మళ్ళీ స్వయంకృషి?

  తెలుగువారు అందరూ కూడా ఒకనాటి అందాల అద్బుత నటి విజ‌య‌శాంతిని తమ మనిషే అనుకొన్నారు. మెగాస్టార్ చిరంజీవిని కూడా అందరూ అలాగే భావించి ఆదరించారు. కానీ వారిరువురూ రాజకీయాలలో చేరిన తరువాత విజయశాంతి తెలంగాణాకి, చిరంజీవి ఆంధ్రాకి మాత్రమే చెందినవారిగా మారిపోయారు. పోనీ రాజకీయాలలో వారు ఏమయినా రాణించారా అంటే అదీ లేదు.   రెండు మూడు పార్టీలు మారినా విజయశాంతి తలరాత మాత్రం మారలేదు. ఆమె పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుండిపోతే ఆమెకు రాఖీలు కట్టిన అన్నయ్య కేసీఆర్ మాత్రం ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇప్పుడు ఆమె ఏ పార్టీలో ఉందో, ఏమి చేస్తున్నారో కూడా జనాలకి తెలియదు. అందుకే రాములమ్మ మళ్ళీ తన కర్తవ్యం గుర్తు చేసుకొంటూ సినిమాల్లోకి వచ్చేస్తోంది. కాకపోతే ఇంతకాలం తను వ్యతిరేకించిన  ఆంద్రోళ్ళ సినిమాలలోనే మనసు చంపుకొని నటించక తప్పడం లేదు ఆమెకు.   ఇక పులిని చూసి నక్క వాతలు పెట్టుకొన్నట్లుగా స్వర్గీయ యన్టీఆర్ తెదేపా పెట్టిన 9నెలలోనే ముఖ్యమంత్రి అయిపోయి రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పగాలేనిదీ, ఆంద్ర, తెలంగాణా ప్రాంతాలలో లక్షలాది అభిమానులున్న తను ప్రజారాజ్యం స్థాపిస్తే మూడు నెలలోనే ముఖ్యమంత్రి కాలేనా? అనే గొప్ప నమ్మకంతో రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చేరు చిరంజీవి. ఆయన నటించిన సినిమాలలో చాలా వరకు సూపర్ హిట్ట్ అయినప్పటికీ, ఆయన ప్రజారాజ్యం మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిపోవడంతో కంగుతిన్న చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ మహాసముద్రంలో కలిపేసి కేంద్ర మంత్రి సంపాదించుకొని ‘సామాజిక న్యాయం’ కాపాడుకొన్నారు.   కానీ మళ్ళీ రాష్ట్ర విభజనతో అది కూడా మూన్నాళ్ళ ముచ్చటే అయింది. కనీసం అప్పుడయినా సరిగ్గా స్టెప్పులు వేయలేక తడబడటంతో ముప్పై ఏళ్ళు కష్టపడి సంపాదించుకొన్న కీర్తి ప్రతిష్టలు మూడు నెలలో పోగొట్టుకొన్నారు. ముల్లు వచ్చి అరిటాకు మీదపడినా అరిటాకు వచ్చి ముల్లు మీద పడినా చిరిగేది అరిటాకే అన్నట్లు కాంగ్రెస్ చేసిన పాపానికి పాపం ఆ జీవి బలయిపోయాడు అన్యాయంగా.   అందుకు పరిహారంగా రాజ్యసభలో ఓ కుర్చీ ఖాళీ అయితే అందులో ఆయనను కూర్చోబెట్టింది కాంగ్రెస్ పార్టీ. కానీ హై కమాండ్ వ్రాసిచ్చిన స్క్రిప్ట్ లో డైలాగులు ఆయన ఎంత గొప్పగా చదివినా అందరూ వెక్కిరించే వారే కానీ చప్పట్లు కొట్టేవారు కనబడలేదు. క చేసేదేమీ లేక పడిపోయిన చోటనే ఉంగరం వెతుకొనే ప్రయత్నంలో ఆయన కూడా మళ్ళీ సినీపరిశ్రమకు వచ్చేసి జనాల కోరిక మేరకు తన 150 సినిమా కోసం మొహానికి రంగులు పులుముకొని మళ్ళీ జనాల ముందుకు వచ్చేస్తున్నారు.   ఆయనకి మరో ముప్పై ఏళ్ల తరువాత కూడా హీరో వేషాలు వేసే అవకాశాలు ఉండవచ్చునేమో కానీ ఇన్నేళ్ళ తరువాత వస్తున్న రాములమ్మకి మాత్రం అటువంటి అవకాశం ఉండబోదు కనుక గోపీచంద్-నయనతార జంటగా నటిస్తున్న ఒక సినిమాలో ఆమె తల్లి వేషానికో దేనికో సెటిల్ అయిపోక తప్పలేదుట. కానీ అది కూడా ఆ సినిమాలో చాలా ముఖ్యమయిన పాత్రే అని సరిపెట్టుకోక తప్పడంలేదు. ప్రస్తుతం ఏదో ఒక పాత్ర చేస్తున్నా ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి హిట్ ఇవ్వగలిగితే ఆనక ఎప్పుడయినా అవకాశం వస్తే చిరంజీవితో కూడా మళ్ళీ స్టెప్పులు వేసే అవకాశం వచ్చినా ఆశ్చర్యం లేదు.

కేంద్రాన్ని రాష్ట్రాలు యాచించాల్సిందేనా?

  రాష్ట్ర విభజన జరిగి, రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పడి 8 నెలలు గడిచిపోయాయి. తెలంగాణా రాష్ట్రానికి మిగులు బడ్జెట్ దక్కింది. కానీ ఆంద్రకుమాత్రం ఉన్న కష్టాలు సరిపోవన్నట్లుగా ఏకంగా రూ.16,000కోట్ల లోటు బడ్జెట్టు దక్కింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ 8నెలలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో దేనికీ కోతలు పెట్టకుండా ఉన్నంతలో తగినన్ని నిధులు మంజూరు చేస్తూ చాలా పొదుపుగా నెట్టుకొస్తోంది.   కానీ రాష్ట్రం ఆర్ధికంగా నిలద్రొక్కుకోవాలంటే ముందుగా రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు రావలసి ఉంటుంది. అందుకు అనేక సంస్థలు సిద్దంగా ఉన్నప్పటికీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు ఆగుదామనే ఉద్దేశ్యంతో కొన్ని సంస్థలు వేచి చూస్తున్నాయి. ఈ అవరోధం తొలగితేకానీ రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతం కాదు. రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు వస్తే గానీ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగుపడదు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తను అధికారంలోకి రాక ముందు నుండి కూడా ప్రధాని మోడీ, ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూనే ఉన్నారు. మొన్న కూడా మళ్ళీ అదే పని మీద ఆయన డిల్లీ వెళ్లి వచ్చేరు. కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పటిలోగా ఇస్తుందో కేంద్రం చెప్పలేకపోతోంది.   కనీసం ఈలోగా రాష్ట్రానికి ఇవ్వాల్సిన రూ.16,000కోట్లయినా విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఉపశమనం కలగవచ్చును. కానీ ఆ విషయంలో కూడా కేంద్రం ఏమి చేయబోతోందో తెలియదు. ఒకవేళ కేంద్రం తక్షణమే సహాయం చేయలేకపోయినట్లయితే ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు కూడా ప్రభుత్వం కటకటలాడవలసిన పరిస్థితి నెలకొని ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పారు. కనుక కేంద్రం తక్షణమే ఎంతో కొంత సహాయం చేస్తుందని ఆశించడం అత్యాశ కాబోదు.   మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఫెడరల్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు అనేక సంస్కరణలు అమలు చేస్తోందని బీజీపీ పదేపదే చెప్పుకొంటోంది. అటువంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిధులు, ప్రాజెక్టులు, ప్రత్యేక హోదా కోసం కేంద్రం ముందు ఈవిధంగా చేయి చాచే పరిస్థితి రాకుండానే కేంద్రం స్పందిస్తే బాగుండేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పదేపదే అడిగినా చేయి విదిలించకపోతే, దాని వలన తెదేపా-బీజేపీల మధ్య ఉన్న సత్సంబంధాలు దెబ్బ తినడమే కాకుండా రాష్ట్రంలో ప్రజలకు కూడా బీజేపీపై దురాభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా అవతరించాలని తహతహలాడుతున్న బీజేపీ, ఈ కష్ట సమయంలో రాష్ట్రానికి ఉదారంగా సహాయపడి, ఈ క్లిష్ట పరిస్థితుల నుండి అది బయటపడేందుకు వీలయినంత సహాయం చేసినట్లయితే ఆ పార్టీ పట్ల ప్రజలలో మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. అప్పుడు రాష్ట్ర నేతలు కూడా దైర్యంగా ప్రజల ముందుకు వెళ్లి వారి మద్దతు అడగగలుగుతారు. అలాకాక చేస్తాం, చూస్తాం అంటూ ఇలాగే నెలలు, సంవత్సరాలు దొర్లించేస్తే రాష్ట్రం ఎలాగూ మెల్లగా ఎప్పటికో అప్పటికి అభివృద్ధి చెందుతుంది. కానీ దాని వలన బీజేపీకే ఎక్కువ నష్టం జరుగుతుంది.

జగన్ పొలిటికల్ కామెడీ...

