సంప్రదాయలతో కూడిన బీచ్ పార్టీ.. నవంబర్ 9,10 తేదీల్లో భీమిలి ఉత్సవాలు

  విశాఖపట్టణం అంటే అందరికీ తెలిసిందే. మరి భీమునిపట్టణం అంటే చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. అదే ఇప్పుడు భీమిలిగా పిలవబడే అప్పటి భీమునిపట్నం. విశాఖ నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ అద్భుత పర్యాటక ప్రాంతాల్లో భీమిలి ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. విశాఖకు పేరు ప్రఖ్యాతలు రాక ముందే ఓ పెద్ద పట్టణంగా చారిత్రక ప్రాంతంగా విలసిల్లింది భీమిలి. ఈ పట్టణం రానురాను కాస్త మరుగున పడింది కానీ ఇప్పటికీ అక్కడ చూడతగ్గ.. ఆస్వాదించదగ్గ.. విశేషాలెన్నో ఉన్నాయి. గతమెంతో ఘనం అనిపించేలా ఆ చరిత్రను గుర్తు చేసుకునే వేడుకలు జరగనున్నాయి. పర్యాటకులను ఆకర్షిస్తూ ఈ నెల 9,10 తేదీల్లో రెండు రోజుల పాటు భీమిలి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 1861లో ఏర్పాటైన భీమిలి మున్సిపాలిటీ భారతదేశంలోనే రెండో మున్సిపాలిటీగా గుర్తింపు పొందింది. ఏపీలో తొలి మునిసిపాలిటీ భీమిలి.. అది ఏర్పాటై 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2010లో ప్రారంభమైన భీమిలి ఉత్సవాలను ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. పశ్చిమ వైపు ఎత్తుగా ఉండి క్రమంగా తూర్పు వైపు సముద్ర తీరానికి వచ్చేటప్పటికీ పల్లం కావడంతో అక్కడ సముద్ర తీరంలో ప్రకృతి అత్యంత రమణీయంగా ఉంటుంది. పావురాళ్ళకొండ, ప్రఖ్యాత గాంచిన నరసింహస్వామి దేవాలయం, భీమేశ్వర ఆలయం కూడా ఇక్కడే ఉన్నాయి. 16-18  శతాబ్దాల మధ్య ఐరోపా ఖండం వారు భారత దేశానికి వర్తకం చేసుకోటానికి వచ్చినప్పుడు భీమిలిలోనే డచ్ వారు అడుగుపెట్టారు. 1624లో డచ్ వారు ఇక్కడ మొదట వలస వచ్చినప్పుడు ప్రాంతీయులకు డచ్ వారికి మధ్య ఘర్షణలు వచ్చాయని చెబుతుంటారు. ఈ ఘర్షణల్లో 101 మంది సైనికులు 200 మంది స్థానికులు మరణించారని చెప్తుంటారు. ఇప్పటికీ భీమిలిలో డచ్ వారివి సమాధులు ఉండటంతో అక్కడకు వచ్చిన పర్యాటకులు వీటిని తప్పకుండా సందర్శిస్తుంటారు.  భీమిలి బీచ్ పెద్దగా లోతూ ఉండదు కాబట్టి నిత్యం సందర్శకులతో కళకళలాడుతూ ఉంటుంది. కాకినాడకు, శ్రీకాకుళానికి మధ్య 8 లైట్ హౌస్లు నిర్మించారు.వాటిలో ఉన్న ఒక దీప స్తంభం 18వ శతాబ్దపు భీమిలి నౌకాశ్రయ వైభవాన్నీ తెలియచేస్తోంది. 24 కిలోమీటర్ల పొడవున్న ఈ బీచ్ రోడ్ భారత దేశంలోని పెద్ద బీచ్ రోడ్డు లో ఒకటిగా చెబుతారు. గ్రామీణ వాతావరణం పట్టణం కలగలిసిన ఈ సాగర తీర పట్టణంలో ఎన్నో సినిమాలు తెరకెక్కిస్తుంటారు.  ఈ నెల 9,10 తేదీల్లో జరిగే భీమిలి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఎయిర్ బెలూన్ ప్రదర్శన, ఫుడ్ ఫెస్టివల్ తదితర కార్యక్రమాలు ఉంటాయి. భీమిలి ఉత్సవ్ సమయంలో విశాఖ నుంచి భీమిలి వరకు ఉచిత బస్సులు నడపనున్నారు. ఈ ఉత్సవాలను 50 లక్షల బడ్జెట్ తో నిర్వహిస్తున్నామని తెలిపారు. భీమిలి చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పడానికి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు. భీమిలి ఉత్సవ్ సందర్భంగా ఉప్పుటేరులు, తెప్పల పోటీలు తెగ సందడి చేస్తాయి. కుర్రకారు జోరు చూపించే కబడ్డీ ఆటలు, భీమిలి ప్రత్యేక వంటకాల రుచులు, ఘుమఘుమలతో స్వాగతం పలుకుతాయి. రంగవల్లులతో ఊరంతా అందమైన హరివిల్లుల్లా కనిపిస్తుంది. డప్పుల హోరు..పులివేషాల జోరు.. సంప్రదాయ కళల ప్రదర్శనలు, సినీ కళాకారుల అభినయాలు, సంగీత విభావరులు ఒకటేమిటి రెండు రోజుల పాటు ఆద్యంతం ఆహ్లాదకరం. వైభవంగా జరిగే ఈ ఉత్సవాలను చూసేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా కర్ణాటక తమిళనాడు నుంచి పర్యాటకులు విచ్చేయనున్నట్లు తెలిపారు.

సవాల్, ప్రతి సవాల్.. స్పీకర్ వర్సెస్ నారా లోకేష్!!

