శభాష్ అసదుద్దీన్ జీ!

  తాలిబాన్ ఉగ్రవాదుల కంటే అతి భయంకరమయిన, కిరాతకమయిన ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నారు. సిరియా, ఇరాక్, జోర్డాన్ దేశాలలో ముస్లిం మరియు క్రీస్టియన్ మతాలకు చెందిన అనేకమంది యువతులను, పెళ్ళయిన మహిళలను, అభంశుభం తెలియని బాల, బాలికలను చెరపట్టి సెక్స్ బానిసలుగా ఉపయోగించుకొంటున్నారు. అందుకు నిరాకరిస్తున్న వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేస్తున్నారు. కొందరిని బజారు వస్తువుల్లా అమ్మేస్తున్నారు. ఎందుకూ పనికి రారనుకొన్నవారిని సజీవంగా భూస్థాపితం చేసేస్తున్నారు. చిన్నారి పసిపిల్లల పట్ల కూడా వారు చాలా కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. వారిలో చెరలో చిక్కిన అనేకమంది చిన్నారులు, బాల బాలికలు, వృద్ధులు ఆకలి దప్పులతో అలమటించి చనిపోతున్నారని, ఉగ్రవాదుల నుండి వారినందరినీ తక్షణమే కాపాడలేకపోతే వేలాదిమంది బలయిపోతారని ఐక్యరాజ్యసమితికి చెందిన మానవ హక్కుల సంఘం తన తాజా నివేదికలో ప్రకటించింది.   ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు ఇంతవరకు అనేకమంది విదేశీయులను అతి కిరాతకంగా గొంతు కోసి చంపారు. తమకు బందీగా చిక్కిన జోర్డాన్ దేశానికి చెందిన ఒక పైలట్ ని అంతకంటే అతి కిరాతకంగా ఒక ఇనుప బోనులో బందించి అతనిపై పెట్రోల్ పోసి సజీవదహనం చేసి, దానిని తమ అధికారిక వెబ్ సైట్లో పెట్టడం యావత్ ప్రపంచాన్ని కలవరపరిచింది. వారు అతనిని సజీవ దహనం చేస్తున్న సమయంలో అతను కళ్ళు మూసుకొని అల్లాను ప్రార్దిస్తూ మరణించడం యావత్ ముస్లిం సోదరులను తీవ్రంగా కలచివేసింది.   వారి ఆకృత్యాలను చూస్తున్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ దీనిపై స్పందిస్తూ “జీహాద్ అంటే రక్తపాతం, విధ్వంసం కాదనీ, యువత తమ బస్తీలలో ఉన్న సమస్యలపై పోరాటం చేసి వాటిని పరిష్కరించడమే జిహాద్ గా భావించాలని హితవు పలికారు. నిన్న ఆయన హైదరాబాద్ లోని జామియా నిజామియాలో మీడియాతో మాట్లాడుతూ, ఇస్లాంకు ఐఎస్‌ఐఎస్ ప్రధాన శత్రువన్నారు. దానితో ఇస్లాం మతానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. జిహాద్ పేరిట ఉగ్రవాదులు చేస్తున్న అకృత్యాలు, సృష్టిస్తున్న రక్తపాతాన్ని ఇస్లాం మతం అంగీకరించదని ఆయన అన్నారు.   జిహాద్ పేరిట ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు చేస్తున్నఆకృత్యాలను యావత్ ముస్లిం సోదరులు ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. జీహాద్ పేరిట ఇంటర్నెట్, మొబైల్‌లలో కనిపించే సమాచారం చూసి యువత దారితప్పుతోందనీ, ఉగ్రవాది హఫీజ్ సయీద్ లాంటి సంఘ విద్రోహ శక్తులు పొందుపరచిన సమాచారమే అందులో ఉంటుందన్నారు. ముస్లిం యువత అటువంటి వారికి దూరంగా ఉంటూ సమాజ శ్రేయస్సు కొరకు కృషి చేయాలని ఆయన కోరారు.   జీహాద్‌కు అసలయిన అర్ధం, నిర్వచనం తెలుసుకోవలంటే యువత ముస్లిం మతగురువులు మౌలానాలను సంప్రదిస్తే తెలుస్తుందన్నారు. నిజంగా జీహాద్ చేయాలనుకుంటే యువత తమ తమ బస్తీ పరిసరాల్లోని చెడు సమస్యలపై దృష్టి సారించాలని అసదుద్దీన్ కోరారు. ప్రజాస్వామిక దేశమయిన భారతదేశంలో ప్రజల మత స్వేచ్ఛను ఆపడం ఎవరి తరం కాదన్నారు.   యంపీ అసదుద్దీన్ ఒవైసీ అందరికంటే ఈ సమస్యను గుర్తించి ఈవిధంగా మీడియా ముందుకు వచ్చి ఉగ్రవాదుల చర్యలను ఖండించడం చాలా అభినందనీయం. రాష్ట్రంలో మరియు దేశంలో మతగురువులు, ముస్లిం ప్రముఖులు, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి ప్రముఖ సినీ నటులు, మేధావులు, రచయితలు అందరూ కూడా ఇదేవిధంగా ముందుకు వచ్చి దేశంలో ముస్లిం యువత దారి తప్పకుండా కాపాడుకొంటే, దేశానికి, యువతకి కూడా చాలా మేలు చేసినవారవుతారు.

ఆంద్రప్రదేశ్ కి సిరులు కురిపించే శ్రీ సిటీ

  చెన్నై నగరానికి కేవలం 55కిమీ దూరంలో ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో చిత్తూరు వద్ద ఏర్పాటు చేసిన శ్రీ సిటీ పారిశ్రామికవాడలో 25 దేశాలకు చెందిన 104 చిన్నాపెద్దా పరిశ్రమలు గత ఐదేళ్ళుగా పనిచేస్తున్నాయి. వాటిలో పిల్లలు ఆడుకొనే ఆట వస్తువులు మొదలుకొని ట్రక్కులు, భారీ యంత్రసామాగ్రి వరకు తయారవుతున్నాయి. జపాన్ దేశానికి చెందిన ఆటోమొబైల్ పరికరాలు తయారు చేసే సంస్థ ‘ఐసన్’ అక్కడే తమ పరిశ్రమను స్థాపించబోతున్నట్లు ప్రకటించింది.   “మొదట మేము బెంగళూరులో మా సంస్థను స్థాపించాలని అనుకొన్నప్పటికీ మా వినియోగదారులయిన నిస్సాన్ మరియు టొయోటా కంపెనీలు తమిళనాడులో శ్రీపెరంబూరులో ఉన్నందున వాటికి దగ్గిరగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఇక్కడే మా సంస్థను స్థాపించాలని నిర్ణయించుకొన్నాము,” అని ఆ సంస్థకి చెందిన జే. సెంథిల్ కుమార్ తెలిపారు.   ఈ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించేందుకు సువిశాలమయిన ఖాళీ స్థలాలు ఉండటమే కాక అన్ని విధాల అభివృద్ధి చేయబడి ఉండటం, నిరంతర విద్యుత్ సరఫరా కలిగి ఉండటం, ఆంధ్ర, తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక, రాష్ట్రాలకు వేగంగా సరుకు రవాణా చేసుకొనే అవకాశం కలిగిఉండటం వంటి కారణాల వల్ల ఇక్కడ పరిశ్రమలు స్థాపించడానికి అనేక మంది ఆసక్తి చూపిస్తున్నారు. ద్విచక్ర వాహన తయారీలో దేశంలో ప్రసిద్ది చెందిన హీరో మొటోకార్ప్ సంస్థ త్వరలోనే ఇక్కడ ఉత్పత్తి మొదలుపెట్టబోతోంది.   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన విదేశీ పర్యటనలలో అక్కడి పారిశ్రామికవేత్తలకు ఈ శ్రీసిటీ ప్రత్యేకతలను వివరించి అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించగలిగారు. జపాన్ కి చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ ఇసుజు శ్రీసిటీలో తన ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించేందుకు సిద్దమయింది. జపాన్, అమెరికాలతో సహా మరో మూడు దేశాలకు చెందిన సంస్థలు ఈ శ్రీసిటీలో దాదాపు రూ.19,000 కోట్ల పెట్టుబడితో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చినట్లు శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సనారెడ్డి చెప్పారు. వాటిలో కొన్ని సంస్థలతో చర్చలు తుది దశలో ఉంటే, మరి కొన్ని నిర్మాణానికి సిద్దంగా ఉన్నాయని అయన తెలియజేసారు. కేంద్రప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి కోసం నిన్న ప్రకటించిన రాయితీల వల్ల ఇక్కడకి మరిన్ని పరిశ్రమలు తరలిరావచ్చని ఆశించవచ్చును.

