ఎర్రచందనం వేలంవెర్రి ఎందుకో...

  ఎర్రచందనం... చాలా ఖరీదైన కలప. అందమైన వస్తువుల తయారీకి, వైద్యానికి ఉపయోగపడే ఈ కలప శ్రీ చందనం తర్వాత ఆ స్థాయి విలువ కలిగిన కలప. ఎగుమతులకు ఎంతో అవకాశం వున్న దీనికోసం ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో స్మగ్లర్లు ఎంతకైనా తెగిస్తారు. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎర్రచందనం స్మగ్లర్లను ఉక్కుపాదంతో అణిచేస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కల్పతరువులా మారాయి.   ఎర్రచందనం విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఇలా వుంటే, తెలంగాణలో మరోరకంగా వుంది. ఈమధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ హరిత హారం’ పేరుతో ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రమంతటా మొక్కలు నాటి, వాటిని వృక్షాలుగా పెంచి తెలంగాణ మొత్తాన్ని ఆకుపచ్చగా చేయాలన్నది ఈ పథక ఉద్దేశం. దీనితోపాటు భవిష్యత్తులో ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా వచ్చేలా చేసుకోవాలని ప్రభుత్వాధినేతలు ఆలోచించారు. దాంతో ఆ మొక్కలూ ఈ మొక్కలూ ఎందుకు... ఏకంగా ఎర్రచందనం మొక్కలు నాటేయండి.. భవిష్యత్తులో అవి చెట్లయిన తర్వాత వేలం వేస్తే బోలెడంత ఆదాయం అని ఆదేశాలు ఇచ్చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 75 లక్షల ఎర్రచందనం మొక్కల్ని నర్సరీలలో పెంచారు. ఇక వీటిని రాష్ట్రమంతటా నాటడమే ఆలస్యం. ప్రభుత్వ పెద్దల ఆలోచనలు ఇలా వుంటే, ఇలాంటి విషయాలలో అనుభవం వున్న అధికారులు మాత్రం తెలంగాణలో ఎర్రచందనం మొక్కల్ని నాటడం వృధా అని అంటున్నారు. ఎర్రచందనం చెట్లు చక్కగా పెరిగి, నాణ్యమైన ఎర్రచందనం కలప ఇవ్వడానికి రాయలసీమ వాతావరణం మాత్రమే అన్నివిధాలా అనుకూలంగా వుంటుందని చెబుతున్నారు. తెలంగాణ వాతావరణం, భౌగోళిక పరిస్థితులను బట్టి ఎర్రచందనం మొక్కలు ఇక్కడ పెరగవని, ఒకవేళ వాటిని తంటాలు పడి పెంచినా చాలా నాసిరకం కలప వస్తుందని అంటున్నారు. అంచేత, ప్రభుత్వం తెలంగాణ అంతటా ఎర్రచందనం మొక్కలు కాకుండా టేకుగానీ, యూకలిప్టస్ మొక్కలు గానీ నాటుకుంటే మంచిదని అంటున్నారు.

టీడీపీ మాజీలకు స్వర్ణయుగం

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మాజీ టీడీపీ నాయకులకు స్వర్ణయుగం నడుస్తోంది. టీఆర్ఎస్ నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయానా టీడీపీ మాజీ నాయకుడు. ఒకప్పుడు టీడీపీలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా చక్రం తిప్పిన వాళ్ళ హవా ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వలో నడుస్తోంది. తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస యాదవ్, పోచారం శ్రీనివాసరెడ్డి, జోగు రామన్న, మహేందర్ రెడ్డి, అజ్మీరా చందూలాల్... లేటెస్ట్‌గా కడియం శ్రీహరి... ఇలా ఒక్కరూ ఇద్దరూ ఏమిటీ... బోలెడంత మంది టీడీపీ మాజీ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో పదవులు పొంది హ్యాపీగా వున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ టీడీపీలో ఉన్న ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ వైపు ఆశగా చూస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీని విడిచిపెట్టి టీఆర్ఎస్‌లోకి వెళ్ళిపోతే తమకు కూడా పైన చెప్పిన నాయకుల తరహాలోనే రాజకీయ స్వర్ణయుగం వస్తుందని ఆశిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు అయితే బహిరంగంగానే తమ కోర్కెల చిట్టా విప్పి, ఈ కోర్కెలు తీరిస్తే టీఆర్ఎస్‌లోకి వచ్చేస్తామని బేరాలు పెట్టేశారు. ఈ పరిస్థితిని చూసి దేశం నాశనమైపోతోందని బాధపడకండి.. రాజకీయాలే ఇంత!

రాజయ్య ఎమ్మెల్యే సీటుకీ టెండర్?

  ఇటీవలే పదవీచ్యుతుడైన టీఆర్ఎస్ మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యకు కేసీఆర్ మరో షాక్ ఇవ్వబోతున్నారా? ఈ షాక్‌కి సంబంధించిన గుసగుసలు టీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున రాజయ్య అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గతంలో ఈ స్థానం నుంచి రాజయ్య, కడియం శ్రీహరి పోటీపడేవారు. ఒకసారి రాజయ్య చేతిలో కడియం శ్రీహరి ఓడిపోయారు కూడా. ఇప్పుడు ఇద్దరూ ఒకే పార్టీలో ఉండటంతో రాజయ్య స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీకి, కడియం శ్రీహరి వరంగల్ పార్లమెంట్‌కి పోటీ చేసి గెలిచారు. తాజా రాజకీయ పరిణామాలలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి పీకేసి, ఆ పదవిని కడియం శ్రీహరికి ఇచ్చారు. మరి కడియం శ్రీహరి వరంగల్ పార్లమెంట్ సభ్యుడు. ఆయన ఆరు నెలల లోగా అసెంబ్లీకి ఎన్నికవ్వాలి. తెలంగాణలో ఇప్పుడు ఏ అసెంబ్లీ స్థానమూ ఖాళీగా లేదు. మరి ఇప్పుడేం చేయాలి? ఎవరో ఒక ఎమ్మెల్యే తన పదవిని త్యాగం చేస్తే ఆ స్థానంలో కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఓ పనైపోతుంది. మరి ఆ త్యాగం కూడా వేరే ఎవరో ఎందుకు... రాజయ్య చేతే త్యాగం చేయించాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. రాజయ్యను రాజీనామా చేయించి, ఆ స్థానం నుంచి కడియం శ్రీహరిని పోటీకి దింపనున్నట్టు సమాచారం అందుతోంది. ఇదే జరిగితే పాపం రాజయ్య ఎమ్మెల్యే స్థానానికి కూడా టెండర్ పెట్టేసినట్టే అవుతుంది.

ఏపీ క్యాబినెట్‌లోనూ త్వరలో మార్పులు?

  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికి రెండుసార్లు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేశారు. తీసుకోవడం, తీసేయడం, శాఖల్లో మార్పులు చేయడం లాంటి పరిణామాలను చకచకా చేసేశారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి ఎనిమిది నెలలు అవుతున్నా ఇప్పటి వరకూ మంత్రివర్గ విస్తరణ గానీ, మార్పు చేర్పులు గానీ జరగలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడెప్పుడు మంత్రివర్గాన్ని విస్తరిస్తారా అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరలో ఏపీ మంత్రివర్గంలో కూడా మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ మంత్రుల్లో ఆశించిన స్థాయిలో పనితీరును కనబరచని వారు కొందరు ఉన్నారని, వారిని బాధ్యతల నుంచి తప్పించి కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారన్న అభిప్రాయాలు తెలుగుదేశం వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. అదే జరిగితే ఏయే మంత్రులకు విశ్రాంతి ఇస్తారు.. ఎవరెవరికి అవకాశాలు ఇస్తారనేదానిమీద భారీ స్థాయిలో అంచనాలు టీడీపీ వర్గాల్లో వున్నాయి.

ఎర్రగడ్డలో సచివాలయం.. చాలా కరెక్ట్...

