కోలుకుంటున్న సత్య సాయిబాబా

అనంతపురం: సత్య సాయిబాబా ఆరోగ్యం మంగళవారం కాస్త మెరుగుపడింది. వెంటిలేటరు సాయంతో శ్వాస పీల్చుకోవడం, సీఆర్‌ఆర్‌టీ వ్యవస్థ సాయంతో కిడ్నీలు పనిచేయడం వంటివి మినహాయిస్తే మిగిలిన అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి. ఈ మేరకు సత్యసాయి ఆసుపత్రి మంగళవారం ఉదయం, సాయంత్రం రెండు బులెటిన్లను విడుదల చేసింది. బాబాకు అందుతున్న వైద్య సేవలపై ఆసుపత్రి డైరెక్టరు సఫయా ఒక వీడియో సీడీనీ విడుదల చేశారు. బాబా ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి పలువురు ప్రముఖులు ఆసుపత్రికి వస్తున్నారని ఆయన తెలిపారు. ఎవరినీ ఐసీయూలోకి అనుమతించడం లేదని, అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నలుగురు ప్రభుత్వ వైద్యుల బృందం ఆసుపత్రికి వచ్చి వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేసిందని వెల్లడించారు. సత్య సాయిబాబా ఆరోగ్యం మెరుగుపడాలని భక్తులు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు, హోమాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచీ పుట్టపర్తిలోని ఆలయాల్లో భక్తులు మృత్యుంజయ హోమం, నవగ్రహాల హోమం, సర్వదేవతల ఆరాధన నిర్వహించారు. ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో రాత్రి పెద్ద సంఖ్యలో భక్తులు కొవ్వొత్తుల ప్రదర్శన జరిపారు. ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్‌ దర్శన మందిరంలో ఉదయం, సాయంత్రం వేళల్లో భక్తులు భజనలు, సాయినామ కీర్తనలు ఆలపిస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు, సాయి విద్యార్థులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. బాబా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు పలువురు ప్రముఖులు మంగళవారం పుట్టపర్తికి వచ్చారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌, విశ్వహిందూ పరిషత్తు అంతర్జాతీయ అధ్యక్షుడు అశోక్‌ సింఘాల్‌, జాతీయ విపత్తుల నివారణ సంఘం ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి, ఎంపీ నిమ్మల కిష్టప్ప తదితరులు ఆసుపత్రి వద్దకు వచ్చారు. వైద్య బృందంతో మాట్లాడారు.

టిఆర్ఎస్, జగన్ లవే మ్యాచ్ ఫిక్సింగ్

హైదరాబాద్:  రాష్ట్రంలో కుమ్మక్కైంది కాంగ్రెస్, జగన్ పార్టీలేననీ, ఆ విషయం బయటపడకుండా ఉండేందుకే టీడీపీ కాంగ్రెస్ తో కుమ్మక్కైందని విమర్శిస్తున్నారని తెలుగు దేశం పార్టీ దుయ్యబట్టింది. మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఐటి నోటీసులు ఇస్తే తిరిగి కాంగ్రెసు పార్టీలోకి చేరతారని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మంగళవారం అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు కూడా త్వరలో కాంగ్రెసు పార్టీలో చేరడం ఖాయమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ ఎన్నికలను పార్టీ చాలా సీరియస్‌గా తీసుకుంటుందని అన్నారు. త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తామని చంద్రబాబు చెప్పారు. టిఆర్ఎస్, జగన్ వర్గం నేతలు రాజకీయ స్వార్థంతోనే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ అంటున్న వారే త్వరలో అదే పార్టీలో చేరతారన్నారు. ముప్పయ్యేళ్లుగా కాంగ్రెసుతో టిడిపి పోరు చేస్తుందన్నారు. కాంగ్రెసు పార్టీ పాలనలో విద్యుత్ రంగం పూర్తిగా నిర్వీర్యం అయ్యిందన్నారు. టిడిపి ప్రభుత్వం విద్యుత్ రంగంలో సంస్కరణలు చేపట్టిందన్నారు.

