కొణతాలకు సేమ్ టు సేమ్ అదే ట్రీట్‌మెంట్

  ఆలూ లేదు చూలూ లేదు అల్లుడిపేరు సోమలింగం అన్నట్లుగా మాజీ వైకాపా నేత కొణతాల రామకృష్ణ త్వరలో తెదేపాలో జేరబోతున్నట్లు వార్తలు విన్నఅనకాపల్లిలో తెదేపా కార్యకర్తలు కొందరు పట్టణంలో ప్రధాన కూడలి వద్ద ఈరోజు ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేసారు. ఇంతకాలం తమ పార్టీని, అధినేత చంద్రబాబును కూడా తిట్టిపోసిన కొణతాలను పార్టీలో చేర్చుకోవద్దంటూ వారు అధిష్టానానికి ఫ్యాక్స్ ద్వారా లేఖలు కూడా పంపారు. తామెంతో కష్టపడి కొణతాల సోదరుడుని ఎన్నికలలో ఓడిస్తే, ఇప్పుడు అన్నదమ్ములిరువురూ దొడ్డి దారిన పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.   ఇదివరకు తెదేపా నేత దాడి వీరభద్ర రావు తెదేపాను వీడి వైకాపాలో చేరుతున్నప్పుడు కొణతాల వర్గీయులు కూడా ఇదేవిధంగా నిరసనలు తెలియజేసారు. ఇప్పుడు వారికి కూడా సరిగ్గా ఇటువంటి పరిస్థితే ఎదురవడం చాలా విచిత్రం. దాడి వీరభద్ర రావు ఎన్నికలలో వైకాపా ఓడిపోగానే పార్టీ నుండి బయటపడితే, ఆయనను వైకాపాలో చేర్చుకొన్నందుకు పార్టీపై అలిగిన కొణతాల కూడా ఆయన తరువాత పార్టీని వీడారు. దాడి వైకాపాను వీడిన తరువాత తిరిగి తెదేపాలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.   కొణతాల బీజేపీలో చేరుతారని చాలా వార్తలు వచ్చేయి. కానీ ఇప్పుడు కొణతాల కూడా తెదేపాలోకి చేరాలనుకొంటున్నట్లు వార్తలు రావడం కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. అయితే ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేయమని కార్యకర్తలను ఎవరు ప్రేరేపించారో? అయితే నిప్పు లేనిదే పొగ రాదన్నట్లుగా కొణతాలకు తెదేపాలో చేరే ఉద్దేశ్యం లేకపోతే ఆయన దిష్టి బొమ్మలు ఎవరయినా ఎందుకు దగ్ధం చేస్తారు? అని ఆలోచిస్తే ఆయన తెదేపాలోకి ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నారనే అనుమానం కలుగక మానదు.

కోట్లు పోసి కొనుకొన్నా అక్కడ ఆక్యుపెన్సీ నిల్?

  రాష్ట్ర విభజన తరువాత చూసుకొంటే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కాస్తో కూస్తో అభివృద్ధి చెందిన నగరంగా విశాఖపట్నం ఒక్కటే కనబడుతోంది. మున్ముందు ఐటీ, సినీ, పరిశ్రమలు విశాఖకు తరలివచ్చే అవకాశాలు కనబడుతుండటంతో అందరూ అక్కడే ఇళ్లు, స్థలాలు వగైరాలు కొనేందుకు ఆసక్తి చూపుతుండటంతో నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చాలా నిలకడగా సాగుతోంది.   విశాఖకు చక్కటి సముద్రతీరం దానినానుకొని పక్కనే కొండలు ఉండటం ప్రత్యేక ఆకర్షణగా పేర్కొనవచ్చును. దానిని సొమ్ము చేసుకొనే ప్రయత్నంలో ఉడా సంస్థ రుషికొండపై 200 లగ్జరీ విల్లాలు కట్టారు. మరో 200 ఇళ్లు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయి. మొదటి దశలో నిర్మించిన ఇళ్ళలో ఒక్కో ఇల్లు కనీసం కోటి నుండి ఒకటిన్నర కోట్ల వరకు అమ్మగా రెండవ దశలో నిర్మితమవుతున్న ఇళ్ళల్లో ఒక్కోటి రెండున్నర కోట్లు వరకు పలుకుతోంది. మున్ముందు విశాఖకు మంచి భవిష్యత్ ఉందనే ఆలోచనతో ఎక్కడో దేశ విదేశాలలో ఉన్నవారు కూడా అక్కడ ఇళ్ళు కొనుగోలు చేసారు. ఐటీ కంపెనీలు నగరానికి భారీగా తరలివస్తే వాటికి అతి సమీపంలో కట్టిన ఆ ఇళ్లకి మంచి డిమాండ్ ఉంటుందనే ఆలోచనతో కొన్నవారు చాలా మందే ఉన్నారు. అంత డబ్బు పోసి కొన్న ఇళ్ళకి కనీసం నెలకి లక్ష రూపాయలు ఆద్దె వస్తుందని ఆశిస్తున్నారు.   కానీ మొదటి దశ ఇళ్ళ నిర్మాణం, అమ్మకాలు పూర్తయి దాదాపు ఐదేళ్ళవుతున్నా వాటిలో ఇంతవరకు కేవలం 25-30 శాతం ఇళ్ళల్లో మాత్రమే నివాసముంటున్నారు. మిగిలిన ఇళ్ళన్నీ నేటికీ ఖాళీగా పడున్నాయి. నగరంలోకి చేరుకొనేందుకు కొండమీదకి సరయిన రవాణా సదుపాయం, వీధి దీపాలు, కిరాణా, కూరలు వంటి నిత్యావసర వస్తువులు అమ్మే షాపింగ్ సెంటర్లు లేకపోవడంతో అక్కడకి వచ్చి నివసించేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. ఆ కారణంగా ఎవరూ అక్కడ అంత అద్దె చెల్లించి దిగేందుకు ఇష్టపడకపోవడంతో బ్యాంకు రుణాలు తీసుకొని ఆ ఇళ్ళు కొనుకొన్నవారు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. అయితే ఇవేవీ పట్టనట్లు మరో 200 ఇళ్లు చకచకా నిర్మాణం చేస్తున్నారు.   అసలు నగరంలో కొండల మీద నెలకొల్పిన ఐటీ కంపెనీలే కనీస సదుపాయాలు లేక నడిపేందుకు ఆపసోపాలు పడుతుంటే వాటిని నమ్ముకొని మరో కొండ మీద ఇంత భారీగా ఇళ్లు కట్టేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. వీటికి సమీపంలోనే శ్రీరాం గ్రూప్ వారు కూడా పనోరమా హిల్స్ పేరిట భారీ టవున్ షిప్ నిర్మిస్తున్నారు. ఉడా ఇళ్ళకి ఎదురవుతున్న ఆ సమస్యలని చూసి శ్రీరాం సంస్థ ముందుగానే జాగ్రత్త పడుతునప్పటికీ అవి కూడా నగరంలో ఐటీ రంగం అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే కట్టబడుతున్నాయి కనుక వాటికీ ప్రస్తుతం ఇటువంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయి.   నగరంతో నేరుగా రవాణా సదుపాయాలుండి, అన్ని విధాల అభివృద్ధి చెందిన మధురవాడ ప్రాంతం, త్వరలో పూర్తి స్థాయిలో ఐటీ హబ్ గా మారబోతున్నందున అక్కడ మాత్రం ఇళ్లు, స్థలాలు బాగానే అమ్ముడవుతున్నాయి. అయితే మున్ముందు మరింత అధిక ధరలు పలుకుతాయనే ఉద్దేశ్యంతో ఆ ప్రాంతంలో స్థలాలు కొనుకొన్నవారు మాత్రం వాటి అమ్మకానికి తొందరపడటం లేదు. నగరానికి ఐటీ, చిత్ర సీమలు రెండూ తరలివచ్చినట్లయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం మరింత పుంజుకొంటుంది. ఈ అభివృద్ధికి మరో కోణం కూడా ఉంది. రాష్ట్ర విభజన తరువాత విశాఖనగరానికి అనేక ప్రాజెక్టులు ప్రకటించడంతో అవింకా రాకముందే నగరంలో ఇళ్ళ అద్దెలు చాల భారీగా పెరిగిపోవడంతో మధ్యతరగతి జీవులు అల్లలాడిపోతున్నారు.

‘జబర్దస్త్’ టీమ్ పత్తిత్తులా?

  ఈటీవీలో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ కామెడీ షోలో ఈమధ్య ఓ ఎపిసోడ్‌లో గౌడ మహిళను కించపరిచే విధంగా చూపించారు. దానికి స్పందించిన గౌడ యువకులు అందులో నటించిన వేణు అనే కమెడియన్‌ని చావబాదారు. దాంతో కొంతమంది సినీ, టీవీ నటీనటులు నిరసన కార్యక్రమం చేపట్టారు. వేణు మీద దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జబర్దస్త్ టీమ్‌లో వున్నవారైతే ‘‘మేం నవ్విస్తుంటే మమ్మల్ని కొడతారా? ఇదెక్కడి న్యాయం’’ అని ఆవేదనగా ప్రశ్నించారు. ఒక కమెడియన్ మీద ఇలా దాడి చేసి కొట్టడం తప్పు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలాగే మరోవైపు జబర్దస్త్ ప్రోగ్రాంలోని విచ్చలవిడితనం మీద కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.   ఒకప్పుడు ఈటీవీ అంటే ప్రజల్లో ఒక గౌరవమైన అభిప్రాయం వుండేది. ఆ అభిప్రాయాన్ని మార్చుకునేలా చేసిన ఘనత జబర్దస్త్ ప్రోగ్రాం దక్కించుకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్ ప్రారంభంలో మెల్లమెల్లగా మొదలైన బూతులు, ద్వంద్వార్థాలు ఈమధ్యకాలంలో బాగా పెరిగిపోయాయన్న విమర్శలున్నాయి. జబర్దస్త్‌లోని టీమ్‌లో నవ్వించడం కోసం ఒకరిని మించి మరొకరు బూతులు బాగా ఉపయోగిస్తూ కుటుంబ సమేతంగా చూడలేని పరిస్థితి తెచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జబర్దస్త్‌లోని టీమ్‌లో బూతులు, డబుల్ మీనింగ్‌లు మాట్లాడినప్పుడు ఈ ప్రోగ్రాంకి యాంకర్‌గా వున్న యువతి, జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజా కూడా పగలబడి నవ్వుతూ వుంటారు. వాళ్ళమీద బూతు జోకులు వేసినా కూడా ఇహిహి అని ఇకిలిస్తూ వుంటారు. ఈ ఇకఇకలు పకపకలు జబర్దస్త్‌లో బూతుల ధోరణి పెరిగిపోయిందన్న విమర్శలున్నాయి.   ‘నవ్వించడమే నేరమా‌?... మేం నవ్విస్తుంటే మమ్మల్ని కొడతారా?’ అని ఇప్పుడు జబర్దస్త్ టీమ్ అమాయకంగా ప్రశ్నిస్తోంది. అయితే వాళ్ళు కొట్టడం కంటే ఎక్కువ నష్టాన్ని చేస్తున్నారన్న విషయాన్ని మరచిపోతున్నారు. నవ్వించే నెపంతో సమాజంలోని ఎన్నో వర్గాలను వాళ్ళు కించపరుస్తూ స్కిట్లు రూపొందిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పిల్లలు చూసే ప్రోగ్రాములో వాళ్ళు గుప్పిస్తున్న బూతులు సమాజానికి ఎంత నష్టం చేస్తాయో వాళ్ళు గ్రహించాలని పలువురు అంటున్నారు. సినిమాలకి సెన్సార్ అనేది ఒకటి వుంటుంది. టీవీలకు అలాంటిది లేకపోవడం వల్ల జబర్దస్త్‌లో ఎంతటి బూతు అయినా చూపించేస్తున్నారు. ఏ వర్గం ప్రజల్ని అయినా అవమానించేలా స్కిట్లు రూపొందిస్తున్నారు. మొత్తమ్మీద కమెడియన్ వేణును కొట్టడం ఎంత తప్పో, జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో బూతులు, ఇతరులను కించపరిచే స్కిట్లు ప్రసారం చేయడం కూడా అంతే తప్పన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

