పాకిస్థాన్‌తో మాటల్లేవ్...

  ఈనెల 25న భారత్, పాకిస్థాన్‌ల మధ్య విదేశాంగ శాఖ కార్యదర్శుల స్థాయి చర్చలు జరుగనున్నాయి. అయితే కాశ్మీర్ వేర్పాటువాద హురియత్ నేతలతో భారత్‌లోని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ సంప్రదింపులు జరపడం ఈ చర్చలకు విఘాతం కలిగించింది. హురియత్ నేతలతో పాకిస్థాన్ సంప్రదింపులు జరపడం మీద భారత్ సీరియస్ అయింది. దాంతో పాకిస్థాన్‌తో జరగనున్న విదేశాంగశాఖ కార్యదర్శుల స్థాయి చర్చల నుంచి విరమించుకుంటున్నట్లు తేల్చి చెప్పింది. మీకు ఇండియాతో స్నేహం కావాలా? వేర్పాటువాదులతో అనుబంధం కావాలా అని భారత విదేశాంగ కార్యదర్శి సుజాతాసింగ్ పాకిస్థాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్‌కి ఫోన్ చేసి అడిగినప్పటికీ ఆయన హురియత్ నేత షబ్బీర్ షాతో సమావేశమయ్యారు. భారత్‌లోని పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ వేర్పాటువాదులతో సమావేశం కావడం రెచ్చగొట్టే చర్యేనని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు.

అసెంబ్లీలో జగన్‌ని రఫ్ఫాడేసిన మంత్రులు...

  ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలపై చర్చ జరపాలంటూ సభా కార్యక్రమాలను అడ్డుకున్న జగన్ పార్టీపై అధికార పక్షం ఫైర్ అయ్యింది. శాంతిభద్రతలపై ప్రభుత్వానికి ఎందుకు లెక్కలేదని.. మనుషుల ప్రాణాలంటే అధికార పార్టీకి లెక్కలేదని వైకాపా చీఫ్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా జగన్ని ఏపీ మంత్రులు రఫ్పాడించేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా జగన్ మారలేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజా సమస్యలు జగన్‌కు పట్టడం లేదని ఆయన అన్నారు. అలాగే మంత్రులు యనమల రామకృష్ణుడు, పల్లె రఘునాథరెడ్డి కూడా జగన్‌ని విమర్శల వర్షంలో తడిపేశారు.

కేసీఆర్ సింగపూర్ టూర్

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రాత్రి బయల్దేరి సింగపూర్ పర్యటన కోసం వెళ్తున్నారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రి ఈటెల రాజేందర్, తెలంగాణ ప్రభుత్వ అధికారులు కూడా సింగపూర్ పర్యటనకు వెళ్ళనున్నారు. ఐఐఎం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనడానికి కేసీఆర్ సింగపూర్ వెళ్తున్నారు. 22, 23 తేదీలలో ఈ సమ్మేళనం జరగనుంది. కేసీఆర్ 24వ తేదీన తిరిగి వస్తారు. తెలంగాణను అంతర్జాతీయంగా ప్రమోట్ చేసేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటానని కేసీఆర్ చెబుతున్నారు. సింగపూర్ పారిశ్రామిక విధానాన్ని కేసీఆర్ పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. సింగపూర్ పర్యటన ముగిసిన అనంతరం ఆయన మలేసియాకు వెళ్తారు. ఆరు పదులు దాటిన కేసీఆర్ తన జీవితంలో మొదటిసారి విదేశాలకు వెళ్తున్నారు. గతంలో అనేక పదవులు నిర్వహించినప్పటికీ ఆయన ఎప్పుడూ దేశం దాటి వెళ్ళలేదు. మొన్నటి వరకూ ఆయనకు పాస్ పోర్ట్ లేదని, మూడు రోజుల క్రితమే ఆయనకి పాస్ పోర్ట్ వచ్చిందని తెలుస్తోంది.

