సురేష్ మృతితో గౌరెల్లిలో టెన్షన్ టెన్షన్... రాత్రికి రాత్రే అంత్యక్రియలకు పోలీసుల ఒత్తిడి...

  తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు సురేష్ మృతితో అతని స్వగ్రామం గౌరెల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 65శాతం కాలిన గాయాలతో నాలుగు రోజులుగా ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురేష్ మరణించడంతో ఆగమేఘాల మీద పోస్టుమార్టం పూర్తి చేయించిన పోలీసులు... అప్పటికప్పుడు అంబులెన్స్ లో గౌరెల్లి తరలించారు. అయితే, డెడ్ బాడీ ఇంటికి చేరడంతో గ్రామస్తులు, కుటుంట సభ్యులు, బంధువులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఇక, సురేష్ అంత్యక్రియల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. గౌరెల్లి గ్రామంలో పెద్దఎత్తున బలగాలను మోహరించారు. అయితే, సురేష్‌... అంత క్రూరుడు కాదని, అతడ్ని ఎవరో రెచ్చగొట్టి... విజయారెడ్డిని హత్య చేయించారని కుటుంబ సభ్యులు అంటున్నారు. సురేష్‌ను రెచ్చగొట్టింది ఎవరో తేల్చాలని ఫ్యామిలీ మెంబర్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే, సురేష్ కాల్ డేటా ఆధారంగా, ఇప్పటికే కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సురేష్ కాల్ డేటాలో పలువురు రియల్టర్లు ఉండటంతో వాళ్లందరినీ పిలిచి విచారిస్తున్నారు. ఇదిలాఉంటే, విజయారెడ్డి మర్డర్ కి రెండ్రోజుల ముందు ఆమె ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. రెక్కీ నిర్వహిస్తూ... విజయారెడ్డి భర్తతో సురేష్ మాట్లాడినట్లు కూడా ఆధారాలు సేకరించారు. ఇక, సురేష్ మృతికి ముందు పోలీసులు స్టేట్ మెంట్ రికార్డు చేశారు. పట్టా ఇవ్వలేదన్న కోపంతోనే తహశీల్దార్‌ విజయారెడ్డిని సజీవదహనం చేసినట్లు సురేష్ తన వాంగ్మూలంలో తెలిపాడు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా... పట్టా ఇవ్వకపోవడంతోనే చంపేసినట్లు చెప్పాడు. నవంబర్‌ నాలుగున మధ్యాహ్నం చివరిసారిగా విజ్ఞప్తి చేశానని... అయినా విజయారెడ్డి పట్టించుకోకపోవడంతో.... తిరిగి పెట్రోల్‌ డబ్బాతో వెళ్లి... తగలబెట్టానని స్టేట్‌మెంట్ ఇచ్చాడు.

అవినీతిలో ముందంజలో ఉన్న రెవిన్యూశాఖ: ఏసీబీ

  అవినీతికి పర్యాయపదంగా మారిపోయేలా వ్యవహరిస్తొంది రెవిన్యూశాఖ. వీఆర్వో దగ్గర నుంచి ఆర్డీవో వరకు చేయి తడపనిదే కనికరించి పరిస్థితి లేదు. ఏసీబీ రైడ్స్ లో పట్టుబడుతున్న వారిలో సగానికి సగం మంది రెవెన్యూ ఉద్యోగులే ఉన్నారంటే పరిస్థితి తీవ్రత ఎంతుందో  అర్థం చేసుకోవచ్చు. ఈ రెండేళ్లలో ఏసీబీకి చిక్కిన ప్రభుత్వ ఉద్యోగులు 207 మంది ఉంటే, వారిలో యాభై మంది రెవెన్యూ ఉద్యోగులే ఉండడం ఆశ్చర్యం. నాలుగు లక్ష రూపాయల లంచం తీసుకుంటూ కేశంపేట తహసీల్దార్ లావణ్య, వీఆర్వో అనంతయ్య ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. బాచుపల్లి తహసీల్దార్ శ్రీదేవి మూడు లక్షల లంచం తీసుకుంటూ దొరకగా, రెండు లక్షల లంచం తీసుకుంటూ ఇల్లంతకుంట తహసీల్దార్ రవి రాజ్ కుమార్, వీఆర్ కె రామకృష్ణ పట్టుబడ్డారు. ఇక మద్దివంచ వీఆర్వో శివరావు నలభై వేల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. కొత్తకోట ఆర్డీవో, తాసీల్దార్ కలిసి లక్ష యాభై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అవీనీతి రెవిన్యూ అధికారుల చిట్టా భారీగానే ఉంది అని మనకు తెలుస్తోంది.  ఇంత మంది లంచావతారులు ఉంటే ఇప్పటి వరకు వీళ్ల పేర్లెందుకు  బయటకు రాలేదు ప్రశ్నార్ధకంగా ఉంది. ఏపీపీ లెక్కల ప్రకారంగా నాలుగు లక్షల రూపాయలు ల్యాండ్ మ్యుటేషన్ కోసం అటూ ఇటూ తిప్పి రైతుకు పాసుబుక్కు పట్టా ఇవ్వడం కోసం కూడా లంచాలు తీసుకుంటున్న విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత సంవత్సరంలో కూడా రెవెన్యూ అధికారులే అవినీతిలో ప్రధమ స్థానంలో ఉండడం గమనార్హం. మొన్న జరిగిన తహసీల్దార్  ఘటన ఇంకా మరవక ముందే తాజాగా నిన్న కూడా మెడ్చల్ కలెక్టర్ కార్యాలయంలో పంచాయతిరాజ్ అధికారులకు లక్ష రూపాయిలు లంచం తీసుకుంటూ దొరకడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రెవెన్యూ శాఖలో పెద్ద ఎత్తున ఉన్న అవినీతి ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా మారే అవకాశాలు భారీగానే ఉన్నాయి.

సొంత ఇంటి మేకోవర్ కోసం 16కోట్లా? జగన్ పాలనపై నేషనల్ మీడియా ఫైర్...

  మీడియాను కంట్రోల్ చేయడానికి జగన్ సర్కారు జీవోలు తెచ్చినా జాతీయ ఛానెళ్లు మాత్రం ఏకిపారేస్తున్నాయి. ఎన్నికలకు ముందు... ఎన్నికల సమయంలో జగన్ కు ఓ రేంజ్ లో హైప్ ఇచ్చిన ఛానెళ్లే ఇప్పుడు... వైసీపీ పాలనలో తప్పులను... మిస్ మేనేజ్ మెంట్ ను... జగన్మోహన్ రెడ్డి అనుభవరాహిత్యాన్ని ఎండగడుతున్నాయి. ముఖ్యమంత్రిగా ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటూ... ఒక్క పైసా కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయనంటూ లెక్చర్లు దంచికొడుతున్న జగన్మోహన్ రెడ్డి... తాడేపల్లిలోని తన ఇంటి మేకోవర్ కోసం 15.65కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేశారంటూ లెక్కలతో సహా వివరిస్తూ కథనాలు ప్రసారం చేస్తున్నాయి. దుబారాను అరికట్టి ప్రజాధనాన్ని సేవ్ చేస్తామని గొప్పగా చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి... దాదాపు 16కోట్ల రూపాయల ప్రజల డబ్బును తన సొంత ఇంటి మేకోవర్ కోసం ఖర్చు చేయడమేంటని నేషనల్ మీడియా దుమ్ముదులుపుతోంది. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయానికి వెళ్లే రోడ్ల విస్తరణ కోసం 5కోట్లు.... వ్యూయింగ్ కట్టర్ కోసం 3.25కోట్లు... సెక్యూరిటీ ఏర్పాట్ల కోసం 1.89కోట్లు... ఎలక్ట్రిక్ వర్క్ కోసం 3.65కోట్లు... ప్రజాదర్బార్ ఏర్పాట్ల కోసం 82.5లక్షలు... తాత్కాలిక ఏర్పాట్ల కోసం 22.5లక్షలు...  స్టాఫ్ మెయింటెనెన్స్ కి 8.5లక్షలు... ఇంటి కిటికీలు, తలుపుల కోసం 73లక్షలు.... ఇలా ఇప్పటివరకు మొత్తం 15.65 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తన సొంత అవసరాల కోసం దుర్వినియోగం చేశారంటూ కథనాలు ప్రసారం చేశాయి. అయితే, ఎన్నికల అఫిడవిట్ లో 510కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చూపిన జగన్మోహన్ రెడ్డి.... తన సొంత ఇంటి మేకోవర్ కోసం దాదాపు 16 ప్రజాధనాన్ని ఖర్చు చేయడం ఎంతవరకు సబబంటూ ప్రశ్నిస్తున్నాయి.