  కొంతకాలం తర్వాత గూగుల్‌లోకి వెళ్ళి Political comedian అనే మాట కొట్టి ఎంటర్ చేస్తే వైసీపీ అధినేత జగన్ ఫొటోలు కొన్ని లక్షలు కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆయన చేస్తున్న కామెడీ స్థాయి అలా వుంది మరి. జగన్ తాను చేసే కామెడీలో బోలెడన్ని విన్యాసాలను ప్రదర్శిస్తున్నారు. వాటన్నిటి గురించి వీలువెంబడి మెల్లమెల్లగా ప్రస్తావించుకుందాం. ఇప్పుడు మాత్రం జగన్ చేస్తున్న ఒక కామెడీ స్కిట్ గురించి ముచ్చటించుకుందాం.   జగన్ ఎప్పుడు జైల్లోకి వెళ్తాడో అనే సందేహాలు ఆయన పార్టీ ఎమ్మెల్యేలలోనే వుంది. అతి త్వరలోనే జగన్ పార్టీ షట్టర్ క్లోజ్ చేసే అవకాశం కూడా వుందన్న అనుమానాలు వారిలో కలుగుతున్నాయి. అందుకే కలుగులోంచి బయటకి వచ్చే ఎలుకల మాదిరిగా జగన్ పార్టీ నుంచి బయటపడిపోతున్నారు. ఇప్పటికే కొంతమంది నాయకులు వైసీపీకి బైబై చెప్పేశారు. మరికొంతమంది తెలుగుదేశం, బీజేపీలతో బేరసారాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ నాయకుడైనా ఏం చేస్తాడు? పార్టీలోంచి బతుకుజీవుడా అనుకుంటూ పారిపోతున్న వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తాడు. వాళ్ళలో తనమీద నమ్మకం పెంచుకునేలా చేస్తాడు. అయితే జగన్ మాత్రం అలా లేడు. పార్టీలోంచి పారిపోతున్నవాళ్ళని ఆపే ప్రయత్నాలు ఎంతమాత్రం చేయడం లేదు. అయినా మన అమాయకత్వంగానీ, జగన్ ఆపినా వాళ్ళు ఆగుతారా...! తన పార్టీలో పరిస్థితి ఇలా వుంటే, జగన్ మాత్రం మరోలా ఆలోచిస్తూ కామెడీ చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీలో చీలిక తెచ్చి, చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చడానికి పావులు కదుపుతున్నాడు.   నేను ముఖ్యమంత్రినైతే 30 ఏళ్ళు పరిపాలిస్తా అని జగన్ స్టేట్‌మెంట్ ఇచ్చినప్పుడు ఆలు లేదు చూలు లేదు అల్లుడిపేరు జగన్ అనే కొత్త సామెత జనాల మైండులో తక్షణం పుట్టుకొచ్చింది. ఇప్పుడు జగన్ తాను ముఖ్యమంత్రి అయ్యే ఆలోచనను పక్కన పెట్టేసి, చంద్రబాబుని ముఖ్యమంత్రి సీటు మీద నుంచి దించేసే పనిలో బిజీగా వున్నాడు. కొంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలతో ‘టచ్’లోకి వెళ్ళిన జగన్ వారికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడట. ఆ ఆఫర్ సారాంశం ఏంటంటే, కొంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలందరూ ఒక్కటై తెలుగుదేశం పార్టీ నుంచి విడిపోయి బయటకి రావాలి. అలా బయటకి వచ్చిన గ్రూపుకి జగన్ మద్దతు ఇస్తాడు. అలా ఆ గ్రూపు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు. అప్పుడు ముఖ్యమంత్రి పదవి జగన్‌కి ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీలోంచి విడిపోయిన గ్రూపు నాయకుడే ముఖ్యమంత్రి అయిపోవచ్చు.... ఇదీ జగన్ సార్ ఐడియా. ఆ ఐడియా విన్న సదరు టీడీపీ ఎమ్మెల్యేలు జగన్‌ని కిందనుంచి పైకి, పైనుంచి కిందకి ఎగాదిగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయారట. వెళ్తూ వెళ్తూ తమ చెవుల్లో జగన్‌‌కి పూలుగానీ కనిపిస్తున్నాయా అనుకుంటూ, చెవులు తడుముకుంటూ వెళ్ళిపోయారట. ఇదండీ జగన్ పథకం. వేరే పార్టీ వాళ్ళని తన పార్టీలోకి వచ్చేలా చేయడాన్ని ‘ఆకర్ష’ పథకం అంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక గ్రూపును చీల్చి, తాను ఆ గ్రూపుకి తోకలాగా వుండాలనుకుంటున్న జగన్ పథకాన్ని ‘తోకర్ష’ పథకం అనొచ్చేమో!

విధ్వంస చక్రం తిప్పుతున్న అమెరికా

  సృష్టి స్థితి లయ కారకుడు ఆ భగవంతుడేనని అందరం విశ్వసిస్తాము. కానీ ఈ కలియుగంలో ఆ పాత్ర అగ్ర రాజ్యమయిన అమెరికా పోషిస్తోందని చెప్పక తప్పదు. ఏవిధంగా అంటే ఉగ్రవాదానికి ఊతం ఇచ్చేది ఆదేశమే. వారి వలన అపార ప్రాణ నష్టం జరగడానికీ అమెరికాయే కారణం. ఆ ఉగ్రవాదులు రెచ్చిపోయి అదుపు తప్పినప్పుడు వారిపై ఆకాశం నుండి బాంబుల వర్షం కురిపించి మట్టుబెట్టి ప్రజలను రక్షించేది అమెరికానే. ఈ విద్వంస చక్రం నిరంతరం తిరుగుతూ ఉండేందుకు అమెరికా చేయని ప్రయత్నం లేదు.   అమెరికా చేతిలో స్టీరింగులా తిరుగుతున్న విద్వంస చక్రంలో ఉగ్రవాదులతో బాటు నిత్యం వేలాది మంది అమయాకులయిన ప్రజలు ప్రాణాలు కోల్పోవడానికి అమెరికానే కారణం. వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఇరాక్, ఇరాన్, పాకిస్తాన్ ఇలా అనేక దేశాలలో రావణ కాష్టంలా రగులుతున్న మారణకాండకు అందుకు సజీవ సాక్ష్యాలుగా మన కళ్ళ ముందు నిలిచి ఉన్నాయి. అందుకోసం ప్రపంచ దేశాల ప్రజలే కాదు అమెరికా స్వయంగా తన సైనికులను, కోట్లాది డాలర్లను కూడా తృణ ప్రాయంగా సమర్పించుకోవడం విశేషం.   పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ పై దాడులు చేస్తుంటే, ఉగ్రవాదంపై పాక్ బహు చక్కగా పోరాడుతోందని మెచ్చుకొంటూ ప్రతీ ఏడు క్రమం తప్పకుండా భారీ నజరానాలు ఇస్తోంది. కానీ అమెరికా సైనికులు రాత్రికి రాత్రి హటాత్తుగా హెలికాఫ్టర్లలలో శాటిలైట్ వీడియో కెమెరాలు పెట్టుకొని మరీ వచ్చి లాడెన్ న్ని హతమారుస్తుంటే, ఆ తంతుని ఎక్కడో అమెరికాలో కూర్చొని వీడియోలో చూసి ఆనందించడం కేవలం అమెరికన్లకే చెల్లు. తను ఇంతకాలంగా వెతుకుతున్న బిన్ లాడెన్ కి పాకిస్తాన్ దేశమే ఆశ్రయం కల్పించినప్పటికీ అందుకు అమెరికా ఏమాత్రం నొచ్చుకోకపోవడం దాని విశాల హృదయానికి ఒక చక్కటి నిదర్శనం. కానీ మళ్ళీ తెల్లారగానే అదే పాకిస్తాన్ దేశంపై ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు అంటూ తన డ్రోన్ విమానాలతో బాంబుల వర్షం కురిపిస్తుంటుంది.   ఇదంతా చూస్తుంటే అసలు అమెరికా ఉగ్రవాదులను మట్టుబెట్టి ప్రపంచంలో శాంతి నెలకొల్పాలని చూస్తోందా? లేకపోతే ఎప్పటికప్పుడు తను తయారు చేసుకొనే అత్యాధునిక ఆయుధాలను పరీక్షించుకోవడానికే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందా? అనే అనుమానం కలగడం సహజం.   లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులను అణచివేశామని అమెరికా సంతోషపడేలోగానే అంతకంటే కిరాతకమయిన ఈ ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులు పుట్టుకొచ్చి ఇరాక్, సిరియా దేశాలలో నిత్యం వందలమంది మహిళలను, పసి పిల్లలను, వృద్ధులను, యువకులను అతి కిరతాకంగా సాముహిక హత్యలు చేస్తున్నారు. వారిని అణచివేసేందుకు అగ్ర రాజ్యాల ప్రయత్నాలేవీ ఫలించకపోగా, వారి చర్యలతో ఉగ్రవాదులు మరింత ప్రతీకారేచ్చతో రగిలిపోతూ విదేశీయులను బందీలుగా పట్టుకొని అతి కిరాతకంగా హత్యలు చేస్తున్నారు.   ఇందుకు కూడా అమెరికానే ముందుగా నిందించవలసి ఉంటుంది. ఇరాక్ దేశంలో చమురు బావులను స్వంతం చేసుకొనేందుకు రసాయన, అణు బాంబులు ఉన్నాయనే వంకతో ఇరాక్ పై దాడులు చేసి ఆ దేశ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ న్ని ఉరి తీసింది. సద్దాం హుస్సేన్ కూడా అతి కిరాతకుడే కావచ్చును. కానీ అతని భయంతోనే ఉగ్రవాదులెవరూ తలెత్తే సాహసం చేయలేకపోయారు. కానీ అమెరికా నిర్వాకం వలన ఇప్పుడు ఇరాక్ ఒక దిక్కులేని దేశంగా మారిపోయింది. ఇదే అదునుగా ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులు ఇరాక్ దేశాన్ని క్రమ క్రమంగా తమ గుప్పెట్లోకి తెచ్చుకొంటూ అక్కడి ప్రజలను నిర్దాక్షిణ్యంగా హత్యలు చేస్తున్నారు.   వారిని కాపాడే శక్తి లేని నామ మాత్రపు ఇరాక్ ప్రభుత్వం అమెరికా అందిస్తున్న ఆయుధాలు, మందు గుండు, బాంబులు వంటి మారణాయుధాలు వారికి అందజేస్తూ మీ ప్రాణాలు మీరే కాపాడుకొమ్మని చేతులు ఎత్తేసింది. ఇటీవల ఇరాక్ లో దాదాపు 5000 మంది జనాభా ఉండే ఒక గ్రామాన్ని ఉగ్రవాదులు చుట్టుముట్టగా ప్రభుత్వం అందించిన ఆ ఆయుధాలతో అక్కడి ప్రజలు ఉగ్రవాదులను ఎదుర్కొంటున్నట్లు వార్తలు వచ్చేయి. కానీ అత్యాధునిక ఆయుధాలు కలిగిన వేలాదిమందితో కూడిన ఉగ్రవాద మూకలను తమ వద్ద ఉన్న కొద్దిపాటి ఆయుధాలతో ఎంతో సేపు నిలువరించడం కష్టం గనుక ఆ తరువాత ఏమి జరిగి ఉంటుందో తేలికగానే ఊహించుకావచ్చును.   ఈ మారణహోమానికి ఎప్పుడు తెరపడుతుందో? అసలు అంతమొందించడం సాధ్యమో కాదో అనే భయం కలుగుతోంది.

