టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

ముంబై: ప్రపంచకప్ టైటిల్ భారత్, శ్రీలంక సిద్ధమయ్యాయి. శనివారమిక్కడ జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో ఇరు జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన లంక కెప్టెన్ సంగక్కర మరో ఆలోచన లేకుండా ప్రత్యర్థికి ఫీల్డింగ్ అప్పగించాడు. ఇరు జట్ల కెప్టెన్లు తడబడటంతో టాస్ రెండు సార్లు వేయాల్సి వచ్చింది. మొదటిసారి వేసిన తర్వాత టాస్ తమదంటే తమదని ఇరువురు అన్నారు. దీంతో మరోసారి టాస్ వేయాల్సివచ్చింది. భారత జట్టులో ఆశిష్ నెహ్రా స్థానంలో శ్రీశాంత్‌ను తీసుకున్నారు. శ్రీలంక టీమ్ నాలుగు మార్పులతో బరిలోకి దిగుతోంది. మాథ్యూస్, మెండిస్, హెరాత్, చమరసిల్వాల స్థానంలో రణదిన్, ఫెరీరా, కులశేఖర, కపుదెగర వచ్చారు.

మధుర క్షణాల కోసం ఎదురుచూపులు

ముంబై: భారత్-శ్రీలంకల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో శనివారం జరుగనున్న ఫైనల్ పోరులో టీమిండియానే కప్ గెలుస్తుందని నూట ఇరవై కోట్ల మంది క్రికెట్ అభిమానులు, ప్రజలు ఆకాంక్షిస్తున్న నేపథ్యంలో, మహేంద్ర సింగ్ ధోనీ సేన ప్రపంచకప్ నెగ్గితే శ్రీకాళహస్తికి జట్టును తీసుకొస్తానని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ ఛైర్మన్ శ్రీకాంత్ తెలిపారు. కోట్లాది ప్రజల ఆకాంక్ష నెరవేరితే తప్పకుండా మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని టీమిండియాను శ్రీకాళహస్తికి తీసుకొస్తానని శ్రీకాంత్ మొక్కుకున్నారు. అలాగే బౌలింగ్, బ్యాటింగ్‌లో పటిష్టంగా బరిలోకి దిగుతున్న శ్రీలంకతో భారత్‌కు గట్టిపోటీ తప్పదని 1983లో భారత్‌కు ప్రపంచకప్ సాధించిపెట్టిన అప్పటి టీమిండియా సారథి కపిల్ దేవ్ జోస్యం చెప్పాడు. కానీ ఏది ఏమైనా ఇండియానే గెలుస్తుంది. పాకిస్థాన్‌పై గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియా తప్పక ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంటుందని నమ్మకం వ్యక్తం చేశాడు. మరోవైపు 1983 క్యాలెండర్ 2011 క్యాలెండర్ ఒకేవిధంగా ఉండటంతో భారత్ కప్ గెలుస్తుందని అబిమానులు అనుకుంటున్నారు. శ్రీలంక మ్యాచ్‌లో సచిన్, సెహ్వాగ్‌లు చెలరేగి ఆడుతారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ మ్యాచ్‌ను ప్రముఖులు, సినీతారలు వీక్షించనున్నారు. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్సే ఈ మ్యాచ్‌ను వీక్షించనున్నారు. ఇకపోతే.. ఫైనల్ పోరులో భారత్‌ను మట్టికరిపించాలని శ్రీలంక వ్యూహం రచిస్తోంది. సచిన్, సెహ్వాగ్ బ్యాటింగ్ జోరుకు బ్రేక్ వేయాలని శ్రీలంక కోచ్ ఆటగాళ్లకు సూచించారు. ఇంకా శ్రీలంక మిడిలార్డర్ ఆందోళనకరంగా ఉందని మాజీ కెప్టెన్ రణతుంగ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కెనడాతో మ్యాచ్ నుంచి జయవర్ధనే సరిగ్గా ఆడలేకపోతున్నాడని రణతుంగ తెలిపాడు. ఇక వాఖండే స్టేడియం తొలుత బ్యాటింగ్ చేసే వారిదే విజయమని క్రీడా విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ కీలకమని, మొదట బ్యాటింగ్ పిచ్‌కు అనుకూలిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఫైనల్ పోరుకు తీవ్రవాద ముప్పు పొంచి ఉందని నిఘా సంస్థలు హెచ్చరించడంతో స్టేడియం ప్రాంగణంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. స్టేడియంలో ఐదువేల మంది పోలీసు బలగాలను మోహరించారు. కాగా, వరల్డ్‌కప్‌ను నెగ్గితే భారత క్రికెటర్లకు మరో బంపర్ ఆఫర్. కప్ సాధిస్తే టీమిండియా ఆటగాళ్లకు ఒక్కో కారు చొప్పున ఇచ్చేస్తామంటూ హుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) శుక్రవారం ప్రకటించేసింది. టోర్నీ కార్ల భాగస్వామి అయిన హెచ్ఎంఐఎల్ క్రికెటర్లకు వెర్నా వర్షన్ కార్లను అందజేయనున్నట్లు ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హాంగ్ వూ పార్క్ తెలిపారు. ఇదిలా ఉండగా, ప్రపంచకప్‌కు ఇంకొక్క అడుగు దూరమే ఉన్న నేపథ్యంలో సామాన్యుల నుంచి దేశాధినేతల వరకూ క్రికెట్ మంత్రమే జపిస్తున్నారంటే అతిశయోక్తి లేదు. క్షణం తీరిక లేకుండా ఉండే ప్రధాని మన్మోహన్ సింగ్, యుపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీలు ఫైనల్లో ధోనీసేన విజయాన్ని కాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. మొహాలీలో పాక్‌ను ఓడించిన టీమిండియా... ఫైనల్స్‌లో శ్రీలంకను కూడా చిత్తుచేయాలని ఆకాంక్షించారు. జాతి యావత్తూ మధుర క్షణాల కోసం ఉద్విగ్నంగా ఎదురు చూస్తుందని మన్మోహన్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా భారత సైన్యానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక అస్సాం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఉన్న సోనియా గాంధీ కూడా సెమీస్‌లో పాక్‌ను చిత్తుచేసిన ధోనీసేన ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించాలని అన్నారు.