తెరాసకి మజ్లిస్ తలాక్ చెప్పబోతోందా?

  బ్రిటిష్ వాడు నేర్పిన ‘విభజించి పాలించు’ అనే ఐడియా వాడికి గుర్తుందో లేదో తెలియదు కానీ మనోళ్ళు మాత్రం దానిని ఔపోసన పట్టేసారని చెప్పవచ్చును. అయితే ఒక్కోసారి అది రాష్ట్ర విభజన వ్యవహారంలా ఎదురు తంతుంటుంది. అయినా దాని మీద మనోళ్ళకి ఉన్న మోజు అంతా ఇంతా కాదు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని భావిస్తే తెరాస వచ్చేసింది. అయితే తెరాస తెలంగాణా రాష్ట్రాన్ని ఏలేస్తున్నప్పటికీ, రాజధాని హైదరబాద్ పై అందునా జి.హెచ్.యం.సి.పై తమ పార్టీకి బొత్తిగా పట్టులేకపోవడం కొంచెం బాధగానే ఉంటుంది. అందుకే జి.హెచ్.యం.సి. పరిధిలో ఓట్లన్నిటికీ పూర్తి పేటెంట్ హక్కులు ఉన్నాయని భావిస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రివర్గంలోకి వచ్చి పడ్డారు, మజ్లిస్ పార్టీతో తెరాసకి దోస్తీ కుదిరింది.   అయితే అంతమాత్రాన్న జి.హెచ్.యం.సి.లో తెరాస పాగా వేసేస్తుందనే గ్యారంటీ లేదు. కనుక తన ప్రత్యర్ధులను బలహీనపరచాలంటే వారు బలంగా ఉన్న వార్డులను రెండు ముక్కలుగానో వీలయితే మూడు ముక్కలుగానో విభజించడమే మంచి పద్ధతని తెరాస భావిస్తుండటంతో ప్రస్తుతం 155 వార్డులను 175 గా పునర్విభజన చేసేందుకు సిద్దమవుతోంది. అందులో మళ్ళీ మహిళలకు 50శాతం కోటా, యస్సీ, ఎస్టీ, బీసీలకు వేర్వేరుగా కోటాలు షరా మామూలే. ఇటువంటివి జీర్ణించుకోవడం ప్రత్యర్ధ పార్టీలకు వీలవుతుందేమో కానీ కేవలం ముస్లిం ప్రజల ఓట్ల మీదనే ఆధారపడిన మజ్లిస్ పార్టీకి చాలా నష్టం కలిగించవచ్చును. అందుకే అది తెరాసపై గుర్రుగా ఉందిపుడు.   ఈ వార్డుల పునర్విభజన, ఆ వంకతో ఎన్నికలు వాయిదా వేసుకొంటూపోవడం ఆ పార్టీకి చాలా కోపం తెప్పిస్తోంది. 155 మంది సభ్యులున్న జి..హెచ్.యం.సి. బోర్డు డిశంబర్ మూడున రద్దయిపోయింది. కనుక తెలంగాణా ప్రభుత్వం జి.హెచ్.యం.సి. కమీషనర్ సోమేశ్ కుమార్ కి ఆ బాధ్యతలు అప్పగించింది. అంటే ఆయన ద్వారా పరోక్షంగా తను అధికారం చెప్పట్టిందని అర్ధమవుతోంది. జి.హెచ్.యం.సి. రద్దయిన తరువాత ఆరు నెలలోగా మళ్ళీ ఎన్నికలు నిర్వహించే వెసులుబాటు ఉంది కనుక ప్రభుత్వం కూడా ఏమీ తొందరపడటం లేదు. అయితే అంతవరకు మజ్లిస్ పార్టీ నేతలు నిరుద్యోగులుగా మిగిలిపోతారు. కనుక మజ్లిస్ పార్టీ నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ తక్షణమే జి.హెచ్.యం.సి. ఎన్నికలు జరపాలని గట్టిగా పట్టుబడుతున్నారు.   ఎన్నికలు ఆలశ్యం జరుగుతున్న కొద్దీ తెదేపా-బీజేపీలు, కాంగ్రెస్, తెరాస పార్టీలు అన్నీ క్రమంగా బలపడితే అసలుకే ఎసరు వస్తుందని మజ్లిస్ బెంగపెట్టుకొంది. అయితే ఆ మాట పైకి చెప్పకుండా జి.హెచ్.యం.సి. ఎన్నికలు జరిగి మళ్ళీ కొత్త సభ్యులు బాధ్యతలు చెప్పట్టేవరకు కేంద్రం నుండి జి.హెచ్.యం.సి.కి రావలసిన నిధుల విడుదల ఆగిపోతుందని, అసలే ఆర్ధిక ఇబ్బందులలో ఉన్న జి.హెచ్.యం.సి. ఇంకా కష్టాలలోకి కూరుకు పోతుందని మజ్లిస్ నేతలు వాదిస్తున్నారు.   కానీ, నిన్నమొన్ననే తలసానిని పార్టీలోకి రప్పించుకొన్న తెరాస, వెంటనే ఎన్నికలు నిర్వహించినా గెలవడం కష్టమని భావిస్తున్నందున ముందుగా జి.హెచ్.యం.సి. పరిధిలో పార్టీ కొంత బలపడిన తరువాత అప్పుడు నిర్వహించడం మేలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందువలన మజ్లిస్ పార్టీని కుష్ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మెట్రో రైల్ అలైన్ మెంటులో మార్పులు చేర్పులు చేసి చూసారు. కానీ ఆ తరువాత కేసీఆర్ ఆర్భాటంగా ప్రకటించిన నగరంలో పేదలకు 125 గజాల స్థలం ఉచితంగా క్రమబద్దీకరణ పట్ల మజ్లిస్ నేతలు గుర్రుగా ఉన్నారు.   మజ్లిస్ పార్టీతో దోస్తీ అంటూనే తెరాస తమను పట్టించుకోవడం లేదని, పైగా తమకే ఎసరు పెట్టే ప్రయత్నాలు చేస్తోందని వారు వాపోతున్నారు. తమను సంప్రదించకుండా వక్ఫ్ బోర్డు స్థలాలను ఆక్రమించిన వారికి భూములు క్రమబద్దీకరిస్తామని చెప్పడాన్ని మజ్లీస్ నేతలు తప్పుపడుతున్నారు. వారి బాధ ఎలా ఉన్నప్పటికీ, జి..హెచ్.యం.సి.పై పూర్తి పట్టు సాధించడమే ధ్యేయంగా తెరాస అడుగులు వేస్తోంది. అందువలన ఏదో ఆనాడు మజ్లీస్ పార్టీ తెరాసకు తలాక్ తలాక్ తలాక్ చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ చెయ్యందుకొన్నా ఆశ్చర్యం లేదు.

తిరుపతి మీద జగన్ కన్ను

  తిరుపతి ఎమ్మెల్యే వెంకట రమణ ఇటీవల అనారోగ్యం కారణంగా కన్నమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో తిరుపతి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి వుంది. తెలుగుదేశం పార్టీకి చెందిన వెంకట రమణ కుటుంబ సభ్యులలో ఒకరిని ఈ స్థానం నుంచి ఏకగ్రీవంగా గెలిపించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శోభా నాగిరెడ్డి మరణం తర్వాత ఆమె కుమార్తె అఖిలప్రియను కూడా రాజకీయ పార్టీలన్నీ ఆళ్ళగడ్డ స్థానం నుంచి ఏకగ్రీవంగా గెలిపించాయి. ఆ సంప్రదాయాన్నే తిరుపతిలోనూ కొనసాగించాలని స్థానిక ప్రజలు భావిస్తున్నారు. వెంకట రమణకు ఇద్దరు కుమార్తెలు వున్నారు. వారిద్దరూ పుట్టు బధిరులు. దాంతో వెంకట రమణ భార్య సుగుణను ఈ స్థానం నుంచి ఏకగ్రీవంగా గెలిపించాలన్న ఆలోచనలు వున్నాయి. విద్యాధికురాలు అయిన సుగుణను ఈ స్థానం నుంచి నిలిపే ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ చేస్తోంది.   ఇంతవరకూ అంతా సజావుగానే వుంది. అయితే ఇక్కడే జగన్ మార్కు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. తిరుపతి స్థానాన్ని తన పార్టీ అకౌంట్లో జమ చేసుకోవడానికి జగన్ అద్భుతమైన తెలివితేటలతో ప్రయత్నిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో వున్న వెంకట రమణ ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికలలో ఆయన వైసీపీ నాయకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి మీద విజయం సాధించారు. వెంకటరమణ తీవ్ర అనారోగ్యం పాలైనప్పటి నుంచి కరుణాకర్‌రెడ్డి బాగా యాక్టివ్ అయిపోయారు. వెంకట రమణను పరామర్శించడం, ఆయన కుటుంబాన్ని ఓదార్చడం, వెంకట రమణ చనిపోయిన తర్వాత మృతదేహాన్ని అందరికంటే ముందుగా సందర్శించడం, ఆయన కుటుంబానికి అండగా నిలుస్తానని అనడం, వెంకట రమణ అంత్యక్రియల్లో పాడె మోయడం లాంటి మంచి పనులన్నీ చేశారు. ఇక జగన్ అయితే వెంకట రమణ తన తండ్రి వైఎస్సార్‌కి ఎంతో సన్నిహితుడని అసెంబ్లీలో చెప్పారు. చాలా మంచి వ్యక్తి అని పొగిడారు. వెంకట రమణను వైద్యానికి సింగపూర్‌కి తీసుకెళ్తే బాగుండని ఆవేదనగా అన్నారు.   వీటితోపాటు ఇంకా అనేక రకాలుగా వైసీపీ నాయకులు వెంకట రమణ కుటుంబానికి చేరువ కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి ఉప ఎన్నికలలో వెంకట రమణ భార్య సుగుణ పోటీ చేయకుండా చేసే బ్రెయిన్ వాష్ కార్యక్రమాలు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. సుగుణ పోటీ చేయకుండా వుంటే, వెంకట రమణ కుటుంబం మద్దతుతో కరుణాకర్‌‌రెడ్డిని బరిలో దించాలన్నది ఒక వ్యూహం. అలా కాకుండా వుంటే, వెంకట రమణ భార్యను తెలుగుదేశం పార్టీ తరఫున కాకుండా వైసీపీ తరఫున బరిలోకి దించాలన్నది కూడా వైసీపీ వ్యూహమని సమాచారం. మొత్తమ్మీద తిరుపతి స్థానాన్ని తన కైవసం చేసుకోవాలన్నది జగన్ వ్యూహమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ నగరంలోనూ వైసీపీకి బలం లేదు. ఇప్పుడు తిరుపతి నగరంలో వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వైసీపీ నాయకుడు జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ పరిశీకులు వివరిస్తున్నారు.

