీజేపీ-25 సీట్లు, పీపుల్స్ డెమోక్రేటిక్ పార్టీ (పి.డి.పి.)కి-28 సీట్లు, ఇంతవరకు అధికారంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి- 17 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి-12, ఇతరులకి-7 సీట్లు రావడంతో అక్కడ ఇప్పుడు ఏ పార్టీ దేనితో జత కడుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. మొత్తం 87 సీట్లు గల జమ్మూ, కాశ్మీర్ అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీ లేదా కూటమికయినా కనీసం 44 సీట్లు అవసరం.   28 సీట్లు సాధించిన పి.డి.పి.కి కాంగ్రెస్ (12) మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉందని ఆ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ ప్రకటించారు. కానీ కేవలం కాంగ్రెస్ మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యపడదు కనుక మరో నలుగురు స్వతంత్ర అభ్యర్ధుల మద్దతు కూడా అవసరం ఉంటుంది. కానీ వారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కనుక బీజేపీ లేదా తన రాజకీయ ప్రత్యర్ధి నేషనల్ కాన్ఫరెన్స్ మద్దతు ఇస్తే తప్ప పి.డి.పి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితిలో లేదు.   భవిష్యత్ అంధకారంగా మారిన కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకోవడం కంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో సుస్థిరమయిన పాలన అందించవచ్చని, అప్పుడు రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కూడా బాగా సహాయపడుతుందని పి.డి.పి. భావిస్తోంది.   అయితే మతతత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీతో చేతులు కలిపినట్లయితే మిగిలిన అన్ని పార్టీల నుండి తీవ్ర విమర్శలు మూటగట్టుకోవలసి ఉంటుందనే భయం కూడా పి.డి.పి.ని వెనక్కు లాగుతోంది. ఒకవేళ బీజేపీ మద్దతు తీసుకొంటే ఉప ముఖ్యమంత్రి పదవి, మరి కొన్ని కీలక పదవులు జమ్మూ ప్రాంతం నుండి ఎంపికయిన బీజేపీ సభ్యులకే ఇవ్వవలసి ఉంటుందనే భయం కూడా ఉంది. కానీ దానికి అంతకంటే గత్యంతరం కూడా లేదు.   ఇక బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా “బీజేపీ ద్వారములు అన్ని పార్టీలకు తెరిచియే ఉన్నవి” అని ప్రకటించారు. అంటే ఏ పార్టీకయినా మద్దతు ఇచ్చేందుకు లేదా మద్దతు తీసుకొని ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు బీజేపీ సిద్దమని ఆయన చెప్పినట్లే భావించవచ్చును. ఇప్పటికే ఏడుగురు స్వతంత్ర అభ్యర్దులను పార్టీ వైపుకు తిప్పుకొన్నట్లు వార్తలు వస్తున్నాయి.   ఇంతవరకు ప్రతిపక్షంలో కూర్చొనేందుకు సిద్దమంటూ చెపుతూ వచ్చిన మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఇప్పుడు ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకొని తనే ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆయన పి.డి.పి.కి లేదా పి.డి.పి. ఆయనకు మద్దతు ఇచ్చే అవకాశం లేదు. కనుక ఆయన బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్దమని పరోక్షంగా ప్రకటించినట్లే భావించవచ్చును. ఆ రెండు పార్టీలు చేతులు కలిపినట్లయితే మొత్తం 42 మంది అవుతారు. స్వతంత్ర సభ్యులు ఏడుగురు కూడా బీజేపీకే మొగ్గు చూపడం నిజమనుకొంటే అప్పుడు బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చును. కానీ ఎన్నికల సమయంలో ఒమర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన బీజేపీ ఇప్పుడు మళ్ళీ అతనితోనే జత కడితే విమర్శలు ఎదుర్కోక తప్పదు.   ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ, పి.డి.పి.లు కలిసి (రొటేషన్ పద్దతిలో మంత్రి పదవులు పంచుకొనే షరతు మీద) సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి.