  మాజీ సీఎం చంద్రబాబుపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. అగ్రిగోల్డ్ విషయంలో గత ప్రభుత్వం కుంభకోణాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. హాయ్‌ల్యాండ్ భూములను కొట్టేసేందుకు చంద్రబాబు, లోకేష్ ప్లాన్ వేశారని ఆరోపించారు. చంద్రబాబు బండారం బయటపెడతామని, ప్రజలముందు నిలుచోబెట్టి గుడ్డలూడదీస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకెంతో అనుభవం ఉందని చెప్పే చంద్రబాబు.. ఆ అనుభవాన్ని మడిచి ఎక్కడో పెట్టుకోవాలని తమ్మినేని వ్యాఖ్యానించారు. హాయ్ ల్యాండ్ భూములను చంద్రబాబు తన కుమారుడి పేరిట రాసివ్వాలని ఒత్తిడి తెచ్చారని..ఈ వ్యవహారంలో సీఎం రమేష్, యనమల రామకృష్ణుడు చక్రం తిప్పారని తమ్మినేని సీతారాం ఆరోపించారు. స్పీకర్ స్థానంలో ఉండి ప్రతిపక్ష నేతలపై బహుశా ఈ స్థాయిలో విమర్శలు చేసిన స్పీకర్ మరొకరు లేరనే చెప్పాలి. ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఆయన వ్యాఖ్యలపై టీడీపీ నేత నారా లోకేష్ కూడా స్పందించారు. బహిరంగ లేఖ రాసి స్పీక‌ర్ స్థానాన్ని ఆగౌరవపరిచేలా మాట్లాడొద్దని కోరారు. గౌర‌వ‌నీయులైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ స్పీక‌ర్ శ్రీ త‌మ్మినేని సీతారాం గారికి, అధ్య‌క్షా! బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల‌కు చెందిన త‌మ‌రు అత్యున్న‌త‌మైన శాస‌న‌స‌భాప‌తి స్థానం అలంక‌రించ‌డం చాలా అరుదైన అవ‌కాశం. మీ విద్యార్హ‌త‌లు, రాజ‌కీయానుభ‌వం స్పీక‌ర్ ప‌ద‌వికే వ‌న్నె తెస్తాయని ఆశించాను. విలువలతో సభని హుందాగా నడిపిస్తా అని మీరు మాట్లాడిన మాటలు నన్నెంతో ఆక‌ట్టుకున్నాయి. విలువలతో సభ నడిపించి ట్రెండ్ సెట్ చేస్తా అన్న మీరు స్పీకర్ పదవిలో ఉండి అసభ్య పదజాలంతో మాట్లాడే ట్రెండ్ సెట్ చేస్తారని అనుకోలేదు. ఆరుసార్లు ఇదే స‌భ‌లో స‌భ్యుడిగా వ్య‌వ‌హ‌రించిన మీరు అదే స‌భ‌కు అధ్య‌క్షులుగా ప్ర‌స్తుతం ఉన్నార‌నే విష‌యాన్ని ఒక్క‌సారి గుర్తు చేస్తున్నాను. స‌భాప‌తిగా ప్ర‌తిప‌క్ష‌నేత‌పై మీరు చేసిన వ్యాఖ్య‌లు ఉద్దేశ‌పూర్వ‌కంగా చేసిన‌వేనా అనే అనుమానం క‌లుగుతోంది. ఎనిమిదిసార్లు శాస‌న‌స‌భ‌కు ఎన్నికై, ముఖ్య‌మంత్రిగా, ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ప‌నిచేసి విజ‌న‌రీ లీడ‌ర్‌గా ప్ర‌స్తుతించ‌బ‌డిన చంద్ర‌బాబుగారి గురించి 'గుడ్డలూడ‌దీయిస్తా' అంటూ మీరు చేసిన వ్యాఖ్య‌లు మీ స్పీక‌ర్ స్థానాన్ని చిన్న‌బుచ్చేలా ఉన్నాయ‌ని నాక‌నిపిస్తోంది. స‌భామ‌ర్యాద‌లు మంట‌గ‌లిసిపోకుండా కాపాడే గౌర‌వ‌స్థానంలో ఉండి..ప్ర‌తిప‌క్ష‌నేత‌ను అవమానిస్తూ మీరు చేసిన వ్యాఖ్య‌లు చాలా మంది చంద్ర‌బాబుగారి అభిమానుల్లాగే న‌న్నూ బాధించాయి. బ‌డుగు, బ‌ల‌హీన‌వ‌ర్గాల పార్టీ అయిన తెలుగుదేశం శాస‌న‌సభాప‌క్ష నేతని మీరు ఎన్నో మెట్లు దిగ‌జారి దూషించి..దానినే 'నేనొక ప్ర‌జాప్ర‌తినిధిగా మాట్లాడుతున్నా'నంటూ స‌మ‌ర్థించుకోవ‌డం హర్షణీయం కాదు. మీరు చేసిన వ్యాఖ్యలే సభలో సభ్యులెవరన్నా చేస్తే మీరెలా స్పందిస్తారు? వాటిని అన్‌పార్లమెంటరీ పదాలు అని తొలగిస్తారా లేక సభలో హుందాగా మాట్లాడాలి, బయట ఎలా మాట్లాడినా పరవాలేదని సూచిస్తారా? వైఎస్ హ‌యాంలో అగ్రిగోల్డ్ మోసాలు వెలుగుచూశాయి. టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో డిపాజిట్‌దారుల వివ‌రాలు సేక‌రించాం. న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యించి అగ్రిగోల్డ్ ఆస్తుల‌ను కాపాడాం. ఈ రోజు అగ్రిగోల్డ్‌కి సంబంధించి ఒక్క సెంటుభూమి కూడా యాజ‌మాన్యానికి, ఇత‌రుల‌కు ద‌క్క‌కుండా కాపాడింది తెలుగుదేశం ప్ర‌భుత్వం మాత్ర‌మే. బాధితుల‌కు న్యాయం చేయాల‌ని రూ.336 కోట్లు సిద్ధంచేస్తే.. అగ్రిగోల్డ్ ఆస్తుల‌పై క‌న్నేసిన వైకాపా నేత‌లే కోర్టులో కేసులు వేసి మ‌రీ అడ్డుకున్నారు. ఇప్పుడు ఆ నిధుల నుండే రూ.264 కోట్లను పంపిణీ చేసి మిగతా రూ.72 కోట్లు మింగేశారు. అలాగే అగ్రిగోల్డ్ బాధితుల్ని ఆదుకునేందుకు బ‌డ్జెట్‌లో కేటాయించిన రూ.1150 కోట్లు ఏమ‌య్యాయో తెలియ‌డంలేదు. మీరు ఇటీవ‌ల ఉగాండా వెళ్లారు. మిమ్మ‌ల్ని కుటుంబ‌స‌మేతంగా తాడేప‌ల్లి ఇంటికి పిలిపించుకున్న జ‌గ‌న్ గారు మీ విదేశీ ప‌ర్య‌ట‌న చాలా చ‌క్క‌గా సాగాల‌ని అభిల‌షిస్తూ పుష్ప‌గుచ్ఛం అంద‌జేశారు కూడా. అక్క‌డి స‌ద‌స్సులో మీరు తెలుసుకున్న విలువ‌లు, స‌భామ‌ర్యాద‌లు మ‌న రాష్ట్ర శాస‌న‌స‌భ‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి అనుకున్నాం. అలాంటిది అట్నుంచి వ‌చ్చాక మీరు ఇలా ప్ర‌తిప‌క్ష‌నేత‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌ల వెనుక మ‌ర్మ‌మేంటో చెప్ప‌గ‌ల‌రా? అలాగే అగ్రిగోల్డ్‌తో నాకు సంబంధం ఉంద‌ని కూడా మీరు వ్యాఖ్యానించారు. ప్ర‌భుత్వంలో ఉన్న‌ది మీరే క‌దా!అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా నాపై చేసిన ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయారు.గౌర‌వ‌నీయ స‌భాప‌తి స్థానం నుంచి ప్ర‌తిప‌క్ష‌నేత‌పైనా, మండలి స‌భ్యుడినైన నాపైనా నిందారోప‌ణ‌లు చేయడం మీ స్పీక‌ర్ స్థానానికి స‌ముచితం కాదు. అగ్రిగోల్డ్ బాధితుల‌కు టీడీపీ హ‌యాంలో అందించే సాయాన్ని వైకాపా నేత‌లు అడ్డుకోకుండా ఉండి ఉంటే.. ఇప్ప‌టిక‌న్నా ఎక్కువ సాయమే అందేది. మీరు చేసిన ఆరోప‌ణ‌ల‌కు క‌ట్టుబ‌డి ఉంటాను అంటే నాదొక స‌వాల్‌. అగ్రిగోల్డ్‌కి సంబంధించి ఏ ఒక్క అంశంలోనైనా నాకు సంబంధం ఉంద‌ని నిరూపిస్తే నా ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసి రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాను. ఒక‌వేళ మీరు చేసిన ఆరోప‌ణ‌లు అన్నీ అవాస్త‌వాల‌ని తేలితే..మీరేం చేస్తారో కూడా చెప్పాల‌ని ఈ బ‌హిరంగ లేఖ ద్వారా స‌వాల్ విసురుతున్నాను. ఇటువంటి బురద జల్లే ఆలోచనలన్నిటి వెనుకా మీ పార్టీ అధ్యక్షులవారి ప్రోద్భలం, ప్రోత్సాహం ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. మీ ఆరోపణలకు కూడా అదే కారణమై ఉంటుంది. కాబట్టి మీ ఆరోపణలు అవాస్తవమని తేలితే, మీరన్నట్టే ఒక ప్రజా ప్రతినిధిగా మీ పార్టీ అధ్యక్షుడి గుడ్డలూడదీసి, రాజకీయాల నుండి తప్పించేలా సవాల్ స్వీకరిస్తారని ఆశిస్తూ... ఇట్లు నారా లోకేశ్‌ ఎమ్మెల్సీ, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి

నవంబర్ 11వ తేదీ నుండి స్విగ్గీ, జోమాటో సంస్థలపై నిషేధం!!

  టెక్నాలజీ పెరిగేకొద్దీ మనిషిలో బద్దకం అంతకు రెట్టింపు పెరుగుతూనే ఉంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు పక్కనే ఉన్న అంగడికి కూడా ఎవరూ వెళ్లడం లేదు. చిన్న గుండుసూది నుంచి ఇష్టమైన ఆహారం వరకు అన్నింటిని ఆన్ లైన్ లొనే ఆర్డర్ చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో స్విగ్గీ, జొమాటో లాంటి ఆన్ లైన్ సంస్థలు వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్ ను భారీ డిస్కౌంట్ లతో అందిస్తుండటంతో ఆన్ లైన్ ఫుడ్ కి మరింత డిమాండ్ పెరిగింది. డిమాండ్ సంగతి దేవుడెరుగు..ఆ సంస్థలు మమ్మల్ని మాత్రం మోసం చేస్తున్నాయంటూ వాపోతున్నారు హోటల్స్ యజమానులు. సోమవారం నుంచి స్విగ్గీని నిషేధిస్తున్నామని తేల్చి చెప్పేస్తున్నారు.  వారమంతా కష్టపడి వీకెండ్ లో ఫ్యామిలీతో సరదాగా రెస్టారెంటుకు వెళ్ళేవారి సంఖ్య పూర్తిగా తగ్గి ప్రతి చిన్నవి ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకొని ఇంట్లోనే ఎంజాయ్ చేసే వారి సంఖ్య పెరిగింది. స్విగ్గీ, జొమాటో వంటి అనేక సంస్థలు.. అందుకు అనుగుణంగా ఆన్ లైన్ యాప్లను అందుబాటులోకి తీసుకు వచ్చాయి. వివిధ హోటల్స్.. రెస్టారెంట్లతో.. కమిషన్ల లెక్కన ఒప్పందం చేసుకొని ప్రజలకు ఆహార పదార్థాలను చేరవేస్తున్నాయి. హోటల్ కు వచ్చే వారికన్నా ఆన్ లైన్లో వ్యాపారం జోరుగా సాగుతుండటంతో హోటల్ నిర్వాహకులు కూడా స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలతో ఒప్పందాలు  చేసుకోక తప్పదని చేసుకుంటున్నాయి.  అయితే 16 నెలల క్రితం కేవలం 0 నుంచి 10 శాతం కమీషన్లతో ఈ ఆన్లైన్ ఆర్డర్ ప్రక్రియను సంస్థలు ప్రారంభించాయి. అప్పుడు ఇరువర్గాలకు లాభం ఉండేదని..ఇటీవల వినియోగదారుల నుంచి విశేష స్పందన రావడంతో ఆన్లైన్ సంస్థలు 10 శాతం కమిషన్ కాస్త 18 నుంచి 25 శాతానికి పెంచేశాయి. దీంతో హోటల్ నిర్వాహకుల్లో ఆందోళన మొదలైంది. ఆన్లైన్ సంస్థల డిమాండ్ల పై విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ నెల 11 నుంచి స్విగ్గీ సంస్థను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు.  కమీషన్ వ్యవహారం ఎన్నోసార్లు చర్చకు వచ్చినా ఆన్ లైన్ సంస్థల తీరులో మార్పు రాకపోవడంతో వాటి ద్వారా అమ్మకాలను నిలిపి వేయాలని నిర్ణయించినట్లు చెప్పారు హోటల్ నిర్వాహకులు. ఇప్పటికే అంతంత మాత్రంగా హోటల్స్ నిర్వహిస్తున్నామని.. అలాంటిది ఇప్పుడు ఏకంగా 25 శాతం కమీషన్ అంటే నష్టంతో అమ్ముకోవలిసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఆన్ లైన్ సంస్థలు అందినంత వరకు దోచుకొని తమను ముంచాలని చూస్తే ఎలా ఊరుకుంటామని ప్రశ్నిస్తున్నారు హోటల్ యజమానుల సంఘం ప్రతి నిధులు. స్విగ్గీతో పాటు ఇతర సంస్థలతో కూడా చర్చిస్తున్నామని వారు కూడా ఇదే పద్దతిలో ఉంటే ఆ సంస్థలను కూడా నిషేధిస్తామని స్పష్టం చేశారు.