జగన్ ఫ్యాన్స్ ఆందోళన

  ఎలాంటి వారికైనా కొంతమంది ఫ్యాన్స్ వుంటారు. దానికి కారణం వారి దగ్గర వున్న డబ్బు కావచ్చు.. వారి వల్ల గతంలో పొందిన లాభం కావొచ్చు.. భవిష్యత్తులో ఉపయోగపడతాడన్న ఆశ కావొచ్చు... ఇతనూ మనలాంటివాడేనన్న అభిమానం కావచ్చు... ఎలాంటి వ్యక్తిత్వం వున్నవారినైనా అభిమానించేవారు కొందరు ఉంటారన్నది ఖాయం. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే మన వైసీపీ నాయకుడు జగన్. తన తండ్రిని అడ్డుగా పెట్టుకుని ఈయన లక్షల కోట్ల రూపాయలు సంపాదించారన్న ఆరోపణలున్నాయి. ఆ ఆరోపణలకు బలం చేకూర్చే లక్షల కోట్ల ఆస్తులున్నాయి. సీబీఐ కేసులున్నాయి... అన్నిటికీ మించి 16 నెలల జైలు జీవితం వుంది... ఇంకా చెప్పాలంటే బోలెడన్ని సాక్ష్యాధారాలున్నాయి. మొత్తమ్మీద జగన్ వైట్ కాలర్ నేరస్తుడన్న విషయం దేశంలో ఎవర్ని అడిగినా తడుముకోకుండా చెబుతారు. అయితే అలాంటి జగన్‌ని కూడా కొంతమంది అభిమానిస్తారు. అందుకే ఆయనకు గత ఎన్నికలలో కొన్ని స్థానాలు వచ్చాయి. అవి ఏ మార్గంలో వచ్చాయన్నది ప్రస్తుతానికి అప్రస్తుతం. అలా జగన్ని అభిమానించేవారు ఇప్పుడు చాలా ఆందోళనకు గురవుతున్నారు. ఎలాంటి ఫ్లాష్‌బ్యాక్ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ పార్టీని కొద్ది స్థానాల్లో అయినా గెలిపించారు. 16 నెలలో జైల్లో వున్నా చివరికి బెయిల్ దొరికింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంటూ, నిర్మాణాత్మక ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తే బాగుంటుంది కదా అని ఆయన అభిమానులు అనుకుంటున్నారు. అయితే జగన్ మాత్రం ప్రతిక్షణం అధికార పార్టీ మీద విరుచుకుపడుతూ, అయిన దానికీ కానిదానికీ ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేయడానికి తంటాలు పడుతున్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు విషయంలో ప్రభుత్వాన్ని ఏదోరకంగా బద్నామ్ చేయడానికి జగన్ పడుతున్న తంటాలు చూసి ఆయన అభిమానులు బాధపడుతున్నారు. అద్భుతమైన రాజధాని నిర్మాణానికి సహకారం అందిస్తే జగన్ సార్ పేరు కూడా చరిత్రలో నిలుస్తుంది కదా.. అలా కాకుండా అడ్డం తగులుతూ చరిత్ర లేకుండా అయిపోతాడే అని బాధపడుతున్నారు. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో వున్న రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి కృషి చేస్తున్న ప్రభుత్వానికి తనవంతు సహకారం అందిస్తే జనంలో కాస్తయినా సానుభూతి వస్తుంది కదా అనుకుంటున్నారు. జగన్ వ్యవహార శైలి ఇలాగే కొనసాగితే, రేపు ఎప్పుడైనా జగన్ జైల్లో పడితే కనీసం అయ్యోపాపం అనుకునేవాళ్ళు కూడా జనాల్లో మిగలరని జగన్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

మళ్ళీ ఓదార్పు యాత్రలకి జగన్ సిద్దం?

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మరో ఓదార్పు యాత్రకి సిద్దం అవుతున్నట్లు తాజా సమాచారం. ఆయన ఈనెల 11వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన రైతుల కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు బయలుదేరుతున్నట్లు వైకాపా చెపుతోంది. గత తొమ్మిది నెలల్లో రాష్ట్రంలో 85 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వైకాపా వాదిస్తోంది. వారి కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందలేదు కనుక జగన్మోహన్ రెడ్డి వారిని పరామర్శించి వారికి కొంత ఆర్ధిక సహాయం చేయబోతున్నట్లు సమాచారం.   ఆయన తన తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణించిన నాటి నుండి తన పార్టీని బలపరుచుకొనేందుకు ఓదార్పు యాత్రలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణా నుండి బయటపడిన వైకాపా మళ్ళీ తెలంగాణాలో అడుగుపెట్టేందుకు కూడా ఓదార్పుయాత్రలనే సురక్షితమయిన మార్గంగా ఎంచుకొంది. కానీ అక్కడ అధికారంలో ఉన్న తెరాసతో సంబంధాలు చెడగొట్టుకోవడం ఇష్టం లేకనో లేకపోతే తెలంగాణాలో అడుగుపెట్టే సాహసం చేయలేకనో ఆయన స్వయంగా తెలంగాణాలో పర్యటించకుండా తన సోదరి షర్మిలను పరామర్శ యాత్రల పేరిట పంపిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆయన రైతు కుటుంబాలను ఓదార్చే మిషతో యాత్రలకు ఎందుకు బయలుదేరుతున్నారంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు జేసేందుకేనని చెప్పవచ్చును. కానీ ఇటువంటి డొంకతిరుగుడు ప్రయత్నాల ద్వారా రాష్ట్రంలో ప్రజలను ఆకట్టుకొని ఎన్నికలలో గెలవడం సాధ్యం కాదని రెండు రాష్ట్రాలలో ప్రజలు స్పష్టంగా తెలియజేసారు. కానీ జగన్ తన ఓటమి నుండి ఎటువంటి గుణపాటం నేర్చుకోకుండా పాత పద్దతులలోనే ముందుకు సాగాలనుకోవడం విశేషమే.  

డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేడే చివరి రోజు

  డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఈరోజే చివరి రోజు. కనుక దాదాపు నెలరోజులుగా డిల్లీలో బీజేపీ, ఆమాద్మీ పార్టీల మధ్య హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల ప్రచార యుద్ధం ఈరోజు సాయంత్రం ఆరుగంటలకు ముగియబోతోంది. క్రితం సారితో పోలిస్తే, ఈసారి బీజేపీ, అమాద్మీ పార్టీ రెండూ కూడా ఈ ఎన్నికలలో ఎలాగయినా విజయం సాధించాలానే పట్టుదలతో చాలా తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఎంతో ఘన చరిత్ర ఉందని చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీ, ఆ రెండు పార్టీల మధ్య జరుగుతున్న పోరాటాన్ని ప్రేక్షక పాత్ర వహించి చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. ప్రచారం కీలక దశకు చేరుకొంటున్న కొద్దీ బీజేపీ, ఆమాద్మీ పార్టీలు రెండూ కూడా తమ వద్ద ఉన్న అన్ని అస్త్ర శస్త్రాలు బయటకి తీసి ఒకదానిపై మరొకటి ప్రయోగించుకొంటున్నాయి. బీజేపీ ఈవిధంగా పోరాడటం ఎవరికీ ఆశ్చర్యం కలిగించకపోయినా, ఆమాద్మీ పార్టీ విజయమో వీరస్వర్గమో అన్నట్లుగా తన సర్వశక్తులు ఒడ్డి బీజేపీతో పోరాడటం చాలా ఆశ్చర్యంగానే ఉంది. అందుకు బలమయిన కారణమే ఉంది. ఈసారి ఆమాద్మీ పార్టీ ఎన్నికలలో గెలవలేకపోతే మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు ఆ పార్టీని సజీవంగా నిలుపుకోవడం చాలా కష్టమవుతుంది. అందుకే ఇదే తన అంతిమ పోరాటంగా భావించి బీజేపీతో యుద్ధం చేస్తోంది. మరి డిల్లీ ప్రజలు ఏ పార్టీకి ఓటు వేసి గెలిపించుకొంటారో మరి కొన్ని రోజుల్లోనే తేలిపోతుంది. ఫిబ్రవరి 7వ తేదీన డిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.

అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకి జగన్ హాజరు

  అక్రమాస్తుల కేసుల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ మొత్తం 11 చార్జ్ షీట్లు దాఖలు చేసింది. అన్ని చార్జ్ షీట్లలో ఏ-1 నిందితుడిగా ఉన్న ఆయనపై ప్రస్తుతం మొదటి మూడు చార్జ్ షీట్లలో సీబీఐ చేసిన ఆరోపణలపై సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డిత్ బాటు ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న విజయసాయిరెడ్డి, అయోధ్యరామిరెడ్డి తదితరులు కూడా బుధవారం నాడు జరిగిన విచారణకు హాజరయ్యారు. వారు ఈ కేసుల విచారణకు హాజరయినప్పుడు తమను ఈ కేసుల నుండి విముక్తి చేయమని కోరుతూ డిశ్చార్జ్ పిటిషన్లు వేసారు. వాటిని స్వీకరించిన కోర్టు ఈనెల 9వ తేదీకి వాయిదా వేసింది. అక్రమాస్తుల కేసు విచారణను మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ 11 చార్జ్ షీట్లపై విచారణ పూర్తవడానికి ఇంకా ఎన్ని ఏళ్ళు పడుతుందో, అంతిమంగా ఎటువంటి తీర్పు వస్తుందో తెలియడం లేదు. బహుశః మరో నాలుగేళ్లయినా పడుతుందేమో?

కేసీఆర్ అభద్రతాభావంతో ఉన్నారా?

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే ఎన్నికల సమయానికి రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు 154కి పెరుగుతాయని అందులో కనీసం 134 సీట్లు తెరాసయే గెలుచుకొంటుందని జోస్యం చెప్పారు. తెలంగాణాలో తెరాసకు వేరే ప్రత్యామ్నాయం లేదని కుండ బ్రద్దలుకొట్టినట్లు ప్రకటించారు.   తెరాస పార్టీ ఏకంగా 134 సీట్లు గెలుచుకోగలదని ఆయనకి అంత విశ్వాసం ఉన్నపుడు ఇతర పార్టీల నేతలని, యం.యల్యే.లని పార్టీలోకి ఆకర్షించేందుకు అంత ముమ్మరంగా ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు? చంద్రబాబు నాయుడు ఒక్కరోజు వరంగల్ పర్యటించేందుకు వస్తుంటే తెరాస మంత్రులు అంత తీవ్రంగా ఎందుకు ప్రతిస్పందిస్తున్నట్లు? వైకాపా నేత షర్మిల రాష్ట్రంలో పరామర్శ యాత్రలు చేస్తుంటే బొత్తిగా పట్టించుకోని తెరాస నేతలు, చంద్రబాబు నాయుడు పర్యటిస్తారంటే మాత్రం ఎందుకు కంగారు పడుతున్నారు? అని ప్రశ్నించుకొంటే కేవలం అభద్రతాభావం వల్లనేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ కి వచ్చినప్పుడు తన పార్టీ నేతలకు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొంటే ఈ అనుమానం నిజమనేననిపిస్తుంది. తెరాస పార్టీ కేవలం ఒకరిద్దరు నేతల వ్యక్తిగత బలంపైన, తెలంగాణా సెంటిమెంటుపైనే ప్రధానంగా ఆధారపడి నిలబడి ఉందని, ఆ పార్టీకి సరయిన పునాదులు లేవని ఆయన అన్నారు. ఒకవేళ గ్రామ స్థాయి నుండి తెరాస పార్టీని బలంగా నిర్మించుకొని ఉంటే, కేసీఆర్ ఈవిధంగా ఇతర పార్టీలను చూసి అభద్రతాభావానికి గురి అవనవసరం లేదు. ఇతర పార్టీల నేతలకు గాలం వేయవలసిన అవసరం అంతకంటే ఉండదు. ఇదంతా కేసీఆర్ కి తెలియదనుకోలేము. తెలిసినా ఆయన తన పంధాలోనే ముందుకు సాగుతున్నారంటే ఆయనలో అభద్రతాభావమే అందుకు కారణమని చెప్పవచ్చును.   ఆ కారణంగానే ఆయన అప్పుడప్పుడు హోమాలు, యాగాలు చేస్తుంటారు. ఆ కారణంగానే దేవుళ్ళకు మొక్కులు చెల్లించుకోవాలనుకొంటున్నారు. ఆ కారణంగానే ఆయన ఇప్పుడు మళ్ళీ వాస్తును ఆశ్రయిస్తున్నారు. మనసులో ఇన్ని భయాలు పెట్టుకొని పైకి మాత్రం నూటికి నూటొక్క మార్కులు నాకే అనుకొంటే దాని వలన తెరాసయే నష్టపోతుంది తప్ప ప్రతిపక్షాలు కాదు.

తెరాస పట్ల వైకాపా వైఖరి మారుతోందా?

  ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణా ప్రభుత్వానికి, తెరాసను వెనకేసుకు వచ్చే సాక్షి మీడియాలో ఈ మధ్య వాటికి వ్యతిరేకంగా వార్తలు, విశ్లేషణలు రావడం చూస్తుంటేతెరాస పట్ల వైకపా వైఖరిలో క్రమంగా మార్పు వస్తోందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు ఆంద్ర ప్రయోజనాలు కాపాడుకోవాలి అంటూ గొంతు చించుకొన్న వైకాపా, ఎన్నికల తరువాత తెలంగాణా ప్రభుత్వం ఆంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని విమర్శలు చేస్తున్నా, యుద్ధాలు చేస్తున్నా ఏనాడూ నోరువిప్పిన దాఖలాలు లేవు. పోలవరం, ఫాస్ట్ పధకం, నీళ్ళు, విద్యుత్ వంటి అనేక అంశాల మీద రెండు ప్రభుత్వాల మధ్యన యుద్ధం జరుగుతుంటే ఏనాడు కూడా వైకపా ఆంద్ర ప్రయోజనాల గురించి మాట్లాడలేదు. కానీ ఆంద్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబుపై యుద్ధం ప్రకటించింది కూడా.   కానీ ఈమధ్యన సాక్షి మీడియా ద్వారా తెరాసను, తెలంగాణా ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది. కేసీఆర్ సచివాలయాన్ని ఎర్రగడ్డకు తరలించాలనే నిర్ణయంపై సాక్షి మీడియాలో ఒక చర్చ నిర్వహించడం ద్వారా కేసీఆర్ పై బాణాలు సందించింది. కాంగ్రెస్ నేతలు, ప్రతిపక్షాలు, ఎర్రగడ్డ ఆసుపత్రి ఉద్యోగులు అందరూ కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేస్తున్న ప్రకటనలు, నిరసన ర్యాలీల గురించి వార్తలు ప్రచురిస్తోంది. ఇదంతా చూస్తుంటే వైకాపా తెరాసకు దూరం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. కానీ బహుశః జి.హెచ్.యం.సి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే పనిగట్టుకొని కేసీఆర్ మరియు ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోందేమో? ఆవిధంగా హైదరాబాద్ జంట నగరాలలో స్థిరపడిన ఆంద్రప్రజలను ఆకట్టుకోవచ్చని భావిస్తోందేమో? అని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.

