కొత్త టైటిల్‌తో జగన్ ఓదార్పు యాత్ర

  మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలకు పాదయాత్రలను పరిచయం చేస్తే, ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలు పరిచయం చేసారు. అయితే ఆయన పాదయాత్రలు చేసి ముఖ్యమంత్రి కాగలిగేరు గానీ జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఓదార్పు యాత్రలు చేసినా ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఆ ఓదార్పు యాత్రల వలన ఆయనకు అధికారం దక్కకపోయినా వాటిని ఆయనే కనిపెట్టినందున వాటిపై పూర్తి ‘పేటెంట్ హక్కులు’ మాత్రం ఆయనకే స్వంతమనే విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేవు.   సాధారణంగా ఎవరయినా మనిషిపోతే వారి ఆత్మీయులు వెంటనే వెళ్లి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి వస్తుంటారు. కానీ మనిషి పోయిన పదేళ్ళ తరువాత వెళ్లి పోయినవాళ్ళని గుర్తుచేసి మరీ ఓదార్చడం జగన్మోహన్ రెడ్డికే చెల్లు. ఏళ్ల తరబడి అలా ఓదార్చుకొంటూపోతే ఎవరిని ఎవరు ఎందుకు ఓదార్చుతున్నారనే కన్ఫ్యుజన్ కూడా ఏర్పడుతోంది. పైగా ఇంకా ఓదార్చవలసిన మనుషులు మిగిలున్నారా? అని వెర్రి జనాలు వెర్రి ప్రశ్నలు కూడా వేస్తుంటారు. కానీ ‘ఓదార్పు యాత్రలు’ ఇంత పాపులర్ అయిన తరువాత జనాలు ఏదో అనుకొంటున్నారని ఇంట్లో కూర్చొని గోళ్ళు గిల్లుకొంటూ కూర్చోలేరు గనుక వాటికి ఏదో ఒక కొత్త టైటిల్ తగిలించి మళ్ళీ యాత్రలకి బయలుదేరుతుంటారు సోదరసోదరీమణులు.   తెలంగాణా రాష్ట్రంలో తమ పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకోవాలని ఫిక్స్ అయిపోయిన జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోనే ఉంటున్నప్పటికీ తను స్వయంగా వెళ్లి ఓదార్చకుండా షర్మిలమ్మని పంపించేరు ఎందుకో. ఆంధ్రా యాత్రలకి పెట్టిన పేరే తెలంగాణా యాత్రలకి పెడితే అక్కడి జనాలు నొచ్చుకొంటారనొ ఏమో ఆమె చేప్పట్టిన ఓదార్పు యాత్రలకి ‘పరామర్శ యాత్ర’ అని కొత్త టైటిల్ పెట్టేరు.   ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళీ ఓదార్పు యాత్రలకి శంఖం పూరించేసారు. వాటికి ‘రైతు భరోసా యాత్రలు’ అని టైటిల్ ఫిక్స్ చేసారు. ఈనెల 22న హిందూపురం నుండి ఐదు రోజుల పాటు అనంతపురం జిల్లాలో ఈ యాత్రలు చేస్తారు. రాష్ట్రంలో అప్పుల బాధలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల కుటుంబాలను ఆయన ఓదార్చబోతున్నారు. కేవలం ఓదార్చడంతో సరిపెట్టేయకుండా ఆచేత్తోనే వారి అప్పులు కూడా తీర్చేస్తే ఆ రైతు కుటుంబాలకు నిజమయిన ఊరటనిచ్చినవారవుతారు.   మరి ఆయన ఆపని చేస్తారో లేదో తెలియదు గానీ తనకు అధికారం దక్కకుండా జేసిన చంద్రబాబు నాయుడుపై, ఆయన ప్రభుత్వంపై నిప్పులు కక్కడం మాత్రం గ్యారంటీ. తెదేపా ప్రభుత్వం రుణమాఫీ చేయలేకపోయినందునే రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని బోడిగుండుకి మోకాలికి ముడేసే ప్రయత్నం చేయవచ్చును.   రాష్ట్రంలో ఇప్పుడు అనేక డజన్ల న్యూస్ ఛానళ్ళు డేగ కళ్ళేసుకొని రాష్ట్రాన్ని నిత్యం జల్లెడ పడుతున్నాయి. కానీ వారెవరికీ కనబడని రైతుల ఆత్మహత్యలు కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే కనబడటం గొప్ప విషయమే. ఆర్ధిక సమస్యల కారణంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నట్లయితే దానిని దాచిపెట్టాలని ప్రభుత్వం ప్రయత్నించినా మీడియా ఊరుకోదు. ఏమయినప్పటికీ రైతులు ఆత్మహత్యలు చేసుకొంటే అది అందరూ సిగ్గుతో తలదించుకోవలసిన విషయమే. కనుక జగన్మోహన్ రెడ్డి తన వద్ద ఉన్న ఆ సమాచారాన్ని ఇతర మీడియాకి కూడా అందజేస్తే వారు కూడా ఆ విషయాన్ని దృవీకరించుకొని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తారు.   ఇదివరకు తన తండ్రి మరణించినప్పుడు అనేక వేలమంది గుండెలు పగిలి చనిపోయారని చెప్పుకొని ఓదార్పు యాత్రలు చేసుకొని పార్టీని బలపరుచుకొన్నారు. మళ్ళీ ఇప్పుడు రైతు భరోసా యాత్రలు చేసేందుకు సిద్దం అవుతున్నారు. కానీ తెలంగాణా రాష్ట్రంలో అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నా పట్టించుకోని జగనన్న కేవలం ఆంధ్రా రైతులనే ఎందుకు ఓదార్చాలనుకొంటున్నారో అనే ప్రశ్నకు సమాధానం తెలిసినవారికి ఈ యాత్రల పరమార్ధం ఏమిటో కూడా తెలిసే ఉంటుంది.

మోడీ స్థాయిని బీజేపీ నేతలే తగ్గించేస్తున్నారేమిటో?

  డిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ ఓడిపోయినంత మాత్రాన్న మోడీ ప్రభావం తగ్గిందని ప్రతిపక్షాలు ప్రచారం చేయడం సరికాదని బీజేపీ నేత పురందేశ్వరి అన్నారు. ఇటీవల ఓడిషా రాష్ట్రంలో జరిగిన మునిసిపల్ ఎన్నికలలో తమ పార్టీ ఘనవిజయం సాధించిందని ఆమె తెలిపారు. ఒక రాష్ట్రంలో జరిగిన మునిసిపల్ ఎన్నికలలో విజయం సాధించడాన్ని మోడీ ప్రభావాన్ని కొలమానంగా పురందేశ్వరి పేర్కోవడం పెద్ద పొరపాటని చెప్పవచ్చును.   నిజానికి డిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో మోడీ ప్రభావం ఆధారంగా జరిగినవి కావు. డిల్లీలో నివసిస్తున్న నిరుపేద, సామాన్య మధ్యతరగతి ప్రజలు నిత్యం ఎదుర్కొనే అనేక స్థానిక సమస్యలను ఆమాద్మీ పార్టీ తన ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తూ, వాటిని పరిష్కరిస్తాననే హామీతో ప్రజలను ఆకట్టుకోగలిగింది. అధికారుల అవినీతితో విసిగి వేసారిపోయిన వ్యాపార వర్గాలను అవినీతిని అంతం చేస్తానని హామీ ఇచ్చి ఆకట్టుకొంది. అరవింద్ కేజ్రీవాల్ క్రిందటి సారి తన 49 రోజుల పరిపాలనలో అవినీతిపై ఏవిధంగా పోరాడారో సామాన్య ప్రజలకు కళ్ళకు కట్టినట్లు సాక్ష్యాలతో సహా చూపడం వలన ప్రజలు ఆయన వైపు ఆకర్షితులయ్యారు.   బీజేపీ కూడా అటువంటి హామీలే ఇచ్చింది. కానీ డిల్లీ ప్రజలు ప్రాధాన్యత ఇస్తున్న స్థానిక సమస్యలు, అవినీతి, మహిళకు రక్షణ అనే మూడు అంశాలపై బీజేపీ తన వైఖరిని సమర్ధంగా ప్రచారం చేసుకోలేకపోయింది. బీజేపీ, ఆమాద్మీ పార్టీలు అమలుచేసిన ఎన్నికల వ్యూహాలు కూడా ఆ పార్టీల జయాపజయాలకు కారణమయ్యాయి. కనుక ఆ ఎన్నికలు మోడీ ప్రభావానికి గీటురాయి కానేకావు. కానీ ప్రతిపక్షాలకు అందివచ్చిన ఆ అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకొంటూ మోడీ ప్రభావం తగ్గిందని ప్రచారం చేసుకొంటున్నాయి అంతే.   దానిని చూసి బీజేపీ నేతలు కంగారుపడిపోతూ ఏదో ఒక రాష్ట్రంలో జరిగిన మునిసిపల్ ఎన్నికలను కూడా మోడీ ప్రభావాన్ని కొలిచేందుకు ప్రమాణంగా చెప్పుకొంటే వారే ఆయన స్థాయిని స్వయంగా తగ్గించుకొంటున్నట్లవుతుంది. రేపు తమ పార్టీ ఏ ఎన్నికలలో ఓడిపోయినా అప్పుడు బీజేపీ నేతలందరూ ఈవిధంగానే సంజాయిషీలు చెప్పుకోవలసిన దుస్థితి ఏర్పడుతుంది. దాని వలన ప్రజలకు తప్పుడు సంకేతాలిచ్చినట్లవుతుంది కూడా.