మంత్రి పదవులు లేవు ఓన్లీ కిరీటాలే...అడ్జస్ట్ అయిపోండి

  ప్రజాసేవ అంటే మాటలా? చెప్పిన ప్రతీ మాటకి చప్పట్లు ముందు వెనుకా కొట్టేందుకు ఓ నలబై మంది అనుచరులు ఉండాలి...వారందరినీ మేపడానికి ఆర్ధిక స్తోమత ఉండాలి....అది సమకూర్చుకొనేందుకు ఏదో ఒక పదవి ఉండాలి...పదవి ఉంటే ముందు వెనుక ఏకే 47తుపాకులు పట్టుకొని తిరిగే సెక్యూరిటీ ఉండాలి... అన్నీ ఉండి ఎర్రబుగ్గ కార్లు లేకపోతే చాలా నామోషీగా ఉంటుంది...గనుక అదీ తప్పదు. అలాగని దొరికిన ఆ ఒక్క ఎర్రబుగ్గ కారేసుకొని జనాల్లోకి రయ్యని వెళిపోతే ఎవరు పట్టించుకోరు సరికదా ఉన్న పరువు కూడా పోయే ప్రమాదం ఉంటుంది..కనుక మళ్ళీ దానికి ముందూ వెనుకా ఓ పాతిక కార్లు, పోలీసు ఎస్కార్టులు తప్పనిసరి. అప్పుడే ప్రజాసేవ చేయడానికి వీలు పడుతుంది. కానీ ఈ కష్టం ఏమీ తెలియని అజ్ఞానులయిన జనాలు “ఓస్.. ప్రజాసేవే కదా...”అని తేలికగా తీసిపడేస్తుంటారు.   ఇక విషయంలోకి వస్తే మొన్నీ మధ్యన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన మంత్రి వర్గం విస్తరించినప్పుడు చాలా మందికి లోపల కుర్చీలు దొరకకపోవడంతో ప్రజాసేవ చేయలేకపోతున్నందుకు తెగ ఇదయిపోయారు. వాళ్ళు అదేపనిగా ఇదయిపోయి చివరికి వాళ్ళ ఉసురు తగిలితే అది తన ప్రభుత్వానికి మంచిది కాదనుకొన్నారో ఏమో గానీ కేసీఆర్ గారు “మీకు కుర్చీలు ఇవ్వలేకపోయినందుకు సారీ! కానీ మీకందరికీ కిరీటాలు (అంటే క్యాబినెట్ ర్యాంక్ హోదా అన్నమాట) ఇస్తాను పెట్టుకొని తిరగండి” అని చెప్పి ఓమూడు డజన్ల మంది తెరాస నేతలందరికీ తలకొక కిరీటం పంచి పెట్టేసారు.   “ఆ కిరీటం ధరించిన వారికి ఎవరికయినా సరే మంత్రిగారికి ఉండే అన్ని సౌకర్యాలు కల్పించవలెను” అని రూల్స్ వ్రాసుకొన్నాము గనుక అందరికీ నీలిబుగ్గ కార్లు దానితో బాటే మిగిలిన హంగులన్నీ అమరి పోయాయి. ఇప్పుడు వారందరూ ఆ కార్లేసుకొని నగరంలో రయ్యి రయ్యిమంటూ గిరగిరా తిరిగేస్తుంటే, “మాకూ రోడ్ల మీదకు వచ్చేందుకు కొంచెం సమయం కేటాయిస్తే బాగుంటుంది కదా” అని జనాలు గొణుకొంటున్నారుట.   నిజానికి ఎప్పుడో 1989లో మోటార్ వాహానాల చట్టంలో 314 రూల్స్ ప్రకారం కేవలం ముఖ్యమంత్రి, అందరు మంత్రులు, రాష్ట్ర ప్లానింగ్ కమీషన్ చైర్మన్, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, శాసనమండలి చైర్మన్, డిప్యుటీ చైర్మన్ లకు మాత్రమే ఈ నీలి బుగ్గలుండాలి అని వ్రాసుకొన్నాము. కానీ క్యాబినెట్ హోదా ఉన్నవాళ్ళకి నీలి బుగ్గలు ఉండకూడదని ఎక్కడా వ్రాసిలేదు. అది పట్టించుకోకుండా గిట్టని వాళ్ళు దీనినీ తప్పు పట్టడం చాలా అన్యాయం.   ప్రస్తుతం కొత్తగా నీలిబుగ్గల వారు ఎవరెవరు అంటే: చీఫ్ విప్: కొప్పుల ఈశ్వర్, విప్: గంపా గోవర్ధన్, నల్ల ఓదెలు మరియు జి.