మోడీ విదేశీ విధానం సత్ఫలితాలు ఇస్తున్నట్లే ఉంది

  ఇంతకు ముందు శ్రీలంక అధ్యక్షుడిగా ఉన్న మహేంద్ర రాజపక్స చిరకాలంగా ఆ దేశానికి పెద్ద సమస్యగా తయారయిన యల్.టి.టి. ఉగ్రవాదుల సమస్యను పరిష్కరించారు. కానీ ఉగ్రవాదులను మట్టుబెట్టే ప్రయత్నంలో నిర్వహించిన మిలటరీ ఆపరేషన్ లో వేలాదిమంది అమాయకులయిన తమిళ మహిళలు, వృద్ధులు, చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుండే తమిళనాడులో ప్రజలు, రాజకీయ పార్టీలు కూడా రాజపక్సేని తీవ్రంగా వ్యతిరేకించేవి. ఆయన ప్రతీ ఏడాది విధిగా తిరుపతి వెంకన్న దర్శనానికి వస్తుండటం, ఆయన వచ్చినప్పుడు తమిళ పార్టీలు నిరసనలు తెలపడం ఆనవాయితీగా మారిపోయింది.   ఆయన తమిళ ప్రజలకే కాక భారతః ప్రభుత్వానికీ పెను సవాలుగా మారారు. భారత్-శ్రీలంక మధ్య సముద్రజలాలలో చేపలు పట్టుకొనే తమిళ జాలారులని తరచూ అరెస్ట్ చేసి జైల్లో పడేస్తుండటం, దానిపై తమిళ పార్టీలు నిరసనలు తెలపడం, ఆనక భారత్, శ్రీలంక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి విడిపించుకోవడం కూడా ఆనవాయితీగా మారిపోయింది. ఇక వీటన్నిటి కంటే మరింత తీవ్రమయిన విషయం ఏమిటంటే రాజపక్సే చైనాకు దగ్గరవుతూ దానిని మంచి చేసుకొనే ప్రయత్నాలలో భారత్ అభ్యంతరాలను త్రోసిపుచ్చి చైనాకు చెందిన రెండు అణుజలాంతర్గాములను శ్రీలంక పోర్టులో నిలిపి ఉంచేందుకు అనుమతించారు.   కానీ ఇప్పుడు మైత్రీపాల నేతృత్వంలో భారత్-శ్రీలంకల మధ్య మళ్ళీ మైత్రీ బంధాలు పునరుద్దరించబడినట్లయితే, బహుశః చైనా తన రెండు అణుజలాంతర్గాములను వెనక్కి తీసుకోవలసిందిగా ఆ దేశాన్ని శ్రీలంక కోరవచ్చును. కనుక ఈ పరిణామాలు చైనాకు చాలా ఆగ్రహం కలిగించవచ్చును. కానీ భారత్ చైనాతో సహా అన్ని దేశాలతో మిత్రత్వమే తప్ప శత్రుత్వం కోరుకోదనే విషయం చైనాకు కూడా తెలుసు. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా భారత్ పర్యటన ముగిసిన వెంటనే భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చైనా పర్యటనకు బయలుదేరడమే అందుకు ఒక ప్రత్యక్ష ఉదారణ.   త్వరలోనే ప్రధాని మోడీ కూడా చైనా పర్యటనకు వెళ్ళబోతున్నారు. ఆయన పర్యటనలో భారత్-చైనా దేశాల మధ్య చిరకాలంగా ఉన్న సరిహద్దు వివాదాలను శాశ్విత ప్రాతిపాదికన పరిష్కారం చేయాలని భావిస్తున్నారు. ఆ ప్రయత్నాలలో భాగంగానే ప్రస్తుతం సుష్మా స్వరాజ్ చైనాలో పర్యటిస్తున్నారు.అంతకంటే ముందుగా ఆయన శ్రీలంకలో పర్యటిస్తారు. ఆ సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడే విధంగా అడుగులు వేయవచ్చును. ఈ విధంగా ఒకే సమయంలో అటు అమెరికాతో, దానిని వ్యతిరేకించే చైనాతో, చైనా వ్యతిరేకించే జపాన్ దేశంతో, చైనాకు దగ్గరయిన శ్రీలంకతో సత్సబందాలు నెలకొల్పుకొనే ప్రయత్నాలు చేయడం హర్షణీయం.      

నటి త్రిషకు కాబోయే భర్తకు బెదిరింపు కాల్స్

  ప్రముఖ సినీనటి త్రిషకు కాబోయే భర్త వరుణ్‌మణియన్‌ తనకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ చెన్నైలోని తేనాంపేటలో గల పోలీసుస్టేషన్‌లో నిన్న ఫిర్యాదు చేశారు. ఐపీఎల్ క్రికెట్ పోటీలో చెన్నై సూపర్‌కింగ్స్ ఫ్రాంచైజ్ ను తీసుకోమని త్రిష కోరినట్లు మీడియాలో ప్రచారం జరిగింది కానీ అవన్నీ ఒట్టి ఊహాగానలేనని కొట్టిపడేశారు. ఒకవేళ ఆయన అటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే చంపేస్తామని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ ద్వారా ఆయనను బెదిరించడంతో ఆయన పోలీసులను ఆశ్రయించవలసి వచ్చింది. సినీ తారలు రాజకీయాలు, క్రికెట్ రంగాలపై మోజు పెంచుకొని వాటిలో ప్రవేశించడం చాలా రోజులుగా జరుగుతూనే ఉంది. ఇక ఐ.పి.యల్. సంగతి చెప్పనే అక్కరలేదు. అనేకమంది బాలివుడ్ నటీనటులు, రాజకీయనాయకులు అందులో పెట్టుబడులు పెట్టడం ద్వారా పేరుకి పేరు డబ్బుకి డబ్బు ఆర్జించాలని ఆరాటపడుతున్నారు.   నిప్పు లేనిదే పొగ రాదన్నట్లు సినీ, వ్యాపార రంగాల నేపద్యం నుండి వచ్చిన త్రిష, వరుణ్‌మణియన్‌ కూడా ఐ.పి.యల్. మోజు పెంచుకొని ఉండి ఉంటే ఆశ్చర్యమూ లేదు. అది నేరమూ కాదు. కానీ ఐ.పి.యల్. ఫ్రాంచైజ్ కొనేందుకు ప్రయత్నిస్తే చంపేస్తామని బెదిరింపులు రావడమే ఆశ్చర్యంగా ఉంది. దానిని బట్టి ఐ.పి.యల్. వ్యాపారం ఎంత పెద్ద ఎత్తున జరుగుతోందో? దానికి ఎంత పోటీ ఉందో అర్ధమవుతోంది. ప్రజలను రంజింపజేయడానికి సృష్టించిన ఐ.పి.యల్. క్రికెట్ పోటీలలో ఇటువంటి అనారోగ్యకరమయిన ఆలోచనలు, ప్రయత్నాలు ఇప్పటికే చాలా జరగడంతో క్రమంగా దాని ప్రతిష్ట మసకబారుతోంది. ఇప్పుడు అది ఒకరినొకరు చంపుకోనేంత వరకు వెళ్లిందంటే అది ఎంత దిగజారిపోయిందో, ఎంత వికృత స్థాయిలో జరుగుతోందో అర్ధమవుతోంది.