తెలంగాణ ప్రజలు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారోగానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. పైగా కేసీఆర్ లాంటి అద్భుతమైన వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా చాలా గొప్ప ముహూర్తంలో ప్రమాణ స్వీకారం చేసినట్టున్నారు. అప్పటి నుంచీ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. అందరూ కలలు కంటున్న బంగారు తెలంగాణ సిద్ధించడానికి ఇంకా ఎంతో సమయం పట్టదన్న నమ్మకం తెలంగాణ ప్రజానీకంలో ఏర్పడింది. సీఎం కేసీఆర్ గతంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నీ ఒక ఎత్తయితే, ఇప్పుడు తెలంగాణ సచివాలయాన్ని ఎర్రగడ్డకు తరలించాలని చేస్తున్న ప్రయత్నం ఒక ఎత్తు. సచివాలయాన్ని ఎర్రగడ్డలో నిర్మించిన వంద అంతస్తుల భవంతిలోకి తరలించడంతోపాటు ఇప్పుడున్న సచివాలయాన్ని కూలగొట్టేసి అక్కడ ఆకాశ హర్మ్యాలు నిర్మించాలన్న ఆలోచనే నిజంగా ఒక వండర్. దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా కేసీఆర్ని చూసి కుళ్ళుకోవడానికి ఈ ఒక్క ఐడియా చాలు. అసలు సచివాలయాన్ని ఎర్రగడ్డకు తరలించాలన్న ఐడియా కేసీఆర్ మంత్రివర్గంలో వారికో, అధికారులకో వచ్చి వుండదు. అది స్వయానా కేసీఆర్‌కే వచ్చి వుంటుంది. ఎందుకంటే అంత గొప్ప ఆలోచనలు చేయగల సత్తా ఆయనకే వుంది. మొత్తానికి సచివాలయాన్ని ఎర్రగడ్డకు తరలించాలని నిర్ణయించడం చాలా కరెక్ట్.. ఎర్రగడ్డలో సచివాలయం, మంత్రుల క్వార్టర్స్, అధికారుల క్వార్టర్స్, దాంతోపాటు పెరేడ్ గ్రౌండ్ నిర్మించడం వల్ల అందరూ ఎర్రగడ్డలోనే సెటిలవుతారు. దానివల్ల తెలంగాణ సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. ఎలాగంటే, ప్రస్తుతం ప్రజా ప్రతినిధులు, అధికారుల సమయంలో ఎక్కువ శాతం ట్రావెలింగ్‌కే ఖర్చయిపోతుంది. అందరూ ఎర్రగడ్డలోనే వుండటం వల్ల సమయం కలిసొస్తుంది. ఇంటి నుంచి సచివాలయానికి క్షణాల్లో వెళ్ళిపోవచ్చు. అలా మిగిలిన సమయాన్ని తెలంగాణ అభివృద్ధి కోసం ఉపయోగించవచ్చు.  ప్రజా ప్రతినిధులుగానీ, అధికారులు గానీ ప్రజా సేవ చేసీ చేసీ విసిగిపోతే వెంటనే పక్కనే వున్న పరేడ్ గ్రౌండ్‌కి వెళ్ళి వాకింగ్ చేస్తే రిలాక్స్ అవ్వొచ్చు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం పరేడ్ గ్రౌండ్‌లో వాకింగ్, జాగింగ్ లాంటివి చేయడం వల్ల అందరూ ఆరోగ్యాలను కాపాడుకుని, అలా కాపాడుకున్న ఆరోగ్యాన్ని తెలంగాణ ప్రజల సేవకు వినియోగించవచ్చు. త్వరలోనే బంగారు తెలంగాణ సాధించవచ్చు.

టీ జాక్ అవసరం ఇంకా ఉందా?

  తెలంగాణా ఉద్యమాలలో కీలక పాత్ర పోషించిన తెలంగాణా రాజకీయ జే.యే.సి. తెలంగాణా రాష్ట్రం ఏర్పడి, తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత నుండి క్రమంగా తన ఉనికిని కోల్పోతూ వస్తోంది. నిజానికి తెలంగాణా రాష్ట్ర సాధన కోసమే ఏర్పడిన టీ-జే.యే.సి. తెలంగాణా రాష్ట్రం, ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా కొనసాగాలనుకోవడం వలననే దాని ఉనికి, గౌరవం పోగొట్టుకొంటోందని చెప్పక తప్పదు. రాష్ట్ర విభజన తరువాత తనను రాజకీయ పార్టీలు దగ్గరకు రానీయవని తను ముందే ఊహించానని టీ-జే.యే.సి. చైర్మన్ ప్రొఫెసర్ కోదండ రామ్ చెప్పడమే అందుకు నిదర్శనం.   ఇంతకు ముందు ఆంధ్రా పాలకుల చేతిలో తెలంగాణా రాష్ట్రం దోపిడీకి గురవుతోందని, కనుక మన రాష్ట్రాన్ని మనమే పాలించుకోవాలని తెరాస నేతలు, టీ-జే.యే.సి. నేతలు వాదించే వారు. ఇప్పుడు తెలంగాణా రాష్ట్రాన్ని వారే పరిపాలించుకొంటున్నారు. తెలంగాణా ప్రభుత్వం తన ప్రజల కోసం అనేక భారీ అభివృద్ధి, సంక్షేమ పధకాలు రూపొందించి వాటిలో కొన్నిటిని అమలు చేస్తోంది కూడా. అయినా కూడా టీ-జే.యే.సి. నేతలు మాత్రం దానిని నేటికీ రద్దు చేయాలనుకోవాలనుకోవడం లేదు. అయితే దానిని ఇంకా కొనసాగించేందుకు వారికి సరయిన కారణాలు మాత్రం లేవు. కానీ ఒక్కటే కారణం కనిపిస్తోంది. ఇంతకాలం టీ-జే.యే.సి. వలననే వారికి తెలంగాణాలో ఒక ప్రత్యేక గుర్తింపు, గౌరవం దక్కాయి. అందుకే దానిని ఇంకా కొనసాగిస్తున్నారని భావించవలసి ఉంటుంది.   వారు అధికార తెరాసను, దాని అధినేత కేసీఆర్ ను ప్రశ్నించే సాహసం చేయలేకపోవడం వలన ప్రజల దృష్టిలో చులకనయిపోయారు. ఇటీవల రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ విజ్రుంభించి అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నప్పుడు కూడా టీ-జే.యే.సి. నేతలెవరూ నోరు విప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నించే సాహసం చేయలేకపోయారు. అలాగని తెలంగాణ ప్రభుత్వాన్ని వెనకేసుకొని రాలేకపోవడం చేత వారిని తెరాస పార్టీ కూడా దగ్గరకు రానీయ లేదు. దానితో వారు ప్రజలకీ, ప్రభుత్వానికి కూడా కాని వారయిపోయారు. క్రమంగా వారి ఉనికి కూడా ప్రశ్నార్ధకంగా మారిపోయింది.   అయినప్పటికీ టీ-జే.యే.సి. ద్వారా తమకు సమాజంలో వచ్చిన ప్రత్యేక గుర్తింపును వదులుకోలేని వారి బలహీనత కారణంగానే వారు నేటికీ దానిని సజీవంగా ఉంచే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దాని వలన వారు నానాటికీ ప్రజల, ప్రభుత్వం దృష్టిలో మరింత చులకన అవుతున్నారనే సంగతిని మాత్రం గ్రహించలేకపొతున్నారు. హైదరాబాదులో నిన్న సమావేశమయిన టీ-జే.యే.సి. నేతలు ఇకపై ప్రభుత్వానికీ, ప్రజలకీ మధ్య వారధిగా పనిచేయాలని నిశ్చయించుకొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక అభివృద్ధి, సంక్షేమ పధకాలు, ప్రాజెక్టుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, అదేవిధంగా వాటి గురించి ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని వారు నిర్ణయించుకొన్నారు.   ప్రభుత్వం తరపున వారు ప్రచారం చేసి దాని మెప్పు పొందదలచుకొంటే ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చును. కానీ ప్రజాభిప్రాయం పేరిట తన ప్రభుత్వానికి ఉచిత సలహాలు, సూచనలు చేసేందుకు ప్రయత్నిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని దూరంగా అట్టేబెట్టడం తధ్యం.

జగన్ రూటు మార్చాడా?