సామాన్య భక్తులపై కక్షగట్టిన టీటీడీ... అద్దె గదుల ధరలు అమాంతం పెంపు... 

  తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి సామాన్య భక్తులకు షాకిచ్చింది. శ్రీవారి దర్శనం దగ్గర్నుంచి వసతుల వరకు ప్రతి విషయంలోనూ సామాన్య-మధ్యతరగతి భక్తులను చిన్నచూపు చూసే టీటీడీ... సడన్ గా ఊహించని ఝలక్ ఇచ్చింది. సామాన్యులు ఉంటే అద్దె గదుల ధరలను ఒక్కసారిగా అమాంతం పెంచేసింది. తిరుమలలోని దాదాపు అన్ని గెస్ట్‌-హౌస్‌ల్లోని గదుల అద్దెలనూ రెట్టింపు చేసింది. తిరుమల నందకం అద్దె గదుల ధరను 600 నుంచి వెయ్యికి పెంచగా, కౌస్తుభం, పాంచజన్యంలో రూమ్స్‌‌ను 500 నుంచి వెయ్యి రూపాయలకి పెంచారు. అలాగే, కనీస వసతి ధరను వంద రూపాయలు చేశారు. అయితే, ఈ అద్దె గదుల ధరల పెంపు కేవలం తిరుమలలో మాత్రమే చేసింది. దాంతో తిరుపతిలో యథావిధిగా పాత ధరలే కొనసాగనున్నాయి. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి దివ్యసుందర రూపాన్ని క్షణకాలం చూసి ఆనందంతో పరవశించిపోతారు. అయితే, శ్రీవారి భక్తుల్లో ఎంతోమంది భాగ్యవంతులు ఉన్నా... ఎక్కువగా సామాన్య-మధ్యతరగతి వాళ్లే ఉంటారు. అంతేకాదు శ్రీవారి దర్శనం రోజుల తరబడి వేచి ఉండాల్సి రావడంతో... సాధారణ అద్దె గదులను ఆశ్రయిస్తారు. ముఖ్యంగా 100 రూపాయల గదులను తీసుకునేందుకు మొగ్గుచూపుతారు. కానీ, వంద రూపాయల గదులు తక్కువగా ఉండటం, అవి అందరికీ దొరకని పరిస్థితి ఉండటంతో... ప్రత్యామ్నాయంగా ఐదొందలు, ఆరొందల గదులను ఆశ్రయిస్తారు. అయితే, ఈ గదుల ధరలనే ఇప్పుడు టీడీపీ అమాంతం డబుల్ చేసింది. దాంతో, సామాన్య భక్తులు... టీటీడీ నిర్ణయంపై మండిపడుతున్నారు. సాధారణ భక్తులు ఉండే అద్దె గదుల ధరలను రెట్టింపు చేయడంతో.... ఆ అదనపు ఆర్ధిక భారాన్ని తట్టుకోవడం తమ వల్ల కాదంటున్నారు.  

వెళ్తూవెళ్తూ టీడీపీపై యామిని విమర్శలు... కమలం గూటికి చేరేందుకు సన్నాహాలు

  తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. ఎన్నికల తర్వాత సైలెంటైపోయిన సాదినేని యామిని టీడీపీకి గుడ్-బై చెప్పేసింది. యామిని టీడీపీకి రాజీనామా చేస్తుందని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతున్నా, ఇప్పుడు తెలుగుదేశం అధికారిక వాట్సప్ గ్రూప్ లో తన రాజీనామా లేఖను పోస్ట్ చేసింది. పార్టీలో అంతర్గత విభేదాలు... దేశం, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు... ఇతరత్రా బలమైన కారణాల వల్లే టీడీపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించింది. అయితే, తన రాజీనామా లేఖలో సాదినేని యామిని కీలక వ్యాఖ్యలు చేసింది. టీడీపీలో నేతల మధ్య సఖ్యత లోపించిందని, అనేక సమస్యలు, లోపాలు ఉన్నాయంది. టీడీపీకి రాజీనామా చేసిన సాదినేని యామిని... కొంతకాలంగా ఏపీ బీజేపీ చీఫ్ కన్నాతో యామిని చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే కాషాయ తీర్ధం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఎన్నికలైన నాటి నుంచే ఈ మాటలు వినిపించినా..... అప్పట్లో చంద్రబాబు బుజ్జగించడంతో ఆగిపోయిందని అంటారు. కానీ, ఇప్పుడు బీజేపీలోకి వెళ్లాలని డిసైడైందని, ఒకట్రెండు రోజుల్లో కమలదళంలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, యామినికి ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే, విమర్శలు, ప్రతివిమర్శలతో అతితక్కువ కాలంలోనే పేరు తెచ్చుకుంది సాదినేని యామిని. టీవీ డిబేట్స్ అయినా, ప్రెస్ మీట్స్ అయినా... టీడీపీ తరపున బలమైన వాయిస్ వినిపించింది. ముఖ్యంగా జగన్, పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. యామిని వాగ్దాటిని చూసి, తెలుగుదేశం కూడా నెత్తినపెట్టుకుంది. ఏళ్లతరబడి పని చేస్తున్న నేతలను కాదని, అప్పుడప్పుడే పార్టీలోకి వచ్చిన యామినికి అధికార ప్రతినిధి పదవి కట్టబెట్టింది. ఇక, చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ యామినిని ఎంతో ప్రోత్సహించారు. దాంతో టీవీ డిబేట్స్ అండ్ ప్రెస్ మీట్స్ లో ఆమె కనిపించని రోజే ఉండేది కాదు. అంతలా టీడీపీ వాయిస్ వినిపించింది యామిని. యామిని... టీడీపీకి రాజీనామా చేయడానికి అనేక కారణాలు వినిపిస్తున్నప్పటికీ... ఏదోవిధంగా అధికార పార్టీలో ఉండాలన్నదే ఆమె లక్ష్యమని అంటున్నారు. అందుకే, అప్పుడు టీడీపీలో చేరిందని... ఇప్పుడు కేంద్రంలో అధకార పగ్గాలున్న బీజేపీలో చేరబోతోందని తెలుగుదేశం నేతలు మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు అప్పుడు ఎంతమంది వారించినా వద్దంటున్నా నెత్తిమీద పెట్టుకున్నారని, ఇఫ్పుడవన్నీ పక్కనబెట్టి రాజీనామాచేసి వెళ్లిపోయిందని టీడీపీ మహిళా నేతలు మండిపడుతున్నారు.  

మీరు తేల్చుతారా? మమ్మల్ని తేల్చమంటారా? కేసీఆర్ సర్కారుకు హైకోర్టు వార్నింగ్

  మీరు తేల్చుతారా... మమ్మల్ని తేల్చమంటారా... అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించింది హైకోర్టు. వీలైనంత త్వరగా ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించాలని, లేదంటే తామే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని... తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వ తీరుపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసిన హైకోర్టు... ప్రభుత్వానికి అధికారం ఉన్నట్లే.... కోర్టులకు కూడా అధికారాలు ఉంటాయనే సంగతి మర్చిపోవద్దని వార్నింగ్ ఇచ్చింది. ఇక, ఆర్టీసీ స్థితిగతులు, బకాయిలపై ఆయా శాఖాధిపతులు సమర్పించిన లెక్కలపై హైకోర్టు మరోసారి తీవ్రస్థాయిలో మండిపడింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే... కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తెలుసా? లేదా? అంటూ అధికారుల్ని హెచ్చరించింది. ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండీ సునీల్‌ శర్మ... ఆర్ధికశాఖ ముఖ‌్య కార్యదర్శి రామకృష్ణారావు.... సమర్పించిన నివేదికలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయంటూ హైకోర్టు మండిపడింది. ఐఏఎస్‌లు... ఇలా కోర్టుకు అసంపూర్ణ నివేదికలు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించింది. అయితే, ప్రభుత్వ రికార్డుల ప్రకారమే తాము నివేదికలు ఇచ్చినట్లు అధికారులు... హైకోర్టుకు రిప్లై ఇవ్వడంతో... అలాగైతే, మొదటిసారి ఇచ్చిన నివేదికను పరిశీలించకుండానే ఇచ్చారా? అంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. ఇంత దారుణంగా తప్పుడు వివరాలు ఇచ్చిన అధికారులను తన సర్వీసులో చూడలేదంటూ హైకోర్టు సీజే ఆర్ఎస్‌ చౌహాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్ధికశాఖ... ఆర్టీసీ నివేదికల్లోని అంకెలు వేర్వేరుగా ఎందుకున్నాయంటూ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. సమస్యను తప్పుదోవ పట్టించేందుకు తెలివిగా గజిబిజి లెక్కలు... పదాలు వాడారని అభిప్రాయపడింది. అధికారుల నివేదికలను చూస్తుంటే... కోర్టునే కాకుండా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, రవాణాశాఖ మంత్రిని, రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా తప్పుదోవ పట్టించినట్లు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అధికారుల నివేదికలపై మరోసారి హైకోర్టు ఫైరవడంతో ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు వివరణ ఇచ్చారు. పొరపాటుకు మన్నించాలని కోరారు. అయితే, క్షమాపణ కోరడం సమాధానం కాదన్న హైకోర్టు.... వాస్తవాలు చెప్పాలంటూ చురకలు వేసింది.  నీటి పారుదల కోసం వేలకోట్ల రూపాయలు ఖర్చు చేస్తోన్న ప్రభుత్వం.... ఆర్టీసీ కార్మికుల కోసం 49కోట్లు చెల్లించడానికి ఎందుకు ఇబ్బంది పడుతోందని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజల కోసం ప్రభుత్వం తన స్టాండ్ మార్చుకోవాలని... మానవతా దృక్పథంతో ఆలోచించాలని సూచించింది. కార్మికుల డిమాండ్లను మరోసారి పరిశీలించి... చర్చలు జరపాలని ఆదేశించింది.  