నరేంద్ర మోడీ ప్రచార స్టయిలే వేరు

  ఈరోజు డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ మళ్ళీ తన మాటల మాయాజాలంతో డిల్లీ ప్రజలను కట్టిపడేశారు. ఒకవైపు వారిని తన మాటలతో ఆకట్టుకొంటూనే, తన ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పిస్తూ మళ్ళీ తనతో కలిసి పనిచేస్తానని చెపుతున్న ఆమాద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కి చురకలు వేసారు. మోడీ మార్క్ ప్రచారం అంటే ఎలా ఉంటుందో డిల్లీ ప్రజలకు మరొకమారు రుచి చూపించారు.   ముందుగా ఆమాద్మీ పార్టీ ఆయువు పట్టు మీదే దెబ్బ తీసారు. డిల్లీ ప్రజలు ఎంతో నమ్మకంతో ఆ పార్టీకి ఓటేస్తే, అరవింద్ కేజ్రీవాల్ కేవలం 49 రోజుల్లోనే పదవిలో నుండి దిగిపోయి ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఆక్షేపించారు. కనుక ఈసారి డిల్లీ ప్రజలు ఆమాద్మీని దూరంపెట్టి సుస్థిరమయిన పాలన అందించగల బీజేపీకే ఓటువేసి గెలిపిస్తే, ఇంతకు ముందు కనీవినీ ఎరుగని విధంగా డిల్లీని అభివృద్ధి చేస్తూ ప్రజలకు మంచి పరిపాలన అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.   “డిల్లీ మన దేశానికి ముఖచిత్రం వంటిది. అటువంటి డిల్లీ గురించి, ప్రజల సమస్యల గురించి అన్నీ క్షుణ్ణంగా తెలిసిన కిరణ్ బేడీ వంటి మంచి సమర్దురాలయిన మహిళా పోలీస్ అధికారిణి చేతిలో డిల్లీని పెడితే ప్రజలు కూడా నిశ్చింతగా ఉండవచ్చని అన్నారు. ఆమాద్మీ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ, “ఉట్టికి ఎగురలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లుగా డిల్లీని పరిపాలించలేని ఆమాద్మీ పార్టీ, ఏకంగా దేశాన్నే ఏలేద్దామనుకొంది. కానీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేక సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది.”   "మా పార్టీ నేతలు అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా పర్యటన విజయవంతం అయ్యిందని చెప్పుకొంటే దానిని ప్రతిపక్షాలు తప్పు పట్టాయి. ఒకవేళ ఆయన పర్యటనలో ఎక్కడయినా అపశ్రుతి జరిగితే, అప్పుడు ప్రతిపక్షాలు దానిని అందిపుచ్చుకొని ఎన్నికలలో లబ్ది పొందే ప్రయత్నం చేయవా? ఒకవేళ ఒబామా గణతంత్రదినోత్సవ వేడుకలలో పాల్గొని ఏ ఒప్పందాలు చేసుకోకుండా వెళ్ళిపోయినా ప్రతిపక్షాలు మా ప్రభుత్వాన్ని విమర్శించకుండా వదిలిపెడతాయా?" అని ఆయన నిలదీశారు.   తనతో భుజం భుజం కలిపి కలిపి పనిచేయగల బీజేపీకి ఓటువేసి గెలిపించినట్లయితే కేంద్రం, డిల్లీ ప్రభుత్వం రెంటి మధ్య మంచి సయోధ్య ఉంటుంది కనుక, చక్కగా పనిచేస్తూ డిల్లీని మరింత అభివృద్ధి చేయగలమని ఆయన చెప్పారు. ఆమాద్మీ పార్టీ తన పరిధిలో లేని అంశాలయిన భూసేకరణ చట్టాలను మార్పు, డిల్లీకి రాష్ట్ర హోదా వంటివి అనేక హామీలు ఇస్తోంది. ఆ సంగతి విద్యావంతులయిన ప్రజలకు తెలుసు. కానీ డిల్లీ మురికివాడలలో నివసించే ప్రజలకు తెలియదు. ఆమాద్మీ పార్టీ ఇస్తున్న ఆచరణ సాధ్యం కాని హామీలను నమ్మి మళ్ళీ మోసపోవద్దని డిల్లీ ప్రజలకు మోడీ హితవు పలికారు. ఒకవేళ ఆయన ఎన్నికల ప్రచారానికి మరింత సమయం కేటాయించగలిగి ఉండి ఉంటే, బహుశః బీజేపీకి భారీ మెజార్టీ సాధించి పెట్టేవారేమో?

మాజీ పోలీస్ ఆఫీసర్ అధికారిణికి కూడా అది తప్పదా?

  డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకి చేరుకొంటున్నకొద్దీ ప్రధానంగా పోటీ పడుతున్న బీజేపీ, ఆమాద్మీ పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రం అవుతోంది. మాజీ ఐ.పి.యస్. అధికారిణి, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి అయిన కిరణ్ బేడి ఈరోజు ఆమాద్మీ పార్టీకి చెందిన కుమార్ విశ్వాస్ కొన్ని అసభ్యమయిన మాటలన్నాడంటూ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు.   కానీ తన చుట్టూ పదిమంది మీడియావాళ్ళు, ఎన్నికల సంఘానికి చెందిన ఒక అధికారి ఉండగా తాను అసభ్యంగా మాట్లాడనని పిర్యాదు చేయడం కేవలం తనపై బురద జల్లడానికేనని, ఆమె తన ఆరోపణలను రుజువు చేసినట్లయితే తాను రాజకీయ సన్యాసం చేస్తానని ప్రతిసవాలు విసిరారు. కనుక ఇప్పుడు బంతి ఆమె కోర్టులోనే ఉన్నట్లు భావించవలసి ఉంటుంది. ఒకవేళ ఆమె తన ఆరోపణలను రుజువు చేయగలిగినట్లయితే ఆమాద్మీ పార్టీకి గట్టి ఎదురు దెబ్బే తగులుతుంది.

