అప్పటివరకు ఓపిక పడదాం: టి కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్: తెలంగాణ అంశంపై కాంగ్రెస్ అధిష్టానం సూచన 5 రాష్ట్రాల విధానసభలకు ఎన్నికలయ్యేవరకు ఓపిక పట్టాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రతినిధులు నిర్ణయించారు. తెలంగాణ కాంగ్రెసు ఎంపీలు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్సులో సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా మే చివరి వారం వరకు కేంద్రానికి సమయం ఇవ్వాలని ఆ తర్వాత తెలంగాణకు అనుకూలంగా ప్రకటన రాకుంటే కేంద్రంపై ప్రత్యక్ష ఆందోళనకు దిగేందుకు సిద్ధమయినట్లుగా తెలుస్తోంది. మే తర్వాత ఉద్యమాన్ని కాంగ్రెసు పార్టీ అధ్వర్యంలో ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఓ యాక్షన్ కమిటీని వేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణకు చెందిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంతకాలతో కేంద్రానికి ఓ లేఖను కూడా రాయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇతర అంశాల జోలికి వెళ్లకూడదని, అలా చేస్తే ముఖ్యమైన తెలంగాణ అంశం పక్కదారి పట్టే అవకాశాలు ఉన్నాయని వారు భావించినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెసు ఆధ్వర్యంలో వేసే కమిటీ ద్వారా ఉద్యమాన్ని ఉధృతం చేసి కేంద్రానికి తెలంగాణ సెంటిమెంటు ప్రధాన్యత చెప్పాలని అనుకున్నట్లుగా తెలుస్తోంది.

తల్లిని గెలిపించుకోవడానికి జగన్ తంటాలు

కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ సీటును గెలుచుకోవడానికి వ్యూహాలు చేస్తున్నారు. గత ముప్పయ్యేళ్లుగా వైయస్ కుటుంబం వైపే నిలబడిన కడప, పులివెందుల ప్రజలు ఇప్పుడు వైయస్ మరణం తర్వాత నిలువునా కుటుంబం చీలడంతో ఎటువైపు ఉంటారనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే వివేకానందరెడ్డికి స్థానికంగా ఉన్న పట్టు దృష్ట్యా ఆయన వైపే ప్రజలు ఉంటారని కొందరు చెబుతుండగా, వైయస్ ఇమేజ్ దృష్ట్యా జగన్ వైపే ఉంటారని మరికొందరి వాదన. ఈ ఎన్నికల ద్వారా జగన్ కాంగ్రెసు వైపు కాకుండా వైయస్ వైపు ఉన్నారని చెప్పడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు కడప పార్లమెంటు స్థానంతో పాటు పులివెందుల అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తన వర్గం నేతలతో శనివారం భేటీ అయ్యారు. ఎన్నికలలో వ్యూహాలపై వారితో చర్చించారు. ఎవరెవరు ఏం చేయాలో నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇక తన వంతుగా తల్లిని పులివెందుల స్థానం నుండి గెలిపించడానికి జగన్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా చేయించుకున్న ప్రచార రథంలో మంగళవారం నుండి ప్రచారం ప్రారంభించనున్నారు. 25 రోజుల పాటు సాగే ఈ ప్రచార పర్యటనలో జగన్ కడప నుండి తాను గెలవడానికి ఒక్కో నియోజకవర్గంలో మూడు రోజులు పర్యటించనున్నారు. ఇక తల్లి విజయమ్మ పోటీ చేస్తున్న పులివెందుల అసెంబ్లీ స్థానం నుండి ఆమెను గెలిపించడానికి ఏకంగా 7 రోజులు అక్కడ పర్యటించనున్నారు. ఈ ఎన్నికల ద్వారా జిల్లా ప్రజలు తమ వైపు ఉన్నారని చెప్పడమే కాకుండా తన రాజకీయ భవిష్యత్తును కూడా నిర్ణయించుకోనున్నారు.   కాగా, యువనేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15న కడప పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేయనున్నారు. పులివెందుల అసెంబ్లీ స్థానానికి వైఎస్ విజయలక్ష్మి ఈ నెల 16న నామినేషన్ వేయనున్నారు. కడప, పులివెందుల స్థానాల్లో మే 8వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఈసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయమ్మ పులివెందుల శాసనసభ స్థానానికి, జగన్ కడప లోక్‌సభ స్థానానికి గత నవంబర్‌లో రాజీనామా చేయటంతో ఆ స్థానాలు ఖాళీ అయిన విషయం తెలిసిందే. దీంతో ఈ రెండు స్థానాలకూ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. కాగా వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ఉగాది పండుగ తర్వాత ప్రకటించనున్నారు.