ధోనీకి అనుకూలిస్తున్న గ్రహాలు

ముంబై: ప్రపంచ కప్ పోటీల పైనల్ మ్యాచుకు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. దీనివల్ల భారత్ ఫైనల్ మ్యాచులో శ్రీలంకపై విజయం సాధిస్తుందని చెబుతున్నారు. 1983లో కపిల్ దేవ్‌కు అనుకూలించిన గ్రహగతులే ప్రస్తుతం ధోనీకి విజయం చేకూర్చే విధంగా ఉన్నాయని చెబుతున్నారు. కపిల్ దేవ్ సేన ప్రపంచ కప్ టైటిల్ గెలిచింది శనివారంనాడేనని, ఇప్పుడు కూడా పైనల్ శనివారమే జరుగుతోందని, ఇది కూడా ధోనీ సేనకు అనుకూలిస్తుందని చెబుతున్నారు. శని భారత్‌కు అనుకూలంగా ఉన్నాడని వారంటున్నారు. గురుడు కూడా భారత్‌కు అనుకూలంగా ఉన్నాడని చెబుతున్నారు. అయితే, ఆటలపై ప్రభావం చూపే కుజుడు మాత్రం కాస్తా ఆటంకంగా ఉన్నాడని, హోమాలూ పూజల వల్ల కుజుడి ప్రభావం తగ్గుతుందని అంటున్నారు. ప్రస్తుత గ్రహగతులు తప్పకుండా ధోనీకి సహకరిస్తాయని చెబుతున్నారు. శనికి గురువు అయిన ధనిష్ట నక్షత్రంలో ఈ మ్యాచు జరుగుతోందని, కేతువూ శని మిత్రులని, ధోనీ నక్షత్రం ఇందుకు అనుకూలంగా ఉందని చెబుతున్నారు. పైగా గ్రహాలు శ్రీలంక కెప్టెన్ సంగక్కరకు అనుకూలంగా లేవని చెబుతున్నారు.

