అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ

  హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన భారతీయ జనతాపార్టీ జాతీయ అమిత్‌ షాతో పవన్‌ కళ్యాణ్ భేటీ అయ్యారు. షాను పవన్ బేగంపేటలోని టూరిజం హోటల్‌లో గురువారం రాత్రి 10.45 గంటల ప్రాంతంలో కలిశారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి బిజెపి, జనసేన మధ్య రహస్యమైన అవగాహన కుదిరిందని తెలుస్తోంది. మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో బిజెపి, తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేయడంపైనే వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పవన్‌ కళ్యాణ్‌ సేవలను వినియోగించుకోవాలని బిజెపి, టిడిపి భావిస్తున్నాయి. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికలలో జనసేన కూడా పోటీ చేసే అంశాన్ని కూడా పరిశీలించారని తెలుస్తోంది. అమిత్ షాతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ రెండు రాష్ట్రాలకు సంబంధించి బిజెపి, జనసే మధ్య ఒక ప్రతిపాదన వచ్చిందన్నారు. ఆ ప్రతిపాదన ఏమిటో ఇప్పుడే చెప్పనన్నారు. 

లవర్లకి, భార్యలకి ‘టూర్’లలో నో ఎంట్రీ

  ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో విరాట్ కోహ్లీ ఘోర వైఫల్యానికి ప్రధాన కారణం టూర్ సందర్భంగా విరాట్ కోహ్లీ తన ప్రియురాలు అనుష్క శర్మతో ప్రేమ కలాపాలు నడపటమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టూర్‌కి తనతోపాటు అనుష్క శర్మ కూడా వచ్చేలా విరాట్ కోహ్లీ బీసీసీఐ నుంచి అధికారికంగా అనుమతి తీసుకున్నాడు. సాధారణంగా ఇలాంటి అనుమతి క్రికెటర్ల భార్యలకు మాత్రమే ఇస్తారు. విరాట్ కోహ్లీ ప్రియురాలికి కూడా అధికారికంగా అనుమతి ఇవ్వడంపై దుమారం రేగింది. దాంతో కళ్ళు తెరిచిన బీసీసీఐ టూర్లకు వెళ్ళే క్రీడాకారులు తమ వెంట లవర్లని కాదు కదా, సొంత భార్యలని కూడా తీసుకుని వెళ్ళకూడదని బీసీసీఐ నిబంధన విధించింది.

తెలంగాణ రాష్ట్రం న్యాయమైన ఆకాంక్ష.. అందుకే మద్దతు...

  ‘ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ప్రజల న్యాయమైన కోరిక అందుకే భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది’ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. హైదరాబాద్ వచ్చిన ఆయన ఒక బహిరంగ సభలో షా ప్రసంగించారు. జార్ఖండ్, చత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను బీజేపీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా విభజించిందని, అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో మాత్రం యుపీఏ ప్రభుత్వం రెండు రాష్ట్రాల మధ్య, ప్రజల మధ్య చిచ్చుపెట్టిందని ఆయన అన్నారు. తెలంగాణ అమరవీరులకు అమిత్ షా బీజేపీ తరఫున ఘన నివాళులు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. నిజాంను తరిమికొట్టిన ఘనత పటేల్‌దేనని, పటేల్ లేకుంటే భారత్‌లో హైదరాబాద్ విలీనం అయ్యేదికాదని అమిత్ షా అన్నారు. సర్దార్ పటేల్ లక్ష్యాన్ని నరేంద్ర మోడీ పూర్తి చేస్తారన్న ఆశాభావాన్ని షా వ్యక్తం చేశారు.

‘నీగ్రో’ అన్నాను.. అయాం వెరీ సారీ... గోవా సీఎం

  గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తాను ‘నీగ్రో’ అనే పదాన్ని ఉపయోగించినందుకు అసెంబ్లీలో క్షమాపణలు చెప్పారు. సాధారణంగా ఆఫ్రికన్ జాతీయులను ‘నీగ్రో’ అని పిలవడం అమర్యాదకరం.. వారిని ‘బ్లాక్స్’ అనాలి. గోవా ముఖ్యమంత్రి గోవా అసెంబ్లీలో గోవా ప్రభుత్వం అదుపులో వున్న విదేశీయుల గురించి వివరిస్తూ, ఓ గుర్తు తెలియని ఆఫ్రికన్ నీగ్రో వ్యక్తిని కలాంగుటే గ్రామం వద్ద అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. దీనిపై విపక్షాలు విమర్శలు చేశాయి. ‘నీగ్రో’ అనే పదం జాతి వివక్ష కిందికి వస్తుందని మండిపడ్డాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ దీనిపై స్పందిస్తూ... ఇలాంటి పదాల వాడకంతో విదేశీ యాత్రికులకు ప్రతికూల సందేశాలు వెళతాయంది. దీనిపై సీఎం పారికర్ వివరణ ఇస్తూ.. ఇది పోలీస్ డిపార్ట్‌మెంటు తప్పిదమని, ఆ విభాగంలోని ఓ క్లర్కు సదరు ఫైల్లో నీగ్రో అని పేర్కొన్నాడని తెలిపారు. అయినప్పటికీ నీగ్రో అనే పదం ఉపయోగించినందుకు తాను క్షమాపణలు కోరుతున్నానని మనోహర్ పారికర్ అన్నారు.