జాతీయ మీడియాపై భగ్గుమన్న ఉండవల్లి

న్యూఢిల్లీ: రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ జాతీయ మీడియాపై భగ్గుమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిపై ఓ పత్రిక చేసిన వ్యాఖ్యలను ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రంగా నిరసించారు. ఆ పత్రికపై విరుచుకుపడ్డారు. జాతీయ పత్రిక అయిన ఎకనామిక్ టైమ్స్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ఆర్ గురించి రాస్తూ ఆయన పథకాలు, పరిపాలన తదితర విషయాలను ప్రస్తావిస్తూ రోగ్ అనే వ్యాఖ్యంతో వైయస్ఆర్‌ను సంభోదించింది. దీనిపై ఉండవల్లి ఆగ్రహోద్రులయ్యారు. కేంద్రంలో యూపిఎ ప్రభుత్వాన్ని రెండుసార్లు అధికారంలోకి తీసుకు రావడానికి కృషి చేసిన వైయస్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. వైయస్ రాష్ట్రంలో సుపరిపాలన అందించారన్నారు. ఈ విషయంపై ఉండవల్లి కోర్టుకు కూడా వెళ్లారు.

టీం ఇండియాకు నేతల ప్రసంసల వెల్లువ

హైదరాబాద్‌‌: క్రికెట్‌లో ప్రపంచ కప్‌ సాధించిన మహేంద్ర సింగ్‌ ధోని సేనకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. మ్యాచ్‌ను ఆదుకున్న గంభీర్‌ సింగ్‌కు కూడా సిఎం ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అలాగే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు కూడా ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌కు అభినందనలు తెలియజేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సభ్యుడు వై.ఎస్. జగన్మోహన రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. శ్రీలంకపై చిరస్మరణీయ విజయం సాధించిన టీమిండియాకు జగన్మోహన రెడ్డి అభినందనలు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి విజయాలు సాధించాలని ఆయన అభినందించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు, మాజీ స్పీకర్‌ సురేష్‌రెడ్డి, లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ్‌, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి, కాంగ్రెస్‌ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ ఇంకా వివిధ పార్టీల నాయకులు, ఎంపీలు, ఎంఎల్యేలు టీం ఇండియాకు అభినందనలు తెలియజేశారు.

ఇక మురిపించనున్న ఐపిఎల్

హైదరాబాద్: ప్రపంచకప్ సంరంభం ముగిసింది. కపిల్ డెవిల్స్ తర్వాత 28ఏళ్ల అనంతరం మహేంద్ర సింగ్ సారథ్యంలోని భారత్ జట్టు ప్రపంచకప్‌ గెలుచుకోవడంతో భారత అభిమానుల ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. ఈ ఆనందాన్ని అనుభవిస్తున్న తరుణంలో క్రికెట్ అభిమానులను ఐపిఎల్ మురిపించడానికి వస్తుంది. ప్రపంచ కప్పు ఆటలను అందరూ ఆస్వాదించినప్పటికీ ఐపిఎల్‌లో ఉండే మజా వేరు. 20 ఓవర్ల ఈ మ్యాచ్ యాక్షన్ చిత్రాన్ని తలపిస్తుంది. ఈ 20 ఓవర్ల పోరులో బంతి బంతికి ఉత్కంఠ, పరుగు పరుగుకి అభిమానులకు ఓ పులకింత. ధాటిగా ఫోర్లు, సిక్సులతో క్రికెట్ అభిమానులను అలరిస్తుంది. ఇలాంటి 20 ట్వంటీ మ్యాచ్ మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 8వ తారీఖునుండి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇది మే 28 తారీఖు వరకు కొనసాగుతుంది. ఇప్పటికే ప్రపంచకప్ టోర్నీ అభిమానులను నలభై రోజులు అలరించింది. ఇక 20ట్వంటీ టోర్నీ మరో యాభై రోజులు అభిమానులను అలరించనుంది. ప్రపంచకప్, 20ట్వంటీ కారణంగా క్రికెట్ అభిమానులకు వరుసగా మూడు నెలలు పండగే పండగ. ప్రపంచకప్ సంరంభం ముగిసిన తర్వాత ఐపిఎల్‌కు ఐదు రోజులే ఉన్నందున అభిమానుల ఆనందానికి హద్దే ఉండదనటంలో సందేహం లేదు. అయితే ఈ సంవత్సరం గతంలో ఉన్న ఎనిమిది జట్లకు తోడుగా పూణే, కోచి జట్లు కలిపి మొత్తం పది జట్లు బరిలోకి దిగుతున్నాయి.