మా విజయం ముంబై బాధితులకు అంకితం

ముంబై: నవంబర్ 26వ తేదీ ముంబై దాడుల్లో సంభవించిన మరణాలు భారత బ్యాట్స్‌మెన్ గౌతం గంభీర్‌ మదిలో ఇంకా కలత సృష్టిస్తున్నట్లే ఉన్నాయి. శ్రీలంకపై ముంబైలో ఫైనల్ మ్యాచులో ఆడడానికి సిద్ధపడిన గౌతం గంభీర్ భారత్ విజయం సాధిస్తుందనే విశ్వాసంతో ఉన్నాడు. ముంబై దాడుల్లో మరణించినవారికి తమ విజయాన్ని అంకితం ఇవ్వాలనేది తన అభిప్రాయమని అతను అన్నాడు. ప్రపంచ కప్ ఫైనల్లో, అదీ ముంబైలో విజయం సాధించినప్పుడు దాన్ని ముంబై బాధితులకు అంకితం ఇవ్వడమే సముచితమని అతను అభిప్రాయపడ్డాడు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను తన అభిప్రాయాలను వెల్లడించాడు. పాకిస్తాన్‌పై ఏ రోజు కూడా ఓడిపోకూడదని తాను టాటూను పొడిపించుకున్నట్లు అతను చెప్పాడు. శ్రీలంక జట్టులో ప్రపంచ ఖ్యాతి సాధించిన సిన్నర్లు ఉన్నారని, వారిని తానొక్కడినే కాదు అందరూ దీటుగా ఎదుర్కుంటారని అతను అన్నాడు.

ఉప ఎన్నికల తర్వాత రాజీనామాలు?

హైదరాబాద్: కడప పార్లమెంటు సీటుకు, పులివెందుల శాసనసభా స్థానానికి ఉప ఎన్నికలు ముగిసిన తర్వాతనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు రాజీనామాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికలకు ముందే రాజీనామాలు చేయాలని కొంత మంది శాసనసభ్యులు అభిప్రాయపడుతున్నారు. అయితే, వారిని వైయస్ జగన్ ఆపుతున్నట్లు సమాచారం. ఉప ఎన్నికల తర్వాత పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటాయని, ఆ సమయంలో మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే దాని ప్రభావం తమకు అనుకూలంగా ఉంటుందని వైయస్ జగన్ చెబుతున్నట్లు సమాచారం. వైయస్ జగన్ వెంట దాదాపు 23 మంది కాంగ్రెసు శాసనసభ్యులు, ఇద్దరేసి ప్రజారాజ్యం, తెలుగుదేశం శాసనసభ్యులు ఉన్నట్లు భావిస్తున్నారు. ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత దాదాపు 27 మంది శాసనసభ్యులు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరుగుతాయని జగన్ వారికి చెబుతున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల తర్వాత మరింత మంది తెలుగుదేశం, కాంగ్రెసు శాసనసభ్యులు తన వైపు రావచ్చుననేది జగన్ అంచనాగా చెబుతున్నారు. కాగా, జగన్ వర్గానికి చెందిన తమ పార్టీ శాసనసభ్యులపై ఉప ఎన్నికలకు ముందే చర్యలు తీసుకోవాలని కడప జిల్లా కాంగ్రెసు నాయకులు పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. కాంగ్రెసు శాసనసభ్యులుగా కొనసాగుతూ బహిరంగంగా వారు మద్దతు ప్రకటిస్తున్నారని, ఉప ఎన్నికల ఇంచార్జీలుగా పనిచేస్తున్నారని, దాని వల్ల తాము కాంగ్రెసు తరఫున ఎన్నికల ప్రచారం చేయడానికి ఇబ్బందులు ఏర్పడతాయని వారు వాదిస్తున్నారు. ఒక వేళ ఆ ఒత్తిడికి తలొగ్గి కాంగ్రెసు నాయకత్వం చర్యలకు ఉపక్రమించినా, పూర్తిగా తొలగించడానికి నెలకు పైగానే సమయం పడుతుందని జగన్ తన వర్గానికి చెందిన శాసనసభ్యులకు చెబుతున్నట్లు సమాచారం. అందువల్ల ఉప ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాలని ఆయన వారికి సూచిస్తున్నట్లు తెలుస్తోంది.