పరమ డొక్కు ఆటో... 3 కిలోల బంగారు బిస్కెట్లు

  బెంగుళూరు రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు అటుగా వచ్చిన ఓ డొక్కు ఆటోని ఆపారు. ఆటోని తనిఖీ చేసిన పోలీసులు ఆశ్చర్యంతో నోళ్ళు తెరిచారు. కారణం, ఆ ఆలోలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు కిలోల బంగారు బిస్కెట్లు వున్నాయి మరి. బెంగళూరు నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు బిస్కట్ల రూపంలో ఉన్న బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు ఈ సందర్భంగా కనుగొన్నారు. ఆటోలో వున్న కోయంబత్తూరుకు చెందిన నటరాజ్, బాల, రాంకుమార్ల వద్ద ఉన్న సూట్‌కేసులో మూడు కిలోల బంగారు బిస్కట్లు, 42 లక్షల రూపాయల నగదు ఉన్నట్లు గుర్తించారు. వాటికి సంబంధించి వారి వద్ద ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేవు. పోలీసులు, ఆదాయపన్ను శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు.

హైదరాబాద్‌లో బీజేపీ అమిత్ షా సందడి

  బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ అంతర్జాయతీయ విమానాశ్రయంలో అమిత్ షాకి బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ఆయన గ్రేటర్ హైదరాబాద్‌కు సంబంధించిన బీజేపీ నాయకులతో ఆయన చర్చలు జరిపారు. ఈ భేటీలో ప్రధానంగా గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి చర్చలు జరిపారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలని, దీనికి సంబంధించిన నేతలకు దిశ నిర్దేశం చేస్తారని తెలుస్తోంది. కాగా, అమిత్ ‌షా సమక్షంలో మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ భారతీయ జనతాపార్టీలో చేరారు.

మెదక్ లోక్‌సభ స్థానం నుంచి జగ్గారెడ్డి?

  మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ మాజీ శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ నేపథ్యంలో మెదక్ లోక్‌సభ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి జగ్గారెడ్డి సిద్ధపడుతున్నారని తెలిసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఎదురొడ్డి నిలబడగల నాయకుడు జగ్గారెడ్డేనని కాంగ్రెస్ అధిష్టానం భావించడం వల్ల మెదక్ టిక్కట్ ఆయనకే దక్కే అవకాశం వుందన్న ప్రచారం జరుగుతోంది. ఇక మెదక్ లోకసభ సీటు నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను పోటీకి దించాలని కూడా కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

కెన్యాలో ఎబోలా.. తెలుగు వ్యక్తి మృతి

ఆఫ్రికన్ దేశాలను ప్రమాదకరమైన ఎబోలా వైరస్ గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వైరస్ కారణంగా కెన్యాలోని ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మరణించారు. మృతుడు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం చిటుకురాళ్లు గ్రామానికి చెందిన గజేందర్ రెడ్డిగా గుర్తించారు. ఈయనకు నాలుగు రోజుల క్రితం ఈ వైరస్ సోకిందని తెలుస్తోంది. వైరస్ కారణంగా విషజ్వరం పెరిగిపోయి ఆయన మరణించినట్టు తెలుస్తోంది. గజేందర్‌రెడ్డి భార్యాపిల్లలు కెన్యా నుంచి స్వదేశానికి బయల్దేరి గురువారం ఉదయం 10 గంటలకు బెంగళూరుకు వచ్చారు. అయితే వారు ఆరోగ్యంగా వున్నట్టు తెలుస్తోంది. ఎబోలా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. పశ్చిమాఫ్రికాలోని గినియా, లైబీరియా, సియార్రా లియోన్, నైజీరియా దేశాల్లో ప్రబలిన భయానకమైన ఎబోలా వైరస్ కారణంగా మరణించినవారి సంఖ్య 1,229కి చేరినట్టు తెలుస్తోంది.

కళ్ళంలో కారంకొట్టి 11 లక్షలు చోరీ...