తెదేపా, తెరాసలపై పురందేశ్వరి విమర్శలు

  తెదేపా పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం నారా లోకేష్ నేతృత్వంలో ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేసింది. ఒక రాజకీయ పార్టీ తన కార్యకర్తల కోసం ఆవిధంగా సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం దేశంలో అదే మొదటిసారి. తన కార్యకర్తలకి మరింత సంరక్షణ కల్పించాలనే ఉద్దేశ్యంతో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియలో రెండున్నర లక్షల ఇన్స్యూరెన్స్ కవరేజ్ సదుపాయం కూడా కల్పించింది. దానికి వచ్చిన మంచి స్పందన చూసి తెలంగాణాలో తెరాస కూడా సభ్యత్వ నమోదు ప్రక్రియలో రెండు లక్షల ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఇస్తోంది. దానికి కూడా చాలా మంచి స్పందనే వస్తోంది.   సామాన్య కార్యకర్తలకు అంత భారీ ఇన్స్యురెన్స్ కవరేజి తీసుకోవడం కష్టమే కనుక అది వారికి చాలా లబ్ది చేకూరుస్తుంది. పార్టీ కార్యకర్తలకు మేలు జరిగితే వారు కూడా చాలా సంతోషంగా పార్టీ కోసం మరింత కష్టపడి పనిచేస్తారు. అయితే ఈవిధంగా పరస్పర లబ్ది చేకూర్చే ఈ ఆలోచనని బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి అక్షేపిస్తున్నారు. ఆ రెండు పార్టీలు కొత్త సభ్యులను ఆకట్టుకొనేందుకే అటువంటి ఆలోచన చేస్తున్నాయని అన్నారు. కానీ బీజేపీకి మాత్రం అటువంటి అవసరం లేదని, పార్టీ సిద్ధాంతాలు, ప్రధాని మోడీ పరిపాలన గురించి వివరించి బీజేపీ సభ్యత్వ నమోదు చేస్తున్నామని, తమ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన వస్తోందని ఆమె తెలిపారు.   ప్రాంతీయ పార్టీలయిన తెదేపా, తెరాసలు సామాన్య ప్రజలను తమవైపు ఆకర్షించేందుకు ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఇచ్చి ఉండవచ్చును. గానీ దానివలన ఆ కార్యకర్తలకి, పార్టీకి కూడా మేలు జరుగుతున్నప్పుడు అందులో తప్పు పట్టవలసింది ఏముంది? తాము బీజేపీ సిద్ధాంతాలు, ప్రధాని మోడీ పరిపాలన గురించి వివరించి పార్టీ సభ్యత్వ నమోదు చేస్తున్నామని పురందేశ్వరి చెపుతున్నారు. పార్టీలో సభ్యులను చేర్చుకొనేందుకు ఆమె ఒక పద్ధతి అనుసరిస్తే, తెదేపా, తెరాసలు మరొక పద్ధతి అనుసరించాయి. అందులో తప్పేమీ లేదు. ఏదో ఒకనాడు కాంగ్రెస్, బీజేపీలు కూడా తెదేపా, తెరాసల పద్ధతినే అనుసరించినా ఆశ్చర్యం లేదు.   కాంగ్రెస్, బీజేపీలు పేరుకి జాతీయ పార్టీలయినప్పటికీ ఇంతవరకు పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియపై పెద్దగా దృష్టి పెట్టలేదనే చెప్పవచ్చును. అమిత్ షా బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చెప్పట్టిన తరువాత పార్టీకి సభ్యత్వ నమోదు ప్రక్రియ చాలా ఆత్యవసరమని ఆయన గట్టిగా నొక్కి చెప్పిన తరువాతనే ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో బీజేపీ నేతలు అందుకు నడుం బిగించారు. ఆయన ఆంధ్రాలో 45 లక్షలు, తెలంగాణాలో30 లక్షల మంది కొత్త సభ్యులను చేర్చుకోవాలని నిర్దేశించారు. కానీ కేవలం పార్టీ సిద్దాంతాలు, మోడీ పేరు చెప్పుకొని అన్ని లక్షల మందిని ఆకర్షించడం అసాధ్యమని బీజేపీ నేతలకి కూడా తెలుసు. అందుకే ఆయన నిర్దేశించిన లక్ష్యం చేరుకోవడం అసాధ్యమని వారు ఆనాడే ఆయనకు చెప్పారు కూడా. అప్పటి నుండి రెండు రాష్ట్రాలలో బీజేపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ జరుగుతున్నప్పటికీ ఇంతవరకు వారు తమ లక్ష్యంలో ఎంత సాధించారో చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది. కానీ ఆసంగతి ఒప్పుకోవడం కష్టం. ఆ రెండూ కూడా ప్రాంతీయ పార్టీలు కనుక ఇటువంటి ప్రయోగాలు చేస్తూ బీజేపీ కంటే సభ్యత్వ నమోదులో తెదేపా, తెరాసలు  చాలా దూసుకుపోయాయి. కానీ తమకు ఆ ఆవకాశం లేకపోవడంతో సభ్యత్వ నమోదు ప్రక్రియలో నత్తనడకలు సాగుతున్నందునే  పురందేశ్వరి ఆ విధంగా విమర్శిస్తున్నట్లు భావించవలసి ఉంటుంది.  

యథా కేసీఆర్ తథా రాజయ్య

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాష్ట్రంలో ఇతర రాజకీయ పార్టీలు వేలెట్టడానికి వీలులేదంటారు. అందుకు అనేక కారణాలు చెపుతుంటారు కూడా. నిన్న మొన్నటి వరకు తెలంగాణా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన డా. టీ. రాజయ్య కూడా ఇప్పుడు కేసీఆర్ నే ఆదర్శంగా తీసుకొన్నట్లున్నారు. ఆయన కూడా తన స్టేషన్ ఘన పూర్ నియోజకవర్గంలో తెరాస నేతలెవరూ వేలెట్టడానికి వీలులేదంటున్నారు.   ఆ మధ్యన మోడీ ప్రభుత్వం తెలంగాణా పట్ల సవతితల్లి ప్రేమ ప్రదర్శిస్తోందని మోడీకి శాపనార్ధాలు పెట్టిన కేసీఆర్, ఇప్పుడు అదే నాలికతో మోడీ అంత గొప్ప నాయకుడు లేనేలేడని, ఆయన దేశాన్ని ఎక్కడికో తీసుకు వెళ్లిపోతున్నారని తెగ పొగిడేస్తున్నారు. ఇంతకు ముందు మోడీ ప్రకటించిన స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని ఏ మాత్రం పట్టించుకోని కేసీఆర్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని శాఖల చేత వారంలో ఒకరోజు చీపురు పట్టించేసి స్వచ్చ భారత్ కూడా చేసేస్తామని ప్రకటించారు. కవితమ్మకు కేంద్రమంత్రి పదవి ఇప్పించేందుకే కేసీఆర్ ట్యూన్ మార్చేరని ప్రతిపక్షాలు చెవులు కోరుకొంటున్నాయి.   ఇంతకు ముందు తనను ఉపముఖ్యమంత్రి పదవిలో నుండి దింపేసినప్పుడు డా.రాజయ్య కూడా కూడా కేసీఆర్ పై ఇలాగే చిర్రుబుర్రులాడారు. కానీ ఇప్పుడు కేసీఆర్ చాలా గొప్పగా పరిపాలిస్తున్నారని, తాను కేవలం ఆయనకే జవాబుదారిగా ఉంటానని ప్రకటించేసారు. పనిలోపనిగా తెలంగాణా కోసం తను చేసిన త్యాగాలను ప్రజలకు ఓసారి గుర్తుచేసి ఇకపై తన నియోజక వర్గం అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి గట్టిగా కృషిచేస్తానని ప్రకటించేసారు.   రాష్ట్ర పునర్విభజన చట్ట ప్రకారం నీళ్ళు, విద్యుత్ లో తెలంగాణకు న్యాయంగా రావలసిన వాటాను ఆంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని కేసీఆర్ వాదించడం అందరికీ తెల్సిన విషయమే. అదేవిధంగా తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి కోసం 50 శాతం సబ్సిడీపై సన్న, చిన్నకారు రైతులకు ట్రాక్టర్లను అందిస్తోంది. ఈ పధకంలో వరంగల్ జిల్లాకు మొత్తం 94 ట్రాక్టర్లు మంజూరయ్యాయి. వాటిలో రాజయ్యకు చెందిన స్టేషన్‌ఘన్‌పూర్ నియోజక వర్గంలో ఒక్కో మండలానికి రెండు చొప్పున ట్రాక్టర్లు మంజూరు అయ్యాయి. ఆ పంపకాలన్నీ తన కనుసన్నలలోనే జరగాలని రాజయ్య అనుకొంటుంటే, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి వాటిలో ఒక దానిని తనకు బాగా పరిచయమున్న ఒక రైతుకు కేటాయించమంటూ ఒక సిఫార్సు లేఖ ఇచ్చారు. సదరు రైతు ఈ పథకాంలో లబ్ది పొందేందుకు అన్ని విధాల అర్హుడని పేర్కొంటూ గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీడీవోలు సంతకాలు చేసి ఇచ్చేసారు. దానితో అధికారులు కూడా ఆ రైతుకి ట్రాక్టరు మంజూరు చేస్తున్నట్లు తెలియజేసారు.   ఈ సంగతి తెలుసుకొన్న రాజయ్య అధికారుల మీద విరుచుకు పడ్డారు. కడియం ఇచ్చిన సిఫార్సు లేఖ ఆధారంగా ట్రాక్టర్లు ఎవరికీ పడితే వారికి ఇచ్చినట్లయితే ‘కబడ్ధార్’ అంటూ హెచ్చరికలు జారీ చేయడమే కాకుండా ఆయన కూడా మరో రైతు పేరును సిఫార్సు చేసినట్లు తాజా సమాచారం. ఈనెలాఖరులోగా ఈ సబ్సిడీ ట్రాక్టర్ల పంపకం జరగిపోవాలి. కానీ ఇప్పుడు రాజయ్య అడ్డుపడుతుండటంతో అధికారులు తలలు పట్టుకొన్నారు. బహుశః ఈ పంచాయితీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరకు వెళ్ళవచ్చును. అప్పుడు ఆయన రాజయ్యను కాదని కడియంకి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే అది మరొక పంచాయితీ అవుతుంది.

హైదరాబాద్ మెట్రోకి మళ్ళీ బ్రేకులా?

  హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మిస్తున్న యల్.యండ్.టి. సంస్థ ఆమధ్య ఒకసారి ఈ ప్రాజెక్టు వలన తమకు లాభం లేదని, తెలంగాణా ప్రభుత్వం అనుమతిస్తే ఈ ప్రాజెక్టు నుండి తాము తప్పుకొంటామని లేఖ వ్రాసినప్పుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ వారితో చర్చలు జరిపిన తరువాత సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని, అనుకొన్న సమయానికే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. ఆ సందర్భంగా కేసీఆర్ సూచించిన కొన్ని మార్పులకు వారు అంగీకరిస్తున్నట్లే మాట్లాడారు. దానితో సమస్యలన్నీ పరిష్కారమయిపోయాయనే అందరూ భావించారు. కానీ కదా మళ్ళీ మొదటికి వచ్చినట్లు తెలుస్తోంది.   కేసీఆర్ సూచించిన మార్పుల కోసం అధనంగా మరో రూ.2200 కోట్లు వ్యయం అవుతుందని యల్.యండ్.టి. సంస్థ “ప్రాధమిక అంచనా”లను ప్రభుత్వానికి ఇటీవలే సమర్పించినట్లు తాజా సమాచారం. ఈ అంచనాలు కార్య రూపం దాల్చేసరికి మరికొంత పెరిగే అవకాశం కూడా ఉంటుందని వేరే చెప్పానవసరం లేదు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై రూ.6000 కోట్లు ఖర్చు చేసిన యల్.యండ్.టి. సంస్థ ఇప్పుడు మరో రూ.2200 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడటం లేదు. కనుక ముందే ఒప్పుకొన్నట్లు ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని యల్.యండ్.టి. సంస్థ కోరుతున్నట్లు తెలుస్తోంది.   కేవలం సామాజిక బాధ్యతగానే ప్రపంచంలో వివిధ దేశాలు మెట్రో రైల్ నిర్వహిస్తున్నాయి తప్ప మెట్రో రైల్ నిర్వహణ లాభదాయకం కాదని మెట్రో గురు శ్రీధరన్ ఇదివరకే తేల్చి చెప్పారు. యల్.యండ్.టి. సంస్థ కూడా ఇదివరకే ఆ సంగతి కుండ బ్రద్దలు కొట్టినట్లు చెప్పింది. అటువంటప్పుడు మరో రూ.2200 కోట్లు పెట్టుబడి దానిపై పెట్టడానికి ప్రభుత్వం కూడా పునరాలోచించుకోక తప్పనిసరి పరిస్థితి నెలకొంది.   ఈ భారీ పెట్టుబడి సమస్య గురించి తెలంగాణా ప్రభుత్వం, యల్.యండ్.టి. సంస్థ ప్రతినిధులు మల్లగుల్లాలు పడుతుంటే, కొత్తగా మరొక సమస్య కూడా వెలుగులోకి వచ్చింది. ఇదివరకు యల్.యండ్.టి. సంస్థ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకొంటామని తెలుపుతూ తెలంగాణా ప్రభుత్వానికి లేఖ వ్రాసినప్పుడు, ఇందులో ఇమిడిఉన్న కొన్ని సాంకేతిక సమస్యలని, ఇబ్బందులను అధిగమించేందుకు, మోడీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని సెంట్రల్ మెట్రో యాక్ట్ పరిధిలోకి తీసుకువస్తూ చట్ట సవరణ చేసింది. దానివల్ల సమస్యలు పరిష్కారం అయ్యాయో లేదో తెలియదు గానీ, ఆ చట్టంలో “ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం-నిర్వహణ” అనే పద్దతి గురించి ఎక్కడా ప్రస్తావన లేకపోవడంతో అదే పద్దతిలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుపై యల్.యండ్.టి. సంస్థకి, దానిపై రూ.6000 కోట్లు పెట్టుబడి పెట్టినప్పటికీ ఎటువంటి యాజమాన్య హక్కులు లేకుండా పోయాయి. కనుక చట్టసవరణ చేసి ఈ లోపాన్ని సరిదిద్దమని యల్.యండ్.టి. సంస్థ కేంద్రానికి మోర పెట్టుకొన్నప్పటికీ అటునుండి ఇంతవరకు స్పందన లేకపోవడంతో చాలా ఆందోళన చెందుతోంది.   అయితే నేడు కాకపోతే రేపయినా చట్టసవరణ జరిగే అవకాశం ఉంది. కానీ మలివిడత ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమయిన రూ.2200 కోట్లు పెట్టుబడి ఎవరు పెడతారు? ఎప్పుడు పెడతారు? అసలు పెట్టుబడి పెడతారా లేదా? అనే ప్రశ్నలకు జవాబు దొరికితే గానీ ఈ ప్రాజెక్టు మళ్ళీ పట్టాలు ఎక్కేలాలేదు. ఇంతవరకు వచ్చిన తరువాత ఈ ప్రాజెక్టును అర్ధాంతరంగా ఆపితే చాలా నష్టమే కాకుండా అది ప్రభుత్వానికి, యల్.యండ్.టి. సంస్థకి కూడా తీరని అప్రదిష్ట కలిగిస్తుంది. అలాగని ముందుకు వెళ్ళాలన్నా చాలా సాహసం చేయాల్సి ఉంటుంది. మరి తెలంగాణా ప్రభుత్వం ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.

ముఖ్యమంత్రుల భేటీ ముగిసింది కానీ..

  గవర్నరు నరసింహన్ సమక్షంలో ఆంధ్రా, తెలంగాణా ముఖ్యమంత్రుల సమావేశం కొద్ది సేపటిక్రితమే ముగిసింది. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ నాగార్జున్ సాగర్ నుండి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు 10టియంసీల నీళ్ళు విడుదల చేసేందుకు అంగీకరించారు. మళ్ళీ వచ్చే ఖరీఫ్ సీజన్ లో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అంతే మొత్తం నీళ్ళు తెలంగాణా రాష్ట్రానికి ఇవ్వాలని ఆయన చేసిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించినట్లు తాజా సమాచారం. సాగర్ డ్యాం వద్ద కేంద్ర రిజర్వ్ పోలీస్ దళాలను ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గవర్నర్ నరసింహన్ న్ని కోరినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రులు ఇరువురూ సమావేశం పూర్తికావడంతో రాజ్ భవన్ నుండి వెళ్ళిపోయారు. కానీ ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖా మంత్రులు దేవినేని ఉమా మహేశ్వర రావు మరియు హరీష్ రావు, ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు ఇంకా గవర్నర్ సమక్షంలోనే చర్చలు కొనసాగిస్తున్నారు. నీటి పంపకాలపై ఇరు రాష్ట్రాల అధికారులు పూర్తి వివరాలు, ప్రతిపాదనలతో మళ్ళీ మరోమారు తన వద్దకు రావాలని గవర్నర్ నరసింహన్ మంత్రులను అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. మరి కొద్ది సేపటిలో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖా మంత్రులు మీడియా ముందుకు వచ్చి తమ సమావేశ వివరాలను వెల్లడించవచ్చును.

ఉండవల్లి తప్పటడుగు వేయబోతున్నారా?

  రాష్ట్ర విభజన సమయంలో ప్రజల దృష్టిని బాగా ఆకర్షించిన వారిలో కాంగ్రెస్ మాజీ యంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఒకరు. కానీ రాష్ట్ర విభజన తరువాత చాలా మంది కాంగ్రెస్ నేతలలాగే ఆయన కూడా రాజకీయాల నుండి తప్పుకొన్నారు. మళ్ళీ వారితోబాటే ఆయన కూడా ఇప్పుడు రాజకీయాలలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.   ఇప్పుడు కాంగ్రెస్ నేతలలో చాలా మంది బీజేపీ వైపు చూస్తున్నారు కనుక ఉండవల్లి కూడా అటువైపు వెళతారని ప్రజలు భావించినప్పటికీ ఆయన వైకాపాలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నట్లున్నారు. ఆయనను వైకాపాలోకి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు కూడా వచ్చేయి.   ఆయన కూడా తను వైకాపాలో చేరబోతున్నట్లు స్పష్టమయిన సంకేతాలే ఇస్తున్నారు. తుళ్ళూరు మండలంలో రాజధాని కోసం భూములు ఇచ్చేందుకు ఇష్టపడని రైతులను ఆయన గురువారం కలిసి వారి అభిప్రాయలు తెలుసుకొన్నారు. తరువాత ఆయన మీడియాతో చెప్పిన ప్రతీ మాట కూడా వైకాపా గొంతును వినిపిస్తున్నట్లే ఉంది.   “చంద్రబాబు నాయుడు కేవలం ఒక్క శాతం ఓట్లు అధికంగా పొందడం చేతనే అధికారంలోకి రాగలిగారు. రాజధాని కోసం రైతుల భూములను బలవంతంగా తీసుకొనేందుకు ప్రయత్నిస్తే వారి తరపున న్యాయపోరాటం చేసేందుకు నేను సిద్దం. అవసరమయితే ఈ సమస్య గురించి పార్లమెంటులో కూడా లేవనెత్తుతాము. ఈ తొమ్మిది నెలల పాలనలో మోడీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదు” అని అన్నారు.   మోడీ ప్రభుత్వం గురించి ఆయన చెప్పిన ఆ ఒక్క ముక్క మాత్రమే వైకాపా వైఖరికి మ్యాచ్ అవడం లేదు. కానీ మోడీ విషయంలో వైకాపా త్వరలో వైఖరిని మార్చుకోబోతోందనే సంకేతం ఇస్తున్నట్లు భావించవచ్చును. సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుండీ జగన్మోహన్ రెడ్డి తనను తాను, తన నేతలను, కార్యకర్తలను ఓదార్చుకొనే ప్రయత్నంలో తమ పార్టీ కేవలం ఒక్క శాతం ఓట్ల తేడాతో ఓడిపోయిందని చెప్పుకొంటుంటారు. ఇప్పుడు అదే ముక్క ఉండవల్లి నోటి నుండి కూడా వెలువడింది. రాజధాని కోసం భూములు ఇవ్వదలచుకోని కొన్ని గ్రామాల రైతులు జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడు ఆయన వారి తరపున న్యాయపోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఉండవల్లి కూడా అదే చెపుతున్నారు.   ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో సభ్యుడు కాదు. యంపీ కూడా కాదు. కానీ ఈ అంశం గురించి పార్లమెంటులో లేవనెత్తుతానని హామీ ఇస్తున్నారంటే అది ఎవరి ద్వారా వీలవుతుంది? అని ప్రశ్నించుకొంటే వైకాపా యంపీల ద్వారాననే సమాధానం వస్తుంది. అంటే నేడో రేపో ఆయన వైకాపాలో చేరడం తధ్యమని స్పష్టమవుతోంది. మంచి వక్త, రాజకీయ అనుభవజ్ఞుడు, మంచి జనాధారణ ఉన్న నేతగా పేరున్న ఉండవల్లి వైకాపాలో చేరితే ఆ పార్టీకి చాలా లాభమే. కానీ ఆయన రాజకీయ జీవితంలో అదొక పెద్ద పొరపాటు అయ్యే అవకాశాలే ఎక్కువ. ఎందుకో అందరికీ తెలుసు గనుక మళ్ళీ ప్రత్యేకంగా ఆ విషయాల గురించి ఏకరువు పెట్టనవసరం లేదు.

బీజేపీ చేసిన తప్పు టీడీపీ కూడా చేస్తోందా?