ఐదుగురు జడ్జిలదీ ఒకే మాట... ఏకాభిప్రాయంతో అయోధ్య తీర్పు...

  దశాబ్దాలుగా నలుగుతోన్న అయోధ్య వివాదానికి ముగింపు పలుకుతూ... సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో జడ్జిల మధ్య బేధాభిప్రాయాలు రావడం సహజం. కానీ, అయోధ్య కేసులో మాత్రం సీజేఐ రంజన్ గొగోయ్ తోపాటు మిగతా సభ్యులైన జస్టిస్ బాబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌... మొత్తం ఐదుగురూ... ఎలాంటి భిన్నాభిప్రాయాలను తావు లేకుండా... ఒకే మాటపై తీర్పు ఇచ్చారు. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామజన్మభూమి న్యాస్ కు అప్పగించాలని, అప్పటివరకు అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని ఏకాభిప్రాయంతో చెప్పారు. అలాగే, అయోధ్య యాక్ట్ కింద మూడు నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది. అదేవిధంగా అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని సున్నీ బోర్డుకు ఇవ్వాలని సూచించింది. అయితే, ఐదుగురు సభ్యులు రాజ్యాంగ ధర్మాసనంలో ఒకరు ముస్లిం ఉన్నప్పటికీ... మొత్తం అందరూ ఏకాభిప్రాయంతో జడ్జిమెంట్ ఇవ్వడంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

అయోధ్య వివాదంపై సుప్రీం తీర్పు వెనుక కారణాలు ఏంటి?

  దేశ చరిత్రలోనే అతి పెద్ద తీర్పు. ఎప్పుడెప్పుడా అనుకుంటూనే ఆరు తరాల కాలం గడిచిపోయింది. భూమి గురించి మొదలైన గొడవ కాస్త రెండు మతాల మధ్య వివాదంగా మారింది. మాదంటే మాది అంటూ కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న వాగ్వాదాలకి నేడు తెర పడింది. అయోధ్య కేసులో తుది తీర్పు వెల్లడించింది సుప్రీం కోర్టు. జస్టిస్ గోగోయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును ప్రకటించారు. కోర్టు హాలు నెం.1 లో ధర్మాసనంలోని ఐదుగురు న్యాయమూర్తులు సమావేశం అయ్యారు. కేంద్ర నుండి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహ్రా, రాజీవ్ ధావన్‌లు హాజరయ్యారు. మొట్టమొదటిగా అయోధ్య కేసులో భాగంగా వివాదాస్పద భూమి తమదేనంటూ షియా వక్ఫ్ బోర్డు వేసిన పిటిషన్‌ అనర్హమైందంటూ ఏకాభిప్రాయంతో కొట్టివేసినట్లు వెల్లడించారు. బాబ్రీ మసీదు ఎప్పుడు నిర్మించారో సరైన ప్రాతిపదిక లేనందున.. బాబర్ కాలంలోనే మసీదు నిర్మించినట్లుగా పరిగణలోకి తీసుకుంటూ.. మత గ్రంథాలను ఆధారం చేసుకుని కోర్టు తీర్పు ఇవ్వదని స్పష్టం చేశారు జస్టిస్ గొగోయ్. కానీ నిర్ణయం తీసుకునే ముందు రెండు మతాల విశ్వాసాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం చూస్తే వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందిందని.. వివాదాస్పద స్థలంపై ఎవ్వరికి యాజమాన్య హక్కు లేదని స్పష్టం చేశారు. ఆ స్థలంలో ముందుగా మందిరం ఉన్నట్లు పురావస్తు శాఖ నివేదికలు చెబుతున్నాయని.. అందుకుగాను అది వాదించిన న్యాయమూర్తులు రామ్‌లల్లా, విరాజ్‌మాన్‌లకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్టు. మసీదు నిర్మాణం జరిగినా.. ఎప్పుడు కట్టారు ? ఎవరు కట్టారు? అనే అంశాలు స్పష్టం కానట్లుగా హైకోర్టు తీర్పులో ఉందని సుప్రీం న్యాయమూర్తి గోగోయ్ చెప్పారు. అయోధ్య రాముడి జన్మభూమిగానే భావిస్తున్నామని.. ఈ విషయంలో ఎలాంటి వివాదాలకు తావులేదని జస్టిస్ గొగొయ్ అన్నారు. నమ్మకం, మత విశ్వాసాలు ఆధారంగా న్యాయస్థానం తీర్పు ఇవ్వలేదని.. అందులో కోర్టులు జోక్యం చేసుకోవని తెలిపారు. అయోధ్య వివాదాస్పద స్థలంలో న్యాయసూత్రాల ఆధారంగా ఇకపై ఎలాంటి వివాదాలు తలెత్తకుండా భూ యాజమాన్య హక్కులు నిర్ణయించాలని కోరారు.  ఇక వివాదాస్పద స్థలాన్ని ఇరువురికి పంచే ప్రసక్తేలేదని.. మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోనే ఎక్కడైనా ఐదు ఎకరాల భూమిని ముస్లింలకు కేటాయించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివాదాస్పద స్థలాన్ని అయోధ్య ట్రస్ట్‌కు మూడు నెలల్లోగా అప్పగించాలని తీర్పును వెల్లడించింది ధర్మాసనం. వివాదాస్పద స్థలాన్ని రామ జన్మభూమి న్యాస్‌కు అప్పగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