పాపం జగన్.. గత ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చేస్తానని కలలు కన్నాడు. దేవుడికి దణ్ణాల మీద దణ్ణాలు పెట్టాడు. తాను నమ్మే దేవుణ్ణి కూడా తన రాజకీయాల కోసం ఉపయోగించుకున్నాడు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వున్న చర్చ్‌లను వైకాపా ప్రచార కేంద్రాలుగా తీర్చిదిద్దాడు. తనను కూడా రాజకీయాల్లోకి లాగినందుకు ఆ ప్రభువు ఆగ్రహించాడో ఏమోగానీ జగన్ పరిస్థితి తెలంగాణ ఖాళీ అయితే, ఆంధ్రప్రదేశ్‌లో అంత సీన్ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆయన తాను నమ్మిన దేవుడికి దూరంగా జరుగుతూ, హిందూ సంప్రదాయాలకు దగ్గరవుతున్నారా అనే సందేహాలు ఆయన వ్యవహార శైలిని చూస్తే కలుగుతున్నాయి. జగన్ కుటుంబం ఆయన తాత రాజారెడ్డి హయాంలోనే క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. అప్పటి నుంచి ఆ కుటుంబం క్రైస్తవాన్నే అనుసరిస్తోంది. జగన్ బావగారు అనిల్ అయితే స్వయానా క్రైస్తవ మత ప్రచారకుడు. సాధారణంగా క్రైస్తవులు తమ మతాన్ని తాము గౌరవించుకుంటూ ఇతర మతాలను కూడా గౌరవిస్తారు. అయితే, జగన్‌కి హిందూ మతం మీదగానీ, హిందూ ఆచార వ్యవహారాల మీద గానీ అంత గౌరవం లేదన్న విమర్శలు వినిపిస్తూ వుంటాయి. దీనికి ఉదాహరణగా గతంలో జరిగిన కొన్ని ఘటనలను కూడా చెబుతూ వుంటారు. ఈ సారు గతంలో తిరుమల దేవాలయానికి వెళ్ళిన సమయంలో చెప్పులు వేసుకునే వెళ్ళారని, అన్య మతస్తులు తిరుమల దేవాలయానికి వెళ్ళాలంటే డిక్లరేషన్ మీద సంతకం చేయాలి. అలాంటి సంప్రదాయాన్ని పాటించకుండానే ఆయన దేవాలయంలోకి వెళ్ళారని విమర్శలు వున్నాయి. అలాగే తిరుమలలో స్వామివారి కీర్తనం తప్ప మరొకరి కీర్తన జరగడానికి వీల్లేదు. అలాంటి తిరుమలలో తనకు జేజేలు కొట్టించుకున్న ఘనత కూడా జగన్ సార్‌కి వుంది. ఇలా హిందూ మతం మీద ఇంతటి చిన్న చూపు వున్న జగన్ ఇప్పుడు సడెన్‌గా రూటు మార్చినట్టు అనిపిస్తోంది. హిందూ సంప్రదాయాల మీద గౌరవం పెరిగిపోయినట్టు కనిపిస్తోంది. మంగళవారం నాడు విశాఖ పర్యటనకు వెళ్ళిన జగన్ సింహాచలం దేవాలయానికి వెళ్తున్నారని, ఆ తర్వాత విశాఖ శ్రీ శారదా పీఠానికి వెళ్ళి అక్కడ జరిగే యజ్ఞంలో కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఇది నిజంగా వింతే. జగనేంటి.. ఇలా హిందూ సంప్రదాయాలను ఆచరించడమేంటని పరిశీలకులు ఆశ్చర్యపోతున్నారు. జగన్ ఇలా సింహాచలం దేవాలయానికి వెళ్ళడం, శారదా పీఠం యజ్ఞంలో పాల్గొనడం వెనుక రెండే కారణాలు ఉండొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. మొదటిది... జగన్ మీద ఇప్పటికే హిందూ వ్యతిరేకి ముద్ర బాగా బలంగా పడిపోయింది. ఆ ముద్రని తొలగించుకోవడం కోసమే ఇలా చేస్తూ వుండొచ్చు. రెండోది... వచ్చే ఎన్నికలలో ఎలాగైనా అధికారంలోకి రావాలంటే తన శక్తి సరిపోదని జగన్‌కి క్లియర్‌గా అర్థమైపోవడంతో ఇక హిందూ దేవుళ్ళని, యజ్ఞాలని నమ్ముకుంటున్నాడు. మొదటిదైనా, రెండోదైనా మొత్తానికి అధికారం కోసమే జగన్ రూటు మార్చినట్టు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఉపరాష్ట్రపతి ఎందుకు సెల్యూట్ చేయలేదు?

  సోమవారం నాడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి జాతీయ జండాను ఎగురవేసిన అనంతరం అందరూ జాతీయ గీతాన్ని పాడే సమయంలో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ సెల్యూట్ చేయకపోవడం వివాదాస్పదమైంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ జాతీయ పతాకానికి సెల్యూట్ చేస్తుండగా, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ మాత్రం మామూలుగా నిలబడి వున్నారు. ఈ ఫొటో సోమవారం నాడు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించింది. విమర్శలూ వెల్లువెత్తాయి. దీనిమీద ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ప్రొటోకాల్ ప్రకారం జాతీయ గీతాలాపన సమయంలో ఉప రాష్ట్రపతి సెల్యూట్ చేయాల్సిన అవసరం లేదు. కార్యక్రమంలో ప్రధాన హోదాలో ఉన్నవారు, యూనీఫామ్‌లో ఉన్నవారు ఈ సమయంలో సెల్యూట్ చేయాలి. సాధారణ దుస్తుల్లో వున్నవారు సావధానంలో నిలబడితే చాలు. సర్వ సైన్యాధ్యక్షుడి హోదాలో ఉన్న రాష్ట్రపతి సెల్యూట్ చేశారు. ఉపరాష్ట్రపతి సెల్యూట్ చేయాల్సిన అవసరం లేదు’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. హమీద్ అన్సారీకి దేశం ఇంత ఇచ్చింది. జాతీయ పతాకానికి సెల్యూట్ చేయొచ్చు కదా. ఈ విషయంలో కూడా ప్రొటోకాల్ అని వివరణలు ఇచ్చుకోవడం ఎందుకనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇది తెరాస ప్రభుత్వమా? లేక తెదేపా ప్రభుత్వమా?

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంద్ర ప్రభుత్వాన్ని, తెదేపా దాని మంత్రులను, నేతలను ఎంతగా విమర్శిస్తున్నప్పటికీ ఒకప్పుడు తనకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించిన తెదేపా పట్ల ఆయనకు చాలా మమకారం ఉన్నట్లే కనబడుతోంది ప్రస్తుత మంత్రివర్గం చూస్తుంటే. ఆయన స్వయంగా తెదేపా నుండి వచ్చిన మనిషి. స్వైన్ ఫ్లూ దెబ్బకి టి.రాజయ్య ఉపముఖ్యమంత్రి పదవి కోల్పోతే, ఆయన స్థానంలోకి ఇప్పుడు తెదేపా నుండి వచ్చిన కడియం శ్రీహరికి అవకాశం దక్కింది.   ఇక ఇంతకుముందే కేసీఆర్ మంత్రివర్గంలో తెదేపా నుండి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వర రావు, అజ్మీరా చందూలాల్ మరియు పి. మహేంద్ర రెడ్డి చేరారు. వారు కాక జోగు రామన్న, తీగల కృష్ణారెడ్డి, గంగుల కమలాకర్, రమణాచారి, ఇంద్ర కరణ్ రెడ్డి వంటి అనేకమంది తెదేపాకు చెందిన నేతలు అందరూ తెరాస గొడుగు క్రిందకి వచ్చి జేరడంతో ఇప్పుడు తెరాస నేతలకి చోటు మిగలడం లేదు. వారి పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ మళ్ళీ తెదేపా నేతలందరూ ఈవిధంగా ఒకచోట చేరడంతో తెలంగాణాలో కూడా తమ పార్టీయే అధికారంలోకి వచ్చినట్లుందని తెదేపా తమ్ముళ్ళు తెగ సంబరపడిపోతుంటే తెరాస నేతలకు ఏమనాలో అర్ధం కావడం లేదు.