ఈ విజయం చిరకాల వాంఛ: సచిన్

ముంబయి: ప్రపంచకప్ గెలుపొందడం నా చిరకాల వాంఛ అని ఇప్పుడు ఆ కల నెరవేర్చుకోవడం తాను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నట్లు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ప్రపంచకప్ గెలిచిన తర్వాత వ్యాఖ్యానించారు. జట్టులోని సభ్యులంతా కూడా ప్రపంచకప్‌కు ముందు సచిన్ కోసమైనా ఈ కప్ గెలుస్తామని చెప్పారు. వారు అన్నట్టుగానే వారు సచిన్ కోసమైనా మ్యాచ్ గెలిచారు. ఈ కప్పును సచిన్‌కు, తమకు అండగా నిలబడిన భారత ప్రజలందరికీ అంకితమిస్తున్నట్లుగా చెప్పారు. కాగా యువరాజ్ మాట్లాడుతూ భారత జట్టు బలహీనంగా ఉందన్న వారి నోళ్లు ప్రపంచ కప్ గెలవడం ద్వారా మూయించామని అన్నారు. ఈ ప్రపంచ కప్ దేశ ప్రజలందరికీ అంకితమని హర్భజన్ సింగ్, కెప్టెన్ ధోనీ అన్నారు. కాగా కప్ గెలిచిన అనంతరం జట్టు సభ్యులు సచిన్ టెండుల్కర్‌ను భుజాలపై ఎత్తుకొని స్టేడియం కలియదిరిగారు. కోచ్ గ్యారీ కిర్‌స్టన్‌ను కూడా భుజాలపైకి ఎత్తుకొని స్డేడియంలో కలయదిరిగారు.

వైఎస్ పథకాలు.. సోనియా ఆలోచనలే

హైదరాబాద్: ‘రాష్ట్రంలో అమలవుతున్న కేంద్ర, రాష్ట్ర సంక్షేమ, అభివృద్ధి పథకాలు, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆలోచనలు..’ అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల పర్యవేక్షణకు ఇటీవల పిసిసి అధ్యక్షుడు డిఎస్ ‘మానిటరింగ్ కమిటీ’లను నియమించిన సంగతి తెలిసిందే. గాంధీభవన్‌లో డిఎస్ అధ్యక్షతన జరిగిన మానిటరింగ్ కమిటీల సమావేశానికి స్వల్ప సంఖ్యలో సభ్యులు హాజరయ్యారు. ఎఐసిసి కార్యదర్శి కె.బి. కృష్ణమూర్తి హాజరుకాలేదు. మానిటరింగ్ కమిటీల్లో ఉన్న సభ్యులుగా మంత్రుల్లో ఇద్దరు హాజరుకాగా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలా స్వల్ప సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు వ్యక్తిగతం కావనీ, సోనియా గాంధీ ఆలోచనలని చెప్పినట్లు సమాచారం. మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలకు సరైన విధంగా అవగాహన కల్పించలేక పోతున్నామన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేశారని తెలిసింది. ఇలాఉండగా సమావేశానంతరం డిఎస్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను సమర్థవంతంగా అమలు చేయడానికి తమ ప్రభుత్వం బలంగా ఉందని అన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో అధికారులకు సహకారం అందిస్తూ, ఆ సంక్షేమ, అభివృద్ధి పథకాలను అర్హులందరికీ అందేలా మానిటరింగ్ కమిటీలు చూస్తాయని ఆయన తెలిపారు. మానిటరింగ్ కమిటీలు జిల్లా స్థాయిలో కమిటీలతో సమీక్షా సమావేశాలను నిర్వహించాలని, అక్కడ జరిపే సమీక్షా సమావేశాల ఫొటోలను, నివేదికలను ఈ నెల 10వ తేదీలోగా సమర్పించాలని ఆయన ఆదేశించారు. ఈ కమిటీలు ప్రతి నెలా ఒకసారి సమావేశమై పిసిసికి నెలవారీ నివేదికలు పంపించాలని ఆయన సూచించారు.