అయోధ్య తుది తీర్పు.. సంతృప్తికరంగా లేదు.. కానీ?

  ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. సున్నీ వక్ఫ్ బోర్డు పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం.. వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని రామమందిర నిర్మాణానికి అప్పగించింది. వివాదాస్పద స్థలంలోని నిర్మాణాలకు ఇస్లాం మూలాలు లేవని స్పష్టం చేసింది. 1857కు ముందు నుంచే ఈ ప్రాంతాన్ని హిందువులు సందర్శించారనేందుకు ఆధారాలున్నాయని తెలిపింది. మందిర నిర్మాణానికి మూడు నెలల్లోగా ట్రస్టు ఏర్పాటు చేయాలని.. మందిర నిర్మాణానికి ట్రస్టీల నియామకం, విధివిధానాలు మూడు నెలల్లోగా పూర్తి చేయాలని సుప్రీం సూచించింది. అదేవిధంగా అయోధ్యలో మసీదు నిర్మాణానికి.. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల మేర తగిన స్థలాన్ని ఇవ్వాలని జస్టిస్ గొగోయ్ పేర్కొన్నారు. మసీదు నిర్మాణానికి స్థలం కేటాయించేందుకు ట్రస్టు ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా, సుప్రీం తీర్పుపై సున్నీ వక్ఫ్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. వక్ఫ్ బోర్డు తరఫు న్యాయవాది షేక్ అహ్మద్ సయ్యద్ మాట్లాడుతూ.. తీర్పు సంతృప్తికరంగా లేదని అన్నారు. కానీ తీర్పుని గౌరవిస్తామన్నారు. తీర్పు కాపీని మరింత పరిశీలించాల్సి ఉందని, ఆ తర్వాతే భవిష్యత్ కార్యాచరణ చెప్తా అన్నారు. అందరూ శాంతియుతంగా ఉండాలని, ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని సయ్యద్ విజ్ఞప్తి చేశారు.  

అలహాబాద్ హైకోర్టు తీర్పుని తప్పుబట్టిన సుప్రీం... తుది తీర్పు ఏంటంటే?

  అయోధ్యలోని వివాదాస్పద రామ జన్మభూమి-బాబ్రీ మసీదుపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. సున్నీ వక్ఫ్ బోర్డు స్పెషల్ లీవ్ పిటిషన్ ను కొట్టివేసింది. అలాగే, నిర్మోహి అఖాడా దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కొట్టివేసింది. వివాదాస్పద భూభాగాన్ని అలహాబాద్ హైకోర్టు విభజించడం ఆమోదయోగ్యం కాదని సుప్రీం స్పష్టం చేసింది. భూమిని రామజన్మభూమి న్యాస్‌కు అప్పగించాలని సుప్రీం తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో అయోధ్య యాక్ట్ కింద ట్రస్ట్ మూడు నెలల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించింది.  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్ తీర్పును చదువుతూ... రాజకీయాలు, చరిత్రకు అతీతంగా న్యాయం ఉండాలని అన్నారు. అయోధ్య కేసుపై ఐదుగురు న్యాయమూర్తులు ఏకగ్రీవ తీర్పు ఇచ్చారన్నారు. బాబ్రీ నిర్మాణంపై ప్రధాన న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ అంతర్గత నిర్మాణం ఇస్లామిక్ శైలిలో లేదని వ్యాఖ్యానించారు. అఖాడా వాదనను కోర్టు తోసిపుచ్చింది. సున్నీ వక్ఫ్ బోర్డు తరుచూ మాటమార్చిందన్నారు. మసీదు కింద 12వ శతాబ్దం నాటి భారీ పురాతన కట్టడ ఆనవాళ్లు ఉన్నాయన్న పురావస్తు శాఖ వాదనలను తోసిపుచ్చలేమని తెలిపారు. కానీ అది రామాలయమని పురావస్తు శాఖ ఆధారాలు చూపలేదన్నారు. అయితే అయోధ్యను రామ జన్మభూమిగా హిందువులు విశ్వసిస్తారని గొగోయ్ అన్నారు. బాబ్రీ మసీద్‌ నిర్మాణ తేదీపై స్పష్టత లేదని, మొఘలుల సమయం నుంచే హక్కు ఉన్నట్లు వక్ఫ్ బోర్డు నిరూపించలేకపోయిందని అన్నారు. శుక్రవారం రోజు ముస్లింలు ప్రార్థనలు చేసినట్లు మాత్రమే ఆధారాలు సమర్పించిందని వెల్లడించారు. మొగల్ చక్రవర్తి బాబర్ దగ్గర పని చేసిన సైనికాధికారులు మసీదును నిర్మించారని అన్నారు. అదేవిధంగా, బాబ్రీ మసీదు కూల్చివేత సరైనదని కాదని జస్టిస్ గొగోయ్ పేర్కొన్నారు. 1949లో విగ్రహాలను పెట్టి మసీదును అపవిత్రం చేయడం, 1992లో మసీదును కూల్చివేయడం చట్టాన్ని ఉల్లంఘించడం కిందికే వస్తుందని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. ముస్లింలకు ప్రత్యామ్నాయ ప్రదేశం చూపించాలని ఆదేశించారు. అయోధ్యలో మసీదు నిర్మాణానికి.. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల మేర తగిన స్థలాన్ని ఇవ్వాలని జస్టిస్ గొగోయ్ పేర్కొన్నారు. మసీదు నిర్మాణానికి స్థలం కేటాయించేందుకు ట్రస్టు ఏర్పాటు చేయాలని సూచించారు.