కేంద్రం ఎంట్రీతో తెలంగాణ, ఏపీకి చిక్కులు... కొత్త మలుపు తిరిగిన ఆర్టీసీ కేసు...

  ఆర్టీసీ సమ్మె కేసులోకి కేంద్రం ఎంటరైంది. తెలంగాణ సర్కారుతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా హైకోర్టులో తన వాదనలు వినిపించింది. అసలు ఏపీఎస్-ఆర్టీసీ విభజనే జరగలేదన్న కేంద్రం... టీఎస్‌-ఆర్టీసీ కొత్తగా ఏర్పాటు చేశారా అంటూ ప్రశ్నించింది. ఏపీఎస్‌-ఆర్టీసీలో కేంద్రానికి 33శాతం వాటా ఉందన్న అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్... ఇప్పటికీ ఆర్టీసీ విభజన పూర్తి కాలేదని తెలిపారు. అసలు ఆర్టీసీ విభజనే జరగనప్పుడు... టీఎస్‌-ఆర్టీసీకి చట్టబద్ధత ఎక్కడుందంటూ వాదించింది. అంతేకాదు, నేరుగా టీఎస్-ఆర్టీసీకి ...ఏపీఎస్-ఆర్టీసీ ఆస్తులు బదిలీ అవుతాయనే వాదనల్లో నిజం లేదని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ...హైకోర్టుకు విన్నవించారు.  కేంద్రం వాదనలు విన్న హైకోర్టు... ఆర్టీసీ విభజన జరగకుండా అసలు నోటిఫికేషన్ ఎలా ఇస్తారంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే, కేంద్రం వాదనలపై సీఎస్ ఎస్కే జోషి, ఆర్టీసీ ఎండీ అండ్ ఏజీలు హైకోర్టుకు వివరణ ఇచ్చుకున్నారు. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం... టీఎస్‌-ఆర్టీసీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే, ఏపీఎస్‌-ఆర్టీసీ విభజన కోసం రెండు రాష్ట్రాలూ... కేంద్రం అనుమతి ఎందుకు కోరలేదని హైకోర్టు ప్రశ్నించింది. అసలు, ప్రభుత్వానికి సమస్యను పరిష్కరించే ఉద్దేశం ఉందా లేదా అంటూ హైకోర్టు నిలదీసింది. కేంద్రం తాజా వాదనతో ఇటు తెలంగాణ... అటు ఏపీ... రెండింటికీ తలనొప్పులు తప్పవనే మాట వినిపిస్తోంది. అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ వాదనలను విశ్లేషిస్తే... కేంద్రానికి చెప్పకుండా సొంతంగా నిర్ణయాలు కుదరవని అంటున్నారు. ఏపీఎస్‌-ఆర్టీసీలో కేంద్రానికి 33శాతం వాటా ఉందని, ఆర్టీసీ విభజన ఇంకా జరగలేదని చెప్పడం ద్వారా... తెలంగాణలో ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ గానీ, ఏపీలో విలీనం కానీ అంత ఈజీ కాదనే మాట వినిపిస్తోంది. మొత్తానికి, కేంద్రం ఎంట్రీతో ఆర్టీసీ కొత్త మలుపు తిరిగినట్లయ్యింది.

టిక్ టాక్ వల్ల భర్త చేతిలో ప్రాణాలు కోల్పోయిన భార్య...

  చిన్న పిల్లల నుంచి పెద్ద వారి దాక టిక్ టాక్ అంటే తెలియని వారే ఉండనంత క్రేజ్ సంపాదించుకుంది టిక్ టాక్. అయితే ఇటివల టిక్ టాక్ వల్ల చాలా మంది చిక్కుల్లో పడుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి ఘటనే మళ్ళీ చోటు చేసుకుంది. టిక్ టాక్ పచ్చని సంసారంలో చిచ్చు రేపింది, మంటలు పెట్టించింది. భార్యపై భర్తకు అనుమానం పెంచేలా చేసింది. చివరికి ఆ టిక్ టాక్ వీడియోలే ఆమెను భర్త చేతిలో హతం అయ్యేలా చేశాయి. సోషల్ మీడియా మాయలో కుటుంబం మొత్తం చిన్నాభిన్నమైంది. ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. టిక్ టాక్ వీడియోల మోజులో పడి జీవితాలు నాశనమవుతున్నాయి అనడానికి ఇది మరో ఉదాహరణ.  ప్రకాశం జిల్లా కనిగిరిలోని జవహర్ లాల్ వీధిలో భార్యాభర్తలు ఫాతిమా, పాచూ కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. కనిగిరి మండలం తాళ్ళూరుకు చెందిన ఫాతిమా కనిగిరి లో టైలర్ పని చేసే పాచూని వివాహం చేసుకుంది. కొంత కాలంగా భర్తతో ఫాతిమాకు విభేదాలు ఏర్పడ్డాయి. భార్య ఫాతిమాకి వివాహేతర సంబంధం ఉందని, నగదు కూడా విపరీతంగా ఖర్చు చేస్తూ ఇంట్లో ఇబ్బందులకు గురి చేస్తోందనే కారణంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఇలా ఉండగానే రెండు నెలల క్రితం ఫాతిమాకి ఎంపీడీవో ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా ఉద్యోగం వచ్చింది. అంతేగాకుండా టిక్ టాక్ లో తాను ఆడుతూ పాడుతూ చేసిన వీడియోలు అప్ లోడ్ చేయడం కూడా ఆమెకి ఫ్యాషన్ గా మారిపోయింది. వీటన్నింటిని చూసిన భర్త.. వద్దని వాదించినా అతని మాట వినకుండా టిక్ టాక్ లో వీడియోలు అప్ లోడ్ చేయడం ఆపలేదు ఆమె. దీంతో ఇద్దరి మధ్య గొడవలు తారా స్థాయికి చేరుకున్నాయి. తన భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానం ఈ వీడియోలు చూసి పాచూలో మరింత పెరిగింది. ఆ అనుమానం పెనుభూతంలా మారి భార్యను దారుణంగా హత్య చేశాడు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫాతిమా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరించి.. చివరికి పోలీసులకు దొరికిపోయాడు. ఫాతిమా హత్యకు కారణం టిక్ టాక్ అని నిందితుడి సోదరులు చెప్తున్నారు. ఫాతిమాకు టిక్ టాక్ లో వీడియోలు అప్ లోడ్ చేయడం అంటే పిచ్చిగా మారిపోయిందంటున్నారు. మొత్తం మీద టిక్ టాక్ మోజులో పడి భర్త చేతిలో భార్య బలైపోయిన ఈ ఘటన దుమారం రేపుతోంది.  

బీజేపీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఒక లెక్క.. నెల్లూరులో ఒక లెక్క

  భారతీయ జనతా పార్టీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకెత్తయితే నెల్లూరులో మాత్రం మరో ఎత్తు అని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. ప్రస్తుతం నెల్లూరు బీజేపీలో రెట్టింపు ఉత్సాహం నెలకొంది, జిల్లాకు చెందిన ముప్పవరపు వెంకయ్యనాయుడు ఓ సాధారణ ఏబివిపి కార్యకర్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసి ఉపరాష్ట్రపతి వరకు ఎదిగారు. సింహపురికి తిరుగులేని పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టారు. జిల్లాకు చెందిన చాలా మంది నేతలకు రాష్ట్ర పదవవులు ఇప్పించారు. కాని, నెల్లూరులో బీజేపీ బలోపేతానికి కృషి చేసినా జిల్లాలో అంతగా పార్టీ పుంజుకోలేకపోయింది. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల కార్యకర్తలు ప్రజల ఆలోచనల్లో అనూహ్యంగా మార్పులొస్తున్నాయట. మెల్లమెల్లగా కమలం పార్టీకి దగ్గరయ్యే వారి సంఖ్య పెరుగుతోందట. అందుకే ఇప్పుడు నెల్లూరులో భారతీయ జనతా పార్టీకి ఒకప్పుడున్న పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరుగా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా ప్రజలు ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పదికి పది సీట్లు ఇచ్చారు. అయితే ప్రభుత్వ నిర్ణయాల పట్ల ప్రజల్లో నిరాసక్తి కనిపిస్తోందని వినికిడి. మరోవైపు ప్రత్యక్ష దాడులు ఆ పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధితులకు టిడిపి నుంచి సపోర్ట్ కూడా అంతగా లేదన్న భావనతో వారిలో పలువురు బిజెపి వైపు చూస్తున్నారని తెలుస్తోంది. టిడిపిలో ఎంతో కాలం పని చేసిన వారికి అక్కడ సరైన ఆదరణ కరువవడంతో బిజెపిలో చేరుతున్నారట. అలాంటి వారికి కమలం పార్టీ ముఖ్య నేతలు అండదండలు అందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు టిడిపికి మైనస్ గా కనిపిస్తుండగా మరోవైపు అవే బిజెపికి ప్లస్ గా మారుతున్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. కావలిలో టిడిపి ఓట్లు వేసినవారి ఇళ్లూ, దుకాణాలూ కూల్చివేసినప్పుడు బిజెపి నేతలే అండగా నిలిచారు. ఈ విషయంలో కమలం పార్టీ నాయకుల మధ్య పోటీ నెలకొంది, పార్టీ కార్యక్రమాలు ప్రజా పోరాటాల్లో వారు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సీనియర్ నేత కందుకూరి వెంకట సత్యనారాయణకు జాతీయ స్థాయిలో పలుకబడి ఉంది. అయినప్పటికీ ప్రస్తుతం నెలకొన్న పోటీతత్వంతో ఆయన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో సుమారు నూట ఎనభై కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. గాంధీజీ సంకల్ప యాత్రలో భాగంగా జిల్లాలో చేపట్టిన ఈ పాదయాత్రకు మంచి స్పందనే వచ్చింది. దీంతో కమలం పార్టీ కేడర్ లో జోష్ పెరిగింది, స్థానిక నాయకులతో పాటు జిల్లాకొచ్చిన నేతలు వయసు మీద పడినా లెక్క చేయక పాదయాత్రను విజయవంతం చేశారన్న టాక్ వినిపించింది. ఇదిలా ఉండగా కాంగ్రెస్, టిడిపిల్లో కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ఇటీవలే బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట ప్రాంతాల్లో వాకాటికి పెద్ద సంఖ్యలోనే అనుచరులున్నారు, వారంతా ఇప్పుడు టచ్ లోకి రావడమే కాకుండా బిజెపి లోకి వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే ఆయన అనుచరులు చాలా మంది బీజేపీ కండువాలు కప్పేసుకున్నారు, పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తుండటంతో అతి తక్కువ కాలంలోనే పార్టీలో కుదురుకున్నారు. దీంతో జిల్లాలోని తీరం వెంబడి తడ నుంచి సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు, కోవూరు, కావలి వరకు పార్టీ ఓ రేంజ్ లో పుంజుకున్నట్టు కనిపిస్తోంది.  ఇక బిజెపి నుంచి గతంలో ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేసిన కొండపల్లి గురవయ్యనాయుడు వంటి పాతతరం నేతలు కూడా ఇప్పుడు ఫుల్ యాక్టివ్ అవుతున్నారు. జిల్లా నేతలతో కలిసి మెట్ట ప్రాంతాల్లోనూ కమలం పార్టీని పటిష్టం చేసేందుకు సన్నాహాలు మొదలెట్టారు. మెట్ట ప్రాంతాలైన ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి విషయానికొస్తే ఉదయగిరిలో గత ఎన్నికల్లో పోటీ చేసిన గుండ్లపల్లి భరత్ కుమార్ జోష్ కొనసాగిస్తున్నారు. ఇక ఆత్మకూరు వెంకటగిరి లోనూ పార్టీ అభివృద్ధికి జిల్లా ముఖ్య నేతలు, పాతతరం నేతలు గట్టిగానే కృషి చేస్తున్నారు. ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి అమిత్ షాని ఆత్మకూరుకు తీసుకొచ్చి భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.  ఇటీవల నెల్లూరుకు వచ్చిన ఎంపీ సుజనా చౌదరి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్, రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణలు జిల్లాలో పార్టీ బలపడుతుండటాన్ని చూసి ముచ్చట పడ్డారు. వారు లోలోపల చాలా ఆనందపడ్డారట. ఇదే జోష్ తో ముందుకు సాగితే పార్టీకి తిరుగే ఉండదని, ప్రాంతీయ పార్టీల వల్ల కలిగే నష్టాలను అధిగమించటానికి గాంధీజీ ఆశయాలను కొనసాగించడానికి ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలు సూచించారట. మొత్తం మీద నెల్లూరు జిల్లాకు సంబంధించి గతంలో బిజెపిలో చేరికలు పెద్దగా ఉండేవి కావు కానీ, ఇప్పుడు కార్యకర్తల దగ్గర నుంచి నేతల వరకు చేరికలు బాగా పెరిగాయి. ఆ పార్టీకి ఇది శుభ పరిణామమే ఇదే విధంగా ముందుకెళ్తే పార్టీకి మంచి రోజులే ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

పైన పటారం లోన లొటారంలా మారిన తెలంగాణ పరిషత్ ల పరిస్థితి...