2011 వరల్డ్ కప్ విజేత భారత్

ముంబై: వ్వావ్వ్‌వ్.... యాహూ... హుర్రే... శబ్బాష్ష్‌ష్... సూపర్... ధోనీ సేన గెలిచింది. దేశం మొత్తం ఊగిపోయింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా యావద్భారతం ఉర్రూతలూగింది. ఆనందం పట్టలేక ఎగిరి గంతేసింది. విజయోద్వేగంతో గంతులేసింది. భారత వీరుల వీర విహారం చూసి తనువెల్లా పులకించింది. ఇది మామూలు ఆట కాదు. మనోళ్లు కొట్టారు.. ఇరగ్గొట్టారు.. చితగ్గొట్టారు.. గెలిచారు. దేశాన్ని గెలిపించారు. కోట్లాది అభిమానులను మురిపించారు. కప్పు... వరల్డ్ కప్పు... క్రికెట్ వరల్డ్ కప్పు.. ఎన్నాళ్లుగానో.. ఎన్నేళ్లుగానో.. ప్రతి భారతీయుడికీ ఓ తీరని కల. ఇన్నాళ్లకు మన కుర్రాళ్లు ఆ ముచ్చట తీర్చారు. చరిత్రను పునరావృతం చేశారు. 1983నాటి లార్డ్స్‌ను... 2011లో వాంఖడేలో ఆవిష్కరించారు. 28 సంవత్సరాల తర్వాత దేశానికి కప్పు అందించారు. అంతేకాదు... 'సచిన్‌కు ప్రపంచ కప్పును బహుమతిగా అందిస్తాం' అన్న మాట నిలబెట్టుకున్నారు. టాస్‌లో చుక్కెదురైనా... లంకేయులు 274 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచినా... ఏ దశలోనూ తడబడలేదు. వీర విజృంభణ చేస్తాడనుకున్న వీరేంద్ర సెహ్వాగ్ రెండో బంతికే డకౌట్ అయినా, శత శతకాల వీరుడిగా చరిత్ర సృష్టిస్తాడనుకున్న సచిన్ 18 పరుగులకే పెవిలియన్ ముఖం పట్టినా.... అదరలేదు,బెదరలేదు. 'అంతా అయిపోయినట్లే' అనుకుని అటు స్టేడియంలో, ఇటు దేశవ్యాప్తంగా టీవీల ముందు కూర్చున్న అభిమానుల్లో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ ఒక్కో పరుగుతో ఆశలు రేకెత్తించారు. వీలైతే ఫోర్, కాకుంటే రెండు... అదీ కాకుంటే సింగిల్! బంతికి, కాలికి పని చెబుతూనే ఉన్నారు. స్కోరు బోర్డును కదిలిస్తూనే ఉన్నారు. విరాట్ కోహ్లీ ఔట్ అయ్యాక... ధోనీ రంగ ప్రవేశం చేశాడు. అసలే ఫామ్‌లో లేడు. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్‌లోనూ 50 పరుగులు చేయలేదు. ఇప్పుడేం చేస్తాడు.... అని 'శంకావాదులు' సందేహిస్తూనే ఉన్నారు. ఈ అనుమానాలను ధోనీ తన బ్యాట్‌తో బద్దలు కొట్టాడు. అటు ధోనీ, ఇటు గంభీర్ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. తొండితో టాస్ గెలిచినప్పటికీ... శ్రీలంక మ్యాచ్‌ను మాత్రం గెలవలేకపోయింది. భారత బౌలర్లు ఆరంభం నుంచి శ్రీలంక బ్యాటును కట్టేశారు. అడపాదడపా బంతి ముందుకు కదిలినప్పటికీ ఫీల్డర్లు చిరుతల్లా ఉరికి ఉరికి పట్టేశారు. 15 ఓవర్లదాకా ఇదే సీన్! లంకేయుల మొత్తం స్కోరు 210 - 220 దాటదనుకున్నప్పటికీ... చివరికి పరిస్థితి మారింది. ఈ టోర్నీలో అంతగా ఫామ్‌లో లేని మహేళ జయవర్ధనే సెంచరీ కొట్టి భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. చివరి పవర్‌ప్లేలో లంకేయులు గర్జించడంతో మొత్తం స్కోరు 274 పరుగులకు చేరింది. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి. ఛేదిస్తే... ఇలాంటి భారీ లక్ష్యాన్నే ఛేదించాలి. అప్పుడే గెలుపులో మజా! అసలైన ఆనందం! ఈ ఆనందాన్ని శనివారం యావద్భారతం సంపూర్ణంగా ఆస్వాదించింది. గెలుపు ఖాయం కాగానే కుగ్రామాల నుంచి మహా నగరాల దాకా పండగే పండగ! బాణసంచాతో దద్దరిల్లాయి. అటు విదేశాల్లోని భారతీయులు కూడా ఈ విజయంతో సంబరాలు చేసుకున్నారు. ఇటు.. వాంఖడేలో భారత విజయాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన అభిమానుల ఆనందానికి హద్దులే లేవు. ఈ విజయాన్ని సాధించిన భారత జట్టు ఉద్వేగాన్ని వర్ణించేందుకు మాటలు చాలవు.అటు పరుగులతో, ఇటు వికెట్లతో అద్భుత ప్రతిభ చూపిన యువరాజ్‌సింగ్ 'మ్యాన్ ఆఫ్ ది టోర్నీ'గా నిలిచాడు. విశ్వవిజేతగా నిలిచిన భారత జట్టుకు రూ.13.50 కోట్ల నజరానా లభించింది. కాగా, జగజ్జేతగా నిలిచిన టీమ్‌ ఇండియాకు రాష్ర్టపతి ప్రతిభా పాటిల్ ఆదివారం తేనీటి విందు ఇవ్వనున్నారు. దేశానికి వరల్డ్‌కప్ సాధించిపెట్టిన ధోనీ సేనకు రాజ్‌భవన్‌లో ఈ సాయంత్రం రాష్టప్రతి విందు ఏర్పాటు చేశారు.