హత్యకు సూత్రధారి నయామ్

నల్లగొండ: మావోయిస్టు మాజీ నేత, టిఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొణపూరి అయిలయ్య అలియాస్ సాంబశివుడి హత్యకు మరో మాజీ నక్సలైట్ ఎండి నయీముద్దీన్ అలియాస్ నయామ్ సూత్రధారి అని జిల్లా ఎస్పీ రాజేష్‌కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. సాంబశివుడి హత్యలో పాల్గొన్న మొత్తం 12మంది నిందితుల్లో ఐదుగురిని మీడియా ముందు హాజరుపరిచి అనంతరం కోర్టుకు రిమాండ్ చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు నల్లగొండవాసి చిలకరాజు సురేష్, హైదరాబాద్ జియాజి గూడకు చెందిన చకటోళ్ల అమర్, పురానాపూల్‌కు చెందిన గుండు రాకేష్, దర్శనపు శ్రీకాంత్, ధూద్‌బౌళికి చెందిన మారగోని శ్రీ్ధర్‌గౌడ్‌లు ఉన్నారు. పరారిలో ఉన్న నిందితుల్లో నయామ్‌తో పాటు అతని అనచరుడు రహీమ్, సర్వేల్ వాసి, ప్రధాన నిందితుడి కొడుకు చిలకరాజు అరుణ్, వీరమళ్ల రవి, మర్రిగూడెంకు చెందిన రాజుల నరేష్, ఇబ్రహీమ్‌పట్నంకు చెందిన పాశం లింగం, రంగారెడ్డి జిల్లా సింగారం వాసి ఎర్ర కృష్ణలు ఉన్నట్లుగా ఎస్పీ తెలిపారు. ఎస్పీ కథనం మేరకు సాంబశివుడితో నయీంకు ఉన్న పాత కక్షల కారణంగా అతడిని చంపేందుకు తన అనుచరుడైన చిలకరాజు సురేష్‌ను పురమాయించాడు. మరో అనుచరుడు రహీమ్ ద్వారా సురేష్‌కు నయిమ్ 1.9 లక్షలు అందించాడు. సాంబశివుడి హత్యకు సురేష్ హైదరాబాద్‌కు చెందిన రౌడీషీటర్ అమర్ సహాయాన్ని కోరగా అతడు కేసులోని ఇతర నిందితులను భాగస్వాములుగా చేసి వారికి 10వేల చొప్పున అందించాడు. సాంబశివుడి హత్యకు వీరు రెండు పర్యాయాలు రెక్కి చేసి చివరకు సంగెం గ్రామం ధూంధాంలో పాల్గొని వెలుతుండగా దాడి చేసి హత్య చేశారు. హంతకులు వదిలి వెళ్లిన కారు సహాయంతో కేసు దర్యాప్తును కొనసాగించి ఐదుగురు నిందితులను పట్టుకున్నామని, పరారిలో ఉన్న మిగతా వారిని మూడు నాలుగు రోజుల్లో అరెస్టు చేస్తామని ఎస్పీ ప్రకటించారు.

లలిత్ నియామకంపై అభ్యంతరం

న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కుంభకోణంలో యుయు లలిత్‌ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సీబీఐ నియమించడంపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. మాని లాండరింగ్, ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారం ప్రత్యేక ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యే వ్యక్తి రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వంలో కనీసం ఏడు ఏళ్లు అనుభవముండాలని జీఎస్ సింఘ్వీ, ఏకే గంగూలీలతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్‌కు ఆటార్ని జనరల్ వాహనవతి తెలిపారు. లలిత్ నియామకంపై ప్రభుత్వం టెక్నికల్ అంశాన్ని లేవనెత్తడంతో శుక్రవారం లోగా అటార్ని జనరల్ పూర్తి సమాచారంతో హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. మాజీ కేంద్ర మంత్రి ఏ రాజాను విచారించేందుకు సీబీఐ లలిత్‌ను ప్రత్యేక ప్రాసిక్యూటర్‌గా నియమించింది.

హరీష్‌రావును ఆక్షేపించిన నన్నపనేని

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందన్న పంచాంగ శ్రవణంపై టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలను టిడిపి సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి మంగళవారం ఆక్షేపించారు. రాష్ట్రంలో పిల్లి తుమ్మినా, ఎలుక దగ్గినా కూడా దానికి కారణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడే అని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు అంటారని ఆమె అన్నారు.  ప్రతి చిన్న విషయానికి అధికారంలో ఉన్న కాంగ్రెసును కాదని టిడిపిని విమర్శించడం టిఆర్ఎస్‌కు మామూలే అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పంచాంగ కర్త చెప్పిన అంశాన్ని వివాదం చేయాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. కాగా భగవాన్ సత్యసాయి బాబా ఆరోగ్యంపై కూడా  ఆమె స్పందించారు. బాబా కలకాలం ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నారు.