నిలకడగా బాబా ఆరోగ్యం

పుట్టపర్తి:  సత్య సాయిబాబా ఆరోగ్యం మెరుగ్గానే ఉందని సత్య సాయిబాబా ట్రస్టు శనివారం స్పష్టం చేసింది. సత్య సాయి బాబా ఆరోగ్యం క్షీణించిందని వస్తున్న వదంతులను నమ్మొద్దని ట్రస్ట్ పేర్కొంది. బాబా ఆరోగ్యాన్ని పరీక్షించిన వైద్యులు ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని నిర్ధారించారని, సత్యసాయి వైద్యులతో మాట్లాడుతున్నారని సత్య సాయి ట్రస్టు తెలిపింది. బాబా ఆరోగ్య పరిస్థితిపై మధ్యాహ్నాం ఒంటిగంటకు వైద్యులు బులిటెన్ విడుదల చేయనున్నారు. సత్యసాయి ఆరోగ్యంపై వస్తున్న వదంతులు నమ్మవద్దని వైద్యులు తెలిపారు. ఉగాది రోజున ఆయన్ని డిశ్చార్జ్  చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ వదంతుల నేపథ్యంలో పుట్టపర్తికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు.

సిఎం వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాద్: చిత్తూరులో జరిగిన చిత్తూరు శతాబ్ది ఉత్సవాలలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ విభేదాలు ప్రస్తావించారు. ముఖ్యమంత్రి స్థాయిని మరచి మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చేసేవారి జిల్లాల్లో నీరు పుష్కలంగా ఉందన్నారు. తెలంగాణతో పోలిస్తే రాయలసీమ బాగా వెనుకబడి ఉందన్నారు. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 8 నుంచి 10 లక్షల ఎకరాలకు నీరందుతోందని చెప్పారు. చిత్తూరు జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉందని ఆయన తెలిపారు. చిత్తూరు జిల్లాలలో కాల్వల ద్వారా 40 వేల ఎకరాలకు మాత్రమే నీరు అందుతోందని చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి రాయలసీమకు కోట్ల రూపాయలు గుమ్మరించారన్న దురభిప్రాయం ఉందన్నారు.

ప్రపంచకప్‌ ఎవరిదో?