అంత ‘ఫాస్ట్’ ఉండబోదిప్పుడు

  కేవలం తెలంగాణా విద్యార్థులకే ఫీజు రీ ఇంబర్స్ మెంటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించిన ‘ఫాస్ట్’ పధకాన్ని పక్కనపెట్టాలని నిన్న జరిగిన తెలంగాణా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. సమావేశం తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ “ఇది పేద విద్యార్ధులకు సంబంధించిన విషయం గనుక దానిని పక్కనబెట్టి అందరినీ ఆదుకోవాలని నిర్ణయించుకొన్నాము. కానీ ఆర్టికల్ 371లో సెక్షన్ (డి) ప్రకారమే చెల్లిస్తాము. దానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. గత ప్రభుత్వం నాలుగేళ్లలో రూ. 1650 కోట్లు బకాయిలు చెల్లించకుండా తప్పుకోవడంతో ఆ భారం మా నెత్తినే పడింది. మేము అధికారంలోకి వచ్చిన తరువాత దానిలో సగం చెల్లించాము. మిగిలింది కూడా త్వరలోనే చెల్లించాలని నిర్ణయించాము.”   పేద విద్యార్ధుల జీవితాలకి సంబంధించిన విషయం గనుక తెలంగాణా ప్రభుత్వం ‘ఫాస్ట్’ ని అమలు చేయకూడదని నిర్ణయించుకొందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది. పేద విద్యార్ధులకు సహాయం చేసేందుకే గత ప్రభుత్వాలు ఈ ‘ఫీజు రీఇంబర్స్ మెంటు’ పధకాన్ని అమలుచేస్తున్నాయి. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేప్పట్టిన తరువాత ‘అందరికీ కాదు తెలంగాణా విద్యార్ధులకి మాత్రమే’ అంటూ చాలా ఫాస్ట్ గా దూసుకు వెళ్ళినందుకు ఆయన (ప్రభుత్వాని)కి కోర్టులో మొట్టికాయలు పడ్డాయి. ప్రాంతాలు, కులాలు, మతాలు పేరిట విద్యార్ధులలో వివక్ష చూపితే సహించబోమని హైకోర్టు చాలా గట్టిగా హెచ్చరించిన తరువాత తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కి తగ్గవలసి వచ్చింది. అయితే అది ఒప్పుకోవడానికి అహం అడ్డు వస్తోంది గనుక పేద విద్యార్ధులను దృష్టిలో ఉంచుకొని ఫాస్ట్ పధకం పక్కనపెట్టామని ఆయన చెప్పుకొన్నారు. ఏమయితేనేమి, ఇప్పటికయినా వెనక్కి తగ్గి తప్పును సరిదిద్దుకొన్నారు గనుక ఈ సమస్య ఇంతటితో పరిష్కారం అయిందనుకోవచ్చును. కానీ ఆర్టికల్ 371లో సెక్షన్ (డి) ప్రకారమే చెల్లిస్తామని చెప్పారు. స్థానికతకు దానిని ప్రామాణికంగా కోర్టులు కూడా అంగీకరిస్తున్నాయి కనుక దానికి ఎవరూ అభ్యంతరం చెప్పబోరు కూడా. గత ప్రభుత్వం చెల్లించాల్సిన బాకీలను తమ ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆయన చెప్పారు. అందుకు  తప్పకుండా ఆయనను అభినందించవలసిందే. ఇది కాంగ్రెస్ ప్రభుత్వాల పని తీరు ఎలా ఉంటుందో తెలుసు కొనేందుకు ఒక చక్కటి ఉదాహరణ. పేద ప్రజలను తమ కంటే ఎవరూ పట్టించుకొనేవారు ఉండరని డప్పు కొట్టుకొని తిరిగే కాంగ్రెస్ నేతల మాటలు అబద్దాలని ఈ బకాయిలు చెపుతున్నాయి.         

అందరూ టచ్చులోనే ఉన్నారుట!

  రాష్ట్ర విభజన జరిగే వరకు కూడా ఆంద్ర కాంగ్రెస్ నేతలందరూ కూడా చాలా చురుకుగా రాజకీయాలలో పాల్గొన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, చిరంజీవి వంటి మరికొందరు ఎన్నికలు పూర్తయ్యేవరకు కనిపించారు. కానీ ఆ తరువాత వారందరూ కూడా ఏదో మంత్రం వేసినట్లు మాయమయిపోయారు. ఇంతకుముందు ఏ పత్రిక తిరగేసినా, ఏ ఛానల్ పెట్టినా ముందుగా కనబడే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు బొత్తిగా కనబడకుండాపోయారు. అయితే అందుకు మాజీ కాంగ్రెస్ యంపీ సాయి ప్రతాప్ చాలా మంచి కారణమే చెప్పారు.   మళ్ళీ చాలా రోజుల తరువాత అజ్ఞాతం నుండి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన ఆయన “వానలు పడుతాయనే ఉద్దేశ్యంతో విత్తనాలు వేస్తే వానలు పడవు. వానలు పడవనే ఆలోచనతో విత్తనాలు వేయనప్పుడు వానలు పడుతుంటాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల పరిస్థితి కూడా అలాగే ఉంది. కనుక మళ్ళీ పరిస్థితులు అనుకూలించే వరకు మౌనం వహించడమే అన్ని విధాల ఉత్తమం,” అని అన్నారు. ఆయన చెప్పింది నిజమేనేమో! అందుకే హేమాహేమీలనదగ్గ కాంగ్రెస్ నేతలందరూ మౌనంగా ఉండిపోతున్నారేమో?   సాయి ప్రతాప్ చాలా రోజుల తరువాత నోరు విప్పినప్పటికీ కొన్ని ఆసక్తికరమయిన విషయాలు కూడా చెప్పారు. వాటిలో అన్నటికంటే ముఖ్యమయినది మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరకపోవచ్చుననేది ప్రదానమయినది. ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికే చేరుకొంటారని ఆయన జోస్యం చెప్పారు. ఆయనే కాదు మిగిలిన కాంగ్రెస్ నేతలందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ గూటికే చేరుకొంటారని వారిలో చాలా మంది పార్టీతో పూర్తి ‘టచ్చు’ లోనే ఉన్నారనే మరో విషయం కూడా ఆయన బయటపెట్టారు. బహుశః అందుకేనేమో మొన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రానికి వచ్చినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డితో సహా అనేకమంది కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరుతారని మీడియాలో ఎంతగా ప్రచారం అయినప్పటికీ ఒక్క నేత కూడా జేరలేదు. కానీ రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం ఈ ఒకటి రెండు నెలలలో కొంతమంది సీనియర్ కాంగ్రెస్, వైకాపా నేతలు బీజేపీలో చేరుతారని చెపుతున్నారు.   ఒకవేళ కాంగ్రెస్ నేతలు బీజేపీ వైపు మళ్ళినట్లయితే, కాంగ్రెస్ పార్టీ మరిక కోలుకోలేకపోవచ్చును. ఒకవేళ వారందరూ మళ్ళీ కాంగ్రెస్ గూటికే చేరుకొన్నట్లయితే, రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీ మరింతగా శ్రమించవలసివస్తుంది. త్వరలోనే ఎవరు ఏ పార్టీలో చేరుతారో తేలిపోతే దానిని బట్టి పార్టీల బలాబలాలు ఎలా ఉండబోతున్నాయో ఊహించవచ్చును.

కృష్ణపట్నం కిరికిరి

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు-2014లో చట్టాలకి ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాలు తమకు అనుకూలంగా బాష్యం చెప్పుకొంటున్నాయి. ఉన్నత విద్యా సంస్థల ప్రవేశ పరీక్షల నిర్వహణ, నియామకాలలో ప్రస్తుత విధానాన్నే మరో పదేళ్ళు కొనసాగించాలని చెప్పినప్పటికీ, తెలంగాణా ప్రభుత్వం ‘మా సెట్ మాదే మీ సెట్ మీదే’ అని చట్టంలోనే రాసి ఉందంటూ విడిగా పరీక్షలు నిర్వహించుకొనేందుకు సిద్దం అవుతోంది. కనుక తెలంగాణా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉంది. రాష్ట్ర పునర్విభజన చట్ట ప్రకారం ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ లో తమ వాటాగా 53.89 శాతం ఇవ్వాలని తెలంగాణా ప్రభుత్వం వాదిస్తోంది. కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు న్యాయంగా దక్కవలసిన విద్యుత్ కూడా దక్కనీయకుండా మోసం చేస్తోందని తెలంగాణా ప్రభుత్వం వాదిస్తోంది. కానీ విభజనకు ముందు తెలంగాణాకు విద్యుత్ సరఫరా చేసేందుకు చేసుకొన్న విద్యుత్ ఒప్పందాలు ఏవీ చెల్లవని, ఒకవేళ విద్యుత్ కావాలనుకొంటే మళ్ళీ కొత్తగా ఒప్పందాలు చేసుకోవలసిందేనని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తోంది. కనుక ఈ విషయంలో తెలంగాణా ప్రభుత్వం కోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉంది.   ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెలలో గానీ కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఉత్పత్తి ప్రారంభించే అవకాశాలున్నాయి. అందులో 1,600 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కనుక అందులో చట్ట ప్రకారం తమకు రావలసిన 862 మెగావాట్స్ విద్యుత్తును ఇవ్వకపోతే తక్షణమే కోర్టుకి వెళ్లాలని తెలంగాణా ప్రభుత్వం సిద్దంగా ఉంది. “కృష్ణపట్నం విద్యుత్ ప్లాంటు యొక్క ‘కమర్షియల్ డేట్ ఆఫ్ ఆపరేషన్’ ప్రకటన కోసం మేము ఎదురుచూస్తున్నాము. ఆ నాటి నుండి ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తి మొదలవుతుందని అధికారికంగా దృవీకరణ అవుతుంది కనుక అప్పటి నుండి మావాట విడుదల చేయమని ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతాము. ఒకవేళ అందుకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తిరస్కరిస్తే, మేము కోర్టుకు వెళ్లేందుకు కూడా వెనుకాడబోము” అని తెలంగాణా జెన్-కో మేనేజింగ్ డైరెక్టర్ మరియు చైర్మన్ డి.ప్రభాకర్ రావు చెప్పారు. కానీ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ వాదన మరోలా ఉంది. కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలో తెలంగాణా వాటా క్రింద రూ. 1,050 కోట్లు పెట్టుబడి ఉంది కనుక ఆ మొత్తానికి సరిపడే విధంగా ఒప్పందం చేసుకొని విద్యుత్ పొందవచ్చును. కానీ అందులో తెలంగాణాకి 53.89 శాతం విద్యుత్ సరఫరా చేయడం మాత్రం కుదరదని తేల్చి చెప్పారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ సరఫరాకు నిరాకరించినట్లయితే తెలంగాణా ప్రభుత్వం కోర్టుకు వెళ్లేందుకు సిద్దంగా ఉంది. అంటే ఇరు రాష్ట్రాల మధ్య యుద్ధానికి మరో అంశం సిద్దంగా ఉందన్నమాట.