  మొన్నటి ఢిల్లీ ఎన్నికలలో బీజేపీకి పట్టిన గతి అందరూ చూశారు. ఘన విజయం సాధిస్తుందని అందరూ అనుకున్న బీజేపీ దారుణంగా ఓడిపోయింది. దానికి కారణం దారిన పోయే దానమ్మ కిరణ్ బేడీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడమే. ఢిల్లీ బీజేపీలో ఎంతోమంది అర్హులు ఉండగా, పార్టీ జెండాను మోసిన నాయకులుండగా పార్టీకి సంబంధం లేని కిరణ్ బేడీని సీన్‌లోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. దాంతో పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిశాయి. ఫలితం... బీజేపీ ఎవరూ ఊహించని ఘోర పరాజయాన్ని, అంతకు మించిన పరాభవాన్ని మూటగట్టుకుంది. మాంఛి దూకుడు మీద వున్న మోడీ బండికి పెద్ద కుదుపుతో బ్రేకు పడింది. మరి... ఢిల్లీలో బీజేపీకి పట్టిన గతే త్వరలో జరగబోతున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకీ పట్టనుందా? అవును... అలా పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని పలువురు అంటున్నారు... అలా అంటున్నది వేరే ఎవరో కాదు.. తెలుగుదేశం పార్టీ జెండాను భుజాల మీద మోస్తున్న ఆ పార్టీ కార్యకర్తలే! మార్చి 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికలు జరగనున్నాయి. గుంటూరు - కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ స్థానం నుంచి కూడా ఎమ్మెల్సీని ఎన్నుకుంటారు. ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా నిలబడే వ్యక్తిని స్థానిక తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఏనాడో ఖరారు చేశారు. పార్టీ అధిష్ఠానం కూడా ఆ వ్యక్తి వైపే గతంలో మొగ్గు చూపించింది. ఆ వ్యక్తి ఎవరో కాదు... చందు సాంబశివరావు. తెలుగుదేశం పార్టీ అభ్యున్నతి కోసం రెండు దశాబ్దాలుగా పాటుపడిన వ్యక్తి. ఉన్నత విద్యావంతుడు. ఇండియాలోని ఇస్రోలో, అమెరికాలోని నాసాలో అంతరిక్ష పరిశోధకుడిగా కూడా ఎనలేని ఖ్యాతి సంపాదించుకున్న మేధావి. కేంద్ర మంత్రి సుజనా చౌదరికి ఆప్తుడు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఎంతో గౌరవించే వ్యక్తి. అలాంటి చందు సాంబశివరావు పేరును పార్టీ అధిష్ఠానం ప్రకటిస్తుందని అందరూ భావిస్తున్న తరుణంలో అందరూ షాకయ్యే నిర్ణయాన్ని పార్టీ నాయకత్వం ప్రకటించింది. గుంటూరు - కృష్ణాజిల్లాల ఉపాధ్యాయ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎ.ఎస్.రామకృష్ణను తెలుగుదేశం నాయకత్వం ప్రకటించింది. ఎ.ఎస్.రామకృష్ణ తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి కాదు. సీపీఐ (ఎం) అనుబంధ సంస్థ, ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో)కి చెందిన నాయకుడు. తెలుగుదేశం పార్టీలో నాయకులే లేనట్టుగా ఇతర పార్టీకి చెందిన నాయకుడిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంతో  స్థానిక తెలుగుదేశం నాయకులు షాక్‌కి గురయ్యారు. పార్టీకి ఎంతో సేవ చేసిన చందు సాంబశివరావును కాదని, ఇతర పార్టీకి చెందిన ఎ.ఎస్.రామకృష్ణను తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలోకి నిలపడాన్ని  తెలుగుదేశం కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. రామకృష్ణ గెలుపుకు తాము కృషి చేసే ప్రసక్తే లేదని అంటున్నారు. ఈ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఇతర పార్టీకి చెందిన వ్యక్తిని, ఖచ్చితంగా ఓడిపోయే వ్యక్తిని తెలుగుదేశం అభ్యర్థిగా నిలబెట్టడానికి గుంటూరు జిల్లాకు చెందిన ఓ మంత్రిగారు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. ఈ స్థానం నుంచి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) అభ్యర్థి లక్ష్మణరావు రంగంలో వున్నాడు. ఈ లక్ష్మణరావు సదరు మంత్రి గారికి మంచి మిత్రుడు. తన మిత్రుడు లక్ష్మణరావు గెలవాలంటే తెలుగుదేశం అభ్యర్థిగా సత్తాలేని వ్యక్తిని నిలపాలి. ఈ ప్లాన్‌తో ఏ రకంగా చక్రం తిప్పాడోగానీ తెలుగుదేశం పార్టీ తరఫున రామకృష్ణను బరిలో నిలిపేలా చేయడంలో మంత్రిగారు సక్సెస్ అయ్యాడు. మంత్రిగారి మిత్రుడు లక్ష్మణరావు తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు ప్రభుత్వం మీద నిరంతరం దుమ్మెత్తి పోస్తూ వుంటాడు. అంతేకాదు,  గుంటూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం వ్యతిరేకి కన్నా లక్ష్మీనారాయణకు జిగిరీ దోస్త్. అలాంటి వ్యక్తిని గెలిపించడం కోసం తెలుగుదేశం పార్టీ తరఫున బలహీనుడైన అభ్యర్థిని నిలిపేలా చేసిన మంత్రిగారి తెలివితేటలు చూసి  తెలుగుదేశం కార్యకర్తలు ముక్కున వేలేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి నిర్విరామంగా కృషి చేసిన చందు సాంబశివరావుకు మొండిచెయ్యి చూపడంతోపాటు తెలుగుదేశం పార్టీకి చెందని వ్యక్తిని ఎందుకు పోటీలో నిలిపారో చెప్పాలని పార్టీ నాయకత్వం దగ్గర ఎంతగా మొత్తుకున్నా సమాధానం దొరకడం లేదు. మొన్ననే ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులందరూ చాలా సంతోషంగా వున్నారు. ఇలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన చందు సాంబశివరావును పోటీలో నిలిపితే కార్యకర్తల కృషితో విజయం సులభంగా దక్కేది. అయితే ఇప్పుడు వేరే పార్టీకి చెందిన వ్యక్తిని నిలపడంతో ఆ అవకాశం లేకుండా పోతోంది. తెలుగుదేశం నాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక పొరపాటు నిర్ణయంగా చరిత్రలో నిలుస్తుందన్న అభిప్రాయాన్ని ఆ పార్టీ కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో కిరణ్ బేడీని రంగంలోకి దించి బీజేపీ ఎలాంటి చారిత్రక తప్పిదం చేసి పరాభవాన్ని మూటగట్టుకుందో, ఇప్పుడు గుంటూరు - కృష్ణా జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ అదే పరిస్థితిని చవిచూడాల్సి వస్తుందని అంటున్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థిగా చిగురుపాటి వరప్రసాద్ పోటీలో నిలిచారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వుండే వ్యక్తి. దాంతో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఆయన గెలుపు కోసం పనిచేయలేదు. దాంతో ఆయన ఇప్పుడు యుటీఎఫ్ అభ్యర్థిగా వున్న లక్ష్మణరావు చేతిలోనే ఓడిపోయాడు. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా జాక్టో రామకృష్ణకు అనుకూలంగా పనిచేయడానికి నాయకులు, కార్యకర్తలు ఎంతమాత్రం ఇష్టపడటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో లక్ష్మణరావు చేతిలో జాక్టో రామకృష్ణ ఓడిపోతే ఆయనకి మద్దతు ఇచ్చి. విఫల ప్రయోగం చేసిన పాపానికి తెలుగుదేశం పార్టీ పరువు పోవడం ఖాయమని కార్యకర్తలు అంటున్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం నాయకత్వం తన నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని కోరుతున్నారు.

జగన్ భజన ఏడిసినట్టుంది...

  వైసీపీ అధినేత జగన్ మొన్నామధ్య ఎలక్షన్స్ జరిగినప్పటి నుంచి ఒక ఆన్‌లైన్‌ టీమ్‌ని సెట్ చేశాడు. ఆ టీమ్ పనులు ఏమిటంటే, ప్రతిరోజూ సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడిని తిట్టడం, జగన్ భజన చేయడం. ఏ అవకాశం దొరికినా ఈ రెండు పనులు ఆ టీమ్ తప్పకుండా చేస్తూ వుంటుంది. ఒకవేళ అవకాశం దొరక్కపోయినా సరే అవకాశం దొరకపుచ్చుకుని మరీ చంద్రబాబు మీద నింద, జగన్ భజన చేస్తూ వుంటుంది. పాపం ఆ భజన బృందం జగన్‌కి ఎంత భజన చేసినా ఎలక్షన్లో వర్కవుట్ కాలేదు. సార్ ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. అయినప్పటికీ జగన్ ఆన్‌లైన్ భజన బృందం తన వర్క్‌లో బిజీగా వుంది. ఇప్పుడు జగన్ భజన చేయడానికి దొరికిన ఒక అవకాశాన్ని ఈ బృందం అందిపుచ్చుకుంది. ఆ అవకాశం... ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాలు సాధించి ఘన విజయం సాధించడం. ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాలు సాధించగానే జగన్ భజన బృందం మైండ్స్‌లో ఒక ఫ్లాష్ వెలిగింది. వెంటనే దాన్ని అమల్లో పెట్టేశారు. అదేంటంటే, మొన్నటి ఎన్నికలలో జగన్‌కి 67 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్‌కీ ఢిల్లీలో 67 స్థానాలు వచ్చాయి. ఆయన, ఈయనా ఇద్దరూ గొప్ప నాయకులేనని వాళ్ళు ప్రచారం మొదలెట్టేశారు. అరవింద్ కేజ్రీవాల్ చేతులు కట్టుకుని నిల్చున్న ఫొటోని, జగన్ చేతులు కట్టుకుని నిల్చున్న ఫొటోని పక్కపక్కనే పెట్టి డిజైన్‌ తయారు చేశారు. ఇద్దరూ 67 స్థానాలు గెలిచారని పేర్కొన్నారు. కాకపోతే కేజ్రీవాల్ ఎన్నికలలో గెలిచారట. జగన్ మాత్రం ‘నైతికంగా’ గెలిచాడట. ఈ డిజైన్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనిపిస్తోంది. పాపం జగన్‌కి కేజ్రీవాల్‌తో పోల్చుకుని ఆత్మానందం పొందడం మాత్రమే మిగిలింది.

