సంపూర్ణ గోలాయణం 65
ఈ తమాషా గమనించి అందరూ నవ్వుకుంటూ తప్పుకున్నారు
"భలే పిల్ల. సీమటపాకాయలాంటి పిల్ల. అసలు అందరాడ పిల్లలూ ఇంత ధైర్యంగా వుంటే రౌడీల ఆట కట్టయిపోతుంది. ఈవ్ టీజింగ్ వుండదు" అనుకున్నారు కొంతమంది తమ దారిన వెళ్ళిపోతూ. రాధకు అయ్యో అనిపించింది
"వర్ధనమ్మా అత్తయ్య వస్తుంది స్టేషన్ కి అని చెప్పారు నాన్న. నువ్వొస్తావని నాకేం తెల్సు అయినా అలా ఎగాదిగా చూడక పోతే నేను ఫలానా అని చెప్పొచ్చుగా" అంది నిష్టూరంగా.
“చెప్పేదాకా ఎక్కడ ఆగావు నువ్వు? పలకరించగానే గయ్ గయ్ మని ఆల్సేషన్ డాగ్ లా అరవడం మొదలు పెట్టావు. ఇంకా నేనేం చెప్పేది నా తలకాయ" విసుగ్గా అన్నాడు కృష్ణ.
“మరి అరవక ఏం చెయ్యమంటావు చెప్పు! నేనా ఒంటరిగా వస్తున్నాను ఊరా కొత్త ఊరు. నిన్నూ నీ వాలకాన్ని చూస్తే భయం వేసింది. అయినా ఆ గడ్డం ఏమిటీ? ఏదయినా మొక్కా?” అడిగింది.
ఒళ్ళు మండింది కృష్ణ కి "మరే! ఎవరిచేతా టన్నులు తినకుండా నిన్ను తీసుకుని తిన్నగా కొంపకి చేరితే కొండకి వస్తానని మొక్కుకున్నాను!” అనేసి ముందుకు నడిచాడు.
టాక్సీ మాట్లాడాడు కృష్ణ. సామాన్లు పెట్టించి "ఎక్కు" అన్నాడు.
ఎక్కి కూర్చుంది రాధ. టాక్సీ బయలు దేరింది. “అమ్మయ్య! నువ్వొచ్చావు హాయిగా వుంది. నాన్నగారు ఎంత కంగారుపడ్డారు. ఆడపిల్లని వంటరిగా వాల్తేరు పంపుతున్నాను అని ఆదుర్దాపడ్డాడు" అంది రాధ.
“ఏం ఆదుర్దా అక్కరలేదు, నిన్ను వాల్తేరు కాదు, వాషింగ్ టన్ వంటరిగా పంపినా ఏమీ ఢోకా లేదు" అనుకున్నాడు కృష్ణ.
వాకిట్లో టాక్సీ ఆగగానే మెల్లిగా మంచం మీద నుండి లేచి గుమ్మంలోని వచ్చింది వర్ధనమ్మ. సమానులు పట్టుకుని లోపలికి వస్తున్న కొడుకుని చూసి "రాధ వచ్చిందా?” అని అడిగింది.
“ఆ వచ్చింది. చావు తప్పి కన్ను లొట్టపోయింది అన్నట్లు ఎలాగో తీసుకొచ్చాను" అనేసి ఆ సామానులు అక్కడపడేసి మళ్ళీ బయటికి వెళ్ళాడు. టాక్సీకి డబ్బులిచ్చి పంపించేశాడు.
రాధ లోపలికి వచ్చింది
"వచ్చావుటే తల్లీ! ఇన్నాల్టికి చూశాను, కిందటిసారి చూసినప్పుడు పదేళ్ళ పిల్లవి" అంటూ ఆదరంగా దగ్గరికి తీసుకుంది వర్ధనమ్మ. సత్యం గారూ, దీపికా కూడా ఆప్యాయంగా పలకరించారు. దీపిక కాఫీ ఇచ్చింది. కాఫీ తాగి తను తెచ్చిన సామానులు అన్నీ ఓ పక్కగా సర్దేసింది రాధ.
“బాత్ రూమ్ ఎక్కడుంది? స్నానం చెయ్యాలి" అంది.
“చూపిస్తాను రండి" అంది దీపిక.
“నన్ను అంత గౌరవించనక్కరలేదు దీపికా! రాధా అను, మీరూ, అండీ అనుకుంటూ వుంటే ఏమిటో పరాయి వాళ్ళు మాట్లాడుతున్నట్లు వుంటుంది" అనేసింది రాధ.
స్నానం చేసి వచ్చేసరికి వడ్డన ప్రయత్నం చేసుంది ఓపిక లేకపోయినా వర్ధనమ్మ, ఆవిడకి సాయం దీపిక, అది చూసి కంగారుపడి పోయింది రాధ. “అదేమిటి అత్తయ్యా! నువ్వు చేస్తున్నావేం? నేనొస్తానాగు" అంటూ వారించింది.
వద్దు వద్దు అంటున్నా వినకుండా ఆవిడని బలవంతాన ఓ పక్కన కూర్చోబెట్టి దీపికని కూడా వారించి కొంగు దోపుకుని పన్లో దిగిపోయింది. చకచక వడ్డించి తను వస్తూ తెచ్చిన నెయ్యి బయటకు తీసింది. సత్యంగారు, కృష్ణ భోజనాలకి కూర్చున్నారు.
“నాన్న ఎలా వున్నాడమ్మా? ఆరోగ్యంగా వుంటున్నాడా?” భోంచేస్తూ అడిగారు సత్యంగారు.
“బాగానే వున్నారు మామయ్య. ఈ మధ్య ఆ పెళ్ళి ఆగిపోవడంతో బాగా కృంగిపోయారు"
“అసలు అతను ఎలా పోయాడమ్మా?”
“ఏమిటో మరి అదేదో జ్వరం వచ్చిందట అప్పటికి గుంటూరు హాస్పిటల్ కి తీసుకెళ్ళారట. కానీ ఫలితం దక్కలేదు" అంది రాధ.
“ప్చ్ ఏమిటో పాపం!” సానుభూతిగా అన్నాడు సత్యంగారు.
“చచ్చిపోయాడేమో బ్రతికిపోయాడు. స్వర్గంలోనయినా సుఖంగా వుంటాడు మానవుడు" కసిగా అనుకున్నాడు కృష్ణ.