సంపూర్ణ గోలాయణం 78
తిన్నగా పృధ్విగారింటికి వెళ్ళాడు. అప్పటికి అయిదు నిముషాల క్రిందటే వచ్చేసింది దీపిక. దీపని చూడగానే అమ్మయ్య అనుకున్నాడు మోహన్. ఇద్దరూ చకచక తయారైపోయారు. కావల్సినవి అన్నీ తీసేసుకున్నాడు మోహన్ "పద వెళ్దాం!” అన్నాడు.
“మీరూ రండి సార్!” అంది దీప.
“నేనొద్దులేమ్మా! మీవాళ్ళెవారూ లేకుండా నేనొస్తే బాగుండదు. అదీకాక నాకు బోలెడంత రాసుకునే పనుంది మీరిద్దరూ వెళ్ళిరండి" అన్నారాయన. ఇద్దరూ జంటగా ఆయనకి నమస్కరించారు "క్యూరీ దంపతుల్లా గొప్పవాళ్ళు అవండి" అని దీవించారు ఆయన. “అంతా మన మంచికే జరుగుతుంది సంతోషంగా ఉండు" అని తన శిష్యురాలికి ధైర్యం చెప్పారు. అప్పటిదాకా మనసులోని దిగులు దూరం అయిపోగా చిన్నగా నవ్వింది దీప ఇద్దరూ ఆటో ఎక్కి ఆలయానికి చేరారు.
మోహన్ మాట్లాడి ఉంచిన పురోహితుడు సిద్దంగా వున్నాడు. వీళ్ళని చూడగానే "రండి బాబూ! ఇంతాలస్యం చేశారేం? నేనింకా మీ పెద్దవాళ్ళకిగానీ తెలిసిపోయిందేమో ఇంట్లోనే పెళ్ళీ గట్రా చేసేశారేమో అని భయపడుతున్నాను" అన్నాడు. అంతటితో వూరుకోక "బొత్తిగా మీరిద్దరేనా? ఫ్రెండ్స్ ఎవరూ రారా?” అడిగాడు మంత్రం ఆపేసి.
“మా ఫ్రెండ్స్ వస్తారు!” మోహన్ మాట పూర్తి కానేలేదు.... చిట్టిబాబు, పద్మని వెంటేసుకుని వచ్చేశాడు. స్నేహితుడి పెళ్ళి కదా అని కొనుక్కున్న కొత్త బట్టలు, చేతుల్లో పూలదండలు ఇతనే పెళ్ళి కొడుకా అనిపించేటట్లు ఉన్నాడు. వీళ్ళని చూడగానే హుషారుగా విజిల్ వేశాడు. “వెరీ గుడ్ అప్పుడే పెళ్ళి మొదలయిందన్న మాట" అంటూ వచ్చి వాళ్ళకి ఎదురుగా కూర్చున్నాడు. అతని కంతహుషారుగా ఉందిగానీ ఆ పెళ్ళి చూస్తే పద్మకి నీరసం వచ్చింది పెళ్ళి కూతురి మీద జాలికూడా వేసింది.
మెల్లిగా వెళ్ళి పెళ్ళికూతురి పక్కనే కూర్చుంది "మీ వాళ్ళు ఎవరూ లేకుండా ఇలా పెళ్ళి చేసుకోవడం బాధగా లేదూ మీకు?” అని అడిగింది.
“ఏం చేస్తాం? పరిస్థితులు అలా వచ్చాయి మరి నాక్కూడా ఇలా పెళ్ళి చేసుకోవడం అంతఇష్టం లేదు. కానీ ప్రొఫెసర్ గారు చెప్పాక కాదనలేకపోయాను" అంది.
“మెల్లిగా. ప్రొఫెసర్ గారా? ఎవరాయన?” చిట్టిబాబూ, పద్మ ఒకేసారి అడిగేశారు. ఉత్సాహంగా చూసింది దీపిక
"ఆయనా? ఆయన ఒక మహానుభావుడు" ఆవేశంగా చెప్తూ పీటమీదనించి లేవపోతూ వుంటే రెక్కపుచ్చుకుని కూర్చోబెట్టేశాడు మోహన్.
“ఆయన గురించి తర్వాత చెప్పుకుందాం ముందు పెళ్ళి చేసుకో" అన్నాడు.
“త్వరగా కానీండి" అని పురోహితుడిని తొందరపెట్టేశాడు.
“అదేం మాట జన్మకి ఓసారి వచ్చే ముచ్చట ఇది. తాపీగానే కానివ్వండి" అన్నాడు చిట్టిబాబు.