బెయిల్ వద్దు.. జైల్లోనే ఉంటా!
posted on Aug 6, 2024 @ 11:35AM
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టై తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె తన డిఫాల్ట్ బెయిలు పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. ఈ కేసులో తనకు బెయిలు ఇవ్వాలంటూ దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ సోమవారం (ఆగస్టు 5) విచారణకు వచ్చింది. అయితే కవిత తరఫు సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా వేయాల్సిందిగా కవిత తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో కోర్టు కవిత బెయిలు పిటిషన్ విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
అయితే ఈ లోగా తన బెయిలు పిటిషన్ ను కవిత ఉపసంహరించుకున్నారు. కవిత బెయిలు పిటిషన్ ఉపసంహరణ రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది. ఇప్పటికే పలు కారణాలు చూపుతూ కవిత పలుమార్లు దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్లను కోర్టులు తిరస్కరించాయి. ఒక దశలో పదే పదే బెయిలు పిటిషన్లు దాఖలు చేస్తున్నందున న్యాయమూర్తి తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ, సీబీఐ చార్జిషీట్ దాఖలు చేశాయి. దీంతో కవిత డిఫాల్ట్ బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో బుధవారం (ఆగస్టు 7) విచారణకు రానుండగా కవిత మంగళవారం (ఆగస్టు 6) తన బెయిలు పిటిషన్ ను ఉపసం హరించుకున్నారు. కవిత తన డిఫాల్ట్ బెయిలు పిటిషన్ న ఉపసంహరించుకోవడం సంచల నంగా మారింది. బెయిలు పిటిషన్ ఉపసంహరణ వెనుక ఉద్దేశమేమిటన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.