ముంబయి : ప్రపంచకప్‌ అంతిమ ఘట్టానికి చేరింది. భారత్, శ్రీలంక జట్టు తుదిపోరుకు సిద్ధం అయ్యాయి. వాంఖడే స్టేడియం వేదికగా టైటిల్ పోరుకు బరిలోకి దిగనున్నాయి. శనివారం మధ్యాహ్నాం  జరగనున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ తొలిసారి పూర్తిగా ఆసియా జట్ల మధ్యే జరుగుతోంది.  భారత్‌ కప్పు గెలుచుకోవాలని, మువ్వన్నెల పతాకను సమున్నతంగా ఎగరేయాలని యావత్తు దేశం ఆకాంక్షిస్త్తోంది. ధోనీ సేన గెలుపు కోసం ఇండియా అంతటా ఒకటే ఎదురు చూపు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో భారత్, శ్రీలంక జట్లకు ఇది మూడో ఫైనల్. మొదటి ఫైనల్లో విజేతగా నిల్చిన భారత్ తర్వాతి ఫైనల్లో ఓటమిపాలైంది. లంకదీ సరిగ్గా అదే పరిస్థితి. ఫైనల్ చేరిన తొలిసారి జగజ్జేతగా నిలిచి, రెండో ప్రయత్నంలో విఫలమైంది. ముచ్చటగా మూడోసారి తుదిపోరుకు అర్హత పొందిన ఈ రెండు జట్లలో అంతిమవిజేత ఎవరో కొన్ని గంటల్లో తేలిపోతుంది.  ఈ మ్యాచ్‌ను గెలుచుకుని మురళికి అంకితమివ్వాలని శ్రీలంక జట్టు ఉబలాటపడుతోంది. భారత క్రీడాభిమానులు సచిన్‌ వందో సెంచరీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీలంక జట్టుకు మురళి ఏ విధంగా కొండంత అండగా ఉంటున్నాడో, భారత జట్టుకు సచిన్‌ కూడా అంతే! పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ మాదిరిగా ఈ మ్యాచ్‌ కూడా అత్యంత ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇరు జట్లు కప్‌ గెలుచుకోగల సత్తా ఉన్నవే. ఇంతకుముందు ఒక్కొక్కసారి టైటిల్‌ విజేతగా నిలిచినవే. ఇరు జట్లలోనూ అద్భుతమైన క్రీడాకారులున్నారు. అయితే బౌలింగ్‌లో మాత్రం శ్రీలంక కొంత పైచేయిగా కనిపిస్తోంది. ముత్తయ్య మురళీధరన్‌, మలింగ, పెరీరా, కులశేఖర, అజంతా మెండిస్‌ వంటి ఉద్దండులైన బౌలర్లున్నారు. భారత జట్టు ప్రధానంగా జహీర్‌ ఖాన్‌,యువరాజ్‌పై ఆధారపడుతోంది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్లందరూ సమిష్టిగా రాణించారు. శ్రీలంక బ్యాటింగ్‌ కూడా అత్యంత పటిష్టంగా ఉంది. ఉపుల్‌ తరంగ, తిలక రత్నే దిల్షన్‌ అద్భుతమైన ఆరంభాన్ని అందిస్తున్నారు. వారిలో ఒకరు విఫల మైనా సంగక్కర వన్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. మహేలా జయవర్ధనే కూడా రెండు మ్యాచ్‌ల్లో రాణించాడు. ఆంజెలో మాథ్యూస్‌ ఫిట్‌నెస్‌తో లేనందున రణదీవేను జట్టులోకి తీసుకుంటున్నట్లు శ్రీలంక జట్టు అధికారికంగా ప్రకటించింది. ముత్తయ్య మురళీధరన్‌ ఆడటం అనుమానమేనని గురువారం వార్తలొచ్చాయి. అతడు కండరాల నొప్పి నుండి కోలుకున్నట్లు కనిపిస్తోంది. శుక్రవారం నెట్‌ప్రాక్టీస్‌ చేశాడు. భారత జట్టులో ఆశిష్‌ నెహ్రా స్థానంలో శ్రీశాంత్‌ చేరే అవకాశాలున్నాయి. ఈ టోర్నమెంట్‌లో శ్రీశాంత్‌ బంగ్లాదేశ్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఆడాడు. మళ్లీ చివరి మ్యాచ్‌లో ఆడే అవకాశం లభించనుంది. ప్రపంచ కప్ పోటీల్లో భారత్ ఇప్పటి వరకు ఇన్నింగ్సుకు 274 పరుగుల సగటున 2194 పరగులు చేసింది. శ్రీలంక ఇన్నింగ్సుకు 242 పరగుల సగటున 1933 పరగులు చేసింది. అయితే, భారత్ 58 వికెట్లు కోల్పోగా, శ్రీలంక 40 వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఈ విషయంలో శ్రీలంకదే పైచేయిగా ఉంది. లోయర్ ఆర్డర్ మాత్రం శ్రీలంక కన్నా భారత్ మెరుగ్గా ఆడినట్లు కనిపిస్తోంది. భారత లోయర్ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్ 304 పరగులు చేయగా, శ్రీలంక బ్యాట్స్‌మెన్ 172 పరుగులు చేశారు. మొత్తంగా చూస్తే, భారత్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. వాంఖడే స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. స్టేడియం చుట్టూ అయిదువేల మంది పోలీసులు మోహరించారు. ముంబయి మొత్తం భద్రతా వలయంలో ఉంది.