  పైన పటారం లోన లొటారంలా వుంది తెలంగాణాలో కొత్త జిల్లాల పరిస్థితి పరిపాలనా సౌలభ్యం పేరిట ఇబ్బడిముబ్బడిగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఉన్న పది జిల్లాలను ముప్పై మూడు జిల్లాలుగా విభజించింది. పలు జిల్లాల్లో కొత్త కలెక్టరేట్ల నిర్మాణం కొనసాగుతోంది కొన్ని చోట్ల కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రసుతానికైతే అరకొర భవనాలతో చాలీ చాలని వసతులతో ఆయా జిల్లాల కార్యాలయాలు పని చేస్తున్నాయి. ఇదంతా ఒకెత్తయితే కొత్తగా ఏర్పాటైన జిల్లా పరిషత్, మండల పరిషత్ ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కార్యాలయాల భవనాలు, ఫర్నీచర్, సిబ్బంది సర్దుబాటు వంటి అంశాల్లో గందరగోళం కొనసాగుతూనే ఉంది. దీనికి తోడు కనీసం చాయ్ నీళ్ళకు పైసా లేని దుస్థితి నెలకొన్నది. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరిగి మూడేళ్ళు పూర్తయింది. కొత్త జిల్లా పరిషత్ లు కొత్త మండల పరిషత్తులు ఏర్పాటు జరిగి నెలలు దాటింది, నాలుగు నెలల క్రితం ఆయా జడ్పిలు మండలాల పరిధిలో ఎన్నికలు జరిగాయి. గెలిచిన ప్రజా ప్రతినిధులు కూడా బాధ్యతలు చేపట్టారు కానీ, గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించే మండల జిల్లా పరిషత్ లకు మాత్రం ఇంత వరకూ నిధుల కేటాయింపు జరగలేదు. కొత్తగా ఏర్పాటైన జడ్పీలు నిధులు లేక విలవిలలాడుతుంటే కొత్త మండలాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని అక్కడి నేతలు వాపోతున్నారు. పరిషత్ ల విభజన సమయంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా యంత్రాంగం పాత జడ్పీ నుంచి కొత్త జిల్లా పరిషత్ లకు ఉద్యోగులను, ఫర్నీచర్ ను సిబ్బందిని కేటాయించారు. కొత్త మండలాల ఏర్పాటు సందర్భంగా కూడా ఇదే విధానం పాటించారు. అయితే కొన్ని మండలాల్లో సిబ్బంది మినహా ఇంకేమీ సర్దుబాటు చేయలేదట, కొత్త పరిషత్తులు ఏర్పాటు సమయంలో పాత జడ్పీ కార్యాలయంలో విధులు నిర్వర్తించిన ఉద్యోగులను ప్రభుత్వం ఆయా జిల్లాలకు బదిలీ చేసింది. బదిలీపై వెళ్లిన ఉద్యోగులకు ఇప్పటికీ పాత జడ్పీల నుంచే నెల నెలా జీతాలు చెల్లిస్తున్నారు. ఇక డైరెక్ట్ గా నియామకమైన అధికారులకు, సిబ్బందికి జీతాలకు కూడా దిక్కులేని పరిస్థితి ఏర్పడిందట. మండలాల పరిస్థితి కూడా ఇదే మాదిరిగా ఉందని స్థానికుల కథనం. ఉదాహరణకు ఆదిలాబాద్ జడ్పీ ఖాతాలో ప్రస్తుతం మూడు కోట్ల యాభై లక్షల రూపాయల వరకు నిధులు అందుబాటులో ఉన్నాయి. ఈ నిధులు మండలాల ప్రాతిపదికన కొత్తగా ఏర్పాటైన నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కేటాయించాల్సి ఉంది. ఏ జిల్లాలో మండలాల సంఖ్య ఎక్కువగా ఉంటుందో ఆ జిల్లాకు అధిక నిధులు కేటాయించాలి. ఈ లెక్కన ఒక్కో జిల్లాకు ఎనభై ఏడు లక్షల నుంచి తొంభై లక్షల రూపాయల వరకు వస్తాయి. ప్రస్తుతమున్న నిధులు ఆయా జిల్లాలకు పంచాలంటే అందుకు చెక్ పవర్ ను ఉపయోగించాలి. డ్రా చేసిన నిధులను ఇతర జిల్లాలకు అప్పగించాలి కాని, ఆ పని ఇప్పటికీ జరగడం లేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే తప్ప పైసా కేటాయించలేని దుస్థితి నెలకొన్నది. దీంతో కొత్త జిల్లా పరిషత్తులు ఉత్సవ విగ్రహాల తీరుగా మారుతున్నాయి, నిధుల విషయమై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు చేపట్టక పోవడంతో ప్రజా ప్రతినిధులు, అధికారులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. కార్యాలయాల నిర్వహణకే పైసలు లేనప్పుడు ఇక తాము అభివృద్ధి పనులెలా చేపట్టగలమని వారు ప్రశ్నిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం జరిగిన జిల్లా పరిషత్ ల సమావేశంలో పలువురు ప్రజా ప్రతినిధులు ఈ అంశాన్ని ప్రస్తావించారు. రూపాయ్ లేని కొత్త జిల్లా పరిషత్ లు మండల పరిషత్తులు ఎందుకు అని ప్రతి రోజూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వేరే గత్యంతరం లేక కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు సొంత వనరులతో ఫర్నీచర్ సమకూర్చుకున్నారు. మరికొన్నిచోట్ల ప్రజా ప్రతినిధుల ఒత్తిడితో అధికారులు అప్పులు చేసి ఫర్నీచర్ కొన్నారు. ఇక రోజువారీ నిర్వహణ భారంగా మారడంతో కార్యాలయాలకు వెళ్లాలంటేనే ప్రజాప్రతినిధులు అధికారులు జంకుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలనే ఆయా నేతలు, అధికారులు కోరుతున్నారు, గులాబీ పార్టీ పెద్దలు దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

టిపిసిసి పీఠం కోసం మళ్ళీ సందడి ప్రారంభమైంది...

  నిన్న మొన్నటి వరకు స్తబ్దుగా మారిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ పీఠం కోసం మళ్లీ సందడి ప్రారంభమైంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత పీసీసీ చీఫ్ మార్పు కోసం అధిష్ఠానం ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం ఊపందుకుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా ఢిల్లీకి వెళ్లడంతో ఆ ప్రచారం మరింత ఉధృతమైంది. ఇక ఆయన సైతం రాజీనామాకి సిద్ధపడ్డారని రాజీనామా లేఖను అధిష్టానానికి ఇచ్చారని ప్రస్తుతం అది పెండింగ్ లో ఉందని ఢిల్లీ లోని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఉత్తమ్ పదవీ కాలం కూడా ముగియడం, ఆయన నేతృత్వంలో పార్టీ అపజయాలనే మూటగట్టుకోవడంతో కొత్త సారథిని నియమించేందుకు హైకమాండ్ డిసైడ్ అయిందనే లీకులు హస్తిన నుంచి మొదలయ్యాయి. అందుకోసం రాష్ట్ర నేతల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నట్లు గాంధీభవన్ లో గుసుగుసలు వినిపిస్తున్నాయి. ఇలా పెద్ద ఎత్తున ఊహా గానాలు ఊపందుకోవడంతో ఆశావహులు మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించారు. అధ్యక్ష స్థానాన్ని దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నారు. గ్రూపులు కట్టి రాజకీయం నేర్పుతున్నారు, పార్టీ అధిష్ఠానానికి తమ ఆసక్తిని తెలపాలని హస్తిన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. టిపిసిసి మార్పులకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరగడంతో కొత్త అధ్యక్షుడు ఎవరనే చర్చ హస్తం పార్టీలో మొదలైంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్లు నిన్న మొన్నటి వరకు ప్రముఖంగా వినిపించాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాదంటే అదే జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇవ్వాలని కొందరు కోరుతున్నట్టు తెలుస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ వ్యతిరేక వర్గంలో రేవంత్ రెడ్డికి మంచి క్రేజ్ ఉందని యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఆయనకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని మరొక వర్గం చెబుతోంది. ఒక దశలో ఉత్తమ్ ను తప్పించి రేవంత్ కు టిపిసిసి పగ్గాలు అప్పగించేందుకు రెడీ అయినట్టు కూడా కాంగ్రెస్ లో ప్రచారం జరిగింది. అయితే హుజూర్ నగర్ ఉప ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ లు పార్టీలో పెద్ద దుమారమే రేపాయి. కాంగ్రెస్ లోని సీనియర్లంతా ఏకమయ్యి ఆయనకు వ్యతిరేకంగా ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు చేశారట. వ్యతిరేక వర్గమంతా సంతకాలు సేకరించి హైకమాండ్ కు పంపారట. దీంతో రేవంత్ రెడ్డి విషయంలో ఢిల్లీ పెద్దలు పునరాలోచనలో పడ్డారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయినా కొందరు రేవంత్ శ్రేయోభిలాషులు డిల్లీ పెద్దలను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక మరో వర్గం మాత్రం మొదటి నుంచి పార్టీలో పని చేసిన వివాద రహితులకు టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానానికి సూచనలు చేస్తున్నారట. ప్రస్తుతం రెడ్డి సామాజికవర్గం నేత పీసీసీ చీఫ్ గా ఉన్నందున ఈ దఫా రెడ్డి ఏతర సామాజిక వర్గానికి అవకాశమివ్వాలని కోరుతున్నారట. అందులో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పీసీసీ పీఠం కోసం ఆయనకు పెద్దగా ఆసక్తి లేక పోయినప్పటికీ పార్టీలో కీలకంగా ఉన్న ఒక నేత శ్రీధర్ బాబుకు మద్దతు కూడగడుతున్నట్టు ఆయన కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక జానారెడ్డి, జీవన్ రెడ్డిలో ఎవరికిచ్చినా పార్టీలో పెద్దగా వ్యతిరేకత ఉండదని మరికొందరు సూచిస్తున్నారట. ఇదిలా వుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు సైతం తనకు అవకాశమివ్వాలని కోరుతున్నారట. వయసును సాకుగా చెప్పి కొందరు తనపై తప్పుడు నివేదికలు ఢిల్లీకి పంపుతున్నారని కానీ, గతంలో షీలా దీక్షిత్ కు మొన్నటి హర్యానా ఎన్నికల్లో కూడా ఒక అవకాశమిస్తే వారు పార్టీకి మెరుగైన ఫలితాలు తెచ్చిన విషయాన్ని వీ.హెచ్ గుర్తు చేస్తున్నారు. హస్తినలో ఆయన కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు చెప్పుకొంటున్నారు, ఇలా ఎవరికి వారు పార్టీ అధ్యక్ష పదవి కోసం సైలెంట్ గా పని చేసుకుంటుండగా తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెరమీదకు దూసుకొచ్చారు. ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పే జగ్గారెడ్డి తాను కూడా పిసిసి రేసులో ఉన్నానని బహిరంగంగానే ప్రకటించారు. ఎప్పుడూ పెద్దగా రాష్ట్రం దాటని జగ్గారెడ్డి ఈ నెల పదిహేనున ఢిల్లీకి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. సోనియా, రాహుల్, అహ్మద్ పటేల్, కేసీ వేణు గోపాల్, కుంతియాను కలిసి పీసీసీ చీఫ్ పదవి తనకు ఇవ్వాలని ఆయన వారికి విన్నవించనున్నారు. తనకు అవకాశమిస్తే పార్టీని అధికారంలోకి తీసుకోవటానికి రాష్ట్రమంతా తిరుగుతానని సీఎం పదవి ఆశించకుండా అధ్యక్ష బాధ్యతలను నెరవేరుస్తానని జగ్గారెడ్డి చెప్తున్నారు. అంతేకాక ఆ పదవిపై కన్నేసిన వారు కూడా సీఎం పదవిని ఆశించొద్దనే కొత్త వాదనను తెరమీదకు తెచ్చారు. అయితే పదవి ఆశిస్తున్న జగ్గారెడ్డి సహా మరి కొందరు నేతలు మాత్రం మున్సిపల్ ఎన్నికల తరువాతే అధ్యక్ష మార్పు చేయాలని హైకమాండ్ కు సూచిస్తున్నారు. మరి కాంగ్రెస్ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

తరగడానికే కాదు, కోనడానికి కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి ధరలు.....