తమిళనాడులోకి బీజేపీ ఎంట్రీ, చతికిలపడిన డీయంకె

  తమిళనాడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమయిన డి.యం.కే.పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ప్రముఖ సినీతార మరియు పార్టీలో సీనియర్ నాయకురాలు అయిన కుష్బూ కొన్ని వారాల క్రితమే ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరగా ఇప్పుడు మరో సీనియర్ నేత నెపోలియన్ కూడా పార్టీని వీడి నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయన తన పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తునట్లు పంపిన లేఖను డి.యం.కె. అధినేత కరుణానిధి ఆమోదించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ కూడా బీజేపీలో చేరారు.   తమిళనాడు కేరళ రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఆ రెండు రాష్ట్రాలలో పర్యటించిన అమిత్ షా ఈ సందర్భంగా చెన్నైలో మాట్లాడుతూ 2016సం.లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ముందుగా తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించి ఎన్నికలకు వెళతామని తెలిపారు.   నెపోలియన్ చేరిక బీజేపీకి చాలా బలం చేకూరిస్తే, డి.యం.కె. పార్టీకి కోలుకోలేని దెబ్బగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత కరుణానిధి వయోభారంతో పార్టీని నడుపలేని స్థితికి చేరుకొంటే, ఆయన ఇద్దరు కుమారులు అళగిరి, స్టాలిన్ పార్టీ ఆధిపత్యం కోసం పోరాడుకొని విడిపోయారు. అళగిరిని పార్టీ నుండి సప్స్పెండ్ చేసినా పార్టీ పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు పైగా నానాటికీ మరింత క్షీణిస్తోంది.   తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అరెస్టు కారణంగా ఆమెపై అనర్హత వేటు పడిన కారణంగా అధికార అన్నాడీఎంకెపార్టీ చాలా బలహీనంగా ఉన్నప్పుడు, ఇటువంటి అవకాశం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డీయంకె ఇప్పుడు ఆ గొప్ప అవకాశాన్ని అందుకోలేక చతికిలపడితే, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చురుకుగా కదిలి ఆ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవదానికి గతి ప్రయాణాలు చేయడం విశేషం. అమిత్ షా ఇదే దూకుడు ప్రదర్శిస్తే బహుశః వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ మొట్టమొదటిసారిగా తమిళనాడులో కూడా అడుగుపెట్టే అవకాశం ఉంటుందని భావించవచ్చును.

విశాఖలో ఏషియన్ పెయింట్స్ నిర్మాణ కార్యక్రమాలు త్వరలో

  రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక పరిశ్రమల స్థాపనకు ఒప్పందాలు జరిగాయి. అనేక సంస్థలకు ప్రభుత్వం అనుమతులు, భూ కేటాయింపులు చేస్తోంది. ఆ ప్రక్రియలన్నీ ఒకటొకటిగా పూర్తవుతున్నాయి. వాటిలో అన్నిటికంటే ముందుగా విశాఖ జిల్లాలో అచ్యుతాపురం వద్ద పూడి అనే గ్రామంలో రూ.1818కోట్ల పెట్టుబడితో భారతదేశంలో ఎంతో పేరుగాంచిన ఏషియన్ పెయింట్స్ సంస్థ రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏ.పి.ఐ.సి.సి.) ఏషియన్ పెయింట్స్ సంస్థ కోసం పూడి గ్రామం వద్ద 110 ఎకరాలను కేటాయించింది. త్వరలో ఆ భూమిని ఏషియన్ పెయింట్స్ సంస్థకు అప్పగించబోతున్నారు. వచ్చే నెల నుండి నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టి వచ్చే ఏడాది చివరి కల్లా ఉత్పత్తి ప్రారంభించాలని ఆ సంస్థ యాజమాన్యం భావిస్తోంది. కనుక భూమి అప్పగించిన వెంటనే రేయింబవళ్ళు నిర్మాణ కార్యక్రమాలు చేసేందుకు అవసరమయిన ఏర్పాట్లు చేసుకొంటున్నట్లు అధికారులు తెలిపారు.   ఆ సంస్థ తన ఉత్పత్తి కార్యక్రమాలు ప్రారంభిస్తే ప్రత్యక్షంగా 700మందికి, పరోక్షంగా మరనేక వేల మందికి ఉపాధి లభించవచ్చును. అక్కడ రోజుకి నాలుగు లక్షల పెయింట్ ఉత్పత్తి అవుతుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే అచ్యుతాపురం ప్రాంతంలో అనేక చిన్న మధ్య తరహా పరిశ్రమలు, బ్రాండిక్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ సంస్థ కూడా వచ్చినట్లయితే ఆ చుట్టూ పక్కల అభివృద్ధి వేగవంతం అవుతుంది. దీని వలన అనేకమందికి ఉపాధి దొరకడమే కాకుండా ఆర్ధిక ఇబ్బందులలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో మంచి ఆదాయం కూడా వస్తుంది.   ఈ సంస్థ కంటే మూడు రెట్లు ఎక్కువ పెట్టుబడితో చిత్తూరులో శ్రీ సిటీ వద్ద త్వరలో హీరో మోటార్ సైకిల్స్ ఉత్పత్తి సంస్థ కూడా రాబోతోంది. హీరో మోటోకార్ప్ సంస్థ కూడా వచ్చే ఏడాది చివరిలోగా నిర్మాణం పూర్తి చేసుకొని 2016 నుండి ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తోంది.

వెంకయ్య - కిషన్ రెడ్డి మధ్య అగాథం

  వాళ్ళిద్దరూ గురు శిష్యులు. అయితే ఇప్పుడు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అధికారానికి దూరంగా ఉన్నంతకాలం ఒకరికి ఒకరు దగ్గరగా వున్నారు. ఇప్పుడు అధికారం దగ్గరగా వచ్చిన తర్వాత వారిద్దరూ దూరమైపోయారు. కలసికట్టుగా దేశాన్ని ముందుకు నడిపించాల్సిన వారు ఎడమొహం పెడమొహంగా వుంటున్నారు. వాళ్ళిద్దరూ ఎవరో కాదు... బీజేపీ జాతీయ నాయకుడు, కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి.   వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి... ఇద్దరి మధ్య ఏం జరిగిందో, ఏ అభిప్రాయ భేదాలు వచ్చాయో గానీ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. గతంలో వెంకయ్య నాయుడు హైదరాబాద్‌కి ఎప్పుడు వచ్చినా, ఏ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి అక్కడకి తప్పకుండా వచ్చేవారు. అధికార కార్యక్రమం అయినా, అనధికార కార్యక్రమం అయినా కిషన్ రెడ్డి హాజరు తప్పనిసరిగా కనిపించేది. అయితే ఇటీవలి కాలంలో వెంకయ్య నాయుడు ఎప్పుడు హైదరాబాద్‌కి వచ్చినా కిషన్ రెడ్డి అక్కడ కనిపించడం లేదు. బీజేపీ జాతీయ స్థాయి నాయకుడు వచ్చినప్పుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి హోదాలో వున్న కిషన్ రెడ్డి వెళ్ళి కలవటం మర్యాద. ఆ మర్యాదని కూడా కిషన్ రెడ్డి పాటించనంతగా వీరిద్దరి మధ్య దూరం పెరిగిందని తెలుస్తోంది. కిషన్ రెడ్డికి రైట్ హ్యాండ్‌గా భావించే యన్నం శ్రీనివాసరెడ్డి ఆమధ్య వెంకయ్య నాయుడిని విమర్శించినప్పుడు కూడా కిషన్ రెడ్డి ఆ విమర్శలను ఖండించకుండా మిన్నకున్నారు. బీజేపీ లాంటి క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఇలాంటి ధోరణులు కుదరవు. అయినప్పటికీ కిషన్ రెడ్డి ఇదే పంథాలో వ్యవహరిస్తున్నారు.   కిషన్ రెడ్డి వ్యవహార శైలి వెంకయ్య నాయుడికి నచ్చకపోయినప్పటికీ ఆయన ఈ అంశాన్ని నరేంద్రమోడీ దృష్టికి తీసుకెళ్ళ దలచుకోనట్టు తెలుస్తోంది. ఎందుకంటే, నరేంద్రమోడీ వెంకయ్య నాయుడికి ఎంత సన్నిహితుడో కిషన్ రెడ్డికి కూడా అంతే సన్నిహితుడు. దశాబ్దాల క్రితం ఇద్దరూ కలసి భారత ప్రభుత్వం తరఫున అమెరికా పర్యటనకు వెళ్ళిన స్నేహం కూడా వీరిమధ్య వుంది. అందువల్ల కిషన్ రెడ్డి వ్యవహార శైలిని మోడీ దృష్టికి వెంకయ్య తీసుకెళ్ళలేదు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మరో బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని వెంకయ్య నాయుడు ప్రోత్సహిస్తున్నట్టు, కిషన్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. చింతల రామచంద్రారెడ్డిని వెంకయ్య భుజాన వేసుకోవడం ఎంతవరకూ వచ్చిందంటే, త్వరలో ఆయనకు టీటీడీ బోర్డు సభ్యుడిగా అవకాశం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేనంత వరకు వచ్చింది. ఏది ఏమైనప్పటికీ వెంకయ్య లాంటి నాయకుడితో కిషన్ రెడ్డి అనవసరంగా దూరాన్ని పెంచుకుంటున్నారేమోనన్న అభిప్రాయం తెలంగాణ బీజేపీ వర్గాల్లో వినిస్తోంది.