కేసీఆర్ కుటుంబ సర్వే పూర్తి

  తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా సర్వేలో పాల్గొన్నారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సర్వే అధికారులకు వివరాలు అందించారు. కేసీఆర్ కుమారుడు, ఐటీ మంత్రి కేటీఆర్, ఆయన సతీమణి, పిల్లలు వివరాలు అందించారు. కేసీఆర్ కుటుంబ వివరాలతో పాటు బ్యాంకు అకౌంట్ల వివరాలు తెలిపారు. ఈ సర్వే ప్రజల కోసమేనని అర్హులకు సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతోనే ఇంత పెద్దఎత్తున సమగ్ర సర్వే నిర్వహిస్తున్నామని కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. అలాగే సమగ్ర కుటుంబ సర్వేపై సీఎం కేసీఆర్‌కి ఎప్పటికప్పుడు సమాచారం అందుతోంది. సర్వేపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఏపీ అసెంబ్లీ.. బుధవారానికి వాయిదా

  ఆంధ్రప్రదేశ్ శాసనసభ రెండోరోజు సమావేశాలు కూడా వృధా అయ్యాయి. సభ బుధవారం నాటికి వాయిదా పడింది. మంగళవారం సభ ప్రారంభం కాగానే వైసీపీ సభ్యులు శాంతి భద్రతలపై చర్చకు పట్టుబట్టి ఆందోళన చేశారు. సభను సజావుగా నడపాలని, సంప్రదాయాలను పాటించాలని మంత్రి యనమల కోరినప్పటికీ లాభం లేకుండా పోయింది. శాంతిభద్రతలపై చర్చ కోసం ప్రభుత్వం సమాచారం తెప్పించుకోవలసి వుంటుందని అధికారపక్షం చెప్పినప్పటికీ వైసీపీ సభ్యులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు జరిగిన హత్యల గురించి కూడా చర్చకు సిద్ధమని, పరిటాల రవి హత్య గురించి కూడా చర్చిద్దామని తెలుగుదేశం నాయకులు వైసీపీ నాయకుల మీద ఎదురుదాడికి దిగారు. ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య వాదం, వివాదం ఎంతసేపటికీ తెగకపోవడంతో స్పీకర్ కోడెల శివప్రసాద్ అసెంబ్లీని బుధవారానికి వాయిదా వేశారు.

టీ-సర్వేకి విజయశాంతి నో!

   తెరాసలో చిరకాలం కొనసాగి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి మారిన విజయశాంతి, ఈరోజు తెలంగాణా ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలో పాల్గొనేందుకు నిరాకరించారు. ఆమె అయిష్టత చూపడంతో ఆమె కుటుంబ వివరాలను సేకరించడానికి వెళ్ళిన అధికారులు వెనుతిరిగారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళిన సర్వే అధికారులు ఆయన ఇంటికి తాళం వేసి ఉండటంతో వెనుతిరిగారు. జూ.యన్టీఆర్ మాత్రం సర్వే అధికారులకు పూర్తిగా సహకరించి తన వివరాలను అందజేసారు.జూనియర్ ఎన్టీఆర్ కుమారుడికి సోమవారం నాడే అభయ్ రామ్ అని పేరు పెట్టడంతో ఆ పేరు కూడా నమోదు చేయించారు.

భార్య, తమ్ముడి తలలు నరికి కావడి కట్టాడు...

  తోడబుట్టిన తమ్ముడిని, కట్టుకున్న భార్యను ఓ వ్యక్తి దారుణంగా చంపాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి తలలను ఓ కర్రకి అటూ ఇటూ కావడిలాగా కట్టాడు. తాపీగా 20 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి పోలీసులకు లొంగిపోయాడు. రెండు మర్డర్లు చేసినా చాలా కూల్‌గా వున్న అతన్ని చూసి పోలీసులు, జనం హడలిపోయారు. విశాఖపట్నం జిల్లా గొప్పులపాలెంలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే, చెదల గుండన్న, జానకమ్మ (36) భార్యాభర్తలు. అయితే జానకమ్మ మూడు రోజుల క్రితం గుండన్న తమ్ముడు నారాయణ (40)తో వెళ్ళిపోయి పొరుగూరిలో కాపురం పెట్టింది. దాంతో ఆగ్రహించిన గుండన్న తమ్ముడు నారాయణ పొలంలో ఉండగా కత్తితో వెళ్లి నరికి చంపాడు. తమ్ముడి తలను మూటగట్టుకునిభార్య జానకమ్మ వద్దకు వెళ్లాడు. ఆమెను కూడా హతమార్చి ఆమె తలను కూడా శరీరం నుంచి వేరు చేసి, రెండు శిరస్సులనూ కావడి కట్టి 20 కిలోమీటర్ల దూరంలో పాడేరులోగల హుకుంపేట పోలీస్ స్టేషన్ వరకూ తాపీగా నడుచుకుంటూ వెళ్ళి లొంగిపోయాడు.

