సంపూర్ణ గోలాయణం 77
సూర్యంగారు లక్షాధికారి. ఎప్పటి ఫీజు అప్పుడే ఇస్తాడు. బంగారు పిచ్చుకలాంటి పేషెంట్. సత్యంగారు ఇప్పటికే రేపిస్తా ఎల్లుండిస్తా అంటూ బకాయిలు పెట్టి తొమ్మిది వందల అరవై మూడు రూపాయల ఇరవైమూడు పైసల ట్రీట్ మెంట్ చేయించుకున్నాడు. ఫీజుమాట అటుంచి మందుల డబ్బుకూడా సరిగ్గా ఇవ్వడు. ఆయనకి ఏమిటో డబ్బు రావాలిట. రాగానే ఒకేసారి ఇస్తానంటాడు. గట్టిగా అడుగుదాం అంటే బి.పి. పేషెంటు. మళ్ళీ బిపి పెరిగితే చచ్చినట్లు తనే వైద్యం చేయాలి. అటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రాణం జాగ్రత్తగా కాపాడుకోవల్సిన అవసరం ఎంతయినా వుంది తనకి. కాసేపు తర్జన భర్జనపడి, వెళ్ళడానికే నిశ్చయించుకొని మెడిసిన్ చెస్ట్ లో మందులన్నీ సర్దేసుకున్నారు.
తెల్లవారింది దీపిక మోహన్ ల గుండెలు నిముషానికి రెండొందలసార్లు కొట్టుకుంటున్నాయి. సత్యం గారికి సూర్యం గారికి భరించలేనంత టెన్షన్ గా వుంది. శ్యామ్ కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నాడు. ప్రొఫెసర్ గారు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని కూర్చున్నాడు. ఆసనాలు ముగించి లేచారు సూర్యం, మోహన్. కాలం నత్తనడక నడుస్తోంది. అతికష్టం మీద చిన్నముల్లు ఎనిమిది మీదకి చేరింది పెద్ద ముల్లు పన్నెండు మీదకి చేరింది. నీట్ గా తయారై గదిలోంచి బయటికి వచ్చాడు మోహన్.
భారతి నవ్వుతూ ఎదురయింది శుభ శకునం "ఏమిటి బావా విశేషం? పెళ్ళి కొడుకులా తయారై వెళుతున్నావు?” అంది అతన్ని ఎగాదిగాచూస్తూ అదిరిపడ్డాడు మోహన్. భారతిని చూస్తుంటే అతని మనసు కలుక్కుమంది. ఛీ వీళ్ళని ఎలా మోసం చేస్తున్నావో అనిపించింది. కానీ అంతలోనే మనసు లేచి పెళ్ళి చేసుకుని జీవితాంతం బాధపడే కంటే ఇదే మేలు అనిపించింది. చిన్నగా నవ్వేసి మేడ దిగి వచ్చేశాడు.
హల్లోనించి మెట్లెక్కుతున్నారు సూర్యంగారు. తెల్లటి బట్టలు వేసుకుని పెళ్ళి కెడుతున్నట్లు తయారయ్యాడు ఆయన దగ్గరకి వెళ్ళాడు మోహన్. “మామయ్యా మరి నేను వెళ్ళొస్తా జాగ్రత్త" అన్నాడు.
“నీకేం ఫర్వాలేదు వెళ్ళిరా!” భుజం తట్టారు ఆయన.
మెల్లిగా ఇంట్లోంచి బయటపడ్డాడు మోహన్. వెళుతూ వెళుతూ దీప ఇంటిదగ్గర ఒక్కక్షణం ఆగి తొంగి చూశాడు వాకిట్లోనే కుర్చీవేసుకుని కూర్చున్నాడు సత్యంగారు. ఆయన్ని చూడగానే తడబడిపోయాడు మోహన్.కానీ ఆయన మాత్రం కళ్ళజోడులోంచి చూసి ధైర్యం చెప్పుతున్నట్లు నవ్వారు తలొంచుకుని వెళ్ళబోయాడు మోహన్.