చక్రి ఆత్మహత్య చేసుకున్నారా?

  ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి హఠాన్మరణం చిత్ర పరిశ్రమను, ఆయన అభిమానులను విషాదంలో ముంచింది. ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడిగా మాత్రమే కాకుండా, మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న చక్రి మరణం ఎంతో బాధాకరం. చక్రి మరణించక ముందు రోజు వరకూ ఆయన జీవితం గురించి ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. కేవలం శరీరం విపరీతంగా లావుగా వుంటుందే తప్ప... మరే విషయంలోనూ ఆయనకు ఎలాంటి లోటూ లేదని అందరూ భావించారు. వందకు పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన చక్రి కోట్లకు కోట్లు సంపాదించారని అందరూ అనుకుంటారు. అయితే ఆయన జీవితం వెనుక అసలు విషయాలు ఆయన మరణం తర్వాత బయటపడుతున్నాయి. అలా బయటపడిన అనేక విషయాలు చక్రి అందరూ అనుకుంటున్నట్టుగానే స్థూలకాయం కారణంగా గుండెపోటుతో మరణించారా... లేక ఎవరూ ఊహించని విధంగా ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే సందేహాలను ఆయన అభిమానులు, సినీ పరిశ్రమ వర్గాల్లో కలిగిస్తున్నాయి.   శరీరం విపరీతంగా పెరిగిపోయిన చక్రి నిరంతరం వైద్య పరీక్షలు చేయించుకుంటూనే వుండేవారు. ఆయన గుండెకు ఎలాంటి సమస్య లేదని డాక్టర్లు చెప్పారని ఆయన కుటుంబ సభ్యులే చెబుతున్నారు. అలాంటప్పుడు ఆయన ఇంత అకస్మాత్తుగా ఎందుకు మరణిస్తారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే చక్రి మరణించిన రోజు అర్ధరాత్రి రెండు.. రెండున్నర వరకు మేలుకునే వున్నారట. తెల్లవారు ఝామున ఆరుగంటలకు చూస్తే చక్రి చనిపోయి వున్నారు. అయితే అప్పటికే ఆయన పూర్తిగా నల్లగా మారిపోయి వున్నారు. ఒకవేళ నిద్రలో గుండెపోటుతో మరణిస్తే శరీరం నల్లగా ఎందుకు మారిపోయింది? అది కూడా కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే ఆయన శరీరం అలా ఎందుకు మారిపోతుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.   చక్రి మరణించిన తర్వాత ఆయన కుటుంబంలో ఉన్న వివాదాలు బయటపడ్డాయి. చక్రి తల్లి, తమ్ముడు, సోదరీమణుల మధ్య, చక్రి భార్య శ్రావణి మధ్య విభేదాలు బయటపడ్డాయి. చక్రికి శ్రావణి విషం పెట్టి చంపేసిందని మిగతా కుటుంబ సభ్యులు ఆరోపించారట. ఈ విషయాన్ని చక్రి భార్యే బయటపెట్టారు. తనను చక్రి వైపు బంధువులు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని ఆమె మీడియా ముందుకు వచ్చి చెప్పారు. హ్యూమన్ రైట్స్ కమిషన్‌కి ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణభయం వుందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. చక్రితో ఎలాంటి బంధుత్వమూ లేనివారు చక్రి మరణాన్ని తలచుకుని బాధపడుతుంటే, ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఆస్తిపాస్తుల కోసం చక్రి మరణాన్ని ‘హత్య’గా చిత్రీకరించే ప్రయత్నం చేయడం, వివాదం హ్యూమన్ రైట్స్ కమిషన్ వరకూ వెళ్ళడం చేశారు. ఇది చాలా ఇబ్బందికర పరిస్థితిని సృష్టించింది. ఇంత గొడవ అయిన తర్వాత వాళ్ళంతా మనం మనం బంధువులం అనుకుని రాజీ పడిపోయారు. కానీ వారు చేసిన గొడవ వల్ల చక్రికి ఏర్పడిన అప్రతిష్ఠని చెరిపేయగలరా?   చక్రి మరణం తర్వాత జరిగిన గొడవ సంగతి అలా వుంచితే, చక్రి ఆత్మహత్యకు పాల్పడి వుంటారన్న సందేహాలను ఆయన అభిమానులు, సినిమా రంగంలోని వారు వ్యక్తం చేస్తున్నారు. అన్ని వైపుల నుంచి ముంచుకొచ్చిన మానసిక ఒత్తిడి చక్రిని ఆత్మహత్యకు ప్రేరేపించి వుండవచ్చా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న వయసులోనే భారీ విజయాలను సొంతం చేసుకున్న చక్రి బాగానే సంపాదించారు. అయితే ఆయన సంపాదన మొత్తం ఖర్చయిపోయిందని ఆయన భార్యే చెబుతున్నారు. ఒక్క ఇల్లు తప్ప బ్యాంకులో బ్యాలన్స్‌ ఏమీ లేదని చక్రి బాధపడేవారట. సినిమాలు లేక, పని చేసిన సినిమాలు కూడా విజయ సాధించక చక్రి మానసికంగా ఎంతో ఒత్తిడికి గురయ్యేవారట. చేతిలో డబ్బు లేదు, సినిమాలు లేవు... ఈ డిసెంబర్ 31వ తేదీ కోసం ఒక ఫంక్షన్‌ ఈవెంట్ నిర్వహించాలని చక్రికి ఆహ్వానం వస్తే ఆయన చాలా సంతోషించారట. మనకి ఇప్పుడు కొంత డబ్బు వస్తుందని సంబరపడిపోయారట. చివరికి ఆ ఈవెంట్ కూడా కేన్సిల్ అయిపోయేసరికి బాగా డీలా పడిపోయారట. ఎన్నో హిట్ సినిమాలకు మ్యూజిక్ ఇచ్చిన చక్రి ఏదో కాస్తంత డబ్బు వచ్చే ఒక ఈవెంట్ మిస్ అయిందని డీలాపడిపోయారంటే ఆయన ఆర్థిక పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. ‘ఎర్రబస్సు’ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న చక్రి ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోయేసరికి బాగా నిరాశపడిపోయారట. ఇవన్నీ ఆయన భార్యే వెల్లడించారు.   సంపాదించిన డబ్బంతా ఖర్చయిపోయింది. బ్యాంక్ బ్యాలన్స్ నిల్ అయింది. దానికితోడు చేతిలో సినిమాలు లేవు. దానికితోడు అడుగు తీసి అడుగు వేయడానికి కూడా సహకరించని భారీ కాయం. ఉన్న ఫ్రెండ్సందరూ మందుపార్టీ ఫ్రెండ్సే తప్ప మనసుకు ఊరటనిచ్చే ఫ్రెండ్స్ కాదు. చక్రికి పిల్లలంటే ఇష్టం. తమ దంపతులకు పిల్లలు పుడితే వాళ్ళని సినిమా సంగీత రంగంలో తన వారసులుగా తీర్చిదిద్దాలని చక్రి తపించేవారట. అయితే చక్రి భార్యకి పిల్లలు పుట్టే అవకాశం లేదట. పిల్లల కోసం ఎన్నో ట్రీట్‌మెంట్లు తీసుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. పిల్లలు కలగకపోవడం ఎంత పెద్ద బాధో దాన్ని అనుభవించిన వారికి తెలుస్తుంది. వీటికి తోడు చక్రి భార్యకి, చక్రి కుటుంబానికి మధ్య నిరంతరం ఘర్షణలు. చక్రి చనిపోయిన ముందు రోజు కూడా చక్రి తల్లి, చక్రి భార్య ఇద్దరూ గొడవపడ్డారట. దాంతో చక్రి కుటుంబం మొత్తం చక్రి ఇంటి నుంచి బయటకి వెళ్ళిపోయిందట. చక్రికి విజయాల విజయాలు వచ్చి పాపులర్ అయ్యేరేగానీ, మానసికంగా చక్రి చాలా చిన్నపిల్లాడు. అలాంటి చిన్న పిల్లాడిని ఇన్ని ఒత్తిడులు ఒక్కసారిగా చుట్టుముడితే, ఒత్తిడులను తప్పించుకునే దారి కనిపించకపోతే ఏమవుతుంది? ఆ చిన్నపిల్లాడి మనసు ఏ నిర్ణయం తీసుకుంటుంది?   ఇలాంటి పరిస్థితుల్లో మానసిక ఒత్తిడి తట్టుకోలేక చక్రి ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘చస్తే ఏ గొడవాలేదు.. చస్తే ఏ గోలా లేదు’ అనే పాటని చక్రి పాడారు. ఇన్ని ఒత్తిడులు ఎదుర్కొంటున్న చక్రి తన పాటను అనుసరించి వెళ్ళిపోయారా అనే అనుమానాలను ఆయన అభిమానులు, సినిమా పరిశ్రమలోనివారు వ్యక్తం చేస్తున్నారు. చక్రి మరణవార్త తెలిసిన అందరూ... చక్రి బాగా లావుగా వుంటాడు కాబట్టి గుండెపోటు వచ్చి వుంటుందిలే అని అనుకున్నారు. ఇప్పుడు చక్రి జీవితంలోని అసలు గుట్టంతా బయటపడేసరికి ఇప్పుడు ఆయన మరణం మీద సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీకి బదులుగా తెరాస గెలిచింది అంతే!