సునీత, యస్. నిరంజన్ రెడ్డి: తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ కమీషన్; గంటా చక్రపాణి: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్; శాసనసభ్యులు:వి.శ్రీనివాస్ గౌడ్, జలగం వెంకట్రావు, దాశ్యం విని భాస్కర్, కోవ లక్ష్మి, పార్లమెంటరీ కార్యదర్శులుగా కొత్తగా నియమితులయిన మరో నలుగురు సభ్యులు పాతవారితో వెరసి మొత్తం ఓ యాబై మంది వరకు ఉంటారు.   ఇంతమంది కలిసి ప్రజాసేవ చేస్తున్నా ఇంకా ప్రజలు అపార్ధం చేసుకొంటే ఏమి బాగుంటుంది? వీలయితే చంద్రబాబునాయుడి గారి చెవిలో కూడా ఈ ఐడియా వేస్తే ఆయన కూడా అది వర్కవుట్ అవుతుందేమో చూసుకొంటారు కదా?

రాజధాని అభివృద్ధి మండలి-ఏడు చేపల కధ

  ఇంతవరకు విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ప్రాంతాలే కాక చుట్టుపక్కల గల గన్నవరం, మైలవరం, నందిగామ తదితర ప్రాంతాలు ఇంకా చుట్టుపక్కల అనేక గ్రామాలు అన్నీ కూడా వి.జి.టి.యం.పరిధిలోనే ఉండేవి. ఆ ప్రాంతాలలో ఎక్కడ ఇళ్ళు, అపార్టుమెంటులు కట్టుకోవాలన్నా, లే అవుట్లు వేయాలన్నా ఇంతవరకు వి.జి.టి.యం. బోర్డే అన్ని అనుమతులు మంజూరు చేస్తూ ఉండేది. దాదాపు 7,060 చ.కిమీ పరిధిలో కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఉన్న ఆ ప్రాంతాలలో జరిగే రియల్ ఎస్టేట్ వ్యవహారాలన్నీ వి.జి.టి.యం. కనుసన్నలలోనే జరిగేవి.   ఇప్పుడు దాని స్థానంలో రాజధాని అభివృద్ధి మండలి రావడంతో ఇప్పుడు ఆ బాధ్యతలు, హక్కులు, అధికారాలు అన్నీదానికే దఖలు పడ్డాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ఇల్లలకగానే పండగ కాదన్నట్లు రాజధాని అభివృద్ధి మండలి బిల్లును శాసనసభ ఆమోదించినంత మాత్రాన్న సమస్యలన్నీ మటుమాయం అయిపోలేదు. పైగా ఇప్పుడు కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి.   గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలలో నెలకి రూ.100కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు జరుగుతుంటాయి. వాటిలో భాగంగా నెలకి కనీసం 10, 000 ఇళ్లు డజన్ల కొద్దీ కొత్త లే అవుట్లు వెలుస్తుంటాయి. కానీ ఇప్పుడు అవన్నీ ఒక్కసారిగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇంతవరకు ఈ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్న వి.జి.టి.యం.ను రద్దయిపోయింది. కానీ దాని స్థానంలోకి వచ్చిన రాజధాని అభివృద్ధి మండలి ఇప్పుడప్పుడే పని మొదలుపెట్టే పరిస్థితిలో లేదు.   