జగన్ మెజారిటీని తగ్గించే పనిలో కాంగ్రెస్

కడప: కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో యువనేత వైఎస్.జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం పక్కా వ్యూహ రచన చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఓటమి ఖాయమని మానసికంగా ఒక నిర్ధారణకు వచ్చిన అధిష్టానం.. జగన్ మెజారిటీని తగ్గించే దిశగా పావులు కదుపుతోంది. ఇందుకోసం జగన్మోహన్ రెడ్డి అనే పేరుతో ఉండే పలువురు అభ్యర్థులను డమ్మీ అభ్యర్థులుగా బరిలోకి దించాలని భావిసోంది. ఇలా చేయడం వల్ల ఓటర్లు గందరగోళానికి గురై తాము అనుకున్న చోటు ఓటు వేయలేక పోవచ్చన్నది ఆ పార్టీ భావనగా ఉంది. ఈ రెండు స్థానాలకు మే నెల 8వ తేదీన జరుగనున్న విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి (కడప లోక్‌సభ), వైఎస్.విజయలక్ష్మి (పులివెందుల) స్థానాల్లో పోటీ చేయనున్నారు. అయితే, అటు అధికార పార్టీ, ఇటు ప్రధాన ప్రతిపక్షమై తెలుగుదేశం పార్టీలు మాత్రం ఇప్పటి వరకు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం అభ్యర్థుల ఎంపికపై మాత్రం జిల్లా నేతలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్, తెదేపాలు గెలుపు కంటే జగన్ మెజారిటీని తగ్గించేందుకు ఎక్కువ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

జగన్ పై పోటీకి రెడీ అయిన శంకరరావు

హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చేనేత జౌళి శాఖ మాత్యులు శంకర్‌రావు మంగళవారం అన్నారు. పార్టీ అదేశిస్తే కడప పార్లమెంటునుండి అయినా, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుండి అయినా పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు. దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ మధ్య ఈ ఉప ఎన్నికలు అని జగన్ చెప్పడాన్ని ఆయన ఖండించారు. జగన్ వ్యాఖ్యలు ఆయన అవివేకం అన్నారు. ఆయన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమన్నారు. భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, బాబూ జగ్జీవన్ రామ్, సునీల్ గవాస్కర్‌లకు భారతరత్న ఇవ్వాలని ఆయన అన్నారు. చేనేత సొసైటీలోబోగస్ ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు.

తెలంగాణ వాదుల రభస

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ వాదుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇటీవలె తెలంగాణ రాష్ట్ర సమితి నుండి బహిష్కరించబడిన శాసనసభ్యుడు కావేటి సమ్మయ్య అనుచరులు అదిలాబాద్ జిల్లాలో బైక్ ర్యాలీని నిర్వహించారు. వీరు తమ బైకులపై తెలంగాణ గుర్తుతో గల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. అయితే వీరి బైక్ ర్యాలీని తెలంగాణవాదులు అడ్డుకున్నారు. తెలంగాణకు నమ్మక ద్రోహం చేసిన ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య అనుచరులు తెలంగాణ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించడాన్ని వారు ఆక్షేపించారు. బైక్ ర్యాలీని తెలంగాణవాదులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడకు పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను సముదాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా గత శాసనసభా కోటా శాసనమండలి ఎన్నికలలో ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య తెలంగాణ రాష్ట్ర సమితి నిలబెట్టిన అభ్యర్థికి ఓటు వేయకుండా అధికార కాంగ్రెసు పార్టీ అభ్యర్థికి ఓటు వేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో ఆయనను టిఆర్ఎస్ బహిష్కరించింది.