  ఎన్నికలలో ఓడిపోయిన పార్టీలు తమ ఓటమికి తలోరకంగా బాష్యం చెప్పుకొంటే, గెలిచిన పార్టీ తమకు అఖండ ప్రజాధారణ ఉంది గనుకనే గెలవగలిగామని భుజాలు చరుచుకొంటుంటాయి. ఒకానొక సమయంలో తెలంగాణాలో గెలుస్తామో లేదో తెలియని పరిస్థితిని ఎదుర్కొన్న తెరాస గెలిచిన తరువాత ఆవిధంగానే భుజాలు చరుచుకొంది. అయితే బీజేపీ తెలంగాణ ఇన్ చార్జీ మురళీ ధర్ రావు మాత్రం కాంగ్రెస్ పార్టీకి బదులుగా తెరాస గెలిచింది తప్ప ఆ పార్టీ అనుకొంటున్నట్లుగా తెరాస ఏ పార్టీని ఓడించి గెలవలేదని తేల్చి చెప్పారు.   ఎన్నికల ప్రచారం కోసం కేసీఆర్ కాళ్ళకు చక్రాలు కట్టుకొని తెలంగాణా జిల్లాలు అన్నీ తిరిగి ఎంతగా ప్రచారం చేసినా, ఫలితాలు వెలువడే సమయానికి ఆయన గెలుస్తామనే నమ్మకం కోల్పోయిన మాట వాస్తవం.   తెలంగాణా కాంగ్రెస్ నేతలు కూడా తమ పార్టీకి భారీ మెజార్టీ రాకపోయినా కనీసం బొటాబొటి సీట్లతోనయినా తాము అధికారంలోకి రావడం ఖాయమని చాలా దృడంగా నమ్మారు. ఒకవేళ తమకు మెజార్టీ రాకపోయినా, తెరాసకు కూడా మెజార్టీ రాదని, అప్పుడు తప్పని పరిస్థితుల్లో తెరాస తమ మద్దతు కోరుతుందని, దానికి మద్దతు ఇచ్చి తెరాసతో కలిసి రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వారు భావించిన మాట కూడా వాస్తవం. బహుశః ఈ పరిస్థితిని గమనించిన తరువాతే కేసీఆర్ గొంతులో కొంత మార్పు వచ్చింది. అందుకే ఆ సమయంలో ఆయన మళ్ళీ సోనియాగాంధీ భజన అందుకొన్నారు. కానీ అదృష్టవశాత్తు తెరాస గెలిచింది. తనంతట తానే ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. దానితో ఆయన గొంతులో కూడా మార్పు వచ్చింది మళ్ళీ. అది చూసి కాంగ్రెస్ నేతలు ఖంగు తిన్నారు.   ఇదే విషయాన్ని బీజేపీ నేత ఇప్పుడు మరో విధంగా చెపుతున్నారని భావించవచ్చును. అయితే ఆయన కాంగ్రెస్ ఓటమికి గల అనేక కారణాలకు మరొక కొత్త కారణం కూడా తాజాగా జత చేసారు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం ప్రజలను ఆకట్టుకొనేందుకే వారికి మతపరమయిన రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రయత్నించిందని, ఆ కారణంగానే హిందువులు ఆ పార్టీకి దూరమయ్యారని, అందుకే కాంగ్రెస్ ఓడిపోయిందని, తెరాస గెలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు.   ఇప్పుడు కేసీఆర్ కూడా కాంగ్రెస్ పంధాలోనే ముందుకు సాగుతూ ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ ఇచ్చివారిని ఆకట్టుకోవాలని చూస్తున్నారని కనుక మున్ముందు తెరాస భవిష్యత్ కూడా కాంగ్రెస్ లాగే మారవచ్చని ఆయన జోస్యం చెప్పారు. తెరాస హిందువులకి దూరంగా జరుగుతున్న కొద్దీ వారు బీజేపీకి మరింత చేరువవుతున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ అమలు చేయాలనుకొంటున్న ముస్లిం రిజర్వేషన్ వల్ల ఆ పార్టీకి ఏమయినా ప్రయోజనం కలుగుతుందో లేదో తెలియదు కానీ బీజేపీకి మాత్రం తప్పకుండా ప్రయోజనం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్, వైకాపా, తెరాసలు కూటమిగా ఏర్పడనున్నాయా?

  ఇంతకాలం వైకాపా, తెరాసాలు ఒకదాని ప్రసక్తి మరొకటి తేకుండా చాలా జాగ్రత్త పడుతున్నాయి. ఆ రెండు పార్టీలు ఒకదాని పరిధిలోకి మరొకటి ప్రవేశించలేదు. కనుక ఇంతవరకు ఒకరి వల్ల మరొకరికి ఎటువంటి సమస్యలు లేవు, సవాళ్లు లేవు. కనుక ఇంతకాలం వారి స్నేహం బాగానే సాగిపోయింది. కానీ ఇప్పుడు జగన్ తనకు బాగా అచ్చివచ్చిన షర్మిలాస్త్రాన్ని తెలంగాణా మీదకి అంటే తెరాస మీదకి సందించారు. అయినప్పటికీ ఆ బాణం ఎవరినీ గాయపరచకుండా తెలంగాణాలో తమ పార్టీ పరిస్థితి ఏమిటో అంచనా వేసుకొని వెనక్కి తిరిగి వచ్చేసింది.   అదేవిధంగా కేసీఆర్ కానీ తెరాస నేతలు గానీ ఎవరూ కూడా ఆమె యాత్రపై కిమ్మనలేదు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణా లో ఓదార్పు యాత్రకి వచ్చినప్పుడు ఆయన రైల్లోంచి కాలు క్రిందపెట్టడానికి కూడా ఒప్పుకోని తెరాస, ఇప్పుడు షర్మిల యాత్రకు ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అసలు ఆమె వచ్చి వెళ్లిపోయిన సంగతి కూడా గమనించనట్లు ఊరుకొన్నారు. ఆమెను అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తే బహుశః ఆమె పరామర్శ యాత్రకు అనవసర ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుందని భావించి ఊరుకోన్నారేమో తెలియదు. అదేవిధంగా షర్మిల కూడా తెలంగాణా ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేయకుండా సమస్యలున్నాయని వాటిని ప్రభుత్వం పరిష్కరించాలని చిన్న విజ్ఞప్తి చేసి వచ్చేసారు.   ఆ రెండు పార్టీల ఈ తీరు గమనిస్తే, తెలంగాణాలో తెదేపా, బీజేపీలను ఎదుర్కొనేందుకు మున్ముందు కలిసి పనిచేసే ఆలోచనలో ఉన్నాయేమోననే అనుమానంగా ఉంది. రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలాగు ఇక బాగుపడే అవకాశాలు కనుచూపుమేర కనబడటం లేదు కనుక అది కూడా తప్పనిసరిగా తమతో చేతులు కలపవచ్చని, అప్పుడు తెదేపా-బీజేపీలను ఎదుర్కోవడం తేలికవుతుదని వారు భావిస్తున్నారేమో. మళ్ళీ త్వరలో మొదలయ్యే పరామర్శ యాత్రలో కూడా తెరాస, వైకాపాలు ఇదే తీరుగా వ్యవహరించినట్లయితే ఈ అంచనాలు నిజమని నమ్మవచ్చును.

ఇరాక్‌లో మరో దారుణ ఘటన

  బిన్ లాడెన్ మరణంతో తాలిబాన్ ఉగ్రవాదుల ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోందని అందరూ సంతోషిస్తుంటే అంతకంటే క్రూరమయిన ఐ.యస్. (ఇస్లామిక్ స్టేట్) ఉగ్రవాద సంస్థ మరొకటి పుట్టుకొచ్చింది. అది చేస్తున్న దారుణ మారణహోమం చాలా వరకు బయట ప్రపంచానికి తెలియడం లేదు. ఇరాక్, సిరియా దేశాల ప్రజలు దాని దురాఘతాలకి మౌనంగా బలయిపోతున్నారు. తాలిబాన్ ఉగ్రవాదులు పెషావర్ లో 148 మంది విద్యార్ధులను అతికిరాతకంగా హతమార్చిన సంఘటనతో యావత్ ప్రపంచం కలవరపడుతుంటే, ఈ ఐ.యస్. ఉగ్రవాద సంస్థ అంతకంటే దారుణమయిన ఘాతుకానికి పాల్పడిన విషయం కొంత ఆలశ్యంగా బయటపడింది.   ఇరాక్ పశ్చిమ ప్రాంతంలో ఈ ఐ.యస్.ఉగ్రవాదులు 150 మంది మహిళలను, 91 మంది పురుషులు, అతి కిరాతకం కాల్చి చంపి ఫల్లూజా అనే ప్రాంతంలో వారినందరినీ సామూహిక ఖననం చేసేసారని ఇరాక్‌ మానవ హక్కుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. చనిపోయిన వారిలో గర్భిణులు, అభం శుభం తెలియని చిన్నారులు కూడా చాలా మంది ఉన్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. వారిని చంపడానికి కారణం ఆ మహిళలు వారిని పెళ్లి చేసుకొనేందుకు ఇష్టపడకపోవడమేనట. ఐ.యస్.ఉగ్రవాదులు మొత్తం 241మందిని కాల్చి చంపారని ఇరాక్ ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. ఇరాక్‌లోని అల్‌ అన్బర్‌ అనే ప్రాంతంలో ఐ.యస్. ఉగ్రవాదుల నాయకుడు అబూ అనాస్‌ అలి లిబి నేతృత్వంలో ఈ దారుణం జరిగినట్టు తెలుస్తోంది. ఇటువంటి మారణ హోమాలు అక్కడ ఇంకా ఎన్నిజరుగుతున్నాయో ఎందరు బలయిపోతున్నారో వాటిని ఎవరు అడ్డుకొని అమాయకులయిన ప్రజలను కాపాడుతారో ఎవరికీ తెలియదు. ఒకప్పుడు మనిషికి నాగరికత తెలియని రోజుల్లో కూడా బహుశః ఇటువంటి దారుణాలు జరిగి ఉండవేమో. కానీ నాగరికత నేర్చిన మానవుడు మతం పేరుతో ఇటువంటి దారుణాలకు పాల్పడుతుండటం, వాటిని ప్రపంచదేశాలు నిస్సహాయంగా చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోవడం మానవజాతి సమస్తం సిగ్గుతో తలదించుకోవలసిన విషయం.