తిరుపతి ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పోటీకి సిద్దం

  తిరుపతి తెదేపా యం.యల్యే వెంకట రమణ మృతి కారణంగా జరుగనున్న ఉప ఎన్నికలలో తెదేపా ఆయన భార్య సుగుణమ్మను పార్టీ అభ్యర్ధిగా ప్రకటించి, ఆమె ఏకగ్రీవ ఎన్నిక కొరకు సహకరించవలసిందిగా కాంగ్రెస్, వైకాపా మరియు ఇతర పార్టీలని కోరింది. అందుకు వైకాపా సానుకూలంగా స్పందించింది. కానీ కాంగ్రెస్ పార్టీకి గత రెండు ఉప ఎన్నికలలో తల బొప్పి కట్టినప్పటికీ, మళ్ళీ ఇప్పుడు కూడా పోటీకి సిద్దమయింది.   ఒక రాజకీయ పార్టీ ఎన్నికలలో పాల్గొనడాన్ని ఎవరూ తప్పుపట్టకపోయినప్పటికీ, ఏదయినా ఒక పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి చనిపోతే ఆ స్థానాన్ని ఆ పార్టీ అభ్యర్ధికే విడిచిపెట్టే సత్సంప్రదాయాన్ని రాష్ట్రంలో అన్ని పార్టీలు పాటిస్తున్నప్పుడు, దానిని కాదని పోటీ చేస్తున్నందునే ఆ పార్టీ విమర్శలు ఎదుర్కొంటోంది. చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు కె. వేణుగోపాల్ రెడ్డి తమ పార్టీ అభ్యర్ధిగా రుద్రమరాజు శ్రీదేవి పేరును ప్రకటించారు.   ఇంతకు ముందు తెదేపా కార్యకర్తగా పనిచేసిన ఆమె రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని తెలిసి ఉన్నప్పటికీ ఆమె కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసారు. అప్పటి నుండి పార్టీలో చురుకుగా పనిచేస్తున్నారు. గాలికిపోయే పేలాలు కృష్ణార్పణం అన్నట్లుగా, ఈ ఉప ఎన్నికలలో గెలిచే అవకాశం ఎలాగూ ఉండదని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ డ్వాక్రా సంఘాల అధ్యక్షురాలయిన ఆమెకు ఉదారంగా టికెట్ కేటాయించింది. తిరుపతి నియోజక వర్గంలో ఉన్న డ్వాక్రా సంఘాలతో ఆమెకున్న పరిచయాల కారణంగా ఆమెకు విజయావకాశాలు ఉంటాయనే ఆలోచనతోనే ఆమెను బరిలోకి దించినట్లు కనబడుతోంది.   ఒకవేళ ఈ ఎన్నికలలో ఆమె ఓడిపోతే, దానిని ఆమె పద్దులోనే వ్రాసేయవచ్చును. దాని వలన కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టమూ కూడా ఉండబోదు. కానీ ఆమె గెలిస్తే మాత్రం దానిని ‘అధికార తెదేపా ప్రభుత్వంపై ప్రజలలో మొదలయిన వ్యతిరేకత’ అని కాంగ్రెస్ పార్టీ టాంటాం చేసుకొనే సౌలభ్యం ఉంటుంది. బహుశః అందుకే పార్టీలో సీనియర్లను కాదని ఆమెకు అవకాశం కల్పించారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు ఏవయినప్పటికీ, ఇది ఆమెకు అందివచ్చిన అపూర్వ అవకాశమేనని చెప్పవచ్చును. ఒకవేళ ఆమె ఈ ఎన్నికలలో గెలవగలిగినట్లయితే ఆమెకు మళ్ళీ తెదేపా నుండో లేకపోతే బీజేపీ నుండో పార్టీలో చేరమని ఆహ్వానం అందినా ఆశ్చర్యం లేదు.   అయితే ఈ ఉపఎన్నికలలో తెదేపాకు గట్టి పోటీనివ్వగల వైకాపా పోటీలో లేదు. లోక్ సత్తాతో బాటు మరి కొందరు స్వతంత్ర అభ్యర్ధులు బరిలో ఉన్నప్పటికీ వారు ఓట్లు చీల్చగలరేమో గానీ తెదేపాకు గట్టి పోటీ ఇవ్వలేరు. కనుక తెదేపా అభ్యర్ధి సుగుణమ్మకే విజయావకాశాలున్నాయని భావించవచ్చును. కానీ కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీదేవి నుండి ఆమె గట్టిపోటీయే ఎదుర్కోవలసి రావచ్చును.

అమెరికా అధ్యక్షుడి ఆగ్రా పర్యటన రద్దు సాధారణ విషయమా?

  అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా భద్రతా కారణాల దృష్ట్యా తన ఆగ్రా పర్యటనను రద్దు చేసుకొన్నారని ఆయన యొక్క భద్రతా సిబ్బంది ఒక ప్రకటన విడుదల చేసింది. కనుక ఆయన పర్యటన మూడు రోజులకు బదులు ఇప్పుడు రెండు రోజులతోనే ముగుస్తుంది. ఇది చాలా సాధారణమయిన వార్తలా పైకి కనిపిస్తున్నప్పటికీ, చాలా తీవ్రమయిన విషయంగా పరిగణించవలసి ఉంటుంది.   ప్రపంచంలో కెల్లా అత్యంత శక్తిమంతుడు, అత్యాధునిక భద్రతా సౌకర్యాలు గల అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా కూడా భద్రతా కారణాల దృష్ట్యా ఆగ్రాలో తాజ్ మహల్ ని సందర్శించేందుకు వెనకాడవలసి వచ్చిందంటే పరిస్థితి తీవ్రత అర్ధమవుతుంది. ఒబామా భారత్ పర్యటన సందర్భంగా పాక్ ఉగ్రవాదులు భారత్ లో ప్రధాన నగరాలలో ఎక్కడయినా ఎప్పుడయినా దాడులకు పాల్పడే ప్రమాదం పొంచి ఉందని భారత, అమెరికా నిఘా వర్గాలు పదే పదే హెచ్చరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ చాల కట్టుదిట్టమయిన భద్రత గల అమెరికా అధ్యక్షుడు కూడా ఉగ్రవాదుల దాడులకు భయపడి తన పర్యటనను రద్దు చేసుకోవడం ఆయనకు, ఆయనకు రక్షణ కల్పించలేని భారత ప్రభుత్వానికీ, ఆయనను కంటికి రెప్పలా కాపాడుకొంటున్న అమెరికా భద్రతా దళాలకు కూడా ఇది సిగ్గు చేటే.   అంతేకాదు భారత్ పై ఉగ్రవాదుల నీడలు ఎంతగా కమ్ముకొన్నాయనే విషయం ఇప్పుడు ఆయనకు కూడా బాగానే అర్ధమయ్యే ఉండాలి. ఆయన నేల మీద కాలు మోపక ముందే నేల మీదే కాకుండా నింగిలో కూడా అత్యాధునిక విమానాలు వేసుకొని డేగ కళ్ళతో పహారా కాసే అత్యాధునిక రక్షణ కవచం కలిగి ఉన్న అమెరికా అధ్యక్షుడే ఆగ్రాలో అడుగుపెట్టే సాహసం చేయలేకపోయారంటే ఇక దేశంలో ఎటువంటి రక్షణ లేనీ సాధారణ పౌరుల మాటేమిటి?   అమెరికా అధ్యక్షుడికి అపారమయిన భద్రతా వ్యవస్థ ఉంది కనుక ఉగ్రవాదులు ఆ పరిసర ప్రాంతాలను కన్నెత్తి చూడలేకపోవచ్చును. కానీ కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు పరుచుకొని ఉన్న విశాలమయిన భారత దేశంలో ఉగ్రవాదులు దాడి చేయకుండా అడ్డుకోగల శ్రద్ధ, నేర్పు, నైపుణ్యం, అత్యాధునిక పరిజ్ఞానం భారత భద్రతా దళాలకు ఉందా? ఉంటే అమెరికా అధ్యక్షుడు ఆగ్రా ఎందుకు సందర్శించేందుకు వెనుకాడుతున్నారు?   ఉగ్రవాదంపై పోరు కోసం అంటూ అమెరికా ప్రతీ ఏటా కొన్ని లక్షల డాలర్లు పాకిస్తాన్ కి అందజేస్తోంది. అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్ బయలుదేరే ముందు పాక్ ప్రభుత్వం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించకూడదని ఒక హుకూం కూడా జారీ చేసారు. కానీ ఈ పరిస్థితి చూసకయినా పాకిస్తాన్ తన దుశ్చర్యలు మానుకోదని, దాని ఆగడాలకు గత ముప్పై ఏళ్లుగా భారత్ ఎన్ని బాధలు పడుతోందనే విషయం ఆయనకి అర్ధం అయితే చాలు.

జంప్ జిలానీల పరిస్థితి రెంటికీ చెడిన రేవడి కాబోతోందా?