త్వరలో తెలంగాణాలో చంద్రబాబు పర్యటన

  వచ్చే నెలలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేష్ తో కలిసి వరంగల్లో పర్యటించబోతున్నట్లు ఆ పార్టీ తెలంగాణా అధ్యక్షుడు యల్. రమణ తెలిపారు. ఇప్పటికే ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిత్యం ఏదో ఒక అంశం మీద ఘర్షణ జరుగుతూనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తెలంగాణాలో పర్యటించి తన పార్టీని బలోపేతం చేసుకోవాలని ప్రయత్నిస్తే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చొంటారని భావించలేము. కానీ వైకాపా నాయకురాలు వై.యస్.షర్మిల పరామర్శ యాత్రల పేరిట తెలంగాణాలో వైకాపాను బలోపేతం చేసుకొనేందుకు అన్ని జిల్లాలు చుట్టబెట్టేస్తున్నప్పుడు నోరు విప్పని తెరాస నేతలు, వారి అధ్యక్షుడు కేసీఆర్, ఒకవేళ చంద్రబాబు నాయుడు పర్యటనలో ఏమయినా అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తే వారిని చంద్రబాబు నాయుడు ఇదే ప్రశ్న అడగవచ్చును.   ఆయన వెంట నారా లోకేష్ కూడా బయలుదేరినట్లయితే బహుశః మున్ముందు అతనికే తెలంగాణాలో పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని భావించవచ్చును. ఎందువలన అంటే ఆంధ్రాలో తెదేపాను, ప్రభుత్వాన్ని నడిపేందుకు చంద్రబాబు, ఆయనతో బాటు బలమయిన నాయకులు అనేకమంది ఉన్నారు. కానీ తెలంగాణాలో తెరాస ఒత్తిళ్లను తట్టుకొని పార్టీని నడిపించేందుకు ఎవరూ లేరు. ఉన్నకొద్ది మంది నేతల మధ్య సరయిన సమన్వయము లేకపోవడంతో వారందరినీ ఒక్క త్రాటిపైకి తీసుకువచ్చి తెలంగాణాలో తెదేపాను ముందుండి నడిపించే బలమయిన నాయకుడు లేడు. గత కొన్ని నెలలుగా నారా లోకేష్ తరచూ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, అతని ప్రభుత్వంపై ట్వీటర్ లో విమర్శలు గుప్పిస్తుండటం గమనించినట్లయితే, అతని దృష్టి తెలంగాణాపైనే ఉందని అర్ధమవుతుంది.   వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలనుకొంటున్నట్లు ఆ పార్టీ నేతలు చాలా స్పష్టంగానే చెపుతున్నారు. కనుక తెలంగాణాలో బలపడేందుకు తెదేపా కూడా తన ప్రయత్నాలు తాను చేసుకోక తప్పదు. ఆ ప్రయత్నాలేవో ఇప్పటి నుండే మొదలుపెడితే గానీ ఎన్నికల నాటికి పార్టీ బలం పుంజుకోవడం సాధ్యం కాదు. గనుకనే చంద్రబాబు నాయుడు, ఆయనతో బాటు నారా లోకేష్ ఇద్దరూ ఈ యాత్రకు సిద్దమవుతున్నారనుకోవలసి ఉంటుంది.

పెట్టుబడుల సాధనే లక్ష్యంగా బాబు దావోస్ పర్యటన

  రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి, పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఆ ప్రయత్నంలోనే దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్ధిక సదస్సులో హాజరయ్యేందుకు ఈరోజు ఆయన బయలుదేరి వెళ్ళారు. ఆ సదస్సులో ఆయన పట్టణాభివృద్ధి భవితవ్యం అనే అంశంపై ప్రసంగిస్తారు. అనంతరం ఆ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన అనేక ప్రముఖ సంస్థల సి.ఈ.ఓ.లతో ఆయన సమావేశమయ్యి తన ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, రాయితీల గురించి వివరించి వారిని రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టమని కోరనున్నారు. డేవిడ్ చీస్ రైట్ (వాల్ మార్ట్); ఇంద్రా నూయూ (పెప్సీ కంపెనీ); విశాల్ సిక్కా (ఇన్ఫోసిస్); ఫ్రాన్స్ వన్ హౌటన్ (రాయల్ ఫిలిప్స్); ఉషారావు (గ్లోబల్ వాటర్ డెవెలప్మెంట్ పార్ట్ నర్స్); రిషాద్ ప్రేమ్ జీ (విప్రో) తదితర సంస్థల సంస్థల సీఈఓలను చంద్రబాబు నాయుడు కలుస్తారు. చంద్రబాబు నాయుడు తన ప్రతీ విదేశీ పర్యటన ద్వారా రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షిస్తూనే ఉన్నారు. ఈసారి ఆయన అనేక ప్రముఖ సంస్థల సీఈఓలతో ముఖాముఖి సమావేశం అవుతున్నారు కనుక ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకువస్తారని ఆశించవచ్చును.   ఆయనతోబాటు రాష్ట్ర ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, డిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంబంపాటి రామ్మోహన రావు, ఇంధన మరియు మౌలికవసతుల కల్పన శాఖల ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మరి కొంతమంది ఉన్నతాధికారులు దావోస్ వెళ్ళారు.

కరెన్సీ కట్టలతో కూడా కష్టాలేనట!