బీజేపీకి ఢిల్లీ తెలుగు ఓటర్ల చావుదెబ్బ

  ఢిల్లీలో ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టారు. కేంద్రంలో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీని చావుదెబ్బ కొట్టారు. ఒక్క బీజేపీని మాత్రమే కాదు.. కాంగ్రెస్ పార్టీ కూడా అడ్రస్ లేకుండా పోయింది కదా అనే సందేహం రావొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ చచ్చిపోయి, సమాధిలో వున్న పార్టీ. ఆ పార్టీని చావుదెబ్బ కొట్టాల్సిన అవసరం లేదు. ఓటర్లు ఇప్పుడు చావుదెబ్బ కొట్టింది కేవలం భారతీయ జనతా పార్టీనే. ఢిల్లీలోని ఇతర ఓటర్లతోపాటు తెలుగు ఓటర్లు కూడా భారతీయ జనతా పార్టీ మీద తమకున్న కసిని ఈ ఎన్నికలలో తీర్చుకున్నట్టు తెలుస్తోంది. ‘తెలుగువన్’ ఢిల్లీ బ్యూరో అందించిన సమాచారం ప్రకారం, ఢిల్లీలోని తెలుగువారు ఆమ్ ఆద్మీ పార్టీకే ఓటు వేశారు. అటూ ఇటూ ఎటూ చూడకుండా చీపురు గుర్తు మీద ఓటేశారు. ఢిల్లీలో బీజేపీని దెబ్బతీయాలన్న ఉద్యమం సోషల్ మీడియాలో వ్యాపించింది. ఢిల్లీలో నివసించే చాలామంది తెలుగువారు తాము ఈసారి బీజేపీని చావుదెబ్బ తీయడానికే నిర్ణయించుకున్నామని సోషల్ మీడియాలో స్పష్టంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో వున్న తెలుగువారు ఢిల్లీలో నివసించే బంధుమిత్రులకు ఫోన్లు చేసి మరీ బీజేపీకి ఓటు వేయొద్దని చెప్పారంటే ఆంధ్రప్రదేశ్‌లో, తెలుగువారిలో బీజేపీ మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోంది.   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడ్డగోలు విభజనకు గురి కావడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ. బీజేపీ కూడా విభజనకు తనవంతు ఆజ్యం పోసింది. అయితే పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదం పొందిన సమయంలో వెంకయ్య నాయుడు ఒక్కరే ఏదో కాస్తంత కష్టపడ్డారన్న సానుభూతితోపాటు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గౌరవించే తెలుగుదేశం పార్టీతో స్నేహం చేస్తున్నారు కదా అన్న సాఫ్ట్ కార్నర్‌తో ఏపీ ప్రజలు బీజేపీని కొన్ని స్థానాల్లో ఆదరించారు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ మీద తమ మనసులో వున్న కసిని, ప్రతీకారాన్ని తీర్చుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్న విషయాన్ని తమ తీర్పుతో స్పష్టం చేశారు. ఇప్పుడు ఢిల్లీలో బీజేపీని ఓడించే విషయంలో కూడా తెలుగువారు అదే తరహా ప్రతీకారాన్ని ప్రదర్శించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఢిల్లీలోని తెలుగువారు బీజేపీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి గల కారణాలను పరిశీలిస్తే, అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి చేస్తున్న అన్యాయమే కారణమని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలోగానీ, అవసరమైన నిధులు అందించే విషయంలో గానీ, విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందాల్సిన హక్కుల విషయంలోగానీ, నిధులు, నీళ్ళ విషయంలోగానీ కేంద్ర ప్రభుత్వం పట్టీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఈ ఆగ్రహమే ఢిల్లీలో వున్న తెలుగువారికీ సరఫరా అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి ఇప్పుడిప్పుడే వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. ఆ వ్యతిరేకతే ఇప్పుడు ఢిల్లీలో ప్రతిఫలించింది. ఈ నేపథ్యంలో బీజేపీ తనకు జనంలో పెరుగుతున్న వ్యతిరేకతను అర్థం చేసుకోవాల్సిన అవసరం వుంది. ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ తన వ్యవహార శైలిని మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. తెలుగు ప్రజల గుండెలు మండిపోయేలా చేసిన కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పరిస్థితి వచ్చిందో అలాంటి పరిస్థితే బీజేపీకీ రాకుండా వుండేలా బీజేపీ జాగ్రత్తపడాలి. తెలుగువారికి ఇచ్చిన హామీలను నెరవేర్చే బాటలో నడిచి తన పొరపాటును దిద్దుకునే ప్రయత్నం చేయాలి.

బీజేపీ బుద్ధి తెచ్చుకోవాల్సిన ఓటమి....

  ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దేశంలో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీ ఘోరంగా ఓడిపోయింది. మూడు సీట్లతో సరిపెట్టుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ సంగతి సరేసరి.. సర్వనాశనం అయిపోయింది. ఆ పార్టీకి ఏం జరిగి తీరాలో అదే జరిగింది. ‘మోడీ హవా’ అంటూ గెలుపు మీద పూర్తి నమ్మకంతో ఉన్న బీజేపీకి అయితే ఈ ఓటమి బుద్ధి తెచ్చుకోవాల్సిన ఓటమిగా మిగిలిపోయింది. ప్రజలు ఒక్కసారి ఫిక్సయితే ఎవరి మాటా వినరనేదానికి ఉదాహరణగా ఈ ఎన్నికలు నిలిచాయి. ప్రజలు ఎవరికి ఓటు వేయాలో ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత బీజేపీ నాయకులు ఎన్ని సుదీర్ఘ ఉపన్యాసాలు చెప్పినా, ఎదుటి పార్టీలో ఉన్న నాయకులను తమ పార్టీలోకి చేర్చుకున్నా. ఎన్ని రాజకీయ వ్యూహాలు పన్నినా, దేశంలోని రాజకీయ శక్తులను, కార్పొరేట్ శక్తులను ఢిల్లీలోనే కేంద్రీకరించేలా చేసినా ఓటరు మాత్రం తాను అనుకున్నట్టుగానే తీర్పు ఇచ్చాడు. ప్రజలకు దూరమైతే ఫలితాలు ఎలా వుంటాయో బీజేపీకి తెలిసి వచ్చేలా, ఈ ఓటమిని చూసి బీజేపీ బుద్ధి తెచ్చుకునేలా తీర్పు ఇచ్చాడు.   దేశంలో అధికారం చెలాయిస్తున్న పార్టీగా బీజేపీ ఎన్ని రాజకీయ ఎత్తులు, పైఎత్తులు వేసినా, టీవీ ఛానళ్ళను తనవైపు తిప్పుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి సోషల్ మీడియాను తన ప్రచారానికి విజయవంతంగా ఉపయోగించుకుంది. మొన్నటి వరకూ టీవీ ఛానళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేసినప్పటికీ ఆ పార్టీ సోషల్ మీడియానే నమ్ముకుంది. సోషల్ మీడియా ద్వారా తన మీద ఢిల్లీ ప్రజలకు నమ్మకం పెరిగేలా చేసుకోగలిగింది. ఎన్నికల ప్రచారం కోసం పెద్దగా ఖర్చేమీ పెట్టకపోయినా ఢిల్లీ గల్లీ గల్లీలోకి వెళ్ళగలిగింది.   తాను అద్భుతంగా పరిపాలిస్తున్నానని బీజేపీ అనుకోవడం ఇప్పటికైనా మానుకోవాలి. అధికారంలో మునిగి తేలుతూ ప్రజలకు దూరమైతే ప్రజలు ఏ క్షణంలో అయినా తిరగబడతారని గ్రహించాలి. మొన్నటి వరకూ ఢిల్లీలో హాట్ ఫేవరెట్‌గా వున్న బీజేపీ ఇప్పుడు మట్టికరిచి పోవడానికి, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ చరిత్రలో లేనంతటి విజయాన్ని నమోదు చేయడానికి కూడా ఈ తిరుగుబాటే కారణం. ఒక విధంగా చెప్పాలంటే, గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రకంగా ఓటర్లు కాంగ్రెస్ పార్టీని అడ్రస్ లేకుండా చేశారో.. ఇప్పుడు బీజేపీని ఢిల్లీలో అలా చేశారు. అప్పట్లో ఏపీలో చంద్రబాబుకు ఒక మోస్తరుగా మద్దతు చూపిస్తున్న ప్రజలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీద కసితో చంద్రబాబుకు మరింత దగ్గరయ్యారు. మధ్యలో అధికారం కోసం అల్లాడుతున్న జగన్ని కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు ఢిల్లీ ప్రజలు కూడా బీజేపీ విషయంలో అలాంటి ‘కసి’నే ప్రదర్శించారు.   ఢిల్లీ ఫలితాలను చూసి బీజేపీతోపాటు ఇతర రాజకీయ పార్టీలు కూడా బుద్ధి తెచ్చుకోవాల్సిన విషయం ఒకటి స్పష్టమవుతోంది. ప్రజల మనసులకు నచ్చని పనులు చేసిన ఏ పార్టీని ప్రజలు క్షమించరు. గతంలో బ్రహ్మరథం పట్టినవారే క్షణాల్లో మట్టి కరిపిస్తారు. మేం అధికారంలోకి వచ్చాం కాబట్టి మేం ఏమి చేసినా నడుస్తుందని అనుకునే ధోరణిని నాయకులు ఇప్పటికైనా వదులుకోవాలనే గుణపాఠాన్ని ఓటర్లు మరోసారి నేర్పించారు.

ఛీ.. ఇదీ ఒక ప్యాకేజీనా? జనం కామెంట్లు...