  కొన్ని రోజుల క్రితం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ (జి.హెచ్.యం.సి.) కి ఎన్నికలు నిర్వహించాలనుకొంటున్నట్లు తెలిపి అందుకోసం తగిన వ్యూహాలు సిద్దం చేసుకోమని ఆదేశించారు. హైదరాబాద్ జంట నగరాల నుండి త్వరలో 20మంది కార్పొరేటర్లు తెరాసలో జేరబోతున్నట్లు ఆయన ప్రకటించారు. అయన అన్న మాటలను నిజం చేస్తూ ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ లో తెదేపా ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డితో బాటు మరో ఐదుగురు తెదేపా కార్పొరేటర్లు తెరాసలో జేరారు. కనుక నేడు కాకపోతే రేపయినా బహుశః మిగిలిన వారు కూడా జంప్ అయిపోయే అవకాశం ఉందని స్పష్టం అవుతోంది. ఇప్పటికే తెదేపాకు చెందిన సీనియర్ నేతలు తీగల, శ్రీనివాస్ యాదవ్ తదితరులు తెరాస కండువాలు కప్పుకొన్నారు.   వారందరూ కలిసి జి.హెచ్.యం.సి. ఎన్నికలలో తెరాస పార్టీకి అఖండ విజయం సాధించిపెడతారనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ వారినందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్న సంగతి వారికీ తెలుసు. అందుకోసమే తలసాని శ్రీనివాస్ యాదవ్ కి మంత్రి పదవి కూడా దక్కిందని అందరికీ తెలుసు. వారందరికీ హైదరాబాద్ పై మంచి పట్టున్న మాట వాస్తవం. కానీ తెలంగాణా నేతలయిన వారందరికీ ఇంతకాలం జంట నగరాలలో స్థిరపడిన ఆంద్ర ప్రజలు ఎందుకు ఓట్లువేసి గెలిపిస్తున్నారు? అనే ప్రశ్న వేసుకొంటే వారందరూ తెలుగుదేశం పార్టీకి చెందినవారయినందునేనని స్పష్టం అవుతుంది. కానీ వారిప్పుడు తెలుగుదేశం పార్టీని వీడి ఆంధ్రప్రజలను, ప్రభుత్వాన్ని నిత్యం విమర్శిస్తూ, వ్యతిరేకించే తెరాస పార్టీలో చేరిన తరువాత కూడా జంటనగరాలలో ఆంద్రప్రజలు వారికే ఓటువేస్తారా? అని ప్రశ్నించుకొంటే బహుశః వేయకపోవచ్చనే సమాధానం వస్తుంది. వారందరూ తెరాసకు తమ సాంప్రదాయమయిన ఆంద్ర ఓటు బ్యాంకును ఖచ్చితంగా బదిలీ చేస్తారనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ వారినందరినీ నెత్తిన పెట్టుకొంటున్నారు. కానీ వారివల్ల అది సాధ్యం కాదని తేలితే, అప్పుడూ వారిని కేసీఆర్ గౌరవిస్తారా? ఇవ్వకపోతే వారి పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించుకొంటే ‘రెంటికీ చెడిన రేవడి’అని చెప్పుకోవలసి వస్తుందేమో? అటు ఎన్నికలలో గెలిచే అవకాశం కోల్పోయి, ఇటు తెరాసలో నిరాదరణకు గురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.   వారు తెరాసకు తమ ఆంధ్రా ఓటు బ్యాంకును బదలాయించలేరని గ్రహించిన మరుక్షణం కేసీఆర్ ప్రత్యామ్నాయంగా కనబడుతున్న వైకాపాను దగ్గిరకు తీసుకోవచ్చును. తెలంగాణాలో మళ్ళీ దుఖాణం తెరవాలని తహతహలాడుతున్న వైకాపా కూడా ఈ అవకాశాన్ని జారవిడుచుకోకపోవచ్చును.   ఇదే జరిగితే తీవ్రంగా నష్టపోయేది తెదేపా నుండి తెరాసలోకి జంప్ చేస్తున్న నేతలే. ఎందుకంటే వారు ఖాళీ చేసిన స్థానాలలోకి తెదేపా, బీజేపీలు తమ అభ్యర్ధులను నిలబెడతాయి కనుక ఇంతవరకు సాంప్రదాయంగా వారికి పడుతున్న ఆంధ్రా ఓట్లన్నీ కూడా తెదేపా, బీజేపీ లేదా వైకాపా అభ్యర్ధులకే పడవచ్చును. అందువలన మిగిలినవారయినా ఆచి తూచి అడుగువేయడం మంచిదేమో?

గ్రేటర్ ఎన్నికలకు టీఆర్ఎస్ రెడీ

  ఏప్రిల్ నెలలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ (జి.హెచ్.యం.సి.) ఎన్నికలు నిర్వహించాలను కొంటున్నట్లు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. తెదేపా నుండి తెరాసలో చేరి మంత్రి పదవి స్వీకరించిన శ్రీనివాస్ యాదవ్ రాజీనామాను స్పీకర్ ఆమోదించినట్లయితే, మళ్ళీ సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నికలు అనివార్యమవుతాయి. కనుక పార్టీ నేతలను అందుకోసం సన్నాహాలు మొదలుపెట్టమని ఆయన ఆదేశించారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా హైదరాబాద్ జంట నగరాలు మరియు చుట్టుపక్కల నివసించే ప్రాంతాలలో స్థిరపడిన ఆంద్రప్రజల ఓట్లను పొందాలంటే అంత వీజీ కాదని ఆయనకీ తెలుసు. ఎందుకో అందరికీ తెలుసు. కనుక కారణాలు మళ్ళీ ఏకరువు పెట్టనవసరం లేదు.   అందుకే ఆయన ముందు జాగ్రత్తగా హైదరాబాద్ లో తెదేపాకు చెందిన కొందరు యం.యల్యేలను పార్టీలోకి రప్పించారు. అంతే కాకుండా ఖమ్మం జిల్లాకు చెందిన తెదేపా నేత తుమ్మల నాగేశ్వర రావును కూడా పార్టీలోకి రప్పించుకొన్నారు. మెట్రో రైల్ మార్గాన్ని అష్టవంకరలు తిప్పి మజ్లిస్ పార్టీని మచ్చిక చేసుకొనే ప్రయత్నాలు కూడా చాలానే చేసారు. ఈ మధ్యన ఆయన కొందరు మంత్రులను వెంటేసుకొని రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి రామోజీరావుతో ఆరు గంటలసేపు ముచ్చట్లు కొట్టి, ఆయనను పొగిడింది కూడా ఆంద్రప్రజలను, హైదరాబాద్ లో ఉన్న బలమయిన ఆయన సామాజిక వర్గానికి చెందిన ప్రజలను, పారిశ్రామికవేత్తలను పడేయడానికేనని మీడియా కోడై కూస్తోంది.   ఇక హైదరాబాదు జంట నగరాలలో నివసించే పేదలకి 125 గజాల భూమి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడం, అన్ని కులాలు, మతాల వారికీ ప్రార్ధన మందిరాలు, సామాజిక భవనాలకి శంఖు స్థాపనలు వంటి అనేక కార్యక్రమాలు కూడా పెట్టుకొన్నారు. కానీ ఇన్ని చేసినా ఈ ఆంద్ర జనాలు తెరాసకు ఓటేస్తారో లేదో? అనే అనుమానం మనసులో పీకుతూనే ఉంటుంది.   అందుకే వారితో బాగా టచ్చు ఉన్నమాజీ తెదేపా నేతలు హైదరాబాద్ లో ఉంటూ తెరాసకు ఓటేయడమే బెటర్ కదా..తెరాసకి ఓటేస్తే మిమ్మల్ని బాగా చూసుకొంటుంది. తెరాస ఆంధ్రా పాలకులనే తప్ప ఆంద్ర ప్రజలని కాదని కన్విన్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆంధ్ర జనాలు కన్విన్స్ అవుతారో లేదో ఎన్నికలు పెడితేగానీ తెలియదు. కానీ కంటోన్మెంట్ ఎన్నికలలో ఓటేశారు గాబట్టి జి.హెచ్.యం.సి. ఎన్నికలలో కూడా డెఫినెట్ గా మనకే ఓటేస్తారని తెరాస ఆశ.