కొనుగోలుదార్లకు అమ్మకందారులకు ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర రాక మార్కెట్ లో రైతు కన్నీరు పెట్టుకొంటున్నాడు. అటు కొనుగోలుదారులు మాత్రం కిలో ఉల్లికి యాభై నుంచి డెబ్బై రూపాయల పెట్టలేక అష్టకష్టాలూ పడుతున్నాడు. ఈ పరిస్థితి ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. ఇలా దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉల్లి ధరలు ప్రజల్నీ ఉలికిపాటుకు గురి చేస్తున్నాయి. రెండు నెలలుగా యాభై నుంచి డెబ్బై రూపాయల వరకు అమ్మిన కిలో ఉల్లి రెండు రోజులుగా కొన్ని చోట్ల 100 చేరింది. సరుకు లభ్యత ఆగస్ట్ వరకు ఎక్కువగానే ఉన్నా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పడిపోవడంతో ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. దేశీయంగా ఉల్లి ఉత్పత్తి 30 నుంచి 40 శాతం మేర తగ్గడంతో ధరలు బాగా పెరిగిపోయాయి. ఈ నెల చివరి వారానికి గానీ డిసెంబర్ మొదటి వారానికి గానీ పరిస్థితి అదుపులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం అవుతోంది. మెజారిటీ ఉల్లి పంట వాటా మహారాష్ట్ర నుంచి వస్తుంటే మిగిలిన సరుకు ఇతర రాష్ట్రాల నుంచి వస్తోంది. సాధారణంగా ప్రతి నెలా మార్కెట్ లోకి పది లక్షల నుంచి పదమూడు లక్షల టన్నుల వరకు సరుకు వస్తూంటుంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మాత్రం దాదాపు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల టన్నుల వరకు పడిపోయింది. దీంతో ఉల్లి ధర కిలో యాభై నుంచి వంద రూపాయల వరకూ పెరిగింది. కేంద్ర వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం జనవరిలో హోల్ సేల్ మార్కెట్ లో క్వింటాలుకి వెయ్యి, మూడు వందల డెబ్బై ఐదు పలికిన ఉల్లి ధర అక్టోబర్ నాటికి 3,433 కు చేరి నూట నలభై తొమ్మిది శాతం పెరిగిందని మార్కెట్ వర్గాల అంచనా వేస్తున్నాయి. ఈ ధరలను అదుపు చేయడానికి ఈజిప్ట్, నెదర్లాండ్స్ దేశాల నుంచి 2,500 మెట్రిక్ టన్నుల సరుకు దిగుమతి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. స్టాక్ ని త్వరగా తీసుకురావాలన్న ఉద్దేశంతో కస్టమ్స్ అనుమతులు తనిఖీల్లో మినహాయింపు నిచ్చింది. మరో 3000 మెట్రిక్ టన్నుల ఉల్లిని తీసుకు వస్తూ 100 కంటెయినర్లూ సముద్ర మార్గంలో ఉన్నాయి. ఆఫ్ఘనిస్థాన్, టర్కీ, ఇరాన్ ల నుంచి కూడా సరుకు వచ్చేలా ఆయా దేశాల రాయబారులను కోరింది. పాకిస్థాన్ కల్పించే అడ్డంకుల కారణంగా ఆఫ్ఘనిస్థాన్ నుంచి సరుకు రాకపోయినా మిగతా దేశాల నుంచి సాధ్యమైనంత త్వరగా వస్తుందని అంచనా వేస్తోంది. ప్రతి నెలా దాదాపు లక్షా యాభైవేల లక్షల టన్నుల మేర జరిగే ఉల్లి ఎగుమతుల్ని రెండు నెలలుగా నిషేధించినందున ఆ మేరకు సరుకు లభ్యత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది ప్రభుత్వం.మరి ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి సామాన్యుడికి ధరలు అందుబాటులో ఉంటాయో లేదో.

అధికారులను మందలించిన హైకోర్ట్.......

ఆర్టీసీ సమ్మె పై చర్చ రోజుకో కీలక మలుపు తిరిగుతోంది.ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ విధించిన డెడ్ లైన్ ముగియడం, డెడ్ లైన్ లోపు ఎక్కువ సంఖ్యలో కార్మికులు విధులకు హాజరు కాకపోవడం తమ డిమాండ్ల సాధనకు జేఏసీ పట్టుబడుతుండటంతో హై కోర్టు విచారణలో పలు విషయాలు పై చర్చించేందుకు సిద్ధమైయ్యారు. విచారణలో ఉద్దేశ పూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే కోర్టు ధిక్కరణ కిందకి వస్తుందని ఆర్టీసీ సమ్మెపై విచారణ సందర్భంగా అధికారులను హెచ్చరించింది హైకోర్ట్. ఆర్ధిక శాఖ సమర్పించిన రెండు నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఐఏఎస్ అధికారులు అసమగ్ర నివేదికలు ఇవ్వడంపై ధర్మాసనం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంది. ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ విచారణకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషి, ఎండి సునీల్ శర్మ, ఆర్థికశాఖ అధికారులు స్వయంగా హాజరయ్యారు. రికార్డు పరిశీలించాకే నివేదిక ఇస్తున్నట్టుగా కోర్టుకు తెలిపింది ఆర్థికశాఖ. అయితే మొదటి నివేదిక పరిశీలించకుండానే ఇచ్చారా అని హై కోర్టు ప్రశ్నించింది. దీనిపై ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు స్వయంగా వివరణ ఇచ్చారు. సమయాభావం వల్ల రికార్డుల ఆధారంగా నివేదిక రూపొందించామని ఆయన వెల్లడించారు. మన్నించాలని హైకోర్టుని వేడుకున్నారు. అయితే క్షమాపణ కోరడం సమాధానం కాదని వాస్తవాలు చెప్పాలని ఆదేశించింది హైకోర్ట్.

అసలు మీరేం అధికారులు? ఇవేం లెక్కలు?.. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఫైర్!!