అడ్డగోలు విభజన కారణంగా ఆర్థికంగా అనేక ఇబ్బందుల్లో పడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం భారీ స్థాయిలో సహకారాన్ని అందించాల్సి వుంది. విభజన కారణంగా ఆర్థికంగా పాతాళంలోకి పడిపోయిన ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం చెయ్యి అందించి పైకి తీసుకురావలసి వుంది. ఈ మేరకు కేంద్రం నుంచి ఎన్నోసార్లు హామీలు వచ్చాయి. అయితే ఆ హామీలు కార్యరూపంలోకి మాత్రం రావడం లేదు. మొన్నీమధ్య మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 850 కోట్లు ప్యాకేజీ రూపంలో ప్రకటించింది. ఈ ప్యాకేజీని ప్రకటించిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ని తానేదో ఉద్ధరించేస్తున్నట్టు కేంద్రం పోజులు కొట్టింది. అయితే ఎంగిలి చేత్తో కాకిని విసిరినట్టు వున్న ఆ ప్యాకేజీ తెలుగువారి కడుపు మంటను మరింత పెంచేలా వుంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీ బీజేపీతో తనకున్న మిత్రబంధాన్ని దృష్టిలో పెట్టుకుని తన వ్యతిరేకతను బాహాటంగా వ్యక్తం చేయలేదు. అయితే తెలుగు ప్రజలు మాత్రం కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని పోస్టుమార్టం చేస్తున్నారు. కేంద్రానికి చెప్పుదెబ్బలా తగిలే కామెంట్లు పెడుతున్నారు. ఆ కామెంట్లు మీరూ చూడండి... 1. సి.ఎమ్ రిలీఫ్ ఫండ్ కన్నా తక్కువ. 2.  ప్రత్యేక ప్యాకేజీ గురించి ఏడాదిగా పత్రికలలో రాసిన పేపర్ ప్రింట్ ఖర్చు కన్నా తక్కువే. 3. సీఎం  చంద్రబాబు తన గుంపును వెంట వేసుకుని ఢిల్లీ కి వెళ్ళిన ప్రయాణ ఖర్చులు కూడా రాలేదు. 4. దూకుడు , గబ్బర్ సింగ్ , అత్తారింటికి దారేది సినిమా వసూళ్ళ కన్నా తక్కువ. 5. ఏపీ ఎన్జీఓల ఒక్కరోజు జీతం కన్నా తక్కువ. 6. కేసీఆర్ వాస్తు మార్పుల ఖర్చు పెట్టే దానికన్నా తక్కువే. 7. ఈ పేకేజీ మొత్తం, ఒక్క సంవత్సరం మోడీ బట్టల ఖర్చు కు సరిపోతుంది. 8. జగన్ నెల ఓదార్పు యాత్రలో ఖర్చు పెట్టే దానికన్నా తక్కువ. 9. ఇందులో వింతేముంది, మోసపోవడం ఆంధ్ర ప్రజలకు అలవాటే. 10. అహ్మదాబాద్ కు 60 వేల కోట్ల బుల్లెట్ ట్రైన్ , ఆంధ్ర కు 350 కోట్లు. మోడీ నువ్వు దేవుడివి. 11. కాంగ్రెస్ గుడ్డలూడదీసింది ... బిజెపి గోచీ కూడా కొట్టేసింది .. 12. చాలా ఎక్కువ ఇచ్చేశారేమో.. ఒక్కసారి సరిచూసుకోండి. 13. ఆంధ్రకు ప్యాకేజీ అడిగితే తెలంగాణకు ప్యాకేజ్ ఇచ్చారు ఆంధ్రకు ఇవ్వకపోవడమే తెలంగాణకు పెద్ద ప్యాకేజీ. 14. దీనిని తీసుకోవడం కన్నా ఈ సొమ్మునే ఆంధ్ర తరఫున ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్‌కు, రక్షణ శాఖకు ఇచ్చేస్తే మంచిది. 15. ధోనీ, సచిన్ సంపాదన కన్నా తక్కువ. 16. ఆంధ్ర ప్రజలు ఒకరోజు ఉపవాసం చేస్తే దీనికి 10 రెట్లు వస్తుంది. 17. సంక్రాంతికి ఇచ్చిన చంద్రన్న కానుకే బెటర్. 18. ఈ మాత్రం పన్ను రాయితీని వ్యాట్‌లో రాష్ట్రమే ఇవ్వగలదు, ఇక కేంద్రంతో పనేమిటి. 19. ఒక జిల్లా ఎన్నికల ఖర్చు కన్నా చాలా తక్కువ. 20. తెలుగు సినీ పరిశ్రమ జోలె పడితే ఇంతకన్నా ఎక్కువ వస్తుంది. 21. ఆంధ్ర నుండి తెలంగాణ కొట్టేసే నెలసరి కరెంటు కన్నా తక్కువే. 22. ప్యాకేజీ వివరాలు తెలుసుకుని బ్రాహ్మీకి పిచ్చి పట్టింది, సుత్తి వీరభద్ర రావు బట్టలు చింపుకున్నాడు. 23. కేజీ బేసిన్ లో కేంద్రం ఒక్కరోజులో కొట్టేసే దానికన్నా చాలా తక్కువ. ఏ ప్రభుత్వమైనా రాజకీయ పార్టీలతో ఆడుకోగలదు.. కానీ ప్రజలతో కాదు... ప్రజల గొంతు నొక్కడం ఎవరి తరమూ కాదనడానికి ఈ కామెంట్లే ఒక పెద్ద ఉదాహరణ.

ఆమాద్మీ నుండి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నేర్చుకోవలసి ఉందా?

  అన్ని అంచనాలను తారుమారు చేస్తూ ఆమాద్మీ పార్టీ ఏకంగా 66స్థానాలలో ఆధిక్యతలో దూసుకుపోతుంటే, బీజేపీ కేవలం 4 స్థానాలకే పరిమితమయ్యేలా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయితే మరీ దారుణంగా సున్నాకు పడిపోయింది. ఈ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధులకు స్థానం ఉండబోదని సర్వేలు చెప్పిన మాట నిజం చేస్తూ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే స్వతంత్ర అభ్యర్ధి ఆధిక్యత కనబరుస్తున్నారు. అంతిమ ఫలితాలు వెలువడే సమయానికి ఆ అభ్యర్ధి కూడా ఆమాద్మీ పార్టీ ప్రభంజనానికి కనబడకుండా కొట్టుకుపోయినా ఆశ్చర్యం లేదు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పోటీ చేసిన కిరణ్ బేడీ కూడా వెనుకంజలో ఉండటం విశేషం. సాంప్రదాయ పద్దతులలోనే ఎన్నికలను ఎదుర్కోవడానికి అలవాటుపడిన కాంగ్రెస్, బీజేపీలు ఇకనయినా ఈ ఎన్నికల ప్రచారంలో ఆమాద్మీ పార్టీ అనుసరించిన వ్యూహాలను లోతుగా అధ్యయనం చేసి వాటిని తాము కూడా ఇక ముందు రాబోయే ఎన్నికలలో అనుసరించడానికి వీలవుతుందేమో తెలుసుకొంటే మంచిది.

డామిట్! కధ అడ్డం తిరిగింది

  బీహార్ రాష్ట్ర రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలా సాగిపోతున్నాయి. గత ఎన్నికలలో తమ జే.డి.(యు) పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి, ఆ కుర్చీలో తనకు అత్యంత విధేయుడయిన జితన్ రామ్ మంజీని కూర్చోబెట్టి రిమోట్ తో పరిపాలన చేయాలనుకొన్నారు. మొదట్లో జితన్ రామ్ విధేయత చూపినా కుర్చీలో కుదురుకొన్నాక, తనపై పెత్తనం చేస్తున్న నితీష్ కుమార్ ని చూసి చిరాకుపడటం మొదలుపెట్టారు. కానీ ఆయన అంత త్వరగా సెటిల్ అయి తనకే జర్కులిస్తారని ఊహించని నితీష్ కుమార్ మళ్ళీ  ‘నా కుర్చీ నాకిచ్చేయమని’ పేచీ మొదలుపెట్టారు. ఒకసారి ఆ కుర్చీలో కూర్చొంటే మళ్ళీ ఎవరికీ లేవబుద్ధి కాదని ఆయనకీ తెలుసు. ఆయన కూడా ఆ ఇదితోనే కుర్చీ కావాలని పేచీ పెడుతున్నారు. కానీ ఆ కుర్చీబాగా అలవాటయిపోవడంతో జితన్ రామ్ మంజీ చస్తే అందులో నుండి లేవనని బిగదీసుకొని కూర్చొండిపోయారు.   ఇంత ప్రేమగా ‘కుర్చీ ఇచ్చేయమని అడుగుతున్నా జితన్ రామ్ వినకపోవడంతో ఇక లాభం లేదనుకొని నితీష్ కుమార్ అటువైపు నుండి నరుక్కు రావడం మొదలుపెట్టారు. పేరుకి శరద్ యాదవ్ జేడీ (యూ) పార్టీకి అధ్యక్షుడే కానీ ఆయనని, పార్టీని కూడా నడిపేది తనే గాబట్టి యం.యల్యే.లందరినీ సమావేశానికి హాజరయ్యి తనను వారి శాసనసభా పక్ష నేతగా ఎన్నుకోమని నితీష్ కుమార్ హుకుం జారీ చేయడం, వారు వెంటనే ఆయననే ఎన్నేసుకోవడం చకచకా జరిగిపోయాయి.   కానీ జితన్ రామ్ కూడా గురువును మించిన శిష్యుడే. కనుక వెంటనే మంత్రి వర్గాన్ని సమావేశపరిచేసి అందరూ తనకు మద్దతు ఈయకపోతే ప్రభుత్వాన్ని రద్దు చేసి పడేద్దామని ప్రపోస్ చేసారు. కానీ ఏడుగురు తప్ప అందరూ దానిని అప్పోస్ చేయడంతో, హుటాహుటిన డిల్లీ వెళ్లి మోడీని కాంటాక్టు చేసి చూసారు. ఆయన ఏమి హామీ ఇచ్చారో ఏమో గానీ డిల్లీ నుండి తిరిగి వచ్చిన తరువాత జితన్ రామ్ హనుమంతుల వారిలా రెచ్చిపోయారు.   “నితీష్ కుమార్ కి అధికార దాహం బాగా ఎక్కువయిపోయిందని, అందుకే ఎంచక్కా నడుస్తున్నతన ప్రభుత్వాన్ని కూలద్రోసే ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయనకు చట్టం, రాజ్యాంగం వంటివాటి మీద బొత్తిగా నమక్కం గౌరవం లేవంటూ” చీల్చి చెండాడేశారు. ఆయన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయడానికి ఆ మాత్రం చాలదూ? అనుకొంటూ తక్షణమే శరద్ యాదవ్ చేత వేలి ముద్ర వేయించేసి పార్టీ నుండి బయటకి సాగనంపేసారు.   ఆ తరువాత గవర్నరు కేశరీ నాద్ త్రిపాటిని కలిసి ‘నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొనేందుకు రెడీ’ అంటూ నితీష్ కుమార్ తన వెనకే వచ్చిన యం.యల్యేలందరినీ ఆయన ముందు నిలబెట్టారు. కానీ గవర్నరు వెంటనే ‘ఒకే’ అనేయకుండా ‘నాకు కొంచెం టైం కావాలని’ చెప్పేసరికి నితీష్ కుమార్ షాక్ అయిపోయారు.   నితీష్ కుమార్ అలా బయటకు వెళ్ళగానే, ఇంకా ముఖ్యమంత్రి సీటుని అంటిపెట్టుకొనున్న జితన్ రామ్ మంజీ కూడా రయ్యిమని కారేసుకొని గవర్నరు దగ్గరకు వచ్చి, “మావాళ్ళు అందరూ నాకు హ్యాండిచ్చేసినా, తమరు అనుమతిస్తే ఎక్కడ కావాలంటే అక్కడే నేను నా బలం నిరూపించుకోగలనని” బల్లగుద్దిమరీ చెప్పి వచ్చేసారు.   ఇదంతా చూసి నితీష్ కుమార్ చాలా డిస్సప్పాయింట్ అయిపోయారు. ఏదో గాలిలో తేలుతూ వెళ్లి ముఖ్యమంత్రి కుర్చీలో సెటిల్ అయిపోదామనుకొంటే మధ్యలో బీజేపీ అడ్డుపడుతోందని చాలా బాధపడిపోయారు. “బీజేపీకి అధికార దాహం బాగా ఎక్కువయిపోయింది. జితన్ రామ్ మంజీని అడ్డుపెట్టుకొని అధికారం చేప్పట్టాలని అంతగా ఉబలాటం ఉంటే దానికి ఈ డొంక తిరుగుడు అంతా ఎందుకు?” అంటూ తెగ చికాకు పడిపోయారు. “నేను శాసనసభలో పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానని చెపుతుంటే గవర్నరు దొరవారు పట్టించుకోకుండా ఇంకా టైం కావాలంటే దానర్ధం ఏమిటి?” అంటూ ఎక్కడో డిల్లీలో ఉన్న మోడీని, అమిత్ షాకి కూడా వినిపించేలా గద్గద స్వరంతో ప్రశ్నించారు.   ఆయన బాధ చూసి వాళ్ళు కరగలేదు. గానీ బీజేపీ అధికార ప్రతినిధి షా నవాజ్ హుస్సేన్ కొంచెం ఇస్ట్రాంగుగానే రియాక్ట్ అయ్యారు. “నితీష్ కుమార్ కి పదవీ కాంక్ష ఉందనే సంగతి ఎన్డీయే నుండి బయటపడినప్పుడే తెలుసు. కానీ ఉట్టికి ఎగురలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లుగా రాష్ట్రంలో పార్టీని గెలిపించుకోలేక ముఖ్యమంత్రి కుర్చీలో నుండి దిగిపోయిన పెద్దమనిషి ఏవిధంగా ప్రధానమంత్రి అయిపోదామని కలగన్నారో...ఏమో..మళ్ళీ అది తన వల్లకాదని తెలుసుకొని ముఖ్యమంత్రి కుర్చీలో సెటిల్ అయిపోదామని ప్రయత్నిస్తున్నాడు. అసలు న్యాయం, ధర్మం, చట్టం, రాజ్యాంగం వంటి వాటి మీద ఆయన గారికి నమ్మకం ఉంటేగదా?” అంటూ పాత జ్ఞాపకాలన్నిటినీ త్రవ్వి పోశారు.   “గవర్నరు దొరవారు శాసనసభను సమావేశపరిచేందుకు అనుమతిచ్చిన తరువాత మా పార్టీ ఏమి చేయబోతుందో మీకే అర్ధం అవుతుంది” అని ఒక మంచి క్లూ కూడా ఇచ్చేసారు. అది చూసి జితన్ రామ్ మంజీ తెగ సంతోషపడిపోతుంటే, నితీష్ కుమార్ ‘డామిట్ కధ అడ్డం తిరిగింది’ అని తెగ బాధపడిపోతున్నారు.  