ముఖ్యమంత్రినవుతా, సమస్యలన్నీ పరిష్కరిస్తా...జగన్

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని చూస్తే చాలా ముచ్చటేస్తుంది. రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు అందరూ కూడా అతని దగ్గర చాలా నేర్చుకోవలసింది చాలా ఉంది. రాష్ట్రంలో ఏ మూల సమస్య వచ్చినా, ఎవరు కష్టాలలో ఉన్నా ఆయన అక్కడ టక్కున వాలిపోయి వారిని ఓదార్చుతుంటారు. వారి కోసం ప్రభుత్వంతో అలుపెరుగని పోరాటాలు చేస్తానని భరోసా ఇస్తారు. ఇవ్వడమే కాదు వారి కోసం ధర్నాలు దీక్షలు అంటూ పాపం కడుపు మాడ్చుకొంటారు కూడా. ఇంకా అవసరమయితే స్వంత ఖర్చులతో డిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడి వచ్చేందుకు కూడా ఆయన వెనుకాడరు. ఇంతచేసినా ఆయనని చూసి అధికార పార్టీ నేతలు ఏమీ నేర్చుకోకపోగా ఏవో కేసులు, కోర్టులు, లక్ష కోట్లు, ఈడీ జప్తులు, జైలు అంటూ అసందర్భంగా అర్ధంపర్ధం లేని మాటలు మాట్లాడుతూ సున్నితమయిన ఆయన మనసు నొప్పిస్తుంటారు. అయితే ఆయన వారి తాటాకు చప్పుళ్ళకు బెదిరిపోయే రకం కాదు కనుకనే అంత నిబ్బరంగా ఉండగలుగుతున్నారు.   ప్రజల సమస్యలను ఈ ప్రభుత్వం తీర్చలేకపోతోంది. కనుక నాలుగున్నరేళ్ళ తరువాత తమ పార్టీ అధికారంలోకి వచ్చి తను ముఖ్యమంత్రి అవగానే అన్ని సమస్యలను మంత్రదండంతో మాయం చేసేస్తానని ప్రజలకు నచ్చజెప్పుతూ వారు నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడకుండా కాపాడుకొస్తున్నారు. లేకుంటే ఆయన జీవితమంతా ఓదార్పు యాత్రలకే సరిపోతుంది.   తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ సోమవారం నుండి సమ్మెకు దిగిన కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. కానీ ప్రభుత్వానికి జగన్ మోహన్ రెడ్డికి వారిపై ఉన్నంత ప్రేమ, అభిమానం, వారి సమస్యల పట్ల అవగాహన లేదో ఏమో గానీ వారి సమ్మె ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘జగమంత కుటుంబం నాది’ అని చెప్పుకొనే జగన్మోహన్ రెడ్డి వారి దగ్గర వాలిపోయారు. వారిని కూడా ఓదార్చారు. ప్రభుత్వం వారినందరినీ మోసం చేస్తున్నందుకు పాపం ఆయన కూడా చాలా బాధ పడ్డారు. పంట రుణాల మాఫీ, రాజధాని భూములు, హూద్ హూద్ తుఫాను సహాయం, పెన్షన్లు, ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలు, కోర్టు కేసులు, ఈడీ జప్తులు వంటి సవాలక్ష సమస్యలతో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ వారి తరపున కూడా తను పోరాడుతానని హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలలో ఈ అంశం లేవనెత్తుతానని హామీ ఇచ్చారు. ఒకవేళ అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోయినట్లయితే, ఇక ఎవరూ చేయగలిగేదేమీ ఉండదు కనుక ఓ నాలుగున్నరేళ్లు ఓపికబడితే తను ముఖ్యమంత్రి అవగానే వారి సమస్యలను తనే స్వయంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.   ఇంతకంటే ఎవరయినా ఏమి చేయగలరు? ప్రజలు కష్టాల్లో ఉన్నారు కదాని వారి కోసం లక్ష కోట్లు కరిగించేసుకోలేము కనుక వారిని ఓ నాలుగున్నరేళ్లు ఉగ్గబట్టుకొని ఉంటే తనే వారి కష్టాలన్నీ తీర్చుతానని హామీ ఇస్తున్నారు అంతే. కష్టాల్లో ఉన్నవారిని ఆయన ఓదార్చి భరోసా ఇస్తుంటే అధికార పార్టీ నేతలు ఆయనను మెచ్చుకోకపోయినా పరువాలేదు కానీ ‘ఆయన ముఖ్యమంత్రి అవలేకపోయినా తప్పకుండా మళ్ళీ జైలుకి పోతాడు’ అని ఎకసెక్కెం చేయడం మాత్రం మానరు.అయనవంటి మంచివాళ్లకు ఈలోకంలోచోటే లేదు. ఈ పాడులోకం కంటే ఆ చంచల్ గూడా జైలే వెయ్యి రెట్లు నయమనిపిస్తోంది.    

నైతిక విలువలా? అంటే ఏంటి తలసానీ?

  తెలంగాణా కోసం ఉద్యమించిన తెరాస నేతలకు, ఉద్యమకారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా నిన్నగాక మొన్న తెలుగుదేశం పార్టీలో నుండి బయటకు వచ్చి తెరాసలో చేరిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వర రావులకు మాత్రం మంత్రి పదవులు కట్టబెట్టారు. నిజానికి వారిరువురూ ఆ షరతు మీదే పార్టీ మారినట్లు వార్తలు వచ్చేయి. తెదేపా తరపున శాసనసభకు ఎంపికయిన తలసాని తదితరులు పార్టీ ఫిరాయించినందుకు వారిపై అనర్హత వేటు వేయాలని తెదేపా కోరడం, స్పీకర్ వారికి నోటీసులు జారీ చేయడం గురించి అందరికీ తెలిసిందే.   తెరాసలోకి మారి మంత్రిపదవి సంపాదించుకొన్న తలసాని యాదవ్ ఈ అనర్హత వేటు తప్పించుకొనేందుకు తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసారు. లేకుంటే ఆయనపై అనర్హత వేటు పడితే మంత్రి పదవి కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అదీగాక ఆయన ఇప్పుడు తెదేపా శాసనసభ్యుడిగా కొనసాగే పరిస్థితి కూడా లేదు. కొనసాగితే ప్రతిపక్షాలకు, ముఖ్యంగా తెదేపా సందించే ప్రశ్నలకు, విమర్శలకు జవాబు చెప్పుకోవడం ఆయనకీ, ప్రభుత్వానికీ కూడా చాలా కష్టమవుతుంది. అందుకే ఆయన మంత్రి పదవి చేప్పట్టే ముందే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసారు. అయితే ఆయన దానికి ‘నైతిక విలువల’ రంగులద్దే ప్రయత్నం చేయడం అందరికీ నవ్వు కలిగిస్తుంది.   తను నైతిక విలువలకు కట్టుబడే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసానని ఆయన చెప్పుకొన్నారు. నైతిక విలువల గురించి తను వేరేవారి దగ్గరో పాటాలు నేర్చుకోనవసరం లేదని అన్నారు. మంత్రి పదవి కోసమే పార్టీ ఫిరాయించానని ఎవరేమనుకొన్నా తను పట్టించుకోనని అన్నారు. కానీ తనపై నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించబోనని ఒక హెచ్చరిక కూడా జారీ చేసారు. చంద్రబాబు కూడా నోరు అదుపులో ఉంచుకొంటే మంచిదని అన్నారు. ఆయన మంత్రి పదవి చేప్పట్టబోతున్నందుకు చాలా ఆనందంపడిన ఆయన తల్లిగారు, తనకు పెద్దకొడుకు వంటి చంద్రబాబు నాయుడికి తన కొడుకు దూరం కావడం తనకు చాలా బాధ కలిగిస్తోందని చెప్పడం గమనిస్తే తలసాని ఏమి కోల్పోయారో అర్ధమవుతుంది.   ఆయన మంత్రి పదవి కోసమే తను పార్టీ ఫిరాయించానని ఎవరేమనుకొన్నా తను పట్టించుకోనని చెప్పుకోవడం ద్వారా ఆ ఆరోపణలు నిజమని ఆయనే స్వయంగా దృవీకరిస్తున్నట్లుంది. తనకు సమాజంలో ఈ హోదా, గౌరవం కలిగించిన పార్టీని మంత్రి పదవి కోసమే వీడినప్పుడే ఆయన నైతిక విలువలను తుంగలో తొక్కారు. అటువంటప్పుడు ఆయన నైతిక విలువలు కాపాడేందుకే తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసానని చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.   రాజకీయ నాయకులు పార్టీలు మారితే జానాలు ఆశ్చర్యపోయే రోజులు ఎప్పుడో పోయాయి. మారకపోతేనే వారు ఆశ్చర్యపోతుంటారు. అటువంటప్పుడు నైతిక విలువలను కాపాడేందుకే తన తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసానని తలసాని చెప్పుకోవడం కూడా అనవసరం. ఇప్పుడు మన రాజకీయ వ్యవస్థలో నేతలు తమను తాము సమర్దించుకొనేందుకు అవసరమయిన కొన్నిమూస పద్దతులు, కొన్ని నిశ్చితమయిన వాదనలు, వాటికి అవసరమయిన పడికట్టు పదాలు అన్నీ సిద్దంగా ఉన్నాయి. కనుక నేతలందరూ ఇటువంటి సందర్భాలలో వాటి నుండి తమకు అవసరమయిన పాయింట్లు, పద్దతులు, పదాలు ఏరుకొని మీడియా ముందుకు వచ్చి తదనుగుణంగా చిలకల్లా వల్లె వేస్తుంటారు. ఆ మూస పద్దతులను, పడికట్టు పదాలను ఉపయోగించడం వలన పెద్దగా విమర్శల బారిన పడకుండా తప్పించుకోగలుగుతున్నారు.   తలసాని కూడా అటువంటిదే ‘నా హైదరాబాద్ ని అభివృద్ధి చేసుకోనేందుకే పార్టీ మారానని’ పద్ధతి ప్రకారం బాగానే చెప్పినప్పటికీ ఈ ‘నైతిక విలువల’ సంగతి ఎత్తడం వల్ల ఇంత ఆలోచించవలసి వచ్చింది. లేకుంటే ఆయనని కూడా నలుగురితో నారాయణ అనేసి ఊరుకొనేవారు.

వందల కోట్ల ఆస్తులు జప్తయినా చలించని ఏకైక ధీరుడు?