విశ్వవిజేతగా నిలచిన భారత్

ముంబై: కోట్లాది భారతీయుల స్వప్నం ఫలించింది. యావత్ భారతావని కల తీరింది. 28 ఏళ్ల తరువాత తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకుంటూ ధోని సేన ప్రపంచకప్ గెలవడంతో భరతమాత పులకించి పోయింది.  భారత కెప్టెన్ ధోని సిక్సర్ కొట్టి ఇంకా పది బంతులు ఉండగానే ఇండియాకు ఘన విజయం సాధించిపెట్టాడు.  శ్రీలంక -భారత్‌లు తమ బ్యాటింగ్ విన్యాసాలతో ముంబై వాంఖేడ్ స్టేడియం తడిసి ముద్దయ్యినా.. తన సొంత టీమ్ విజయం సాధించడంతో వాంఖేడ్ స్టేడియం ఆనంద పరవళ్లు తొక్కింది.కెప్టెన్‌గా ధోని అద్భుతమైన ప్రతిభ ప్రదర్శించాడు. అలాగే ధోని బ్యాట్స్‌మ్యాన్‌గా కూడా 91 పరుగులు సాధించి అద్భుతమైన విజయానికి కారకుడయ్యాడు.  

2జి స్కాం రాజా పై చార్జిషీట్ దాఖలు

న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో టెలికం మాజీ మంత్రి ఎ రాజాపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) ప్రత్యేక కోర్టు ముందు తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. 80 వేల పేజీలుఉన్న ఈ చార్జిషీట్ ను ఏడు స్టీల్ పెట్టెల్లో పాటియాలా కోర్టుకు తీసుకొచ్చారు.నిందితుడిగా ఉన్న రాజాను కూడా కోర్టులో హాజరు పరిచారు. ఎ రాజా, ఆయన వ్యక్తిగత సహాయకుడు చండోలియా, టెలికం మాజీ కార్యదర్శి సిద్ధార్థ బెహూరియా, ఎటిస్లాట్ డిబి మాజీ మేనేజింగ్ డైరెక్టర్ షాహిద్ ఉస్మాన్ బల్వాలపై నేరారోపణలు చేస్తూ సిబిఐ ఈ చార్జిషీట్ దాఖలు చేసినట్లు సమాచారం. కేసు నిందితుల్లో డిబి రియాల్టీ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ గోయంకా, యూనిటెక్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ చంద్ర పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రాజా చీటింగ్, ఫోర్జరీ, అవినీతి కింద నేరారోపణలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సిబిఐ ఇది వరకు చెప్పింది.

బాబు వద్దే తేల్చుకుంటా

హైదరాబాద్: తనపై విమర్శలు చేస్తున్నవారిపై తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితోనే తేల్చుకుంటానని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి చెప్పారు. ప్రజా పద్దుల కమిటీ (పిఎసి) చైర్మన్‌గా నాగం జనార్దన్ రెడ్డి కొనసాగడానికి అనర్హుడని సీమాంధ్రకు చెందిన తెలుగుదేశం నాయకులు చేస్తున్న విమర్శలపై ఆయన ఆ విధంగా అన్నారు. తెలంగాణ ఉద్యమానికి పూర్తి సమయం వెచ్చించేందుకే తాను పిఎసి చైర్మన్ పదవికి రాజీనామా చేశానని ఆయన చెప్పారు. పిఎసి చైర్మన్‌గా తాను ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళ్తానని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాంతంతో ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డి రాయలసీమను పోల్చడాన్ని ఆయన తప్పు పట్టారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణవాసులు దురభిప్రాయంతో ఉన్నారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనడాన్ని ఆయన వ్యతిరేకించారు. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా బాబ్లీ ప్రాజెక్టు నిర్మిస్తుంటే గత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి నిర్లక్ష్యం వహించారని, ఈ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బాబ్లీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్తారేమోనని ఆయన అన్నారు.

భారత్ గెలవాలని పూజలు, ర్యాలీలు

హైదరాబాద్: భారత్ ప్రపంచకప్ గెలవాలని భారతీయులు కోరుకుంటున్నారు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కోసం వరల్డ్ టైటిల్ గెలవాలని ఆకాంక్షిస్తున్నారు. టీమిండియా కప్ కొట్టాలని రాష్టవ్య్రాప్తంగా అభిమానులు పూజలు, హోమాలు, ర్యాలీలు నిర్వహించారు. భారత విజయాన్ని కాంక్షిస్తూ విజయవాడ దుర్గగుడిలో మాజీ మేయర్ బిందు మాధవి పూజలు చేశారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో 250 అడుగుల జెండాతో ర్యాలీ తీశారు. గట్టాయలో 72 అడుగుల జెండాతో విద్యార్థుల ర్యాలీ చేపట్టారు. కరీంనగర్‌లోని రాజరాజేశ్వరి ఆలయంలో ఆటో యూనియన్ సభ్యులు పూజలు చేశారు. టీమిండియా కప్ గెలవాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా పాలకొండ కోటదుర్గ ఆలయంలో అభిమానులు పూజలు చేశారు. విశాఖపట్టణంలోని సంపత్ వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు.చీరాల విజ్జేశ్వరస్వామి ఆలయంలో హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో గోదారిమాతకు మహిళలు కలశపూజ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పాత బస్టాండ్‌లో పూలతో తయారు చేసిన 5 అడుగుల ప్రపంచకప్ నమూనాను ప్రదర్శించారు. అభిమానులు మ్యాచ్ చూసేందుకు వీలుగా జంగారెడ్డిగూడెంలో రెండు టీవీ తెరలను ఏర్పాటు చేశారు.