అయోధ్యలో నాలుగంచెల భద్రత... యూపీలో అడుగడుగునా పోలీసులు...

  అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశించింది. తీర్పు తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అల్లర్లు, మత ఘర్షణలు జరగకుండా కేంద్ర హోంశాఖ సెక్యూరిటీ అలర్ట్ ఇచ్చింది. అంతేకాదు, తీర్పు ఎలాగున్నా ఏమీ మాట్లాడొద్దంటూ మంత్రులకు, బీజేపీ నేతలకు ప్రధాని మోడీ ఆదేశించారు. అలాగే ఇరువర్గాలూ సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ఇక, ఉత్తరప్రదేశ్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పోలీసులు పెద్దఎత్తున బలగాలను మోహరించారు. వివాదాస్పద అయోధ్య స్థలం దగ్గర నాలుగంచెల భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 14వేల మంది పోలీసులను మోహరించారు. అలాగే 4వేల మంది పారామిలటరీ బలగాలను రంగంలోకి దించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ఒకవేళ పెద్దఎత్తున అరెస్టులు చేయాల్సి వస్తే... జనాన్ని ఉంచేందుకు స్కూళ్లు, కాలేజీలను తాత్కాలిక జైళ్లుగా మార్చేశారు. ఇక, అత్యంత కీలకమైన సోషల్ మీడియా వేదికలను సైతం పోలీసులు తమ కంట్రోల్ లోకి తీసుకున్నారు. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌... ఇలా అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పైనా నిఘా పెట్టారు. సోషల్ మీడియాలో ఎవరూ కూడా వివాదాస్పద కామెంట్స్, వ్యాఖ్యానాలు చేయొద్దని ఆంక్షలు విధించారు. ఎవరైనా రెచ్చగొట్టేవిధంగా పోస్టులు చేసినా, వైరల్ చేసినా, లైకులు, షేర్లు చేసినా.... జాతీయ భద్రతా చట్టం కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇక, యూపీ పోలీసులు అలర్ట్ ఉండటం కోసం... అత్యంత వేగంగా స్పందించడం కోసం.... ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ తోపాటు ఒక ప్రత్యేక యాప్ ను వినియోగిస్తున్నారు.

ఇది ఎవరికీ విజయం కాదు... ఓటమి కాదన్న మోడీ... సీజేఐకి జడ్ ప్లస్ భద్రత... 

  అత్యంత సున్నితమైన అయోధ్య తీర్పును వెలువరించనున్న భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ కి భద్రతను కట్టుదిట్టం చేశారు. తీర్పు నేపథ్యంలో గొగోయ్ కి జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పిస్తున్నారు. అలాగే, రాజ్యాంగ ధర్మాసనంలోని మిగతా సభ్యులైన జస్టిస్ ఎస్ ఏ బాబ్డే, డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ ఏ నజీర్ ల భద్రతను కూడా పెంచారు.  ఇక, అయోధ్య కేసులో సుప్రీం ఇవ్వబోయే తీర్పు... ఎవరికీ విజయం కాదు.... అలాగని ఓటమి కాదని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఈ తీర్పు భారతదేశ శాంతి, ఐక్యత మరియు సద్భావన, అలాగే గొప్ప సంప్రదాయానికి నాంది కావాలన్నారు. అలాగే, న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. సుప్రీం తీర్పు తర్వాత సమాజంలో శాంతి నెలకొనేలా యావత్ దేశం కలిసిమెలిసి నిలబడదామంటూ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. అయోధ్య తీర్పును వెలువరించబోతున్న సీజేఐ రంజన్ గొగోయ్..... యూపీలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆరా తీశారు. భద్రతా ఏర్పాట్లు, ముందుజాగ్రత్త చర్యలను యూపీ సీఎస్ అండ్ డీజీపీని అడిగి తెలుసుకున్నారు. అయితే, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేసినట్లు సీజేఐకి యూపీ సీఎస్ అండ్ డీజీపీ వివరించారు.

అయోధ్యపై అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతోంది?

  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇవ్వబోయే అయోధ్య తీర్పుపై యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సీజేఐ రంజయ్ గొగోయ్ తోపాటు జస్టిస్ ఎస్ ఏ బాబ్డే, డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ ఏ నజీర్ లు ఈ రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్నారు.  వివాదాస్పద స్థలం 2.77 ఎకరాల భూమిలో రామ మందిరం ఉండేదని హిందువులు.... కాదుకాదు మసీదు ఉండేదని ముస్లింలు వాదిస్తున్నారు. అయితే, రామమందిరాన్ని కూల్చే అక్కడ మసీదును నిర్మించారని, ఆ ప్రాంతం రాముడు జన్మించిన నేల అంటూ హిందువులు అంటున్నారు. అయితే, అయోధ్య స్థల వివాదంపై దాఖలైన 4 సివిల్ దావాలపై అలహాబాద్ హైకోర్టు 2010లో కీలక తీర్పు ఇచ్చింది. ప్రధానంగా కక్షిదారులుగా ఉన్న ముగ్గురిని సమానంగా భూమిని పంచుకోవాలని జడ్జిమెంట్ చెప్పింది.  2.77 ఎకరాల వివాదాస్పద భూమిని.... సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహీ ఆఖాడా, రామ్ లల్లూ.... కలిసి పంచుకోవాలంటూ అలహాబాద్ హైకోర్టు ఇఛ్చిన తీర్పును... సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. దాంతో  2011 మేలో అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించింది. అయితే, తొలుత మధ్యవర్తిత్వంతో సమస్యను పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించినా, ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో.... 2016 ఆగస్ట్ 6 నుంచి అక్టోబర్ 16 వరకు రోజువారీ విచారణ జరిపింది. తుది వాదనలు తర్వాత తీర్పును రిజర్వు చేసి.... దాదాపు 24రోజుల తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వబోతోంది.