  బ్యాంకుల్లో కరెన్సీ కట్టలు దొంతర్లు చూస్తే ఎవరికయినా ముచ్చటేస్తుంది. కానీ ఆ కరెన్సీ కట్టలతో జరిగే లావాదేవీల కోసమే మన దేశంలో బ్యాంకులు ఏడాదికి రూ 21,000 కోట్లు ఖర్చు చేయవలసి వస్తోందంటే నమ్మబుద్ధి కాదు. కానీ అది పచ్చి నిజం.   అభివృద్ధి చెందిన దేశాలలో క్రమంగా కరెన్సీ వినియోగం తగ్గిపోతూ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఆన్ లైన్ నగదు బదిలీలు జరిగుతుంటే మన దేశంలో నిరక్షరాశ్యత, పేదరికం, కోట్లాదిమందికి నేటికీ బ్యాంకు ఖాతాలు కూడా లేకపోవడం, భారతీయులకు కరెన్సీ నోట్లను దాచుకోవాలనే తపన, ఆ నగదును సురక్షితంగా ఒక చోట నుండి మరొక చోటికి తరలించవలసి రావడం వంటి అనేక కారాణాల వలన ప్రతీ ఏడాది దేశంలో బ్యాంకులన్నీఅన్నివేల కోట్లు ఖర్చు చేయవలసి వస్తోంది.   ఈ కారణంగానే ప్రతీ ఏటా లక్షల కోట్ల కరెన్సీ నోట్లను ముద్రించవలసి వస్తోంది. మళ్ళీ ఎప్పటికప్పుడు ఆ నోట్ల సెక్యురిటీ కోడ్స్ మార్చవలసి రావడం, చిరిగిన, పాడయిపోయిన పాత నోట్ల స్థానంలో ఈ కొత్త నోట్లను చెలామణిలోకి తీసుకురావడం, వాటితో లావాదేవీలు నిర్వహించవలసి రావడంతో ఈ అదనపు భారం తప్పడం లేదు. అంటే నోటుకి ఉన్న విలువే కాదు ఆ నోటును చెలామణిలో ఉంచడానికి కూడా ఖర్చు తప్పదన్నమాట.   ఒక్క డిల్లీ నగరంలోనే ప్రజలు ఏడాదికి కనీసం 60 లక్షల గంటలపాటు ఈ కరెన్సీ నోట్లతో లావాదేవీలు నిర్వహించుతున్నారని మాస్టర్ కార్డ్ సంస్థ వారు ఇటీవల విడుదల చేసిన ‘కాస్ట్ ఆఫ్ క్యాష్ ఇన్ ఇండియా’ అనే పుస్తకంలో తెలియజేయబడింది. మరి యావత్ భారతదేశంలో ఉన్న 123 కోట్ల మంది కలిసి ఎన్ని లక్షల కోట్ల గంటల సమయం ఈ కరెన్సీ వ్యవహారాలకోసం వెచ్చిస్తున్నారో ఎవరూ లెక్క కట్టలేరేమో. నేటికీ భారత దేశ జనాభాలో మూడవ వంతు మంది గత 15 ఏళ్లలో ఎన్నడూ బ్యాంకు గడప ఎక్కనే లేదట. కారణాలు అందరికీ తెలిసినవే పేదరికం, దరిద్రం, నిరుద్యోగం, నిరక్షరాస్యత వగైరా వగైరా. అందుకే ప్రధాని మోడీ జన్ ధన్ యోజన అంటూ అందరి చేత బ్యాంకు ఖాతాలు తెరిపిస్తున్నారేమో. కానీ పైసా రాబడి లేని వారి చేత ఎన్ని కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిపిస్తే మాత్రం ఏమి ప్రయోజనమో మోడీ వివరించలేదు.   కానీ 2007 సం.నుండి పట్టణ ప్రాంతాలలో ఎలక్ట్రానిక్ పేమెంట్లు 2.6% to 6.8% వరకు వృద్ధి చెందింది. అది ప్రతీ ఏటికీ ఇంకా వేగంగా పెరుగుతోంది. బ్యాంకులు ఆర్ధిక సంస్థలు, వ్యాపార సంస్థలు అన్నీ కూడా ఎలక్ట్రానిక్ పేమెంట్లను విరివిగా ప్రోత్సహించడం అందుకు అవసరమయిన సదుపాయాలూ కల్పించడం, గుండు సూది నుండి కుక్క పిల్లల వరకు అన్నీ కూడా ఆన్ లైన్లో కొనుగోలు చేసే అవకాశాలు పెరగడంతో పెద్ద పెద్ద పట్టణాలు, నగరాలలో ఈ కరెన్సీ వాడకం క్రమంగా కొంచెం తగ్గు ముఖం పడుతోంది.   2007 సం.లో ఏటీయం ల ద్వారా రూ.3లక్షల కోట్లు లావాదేవీలు జరిగితే అది 2012 నాటికి రూ 18 లక్షల కోట్లకు చేరుకొంది. కానీ అంత మాత్రాన్న భారతదేశంలో కరెన్సీ నోట్లతో లావాదేవీలు ఏ మాత్రం తగ్గలేదు పైగా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. వచ్చే మూడేళ్ళలో భారత్ చైనా దేశాలలో ఏడాదికి 16,000 కోట్ల నుండి 17,300 కోట్ల నోట్లు చెలామణిలో ఉంటాయని ఒక అంచనా. అంటే వాటి ముద్రణ, తరలింపు, వాటితో లావాదేవీలు, పాత నోట్ల ఉపసంహరణ వగైరా తంతు అంతా కూడా పెరుగుతుందన్న మాట.

వైసీపీ ఎమ్మెల్యేలు... బీజేపీతో బేరాలు...

  ఆయనొక ఎమ్మెల్యే. ఒక యువ హీరో అండదండలు పుష్కలంగా ఉన్న వ్యక్తి. గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కూడా వుండేవారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి దూరమై వైసీపీలో చేరారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసి మొన్నటి ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజాబలం కంటే నోటి బలం ఎక్కువ అని ఆయన పేరు జనం నోళ్ళలో బాగా నానింది. ఆయన నోటి దురుసుతనం గురించి, తల బిరుసు గురించి ఆయన నియోజకవర్గంలో కథలు కథలుగా చెప్పుకుంటూ వుంటారు. తనకు రాజకీయంగా జీవితాన్ని ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి అకారణంగా దూరమవ్వడమే కాకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పార్టీనే నోటికొచ్చినట్టు తిట్టేంత నోటి దురుసుతనం ఆయన సొంతం. బోలెడంత రెబల్‌గా వుండే ఆయన ప్రస్తుతం వైసీపీ నాయకుడు జగన్ ముందు మాత్రం కుక్కిన పేనులా పడి వుండే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. టీడీపీని తిట్టే విషయంలో తప్ప మరే విషయంలోనూ పాపం ఆయనకి వాయిస్ లేకుండా పోయింది. దానికితోడుగా ఏపీలో వైసీపీ మెల్లగా కనుమరుగు అయ్యే పరిస్థితులు ముంచుకుని వస్తూ వుండటంతో ఆయన మెల్లగా ఆ పార్టీ నుంచి తన బిచాణా ఎత్తేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.   వైసీపీ నుంచి ఏ పార్టీలోకి జంప్ చేయాలా అని తీవ్రంగా ఆలోచించిన ఆయనకు కేవలం ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే దిక్కులా కనిపించింది. వైసీపీలో చేరిన తర్వాత టీడీపీని ఆయన తిట్టిన తిట్ల ధాటికి ఆ పార్టీలోకి ఆయనకి ద్వారాలు శాశ్వతంగా మూసుకుని పోయాయి. ఆయనగారిని మళ్ళీ పార్టీలోకి తీసుకుని కొరివితో తల గోక్కునే రిస్క్ తెలుగుదేశం పార్టీ పొరపాటున కూడా చేయదు. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరదామా అంటే... ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన రోజే చచ్చిపోయింది. ఇప్పుడు ఈయన ఆ పార్టీలో చేరితే, సంవత్సరానికోసారి ఆ పార్టీకి తద్దినం పెట్టడం తప్ప మరో పని వుండదు. ఇక ఇప్పుడు మిగిలిన ఒకే ఒక ఆప్షన్ ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్‌లో వేళ్ళూనుకుంటున్న భారతీయ జనతా పార్టీ. దాంతో ఇప్పుడు ఆయన దృష్టి బీజేపీ మీద పడింది. ఆటోమేటిగ్గా ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి.   వైసీపీని వదిలి తానొక్కడినే వస్తానని అంటే ఒంటికాయ సొంఠికొమ్ములా ఒక్కడివే ఏంటయ్యా అంటారని అనుకున్నారో ఏమోగానీ, తనకు బాగా మిత్రులైన మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలను కూడా ఆయన తోడు చేసుకున్నారు. మేం ముగ్గురం మూకుమ్మడిగా బీజేపీలో చేరిపోతాం... మాకేంటి... అని ఆయన బీజేపీ అగ్ర నాయకత్వంతో బేరసారాలు నడుపుతున్నట్టు తెలుస్తోంది. మిగతా ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేల్ని డైరెక్టుగా రంగంలోకి దించకుండా బీజేపీతో లావాదేవీలను ఆయన ఒక్కడే చేస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ ఏపీ నాయకత్వంతో పలు దఫాలుగా మీటింగ్స్ కూడా జరిగాయట. మొన్నీమధ్య ఢిల్లీకి వెళ్ళి బీజేపీ కార్యాలయంలో కేంద్ర నాయకత్వంతో కూడా మాటామంతీ జరిపారట. నేడో రేపు ఈ ముగ్గురూ బీజేపీలోకి జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నోటి దురుసు ఎమ్మెల్యే గారి వాగ్ధాటి గురించి బీజేపీ నాయకత్వానికి తెలిసినప్పటికీ ఏపీలో బలం పెంచుకోవడానికి ఇలాంటి వాళ్ళను కూడా చేర్చుకోక తప్పదనే అభిప్రాయంలో ఉన్నట్టు సమాచారం. 