జగన్‌ను జనం తిరస్కరిస్తారు: వీహెచ్

న్యూఢిల్లీ: కడప లోక్‌సభ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్‌ను ప్రజలు తిరస్కరిస్తారని రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. తనపై సోనియా కక్ష సాధిస్తున్నారంటూ జగన్ రాసిన బహిరంగ లేఖలో వాస్తవం లేదని, కక్ష సాధించే సంప్రదాయం ఆమెకు లేదని తెలిపారు. ఇందిరాగాంధీపై పోటీ చేసిన వ్యక్తినే ఆమె సీఎంను చేసిందన్నారు. పనిగట్టుకుని సోనియా, రాహుల్, అల్లుడు రాబర్ట్ వథేరాపై తన పత్రికలో, చానల్‌లో తప్పుడు వార్తలు ప్రసారం చేయించింది జగనేనని, కాంగ్రెస్‌ను ఫినిష్ చేస్తానని ఆయనే అన్నారని వీహెచ్ చెప్పారు. ఇలాంటి వ్యక్తిని, ఆయన మీడియాను ప్రజలు తిరస్కరిస్తారని అభిప్రాయపడ్డారు. దివంగత నేత వైఎస్ జీవించినంత కాలం సోనియాకు విధేయునిగా ఉన్నారని, కానీ జగన్ తన తండ్రికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని, అప్పనంగా వచ్చిన వేల కోట్లు వృధా చేస్తున్నారన్నారు.

టీడీపీకే మా మద్దతు

హైదరాబాద్:  కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభ ఎన్నికలలో తమ పార్టీ తెలుగుదేశం పార్టీకే మద్దతు ఇస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ శుక్రవారం అన్నారు. సిపిఎం, సిపిఐ, తెలుగుదేశం పార్టీ పొత్తులలో ఎలాంటి మార్పు లేదని ఆయన అన్నారు. తాము టిడిపికే మద్దతు ఇస్తామని చెప్పారు. కాగా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడంపై ఆయన మండిపడ్డారు. విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, నిరసనలు చేపడతామని ఆయన అన్నారు. కాగా, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ ప్రబల శక్తిగా ఎదుగుతోందని, అయితే జగన్ తన తండ్రి హయాంలో జరిగిన భూకేటాయింపులపై వస్తున్న ఆరోపణలకు వివరణ ఇచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.

కృష్ణా జిల్లా నేతలకు బాబు హెచ్చరిక

హైదరాబాద్: అంతర్గత కుమ్ములాటలతో వీధికెక్కిన కృష్ణా జిల్లా పార్టీ నాయకులపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. వారిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన చేశారు. వ్యక్తిగత కారణాలతో అంతర్గత వ్యవహారాలపై మీడియాకు ఎక్కితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటివారిపైన అయినా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. వ్యక్తిగత కారణాలతో పార్టీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తే సహించబోమని ఆయన అన్నారు. కృష్ణా జిల్లా పార్టీ నాయకులు వల్లభనేని వంశీ, దేవినేని ఉమా మహేశ్వర రావు తీవ్ర విభేదాలతో మీడియాకు ఎక్కిన విషయం తెలిసిందే.  తాను పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నానని, ఏమైనా సమస్యలు ఉంటే తన వద్ద కూర్చుని పరిష్కరించుకోవచ్చునని చంద్రబాబు చెప్పారు.