ట్యాంక్ బండ్  పై మిలియన్ మార్చ్ మంటలు... రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టులు

  ఆర్టీసీ జేఏసీ ఛలో ట్యాంక్ బండ్ పిలుపు కేసీఆర్ సర్కారు గుండెల్లో గుబులుపుట్టిస్తోంది. మిలియన్ మార్చ్ తో సత్తా చాటేందుకు ఆర్టీసీ కార్మికులు ఉవ్విళ్లూరుతుండటంతో ప్రభుత్వం కంగారుపడుతోంది. ఆర్టీసీ కార్మికుల ఛలో ట్యాంక్ బండ్ ను విఫలం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే, ఎలాగైనాసరే అనుకున్నది చేసి చూపించాలని ఆర్టీసీ జేఏసీ పట్టుదలగా ముందుకు కదులుతోంది. ఆర్టీసీ ఛలో ట్యాంక్‌బండ్‌‌కు అనుమతి నిరాకరించిన పోలీసులు... రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. జిల్లాల నుంచి ఎవరూ హైదరాబాద్ రాకుండా.... ఆర్టీసీ కార్మికులను కట్టడి చేస్తున్నారు. అలాగే, విపక్ష పార్టీల కార్యకర్తలు సైతం హైదరాబాద్ తరలిరాకుండా... ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. జిల్లాల నుంచి హైదరాబాద్‌ కి వచ్చే అన్ని రహదారులను పోలీసులు తమ కంట్రోల్ లోకి తీసుకుంటున్నారు. పోలీసుల ముందస్తు అరెస్టులతో ఆర్టీసీ జేఏసీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరికొందరు తమ ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకుంటున్నారు. అయితే, ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్ రాజిరెడ్డిని  హైదరాబాద్‌ విద్యానగర్‌లో పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఇక, ట్యాంక్ బండ్ తోపాటు హుస్సేన్ సాగర్ చుట్టూ పెద్దఎత్తున బలగాలను మోహరించారు. అనుమాం వస్తే చాలు అదుపులోకి తీసుకుంటున్నారు ఛలో ట్యాంక్‌బండ్‌ను విఫలం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్దామరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా, ఆటంకాలు కల్పించినా.... పెద్దఎత్తున తరలివచ్చి... కార్మికుల ఐక్యతను చాటాలని అశ్వద్ధామరెడ్డి పిలుపునిచ్చారు. పోలీసుల తీరుపై మండిపడ్డ అశ్వద్ధామరెడ్డి.... కార్మికుల ఇళ్లల్లోకి ప్రవేశించి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఫైరయ్యారు. అయితే, ఎన్ని ఆంక్షలు విధించినా, నిర్బంధించినా.... ట్యాంక్‌బండ్‌పై జకల జనుల సామూహిక దీక్షలు నిర్వహించి తీరుతామని ప్రకటించారు. ఇక, ఆర్టీసీ జేఏసీ పిలుపుతో విపక్ష పార్టీలతోపాటు వివిధ ప్రజాసంఘాలు, విద్యార్ధి సంఘాలు.... ఈ మిలియన్ మార్చ్ లో పాల్గోనున్నాయి.

కాసేపట్లో అయోధ్య తీర్పు... దేశవ్యాప్తంగా సూపర్ హైఅలర్ట్

  దశాబ్దాలుగా కొనసాగుతోన్న అయోధ్య భూవివాదంపై మరికాసేపట్లో సుప్రీంకోర్టులో తుది తీర్పు ఇవ్వనుంది. రామజన్మభూమి, బాబ్రీ మసీదు స్థల వివాదంపై చరిత్రాత్మక తీర్పును ఇవ్వబోతోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించనుంది. సుప్రీంకోర్టు చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా సాగిన రెండో కేసుగా ఇది రికార్డులకెక్కింది. అయోధ్యలో 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని... నిర్మోహి అఖాడ, రాంలాల్‌ విరాజ్‌మని‌, సున్నీ వక్ఫ్‌ బోర్డుకు సమానంగా పంచుతూ... అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ... దాఖలైన 14 పిటిషన్లపై సుప్రీంకోర్టు సుదీర్ఘకాలం విచారణ జరిపింది. 2019 ఆగస్ట్ 6నుంచి అక్టోబర్ 16వరకు మొత్తం 40రోజులపాటు బహిరంగ విచారణ జరిగింది. సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వాదనలు వింది. హిందువుల నమ్మకం ప్రకారం ఇది రామజన్మభూమిగా కొనసాగుతోందని, అలాగే రామాలయానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని హిందూ వర్గమైన రాంలాలా విరాజ్‌మని తరపున న్యాయవాదులు వాదించారు. బాబర్ వచ్చి మసీదును నిర్మించాక... ఇక్కడ ప్రతి శుక్రవారం ప్రార్థనలు జరిగేవని సున్నీ వక్ఫ్ బోర్డు ధర్మాసనానికి నివేదించింది. ఈ పిటిషన్లతోపాటు పలు వ్యక్తిగత, హిందూసభ, వీహెచ్‌పీ తదితర పిటిషన్లపైనా వాదనలు జరిగాయి. అనంతరం రాతపూర్వకంగా వాదనలను కూడా సుప్రీం ఇవాళ తుది తీర్పు ఇవ్వబోతోంది. అయోధ్య తీర్పుపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే, తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా తమకు సమ్మతమేనని ఇటు హిందూ సంస్థలు.... అటు ముంస్లిం వర్గాలు చెబుతున్నాయి.  

మోడీని కలవనున్న ఎల్వీ.. జగన్ అనుమానమే నిజమైందా?