  ఆర్టీసీ సమ్మె పిటిషన్‌పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఎటూ తేలకుండానే విచారణ ఈ నెల 11కు వాయిదా పడింది. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్ శర్మ, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణరావు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు సమర్పించిన నివేదికలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐఏఎస్ స్థాయి అధికారులు ఇంత దారుణంగా నివేదిక ఇవ్వడం తన సర్వీస్‌లోనే చూడలేదని చీఫ్ జస్టిస్ అసహనం వ్యక్తం చేశారు. 15 ఏళ్ల జడ్జి చరిత్రలో ఇంతగా అబద్ధాలు చెప్పే అధికారులను ఎక్కడా చూడలేదని చీఫ్ జస్టిస్ విరుచుకుపడ్డారు. ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ.. చెబుతున్న అంకెలు వేర్వేరుగా ఉన్నాయని.. తాము వేటిని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును తప్పుదోవ పట్టించేందుకు చాలా తెలివిగా గజిబిజి లెక్కలు.. పదాలు వాడారని హైకోర్టు పేర్కొంది. మంత్రికి సునీల్ శర్మ తప్పుడు లెక్కలు ఇచ్చారని... ఆయనకు తప్పుడు లెక్కలు ఇస్తే ప్రభుత్వాన్ని చీట్ చేసినట్లేనని హైకోర్టు పేర్కొంది. కేబినెట్‌కి సైతం అధికారులు తప్పుడు లెక్కలు ఇచ్చారని.. సీఎంకి సైతం తప్పుడు లెక్కలతో స్టేట్‌మెంట్ ఇప్పించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తమను తప్పుదోవ పట్టించిన ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీని మంత్రి ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదంటూ మండిపడింది.  జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, ఆర్థిక శాఖలు... ఒక్కొక్కరు ఒక్కో పాట పడుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా చెబుతున్నారని.. హైకోర్టుతో వ్యవహరించే తీరు ఇదేనా అని అధికారులను హైకోర్టు తీవ్ర స్థాయిలో మందలించింది. తాము సమస్యను పరిష్కరించాలని చూస్తుంటే.. ప్రభుత్వం, ఆర్టీసీ మాత్రం స్వచ్ఛందంగా ముందుకు రావడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పూర్తిగా లోపించిందని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. 5 నిమిషాలు తన స్ధానంలో ఉండి చూడాలని.. మీ నివిదేకలు, మీరు చెప్పే మాటలు అసలు నమ్మే విధంగా ఉన్నాయా? అంటూ అధికారులపై చీఫ్ జస్టిస్ మండిపడ్డారు. ప్రభుత్వం, కార్మికసంఘాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సమస్య తాత్కాలిక పరిష్కారం కోసం ప్రభుత్వం 47 కోట్లు ఇవ్వలేదా? అని ప్రశ్నించింది. రూ.47 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం ఎందుకు ఇబ్బంది పెడుతోందని హైకోర్టు ప్రశ్నించింది. అధికారుల తప్పుడు నివేదికల కారణంగా విచారణ మళ్లీ వాయిదా పడింది. మరి అధికారులు ఇకనైన సరైన నివేదికలు ఇస్తారో.. లేక ఇలానే తప్పుడు లెక్కలు చూపించి హైకోర్టు చేత చివాట్లు తింటారో చూడాలి. ఏది ఏమైనా.. ప్రజలు ఇంతలా ఇబ్బంది పడుతుంటే.. ఐఏఎస్ స్థాయి అధికారులు తప్పుడు లెక్కలు చూపిస్తూ కాలయాపన చేయడం దురదృష్టకరం. మరి హైకోర్టు ఈ సమస్యకు 11 వ తేదీన అయినా పరిష్కారం చూపుతుందేమో చూడాలి.

విజయారెడ్డి  హత్యతో పలుచోట్ల వెలుగులోకి వస్తున్న తహసీల్దార్ల నిర్లక్ష్యాలు...

  విజయారెడ్డి హత్యోదంతం తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాలు హాట్ టాపిక్ గా మారిపోయాయి. రిజిస్ట్రేషన్లు పట్టాదారు పాస్ పుస్తకాల జారీ కోసం రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారని బాధితులు వినూత్న నిరసనలకు దిగుతున్నారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ రెవెన్యూ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతున్నారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో కుర్వపల్లి కోట మండల రెవెన్యూ కార్యాలయంలో ఒక వ్యక్తి ధర్నాకు దిగారు. ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. మట్లివారిపల్లె మాజీ సర్పంచ్ రైతు రుద్ర బాలకృష్ణారెడ్డి తన భూమిని రికార్డుల్లోకి ఎక్కించడం లేదంటూ ధర్నాకు దిగారు. ఆరు నెలల నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు స్పందించడం లేదని ఆరోపించాడు. తహసీల్దార్ కార్యాలయంలో పడుకొని వినూత్న నిరసనకు దిగారు. తహసీల్దార్ తనకు ఉన్న భూమిని ఆన్ లైన్ లో తొలగించారని కనుక్కొని నమోదు చేయమంటే ఆరు నెలలుగా వేధిస్తున్నారని రైతు బాలకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సమస్య పరిష్కరించండి అంటే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని రైతు ఆరోపిస్తున్నాడు.  ఇటు చిత్తూరు జిల్లాలోని మరో బాధిత రైతు రెవెన్యూ ఆఫీస్ లోని వినూత్న నిరసనకు దిగాడు. కృష్ణానాయక్ అనే రైతు తాను కొన్న పొలానికి పట్టాదారు పాస్ పుస్తకాన్ని మంజూరు చేయడంలో తహసీల్దార్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని రైతు ఆరోపిస్తున్నాడు. కొన్న పొలంలో సాగు చేసుకుందామనుకున్న వీలు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ తన కుటుంబ సభ్యులతో కలిసి సామూహిక ఆత్మహత్యకు పాల్పడతామంటూ మెడకు ఉరితాళ్లు వేసుకొని ఆందోళన నిర్వహించారు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యనే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటు శ్రీకాకుళం జిల్లా నర్సంపేట రెవెన్యూ మండలం సత్యం రూళ్ల గ్రామం కూడా ఒక రైతు పెట్రోల్ బాటిల్ తో నిరసన వ్యక్తం చేశాడు. 2017 లో తాను కొంత భూమిని కొన్నానని దానికి పాస్ బుక్కు కూడా వచ్చిందని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం పాస్ బుక్ లో ఉన్న వివరాలకు ఆన్ లైన్ లో ఉన్న వివరాలకు అసలు పొంతనే కుదరకపోవటంతో తనకు రైతు భరోసా అందట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సరిచేయమని తహసీల్దార్ ని అడిగితే అసలు తనకు భూమి లేదని చెప్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అందుకే విసుగు చెంది గ్రామంలో జరిగిన రైతు భరోసా సభలో పంచాయతీ కార్యదర్శి సుమలతపై పెట్రోల్ చల్లి నిరసన తెలిపానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీనిపై ప్రభుత్వం ఇప్పటికైన తగిన చర్యలు తీసుకోకపోతే తీవ్ర నష్టాన్ని ఎదురుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

సమ్మె పట్ల  నిన్న పిటీషన్ పై  హైకోర్ట్ లో కొనసాగుతున్న విచారణ...

  నేడు హైకోర్ట్ లో జరుగుతున్న పిటీషన్ పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషి హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు నేరుగా హాజరై వివరణ ఇస్తున్నారు. ప్రభుత్వం ఆర్టీసీ ఎండీ జీహెచ్ఎంసీ దాఖలు చేసిన అఫిడవిట్లపై వాదనలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ విధించిన డెడ్ లైన్ ముగియడం, డెడ్ లైన్ లోపు ఎక్కువ సంఖ్యలో కార్మికులు విధులకు హాజరు కాకపోవడం తమ డిమాండ్ల సాధనకు జేఏసీ పట్టుబడుతుండటంతో హై కోర్టు విచారణలో ఏమి తేలనుంది అనే దానిపై ఉత్కంఠం నెలకొంది. ప్రస్తుతం హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. మొత్తం మూడు అంశాలపైన ఇవాళ విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా ఆర్టీసీ సమ్మెతో పాటు ఇటు నిన్న ప్రభుత్వం నుండి దాఖలు చేసిన అఫిడవిట్ ల పైన దీంతో పాటుగా ప్రైవేటీకరణకు సంబంధించిన మూడు అంశాలపైన ప్రస్తుతం ఇవాళ విచారణ కొనసాగుతుంది.   ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఆర్టీసీకి సంబంధించిన ఎండీ జీహెచ్ఎంసీ కమిషనర్ వీళ్ళందరూ కూడా హైకోర్టుకు వచ్చారు.  నిన్న అఫిడవిట్ దాఖలు చేసిన అంశాలపైన ఏవైనా అభ్యంతరాలు ఉన్నాయా అన్న దానికి సంబంధించి కార్మికుల తరపున న్యాయవాదులు ప్రస్తుతం మాట్లాడుతున్నట్లు సమాచారం. మరొకవైపు చీఫ్ సెక్రెటరీ కూడా ప్రస్తుతం హైకోర్టులో ఉన్నారు. నిన్న అఫిడవిట్ లో ఆర్టీసీకి ఎంత వరకు బకాయిలున్నాయి. ఎంత వరకు చెల్లించారు అనే దానికి సంబంధించి వేరువేరుగా అఫిడవిట్ లను దాఖలు చేయటం జరిగింది.ఇటు జీహెచఎంసీతో పాటు ఆర్థిక శాఖ ఈ రెండు అఫిడవిట్ లను కూడా వేర్వేరుగా దాఖలు చేసింది. అలాగే ఆర్టీసీ కూడా ఇలాంటి ప్రభుత్వం నుండి ఎంత వరకు ఆదాయం రావాల్సి ఉంది అన్న దానికి సంబంధించి కూడా అఫిడవిట్ లో పేర్కొనటం జరిగింది. హై కోర్టు పూర్తి స్థాయిలో ఈ అఫిడవిట్ ను దాఖలు చేయాలని జారీ చేసిన ఆదేశాల మేరకు ఆ అఫిడవిట్ ను నిన్న ఇవ్వడం జరిగింది. ఈ రోజు దానికి సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటికి సంబంధించిన అంశాలపైనా ప్రస్తుతము వాదనలు కొనసాగుతున్నాయి. ఈ వాదనల తర్వాత హై కోర్టు ఏం చేయబోతుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉన్న పరిస్థితి ఉంది.