పరకాలకు త్వరలో మంత్రి పదవి?

  ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి మీడియా సలహాదారుగా ఉన్న డా. పరకాల ప్రభాకర్ ని త్వరలో తన మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తాజా సమాచారం. అందుకోసం మార్చి నెలలో జరుగనున్న యం.యల్.సి. ఎన్నికలలో ఆయనకి గవర్నర్ కోటాలో సీటు ఇచ్చి విధానసభ సభ్యునిగా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఎన్నికలలోగానే ఆయనను చంద్రబాబు తన మంత్రివర్గంలో మంత్రిగా తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.   ఈ సమాచారం నిజమనుకొంటే చంద్రబాబు నాయుడు ఇంత అకస్మాత్తుగా ఆయనను మంత్రివర్గంలోకి ఎందుకు తీసుకొంటున్నారు? ఆయనకి ఏ శాఖ బాధ్యతలు అప్పగించబోతున్నారు? వేరెవకయినా ఉద్వాసన పలకబోతున్నారా? వంటి అనేక ప్రశ్నలు తలెత్తుతాయి.   డా. పరకాలను మీడియా సలహాదారుగా నియమించుకొన్న తరువాత చంద్రబాబు నాయుడు ఆయనను దేశ విదేశాలలో చేసే యాత్రలకి, మీడియా సమావేశాలలో తన వెన్నంటే ఉంచుకొంటూ ఆయనకి చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు ఆయనకి మంత్రి పదవి ఇచ్చినట్లయితే ఆయనకి మరింత ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుంది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా చేస్తున్న ఆయన సతీమణి నిర్మలా సీతారామన్ ద్వారా కేంద్రం నుండి రాష్ట్రానికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది గనుక రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే బహుశః ఆయన ఈ నిర్ణయం తీసుకొంటున్నారేమో? అయినా ఈ వార్తలు అధికారికంగా దృవీకరించవలసి ఉంది.

మరీ ఇంత వాస్తు నమ్మకాలా?

  ఈ మధ్య తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తుకి మరీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లుంది. అందుకే ఏకంగా ఒక ఆస్థాన వాస్తు సిద్ధాంతి సుద్దాల సుధాకర్ తేజని ‘ప్రభుత్వ ఆర్కిటెక్ట్ సలహాదారు’ పేరుతో నియమించుకోవాలని నిర్ణయించుకొన్నారు. అంతే కాదు, వాస్తు ప్రకారం తన క్రింద పనిచేసే అధికారుల కంటే తన అధికార నివాసం ఉన్నత స్థానంలో ఉండాలనే ఉద్దేశ్యంతో గ్రీన్ ల్యాండ్స్ లో ఐ.ఏ.యస్. అధికారుల సంఘం కార్యాలయాన్ని ఖాళీ చేయించి అందులోకి తను మారాలని నిర్ణయించుకొన్నారు. ఆవిధంగా వారి కంటే తను ఉన్నత స్థానంలో ఉండటం వలన వారందరు తన ప్రభుత్వంపై పెత్తనం చేసే బదులు, తానే వారిపై పెత్తనం చేస్తారని వాస్తు సూచిస్తోందిట.   అయితే ఆ విషయం బయటకు చెప్పుకొంది కాదు కనుక అందుకోసం వేరే ఏవో కుంటి సాకులు చెప్పుకోవచ్చును. వాస్తు కోసం కేసీఆర్ ఆభావనంలోకి మారాలని కేసీఆర్ చాలా పట్టుదలగా ఉన్నప్పటికీ, దానికి అనేక అవరోధాలున్నాయి. గత ప్రభుత్వం 2000సం.లో ఆ భవనాన్ని ఐ.ఏ.యస్. అధికారుల సంఘానికి 33 సం.లు లీజు క్రింద ఇచ్చింది. అంటే వారికి మరో 18స.లు పైనే దానిపై హక్కులు ఉంటాయి. కనుక వారు అభ్యంతరం చెప్పవచ్చును. అది ఆంద్ర, తెలంగాణా ఐ.ఏ.యస్. అధికారుల సంఘానికి చెందిన ఉమ్మడి భవనం కనుక ఆంధ్రాకు చెందిన అధికారులు గవర్నర్ నరసింహన్ న్ని కలిసి ఆయనకి దీని గురించి మొరపెట్టుకొన్నారు. హైదరాబాద్ నగరం మరో తొమ్మిదిన్నరేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది కనుక, రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్ 8(1) ప్రకారం హైదరాబాద్ పరిధిలో ఉన్న భవనాల కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకొనే హక్కు ఒక్క గవర్నరుకు మాత్రమే ఉంటుంది. కానీ వారి అభ్యర్ధనకు ఆయన స్పందించారో లేదో తెలియదు గానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం వారి కార్యాలయాన్ని అక్కడి నుండి వేరే చోటికి తరలించి, అందులోకి తను మారాలని భావిస్తున్నారు. అందుకోసమే రోడ్లు మరియు భవనాల శాఖ ఆ భవనం వెనుక ఉన్న 4ఎకరాల ఖాళీ స్థలాన్ని చదునుచేసి శుభ్రం చేయడం మొదలుపెట్టింది కూడా.   ఇది కాక మరో సమస్య కూడా ఉంది. దాదాపు 125సం.ల చరిత్ర కలిగిన ఆ భవనాన్ని 2006సం.లో సాంస్కృతిక సంపదగా ప్రకటించబడింది. అందువలన సంబంధిత శాఖ నుండి అనుమతి పొందవలసి ఉంటుంది. వాస్తు చూసుకొని కేసీఆర్ ఆ భవనంలోకి మారాలని ప్రయత్నిస్తే, ఇన్ని సమస్యలు స్వాగతం పలకడానికి సిద్దంగా ఉన్నాయి. కనుక ఒకవేళ ఏ కారణం చేతయినా ఆయన అందులోకి మారలేకపోయినా, ఆ భవనాన్ని ఉపయోగించుకొంటున్న అధికారులను అక్కడి నుండి ఖాళీ చేయించి, వారికి తన అధికార నివాసానికి వాయవ్యంలో కొంచెం దిగువగా ఉండే మరో భవనాన్ని కేటాయించాలని తద్వారా వాస్తు బ్యాలన్సింగ్ సరిచూసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. వినడానికి ఇదంతా చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ త్వరలోనే ఈ తంతు అంతా పూర్తి అయ్యే అవకాశాలున్నాయి.