పాపం వాసిరెడ్డి పద్మ

  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మేడమ్ మీకు తెలుసు కదా? అదేనండీ... జగన్ని ఎవరైనా ఏమైనా అంటే మాటలతో వాళ్ళ మీద తూటాల్లాంటి మాటలతో విరుచుకుపడే వీర వనిత. గుర్తొచ్చారు కదూ... జగన్ పార్టీకి అధికార ప్రతినిధిగా ఆమె చక్కగా సరిపోయారు. ఏ విషయాన్నయినా జగన్‌కి అనుకూలంగా మలచి చెప్పడంలో, అధికార పార్టీ మీద, జగన్ వ్యతిరేక వర్గాల మీద గయ్యిమని విరుచుకుపడటంలో ఆమెకు ఆమే సాటి. టీవీ ఛానళ్ళ డిస్కషన్లలో ఆమె పాల్గొన్నారంటే మిగతా పార్టీలవాళ్ళు కిక్కురుమనడానికి కూడా వీల్లేకుండా మాటల దాడి చేస్తారామె. అలాంటి ప్రతిభావంతురాలైన వాసిరెడ్డి పద్మ మేడమ్‌కి పాపం... పగవాళ్ళకు కూడా రాని కష్టాలొచ్చిపడ్డాయి. జగన్ పార్టీ కోసం గొంతు ఎంత చించుకున్నా దక్కాల్సినంత గుర్తింపు దక్కకుండా పోయి కంఠశోషే మిగిలింది. రెండ్రోజులకోసారి టీవీ కెమెరాల ముందుకు వచ్చి అరచి కంఠశోష తెచ్చుకోవడమే ఆమెకి చివరికి మిగిలింది.   త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు దక్కే అవకాశం వుంది. ఎప్పటి నుంచో పార్టీ సేవలో మునిగిపోయిన వాసిరెడ్డి పద్మ మేడమ్‌‌కి ఎమ్మెల్సీ అవ్వాలన్న ఆశ కలిగింది. అలా ఆశ కలగడం కూడా న్యాయమే. అయితే ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎవరెవరినో ఎంపిక చేసే పనిలో జగన్ ఉండటంతో పాపం ఆమె చాలా ఫీలయ్యారు. జగన్ దగ్గరకి వెళ్ళి నాకు ఓ ఎమ్మెల్సీ ఇచ్చేయండి అని అడిగే ఛాన్స్ ఎలాగూ వుండదు కాబట్టి.. ఆమె జగన్ సన్నిహితుడు విజయసాయి రెడ్డి దగ్గరకి వెళ్ళి తన ఆవేదనను వ్యక్తం చేశారట. పార్టీకి ఇంతకాలంగా సేవ చేస్తున్నా... నాకు ఓ ఎమ్మెల్సీ ఇచ్చారంటే పార్టీ సేవలో ఇంకా పునరంకితమవుతా అని వినయంగా అడిగారట. ఆమె విజ్ఞప్తి విన్న విజయసాయి రెడ్డి ‘‘ఆ రెండు ఎమ్మెల్సీ సీట్లు వేరేవాళ్ళకి ఫిక్సయిపోయాయి. మీ విషయం తర్వాత ఆలోచిద్దాం’’ అంటే ఓ పద్ధతిగా వుండేది. కానీ ఆయన అలా అనలేదట. మీది ఎమ్మెల్సీ ఇచ్చే స్థాయి కాదని మొహ్మమ్మీదే చెప్పేశారట. మీ స్థాయికి మించి ఆలోచిస్తున్నారంటూ అన్ని సబ్జెక్టుల్లో జీరోలు వచ్చిన స్టూడెంట్‌కి టీచర్ క్లాస్ తీసుకున్నట్టుగా ఆయన వాసిరెడ్డి పద్మకి సుదీర్ఘమైక క్లాస్ తీసుకున్నారట. దాంతో పద్మ మేడమ్ గుడ్ల నీరు కుక్కుకున్నారట. ఆ తర్వాత తన సన్నిహితుల దగ్గర ఎమ్మెల్సీ సీటు విషయంలో తనకెంత అన్యాయం, అవమానం జరిగిందీ చెప్పుకుని లబోదిబో అన్నారట. ఇంతకాలం పార్టీ కోసం అరిచీ అరిచీ నా నోరు బయటపడిందే తప్ప తనకు ఒరిగిందేమీ లేదని ఆమె నెత్తీనోరు బాదుకుంటూ బాధపడుతున్నారట.   పాపం వాసిరెడ్డి పద్మ మేడమ్‌ ఇలాంటి అవమానాలు కొత్తేమీ కాదు. ‘రాజకీయ శూన్య’ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయనకు అండగా నిలబడిన వాళ్ళలో వాసిరెడ్డి పద్మ కూడా ఒకరు. అప్పుడు కూడా అ పార్టీకి అధికార ప్రతినిధిగా వ్యవహరించిన ఆమె పార్టీని భుజాన వేసుకుని నడిపారు. అనేక అంశాల మీద చిరంజీవికి అవగాహన లేక తుతుతు... మేమేమే అంటుంటే.. వాసిరెడ్డి పద్మ తన వాగ్ధాటితో పార్టీని ఆదుకునేవారు. ఆ సమయంలో కూడా ఆమెకు అన్యాయం జరిగింది. అప్పుడు కూడా ఎమ్మెల్సీ పదవి కోసం ఆమె ప్రయత్నిస్తే చిరంజీవి అండ్ కో ఆమెకు మొండిచెయ్యి చూపించారు. దాంతో ఆమె తన ఆగ్రహాన్ని ఒక పెద్ద లేఖ రూపంలో వెల్లడించారు. ఆ తర్వాత ఆ పార్టీ నుంచి జగన్ పార్టీలోకి వచ్చేసి ఇంతకాలం ఇక్కడ కంచిగరుడ సేవ చేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అవమానం జరిగింది. మరి ఇప్పుడు పద్మ మేడమ్ ఏం చేయబోతున్నారు? గతంలో చిరంజీవికి రాసినట్టే జగన్‌కి ఓ భారీ లేఖ రాసేయబోతున్నారా? జగన్ పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారా?

కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరితే మారేది బీజేపీ రూపమే

  బీజేపీ సీనియర్ నేత శ్రీనివాస రాజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు నిర్దిష్టమయిన ఒక ప్రణాళికను తమకు ఇచ్చేరని దానిని తాము తూచా తప్పకుండా పాటించి వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసుకొంటామని ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ రహితంగా మార్చాలనే తమ నిర్ణయంలో మార్పులేదని అన్నారు. కాంగ్రెస్, వై.యస్సార్ కాంగ్రెస్ పార్టీలకి చెందిన కొందరు ప్రముఖ నాయకులు బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని వారందరూ ఈ నెలాఖరులోగా పార్టీలో చేరే అవకాశాలున్నాయని తెలిపారు. కానీ వారి పేర్లను బయటపెట్టేందుకు ఆయన నిరాకరించారు.   మార్చి నెలాఖరులోగా రాష్ట్రంలో 10లక్షల మంది కొత్త సభ్యులను పార్టీలో చేర్పించేందుకు అందరూ కలిసి కట్టుగా కృషిచేస్తున్నామని, తమ అధ్యక్షుడు అమిత్ షా సూచించిన విధంగా 45,000 మంది యాక్టివ్ మెంబర్స్ ను జేర్పించడం ద్వారా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.   రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు మంచి వ్యూహమే సిద్దం చేసుకొంది. కానీ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ నుండి ముక్తి కలిగిస్తామని చెపుతూనే మళ్ళీ అదే పార్టీకి చెందిన నేతలని తమ పార్టీలో చేర్చుకోబోతున్నట్లు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. కాంగ్రెస్ పార్టీనేతలకి బీజేపీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకొంటే అప్పుడు బీజేపీయే తన స్వరూపం కోల్పోయి మరో కాంగ్రెస్ పార్టీగా మారుతుంది.   కాంగ్రెస్ నేతలు రాష్ట్ర విభజనకు సహకరించినందుకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వారిని గట్టిగా శిక్షించారు. ప్రజలు వారిని క్షమించేందుకు సిద్దంగా లేరు. అటువంటి వారినందరినీ బీజేపీలో చేర్చుకోవడం వలన బీజేపీని కూడా ప్రజలు దూరం పెట్టవచ్చును. కాంగ్రెస్ పార్టీ నేతలను బీజేపీలో చేర్చుకోవడం ద్వారా ఆ పార్టీని కనబడకుండా చేయాలని భావిస్తే అంతకంటే పొరపాటు మరొకటి ఉండబోదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని అంతం చేయడం ఎవరివల్లా కాదు. గత 125సం.లుగా ఆ పార్టీ ఇటువంటి ఓడిడుకులను అనేకసార్లు ఎదుర్కొని మళ్ళీ లేచి నిలబడింది. కొంతమంది పాత నాయకులు పోతే ఆ స్థానంలోకి మళ్ళీ కొత్త నాయకులు వచ్చి చేరుతుంటారు. పైగా నేటికీ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయమయిన ఓటు బ్యాంకు భద్రంగానే ఉంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఎన్నడూ మరణం ఉండబోదు.   ఈరోజు బీజేపీలో చేరే నేతలే రేపు పరిస్థితులు మారితే వెంటనే కాంగ్రెస్ గూటికి చేరుకొన్నా ఆశ్చర్యం లేదు. కనుక అవకాశావాదులయిన అటువంటి నేతల కోసం అర్రులు చాచడం కంటే రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ ప్రక్రియ ద్వారా తమ సంఖ్యని పెంచుకొని వారిలోనుండే నిఖార్సయిన మంచి నాయకులను తయారుచేసుకోవడం మంచిది.

