సంపూర్ణ గోలాయణం 63
ఆవిడ పైకి అనకపోయినా ఆ విషయం కనిపెట్టాడు సత్యంగారు. నిర్లిప్తంగా చిరాగ్గా ఉంటున్న భార్యని చూస్తే జాలి వేసింది ఆయనకి. పోన్లే అదేమైనా కోరరాని కోరిక కోరిందా? ఏదో అన్నగారు కష్టాల్లో ఉంటే ఆదుకోవాలని ఆశపడింది!
అనుకున్నాడు. అనుకున్నాక యిక ఆలస్యం చెయ్యకుండా తన బావమరిదికి ఉత్తరం రాసేశాడు. జరిగిన దానికి బాధపడ్డాననీ, ఏ సంకోచమూ లేకుండా రాధను తమ దగ్గరికి పంపమని రాశారు. కొన్నాళ్ళ పాటు యిక్కడే వుండి వూరు చూసి వస్తుంది అని గట్టిగా రాశాడు.
“ఇదిగో మీ అన్నయ్యకి ఉత్తరం రాశాను" అంటూ భార్యకి చూపించారు. అన్యమనస్కంగా చూసిన వర్ధనమ్మ ఎంతో సంతోషించి ఆవిడే కాదు ఆ ఉత్తరం అందుకున్న ఆవిడ అన్నగారు కూడా ఎంతో సంతోషించారు. ఫలానా రోజుకి గోదావరిలో రిజర్వేషన్ చేయించా ఏ మాత్రం వీలున్నా తనూ బయలు దేరతాననీ, లేకపోతే బెజవాడకి బండి ఎక్కిస్తాననీ రాశాడు. తనొచ్చినా, రాకపోయినా స్టేషన్ కి తప్పకుండ ఎవరినైనా రమ్మనమని రాశాడు.
ఆ ఉత్తరం అందుకుని ఎంతో సంబరపడిపోయింది వర్ధనమ్మ, తల్లి లేని పిల్ల కడుపులో పెట్టుకుని చూసుకోవాలి అనుకుంది. తీరా ఆ అమ్మాయి వచ్చే రోజుకి రెండ్రోజుల ముందు నుంచే జ్వరం వచ్చి పడక వేసింది. స్టేషన్ కి ఎవరు వెళతారు? సత్యంగారు లాభంలేదు. దీపిక వల్లకాదు, అందుకే చివరి ప్రయత్నంగా కొడుకుతో చెప్పింది. “సరే తీసుకొస్తాలే, ఆ అమ్మాయినెలా గుర్తుపట్టడం? నీ దగ్గర ఆవిడ ఫోటో ఉందా?” అని అడిగాడు కృష్ణ.
“నా తలకాయ... దాని ఫోటో నా దగ్గరెక్కడుంటుందిరా?” అంది ఆవిడ.
చిరాగ్గా చూశాడు కృష్ణ "నాకిందుకేనమ్మా మిమ్మల్ని చూస్తే ఒళ్ళు మండేది. ఏ పని చేసినా ఇంతే. ఓ ప్లానూ లేదు పాడూ లేదు. ప్లాన్ వేసుకుని దాని ప్రకారం నడవండ్రా అని మొత్తుకుంటాను. వింటారా? ఇప్పుడు చూడు అసలా వేళ ఉత్తరం రాసేటప్పుడు ఆవిడ ఫోటో ఒకటి పంపించమని రాస్తే బాగుండేది. లేదు వాళ్ళలా వస్తున్నారని తెలియగానే మన ఇంటి గుర్తులు తేలియజేస్తూ రాయాల్సింది అదీ లేదు, ఇదీ లేదు.రేపొద్దున్న నేను వెళ్ళి వాళ్ళని ఎలా వెతుక్కోను?” అన్నాడు విసుగ్గా.
వర్ధనమ్మకి విసుగేసింది "రైలు దిగినవాళ్ళని కనుక్కోడం బ్రహ్మవిద్యట్రా? అసలు నా ఒంట్లో బాగుంటే నేనే వెళ్ళేదాన్ని, జ్వరం రాబట్టి నిన్ను బ్రతిమాలాడాల్సి వచ్చింది" అని విసుక్కుంది.
“సరే ఏదో తంటాలు పడతాను. తప్పుతుందా!” అనేసి విసురుగా వెళ్ళిపోయాడు. చెప్పినట్టే మర్నాడు స్టేషన్ కి వెళ్ళాడు. అనుకున్న టైం కి గంట లేటుగా గోదావరి వచ్చేసింది. చీమల పుట్టలోంచి వచ్చే చీమల్లా వున్న జనాన్ని చూసి విసుక్కున్నాడు కృష్ణ, ఇప్పుడీ జనంలో వాళ్ళని ఎలా పట్టుకోవడం అనుకున్నాడు. మరోసారి తన వాళ్ళని తిట్టుకున్నాడు. ఓ పక్కగా నిలబడ్డాడు. పది నిముషాల్లో రష్ తగ్గింది. రైలు పక్కనే నడుస్తూ రిజర్వేషన్ కంపార్టుమెంట్ ల దగ్గర వెతకడం మొదలుపెట్టాడు.