  ఇదివరకు ప్రభుత్వం ఇచ్చే రెండు వందల రూపాయల పెన్షన్ కోసం అనేక వేల మంది వృదులు కాళ్ళరిగిపోయేలా తిరిగడం మనకి తెలుసు. ఇప్పుడు రెండు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు వచ్చిన తరువాత ప్రభుత్వం పెంచిన వెయ్యి రూపాయల పెన్షన్ కి అర్హుల జాబితాలో పేరు లేకపోవడంతో కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకొంటున్నవారు, గుండెపోటుతో చనిపోతున్న వారి గురించి కూడా మనకి తెలుసు. నీళ్ళు లేక కళ్ళ ముందు పంటలు ఎండిపోతుంటే, వాటి కోసం చేసిన అప్పులు తలుచుకొని అదే పొలాలలో పురుగుల మందులు త్రాగి ప్రాణాలు తీసుకొంటున్నవారి గురించి మనకి తెలుసు. వారు చనిపోయాక, వారి భార్యా పిల్లలను అప్పులిచ్చినవారు వేధిస్తుంటే పాపం ఆ తల్లీ పిల్లాలూ కూడా ఏ బావిలోనో దూకి ఆత్మహత్యలు చేసుకోవడం గురించి వార్తలు వింటున్నాము. ఇవన్నీ వింటున్నప్పుడు ఎవరికయినా మనసు ఉసూరుమనక మానదు. కేవలం వెయ్యి రూపాయల కోసం ప్రాణాలు పోగొట్టుకొంటున్నారు అంటే వారికి ఆ చిన్న మొత్తం ఎంత అమూల్యమయిందో అర్ధమవుతుంది.   కానీ ప్రతీ రెండు మూడు నెలలకీ ఒకసారి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అధికారులు జగన్మోహన్ రెడ్డికి చెందిన కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేస్తున్నా ఆయనకు చీమ కుట్టినట్లు లేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన ప్రత్యర్ధులు అతని వద్ద లక్షల కోట్ల ఆస్తులు పడున్నాయని ఆరోపిస్తే ఆయన వారి ఆరోపణలకు ఏనాడు నేరుగా జవాబు చెప్పే ప్రయత్నం చేయరు. కానీ వారందరూ కలిసి అమాయకుడయినా తనపై లేనిపోని తప్పుడు కేసులు పెట్టించారని ప్రత్యారోపణలు చేస్తారు. లేకుంటే ఫలానా ఫలానా వాళ్ళ మీద ఆనాడు కోర్టులో కేసులు వేస్తే స్టే తెచ్చుకోలేదా అని వితండవాదం చేస్తారు తప్ప ప్రత్యర్ధులు చేస్తున్న ‘ఆ లక్షల కోట్ల’ ఆస్తుల ప్రస్తావన తేకుండా జాగ్రత్తపడుతుంటారు.   అయితే ఆయన తన ఆస్తుల గురించి చెప్పుకొన్నా చెప్పుకోకపోయినా, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇంతవరకు జగన్ మరియు అతని సహచర సంస్థలకు చెందిన జప్తు చేసిన ఆస్తుల విలువే రూ. 863 కోట్లుంది. ఈ రోజు తాజాగా మరో 47 కోట్ల విలువయిన ఆస్తులను జప్తు చేసింది. అంటే మొత్తం రూ.910 కోట్లు అన్నమాట. అయినప్పటికీ జగన్ కి చీమ కుట్టినట్లుగా అయినా ఉందో లేదో తెలియదు. వెయ్యి రూపాయల కోసం పాపం పేదవాళ్ళు ప్రాణాలు పోగొట్టుకొంటుంటే, ఏకంగా రూ. 910 కోట్లు పోయినా చలించకుండా జగన్మోహన్ రెడ్డి తన బిజినెస్సులు, ధర్నాలు నిరాహార దీక్షలు వగైరా అన్నీకార్యక్రమాలు ఏమీ జరగనట్లుగా యధావిధిగా చేసుకుపోతుండటం గమనిస్తే ప్రతిపక్షాల ఆరోపణలు నిజమేనని నమ్మక తప్పేలా లేదు.

రామోజీని కేసీఆర్ ఎందుకు పొగిడారంటే...

  అనవసరంగా ఎవర్నీ పొగడని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్నీమధ్య మీడియా మొఘల్, ఫిలింసిటీ రూపకర్త, ముఖ్యంగా ‘ఆంధ్రోడు’ అయిన రామోజీరావును భారీ స్థాయిలో పొగిడారు. తనకున్న బిజీ షెడ్యూల్లో కూడా రామోజీ ఫిలింసిటీలో ఐదు గంటలపాటు గడిపి ఫిలింసిటీని, త్వరలో నిర్మించబోయే ‘ఓం’ నగరాన్ని, రామోజీని పొగడ్తల వర్షంలో ముంచేశారు. కేసీఆర్ నోటి వెంట ఆంధ్రులను తిట్టడమే విన్నవారికి ఇది ఒక పిడుగులాంటి పరిణామం. తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో ‘‘లక్ష నాగళ్ళతో రామోజీ ఫిలింసిటీని దున్నుతాం’’ అని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడిలా రామోజీని లక్ష పొగడ్తలతో ముంచేయడం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని బిత్తరపోయేలా చేసింది. జనానికి షాకులివ్వడం కేసీఆర్‌కి కొత్త కాదు. అయితే ఇంత పెద్ద షాక్ ఇస్తారని మాత్రం ఎవరూ ఊహించలేకపోయారు. ఆ షాక్ నుంచి జనం తేరుకోవడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం వుంది. ఊరికే పొగడరు మహానుభావులన్నట్టుగా రామోజీని కేసీఆర్ ఈ రకంగా పొగడ్డం వెనుక వున్న అసలు కారణాన్ని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   దొరతనం పుష్కలంగా వున్న కేసీఆర్ మొదటి నుంచీ రామోజీరావుకు చెందిన సామాజికవర్గం అంటే విపరీతమైన మంట. రాష్ట్ర విభజనను ఆ సామాజికవర్గానికి చెందినవారే విపరీతంగా వ్యతిరేకించారన్న ఆగ్రహం ఆయనకి వుంది. అందుకే తన మాటల్లో, చేతల్లో ఆ కులం మీద తన ఆగ్రహాన్ని వెళ్ళగక్కుతూ వుండేవారు. ఆ కులానికి చెందిన వారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారన్న అక్కసు కూడా ఆయన మాటల్లో ధ్వనిస్తూ వుండేది. అలాంటి కేసీఆర్ ఇప్పుడు రామోజీరావు ఆహ్వానించకుండానే ఫిలిం సిటీకి వెళ్ళడానికి, పొగ్గడ్డానికి వెనుక వున్నది రాజకీయ కారణాలేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఉద్యమం చేస్తున్న సమయంలో ఆ సామాజికవర్గానికి చెందిన వారిని కేసీఆర్ ఎంత ఘాటుగా విమర్శించినా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాధినేతగా ఉన్నప్పుడు బలమైన ఆ సామాజికవర్గాన్ని తిట్టి ఉపయోగం లేదని కొంతమంది సన్నిహితులు, శ్రేయోభిలాషులు కేసీఆర్‌కి ఉపదేశం చేసినట్టు సమాచారం. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే, ఇప్పటికే చెందిన అభివృద్ధి ఆగిపోకుండా వుండాలంటే ఆ సామాజికవర్గంతో అనుబంధాన్ని పెంచుకోక తప్పదని వారు సూచించినట్టు తెలుస్తోంది.   వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో రామోజీరావు మీద, ఫిలింసిటీ మీద, మార్గదర్శి మీద కక్షగట్టి వ్యవహరించారు. అది అప్పటి ఆంధ్రప్రదేశ్‌లోని రామోజీ కులస్థులకు ఆగ్రహాన్ని తెప్పించింది. రామోజీ మీద చేస్తున్న దాడి తమ సామాజికవర్గం మీద చేస్తున్న దాడిగానే అందరూ భావించారు. దాంతో వారంతా క్రమంగా కాంగ్రెస్ పార్టీకి దూరమై తెలుగుదేశం పార్టీకి చేరువయ్యారు. ఇప్పుడు వైఎస్సార్ చేసిన తప్పే మీరూ చేయడం ఎందుకని కేసీఆర్ సన్నిహితులు చెవిలో ఇల్లు కట్టుకుని బోధించినట్టు భోగట్టా.   తెలంగాణలో పెట్టుబడులు పెట్టినవారిలో, భారీ సంఖ్యలో పరిశ్రమలు నిర్వహిస్తున్నవారిలో ఆ కులానికి చెందిన వారే ఎక్కువమంది వున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు వాళ్ళంతా మూటాముల్లె సర్దుకుని ఆంధ్రప్రదేశ్‌కి తరలి వెళ్ళిపోతే తెలంగాణకు తీరని నష్టం జరిగే ప్రమాదం వుంది. ఇప్పటికే ఆర్థిక కష్టాలు ప్రారంభమైన తెలంగాణకు అది మరొక పెద్ద కష్టం అయ్యే అవకాశం వుంది. అందుకే ఆ కులాన్ని మంచి చేసుకునే ప్రయత్నాలను ప్రారంభించారు. అందులో భాగమే రామోజీని పొగడ్డం, అదే సామాజిక వర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవి ఇవ్వబోవడం అని విశ్లేషకులు అంటున్నారు.   ఇవాళో రేపో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో తుమ్మల నాగేశ్వరరావుకు రోడ్లు, భవనాల శాఖతోపాటు విద్యుత్ శాఖను కూడా ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఇది కూడా కేసీఆర్ రాజకీయ వ్యూహంలో ఒక భాగమే. తెలంగాణ రాష్ట్రంలో విద్యుదుత్పాదన కంపెనీలు నిర్వహిస్తున్నవారు, బిల్డర్లు ఎక్కువమంది తుమ్మల సామాజికవర్గానికి చెందినవారే. ఆ రెండు రంగాలకూ తుమ్మలను మంత్రిగా చేయడం వల్ల తన సామాజికవర్గానికి చెందిన వారు తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టకుండా తుమ్మల చేయగలరన్న నమ్మకంతోనే కేసీఆర్ ఆ రెండు శాఖలను తుమ్మలకు అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది. తుమ్మల హోంశాఖ మంత్రి కావాలన్న ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ కేసీఆర్ ఆయనను ఈ రెండు శాఖలనే కేటాయించనున్నారని తెలుస్తోంది.   ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన సామాజికవర్గం టీఆర్ఎస్‌కి దూరమైపోయింది. కాంగ్రెస్ నాయకుడు జానా ఛార్మ్ కోల్పోవడంతో ఇప్పుడు అందరూ టీడీపీ నాయకుడు రేవంత్ వైపు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ అని వాళ్ళు నమ్ముతున్నారు. రేవంత్ సామాజికవర్గానికి రామోజీ సామాజివర్గం వాళ్ళు కూడా కలిశారంటే అది రాజకీయంగా టీఆర్ఎస్‌కి పెద్ద నష్టం చేసే అవకాశం వుంది. దాంతో రేవంత్ కులం ఎలాగూ తనకు దూరమైపోయింది... ఇప్పుడు రామోజీ కులాన్నయినా దగ్గర చేసుకోవాలని కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలే ఇవన్నీ అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అంచేత లక్ష నాగళ్ళతో రామోజీ ఫిలింసిటీని కేసీఆర్ దున్నితే చూడాలని కోరుకుంటున్న వాళ్ళు ఇక ఆశలు వదులుకోవడం మంచింది.

విభజన బిల్లుకి సవరణలు సాధ్యమేనా?