వదినమ్మ పై పోటీ చేస్తా

హైదరాబాద్: ఉప ఎన్నికల్లో తన అన్న వైఎస్.రాజశేఖర్ రెడ్డి సతీమణి, తన వదినమ్మ వైఎస్.విజయలక్ష్మిపై పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు రాష్ట్ర మంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి పునరుద్ఘాటించారు. అంతేకాకుండా, కడప ఉప ఎన్నికల్లో సెంటిమెంట్‌కు ఎలాంటి తావులేదన్నారు. మే నెలలో కడప, పులివెందుల స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్న విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున వైఎస్.వివేకానంద రెడ్డి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అలాగే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున వైఎస్ఆర్ సతీమణి విజయలక్ష్మి పోటీ చేస్తారని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల పోటీపై వైఎస్.వివేకా శుక్రవారం స్పందిస్తూ వదినమ్మపై పోటీ చేయాలన్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదన్నారు. అదేసమయంలో అధిష్టానం ఏదైనా చెపితే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన తేల్చి చెప్పారు.  వైయస్ విజయమ్మపై పోటీ చేయడానికి వివేకానంద రెడ్డి విముఖత ప్రదర్శిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. వివేకానంద రెడ్డి మాటలు ఆ వార్తలను ఖండిస్తున్నాయి. కాగా, వైయస్ రాజశేఖర రెడ్డి సెంటిమెంటును వాడుకోవడానికి పులివెందులలో కాంగ్రెసు పార్టీ విజయమ్మపై కాంగ్రెసు పార్టీ పోటీకి దిగకపోవచ్చునని కూడా ప్రచారం జరిగింది. అయితే, ఆ ప్రచారాన్ని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌తో పాటు వివేకానంద రెడ్డి కూడా అప్పుడే ఖండించారు. కడప పార్లమెంటు సీటుతో పాటు పులివెందుల అసెంబ్లీ స్థానంలో కాంగ్రెసు అభ్యర్థులు ఉంటారని వారు చెప్పారు. కడప పార్లమెంటు సీటులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి వైయస్ జగన్‌పై వివేకానంద రెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని పోటీకి దించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.

నాదెండ్ల హామీతో టీఆర్ఎస్ దీక్ష విరమణ

హైదరాబాద్: శాసనసభ సభ్యత్వానికి పోచారం శ్రీనివాస రెడ్డి చేసిన రాజీనామాపై శానససభ డివ్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ హామీ ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు శుక్రవారం సాయంత్రం తమ దీక్షను విరమించుకున్నారు. పోచారం శ్రీనివాస రెడ్డి రాజీనామా ఆమోదంలో నాదెండ్ల మనోహర్ చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ తెరాస శాసనసభ్యులు ఉదయం శాసనసభ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరవధిక దీక్షకు దిగారు. ఆదివారంలోగా పోచారం రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని నాదెండ్ల మనోహర్ తెరాస శాసనసభ్యులకు హామీ ఇచ్చారు. దీంతో వారు దీక్ష విరమించారు.