వైసీపీలోకి గొట్టిపాటి..! బాబు పిలిచి మాట్లాడినా...?

  గొట్టిపాటి రవికుమార్... అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే... 2004లో కాంగ్రెస్ నుంచి... 2014లో వైసీపీ నుంచి... 2019లో టీడీపీ నుంచి... మొత్తంగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి... ఒకప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి రవికుమార్... అప్పటి రాజకీయ పరిస్థితులు, వ్యాపార ఆర్ధిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశంలో చేరారు. అనంతరం 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేసి... మూడోసారి అద్దంకి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, ఏ కారణాలతోనైతే ఆనాడు టీడీపీలో చేరారో... ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో... మళ్లీ అదే పరిస్థితులు గొట్టిపాటికి ఎదురవుతున్నాయట. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నప్పటికీ, స్థానిక రాజకీయ పరిస్థితులు మాత్రం అనుకూలంగా లేకపోవడంతో... మళ్లీ వైసీపీ గూటికి చేరాలని భావిస్తున్నారట. వైసీపీ నేతలతో ఇప్పటికే చర్చలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. అయితే, గొట్టిపాటి రవికుమార్ ఆలోచనను తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు పిలిచి మాట్లాడారు. అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చాక... నియోజకవర్గంలో ఎదురవుతోన్న కష్టాలు... వ్యాపారపరంగా కలుగుతున్న ఇబ్బందులు... మరోవైపు కేసులు... ఇలా తన ఇక్కట్లపై గొట్టిపాటి ఏకరువు పెట్టారట. ముఖ్యంగా తనకున్న గ్రానైట్ వ్యాపారంపై విజిలెన్స్ దాడులు చేయిస్తున్నారని, దాంతో బల్లికురవ, చీమకుర్తిలో బిజినెస్ నిలిచిపోయిందని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట. అయితే, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తాను, పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పిన చంద్రబాబు.... పార్టీ మారాలన్న ఆలోచనను మానుకోవాలని సూచించారట.  చంద్రబాబు బుజ్జగించినా, అండగా ఉంటామని భరోసా కల్పించినా, గొట్టిపాటి మాత్రం పార్టీ మారాలనే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకు, వ్యాపారపరంగా ఇబ్బందులు ఒకటైతే... మరోవైపు జగన్ తో సన్నిహిత సంబంధాలు ఉండటం కూడా కారణమంటున్నారు. ఇప్పటికే తన అనుచరులతో గొట్టిపాటి మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. మొత్తానికి గొట్టిపాటి పార్టీ మారడం ఖాయమే అయినా... అది ఎప్పుడు ఎలా అనేది మాత్రం తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

జగన్ ఇంటి కిటికీలు, బోల్టులకు 73లక్షలా? ఎంత మోసమంటూ నారా లోకేష్ ఎద్దేవా

  ప్రజాధనాన్ని సొంత పనులకు వాడుకోవడంలో ఎవరూ తక్కువ కాదని నిరూపించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గతంలో చంద్రబాబుపై ఇలాంటి ఆరోపణలే చేసిన జగన్... తాను అధికారంలోకి వచ్చాక, అదే పని చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయ మరమ్మతులు కోసం 73లక్షల రూపాయలు మంజూరు చేయడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. అది కూడా కేవలం కిటికీలు, తలుపులు కోసం దగ్గరదగ్గర కోటి  రూపాయలు కేటాయించడాన్ని జాతీయ మీడియా తప్పుబడుతోంది. కిటికీలు, తలుపులు కోసం ఏకంగా 73లక్షలు మంజూరు చేస్తారా? అంటూ విస్తృతంగా కథనాలు ప్రసారం చేస్తున్నారు. దాంతో, జగన్ క్యాంప్ హౌస్ మరమ్మతు వ్యవహారం అటు జాతీయ మీడియాలోనూ... ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. జగన్ క్యాంపు కార్యాలయం కిటికీలు, తలుపులకు 73లక్షల రూపాయలు కేటాయిస్తూ జీవో ఇవ్వడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఓ రేంజ్ లో సెటైర్లు వేశారు. డబ్బుల్లేవు... డబ్బుల్లేవు అంటూ నిత్యం డైలాగులు చెబుతున్న జగన్మోహన్ రెడ్డి... తన ఇంటి కిటికీలు, బోల్టులకు మాత్రం లక్షల లక్షల రూపాయలు మంజూరు చేసుకుంటున్నారని మండిపడ్డారు. అన్ బిలీవబుల్... మైండ్ పోతోంది... జగన్ ఇంటి కిటికీలకు 73లక్షలా? అంటూ లోకేష్ విస్మయం వ్యక్తంచేశారు. కిటికీలకు బోల్టులకు లక్షల లక్షలు తగలబెడుతూ... పైకి మాత్రం నెలకు రూపాయి మాత్రమే జీతం తీసుకుంటున్నానంటూ సీఎం జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఖజానా నుంచి 73లక్షల రూపాయలను తన సొంత ఇంటి కోసం ఖర్చుపెట్టడం మోసం కాదా అంటూ ప్రశ్నించారు. అయితే, అప్పుడు టీడీపీ... ఇప్పుడు వైసీపీ... అప్పుడు చంద్రబాబు... ఇప్పుడు జగన్... ఇద్దరూ కూడా ప్రజాధనాన్ని సొంత అవసరాల కోసం మరమరాల్లాగా ఖర్చుపెట్టడంలో ఎవరూ తక్కువ కాదని... అంటున్నారు.

హత్యకు ముందు సురేష్.. ఎమ్మార్వో భర్తతో ఏం మాట్లాడాడు? కారులో వచ్చింది ఎవరు?

  అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి తన ఆఫీస్ లోనే అగ్నికి ఆహుతి అయిన సంగతి తెలిసిందే. అయితే ఆమెను హత్య చేసిన నిందితుడు సురేష్ కూడా ఈరోజు మృతి చెందాడు. తహసీల్దార్ విజయారెడ్డి పై పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటనలో అతడు కూడా తీవ్ర గాయాలపాలయ్యాడు. సురేష్ 65 శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చేరగా చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించి అతడు మృతి చెందాడు. ముఖం, ఛాతీ కాలిపోవటంతో అతడు చికిత్సకు స్పందించలేదని సమాచారం. కాగా, ఓ భూమికి సంబంధించి పట్టా ఇవ్వలేదనే ఆగ్రహంతోనే తాను ఎమ్మార్వోను సజీవ దహనం చేసినట్లు సురేష్ వాంగ్మూలం ఇచ్చాడు. అయితే తహసీల్దార్ విజయారెడ్డి హత్య వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే పాత్ర ఉందని.. ఇద్దరు స్థానికులు ఫోన్ మాట్లాడుకున్న ఆడియో లీక్ అయింది. మరోవైపు విజయారెడ్డి భర్త కూడా ఈ హత్య వెనుక రాజకీయ నాయకులు ఉన్నారని, సురేష్ వెనుక ఎవ్వరో ఉన్నారని.. సీబీఐ దర్యాప్తు చేసి నిజానిజాలు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు అధికార పార్టీ నేతలు, విపక్ష నేతలు.. తహసీల్దార్ మృతికి మీరు కారణం అంటే మీరు కారణం అంటూ విమర్శలు చేసుకుంటున్నారు. విజయారెడ్డి హత్య రాజకీయ రంగు పులుముకోవడంతో.. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. విజయారెడ్డిపై దాడికి ముందు ఆమె ఇంటి వద్ద సురేష్ రెక్కి నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనకు రెండు రోజుల ముందు విజయారెడ్డి ఇంటి దగ్గర ఆమె భర్తతో కూడా సురేష్ మాట్లాడినట్లుగా పోలీసులు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, విజయారెడ్డి హత్య తర్వాత తహసీల్దార్ కార్యాలయం నుంచి బయటికొచ్చిన సురేష్.. కారులో ఉన్నవారితో మాట్లాడినట్లు గుర్తించారు. సురేష్‌తో కారులో కూర్చోని మాట్లాండింది ఎవరో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కారులో ఉన్నవారు ఎవరో తెలిస్తే.. ఈ హత్య వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయో లేదో తెలిసే అవకాశం ఉంది.