తిరుపతిలో ఎన్నిక జరగాలి

  ఎవరైనా పదవిలో వున్న ప్రజా ప్రతినిధి అకస్మాత్తుగా మరణిస్తే, వారి స్థానంలో వారి కుటుంబానికి చెందిన ఒకరిని ఎన్నుకోవడం అనేది సంప్రదాయంగా వస్తోంది. ఆయా స్థానాల్లో వారి కుటుంబ సభ్యుల్లో ఒకర్ని నిలిపి, పోటీ లేకుండా గెలిపించుకోవడం ఆనవాయితీగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆళ్ళగడ్డ స్థానంలో భూమా శోభా నాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియ వైసీపీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి అన్ని పార్టీలూ సహకరించాయి. ఆ తర్వాత నందిగామ అసెంబ్లీ స్థానం నుంచి తంగిరాల ప్రభాకరరావు కుమార్తె సౌమ్య తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో నిలిచారు. అయితే అంతకుముందు ఆళ్ళగడ్డ స్థానంలో ఏకగ్రీవం కావడానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ నందిగామ స్థానం విషయానికి వచ్చేసరికి లేనిపోని ఆశలు పెట్టుకుని పోటీలో నిలిచింది. దాంతో ఆ స్థానంలో ఎన్నిక తప్పలేదు. తంగిరాల ప్రభాకరరావు కుమార్తె సౌమ్య గెలవకా తప్పలేదు. ఇప్పుడు తిరుపతి స్థానానికి కూడా ఉప ఎన్నిక జరగబోతోంది. తిరుపతి తెలుగుదేశం ఎమ్మెల్యే వెంకట రమణ అనారోగ్యంతో మరణించడంతో ఆ స్థానం నుంచి ఆయన భార్య సుగుణమ్మని నిలపాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. తిరుపతి నుంచి సుగుణమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక అయితే బావుంటుందని తిరుపతిలోని వెంకట రమణ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ ఎన్నిక జరగక తప్పని పరిస్థితి ఏర్పడింది.   తిరుపతి స్థానం ఈసారి ఏకగ్రీవం కాకుండా పోటీ జరగాలని పలు రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడా అడ్రస్ లేకుండా పోయిన లోక్‌సత్తా పార్టీకి తిరుపతిలో పోటీ చేయాలన్న తహతహ పుట్టుకొచ్చింది. ఏదైనా అద్భుతం జరిగి గెలవకపోతామా అన్న ఆశ ఆపార్టీలో ఏర్పడింది. అందుకే ‘కుటుంబ పాలనకు మేం వ్యతిరేకం’ అంటూ నినదిస్తూ ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ స్థానం మీద కన్ను వుంది. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని ఇప్పటికే పార్టీలో నిర్ణయం జరిగిపోయినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఎంతమాత్రం లేకపోయినా, ఏదైనా అద్భుతం జరగకపోతుందా అని ఆశిస్తోంది. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగి కాంగ్రెస్ గెలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో తమకు మంచి రోజులు వస్తాయన్నదానికి ఆ విజయాన్ని ఉదాహరణగా చూపించాలని ఆశిస్తోంది. ఇక వైసీపీ అయితే పైకి వెంకట రమణ కుటుంబం మీద తమకు బోలెడంత సానుభూతి వుందని చెబుతున్నప్పటికీ రాయలసీమ ముఖ్య నగరమైన తిరుపతిలో తమ పట్టును సాధించాలంటే తిరుపతిలో పోటీ చేసి గెలవాలని ఆశిస్తోంది. అయితే తన మనసులోని మాటను ఇంతవరకు బయటపెట్టలేదు. మిగతా పార్టీలు ఇక్కడ పోటీ చేస్తున్నాయి కాబట్టి మేమూ చేస్తామని ప్రకటించి చివరి నిమిషంలో కరుణాకర్ రెడ్డిని రంగంలోకి దించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.   ఏది ఏమైనప్పటికీ, తిరుపతిలో ఏకగ్రీవం కాకుండా ఎన్నిక నిర్వహించడం ద్వారానే వెంకట రమణ భార్య సుగుణమ్మ విజయం సాధించడం మంచిదన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీ వారో దయ చూపిస్తే గెలిచామన్న న్యూనత లేకుండా వుండాలన్నా, వెంకట రమణకు, తెలుగుదేశం పార్టీకి తిరుపతి ప్రజల్లో ఉన్న ఆదరణ మరోసారి నిరూపణ అవ్వాలన్నా తిరుపతిలో ఎన్నిక జరగడమే న్యాయమని వారు భావిస్తున్నారు.

పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన అమెరికా

  ఏదయినా తనదాకా వస్తే కానీ తెలియదని ఊరికే అనలేదు పెద్దలు. ఈ విషయం అమెరికాని చూస్తే అర్ధమవుతుంది. గత మూడు దశాబ్దాలుగా పాకిస్తాన్ ఉగ్రవాదులతో, సరిహద్దుల వద్ద పాక్ భద్రత దళాలతో వేగుతున్న భారత్ సమస్య గురించి ఎంతగా మొత్తుకొన్నప్పటికీ అమెరికా పట్టించుకోలేదు. పైగా ఉగ్రవాదంపై పాక్ ప్రభుత్వం చాలా గొప్పగా పోరాడుతోందని మెచ్చుకొంటూ ప్రతీ ఏటా వందల కోట్ల రూపాయలు దానికి కప్పం కడుతోంది. అప్పనంగా వచ్చిపడుతున్న ఆ డబ్బును పాక్ ప్రభుత్వం దేనికి ఖర్చు పెడుతోందో అమెరికా కనుగొందో లేదో తెలియదు.   భారత్ అభివృద్ధికి బ్రేకులు వేసేందుకు పాక్ వంటి దూర్త దేశాన్నిదానికి పక్కలో బల్లెంలా ఉంచడం చాలా అవసరమని అమెరికా భావిస్తోందేమో? అందుకే అది పాక్ ప్రభుత్వానికి అంత ఉదారంగా సాయం చేస్తోందేమోననే అనుమానాలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న తన ఉగ్రవాదమూకలు భారత్ పై తరచూ దాడులు చేస్తూ అమాయకులయిన ప్రజల ప్రాణాలు బలిగొంటున్నప్పటికీ, అమెరికా మాత్రం పాక్ ప్రభుత్వాన్ని మెచ్చుకొంటూ దానికి భారీ నజరానాలు ముట్టజెప్పడం గమనిస్తుంటే ఆ అనుమానాలు నిజమేననిపించక మానదు.   కానీ ఆ దేశ అధ్యక్షుడు బారక్ ఒబామా భారత గణతంత్ర దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిధిగా పాల్గొనేందుకు వస్తున్నారని తెలిసినప్పటి నుండి పాక్ ప్రభుత్వం ఉగ్రవాదులతో కటువుగా ఉండవలసింది పోయి భారత్ పై ఉగ్రవాద దాడులు నిర్వహించేందుకు అది అన్ని విధాల వారికి సహాయ సహకారాలు అందిస్తుండటం చాలా విస్మయం కలిగిస్తోంది. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా స్వయంగా డిల్లీకి వస్తున్న తరుణంలో దేశంలో ప్రధాన నగరాలలో ముఖ్యంగా డిల్లీ, ముంబై విమానాశ్రయాలలో ఉగ్రవాద దాడులు జరుగవచ్చని పదేపదే భారత, అమెరికా నిఘావర్గాలు హెచ్చరికలు జారీ చేస్తుండటం అందరినీ చాలా కలవరపరుస్తోంది.   ఈ పరిస్థితి చూసి చివరికి అమెరికా ప్రభుత్వం కూడా పాక్ ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరించక తప్పలేదు. అమెరికా అధ్యక్షుడు భారత్ లో ఉన్న సమయంలో జరిగే ఏ ఉగ్రవాద దాడితోనయినా పాకిస్తాన్ కు సంబంధం ఉందని తేలితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని అమెరికా ప్రభుత్వం పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. అంటే తనకు ప్రమాదం ఉందని తెలిస్తే అమెరికా ఉపేక్షించదు. కానీ గత ముప్పై ఏళ్లుగా భారత్ పై పాక్ ప్రభుత్వం అండదండలతో జరుగుతున్న ఉగ్రవాద దాడులను కానీ, ఇకపై జరుగబోయే దాడులను గానీ అమెరికా ఏ మాత్రం పట్టించుకోదన్నమాట. స్వయంగా అమెరికా అధ్యక్షుడే భారత్ వస్తున్నారనే సంగతి తెలిసి కూడా భారత్ పై దాడులు చేసేందుకు పాక్ దుసాహసం చేస్తోందని తెలిసి ఉన్నప్పటికీ అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్ పట్ల ఇంకా అదే ఔదార్యం చూపించినట్లయితే అది అవివేకమే.

మళ్ళీ పరామర్శకు బయలుదేరనున్న షర్మిల

  కొన్ని రోజుల క్రితం తెలంగాణాలో మెహబూబ్ నగర్ జిల్లాలో పరామర్శ యాత్ర నిర్వహించిన వై.యస్. షర్మిల మళ్ళీ ఈనెల 21వ తేదీ నుండి నల్లగొండ జిల్లాలో పరామర్శ యాత్ర మొదలుపెట్టనున్నారు. ఆమె ఈసారి తన యాత్రలో ఏడు రోజులపాటు ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పర్యటించి మొత్తం 30 కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. జిల్లాలోని దేవరకొండ నుండి ఆమె యాత్ర మొదలుపెట్టి సూర్యాపేట వద్ద ముగిస్తారు. మళ్ళీ కొద్దిరోజుల విరామం తరువాత జిల్లాలో మిగిలిన నియోజకవర్గాల్లో కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పరామర్శ యాత్ర వాల్‌పోస్టర్‌ను హైదరాబాద్‌లో లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు.   ఆమె చేసేది పరామర్శ యాత్రలే అయినప్పటికీ, అదేదో రాజకీయ యాత్ర అన్నట్లుగా ఆమె యాత్రలు మొదలుపెడుతున్న ప్రతీసారి వైకాపా అందుకోసం ప్రత్యేకంగా పోస్టర్లు రూపొందించి విడుదల చేసి విస్తృతంగా ప్రచారం చేయడం గమనిస్తే ఆమె చేస్తున్న ఆ యాత్రల పరమార్ధం ఏమిటో అర్ధం అవుతోంది.