  కృష్ణాజిల్లా గుడివాడలోని రాజేంద్రనగర్ బ్యాంక్ అధికారి ఇంట్లో దుండగులు దోపిడీ చేశారు. బ్యాంక్ అధికారి రాంప్రసాద్ కళ్లల్లో కారం కొట్టి ఏటీఎంలో ఉంచేందుకు దాచిన రూ.11 లక్షలు దోచుకెళ్లారు. పల్సర్ బైక్ వచ్చిన వచ్చిన ఇద్దరు దుండగులు ఈ దోపిడీకి పాల్పడ్డారని బాధితుడు రాంప్రపాద్ తెలిపారు. ఇల్లు అద్దెకు ఉందా అంటూ వచ్చిన దుండగులు తాను లేదని చెప్పేలోపే తన కంట్లో కారం చల్లి తన ఇంట్లోకి చొరబడి డబ్బు ఎత్తుకుపోయారని వివరించారు. వారిని పట్టుకునేందుకు తాము చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలిపారు. ఈ సంఘటన మీద పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విచారణ జరుపుతున్నారు.

సిగ్గుపడుతున్నా.. తలదించుకుంటున్నా.. జాకీచాన్

  హాలీవుడ్ నటుడు, కుంగ్ ఫూ స్టార్ జాకీచాన్ కుమారుడు, నటుడు అయిన జేసీ చాన్ ఈనెల 14వ తేదీన డ్రగ్స్‌ వినియోగిస్తూ దొరికిపోయాడు. క్రమశిక్షణతో కెరీర్ మలచుకున్న జాకీచాన్ కుమారుడు ఇలాంటివాడని తెలుసుకుని ప్రపంచం మొత్తం విస్తుపోయింది. చాకీచాన్ గతంలో చైనాలో డ్రగ్స్‌కి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు ఆయన కుమారుడే డ్రగ్స్ వినియోగిస్తూ దొరికిపోవడం కంటే అవమానకరమైన విషయం మరొకటి వుంటుందా? తన కుమారుడు ఇలా దొరికిపోయిన విషయం తెలుసుకున్న జాకీచాన్‌ షాక్‌కి గురయ్యారు. ఇన్నిరోజులూ బయటి ప్రపంచానికి ముఖాన్ని చూపించలేకపోయారు. ఇప్పుడు మనసు దిటవు చేసుకుని ఈ సంఘటన మీద తన అభిప్రాయాన్ని తెలిపారు. ‘‘నా కుమారుడు జేసీ చాన్ చేసిన ఘనకార్యం వల్ల నేను సిగ్గుతో తల దించుకుంటున్నాను. ఈ వార్త వినగానే నాకు చెప్పలేనంత కోపం వచ్చింది. ఇంతకాలం ప్రజల ముందు తలెత్తుకుని జీవించిన నేను ఇప్పుడు సిగ్గుతో తల వంచుకుంటున్నాను. నన్ను అందరూ క్షమించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు నేను చాలా విషాదంలో మునిగిపోయి వున్నాను. జేసీ చాన్ తల్లి అయితే దు:ఖంలో మునిగిపోయి వున్నారు. జేసీ చాన్ చేసిన తప్పు నుంచి నేటి యువతరం పాఠాలు నేర్చుకుని సక్రమమైన మార్గంలో నడుస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు.

దొంగలు బాబోయ్ దొంగలు...

  ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో గురువారం నాడు దొంగలు చెలరేగిపోయారు. హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి ఐసీఐసీఐ బ్యాంకు నుంచి ఓ ఖాతాదారుడు 9 లక్షలు డ్రా చేసుకుని బయటకి వచ్చాడు. తనస్కూటర్ డిక్కీలో డబ్బు పెట్టుకున్న తర్వాత చూస్తే స్కూటర్ టైర్‌కి పంక్చర్ పడి వుంది. స్కూటర్‌ని నెట్టుకుంటూ వెళ్ళి పంక్చర్ వేయిస్తూ వుండగా దొంగలు అతని కన్నుగప్పి డిక్కీలో వున్న 9 లక్షలను దోచుకుపోయారు.   అలాగే హైదరాబాద్‌లోని బేగం బజారులో ఆటోలో వెళ్తున్న వ్యాపారులపై దాడి చేసి వారి వద్ద నుంచి 2 కేజీల బంగారు ఆభరణాలను దుండగులు అపహరించుకుని పోయారు.   తెనాలి చెంచుపేటలో ఒక వ్యక్తి బ్యాంకు నుంచి 8 లక్షల రూపాయలను డ్రా చేసుకుని వస్తుండగా, దొంగలు ఆ వ్యక్తి చేతిలోంచి సంచిని లాక్కుని పారిపోయారు.   అనంతపురం జిల్లాలోని లోని ఓ దేవాలయంలో దొంగలు పడి హుండీలోని డబ్బుతోపాటు 20 లక్షల విలువైన నగలు, వెండి సామానును దోచుకుని పోయారు.

