Yeluka Vacche Illu Bhadram 41

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy

ఎలుక వచ్చే ఇల్లు భద్రం - 41

ఇలపావులూరి మురళీమోహనరావు

" యమభటులు వందమందిని పురాణాలు ఘోషిస్తున్నాయి. తలా అయిదు రూపాయలైనా దక్షిణ ఇవ్వకపోతే ఆ కోపం మనస్సులో పెట్టుకుని ఏ రాత్రి సమయంలో వచ్చి ఓ కొరడా దెబ్బవేస్తారు. ఆ మేరకు తోలు లేచిపోతుంది " అని చెప్పాడు శాస్త్రిగారు.

" వద్దులెండి. ఇంత చేసి ఐదు రూపాయల దగ్గర కక్కుర్తిపడటం దేనికి అలాగే చేద్దాం " అన్నాడు వెంకట్రావు.

" శుభం...ఇక చిత్రగుప్తుల వారిని కూడా మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయనకిష్టమైనవి మంచి జరీ అంచు పంచెల చావులు, బంగారు జరీ ఉత్తరీయాలు. అవి పట్రండి " అని చెప్పాడు శాస్త్రిగారు.

" అబ్బో...మాములువు సరిపోవా ?" అన్నాడు వెంకట్రావు.

" అమ్మో...ఆయన ఒక కూడిక, తీసివేత తప్పువేసినా మీరు కొన్ని వందల సంవత్సరాలు నరకంలోనే ఉండవలసి వస్తుంది. చిత్రగుప్తు ప్రసన్నం చాలా ముఖ్యం. ఆయన చితా విప్పితే యముడు కూడా నోరెత్తడు " అని చెప్పాడు శాస్త్రిగారు.

" మొత్తానికి కిరాణాషాపు, రైతుబజార్, బట్టల షాపు మా యింట్లోనే పెట్టేస్తున్నారు "

" నరకబాధ అలాంటిది. ఆ బాధలు తప్పించుకోవడానికి తపస్సులు వేల సంవత్సరాలు ఒంటికాలు మీద తపస్సులు చేసేవారని వేదాలు ముఖం మీద కొట్టినట్లు చెబుతున్నాయి "

" ఆ నరక బాధ సంగతి దేవుడెరుగు. ఇదే పెద్ద నరకబాధగా ఉంది. అసలు ఈ తతంగాలు చెయ్యకపోతే ఏమౌతుందట "

" సుందరి నువ్వెళ్ళి కాఫీ పట్రమ్మా " అన్నారుశాస్త్రిగారు.

సుందరి లోపలకి వెళ్ళింది.

" వెంకట్రావు గారు... అమ్మాయి ముందు చెప్పడం బాగుండదని ఊరుకున్నాను. మీరు చేసిన పాపం ఫలం అప్పుడే ఎలా కొట్టిందో అర్థం కాలేదా " నెమ్మదిగా అన్నాడు శాస్త్రిగారు.

" ఏమైంది ?" అన్నాడు వెంకట్రావు.

" నిన్నరాత్రి ఏం జరిగింది ? ఉత్తి పుణ్యానికి పోలీసువారి చేత చావుదెబ్బలు తిన్నారే! మీ తప్పేమిలేకపోయినా పోలీసువాడు డొక్కలు ముక్కలు చేశాడే..నిజానికి వాడు పోలీసువాడు కాదు. పోలీసు రూపంలో వచ్చిన యమభటుడు! మీ పాపం అప్పుడే చిత్రగుప్తుడి చిట్టాలోకి ఎక్కి ఆ పాపఫలం శాంపిల్ చూపించడానికి తన భటుడిని రక్షక భటుడి రూపంలో పంపాడు. శాంతి చేయించాలని మనసులో ఉద్దేశం ఉంది కాబట్టి ఆ సమయంలో మేమంతా వచ్చాం " అన్నారు శాస్త్రిగారు.

అది వినగానే వెంకట్రావు వళ్ళంతా చెమటతో తడిసిపోయింది.

****************

" ఎంతైనాయి సరుకులు ?" అడిగింది సుందరి.

" ఐదువేలయ్యాయి. ఏడుస్తూ ఇచ్చాడు షాపువాడు " చెప్పాడు వెంకట్రావు.

" దేనికి! అన్నీ సరుకులు వాడి దగ్గర కొంటున్నందుకు సంతోషించాలి గానీ " అన్నది సుందరి.

" అప్పుకదా..అందుకు...ఇంతకూ ఈ శాస్త్రిగారు రాలేదేంటి "

" ఫోన్ చెయ్యండి " శాస్త్రిగారికి రింగ్ చేశాడు వెంకట్రావు.

" హలో..శాస్త్రిగారూ ఉన్నారా ?

" లేరండి..గవర్నర్ గారింట్లో వరలక్ష్మీ వ్రతం ఉంది. అక్కడికి వెళ్లారు "

" అరె...ఈరోజు మాయింట్లో శాంతి పూజలు చేయిస్తానన్నారు "

" ఎవరండి మీరు ?"

" నేను వెంకట్రావును "

" మీరా అంకుల్...అయితే తప్పకుండా వస్తారు "

" ఎప్పుడు ?"

" గవర్నర్ గారి బంగాళా నుంచి నేరుగా మీ ఇంటికే వస్తానన్నారు "

" ఎన్నిగంటలకి ?"

" పన్నెండింటికల్లా వస్తారు. ఈ లోపల మీరేమి తినకండి "

" నేను ఆకలికి అసలు ఉండలేను తల్లీ "

" అందరూ అంతే అంకుల్...ఈ లోపల మీరు స్నానం చేసి ఆంటీతో కలిసి విష్ణుసహస్రనామాలు చదువుతుందండి. డాడీకి కొంచం పని తగ్గుతుంది "

" మంచిది తల్లీ...గవర్నర్ గారిల్లేనా...ఇంకా అట్నుంచి వెళ్ళే ఇల్లు ఇంకేమైనా ఉన్నాయా ?"

" లేదంకుల్..ఒకటే "

" మంచిది " అని ఫోన్ పెట్టేశాడు వెంకట్రావు.

సుందరికి విషయం మొత్తం చెప్పాడు.

" ఆ నామాలు నాకు నోరు తిరగవు. నువ్వు చదువుతుండు నేను వింటుంటాను " అన్నాడు వెంకట్రావు.

విష్ణుసహస్రనామాలు చదవటం మొదలు పెట్టింది సుందరి. వెంకట్రావు ''మమ'' అనసాగాడు.

శాస్త్రిగారింట్లో.

" ఏమంటాడమ్మా వాడు ?" అడిగాడు శాస్త్రిగారు.

" నమ్మేశాడు నాన్నా " పకపక నవ్వింది రంగవల్లి.

" నిన్న సమయానికి ఫోన్ చేశావు. లేకపోతే ఇరవైవేలు నష్టపోయేవాళ్ళం " పెద్దగా నవ్వారు శాస్త్రిగారు.

(ఇంకావుంది)

(హాసం సౌజన్యంతో)