రామ్ చరణ్ అంటే మీడియాకు అంత ఇది దేనికో?

  నిప్పు లేనిదే పొగ రాదంటారు. కానీ వస్తుందని రామ్ చరణ్ తేజ్ వాదన. ఆదివారం రాత్రి తన ఇంట్లో స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకొంటూ కొంచెం చిందులు వేస్తే అది గిట్టని పక్కింటాయన పోలీసులకి పిర్యాదు చేసారని మీడియాలో వార్తలు వచ్చేయి. కానీ అవన్నీ ఒట్టి పుకార్లేనని రామ్ చరణ్ తేజ్ కొట్టి పడేశాడు. అసలు అటువంటి వార్తలు ఎలా వచ్చాయో అర్ధం కావడం లేదని బాధపడ్డాడు కూడా. అయితే రాత్రి తన ఇంట్లో స్నేహితులకు డిన్నర్ మాత్రమే ఇచ్చానని అంగీకరించాడు. మందు పార్టీకి...విందు భోజనానికి మధ్య ఉన్న చిన్న డిఫరెన్స్ తెలుసుకోకుండా మీడియా వాళ్ళు ఏదో వ్రాసేసి ఉంటారని సర్ది చెప్పుకొన్నాడు.   ఇదివరకు ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల కారు తన కారుకు అడ్డు వచ్చినప్పుడు కూడా రామ్ చరణ్ తేజ్, పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేస్తే పాపం వారిరువురి ఉద్యోగాలు పోతాయని జాలిపడి, తన తండ్రి చిరంజీవి సెక్యూరిటీ కోసం ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీ గార్డుల చేత వారిరువురినీ నడిరోడ్డు మీద మీడియా సాక్షిగా ఉతికి ఆరేయించాడు. అప్పుడు కూడా ఇలాగే ఆయన అమాయకంగా ఫేస్ పెట్టి తనంటే గిట్టని మీడియా వాళ్లెవరో తన ఫోటోలను కష్టపడి మార్ఫింగ్ చేసి, గాలి కబుర్లు పోగేసి ఏవేవో వ్రాసిపడేసారని నొచ్చుకొన్నాడు. అసలు ఈ మీడియావాళ్లకు రామ్ చరణ్ అంటే అంత ఇది ఎందుకో తెలియదు. కానీ వాళ్ళ రాతల కారణంగా పాపం ఆ పెద్దాయన కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసివస్తోంది. కానీ ఆయనకి శపించే శక్తే తప్ప నిషేధించే శక్తి లేకపోవడంతో మీడియా బ్రతికిపోయింది.   ఆయన ఇన్నేళ్ళుగా సినిమాలలో ఉన్నా, రాజకీయాలలో ఉన్నా ఏనాడూ కూడా ఇలాంటి వివాదాలలోకి వెళ్ళకుండా చాలా పరువుగా బ్రతికేసారు. కానీ ఏమిటో ఈ మీడియా నిప్పు లేకుండానే పొగ పుట్టించేస్తూ పాపం చెర్రీ బాబును తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. మీడియా ఎలాగు మారే అవకాశం లేదు. కనుక అదేదో చెర్రీ బాబే మారిపోతే ఆ పెద్దజీవి కూడా సంతోషిస్తారు కదా!

కేంద్రానికి వర్తించిన సూత్రమే చంద్రబాబుకి కూడా?

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు నిన్న డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ “కేంద్రానికి ఆర్ధిక ఇబ్బందులు ఉండి ఉండవచ్చు. కానీ, ఆ కారణంగా రాష్ట్రానికి నిధులు విడుదల చేయలేమని చెప్పడం భావ్యం కాదు. ఏవిధమయిన ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రానికి తక్షణ సహాయం చేయాలి. మేమేమీ అధనంగా కోరడం లేదు. ఇదివరకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను, విభజన బిల్లులో రాష్ట్రానికి ఇచ్చిన హామీలనే నేరవేర్చమని అడుగుతున్నాము,” అని అన్నారు.   ఆయన కేంద్రం నుండి రాష్ట్రానికి రావలసిన నిధులు రాబట్టడంలో వైఫల్యం చెందారని రాష్ట్రంలో ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. అదీగాక రాష్ట్ర ఆర్దికపరిస్థితులు కూడా నానాటికీ క్షీణిస్తున్నాయి. బహుశః అందుకే ఆయన కేంద్రాన్ని అంత గట్టిగా నిలదీసి ఉండవచ్చును. అందుకు ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ కూడా సానుకూలంగానే స్పందిస్తూ త్వరలోనే రాష్ట్రానికి మరిన్ని నిధులు విడుదల చేస్తామని మీడియా సమక్షంలో హామీ కూడా ఇచ్చారు.   అయితే, కేంద్రం వద్ద నిధులు ఉన్నా లేకున్నా ఇస్తానని హామీ ఇచ్చింది గనుక ఇవ్వవలసిందేనని ఆయన గట్టిగానే అడిగారు. కానీ ఇప్పుడు అదే మాటని పట్టుకొని ఆయన కేంద్రాన్ని ఏవిధంగా నిలదీసి అడిగారో అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్, వైకాపాలు కూడా ఆయన ఎన్నికలలో చేసిన అన్ని హామీలను అమలుచేయమని నిలదీయవచ్చును. తెలంగాణా ఉద్యోగులతో సమానంగా తమకూ 43శాతం వేతన సవరణ చేయాలని కోరుతున్న ఆంధ్రా యన్జీఓ సంఘాలు కూడా అదే మాటను పట్టుకొని ఆయనని నిలదీసినా ఆశ్చర్యం లేదు. ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయగా లేనిదీ తాం ఆయనని నిలదీస్తే తప్పేమిటని ప్రతిపక్ష పార్టీలు, ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తే చంద్రబాబు నాయుడికి ఇబ్బందులు తప్పకపోవచ్చును.