రాజీవ్ ఆరోగ్యశ్రీ కాదు... ఎన్టీఆర్ ఆరోగ్య సేవ

  రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం పేరు మారింది. పేరు మారడంతోపాటు తీరు కూడా మారనుంది. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా మరింత మెరుగ్గా వైద్య సేవలు అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకూ రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరిట వున్న పథకాన్ని ఎన్టీఆర్ ఆరోగ్యసేవగా మారుస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఆరోగ్య శ్రీలో 100 జబ్బులను అదనంగా చేరుస్తున్నామని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో యూజర్‌ ఛార్జీలను పెంచే ఆలోచన ఏదీ ప్రభుత్వానికి లేదని చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల్లో బయోమెట్రిక్‌, ట్రాకింగ్‌ విధానంపెడతామని మంత్రి కామినేని శ్రీనివాస్‌ తెలిపారు.

ఢిల్లీ ఫైవ్‌స్టార్ హోటల్లో నర్స్ మీద గ్యాంగ్ రేప్

  దేశ రాజధాని ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో గల ఓ గదిలో ఒక నర్సుపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఈ దారుణం జరిగింది. అనారోగ్యంతో ఉన్న ఒక మహిళకు సపర్యలు చేయడానికి ఈ నర్సును నియమించారు. అయితే.. సదరు పేషెంట్‌కి సహాయకులుగా వచ్చిన నీరజ్, రాజన్ అనే ఇద్దరు యువకులు ఆ నర్సుపై అఘాయిత్యం చేశారు. అత్యాచారానికి గురైన నర్సు తొలుత పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే.. నిందితులు ఆమెపై మరోసారి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపారు. ఉద్యోగం పీకేస్తామని వాళ్లు బెదిరించి, ఒకరి తర్వాత ఒకరుగా పలుమార్లు అత్యాచారం చేసినట్లు అత్యాచారానికి గురైన నర్సు తన ఫిర్యాదులో పేర్కొంది.

అల్లు అర్జున్ తాగి డ్రైవ్ చేశాడా? తప్పుడు ప్రచారం చేశారా?

  కథానాయకుడు అల్లు అర్జున్ తప్పతాగి వెహికల్ డ్రైవ్ చేశాడని, పోలీసులు అల్లు అర్జున్‌ని పట్టుకుని, ఆ తర్వాత లోపాయకారీ ఒప్పందంతో వదిలిపెట్టేశారన్న వార్తలు వినిపించాయి. ఇలాంటి వార్తల పట్ల అల్లు అర్జున్ విచారం వ్యక్తం చేసి, అసలేం జరిగిందో వివరణ ఇచ్చారు. ‘‘అర్ధరాత్రి సమయంలో నేను నా వెహికల్ డ్రైవ్ చేస్తూ వస్తుండగా పోలీసులు ఆపారు. నన్ను బ్రీత్ అనలైజర్ ఊదమన్నారు. అయితే మీడియా ముందు అలా ఊదడం ఇబ్బందిగా అనిపించి నేను ఆ విషయాన్ని పోలీసులకు తెలిపాను. పోలీసులు నన్ను మీడియా ముందు నుంచి పక్కకి తీసుకెళ్ళి బ్రీత్ అనలైజ్ పరీక్ష చేశారు. ఆ పరీక్షలో నేను తాగలేదని తెలియడంతో నన్ను వెళ్ళిపొమ్మన్నారు. ఆ సమయంలో నేను తాగి వున్నటయితే పోలీసులు వదిలిపెట్టేవారే కాదు. అయితే పలు వెబ్‌సైట్లలో నేను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిపోయానని వార్తలు రాసి, వీడియోలు పెట్టడం దారుణం. నేను తాగిడ్రైవ్ చేయను. ఒకవేళ మద్యం సేవిస్తే నడుచుకుంటూనో, ఆటోలోనో వెళ్తాను. లేదా ఎవర్నయినా డ్రాప్ చేయమని అడుగుతాను’’ అని అల్లు అర్జున్ అన్నారు.