ఎలాంటి పుకార్లు నమ్మద్దు: రఘువీరా

హైదరాబాద్: బాబా ఆరోగ్యంపై ఎలాంటి పుకార్లు నమ్మవద్దని రాష్ట్ర మంత్రి ఎన్.రఘువీరారెడ్డి చెప్పారు.బాబా కళ్లు తెరిచి చూస్తున్నారని బాబా సోదరుడి కుమారుడు రత్నాకర్ చెప్పారన్నారు. విదేశాలనుండి కూడా వైద్యులు బాబా ఆరోగ్యం కోసం వచ్చారన్నారు. బాబా ఆరోగ్యం విషయంలో పారదర్శకత ఉండాల్సిందే నన్నారు. మరింత పారదర్శకత కోసం ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ రమేష్ పుట్టపర్తి వెళ్లాల్సిందిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశించారన్నారు. బాబా ఆరోగ్యం విషయంలో ఎలాంటి సమన్వయ లోపం ఉండరాదన్నారు. ప్రభుత్వం తరఫున పుట్టపర్తిలో అన్నింటిని పర్యవేక్షించడానికి ప్రభుత్వం ప్రత్యేక అధికారిని పంపిస్తుందన్నారు. సత్యసాయి బాబా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, ఆయన శరీరంలోని అన్ని అవయవాలు సక్రమంగానే పని చేస్తున్నాయని ఒక్క కిడ్నీ సమస్యనే ఉందని చెప్పారు. కిడ్నీ నుండి రెస్పాన్స్ రావడానికి సమయం ఎంతని చెప్పలేమని డాక్టర్లు చెబుతున్నారన్నారు. ఇప్పటికే మంత్రి గీతారెడ్డి పుట్టపర్తిలో ఉన్నారన్నారు. ఆమె ఓ భక్తురాలిగా, ప్రభుత్వం అధినేతగా అక్కడ పర్యవేక్షిస్తున్నారని అన్నారు. బాబా కోలుకోవడానికి భక్తులు ఆవేశాలకు లోనుకావద్దని కోరారు. సీనియర్ ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యంను అక్కడి పరిస్థితులు కుదుట పడే వరకు అక్కడే ఉండమని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. బాబా ఆరోగ్యం త్వరగా బాగుపడాలని రఘువీరారెడ్డి ఆకాంక్షించారు. బాబా ఆరోగ్యం విషయం ప్రజలకు, భక్తులకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే రోజుకు రెండుసార్లు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేస్తున్నట్లుగా చెప్పారు.

ప్రేమ సాయిగా పుడుతా

అనంతపురం: ప్రశాంతి నిలయాన్ని, దాని కార్యకలాపాలను పుట్టపర్తి సత్య సాయిబాబా తర్వాత ముందుకు నడిపించేదెవరనే ప్రశ్న ఉదయిస్తోంది. సత్య సాయిబాబాకు వారసుడే లేడని అంటున్నారు. నాలుగేళ్ల క్రితం సత్య సాయిబాబా ఆరోగ్యం దెబ్బ తిన్నప్పుడే ఆయన వారసుడిపై చర్చ జరిగింది. అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతున్న పుట్టపర్తే దాని ప్రధాన కేంద్రం కానుందనే వార్తలు వస్తున్నాయి. సాయిబాబా 1963 జులై 6వ తేదీన గురు పూర్ణిమ సందర్భంగా తన ఆధ్యాత్మిక రహస్యాన్ని వెల్లడించారు. శివ - శక్తి సూత్రానికి సంబందించిన ముగ్గురి అవతారమని ఆయన చెప్పుకున్నారు. శ్రీ సత్య సాయిబాబా శివుడు, పార్వతి, కర్ణాటకలోని మాండ్యాలో గల ప్రేమ సాయిల అవతారంగా తనను ఆయన చెప్పుకున్నారు. చిన్నప్పుడు తాను రాసిన పాటల్లో కూడా సత్య సాయి షిర్డీ సాధువును ఉటంకిస్తూ వస్తున్నారు. తాను 8 ఏళ్ల తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీలో తిరిగి జన్మిస్తానని షిర్డీ సాయిబాబా తన మరణానికి ముందు 1918లో ప్రకటించాడు. సత్యసాయిబాబా 1926లో జన్మించారు. తనను షిర్డీ బాబాగా ప్రకటించుకున్నారు. గత జన్మలో తాను షిర్డీ సాయిబాబానని ఆయన తర్వాత ప్రకటించుకున్నారు. తాను మాండ్యాలో ప్రేమ సాయిగా పుడుతానని సత్యసాయి బాబా తన ప్రవచనాల సందర్భంగా చెప్పేవారు. కానీ ఇప్పటి వరకు సత్యసాయి ట్రస్టు ఆయన వారసుడిని ప్రకటించలేదు. సత్యసాయి వారసుడిని ప్రకటించే కార్యక్రమానికి సత్యసాయి ట్రస్టు స్వస్తి చెప్పినట్లు సమాచారం. సత్యసాయి బాబా సోదరుడు జానకీ రామ్ కుమారుడు రత్నాకర్ సత్య సాయి ట్రస్టులో శక్తివంతుడైన సభ్యుడు.