రంగంలోకి నారా లోకేష్... ఆనం బ్రదర్స్ టీడీపీ ఎంట్రీ ఖాయం

  నెల్లూరు జిల్లాలో రాజకీయంగా బలం కలిగిన ఆనం బ్రదర్స్ గత ఎన్నికలలో తెలుగుదేశం, మోడీ ధాటికి తట్టుకోలేక ఓడిపోయారు. ఇప్పుడు ఈ ఇద్దరు బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై కొట్టి తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి సిద్ధమవుతున్నారు. రాజకీయంగా రెబల్ అయిన ఆనం వివేకానందరెడ్డి ఎన్నికల ముందు నుంచీ కాంగ్రెస్ పార్టీని తీవ్రస్థాయిలో విమర్శిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన విభజన పాపం ఆయనతోపాటు ఆయన సోదరుడు రామనారాయణరెడ్డిని కూడా ఓడించింది. అయితే అప్పటి నుంచి వివేకానందరెడ్డి కాంగ్రెస్ పార్టీని ఘాటుగా విమర్శిస్తూ వస్తున్నారు. ఆయన ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమన్న అభిప్రాయం జిల్లాలో వుంది. అయితే రామనారాయణరెడ్డి మనసులో ఏముందన్న విషయం మాత్రం నిన్నటి వరకూ బయటపడలేదు. ఇప్పుడు ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. అన్నదమ్ములు ఇద్దరూ ఒకేసారి తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. అయితే ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో వున్న ఆనం సోదరులు తెలుగుదేశం పార్టీలో చేరడం అక్కడ స్థానికంగా వుండే తెలుగుదేశం నాయకత్వానికి కొంత ఇబ్బంది కలిగించే అంశం కావచ్చు. కొంత వ్యతిరేకత కూడా ఎదురయ్యే అవకాశం వుంది. అందుకే, ఆనం సోదరుల తెలుగుదేశంలో చేరిక సాఫీగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగే బాధ్యతను నారా లోకేష్ తీసుకున్నట్టు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో ఆనం సోదరుల తెలుగుదేశంలోకి ఆగమనాన్ని వ్యతిరేకిస్తున్న వారిని బుజ్జగించే పనిలో ప్రస్తుతం లోకేష్ ఉన్నట్టు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో బుజ్జగింపులు పూర్తయి, ఆనం బ్రదర్స్ తెలుగుదేశంలో చేరడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

గవర్నర్ తిరుగుబాటు.. కేంద్రానికి నోటీసులు..

  యుపీఏ హయాంలో గవర్నర్ పదవులు పొందిన కొంతమందిని ఎన్డీయే ప్రభుత్వం తన పరిపాలనా సౌలభ్యం కోసం సాగనంపుతూ వస్తోంది. కొంతమంది బుద్ధిగా ఇంటికి వెళ్ళిపోతే కొంతమంది మాత్రం తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. వారిలో ఉత్తరాఖండ్ గవర్నర్ అజీజ్ ఖురేషీ ఒకరు. తనను గవర్నర్ పదవి నుంచి తొలగించే అర్హత కేంద్ర ప్రభుత్వానికి లేదంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును ఐదుగురు న్యాయమూర్తులున్న రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేశారు. ఈ ధర్మాసనం ఈ విషయంలో ఆరు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

గవర్నర్‌కి అధికారాలు వద్దు: టీఆర్ఎస్ ఎంపీలు

  టీఆర్ఎస్ ఎంపీలు గురువారం నాడు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ని కలిశారు. రాష్ట్ర విభజన బిల్లులో స్పష్టంగా పేర్కొన్న విధంగా హైదరాబాద్‌లో శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్ చేతిలో వుంచడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, అలా చేయడానికి వీల్లేదని టీఆర్ఎస్ ఎంపీలు రాజ్‌నాథ్‌సింగ్‌కి విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌కి ప్రత్యేక అధికారాలు ఇవ్వడం అంటే తెలంగాణ రాష్ట్ర హక్కులను హరించడమేనని వారు పేర్కొన్నారు. సెక్షన్ - 8 కింద రాష్ట్ర అధికారాలు లాక్కోవడం సరికాదని వాదించారు. ఎన్డీయే ప్రభుత్వం సమాఖ్య విధానాన్ని గౌరవించాలని చెప్పారు. అయితే అయితే చట్ట ప్రకారమే గవర్నర్ నిర్ణయాలు తీసుకుంటారని రాజ్‌నాథ్ సింగ్ ఈ సందర్భంగా వారికి చెప్పారు. తాము విభజన చట్టంలో వున్న అంశాన్ని అమలు చేయాలని అనుకుంటున్నామే తప్ప సమాఖ్య విధానానికి ఎంతమాత్రం వ్యతిరేకంగా వెళ్ళడం లేదని వారితో అన్నారు.