సమగ్ర సర్వే... జూనియర్ ఎన్టీఆర్... లగడపాటి...

  సినీ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మంగళవారం జూబ్లీహిల్స్లో తన నివాసానికి వచ్చిన ఎన్యుమరేటర్కు తమ కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు అందచేశారు. జూనియర్ ఎన్టీఆర్ కుమారుడికి సోమవారం నాడే పేరు పెట్టారు. సర్వేలో జూనియర్ కుమారుడు అభయ్ రామ్ పేరు కూడా నమోదు చేశారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇంట్లో లేకపోవటంతో ఎన్యుమరేటర్ వివరాలు నమోదు చేసుకోకుండానే వెనుతిరిగారు. కుందన్బాగ్ ఆఫీసర్స్ కాలనీలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తన వివరాలు నమోదు చేయించుకున్నారు. అలాగే జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ రాజేంద్ర నగర్లో ఎన్యుమరేటర్లకు వివరాలు వెల్లడించారు.

సర్వే ఎఫెక్ట్... గర్భిణికి సమస్య...

  సమగ్ర కుటుంబ సర్వే ఫలితంగా మెదక్ జిల్లాలో ఓ మహిళ పురిటినొప్పులతో ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంది. మెదక్ జిల్లా శివంపేటకి చెందిన జ్యోతి అనే గర్భిణి పురిటి నొప్పులతో మంగళవారం ఉదయం ఏడు గంటలకు నరసాపూర్ ఆస్ప్తత్రికి అయితే డాక్టర్లు లేరంటూ సిబ్బంది ఆమెను తిప్పి పంపారు. సమగ్ర కుటుంబ సర్వే ఉండటం వల్ల సిబ్బంది ఎవరూ రారని చెప్పారు. వాస్తవానికి వైద్యసేవల లాంటి అత్యవసర సేవలకు సర్వే నుంచి మినహాయింపు ఇచ్చారు. అయినా వైద్యులు సర్వే పేరు చెప్పి విధులకు హాజరు కాలేదు. కనీసం ఆస్పత్రిలో నర్సులు, హెడ్ నర్సు ఉండాల్సి ఉన్నా, సర్వే కోసం వాళ్లు తమ తమ ఇళ్లకు వెళ్లినట్లు చెబుతున్నారు. కనీసం ప్రైవేటు ఆస్పత్రులు కూడా ఏవీ తెరవకపోవడంతో పురిటినొప్పులతో బాధపడుతున్న జ్యోతి నడిరోడ్డుమీదే ఉండిపోవాల్సి వచ్చింది.

యు.పి.లో వరదలు... 49 మంది మృతి

  ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటి వరకు వరదల్లో మరణించిన వారి సంఖ్య 49కి చేరింది. తొమ్మిది జిల్లాలో ఇంకా వరద ఉధృతి తీవ్రంగా ఉంది. బహరైచ్ జిల్లాలో 22మంది, శ్రవస్తి జిల్లాలో 10మంది, బలరామ్పూర్ జిల్లాలో ఇద్దరు, లఖింపూర్ జిల్లాలో 11మంది, సితాపూర్ జిల్లాలో నలుగురు వ్యక్తులు వరద కారణంగా మరణించారు. ఇప్పటికీ 15 వందల గ్రామాలు నీట మునిగి వున్నాయి. వరద సహాయం నిమిత్తం రాష్ట్రప్రభుత్వం కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు, పోలీసులు, జాతీయ విపత్తు సహాయక సిబ్బంది....సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కాగా రాప్తీ, సరయు, ఘాఘ్ర, శారద తదితర నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.

దొంగనోట్ల ఎల్లంగౌడ్ లొంగిపోయాడా?

  హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన నకిలీ నోట్ల కేసులో ప్రధాన నిందితుడు ఎల్లంగౌడ్ అరెస్టయ్యాడు. ఎల్లంగౌడ్‌ని ఎస్ఓటీ పోలీసులు మహారాష్ట్రలో అరెస్టు చేశారు. కొద్ది రోజుల క్రితం ఒక పోలీసు కానిస్టేబుల్ మీద కాల్పులు జరిపిన కేసులో ఎల్లం గౌడ్ నిందితుడు. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి పరారీలో వున్న ఎల్లంగౌడ్‌ని ఎంతో పరిశోధించి అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు. ఎల్లం గౌడ్ తన భార్యకు ఫోన్ చేస్తూ వుండటంతో అతని ఫోన్‌ని ట్రేస్ చేసి మహారాష్ట్రలో అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఎల్లంగౌడ్‌ను పోలీసులు అరెస్టు చేయలేదని, అతనే లొంగిపోయాడన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎల్లంగౌడ్ పట్టుబడటంలో పోలీసుల గొప్ప ఏమీ లేకపోయినా ఆ క్రెడిట్‌ని తమ ఖాతాలో వేసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తు్న్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఊతకర్ర సహాయంతో బాలకృష్ణ....

  నందమూరి బాలకృష్ణ ఇటీవల ఓ సినిమా షూటింగ్‌లో బైక్ మీద నుంచి జారి పడి గాయపడిన విషయం తెల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ తొలిరోజు సమావేశాలకు బాలకృష్ణ ఊతకర్ర సాయంతో వచ్చారు. బాలకృష్ణని టీడీపీ, వైసీపీలకు చెందిన శాసనసభ్యులు ఆయనను పరామర్శించారు. ఆయనకు గాయం ఎలా అయ్యిందో... ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అడిగిన వారందరికీ సమాధానం చెబుతూ బాలకృష్ణ చాలా ఉత్సాహంగా కనిపించారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బాలకృష్ణ, నటి రోజాలు పిచ్చాపాటిగా మాట్లాడుకుంటూ బయటకు రావడం విశేషం. రోజా టీడీపీలో చేరబోతున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో బాలకృష్ణ, రోజా ఇలా ముచ్చటించుకోవడం ఆసక్తికరంగా మారింది.

ప్రేమించలేదని గొంతుకోసింది..

  సాధారణంగా ప్రేమించని పాపానికి యువతుల మీద దాడులు జరుగుతూ వుంటాయి. అందుకు పూర్తిగా రివర్స్‌గా వున్న సంఘటన కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో జరిగింది. రమణి అనే యువతి తనకు అన్న వరస అయ్యే యువకుడి మీద మనసుపడింది. ప్రేమించానని చెప్పింది. అయితే రాము మాత్రం తప్పు అన్నాడు. అయినా రమణి వినలేదు. వెంటపడి వేధించడం మొదలుపెట్టిది. అయితే రాము మాత్రం ఆమె ప్రేమకు ససేమిరా అంటూ వచ్చాడు. మొన్నీమధ్యే రాము తన మేనకోడలిని పెళ్ళి చేసుకున్నాడు. దాంతో ఆగ్రహించిన రమణి సోమవారం సాయంత్రం ఆమె నీతో మాట్లాడాలి, పని ఉందంటూ అతడిని వేదాద్రి వద్దకు పిలిపించింది. అక్కడే అతడిపై కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. అక్కడినుంచి నేరుగా ఆస్పత్రికి వచ్చిన రాము.. చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లిపోయాడు. ఇంట్లో వాళ్లు ఏం జరిగిందని అడిగినా ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నాడు. అయితే మరింత గట్టిగా అడగడంతో అప్పుడు అసలు విషయం చెప్పాడు. దాంతో కుటుంబ సభ్యులు అతడిని వెంటనే విజయవాడ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

మెదక్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి కోదండరాం?

  మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పోటీ చేయనున్నారా? ఈ ఆలోచన కోదండరాంకి వుందోలేదో గానీ, కాంగ్రెస్ పార్టీకి మాత్రం వచ్చింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిశీలిస్తోంది. సోమవారం ఏఐసీసీ పరిశీలకుడు ఆర్‌సీ కుంతియా సమక్షంలో గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు ఈ ప్రతిపాదన వచ్చింది.మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాంను నిలబెడితే బాగుంటుందని పార్టీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి ప్రతిపాదించారు. గత ఎన్నికల్లో ఉద్యోగులంతా టీఆర్‌ఎస్ పక్షాన నిలిచి గెలిపిస్తే కేసీఆర్ మాత్రం కోదండరాంను పక్కనపెట్టడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. చిన్నారెడ్డి ప్రతిపాదన పట్ల పలువురు నేతలు సానుకూలంగా స్పందించారు.