మరణించాకా ప్రజల గుండెల్లో

హైదరాబాద్: మరణించిన తర్వాత ఎంతోమంది నాయకులను ప్రజలు మర్చిపోతారని కానీ బాబూ జగ్జీవన్ రామ్‌ను మాత్రం తమ గుండెల్లో ప్రజలు నిలుపుకున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మంగళవారం అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా చంద్రబాబు ఆయన ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. షెడ్యూల్డు కులాలకు ఎనలేని కృషి చేసింది తెలుగుదేశం పార్టీ అన్నారు. ఎస్సీలకు ఇప్పటికీ భూములు లేవని వారికి కొన్ని హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఎస్సీ ఫైనాన్సు కార్పోరేషన్‌లో డబ్బులు లేని పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉందన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం ఎస్సీలను, ఎస్టీలను విస్మరిస్తోందన్నారు. వారి కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బులను కూడా ఖర్చు పెట్టడం లేదన్నారు. టిడిపి ఏర్పాటు చేసిన జస్టిస్ పున్నయ్య కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన కమిటీ కోసం చైర్మన్‌ను కూడా నియమించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.

ఇక ప్రచార యాత్రలు: కోదండరామ్

హైదరాబాద్ : ఈనెల 11వ తేదీ నుంచి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని ఎనిమిదో అధ్యాయంపై ప్రచార యాత్రలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 20వ తేదీ నుంచి వరుస ఉద్యమ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఈసారి ఉద్యమం కేంద్రంపైన, రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలే లక్ష్యంగా ఉంటుందని చెప్పారు. 5 రాష్ట్రాల ఎనికల దృష్ట్యా తాము వెనక్కి తగ్గలేదని, ఎన్నికల సందర్భంగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే తమ వ్యూహమన్నారు. ఈరోజు జిల్లా ఐకాస నేతలతో కోదండరామ్ సమావేశం కానున్నారు. ఉద్యమ భవిష్యత్ కార్యాచరణ, ప్రచార యాత్రల నిర్వహణ, ఉద్యమ నిర్వహణలో లోపాలను సరిదిద్దుకోవడంపై చర్చ జరుగుతోంది. జగన్‌ను తెలంగాణ వ్యతిరేకిగా చూస్తున్నామని కోదండరామ్ చెప్పారు. వైయస్ జగన్‌కు సహకరించడమంటే తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లేనని ఆయన అన్నారు. జగన్ వెంట తిరగడమంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షకు భిన్నంగా వ్యవహరించడమేనని ఆయన అన్నారు.

సత్యసాయి ఆరోగ్యంపై సీఎం సమీక్ష

హైదరాబాద్ : సత్య సాయిబాబా ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు రఘువీరారెడ్డి, పితాని సత్యనారాయణ, సుదర్శన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్, డీజీపీ అరవిందరావు, విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  పుట్టపర్తికి విదేశీ భక్తులు, వీఐపీల తాకిడి పెరుగుతుండడంతో తీసుకోవాల్సిన భద్రతా చర్యలు కల్పించాల్సిన సౌకర్యాలపైన వీరు సమీక్షించినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం బాబా ఆరోగ్య పరిస్థితి గురించి మరోసారి వాకబు చేసిన అనంతరం ముఖ్యమంత్రి పుట్టపర్తికి బయలుదేరే అవకాశాలున్నట్లు సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి.