  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం తనకు కంచుకోట వంటి ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్రద్దలు కొట్టుకోవడానికి కూడా వెనుకాడలేదు. అయితే వ్రతం చెడ్డా ఫలం కూడా దక్కలేదన్నట్లయింది దాని పరిస్థితి. అయితే అది చేసిన తప్పుకి నేడు ఆంద్ర, తెలంగాణా ప్రజలు, ప్రభుత్వాలు గొడవలుపడాల్సి వస్తోంది. రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత అవి క్రమంగా తగ్గకపోగా నానాటికీ మరింత పెరుగుతున్నాయి. గవర్నర్ నరసింహన్ కూడా ఈ విషయంలో ఏమీ చేయలేక చేతులెత్తేశారు. ఇక కేంద్రమో లేకపోతే సుప్రీంకోర్టో జోక్యం చేసుకొని ఈ సమస్యలను పరిష్కరించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కొన్ని గొడవలు సుప్రీంకోర్టుకు చేరుకోన్నాయి. బహుశః త్వరలో మరిన్ని పిటిషన్లు పడవచ్చును. అదేజరిగితే, ఇంతవరకు నిర్లిప్తంగా కూర్చోన్నందుకు సుప్రీంకోర్టు మొదట కేంద్రానికి మొట్టికాయలు వేసినా ఆశ్చర్యం లేదు. మరి ఆ భయంతోనో లేక ఈ సమస్యలను పరిష్కరించక తప్పని పరిస్థితులు ఏర్పడినందునో గానీ, కేంద్రం అవసరమయితే రాజ్యాంగాన్ని కానీ లేదా విభజన బిల్లును గానీ సవరించడం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించాలని భావిస్తున్నట్లు కేంద్రమంత్రి యం. వెంకయ్యనాయుడు తెలిపారు.   కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో న్యాయ సలహాలు కోరిందని తెలిపారు. రాష్ట్ర విభజనలో కీలకపాత్ర పోషించిన మాజీ కేంద్రమంత్రి జైరామ్ రమేష్ ని కూడా ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి సహాయం అందించమని కోరినట్లు ఆయన తెలిపారు. అయితే ఈసారి ఇరు రాష్ట్రాల ప్రతినిధులను సంప్రదించి వారి సలహాలను, సూచనలను అన్నిటినీ పరిగణనలోకి తీసుకొని ఆ ప్రకారమే రాజ్యాంగంలో కానీ విభజన బిల్లులో గానీ నియమ నిబంధనలు మార్చుతామని ఆయన తెలిపారు.   వాస్తవిక దృక్పధంతో చూస్తే వెంకయ్యనాయుడు పద్ధతి ద్వారా అన్ని సమస్యలను శాస్వితంగా పరిష్కరించే అవకాశం ఉంది. కానీ ప్రతీ విషయంలో తమ మాటే నెగ్గాలని, తమ వాదనే సరయినదని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నప్పుడు, బిల్లులో లేదా రాజ్యాంగంలో సవరణలు సాధ్యమేనా? అని ఆలోచిస్తే సాధ్యం కాదనే అనిపిస్తుంది. విభజన బిల్లును కదపడం అంటే తేనే తుట్టెను కదపడమేనని చెప్పవచ్చును. కానీ ఏదో ఒక ప్రయత్నం చేయకపోతే ఈ సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావు కనుక ఈ విషయంలో కేంద్రం చొరవ తీసుకోవడమే మంచిదని చెప్పవచ్చును.

కొప్పులు పట్టుకొంటున్న తెరాస నేతలు

  ఎన్నికలలో టికెట్స్ కేటాయింపు, మంత్రివర్గ విస్తరణ ఏ రాజకీయపార్టీకయినా అగ్ని పరీక్షల వంటివే. వాటికి ముందు ఒక రకమయిన పరిస్థితి తరువాత పూర్తిగా విభిన్నమయిన పరిస్థితులు ఉంటాయి. ముందు పార్టీ అధిష్టానాల చుట్టూ ఆ పార్టీ నేతలు తిరిగితే, ఆ తరువాత పార్టీ అధిష్టానాలు అసమ్మతి రాగాలు ఆలపించే వారి చుట్టూ తిరగడం పరిపాటి. అందుకే ఈ రెండు పనులు కత్తి మీద సాము వంటివేనని చెప్పక తప్పదు. రేపు మంత్రి వర్గ విస్తరణకు పూనుకొన్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సరిగ్గా ఇటువంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు.   ఆయనకు అత్యంత సన్నిహితుడు, విశ్వసనీయ అనుచరుడు అని పేరు పొందిన కొప్పుల ఈశ్వర్ కు మొదట్లోనే ఉపముఖ్యమంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. ఆయన కరీం నగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గం నుండి మూడు సార్లు యం.యల్యే.గా పోటీ చేసి గెలిచారు. కానీ కనీసం మంత్రి పదవి కూడా దక్కలేదు. కనీసం ఈసారయినా తప్పకుండా మంత్రి పదవి ఇస్తారని ఆయన, ఆయన అనుచరులు కూడా ఆశించారు. కానీ ఈసారి కూడా వేరే వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చి ఆయనకు మాత్రం చీఫ్ విప్ పదవి ఇవ్వజూపితే ఆయన నిరాకరించినట్లు తెలుస్తోంది.   ఆయన అనుచరులయితే అప్పుడే కరీంనగర్ జిల్లాలో ధర్నాలు, రాస్తారోకోలు అంటూ వీరంగం అడేస్తున్నారు కూడా. మూడు సార్లు వరుసగా యం.యల్యే.గా గెలిచి, కేసీఆర్ ఆదేశానుసారం రెండు సార్లు తన యం.యల్యే. పదవికి రాజీనామాలు చేసిన తమ నాయకుడు కొప్పులకుమంత్రి పదవి ఈయకుండా నిన్నగాక మొన్న పార్టీలో చేరిన వారికి, మొట్టమొదటిసారిగా యం.యల్యే.గా ఎన్నికయిన వారికీ మంత్రిపదవులు ఇస్తున్నందుకు ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం ముందే తాము ధర్నాలు చేసేందుకు కూడా వెనుకాడబోమని మీడియా ముఖంగానే వారు ముఖ్యమంత్రి కేసీఆర్ కి బహిరంగ హెచ్చరికలు చేస్తున్నారు. అది వారు చేస్తున్న హెచ్చరికలు కావు వారి ద్వారా కొప్పులే స్వయంగా చేస్తున్న హేచ్చారికలుగా భావించవలసి ఉంటుంది.   ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇంకా24 గంటలు సమయం ఉన్నందున ఈలోగా అటు ముఖ్యమంత్రి కేసీఆర్, ఇటు కొప్పుల వర్గీయులు తాము అనుకొన్నది సాధించేందుకు సామదానబేధ దండోపాయలన్నీ ప్రయోగించడం తధ్యం. ఒకవేళ ముఖ్యమంత్రి కొప్పులను వెనక్కి తగ్గేలా ఒప్పించగలిగితే, తాత్కాలికంగా మంటలు ఆర్పివేసినా లోలోన నిప్పు రాజుకొంటూనే ఉంటుంది.   ఒకవేళ కొప్పుల ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి మంత్రి పదవి దక్కించుకోగలగితే, ఆయన వలన వేరేవారి నోటికాడ కూడు లాకోన్నట్లవుతుంది కనుక అప్పుడు సదరు నేత ఇంతకంటే తీవ్ర స్థాయిలో అసమ్మతి రాగం ఆలపించే అవకాశం ఉంది. అయితే ఎవరు ఎన్ని కుప్పి గంతులు వేసినప్పటికీ ప్రస్తుతం అధికార పార్టీని వీడి బయటకు వెళ్ళే దుస్సాహసం ఎవరూ చేయబోరు కనుక ఈ అలకలు, అసమ్మతి రాగాలు కూడా క్రమంగా తగ్గుముఖం పట్టక తప్పదు. మన రాజకీయ పార్టీల చరిత్రలను తిరగేస్తే ఆ సంగతి అర్ధమవుతుంది.

సమయం కాని సమయంలో వైకాపా ధర్నాలు

  ప్రతిపక్ష పార్టీ అన్నాక ఏదో ఒక హంగామా చేస్తూ ఉండక తప్పదు లేకుంటే ప్రజలు, ప్రభుత్వం కూడా పట్టించుకోవడం మానేస్తారు. ‘అసలు రాష్ట్రంలో ఆ పార్టీ ఉందా లేదా?’ అంటూ మీడియా కూడా వెనక నుండి గిల్లుతో ఉంటుంది. అదీగాక నిత్యం ఏదో ఒక హడావుడి చేయకపోతే పార్టీ నేతలు వారి అనుచరులు కూడా పక్క పార్టీల వైపు దిక్కులు చూడటం మొదలుపెడుతుంటారు. కనుక ఏదో ఒక సాకు దొరకబుచ్చుకొని ప్రతిపక్షాలు హడావుడి చేయక తప్పదు. కనుకనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయంలో చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తుంటాయి, ప్రభుత్వాలు, ప్రజలు ఏమనుకొన్నా సరే.   ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న వైకాపా కూడా ఆ సూత్రమే పాటిస్తోందని చెప్పవచ్చును. ప్రభుత్వం తన హామీలను అమలుచేయకపోవడాన్ని నిరసిస్తూ మొన్న రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, మహా ధర్నాలు నిర్వహించిన వైకాపాకు వైజాగ్ కాకుండా మరో ఒకట్రెండు జిల్లాలలో మాత్రమే స్పందన కనబడింది. వైజాగ్ లో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ధర్నాకు కూర్చొన్నారు గనుక ఉత్తరాంధ్ర జిల్లాల నేతలు దానిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని జనసమీకరణ చేయడంతో అక్కడ జనాలు బాగానే కనబడ్డారు.   మళ్ళీ వచ్చే నెల 6, 7 తేదీలలో జగన్మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లాలో తణుకు పట్టణంలో ధర్నాలు చేయబోతున్నారు. కారణం అదే. అయితే సార్వత్రిక ఎన్నికలలో ఆ జిల్లాలో వైకాపా ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అంటే ఆ జిల్లాలో పార్టీకి అంత పట్టులేదని అర్ధమవుతోంది. తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటి ఆ జిల్లాలో జగన్ ధర్నాకు కూర్చోన్నాక ధర్నా కార్యక్రమంలో జనాలు కనబడకపోతే చాలా అవమానకరం కనుక స్థానిక నేతలు మళ్ళీ జనసమీకరణ కోసం చెమటోడ్చక తప్పదు.   ఇక ధర్నా కోసం ఆయన ఎంచుకొన్న సమయం కూడా సరిగ్గాలేదని చెప్పవచ్చును. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత సంక్రాంతి పండుగకు సరిగ్గా వారం రోజుల ముందు ధర్నాకు కూర్చోవడం వలన ఆశించిన ఫలితం కనబడక పోవచ్చును. అదే అసెంబ్లీ సమావేశాలకు ముందు తనకు బాగా పట్టున్న ఏ కడపలోనో నెల్లూరులోనో ధర్నాలో, మహామహా ధర్నాలో విజయవంతంగా చేసుకొని ఉంటే, ఆ పేపర్ కటింగులు పట్టుకొనొచ్చి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే అవకాశం ఉండేది. కానీ తనకు బొత్తిగా బలం లేని చోట ప్రజలందరూ పెద్ద పండగకి సిద్దమవుతున్న సమయంలో ధర్నాలు చేయడం తప్పు నిర్ణయమేనని భావించవచ్చును.