ఏపీ ప్రభుత్వానికి బీజేపీ నిర్మాణాత్మక సహకారం

  ప్రతిపక్ష పార్టీ అంటే వీలయినప్పుడల్లా మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని విమర్శిస్తుండాలి. ఏదో ఒక అంశం దొరకబుచ్చుకొని ఉద్యమాలతో హడావుడి చేస్తుండాలి. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ సంప్రదాయాన్నే ఎంతో నిష్టగా పాటించేస్తూ ప్రజలని కూడా ఇదే సరయిన పద్దతేమోనని నమ్మేలా చేస్తున్నాయి. కానీ రాష్ట్రాభివృద్ధిలో నిర్మాణాత్మకమయిన పాత్ర పోషించాలానే ఆలోచన వాటికి కలలో కూడా కలగదు. ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా ఆ పాత్ర బహు చక్కగా పోషిస్తోంది.   తెదేపాకు మిత్రపక్షమయిన బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను సున్నితంగా ఎత్తి చూపుతూనే దానికి నిర్మాణాత్మకమయిన సలహాలు ఇస్తోంది. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సంఘంలో సభ్యుడయిన సోమూ వీర్రాజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలలో వేసవి ఇంకా రాకమునుపే అప్పుడే నీటి ఎద్దడి మోదలయిందని, ఆ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు చేప్పట్టాలని కోరారు. రాయలసీమ ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి పరిష్కారాలను పేర్కొంటూ కేంద్రప్రభుత్వానికి ఒక నివేదిక పంపినట్లయితే తాము కేంద్రంపై ఒత్తిడి తెచ్చి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తరచూ కరువు బారిన పడుతున్న రాయలసీమ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన కోరారు.   ఆ తరువాత మాట్లాడిన బీజేపీ సీనియర్ నేత శ్రీనివాస రాజు, రాష్ట్రంలో ఇసుక విక్రయాలపై ప్రభుత్వం ఇంత వరకు ఒక నిర్దిష్టమయిన విధానం అవలంభించలేకపోతోందని దాని వలన దళారులు లబ్ది పొందుతుంటే, నిర్మాణరంగం తీవ్రంగా నష్టపోతోందని, కనుక రాష్ట్ర ప్రభుత్వం వీలయినంత త్వరగా లోపరహితమయిన విధానాలను ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు.

చంద్రబాబు తెలంగాణలో పర్యటిస్తే తెరాసకు ఉలుకెందుకు?

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ వచ్చే నెల వరంగల్లో పర్యటిస్తారని తెదేపా ప్రకటించగానే, ఊహించినట్లే తెరాస నేతలు చాలా తీవ్రంగా స్పందించడం మొదలుపెట్టారు. తెలంగాణా రాష్ట్ర రవాణా శాఖా మంత్రి మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ “మా రాష్ట్రానికి అడుగడుగునా ఇబ్బందులు సృష్టిస్తున్న ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మా రాష్ట్రంలో పర్యటించవలసిన అవసరం ఏమిటి? ఆ కార్యక్రమమేదో ఆయన ఆంధ్రాలోనే పెట్టుకొంటే మంచిది. అలా కాదని తెలంగాణాలో పర్యటించేందుకు బయలుదేరితే మేము చేతులు ముడుచుకొని కూర్చోబోము. మేము ఏమి చేయాలో అది చేస్తాము,” అని హెచ్చరించారు. అందుకు తెదేపా తెలంగాణా నేతలు కూడా ఘాటుగానే స్పందించారు.   తెదేపా అధ్యక్షుడయిన చంద్రబాబు నాయుడు తెలంగాణాలో తన పార్టీని బలపరుచుకొనేందుకు బయలుదేరితే ఆయనను అడ్డుకొంటామని ఒక బాధ్యతాయుతమయిన మంత్రి పదవిలో ఉన్న మహేందర్ రెడ్డి హెచ్చరించడం చాలా తప్పు. ప్రతీ భారతీయుడికి దేశంలో ఎక్కడయినా స్వేచ్చగా సంచరించే, స్థిరపడే హక్కలు ఉన్నట్లే, ప్రతీ రాజకీయ పార్టీకి దేశంలో ఏ రాష్ట్రంలోనయినా తన పార్టీని ఏర్పాటుచేసుకొని, దానిని బలపరుచుకొని, ప్రజల తరపున పోరాడుతూ, ఎన్నికలలో పోటీ చేసే హక్కు ఉందని మంత్రిగా ఉన్న ఆయనకి తెలియకపోదు. కానీ తెలంగాణా అంటే అదేదో వేరే దేశం అన్నట్లు అక్కడ ఇతరులకి ప్రవేశించే హక్కు లేదని, ప్రవేశిస్తే అడ్డుకొంటామని వాదిస్తే, అందుకు కోర్టులో మరో మారు మొట్టికాయలు తినక తప్పదు.   క్రిందటి సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ‘తెలంగాణాలో కేవలం తెరాస ఒక్కటే ఉండాలి. తమ పార్టీకి అసలు పోటీయే ఉండకూడదు’ అనే ఆలోచనతో కాంగ్రెస్, తెదేపాలకు చెందిన బలమయిన నేతలను, యం.యల్యే.లను కేసీఆర్ తన పార్టీలోకి ఆకర్షించేరు. అయినప్పటికీ తెదేపా తమ పార్టీకి గట్టి పోటీ ఇస్తుండటంతో దానిపై ‘ఆంద్ర ముద్ర’ వేసి బరిలో నుండి తప్పించాలని విశ్వప్రయత్నం చేసారు. కానీ మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అది సాధ్యం కాదు గనుక తెదేపాను కూడా ఎదుర్కోక తప్పలేదు. ఇప్పుడు మంత్రి మహేందర్ రెడ్డి హెచ్చరికలు వింటుంటే ఆయన కూడా కేసీఆర్ అభిప్రాయాన్నే మళ్ళీ వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది.   తెలంగాణాలో కాంగ్రెస్, బీజేపీ, వైకాపాలు బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంటే దానికి లేని అభ్యంతరం తెదేపా చేస్తేనే ఎందుకు? అని ప్రశ్నించుకొంటే నేటికీ తెరాస నేతలు తెదేపాతో ఉనికితో తీవ్ర అభద్రతాభావానికి గురవుతుండటం వలననే కావచ్చును. ఆ రెండు పార్టీలు ఒకే సమయంలో రెండు రాష్ట్రాలలో అధికారం చేప్పట్టాయి. కనుక సహజంగానే ప్రజలు ఇరు ప్రభుత్వాల, ముఖ్యమంత్రుల పనితీరును ప్రజలు నిత్యం బేరీజు వేసుకొని చూస్తూనే ఉంటారు. విద్యుత్ సంక్షోభం పరిష్కరించే విషయంలో అది నిరూపించబడింది. ఒకవేళ తెదేపా ప్రభుత్వం మిగిలిన ఈ నాలుగున్నరేళ్ళలో రాజధాని నగరం నిర్మించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపించగలిగితే ఆ ప్రభావం తప్పకుండా తెలంగాణా ప్రజలపై కూడా పడుతుంది.   కానీ తెరాస ప్రభుత్వం కూడా ఎంత సమర్ధంగా పరిపాలన చేసినప్పటికీ, అభివృద్ధి సాధించినప్పటికీ ఆ ప్రభావం ఆంద్ర ప్రజలపై పడుతుందేమో గానీ, ప్రాంతీయవాదం ఆధారంగానే పుట్టిన తెరాస ఆంధ్రాలోకి ఎన్నడూ కూడా విస్తరించలేదు. కానీ తెదేపా మాత్రం తెలంగాణాలో కూడా ఉంది కనుక ఆంధ్రప్రదేశ్ లో తమ ప్రభుత్వం సాధించిన అభివృద్ధి గురించి గట్టిగా ప్రచారం చేసుకొని ప్రజలను తనవైపు తిప్పుకొనే అవకాశం ఉంది. బహుశః అందుకే తెరాస పార్టీ తీవ్ర అభద్రతాభావానికి గురవుతున్నట్లు కనబడుతోంది. లేకుంటే అధికారంలోకి వచ్చిన తరువాత కూడా నేటికీ కాంగ్రెస్, తెదేపాకి చెందిన నేతలను తమ పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నాలు చేసేవారు కాదని చెప్పవచ్చును.   తెదేపా, తెరాస రెండు పార్టీలు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే గుజరాత్ రాష్ట్రంలో జరిగిన అభివృద్దే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యేందుకు దోహదపడింది కనుక రెండు ప్రభుత్వాలు కూడా సమర్ధంగా పరిపాలించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లయితే వారికి ప్రజలే పట్టం కడతారు. అలాకాక ఈ నాలుగున్నరేళ్ళలో గాలిలో మేడలు కడుతూ ప్రజలకి బంగారు కలలు చూపిస్తూ కాలక్షేపం చేసినట్లయితే, ఈ విధంగా ఇతర పార్టీలను చూసి ఉలికులికి పడక తప్పదు, ఇతర పార్టీలను చూసి అభాద్రతాభావానికి గురికాక తప్పదు. సెంటిమెంట్లు, పోసికోలు కబుర్లతో ప్రజలను ఆకట్టుకోవచ్చునేమో కానీ వారిని కలకాలం తమకే ఓటు వేసేలా చేయలేవు. ఏ పార్టీ విజయానికయినా ఇప్పుడు అభివృద్దే గీటురాయి. ఈ విషయం గుర్తుంచుకొంటే ఎవరికీ భయపడనవసరం లేదు.