డబ్బులున్నాయా లేవా అనేది కాదు ప్రశ్న

  కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీలో భాగంగా క్రిందటి వారం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 850 కోట్లు నిధులు విడుదల చేసింది. కానీ దాని వలన రెండు రాష్ట్రాల నుండి కూడా విమర్శలు మూటగట్టుకోవలసి వచ్చింది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి అంత భారీగా నిధులు ఇచ్చిన కేంద్రం తెలంగాణా రాష్ట్రానికి మాత్రం చిల్లి గవ్వ విదిలించకుండా మళ్ళీ సవతి తల్లి ప్రేమ చూపించిందని తెలంగాణా ప్రజలు భావిస్తుంటే, ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.16, 000 కోట్ల లోటు బడ్జెట్ ఉంటే కేవలం రూ.500 కోట్లు మాత్రమే విడుదల చేసినందుకు సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అసంతృప్తి వ్యక్తం చేసారు. అదే విషయాన్ని కుండబ్రద్దలు కొట్టినట్లు ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీతో చెప్పారు కూడా.   పార్లమెంటు సాక్షిగా అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ తదితరులు ఇచ్చిన అన్ని హామీలను, విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను కేంద్రం వీలయినంత త్వరగా అమలుచేయాలని ఆయన గట్టిగా కోరారు. కేంద్రానికి ఆర్ధిక సమస్యలుంటే ఉండవచ్చును. అయినా కూడా కేంద్రం తన హామీలను నిలబెట్టుకోవలసిందేనని ఆయన అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు తగ్గిన కారణంగా కేంద్రానికి రూ.45,000 కోట్ల ఆదాయం సమకూరిందని కనుక రాష్ట్రానికి నిధుల మంజూరు విషయంలో వెనకాడటం సరికాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసారు. ఆ కారణంగానే ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ మీడియా ముందుకు వచ్చి రాష్ట్రానికి ఇచ్చిన అన్నిహామీలను అమలుచేస్తామని ప్రకటించారు.   ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు అనేకసార్లు డిల్లీ వెళ్లి ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని, ప్రధాని మోడీని కలిసి నిధుల విడుదల కోసం పదేపదే అభ్యర్ధించారు. కానీ ఏనాడూ కూడా ఇంత కటువుగా మాట్లాడలేదు. కానీ మార్చి 31తో ఆర్ధిక సంవత్సరం ముగిసే సమయంలోగా కేంద్రం నుండి నిధులు రాబట్టుకోలేకపోతే ఆ ప్రభావం రాష్ట్ర బడ్జెట్ పై కూడా తీవ్రంగా ఉంటుంది. అదీగాక ప్రతిపక్షాలు కూడా ఈ అంశాన్ని అందిపుచ్చుకొని ఆయనను ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుండటంతో ఇంత కటువుగా మాట్లాడవలసి వచ్చిందని చెప్పవచ్చును. కానీ గత కాంగ్రెస్ ప్రభుత్వంలా కాకుండా మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలను అమలుచేసేందుకు కట్టుబడి ఉందని, నిధులు ఇస్తామని గట్టిగా హామీ ఇస్తోందని కనుక అప్పుడే తొందరపడి అపోహలు పెంచుకోవడం మంచిది కాదని చంద్రబాబు నాయుడు అన్నారు.

అన్ని హామీలు అమలు చేస్తాం: జైట్లీ

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి తన డిల్లీ పర్యటనలో కేంద్రంతో కొంచెం కటువుగానే మాట్లాడారు. నిన్న డిల్లీలో జరిగిన ‘నీతి ఆయోగ్’ సమావేశానికి హాజరయిన ఆయన, ప్రధాని మోడీని, ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కలిసి రాష్ట్రానికి సహాయం చేయడంలో జరుగుతున్న జాప్యం పట్ల రాష్ట్ర ప్రజలలో నానాటికి పెరుగుతున్న అసంతృప్తి గురించి వారికి వివరించి తక్షణమే రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలని ఆయన కోరారు. ప్రజాభీష్టానికి విరుద్దంగా గత యూపీయే ప్రభుత్వం రాష్ట్ర విభజన చేసినప్పుడు, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండూ కూడా ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాల ఆదుకొంటామని పార్లమెంటులో, విభజన చట్టంలో కూడా పేర్కొన్నాయని, గానీ ఇప్పుడు ఆర్దిక సమస్యలున్నాయని చెపుతూ జాప్యం చేయడం ఎవరికీ మంచిది కాదని ఆయన తెలిపారు. ఈ అంశంపై ప్రజలు, మీడియా, రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఏవిధంగా స్పందిస్తున్నదీ కూడా ఆయన వారికి వివరించారు.   ఆయన ఒత్తిడి కారణంగానే ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ, రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను, విభజన చట్టంలో పెర్కొన్నవీ అన్నిటినీ తమ ప్రభుత్వం తప్పకుండా అమలుచేస్తుందని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఏర్పడి కొన్ని నెలలే అయ్యిందని, కనుక ఒక్కొక్కటిగా రాష్ట్రానికిచ్చిన అన్ని హామీలను అమలుచేస్తామని ఆయన తెలిపారు. ఇటీవల రాష్ట్రానికి మంజూరు చేసిన ఆర్ధిక ప్యాకేజీ కేవలం ఆరంభం మాత్రమేనని మున్ముందు ఇంకా విడుదల చేస్తామని, ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసేలోగానే మరికొంత విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రత్యేకహోదా విషయంలో కూడా తమ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదని స్పష్టం చేసారు.   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి నిధులు తేవడంలో విఫలమయ్యారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ, ప్రజలను ఆకట్టుకొని రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్న కారణంగా ఆయన నేరుగా ఆర్ధికమంత్రి చేతనే ఈవిధంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడింపజేయడం వలన తన ప్రయత్నలోపం ఏమి లేదనే సంగతి స్పష్టం చేయగలిగారు. ఆ విషయం ప్రజలకి కూడా తెలుసు గానీ, రాష్ట్రానికి నిధులు మంజూరులో ఎక్కడ, ఎందుకు జాప్యం జరుగుతోందనే విషయాన్ని ఆయన ఆర్ధిక మంత్రి జైట్లీ ద్వారానే చెప్పించడం ద్వారా ఈ అంశంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు ఆయన జవాబు చెప్పినట్లయింది.

తిరుపతి టీడీపీ గుండెల్లో టీటీడీ రాయి

  ఈనెల 13వ తేదీ తిరుపతి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. తిరుపతి ఎమ్మెల్యేగా వున్న వెంకట రమణ మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుపుతున్నారు. దివంగత ఎమ్మెల్యే భార్య సుగుణమ్మ ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా వున్నారు. ఈ స్థానాన్ని ఏకగ్రీవం చేయాలని టీడీపీ ప్రయత్నించడంతో కాంగ్రెస్, లోక్‌సత్తా, కొంతమంది ఇండిపెండెంట్లు పట్టిన పట్టు విడవకపోవడం వల్ల పోలింగ్ జరపడం అనివార్యమైంది. అయినప్పటికీ ఈ స్థానంలో టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ గెలుపు ఖాయమన్న ధీమాలో మొన్నటి వరకూ స్థానిక టీడీపీ వర్గాలు వున్నాయి. అయితే కొద్ది రోజుల క్రితం జరిగిన పరిణామాలు ఆ వర్గాల గుండెల్లో రాళ్ళు పడేలా చేశాయి.   తిరుపతిలో ఒక మఠానికి చెందిన స్థలంలో అనేకమంది ఎప్పటి నుంచో ఇళ్ళను నిర్మించుకుని వున్నారు. ఆ స్థలం దశాబ్దాల క్రితం టీటీడీకి స్వాధీనం అయింది. ఆ స్థలంలో నిర్మించిన ఇళ్ళను తొలగించాలని టీటీడీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. అయితే రాజకీయ వత్తిడుల కారణంగా అది సాధ్యపడలేదు. అయితే ఆ స్థలంలో ఎప్పటి నుంచో ఇళ్లు కట్టుకుని నివసిస్తున్నారు కాబట్టి చూసీ చూడనట్టు వదిలేస్తే బావుంటుందన్న అభిప్రాయాలు కూడా వున్నాయి. గత పది సంవత్సరాలుగా రెండు మూడుసార్లు ఆ ఇళ్ళను తొలగించాలని ప్రయత్నాలు జరిగాయి. కానీ, వీలు కాలేదు. ఇది ఎప్పటి నుంచో తెగని పంచాయితీలా వుంది. గత ప్రభుత్వాలు కూడా ఈ ఇళ్ళ జోలికి వెళ్ళకపోతేనే మంచిదని భావించాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం హయాంలో ఈ తేనెతుట్టెని మళ్ళీ కదిల్చారు. ఈ ఇళ్ళను ఖాళీ చేసి వెళ్ళిపోవాలని, ఇంతకాలం తమ స్థలంలో ఇళ్ళు నిర్మించుకుని నివసించారు కాబట్టి తమకు అద్దె చెల్లించాలని టీటీడీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. దాంతో స్థానిక తెలుగుదేశం వర్గాలు గతుక్కుమన్నాయి.   దశాబ్దాలుగా ఏ పార్టీ అయినా టచ్ చేయడానికి జంకిన అంశాన్ని ఇప్పుడు టచ్ చేయడం, అది కూడా తిరుపతి ఎన్నికలు జరగబోతున్న సమయంలో నోటీసులు జారీ చేయడం ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఇబ్బందుల్లో నెట్టే అంశమని స్థానిక టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నోటీసుల కారణంగా 15 వేల ఓట్లు ఖాయంగా గల్లంతైనట్టేనని, ఇలా కూల్చివేతల కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్న అభిప్రాయం తిరుపతి నియోజకవర్గ ప్రజల్లో బలంగా కలిగితే దానివల్ల ఎంత నష్టం జరుగుతుందోనని భయపడుతున్నారు. ఈ నోటీసులు జారీ చేసేముందు చంద్రబాబు నాయుడు స్థానిక తెలుగుదేశం నాయకులనుగానీ, కార్యకర్తలను గానీ ఎంతమాత్రం సంప్రదించకుండా అధికారుల మాటల్ని నమ్మడం బాగాలేదని అనుకుంటున్నారు. కనీసం ఆ నోటీసులేవో జారీ చేసేముందు తమను ఒక్క మాట అడిగినా దానివల్ల వచ్చే సమస్యలేమిటో వివరించేవాళ్ళమని, ఇప్పుడు తీరా నోటీసులు జారీ చేశాక తాము ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చేశామని చెబుతున్నారు.   అధికారంలో లేనప్పుడు కార్యకర్తల నాయకుడిగా వుండటం, అధికారం వచ్చిన తర్వాత అధికారులు చెప్పినట్టు వినే ముఖ్యమంత్రిగా మారిపోవడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని తెలుగుదేశం కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తల విషయంలో చంద్రబాబు తీరు ఓడ మల్లన్న... బోడిమల్లన్న తరహాలో వుండటం పట్ల వారు బాధపడుతున్నారు.అధికారుల మాటలు నమ్మి తిరుపతిలో జారీ చేసిన నోటీసుల వల్ల తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే ఆ బాధ తమకే వుంటుంది తప్ప అధికారులకు కాదని వారు అంటున్నారు. ఏది ఏమైనా అధికారుల అత్యుత్సాహం కారణంగా తిరుపతిలో తలెత్తిన పరిస్థితులు పార్టీకి ఇబ్బంది కలిగించకూడదనే వారు కోరుకుంటున్నారు.