ఎందుకంటే మాస్టర్ ప్లాన్ తయారవలేదు. రాజధాని నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిని అనుకొని ఉన్న ప్రాంతాలు అన్నీ కూడా తదనుగుణంగానే అభివృద్ధి చెందాలని అనుకొంటున్నారు. కనుక రాజధాని, దాని పరిసర ప్రాంతాలలో అడ్డ దిడ్డంగా నిర్మాణాలు జరగకూడదనే ఆలోచనతో ఆ ప్రాంతలన్నిటినీ కూడా రాజధాని అభివృద్ధి మండలి పరిధిలోకి తీసుకు వచ్చేరు. ఆ ప్రాంతాలన్నీ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఒక క్రమ పద్దతిలో అభివృద్ధి చెందితే మున్ముందు సమస్యలు రాకుండా ఉంటాయని ఆయన ఉద్దేశ్యం. రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సిద్దం అయితే తప్ప, దాని పరిధిలో ఉన్న ప్రాంతాలలో ఎక్కడా కూడా కొత్తగా ఎటువంటి కట్టడాలకు అనుమతులు మంజూరు చేయడానికి వీలు లేదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చివరికి ఎవరయినా తమ ఇంటికి మార్పులు చేర్పులు చేసుకొనేందుకు కూడా అనుమతి లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.   అయితే సింగపూరు సంస్థ వాళ్ళు మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇవ్వడానికి మరో ఆరు నెలలు పడుతుందని స్వయంగా మంత్రులే చెపుతున్నారు. మాస్టర్ ప్లాన్ తయారు చేయాలంటే ముందుగా భూసేకరణ తంతు ఒకటి పూర్తి కావలసి ఉంది. కానీ రాయపూడి గ్రామా రైతులు అప్పుడే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లేందుకు డిల్లీలో లాయర్ల చుట్టూ తిరుగుతున్నారు. పెనుమాక గ్రామ రైతులు ‘ల్యాండ్ పూలింగుకి ఒప్పుకోము’ అంటూ బోర్డులు పెట్టారంటూ వార్తలు వచ్చేయి.   రైతులు భూములు ఇస్తే సింగపూరోళ్ళు వచ్చి డ్రాయింగులు గీసి ఇస్తారు. వాళ్ళు డ్రాయింగులు ఇస్తే రాజధాని అభివృద్ధి మండలి తన పని మొదలుపెడుతుంది. అది పని మొదలెడితే గానీ ఇంటి మీద పెంకు వేసుకోవడానికి కూడా వీలుపడదు. ఇదంతా చూస్తుంటే ఏదో ఏడూ చేపల కధలా తయారయింది చివరికి. ఈ భూముల సేకరణ ఎప్పుడు జరిగేనో...ఆ సింగపూరోళ్ళు డ్రాయింగులు గీసెదెప్పుడో...రాజధాని అభివృద్ధి మండలి పని మొదలు పెట్టేదెప్పుడో...తము ఇళ్లు కట్టుకొనేదెప్పుడో...అంటూ అందరూ భారంగా నిటుర్పులు విడుస్తున్నారు.   ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు మధ్యతరగతి వాళ్ళు లక్షల్లో నష్టపోతుంటే బిల్డర్లు కొట్లలో నష్ట పోతున్నారు. మధ్యతరగతి జనాలు బ్యాంకుల నుండి వడ్డీలకి అప్పులు తెచ్చుకొని బిల్డర్ల చేతిలో డబ్బు పోస్తే, ఎలాగూ రాజధాని వచ్చేస్తోంది గనుక బిల్డర్లు కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మరీ ఎడాపెడా భూములు కొనేసి చకచకా ఇళ్లు, అపార్ట్ మెంటులు లేపేసి నాలుగు రాళ్ళూ పోగేసుకొందామని ఆశపడ్డారు. ఇప్పుడు వారందరూ లబోదిబోమని మొత్తుకొంటున్నారు. కనుక ఇప్పటికయినా ప్రభుత్వం మేల్కొని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే బాగుంటుందేమో?

చంద్రబాబుకు ఈ చెత్త అవసరమా?