కేసీఆర్ని విమర్శించడం చాలా అన్యాయం

  తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వ్యాధి ప్రబలిపోతోంది. ముఖ్యంగా హైదరాబాద్ స్వైన్ ఫ్లూ పేరు చెబితేనే ఉలిక్కిపడుతోంది. ఇప్పటికే 20 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడి మరణించారు. ఈ వ్యాధి భవిష్యత్తులో మరింత ప్రబలే ప్రమాదం వుందన్న భయాన్ని సాక్షాత్తూ సీఎం కేసీఆరే వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది ప్రతిపక్ష నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ‌నిర్లక్ష్యం కారణంగానే స్వైన్ ఫ్లూ ప్రబలిపోయిందని విమర్శిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు తెలంగాణను స్వైన్ ఫ్లూలో నంబర్ వన్ చేశారని విమర్శిస్తున్నారు. నిజంగా ఇవి చాలా దారుణమైన విమర్శలు. కేసీఆర్ని ఏ విషయంలో విమర్శించినా పెద్ద బాధ కలగదుగానీ, స్వైన్ ఫ్లూ విషయంలో విమర్శిస్తే మాత్రం చాలా బాధ కలుగుతూ వుంటుంది. పాపం ఆయన బంగారు తెలంగాణ సాధించే దిశగా తెలంగాణలోని అన్ని కార్పొరేషన్లలో పర్యటిస్తూ బిజీగా వున్నారు. పేద ప్రజలందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లు ఎలా కట్టించాలా అని ఆయన నిరంతరం ఆలోచిస్తూ మథనపడుతున్నారు. పేదల్ని ఎలా ఆదుకోవాలన్న ఆలోచనలోపడిపోయిన ఆయన స్వైన్ ఫ్లూ గురించి పెద్దగా పట్టించుకోలేదు. అదేదో పెద్ద తప్పు అయినట్టు ప్రతిపక్షాలు విమర్శించడం దారుణం.   అయినా రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ ప్రబలుతోందని సీఎం కేసీఆర్‌కి తెలియదని అనుకుంటున్నారా? ఆయనకి ఈ విషయం ఎప్పుడో తెలుసు. కానీ, ఏదో స్వైన్ ఫ్లూ వచ్చింది.. రెండు మూడు రోజులు వుండి పోతుందిలే అని లైట్ తీసుకున్నారు. ఏదో అనుకోకుండా 20 మందికి పైగా చనిపోయారు. అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లు జరుగుతూనే వుంటాయి. అసలు పొరపాట్లు చేయనివాళ్ళెవరు? అలాంటప్పుడు ఈ విషయం మీద రాద్ధాంతం చేయడం ప్రతిపక్షాలకు తగునా? అయినా అంతమంది చనిపోయాక కేసీఆర్ స్పందించారు కదా? వైద్య ఆరోగ్య శాఖ అధికారుల మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు కదా? ప్రధానమంత్రితో, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో ఫోన్లో మాట్లాడి సాయం చేయమని అడిగారు కదా? అధికారులతో సమావేశాలు ఏర్పాటు కూడా చేశారు కదా.. ప్రజలందరూ అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు కదా... ఇంత చేసినా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయంటే వాళ్ళని ఏమనాలి?

మళ్ళీ స్వయంకృషి?

  తెలుగువారు అందరూ కూడా ఒకనాటి అందాల అద్బుత నటి విజ‌య‌శాంతిని తమ మనిషే అనుకొన్నారు. మెగాస్టార్ చిరంజీవిని కూడా అందరూ అలాగే భావించి ఆదరించారు. కానీ వారిరువురూ రాజకీయాలలో చేరిన తరువాత విజయశాంతి తెలంగాణాకి, చిరంజీవి ఆంధ్రాకి మాత్రమే చెందినవారిగా మారిపోయారు. పోనీ రాజకీయాలలో వారు ఏమయినా రాణించారా అంటే అదీ లేదు.   రెండు మూడు పార్టీలు మారినా విజయశాంతి తలరాత మాత్రం మారలేదు. ఆమె పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుండిపోతే ఆమెకు రాఖీలు కట్టిన అన్నయ్య కేసీఆర్ మాత్రం ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇప్పుడు ఆమె ఏ పార్టీలో ఉందో, ఏమి చేస్తున్నారో కూడా జనాలకి తెలియదు. అందుకే రాములమ్మ మళ్ళీ తన కర్తవ్యం గుర్తు చేసుకొంటూ సినిమాల్లోకి వచ్చేస్తోంది. కాకపోతే ఇంతకాలం తను వ్యతిరేకించిన  ఆంద్రోళ్ళ సినిమాలలోనే మనసు చంపుకొని నటించక తప్పడం లేదు ఆమెకు.   ఇక పులిని చూసి నక్క వాతలు పెట్టుకొన్నట్లుగా స్వర్గీయ యన్టీఆర్ తెదేపా పెట్టిన 9నెలలోనే ముఖ్యమంత్రి అయిపోయి రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పగాలేనిదీ, ఆంద్ర, తెలంగాణా ప్రాంతాలలో లక్షలాది అభిమానులున్న తను ప్రజారాజ్యం స్థాపిస్తే మూడు నెలలోనే ముఖ్యమంత్రి కాలేనా? అనే గొప్ప నమ్మకంతో రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చేరు చిరంజీవి. ఆయన నటించిన సినిమాలలో చాలా వరకు సూపర్ హిట్ట్ అయినప్పటికీ, ఆయన ప్రజారాజ్యం మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిపోవడంతో కంగుతిన్న చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ మహాసముద్రంలో కలిపేసి కేంద్ర మంత్రి సంపాదించుకొని ‘సామాజిక న్యాయం’ కాపాడుకొన్నారు.   కానీ మళ్ళీ రాష్ట్ర విభజనతో అది కూడా మూన్నాళ్ళ ముచ్చటే అయింది. కనీసం అప్పుడయినా సరిగ్గా స్టెప్పులు వేయలేక తడబడటంతో ముప్పై ఏళ్ళు కష్టపడి సంపాదించుకొన్న కీర్తి ప్రతిష్టలు మూడు నెలలో పోగొట్టుకొన్నారు. ముల్లు వచ్చి అరిటాకు మీదపడినా అరిటాకు వచ్చి ముల్లు మీద పడినా చిరిగేది అరిటాకే అన్నట్లు కాంగ్రెస్ చేసిన పాపానికి పాపం ఆ జీవి బలయిపోయాడు అన్యాయంగా.   అందుకు పరిహారంగా రాజ్యసభలో ఓ కుర్చీ ఖాళీ అయితే అందులో ఆయనను కూర్చోబెట్టింది కాంగ్రెస్ పార్టీ. కానీ హై కమాండ్ వ్రాసిచ్చిన స్క్రిప్ట్ లో డైలాగులు ఆయన ఎంత గొప్పగా చదివినా అందరూ వెక్కిరించే వారే కానీ చప్పట్లు కొట్టేవారు కనబడలేదు. క చేసేదేమీ లేక పడిపోయిన చోటనే ఉంగరం వెతుకొనే ప్రయత్నంలో ఆయన కూడా మళ్ళీ సినీపరిశ్రమకు వచ్చేసి జనాల కోరిక మేరకు తన 150 సినిమా కోసం మొహానికి రంగులు పులుముకొని మళ్ళీ జనాల ముందుకు వచ్చేస్తున్నారు.   ఆయనకి మరో ముప్పై ఏళ్ల తరువాత కూడా హీరో వేషాలు వేసే అవకాశాలు ఉండవచ్చునేమో కానీ ఇన్నేళ్ళ తరువాత వస్తున్న రాములమ్మకి మాత్రం అటువంటి అవకాశం ఉండబోదు కనుక గోపీచంద్-నయనతార జంటగా నటిస్తున్న ఒక సినిమాలో ఆమె తల్లి వేషానికో దేనికో సెటిల్ అయిపోక తప్పలేదుట. కానీ అది కూడా ఆ సినిమాలో చాలా ముఖ్యమయిన పాత్రే అని సరిపెట్టుకోక తప్పడంలేదు. ప్రస్తుతం ఏదో ఒక పాత్ర చేస్తున్నా ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి హిట్ ఇవ్వగలిగితే ఆనక ఎప్పుడయినా అవకాశం వస్తే చిరంజీవితో కూడా మళ్ళీ స్టెప్పులు వేసే అవకాశం వచ్చినా ఆశ్చర్యం లేదు.