క్రియా యోగా.. దీని గొప్పతనం, దీని వెనకున్న గురువుల జీవితం ఇదే..!
క్రియా యోగా.. దీని గొప్పతనం, దీని వెనకున్న గురువుల జీవితం ఇదే..!
గొప్ప దివ్య కాంతితో ప్రకాశించే గురువును మృత్యువు ప్రభావితం చేయదు. మరణ సమయంలో తన శరీరాన్ని పూర్తిగా స్పృహలో వదిలివేస్తాడు. దీనినే మహాసమాధి అంటారు. క్రియా యోగ సంప్రదాయానికి చెందిన ఇద్దరు గురువులు మహాసమాధిలోకి ప్రవేశించారు. వారే.. "ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి" రచయిత శ్రీ శ్రీ పరమహంస యోగానంద, ఈయన గురువు, మరియు "కైవల్య దర్శనం" రచయిత శ్రీ శ్రీ స్వామి శ్రీ యుక్తేశ్వర్ గిరి. వీరిద్దరూ మహాసామాధిలోకి ప్రవేశించి వారి దేహాన్ని త్యాగం చేశారు. అయితే మహాసమాధి చెందే ముందు వారి దేహాలు ఎలాంటి అసౌకర్యానికి గురికాలేదు. స్వామి యోగానంద గారు.. 97 సంవత్సరాల క్రితం "తెలియకుండానే, నేను మీతో నడుస్తాను, నా అదృశ్య చేతులతో మిమ్మల్ని రక్షిస్తాను" అని చెప్పారు. ఈ ఇద్దరు గురువుల జీవితం ఏమిటి? క్రియా యోగా గొప్పతనం ఏమిటి? వీరి మహాసమాధి ఎప్పుడు జరిగింది? తెలుసుకుంటే..
స్వామి పరమహంస యోగానంద..
పరమహంస యోగానంద మొదటిసారిగా 17 సంవత్సరాల వయసులో వారణాసిలో శ్రీ యుక్తేశ్వర్ను కలిశాడు. తన గురువును కనుగొనాలనే బలమైన కోరిక పరమహంస యోగానందలో ఉండేది. వారణాసి వీధుల్లో యోగానంద శ్రీయుక్తేశ్వర్ ను కలిశారు. శ్రీయుక్తేశ్వర్ ఎంతో కఠినంగా ఉన్నా సరే.. పరమహంస యోగానంద ఆయన్ను వదలలేదు, ఆయనతోనే ఉన్నారు.
యుక్తేశ్వర్ చిన్నతనంలోనే యోగానందకు పది సంవత్సరాలు శిక్షణ ఇచ్చి, ప్రపంచ ప్రఖ్యాత గురువుగా తీర్చిదిద్దారు. మహావతార్ బాబాజీ ఇచ్చిన ఆదేశాన్ని శ్రీ యుక్తేశ్వర్ నెరవేర్చారని చెబుతారు. క్రియా యోగాను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేశారు.
యోగానంద మహాసమాధి.. క్రియో యోగా..
పరమహంస యోగానంద మహాసమాధి క్రియా యోగం యొక్క ప్రభావానికి రుజువు. ఆయన మరణించిన 20 రోజుల తర్వాత కూడా ఆయన శరీరం క్షీణించలేదని చెబుతారు. జీవితంలోనే కాదు మరణంలో కూడా యోగా, ధ్యానం ద్వారా సృష్టిలో శక్తులను నియంత్రించవచ్చ పరమహంస యోగానంద మానవాళికి తెలియజేశారు.
క్రియా యోగం అంటే ఏమిటి?
క్రియా యోగం అనేది శ్వాస నియంత్రణ (ప్రాణాయామం), ధ్యానం, అంతర్ముఖ సాధన ఆధారంగా చేసే ఆధ్యాత్మిక పద్దతి.
సరళంగా చెప్పాలంటే..
శ్వాసను నియంత్రించడం, మనస్సును లోపలికి మళ్లించడం, ప్రాణశక్తిని మెదడు, వెన్నుపూసలోని చక్రాల ద్వారా పైకి ఎత్తడం. ఇలా చేస్తూ ఆత్మసాక్షాత్కారం పొందడమే దీని లక్ష్యం.
క్రియా యోగం అనేది మనిషి ఆధ్యాత్మిక పరిణామాన్ని వేగవంతం చేసే అత్యంత శక్తివంతమైన ధ్యాన సాధన అని పరమహంస యోగానంద చెబుతారు. ఒక క్రియా ప్రాణాయామం ఒక సంవత్సర ఆధ్యాత్మిక ప్రగతికి సమానం అని యోగులు నమ్ముతారు.
ఒక యోగి ఆత్మకథ ప్రకారం..
"ఒక యోగి ఆత్మకథ" ప్రకారం క్రియా యోగా సాధన ప్రతి శ్వాసతో రక్తాన్ని డీకార్బోనేట్ చేస్తుంది. మరణ సమయంలో శరీరం వైకల్యం చెందకుండా నిరోధిస్తుంది. ఇది శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన పురాతన శాస్త్రం, తరువాత పతంజలి, ఇతరులు దీనిని నేర్చుకున్నారు. ప్రస్తుతానికి వస్తే.. మహావతార్ బాబాజీ దీనిని లాహిరి మహాశయునికి అందించారు, అతను దానిని స్వామి శ్రీ యుక్తేశ్వర్ గిరికి అందించాడు, స్వామి శ్రీ యుక్తేశ్వర్ గిరి ఈ క్రియా యోగాను స్వామి పరమహంస యోగానందకు అందించారు. అలా.. ఇది గురువు పరంపరగా అందివచ్చింది. క్రియా యోగా సాధాన చేయాలని అనుకునే వారు గురువు సమక్షంలో దీన్ని అభ్యాసం చేయడం మంచిదని చెబుతారు.
*రూపశ్రీ.