ఇక కేసీఆర్ నమస్తే తెలంగాణ జపం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి విరామం ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఇప్పుడు నమస్తే తెలంగాణ జపం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం కోసం ఆయన నమస్తే తెలంగాణ పేరిట ఓ తెలుగు దినపత్రికను ప్రారంభించబోతున్నారు. పార్టీ కార్యకర్తలను ఆయన మండలస్థాయి వార్తా పత్రిక ఏజెంట్లుగా మార్చేశారు. మొదటి ఆరు నెలల కాలంలో మూడు నుంచి మూడున్నర లక్షల సర్క్యులేషన్ ఉండేలా ఆయన పత్రిక ప్లాన్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. తెలంగాణ వాయిస్‌గా చెబుతున్న నమస్తే తెలంగాణ పత్రిక ఏప్రిల్ చివరి వారంలో గానీ మే మొదటి వారంలో గానీ మార్కెట్లోకి రావచ్చునని అంటున్నారు. ఆ పత్రిక తెలంగాణ గుండె చప్పుడు అనే స్లగ్ ఇస్తున్నారు. పత్రిక సర్క్యులేషన్ పెంచాలని ఆదేశిస్తూ కెసిఆర్ మండల స్థాయి వరకు పార్టీ నాయకులందరికీ లేఖలు రాశారు.

భారత్ రెండో స్థానంలోనే

దుబాయ్: ప్రపంచకప్ గెలిచినా భారత్‌కు ఇంకా నెంబర్‌వన్ స్థానం అందని ద్రాక్షలా ఊరిస్తూనే ఉంది. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో పాయింట్లు మెరుగుపరచుకున్నప్పటికీ ఇంకా ఏడు పాయింట్లతో ఆస్ట్రేలియా కంటే భారత్ (121) వెనుకబడింది. ఇక రన్నరప్ శ్రీలంక (118) మూడో స్థానంలో కొనసాగుతుండగా, దక్షిణాఫ్రికా ఆ తరువాత స్థానంలో ఉంది. కాగా భారత్ క్రికెటర్ల ర్యాంకులు మెరుగయ్యాయి. సచిన్, గంభీర్ టాప్ టెన్‌లో చోటు సంపాదించారు. సచిన్ ఒకటి, గంభీర్ నాలుగు స్థానాలు మెరుగు పరచుకొని వరుసగా తొమ్మిది, పది ర్యాంక్‌లకు చేరుకున్నారు. ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు (500)చేసిన తిలకరత్నే దిల్షాన్ (శ్రీలంక) కెరీర్‌లో అత్యుత్తమంగా మూడో ర్యాంకుకు దూసుకెళ్లాడు. 'మ్యాన్ ఆఫ్ ది టోర్నీ' యువరాజ్ సింగ్ ఆరుస్థానాలు మెరుగుపరచుకొని ఆసీస్ స్టార్ రికీ పాంటింగ్‌తో సంయుక్తంగా 17వ ర్యాంక్‌కు దక్కించుకున్నాడు. రైనా నాలుగు స్థానాలు దాటి 31వ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. కాగా బౌ లింగ్‌లో భారత ఆటగాళ్లెవరూ టాప్-10లో చోటు ద క్కించుకోలేదు. ఆల్‌రౌండర్ల జాబితాలో యువీ.. కలిస్ ను వెనెక్కి నెట్టి నాలుగో ర్యాంక్ కైవసం చేసుకున్నాడు.

రిటైర్మెంట్ పై తేల్చిచెప్పిన సచిన్

న్యూఢిల్లీ: అంతర్జాతీయ వన్డేల నుంచి ఇప్పట్లో వైదొలిగే ఆలోచనే లేదని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ స్పష్టం చేశాడు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలన్నదే తన కోరికని, గతంలో కంటే ఇప్పుడే ఆటను బాగా అస్వాదిస్తున్నానని అన్నాడు. వన్డే ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పి టెస్టు కెరీర్‌ను పొడగించుకునే ఆలోచనలో ఉన్నాడనే ఊహాగానాలు రావడంతో మాస్టర్ వివరణ ఇచ్చాడు. తన మనసులో రిటైర్మెంట్ అనేది లేదని చెప్పాడు. ఆ సమయం వచ్చినపుడు అందరికీ చెబుతానని సచిన్ వ్యాఖ్యానించాడు. 'క్రికెట్‌పై ఆసక్తి ఏ మాత్రమూ తగ్గలేదు. ఆట పట్ల అంకితభావం ఉండటం వల్లే సుదీర్ఘకాలం నుంచి కెరీర్ కొనసాగిస్తున్నా. ఇప్పుడు కూడా నా దృక్పధంలో మార్పు లేదు. కెరీర్ కొనసాగించడంపైనే దృష్టిసారిస్తున్నా' అని సచిన్ చెప్పాడు. వచ్చే ప్రపంచ కప్‌లోనూ ఆడతారా అన్న ప్రశ్నకు.. ఆ విషయం గురించి ఆలోచించడం లేదని, ప్రపంచ కప్ విజయ మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నానని అన్నాడు. తన కెరీర్‌లో భారత్‌కు సారథ్యం వహించిన వారందరి కంటే ధోనీయే బెస్ట్ కెప్టెన్ అని సచిన్ కితాబిచ్చాడు. కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ భారత్ కోచ్‌గా కొనసాగాలని సచిన్ ఆకాంక్షించాడు. అయితే, గ్యారీకి కొన్ని బాధ్యత లు ఉన్నందున అతని నిర్ణయాన్ని గౌరవిస్తానని తెలిపాడు.