బీజేపీకి ఆ ఐడియా ఇచ్చింది అరవింద్ కేజ్రీవాలే

  ఒకప్పుడు వారిరువురూ కలిసి పనిచేసేవారు. ఇరువురికీ కూడా ప్రజలలో చాలా మంచి పేరే ఉంది. కానీ క్రమంగా వారిరువురి దారులు వేరయ్యాయి. వారే ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ మరియు మాజీ ఐ.పి.యస్.ఆఫీసర్ కిరణ్ బేడీ. అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించినపుడు ఆయన నుండి దూరమయిన అన్నా హజారే చెంత చేరారు కిరణ్ బేడీ. అవినీతికి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న పోరాటంలో కలిసి పనిచేసారు. కానీ ఇప్పుడు ఆమె కూడా బీజేపీలో చేరడంతో అన్నా హజారేకు ఏమి చెప్పాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది.   అయితే అందుకు కారకుడు మాత్రం అరవింద్ కేజ్రీవాల్ అనే చెప్పక తప్పదు. ఏవిధంగా అంటే, ఇటీవల డిల్లీ ఎన్నికల ప్రచార సందర్భంగా అయన డిల్లీలో బీజేపీకి సమర్దుడయిన నాయకుడు లేడంటూ పదేపదే విమర్శలు గుప్పించారు. దానితో మేల్కొన్న బీజేపీ కిరణ్ బేడీని పార్టీలోకి ఆహ్వానించింది. అంతే కాకుండా ఆమెనే పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి అరవింద్ కేజ్రీవాల్ పైనే పోటీకి దింపే ఆలోచనలో ఉందిప్పుడు. అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి సరయిన నేత లేడని ఎద్దేవా చేయకపోయుండి ఉంటే బహుశః బీజేపీకి కిరణ్ బేడీని పార్టీలో చేర్చుకోవాలనే ఆలోచన బీజేపీకి కలిగేది కాదేమో?   మంచి పోలీస్ ఆఫీసర్ అని పేరు గల ఆమెను ఇప్పుడు పార్టీలో చేర్చుకోవడమే కాకుండా అరవింద్ కేజ్రీవాల్ పైనే పోటీకి దింపాలని భావిస్తోంది. ఒకవేళ ఆమె తనపై పోటీ చేసినట్లయితే అరవింద్ కేజ్రీవాల్ సైతం ఆమెను వేలెత్తి చూపే సాహాసం చేయలేరు. కానీ ఆమె మాత్రం ఆయన 49రోజులలోనే ముఖ్యమంత్రి పదవి వదులుకోవడం గురించి విమర్శలు గుప్పించవచ్చును. బీజేపీలో ఆమె చేరికతో అరవింద్ కేజ్రీవాల్ పని కొరివితో తల గోక్కున్నట్లయింది.   డిల్లీలో రెండు ప్రధాన సమస్యలున్నాయి. వాటిలో మొట్ట మొదటిది మహిళలపై నానాటికి పెరిగిపోతున్న హత్యాచారాలు. రెండవది త్రాగు నీటి సమస్య. ఆ రెంటినీ కిరణ్ బేడీ చాలా సమర్ధంగా ఎదుర్కొనే శక్తి ఉందని అందరికీ తెలుసు. కనుక ఇక రోట్లో తలపెట్టేక రోకటి పోటుకి భయపడితే మాత్రం ఏమీ ప్రయోజనం లేదని “ఆమె రాజకీయాలలో చేరడాన్ని స్వాగతిస్తున్నాని” అరవింద్ కేజ్రీవాల్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసారు. రేపు జయప్రద కూడా బీజేపీలో చేరినట్లయితే, అరవింద్ కేజ్రీవాల్ పని నారీ నారీ నడుమ మురారి అయిపోతుంది.

లక్ష నాగళ్లతో దున్నిస్తానని నేనెప్పుడన్నాను?

  ఇదివరకు అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి రామోజీ ఫిలిం సిటీని ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మించారనే వంకతో లోపల కొన్ని ప్రదేశాలలో రోడ్లను, చెట్లను ప్రొక్లేయిన్లు అవీ పెట్టి కూల్చి వేయించారు. కానీ అందుకు అసలు కారణాలు మాత్రం వేరే ఉన్నాయని అందరికీ తెలిసిందే.   ఆ తరువాత తెలంగాణా ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్న సమయంలో తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కూడా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్లతో దున్నించి చదును చేస్తానన్నట్లు వార్తలు వచ్చేయి. కానీ కొన్ని రోజుల క్రితం ఆయన స్వయంగా రామోజీ ఫిలిం సిటీకి రామోజీ రావును కలిసి రావడమే కాకుండా ఆయన నిర్మించబోయే ‘ఓం సిటీ’ ని తెగ మెచ్చుకొన్నారు.   ఇదే విషయాన్నీ ప్రస్తావిస్తూ నిన్న ఒక విలేఖరి కేసీఆర్ ను ప్రశ్నించినప్పుడు “నేను ఆ మాట ఎప్పుడన్నాను? నేను అన్నప్పుడు నువ్వు విన్నావా? మీకు తోచినది వ్రాసేసుకొని మళ్ళీ నన్ను ప్రశ్నించడం ఏమిటి? అర్ధం లేని మాటలు మాట్లాడకు. అసలు నువ్వు ఏ పత్రిక నుండి వచ్చేవు? అంటూ ఆ విలేఖరిపై ఆయన కోపంగా విరుచుకుపడ్డారు. రామోజీ ఫిలిం సిటీలో ఒక్క కుంట ప్రభుత్వ భూమి కూడా లేదని స్పష్టం చేసారు. అంతే కాదు రామోజీ ఫిలిం సిటీ రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు. తాము పెట్టుబడుల కోసం విదేశాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు, రామోజీ రావు వందల కోట్లు పెట్టుబడి పెట్టి రాష్ట్రంలో ‘ఓం సిటీ’ నిర్మిస్తానంటే తామెందుకు అభ్యంతరం పెడతామని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే వారు ఆంధ్రావాళ్ళా లేదా తమిళ్ వాళ్ళా లేదా మహారాష్ట్రా వాళ్ళా అనే విషయం తాము పట్టించుకోబోమని అందరికీ తమ ప్రభుత్వం సాదరంగా ఆహ్వానం పలుకుతుందని అన్నారు.   అందువలన మిగిలిన మీడియా, వ్యక్తులు, సంస్థల పట్ల కేసీఆర్ వైఖరి ఏవిధంగా ఉన్నప్పటికీ రామోజీకి, ఆయన సంస్థల పట్ల చాలా సానుకూలంగానే ఉందని స్పష్టం అవుతోంది. అయితే ఆంధ్రా వాళ్ళను, మీడియాను అమితంగా ద్వేషించే ఆయన ఒక్క రామోజీపట్ల హటాత్తుగా తన వైఖరి ఎందుకు మార్చుకొన్నారు? అనే ప్రశ్నకు వారే జవాబు చెప్పాల్సి ఉంటుంది.

ఆంధ్రా నుండి విద్యుత్ కొనుగోలుకు కేసీఆర్ కి అహం అడ్డువస్తోందా? లోకేష్

  తెలంగాణా రాష్ట్రం నేటికీ విద్యుత్ కొరతతో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ సమస్యను అధిగమించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణా రాష్ట్రంలో రామగుండం, నల్గొండ తదితర ప్రాంతాలలో ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థల స్థాపనకు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అది ఇంటికి నిప్పు అంటుకొన్నాక నుయ్యి తవ్వడం మొదలుపెట్టినట్లేనని భావించవచ్చును. అందుకే రైతులను మరో మూడేళ్ళు ఆగమని చెపుతున్నారాయన.   తెలంగాణా ప్రభుత్వం వివిధ రాష్ట్రాలతో విద్యుత్ సరఫరా కోసం ఒప్పందాలు చేసుకొంది. కానీ పొరుగునున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ తీసుకొనే ఆలోచన మాత్రం చేయలేదు. తెలంగాణాలో తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొన్న సమయంలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 330 మెగావాట్స్ విద్యుత్ ఇచ్చేందుకు సిద్దమని తెలిపారు. కానీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం స్పందించలేదు కూడా.   ఒకవైపు విద్యుత్ లేక పంటలకు నీళ్ళు అందక రాష్ట్రంలో అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నా కూడా కేసీఆర్ ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి విద్యుత్ తీసుకొనేందుకు ఇష్టపడలేదు. కేసీఆర్ కి అహం అడ్డు వస్తోందా? లేకపోతే ఆంధ్రా పాలకులు, ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు పట్ల ఉన్న అకారణ ద్వేషం కారణంగా విద్యుత్ తీసుకొనేందుకు అయిష్టత చూపుతున్నారా? అనేది ఆయనకే తెలియాలి.   ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ఇస్తామని చెపుతున్నా స్వీకరించేందుకు ఇష్టపడని కేసీఆర్ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తమకు న్యాయంగా రావలసిన విద్యుత్ ఇవ్వకుండా కుట్రలు పన్నుతోందని ఎదురు దాడి చేస్తూ తన ప్రజలని మభ్యపెడుతూ అదే ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని వారి ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేయడం ఆయన రాజకీయ చతురతకి మంచి నిదర్శనం. కానీ దాని వలన తెలంగాణా ప్రజలకి లాభం కలిగి ఉండి ఉంటే అందరూ సంతోషించే వారు కానీ ఆయన వైఖరి వలన తెలంగాణా ప్రజలు, రైతులే అందరి కంటే ఎక్కువగా నష్టపోతున్నారనేది కాదనలేని సత్యం.   ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుండి ‘కేసీఆర్ & కో’ విద్యుత్ కొనుగోలు చేయకపోవడానికి కారణం ఏమిటి? అహం అడ్డు వస్తోందా? ఆయన అహానికి తెలంగాణా రాష్ట్రం బలయిపోతోంది,” అని నారా లోకేష్ ట్వీటర్ లో మెసేజ్ పెట్టారు.   కానీ అందుకు ఇంకా మరి కొన్ని ఇతర కారణాలు కూడా కనబడుతున్నాయి. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలు రెండూ ఒకేసారి ఏర్పడ్డాయి. చంద్రబాబు నాయుడు చొరవ, కృషి, పట్టుదల కారణంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ సంక్షోభం నుండి బయటపడటమే కాకుండా ఇప్పుడు తెలంగాణాకు కూడా విద్యుత్ సరఫరా చేయగల పరిస్థితికి చేరుకొంది. కానీ కేవలం కేసీఆర్ వైఖరి కారణంగానే తెలంగాణా రాష్ర్టంలో నేటికీ విద్యుత్ సంక్షోభం నెలకొని ఉందిఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి విద్యుత్ తీసుకోవడం అంటే కేసీఆర్ తన వైఫల్యాన్ని తనే ఇంటి కప్పు మీదకు ఎక్కి మరీ ప్రకటించుకొన్నట్లవుతుంది. అది రాజకీయంగా ఆయనకు ఇబ్బందికరంగా మారవచ్చును. ప్రతిపక్షాల ముందు మరింత చులకన అయ్యే ప్రమాదం ఉంది.   పైగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుండి విద్యుత్ కొనుగోలు చేసినట్లయితే ఆర్ధికంగా ఇబ్బందులలో ఉన్న ఆ రాష్ట్రానికి దాని వలన ప్రయోజనం కూడా కలుగుతుంది. ఆంద్ర ప్రభుత్వాన్ని పాలకులను ద్వేషిస్తున్న కేసీఆర్ అందుకు ఇష్టపడకపోయుండవచ్చును. అందుకే ఎక్కడో వందల కిమీ దూరంలో ఉన్ననైవేలీ, ఝాఝార్, ధబోల్, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాల నుండి విద్యుత్ కోసం ప్రయత్నిస్తున్నారు తప్ప పొరుగునున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుండి విద్యుత్ తీసుకొనేందుకు సుతరాము ఇష్టపడటంలేదు. అయితే దానివల్ల కూడా మళ్ళీ తెలంగాణా ప్రజలపైనే అదనపు భారం పడుతుంది. సుదూరప్రాంతాల నుండి తెలంగాణా విద్యుత్ సరఫరాకు అదనపు ఖర్చు ఎలాగూ ఉంటుంది. పైగా ఛత్తీస్ ఘర్ వంటి రాశ్రాల నుండి విద్యుత్ సరఫరా అవ్వాలంటే కొత్తగా ట్రాన్స్ మిషన్ లైన్లు కూడా వేయవలసి ఉంటుంది. అందుకు కేంద్రం అనుమతులు మంజూరు చేయాలి. మావోయిష్టుల ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల గుండా అవి నిర్మించాల్సి ఉంటుంది. కనుక దానికి ఎన్ని సం.లు పడతాయో ఎవరికీ తెలియదు. కారణాలు ఏమయినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి వల్ల అంతిమంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకే నష్టం జరుగుతుంది. అదే నారా లోకేష్ కూడా చెపుతున్నారు.