తెలుగుదేశం పార్టీలోకి చెత్త వచ్చి చేరుతోంది. అవును... నిజంగానే చెత్త. ఎందుకూ పనికిరాని చెత్త వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతోంది. ఈ చెత్తవల్ల తెలుగుదేశం పార్టీ కలుషితమైపోవడం తప్ప ప్రయోజనం ఏమీ వుండదు. అయినప్పటికీ, చంద్రబాబుకు ఈ విషయం స్పష్టంగా తెలిసినప్పటికీ చెత్తని పార్టీలో చేరనిస్తున్నారు. ఇతర పార్టీలతో అవసరాలు తీరిపోయి, అవకాశాలు లేకుండా వున్న ‘స్క్రాప్’ అదను చూసుకుని తెలుగుదేశం పార్టీలో కలసిపోవడానికి సిద్ధంగా వుంది. కొంత చెత్త ఇప్పటికే కలసిపోయింది. ఈ పరిణామం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి తెలిసీ జరగడమే పార్టీ శ్రేణులకు ఆవేదన కలిస్తోంది. ఈ చెత్తంతా తెలుగుదేశం పార్టీకి అవసరమా అని వారందరూ ఆవేదన చెందేలా చేస్తోంది. తెలుగుదేశం పార్టీ పదేళ్ళు అధికారానికి దూరంగా వుంది. ఈ పదేళ్ళ కాలంలో అధికారమే పరమావధిగా భావించిన అనేక మంది స్వార్థపరులైన నాయకులు తెలుగుదేశం పార్టీని విడిచి పోయారు. కష్టకాలంలో అండగా నిలవకుండా దూరమైపోవడమే కాదు... ఇతర పార్టీల్లో చేరి తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని అనరాని మాటలు అన్నారు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైపు ఆశగా చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ బొడ్డుకోసి పేరు పెట్టిన గోదావరి జిల్లాకి చెందిన ఓ నాయకుడు తెలుగుదేశం పార్టీలో ఎన్నో హోదాలు అనుభవించారు. పార్టీ అధికారంలో లేకపోవడంతో జంప్ జిలానీలా మారిన ఆయన ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని తిట్టని తిట్టు లేదు. ఇప్పుడు మళ్ళీ నానా తంటాలు పడి, ఎన్నెన్నో రికమండేషన్లు చేయించుకుని తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ మూల నుంచి ఆ మూల వరకు కాంగ్రెస్, వైసీపీలకు చెందిన ఎంతోమంది నాయకులు తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి తహతహలాడుతున్నారు. వీళ్ళంతా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎంతో నష్టం చేసినవాళ్ళే. అలాంటి ‘చెత్త’ ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశంలోకి మళ్ళుతూ వుండటం ఇంతకాలం పార్టీని భుజాలమీద మోసిన నాయకులు, కార్యకర్తలకు ఆవేదన కలిగిస్తోంది. చెరువులో నీరు వస్తే చేరే కప్పల్లాగా తెలుగుదేశం పార్టీ వైపు వస్తున్న వారిని చంద్రబాబు నాయుడు ఆదరించడం మంచిది కాదన్న అభిప్రాయం పార్టీ కార్యకర్తల్లో  వ్యక్తమవుతోంది. వీరంతా పార్టీకి గతంలో ద్రోహం చేసిన వారు, భవిష్యత్తులో నష్టం చేసేవారే తప్ప ఉపయోగపడేవారు కాదన్న ఆవేదనను కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వచ్చేవారిలో కొంతమంది ఉత్తములు, పార్టీకి ఉపయోగపడేవారూ లేరని కాదు.. అయితే ఎందుకూ పనికిరాని వాళ్ళే ఎక్కువగా వుండటం గమనార్హం. అందువల్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గతంలో పార్టీకి ద్రోహం చేసిన వారిని, అవినీతిపరులను, వివాదాస్పదమైన వ్యక్తులను పార్టీలోకి తీసుకోకపోవడం మంచిదన్న అభిప్రాయాన్ని కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. తమ విజ్ఞప్తిని మన్నించి పార్టీని ద్రోహుల నుంచి కాపాడాలని కోరుతున్నారు.

బీజేపీలో బొత్స చేరిక ఖాయమా?

  మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బీజేపీలో చేరబోతున్నట్లు మళ్ళీ వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనను పక్కను పెట్టి రఘువీరా రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టినప్పటి నుండి ఆయన పార్టీకి దూరంగా మసులుతున్నారు. అప్పటి నుండే ఆయన బీజేపీలో చేరుతారని వార్తలు వస్తున్నప్పటికీ ఇంతవరకు ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. కానీ ఈ మధ్యనే బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు ఆయనతో విజయనగరంలో సమావేశమయిన తరువాత ఆయన పార్టీలోకి చేరేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని మీడియాకు చెప్పినట్లు వార్తలు వచ్చేయి.   రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల సబ్-కమిటీ గత ప్రభుత్వాల హయంలో జరిగిన అక్రమ మైనింగ్ లైసెన్సులను, భూకేటాయింపులను, ఇసుక త్రవ్వకాలు, ఎర్ర చందనం స్మగిలింగ్, లిక్కర్ సిండికేట్, రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంస్థలలో జరిగిన అవినీతి అక్రమాలను త్రవ్వి తీసేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేస్తోంది. బొత్స సత్యనారాయణను కూడా విడిచిపెట్టేది లేదని సబ్ కమిటీలో మంత్రులు చాలా స్పష్టంగానే చెపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన ఈ కేసుల నుండి బయటపడాలంటే బీజేపీలో చేరడమే ఏకైక ఉపాయంగా కనబడుతోంది. పైగా రాష్ట్రంలో, దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అంధకారంగా కనబడుతున్నప్పుడు, ఆయనని పక్కన పెట్టిన పార్టీని పట్టుకొని వ్రేలాడటం వలన లాభం కంటే నష్టమే ఎక్కువ. కనుక బీజేపీ అనుమతిస్తే ఆయన ఆ పార్టీలో చేరే అవకాశాలున్నాయి.   అయితే తనపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కేసుల పెట్టకుండా నిలువరించాలనే షరతుతోనే ఆయన బీజేపీలో చేరినట్లయితే అప్పుడు ఆ బీజేపీ అధిష్టానం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసినా లేకపోతే ఆయన బీజేపీలో చేరిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై కేసులు పెట్టినా అది తెదేపా-బీజేపీల స్నేహానికి గండి కొట్టవచ్చును. ఆయనను తీవ్రంగా వ్యతిరేకించే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా బీజేపీలో చేరాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఒకవేళ బొత్సను పార్టీలో చేర్చుకొన్నట్లయితే అప్పుడు ఆయన బీజేపీలో చేరేందుకు ఇష్టపడకపోవచ్చును.   బొత్స సత్యనారాయణను పార్టీలో చేర్చుకొంటే కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించవచ్చనే భ్రమ కూడా మంచిది కాదు. ఎందుకంటే రాష్ట్ర విభజన సమయంలో ఆయన ప్రవర్తించిన తీరును చూసి కాపు సామాజిక వర్గం కూడా ఆయనకు దూరంగా జరిగింది. అందుకే సాధారణ ఎన్నికలలో ఆయన కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరూ కూడా గెలవలేకపోయారు. ఒకవేళ ఆయనను బీజేపీలో చేర్చుకొంటే ఎన్నికల ప్రచార సభలలో ఆయనను తీవ్రంగా విమర్శించిన పవన్ కళ్యాణ్ (ఆయన సామాజిక వర్గానికే చెందిన) కూడా బీజేపీకి దూరం అవవచ్చును.   ఎప్పటికయినా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కలలుగన్న బొత్స సత్యనారాయణ, రాష్ట్ర విభజన వ్యవహారంలో పార్టీ అధిష్టానాన్ని తప్పు ద్రోవ పట్టించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు ఆ మధ్య మీడియాలో వార్తలు వచ్చేయి. కనుక ఇప్పుడు కూడా ఆయన అటువంటి ప్రయత్నాలే చేసినట్లయితే కేంద్రం సహాయం అందక రాష్ట్రాభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. కనుక ఒకవేళ బీజేపీ ఆయనను పార్టీలో చేర్చుకోదలిస్తే ముందుగా ఈ పర్యవసనాలన్నిటినీ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవలసి ఉంటుంది.