భారీ భద్రతలో వాంఖెడే స్టేడియం

ముంబై: క్రికెట్ ప్రపంచ కప్‌కు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు వచ్చిన దృష్ట్యా శనివారం భారత్-శ్రీలంక మధ్య తుది పోరు జరుగనున్న వాంఖెడే స్టేడియం, పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. భారత రాష్టప్రతి ప్రతిభా పాటిల్, శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్సే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా తిలకించనుండటంతో కల్పించిన పటిష్టమైన భద్రతతో వాంఖెడే స్టేడియం దుర్భేద్యమైన కోటను తలపిస్తోంది. 32వేల మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా తిలకించగలిగే సామర్థ్యం ఉన్న వాంఖేడ్ స్టేడియం చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. నగరంలో తనిఖీలను ముమ్మరం చేశారు. నాకాబందీలను తీవ్రతరం చేశారు. వాంఖేడ్ స్టేడియం వద్ద ముంబయి పోలీసులతో పాటు నేషనల్ సెక్యూరిటి గార్డ్స్ టీమ్‌లు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్, స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, క్విక్ రెస్పాన్స్ టీమ్‌కు చెందిన బలగాలు మోహరించి ఉన్నాయి. ఎలాంటి దాడినైనా తిప్పికొట్టేందుకు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. స్టేడియంపైన, చుట్టుపక్కల ప్రాంతాల గగనతలాన్ని ‘నో ఫ్లైయింగ్ జోన్’గా ప్రకటించారు. స్టేడియం లోపల, బయట 180కి పైగా సిసిటివిలను అధికారులు అమర్చారు. ప్రేక్షకులను నిశితంగా గమనించేందుకు ఒక ప్రత్యేక పోలీస్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు డిప్యూటి పోలీస్ కమిషనర్ (ఆపరేషన్స్) రాజ్‌కుమార్ వత్కార్ చెప్పారు.

జస్టిస్ శ్రీకృష్ణపై ధ్వజమెత్తిన కవిత

హైదరాబాద్: జస్టిస్ శ్రీకృష్ణను ఆర్థిక వ్యవహారాల సంస్కరణ కమిటీ చైర్మన్‌గా నియమించడాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యతిరేకించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై నాలుగు కోట్ల మంది ప్రజలకు న్యాయం చేయలేని జస్టిస్ శ్రీకృష్ణ 120 కోట్లమంది ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. శ్రీకృష్ణ తెలంగాణకు వ్యతిరేకంగా రిపోర్టు ఇచ్చినందుకే కేంద్రం ఆయనకు బహుమతిగా ఆ పదవి ఇచ్చిందని శ్రీకృష్ణపై ఆమె ధ్వజమెత్తారు. ఆయన తీరు తెరవెనుక పెద్దలకే ఉపయోగపడుతుందని ఆరోపించారు. ఆయనను ఆర్థిక వ్యవహారాల సంస్కరణ కమిటీ చైర్మన్‌గా వెంటనె తొలగించాలని అన్నారు. శ్రీకృష్ణ కమిటీలోని సభ్యులంతా అవినీతిపరులే అన్నారు. ఆ కమిషన్ వల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజం ఉండదన్నారు.

అందులో కేసీఆర్ పాత్ర: ఎర్రబెల్లి

హైదరాబాద్: ఇటీవల జరిగిన శాసనసభ్యుల కోటా శాసనమండలి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ వెనుక ఆ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు హస్తం ఉందని టిడిపి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు అనుమానం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్‌కు విజ్ఞత ఉంటే క్రాస్ ఓటింగుకు పాల్పడ్డ శాసనసభ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. క్రాస్ ఓటింగుకు పాల్పడ్డ ఎమ్మెల్యేల రాజీనామాను ముందుగా టిఆర్ఎస్ డిమాండ్ చేయాలని అన్నారు. ఒక పార్టీనుండి గెలిచి మరో పార్టీకి ఓటు వేసి నైతిక విలువలు కోల్పోయిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి వారు మద్దతు ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఎజెండా ఓట్లు, సీట్లు, నోట్లు అని ఆరోపించారు. డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు తాము ఎప్పుడో పోచారంను అనర్హుడిగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశామని అన్నారు. ఆయనపై మొదట అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్‌కు పోచారం దీక్షలో కూర్చునే అర్హత లేదన్నారు.