బీజేపీ ఆంద్ర తెలంగాణా టార్గెట్ 45/30 లక్షలు

  ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల పర్యటనకు వచ్చిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రెండు రాష్ట్రాలలో పార్టీ సభ్యత్వ లక్ష్యాలు స్థానిక నేతలకు అందనంత ఎత్తులో ఉంచారు. ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణాలో ఆ పార్టీ కొంత బలంగానే ఉందని చెప్పుకోవచ్చును. కానీ అక్కడ ఆశించినంతగా సభ్యత్వ నమోదు జరుగలేదు. ఇంతవరకు 8 లక్షలు మంది మాత్రమే కొత్తగా ఆ పార్టీలో చేరినట్లు సమాచారం. కానీ అమిత్ షా అక్కడి నేతలకి ఏకంగా 30 లక్షల భారీ లక్ష్యం నిర్దేశించారు. మొబైల్ ఫోన్లు, ఆన్ లైన్ ద్వారానే సభ్యత్వ నమోదు కార్యక్రమం చేప్పట్టాలని ఆయన సూచించడం మరో అగ్నిపరీక్షగా మారే అవకాశం ఉంది.   ఇక ఈరోజు విజయవాడలో పార్టీ నేతలతో సమావేశమయిన ఆయన వారికి ఏకంగా 45లక్షల మంది కొత్త సభ్యులను చేర్చాలని నిర్దేశించారు. అయితే ఆయన రాష్ట్ర పర్యటన ఖరారు అయ్యే వరకు సభ్యత్వ నమోదు ప్రక్రియను పెద్దగా పట్టించుకోని ఆ పార్టీకి చెందిన రాష్ట్ర నేతలకు ఆయన ఇంత భారీ లక్ష్యం నిర్దేశించడం వలన ఏమయినా ప్రయోజనం ఉంటుందా? అని ఆలోచించక తప్పదు. ఇటువంటి కార్యక్రమాలని చాలా ప్రణాళికాబద్దంగా నిర్వహించే నేర్పు ఉన్న, బలమయిన క్యాడర్ ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంతో శ్రమించి రెండు రాష్ట్రాలలో కలిపి మొత్తం 50 లక్షల మందిని కొత్తగా పార్టీలో చేర్చుకోగలిగింది. కానీ బీజేపీ నేతలలో అటువంటి పట్టుదల, ప్రణాళిక, క్యాడర్ సపోర్ట్ లేకపోయినా రెండు రాష్ట్రాలలో కలిపి 75లక్షలు సాధించాలనుకోవడం విచిత్రమే. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తెదేపా అధికారంలో ఉంది కనుక ఆ పార్టీ దాదాపు 40 లక్షల మందిని పార్టీలోకి ఆకర్షించగలిగింది. కానీ రాష్ట్రంలో బలమయిన క్యాడర్ లేని బీజేపీ ఏవిధంగా 45 లక్షల లక్ష్యం చేరుకొంటుందో ఎవరికీ తెలియదు. “అంత భారీ లక్ష్యాలు పెట్టుకొంటే అందులో కనీసం పావు వంతు సాధించిన మంచిదే కదా!’ అనే ఆలోచనతో పెట్టుకొన్నారేమో!

విశాఖలో బిట్స్ పిలానీ సంస్థ ఏర్పాటు

  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ నగరాన్ని స్మార్ట్ సిటీగా మలిచేందుకు ఎంచుకోవడంతోనే దానికి మహర్దశ మొదలయిందని చెప్పవచ్చును. కానీ మధ్యలో హూద్ హూద్ తుఫాను వచ్చి నగరాన్ని అల్లకల్లోలం చేసి పోయింది. కానీ అంతా మన మంచికే అనుకోక తప్పదు. తుఫాను కారణంగా దెబ్బతిన్న విద్యుత్ లైన్ల స్థానంలో భూగర్భ విద్యుత్ లైన్లు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు చేస్తోంది. మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి ప్రయోగం విశాఖ నగరంలోనే అమలవుటోంది. తరువాత కొత్తగా నిర్మించబోతున్న రాజధాని నగరంలో అమలవుతుంది.   ఇక విశాఖ నగరాన్ని ఐ.టీ.హబ్ గా తీర్చి దిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టిగానే కృషి చేస్తున్నారు. నగరం శివార్లలో గంభీరం అనే ప్రాంతంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ ఏర్పాటుకు జోరుగా సన్నహాలు జరుగుతున్నాయి. ఈనెల ఐదున కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ చేతుల మీదుగా దాని శంఖుస్థాపన జరుగవలసింది కానీ భూసేకరణ విషయంలో స్థానిక రైతుల నుండి అభ్యంతరాలు వ్యక్తం అవడంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది. కానీ తాత్కాలికంగా ఆంద్ర విశ్వవిద్యాలయంలో గల ఆంధ్రాబ్యాంక్ భవనంలో ఐ.ఐ.యం. కోర్సుల శిక్షణ ఆరంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.   నగరంలో మూడు ప్రధాన ప్రాంతాలను కలుపుతూ మెట్రో రైల్ నిర్మాణానికి సర్వే కూడా మొదలయింది. మరొక ఆరు నెలలలో నిర్మాణపనులు మొదలయ్యే అవకాశం ఉంది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసిన ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థల అధినేత ఆదిత్య మంగళం బిర్లా తమ బిట్స్ పిలానీ అనుబంధ సంస్థను విశాఖ నగరంలో ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. దానితో బాటే ఒక అంతర్జాతీయ పాటశాలను కూడా ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. వాటికి అవసరమయిన భూములను ఇచ్చేందుకు చంద్రబాబు సంసిద్దత వ్యక్తం చేసారు. కనుక ఇక విశాఖ నగరానికి బిట్స్ పిలానీ కూడా వచ్చేస్తునట్లే భావించవచ్చును. ఇక రైల్వే జోన్ కూడా వచ్చేస్తే విశాఖవాసులు చాలా సంతోషిస్తారు. కానీ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రమంతా విస్తరించడం కూడా చాలా అవసరం.