త్వరలో తెలంగాణా ప్రభుత్వం ఆస్థాన వాస్తు సిద్ధాంతి నియామకం

  సమాజంలో వ్యక్తులు ఇళ్లు, భవనాలు నిర్మించుకొనేటప్పుడు వాస్తుదోషాలు లేకుండా జాగ్రత్తపడుతుంటారు. అది వారి వ్యక్తిగతం కనుక దానిని ఎవరూ తప్పు పట్టలేరు. కానీ దీనికి అతీతంగా వ్యవహరించవలసిన ప్రభుత్వాలు కూడా రోడ్లు, భవనాలు, ఫ్లై ఓవర్ల నిర్మాణాలకు, ప్రస్తుతం ఉన్న భవనాలలో వాస్తు దోషాలను సవరించేందుకు ఆస్థాన వాస్తు పండిట్లను నియమించుకొంటే, ఇక సివిల్ ఇంజనీర్లు ఎందుకు? వారు గీసే డ్రాయింగులు ఎందుకు? అని ఎవరికయినా అనుమానం కలుగకమానదు.   తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రముఖ వాస్తు సిద్దాంతి సుద్దాల సుధాకర్ తేజను ఆస్థాన సిద్ధాంతిగా నియమించుకొనేందుకు నిశ్చయించుకొన్నట్లు సమాచారం. కానీ అందుకు చట్టం అనుమతించదు. కనుక, ‘రాష్ట్ర ప్రభుత్వ ఆర్కిటెక్ట్ సలహాదారు’ అనే పేరుతో ఆయనను నియమించు కొనేందుకు ఫైలు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ఫైలు ఆర్ధిక శాఖ అనుమతి కోసం వేచి ఉందని సమాచారం. రాజుగారు తలచుకొంటే కొరడా దెబ్బలకు కరువా? అన్నట్లు సాక్షాత్ ముఖ్యమంత్రే దానిని ఆమోదించగా లేనిది, ఆర్ధిక శాఖ అంగీకరించదని ఎవరూ భావించలేరు. కనుక ఆయన నియామకం కేవలం లాంచన ప్రాయమేనని భావించవచ్చును. బహుశః మరొక వారం రోజుల్లో అధికారికంగా ప్రకటన వెలువడవచ్చునని సిద్ధాంతి గారు ఆశిస్తున్నారు.   కానీ ఆయన నియామకానికి రోడ్లు భవనాలు శాఖకు మంత్రిగా నియమితులయిన తుమ్మల నాగేశ్వర రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.25,000 కోట్ల వ్యయంతో హైదరాబాద్ మరియు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చిన్నా, పెద్ద నిర్మాణాలు జరుగనున్నాయి. ఈ పరిస్థితిలో వాస్తు సిద్ధాంతిని ముందుకు తీసుకురావడం అంటే మంత్రిగారి చేతులు కట్టేసినట్లేనని చెప్పక తప్పదు. ఎందుకంటే రోడ్లు భవనల శాఖ ఇంజనీర్లు ఎన్ని డ్రాయింగులు గీసుకొన్నా వాటికి సిద్ధాంతి గారి ఆమోదముద్ర పడందే ఏ ఫైలు ముందుకు కదిలే అవకాశం లేదు. కనుక అది పరోక్షంగా మంత్రిగారి అధికారాలకు కత్తెర వేసేందుకు చేసిన ఏర్పాటేనని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.   ఇప్పటికే ఉపముఖ్యమంత్రి రాజయ్యకు ఉద్వాసన పలికిన తీరుకి కేసీఆర్ అనేక విమర్శలు మూటగట్టుకొంటున్నారు. ఇప్పడు వాస్తు సిద్దాంతి నియామకం, ఆయన ద్వారా మంత్రిగారి అధికారాలకు కత్తెర వేసినట్లయితే, మంత్రిగారికి అసంతృప్తి, మరిన్ని విమర్శలు, కోర్టు చివాట్లు కూడా తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల మధ్య సయోధ్య సాధ్యమేనా?

  గవర్నర్ నరసింహన్ మధ్యవర్తిత్వంలో మళ్ళీ చేతులు కలుపుకొన్న ఆంధ్ర, తెలంగాణా తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఇకపై చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలనే సూచనకు అంగీకరించారు. ముందుగా వివిధ శాఖల ముఖ్యకార్యదర్శుల స్థాయిలో చర్చలు జరిపి, అవసరమయితే ముఖ్యమంత్రుల స్థాయిలో కూడా చర్చించుకొని సమస్యలు పరిష్కరించుకొనేందుకు అంగీకరించారు. ఇది రెండు రాష్ట్రాలకు కూడా చాలా శుభ పరిణామమే.   కానీ వచ్చే నెలలో చంద్రబాబు నాయుడు వరంగల్ జిల్లాలో పర్యటిస్తారని ప్రకటించిన నాటి నుండి ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలయింది. చంద్రబాబు తెలంగాణాలో పర్యటిస్తే ఆయనను తప్పకుండా అడ్డుకొని తీరుతామని మంత్రి మహేంద్ర రెడ్డి కుండ బ్రద్దలు కొట్టారు. దైర్యం ఉంటే అడ్డుకోమని తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రతి సవాలు విసిరారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా తెదేపా కార్యకర్తలు తెలంగాణా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ తెలంగాణా వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు చేప్పట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో తమ పార్టీని బలోపేతం చేసుకోవాలని తెదేపా నేతలు భావిస్తుంటే, ఆలోగా ఆ పార్టీని పూర్తిగా తుడిచి పెట్టేయాలని తెరాస ప్రయత్నిస్తోంది.   ఇక నారా లోకేష్ అప్పుడప్పుడు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పై ట్వీట్ బాణాలు సంధిస్తూనే ఉన్నారు. ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలలో పార్టీ సభ్యత్వనమోదు ప్రక్రియను విజయవంతంగా పూర్తయ్యేందుకు ప్రధాన సూత్రధారి అయిన నారా లోకేష్ ఇప్పుడు తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసుకొనేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఆ ప్రయత్నంలోనే ఆయన కూడా తన తండ్రి వెంట వరంగల్ పర్యటనకు బయలుదేరాలని భావిస్తున్నారు. కానీ వారిరువురినీ తెలంగాణాలో అడుగుపెట్టడానికి అనుమతించమని తెరాస నేతలు శపధాలు చేస్తున్నారు.   ఈ నేపద్యంలో ముఖ్యమంత్రులు ఇరువురూ చర్చించుకొని సమస్యలు పరిష్కరించుకోవడం సాధ్యమేనా? అని ఆలోచిస్తే కాదనే సమాధానం వస్తుంది. అంటే రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరింపబడాలంటే ముందుగా ఆ రెండు పార్టీల మధ్య సయోధ్య అవసరమని స్పష్టం అవుతోంది. మరి సయోధ్య కుదురుతుందా? అంటే దానికీ కుదరదనే సమాధానం వస్తుంది. కనుక రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరం కూడా శాస్వితమేనని భావించవలసి ఉంటుంది.   అందుకు కనిపిస్తున్న ఒకే ఒక్క పరిష్కారం ఏమిటంటే మళ్ళీ తెదేపా, తెరాస పార్టీలు పొత్తులు పెట్టుకోవడమే. దాని వలన ఇరువురిలో ఒకరిపట్ల మరొకరికున్న అభద్రతా భావం కొంత తగ్గే అవకాశం ఉంటుంది కనుక రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు కూడా పరిష్కరింపబ అవకాశం ఉంటుంది.