నెల్లూరు ఎంపీ స్థానం ఖాళీ కానుందా?

నెల్లూరు: కాంగ్రెసు పార్టీ, లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి సిద్ధపడుతున్నారు. ‘‘రెండు పడవల ప్రయాణం నాకు ఇష్టం లేదు. ఎంపీ పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే పరిస్థితి ఏ క్షణమైనా రావొచ్చు. నెల్లూరు ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలు రావొచ్చు’’ అని ఆయన చెప్పారు. సోమవారం నెల్లూరు పట్టణంలో నిర్వహించిన ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ జెండా ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. నెల్లూరు ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం కావొచ్చన్నారు. తాను రాజీనామా చేసిన తర్వాత ఇదే స్థానం నుంచి ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ తరఫున ప్రజల ముందుకు వస్తానన్నారు. రాష్ట్రం సరైన దారిలో నడిచి అభివృద్ధి జరగాలన్నా, మహానేత వైఎస్‌ఆర్‌ఆశయాలు నెరవేరాలన్నా, జగన్ నాయకత్వం ఎంతైనా అవసరమన్నారు. ఈ కారణంగానే తాను జగన్ వెంట నడుస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. యువనేత బలపరచిన అభ్యర్థులు.. పార్టీ పుట్టీపుట్టకనే మూడు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా చరిత్ర సృష్టించారని మేకపాటి అన్నారు. రాష్ట్ర అసెంబ్లీకి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ ప్రభంజనం సృష్టిస్తారని, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టం కడతారని ఎంపీ మేకపాటి ధీమా వ్యక్తం చేశారు.

బాబా ఆరోగ్యం పై తాజా బులెటిన్

పుట్టపర్తి :  సత్య సాయిబాబా ఆరోగ్యం గురించి వాస్తవాలను వెల్లడించడం లేదని భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలను దాస్తున్నారని విమర్శిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు పుట్టపర్తికి చేరుకున్నారు. దేశ, విదేశాల నుంచి భక్తులు పుట్టపర్తి వస్తున్నారు. కాగా, సత్యసాయి బాబా ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని వైద్యుడు సఫాయా తెలిపారు. ఆయన మంగళవారం ఉదయం బాబా ఆరోగ్యంపై తాజా బులిటెన్ విడుదల చేశారు. బాబా స్పృహలోనే ఉన్నారని, వెంటిలేషన్ ద్వారా శ్వాస అందిస్తున్నట్లు తెలిపారు. హార్ట్ బీట్, బీపీ నార్మల్‌గానే ఉన్నట్లు వెల్లడించారు. ఇన్పెక్షన్ సోకే అవకాశం ఉన్నందున ఐసీయూలోనికి ఎవరినీ అనుమతించటం లేదని సఫాయా పేర్కొన్నారు. నిరంతరం డయాలసిస్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఈరోజు మధ్యాహ్నాం పుట్టపర్తి రానున్నారు. సత్య సాయిబాబాకు కిడ్నీకి సంబంధించిన వైద్యం జరుగుతోందని రాష్ట్ర మంత్రి గీతా రెడ్డి చెప్పారు. పుట్టపర్తి, ధర్మవరం గ్రామాల్లో నాలుగు వేల మంది పోలీసులను మోహరించారు. చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ రెండు గ్రామాల్లోనూ 144వ సెక్షన్ విధించారు. పలువురు ప్రముఖులు పుట్టపర్తి చేరుకుంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టపర్తికి వచ్చే అవకాశాలున్నాయి. ఈ ఏర్పాట్లను, ప్రముఖుల తాకిడి వల్ల సత్య సాయిబాబా ఆరోగ్యం గురించి నిజాలు దాస్తున్నారనే అనుమానాలను భక్తుల వ్యక్తం చేస్తున్నారు.