త్వరలో తెలంగాణాలో మరో తెలుగు దినపత్రిక

  ఆంద్రప్రదేశ్ రాష్ట్రం విడిపోనంత వరకు కూడా రెడ్డి, కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే రాష్ట్ర రాజకీయాలను శాసిస్తూవచ్చేరు. కానీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణాలో వెలమ సామాజిక వర్గానికి చెందిన కేసీఆర్, ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పగ్గాలు చెప్పట్టడం, రెడ్డి సామాజిక వర్గానికి బలమయిన కోట వంటి కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాలలో తునాతునకలయిపోవడంతో అంతవరకు దానినే నమ్ముకొన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలందరి పరిస్థితి అకస్మాత్తుగా తలక్రిందులయిపోయింది. వారి సామాజిక వర్గానికే చెందిన జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైకాపా ఉన్నప్పటికీ, అందులో ఉన్నవారే ఆయన ధోరణితో విసిగెత్తిపోయి ఒకరొకరుగా బయట పడుతుండటంతో వారు ఎటువైపు వెళ్ళాలో తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.   రాష్ట్ర విభజన తరువాత తప్పకుండా ఇటువంటి పరిస్థితి తలెత్తుతుందనే ఆలోచనతోనే తమకు మంచి బలం ఉన్న రాయలసీమను తెలంగాణాతో కలిపి రాయల తెలంగాణా ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చేరు. కానీ తెరాస నేతలు, తెలంగాణా ప్రజలు అందుకు గట్టిగా అభ్యంతరాలు చెప్పడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆ ప్రతిపాదన పక్కనపడేసి రాష్ట్రాన్ని ఆంద్ర, తెలంగాణాలుగా విభజించేసి చేతులు దులుపుకొంది. దానివల్ల కేవలం కాంగ్రెస్ పార్టీయే కాదు దానినే నమ్ముకొన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతల రాజకీయ భవిష్యత్ కూడా అగమ్యగోచరంగా మారింది.   ఆంధ్రాలో ఆ వర్గానికి చెందినవారిని బీజేపీలోకి ఆకర్షించి వారి అండతో రాష్ట్రంలో బలపడాలని ఆ పార్టీ భావిస్తున్నందున వారికి బీజేపీ ఆహ్వానం పలుకుతోంది. అయితే బీజేపీకి ఉన్న మతతత్వముద్ర కారణంగా నేటికీ ఆ పార్టీలో చేరేందుకు కొందరు వెనుకాడుతున్నారు. ఆంధ్రాలో నేతలు బీజేపీవైపు చూస్తున్నప్పటికీ, తెలంగాణాలో ఆ వర్గానికి చెందిన నేతలు మాత్రం ఎందుకో అసలు బీజేపీ వైపు కన్నెత్తి చూడటం లేదు.   ఇంతవరకు రాష్ట్ర రాజకీయాలను శాసించిన వారు తమకున్న ఆ ప్రత్యేక గుర్తింపు నిలుపుకోవాలనే బలమయిన కోరికతో ఉన్నారు. తెలంగాణా రాజకీయాలలో తమ గొంతు బలంగా వినిపించాలనే ఉద్దేశ్యంతో వారిలో కొంతమంది కలిసి త్వరలో (ఉగాది నాటికి) ఒక తెలుగు దినపత్రికను తీసుకురాబోతున్నట్లు తాజా సమాచారం. అందుకోసం రూ.50 కోట్ల పెట్టుబడితో తెలంగాణాలో మూతపడిన ఒక పత్రిక కార్యాలయాన్ని అందులో యంత్రాలను అన్నిటినీ కొనుగోలు చేసి, పత్రిక రిజిస్ట్రేషన్ కార్యక్రమం వగైరా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణాకు చెందిన ఒక సీనియర్ జర్నలిస్టుని సంపాదకుడిగా ఎంచుకొన్నట్లు తెలుస్తోంది. కానీ తెలంగాణాలో బలంగా నిలద్రొక్కుకొనున్న నాలుగయిదు తెలుగు దిన పత్రికలతో పోటీపడి తట్టుకొని నిలబడవలసి ఉంటుంది.

వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్టులో కదలిక

  ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో వైజాగ్, విజయవాడ మరియు తిరుపతి నగరాలలో నిర్మించబోయే మెట్రో రైల్ ప్రాజెక్టులకు ఆ రంగంలో విశేష అనుభవం, మంచి నైపుణ్యం ఉన్న ఈ శ్రీధరన్ సలహాదారుగా నియమించుకొన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన కొన్ని రోజుల క్రితం విజయవాడ, వైజాగ్ నగరాలలో విస్తృతంగా పర్యటించిన తరువాత, విజయవాడ నగరం మధ్యలో ఒక మెట్రో రైల్వే లైన్, వైజాగ్ నగరంలో అన్ని ప్రాధాన కూడళ్ళను కలిపే విధంగా మూడు మెట్రో రైల్వే లైన్లు నిర్మించాలని ప్రతిపాదించారు. ఆరు నెలలలో వైజాగ్ మరియు విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల సమగ్ర నివేదికలు అందజేసి, రెండు చోట్ల ఒకేసారి నిర్మాణం ప్రారంభించాలనుకొంటున్నట్లు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలిపారు. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టును మూడేళ్ళలో పూర్తిచేసి ఇస్తానని హామీ కూడా ఇచ్చారు.   శ్రీధరన్ గుర్తించిన మూడు మెట్రో రైల్వే లైన్ మార్గాలపై సమగ్ర అధ్యయనం చేసేందుకు డిల్లీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కార్పోరేషన్ కి చెందిన నలుగురు నిపుణుల బృందం ఈరోజు వైజాగ్ రానుంది. వారు మెట్రో రైల్ ఏర్పాటుకు అవసరమయిన భూసేకరణ, ఏఏ ప్రాంతాలలో మెట్రో రైల్వే స్టేషన్లను ఏర్పాటు చేయాలి? వంటి అన్ని అంశాలపై అధ్యయనం చేస్తారు. వైజాగ్ లో పారిశ్రామిక ప్రముఖ ప్రాంతమయిన గాజువాక నుండి యన్.ఏ.డి. జంక్షన్, రైల్వే స్టేషన్, హనుమంతవాక, మద్దిలపాలెం, ఆర్టీసీ కాంప్లెక్, జగదాంబ జంక్షన్ మీదుగా నగరం కొస నుండే పాత పోష్టాఫీసు ప్రాంతం వరకు మూడు మెట్రో రైల్వే లైన్లను నిర్మించి వాటిని ప్రధాన కూడళ్ళలో అనుసంధానం చేయాలని శ్రీధరన్ ప్రతిపాదించారు.   ఈరోజు నగరానికి వస్తున్న నిపుణుల బృందం ఆ మార్గాలలో మెట్రో రైల్వే లైన్ నిర్మాణం కోసం అధ్యయనం చేయనున్నారు. అన్నీ సవ్యంగా సాగినట్లయితే బహుశః వచ్చే దసరా పండుగ సమయానికి రెండు చోట్ల నిర్మాణపనులు ప్రారంభం అవవచ్చును.

ఏపీలో కూడా గిరిజన బెటాలియన్ ఏర్పాటు?

  మావోయిష్టుల ప్రభావం అధికంగా ఉన్న చత్తిస్ ఘడ్ రాష్ట్రంలో వారిని ఎదుర్కోవడానికి అక్కడి ప్రభుత్వం అడవులలో నివసించే గిరిజన యువకులతో ‘సాల్వాజుడుం’ అనే గిరిజన పోలీస్ బెటాలియన్ తయారుచేసుకొని వారితోనే మావోయిస్టులను మట్టుబెట్టాలని చూసింది. కానీ వారు మావోయిస్టులను మట్టుబెట్టలేకపోయినా మావోయిస్టులు మాత్రం వారిపై ప్రతీకారం తీర్చుకొనేందుకు వారి కుటుంబ సభ్యులను, ఇన్ఫార్మర్ల నెపంతో అమాయకులయిన గిరిజనులను కిరాతకంగా హత్యలు చేయడంతో ఆ ‘సల్వాజుడుం’ ఐడియా బెడిసికొట్టింది. అంతే కాదు ఆ సల్వాజుడుం సృష్టికర్త ‘మహేంద్ర కర్మ’పై పగపట్టిన మావోయిస్టులు ఆయనను హతమార్చే ప్రయత్నంలో చేసిన దాడిలో ఒక మాజీ కేంద్రమంత్రితో సహా అనేక మంది కాంగ్రెస్ నేతలు, పోలీసులు దాదాపు డబ్బై మంది ఒకేసారి చనిపోయారు.   ఇదంతా తెలిసి కూడా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఆ విఫల ప్రయోగాన్ని రాష్ట్రంలో కూడా అమలుచేయాలని సిద్దమవుతోంది. అయితే దానికి వేరే బలమయిన కారణాలున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా అనేక వందల గిరిజన గ్రామాలు ఆ ప్రాజక్టు క్రింద మునిగిపోతాయి. ఆ కారణంగా నిర్వాసితులయిన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వంపై ఆగ్రహం కలగడం సహజం. ఇదే అదునుగా వారిలో యువకులను మావోయిస్టులు ఆకర్షించే ప్రమాదం ఉంది. కనుక వారినందరినీ ప్రభుత్వమే చేరదీసి వారితో ఒక గిరిజన పోలీస్ బెటాలియన్ (సాల్వాజుడుం) ఏర్పాటు చేయడం ద్వారా వారి కుటుంబాలను ఆదుకోవచ్చును. ఈ గిరిజన పోలీస్ బెటాలియన్ ఏర్పాటు ద్వారా శ్రీకాకుళం, విజయనగరం,విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాలలోని గిరిజన ప్రాంతాలలో తమ ఉనికిని చాటు కొనేందుకు విద్వంసానికి పాల్పడుతున్న మావోయిస్టులను నియంత్రించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.   ఈ గిరిజన బెటాలియన్ కోసం ప్రత్యేకంగా రంపచోడవరం లేదా పాడేరు ప్రాంతాలలో ఎక్కడో ఒకచోట ప్రధాన కార్యాలయం, శిక్షణా సంస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గిరిజనులకు ఈ విధంగా ఉపాధి కల్పించాలనే ప్రభుత్వ ఆలోచన బాగానే ఉంది. కానీ రాష్ట్రంలో కూడా మళ్ళీ ఛత్తీస్ ఘడ్ చేదు అనుభవాలు పునరావృతం కాకుండా ఏవిధంగా నివారించాలో ముందుగానే ఆలోచించితే ఆ తరువాత ప్రభుత్వాన్ని ఎవరూ తప్పు పట్టే అవకాశం ఉండదు.