  ఏపీ ప్రభుత్వం ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఆయనను బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా నియమించారు. అయితే ఎల్వీ నెల రోజుల పాటు సెలవుపై వెళ్లారు. మరోవైపు ఎల్వీని బదిలీ చేసిన విధానం సరైంది కాదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు ఎల్వీ బదిలీని తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎల్వీ ప్రధాని మోడీని కలవనున్నారనే వార్త హాట్ టాపిక్ గా మారింది. ఎల్వీ మోడీతో భేటీ అయ్యే తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 15వ తేదీన ఆయన ఢిల్లీ వెళ్లి మోడీని కలవనున్నారని సమాచారం. ఎల్వీ మోడీని కలవనున్నారనే వార్త రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఎల్వీకి ఆరెస్సెస్ తో సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆయన ఏపీలో జరిగే ప్రతి చిన్న విషయాన్నీ.. ఆరెస్సెస్, బీజేపీలకు చేరుస్తున్నారన్న అనుమానంతోనే.. ఆయన్ని సీఎస్ పదవి నుంచి జగన్ తప్పించారని ప్రచారం జరిగింది. ఇప్పుడు సీఎస్ మోడీని కలబోతున్నారన్న వార్తలు ఒక్కసారిగా హీట్ పెంచాయి. సీఎస్ మోడీని కలిసి ఏం చెప్పబోతున్నారు? ఏపీ సర్కార్ ని ఇరుకున్న పెట్టే పని ఏమైనా చేయబోతున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. ఎల్వీకి మరో ఐదు నెలల సర్వీసు ఉంది. దాంతో ఆయనను కేంద్రం తన సేవలకు వినియోగించుకోనుందనే ప్రచారం కూడా జరుగుతోంది. అసలే తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని చూస్తున్న బీజేపీ వచ్చిన ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవట్లేదు. మరి ఇప్పుడు ఎల్వీ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ సర్కార్ ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తుందేమో చూడాలి.  

ఐదేళ్ల చిన్నారి పై దారుణానికి పాల్పడ్డ దుండుగులు...

  చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లలో దారుణం చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి పెళ్లికొచ్చిన ఐదేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసిన దుండగులు దారుణంగా హతమార్చారు. బి కొత్తకోట మండలం గట్టు గ్రామ పంచాయతీలోని గుట్ట పాలెం గ్రామానికి చెందిన ఉషారాణి, సిద్దారెడ్డి దంపతులు తమ ఐదేళ్ల కుమార్తె వర్షితను తీసుకుని అంగళ్లలో బంధువుల పెళ్లికి వెళ్లారు. పెళ్లికి వెళ్లిన తరువాత వర్షిత కనిపించకుండా పోయింది. గుర్తు తెలియని వ్యక్తులు చిన్నారిని కిడ్నాప్ చేసిన తరువాత లైంగిక దాడి చేసి చంపేసినట్లుగా అనుమానిస్తున్నారు. వర్షితను కిడ్నాప్ చేస్తున్న దృశ్యాలు సీసీ టీవీ కెమెరాకు చిక్కాయి. పోలీసులు ఈ ఘటన పై దర్యాప్తు చేస్తున్నారు.   ఐదేళ్ల చిన్నారి హర్షిత పెళ్లిలో ఆడుకుంటూ ఉండగా ఒక యువకుడు ఆ పాపను తీసుకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది.  తర్వాత ఆ పాపను అత్యాచారం చేసి చంపేసినట్టుగా వెల్లడైయ్యింది. అప్పటి వరకు ఆడుకుంటూ ఉత్సాహంగా ఉన్నటువంటి పాప తొమ్మిది గంటల యాభై నిమిషాల ప్రాంతంలో ఒక యువకుడు ఫొటో తీస్తా అంటూ తీసుకు వెళ్ళినట్టుగా వెల్లడించారు తల్లిదండ్రులు. పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు పాప కోసం వెతికారు. రాత్రి అంతా కళ్యాణ మండపంతో పాటు సమీప ప్రాతంలో ఎంత వెతికినా కూడా పాప కనిపించకపోవడంతో ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మండపానికి సమీపంలోనే ఈ చిన్నారి మృతి చెందిందన్న వార్త పెళ్ళికి వచ్చిన బంధువుల ద్వారా సమాచారం తెలుసుకున్న తల్లీదండ్రులు  ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. నిర్మానుష్య  ప్రాంతంలో ఉన్న పాప మృతిదేహం దగ్గరకు వెళ్ళి కన్నీటి పర్యాంతం అయ్యారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పోలీసులు అధికారులు వీలైనంత త్వరలో ఆ కామాంధుడిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

మహా రాజకీయం కథ నేటితో కంచెకు చేరనుందా?

  మహా రాజకీయం ఇటివల చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ అర్ధరాత్రితో మహారాష్ట్ర లోని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఆయుష్షు తీరిపోతుంది. ఆలోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. కానీ పక్షంలో రాష్ట్రపతి పాలన తప్పదు. గవర్నర్ విచక్షణాధికారాన్ని వినియోగించి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ను కొనసాగమని కూడా కోరవచ్చు.  ఎన్నికల ఫలితాలు వచ్చి 15 రోజులైనా బీజేపీ, శివసేన మధ్య ముఖ్యమంత్రి పీఠం కోసం సాగుతున్న పెనుగులాట రాజ్యాంగ సంక్షోభానికి దారితీసింది. బీజేపీ, శివసేన నాయకులు కత్తులు నూరుకుంటున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టటానికి  బీజేపీ ప్రయత్నిస్తోందంటూ మొత్తం ఎమ్మెల్యేలను బాంద్రాలోని ఓ హోటల్ కు తరలించింది శివసేన నాయకత్వం. పార్టీ చీఫ్ ఉద్దవ్ థాక్రే నివాసానికి సమీపంలోనే ఈ హోటలుంది. మరోవైపు తమ ఎమ్మెల్యేలను ఎక్కడ ఎగరేసుకుపోతారన్న భయంతో కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా వ్యవరిస్తోంది. గత అర్ధరాత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాజస్థాన్ లోని జైపూర్ కు తరలించారు.  మొత్తం మీద మహారాష్ట్ర పాలక కూటమికి ప్రజలు అధికారం ఇచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవడంతో రిసార్టు రాజకీయాలు మొదలయ్యాయి. ఎన్నికల ముందు కుదిరిన ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రి పీఠాన్ని రెండున్నరేళ్ల పాటు తమకు ఇవ్వాల్సిందేనంటూ శివసేన పట్టుబడుతోంది. అదేంకుదరదు అయిదేళ్లు సీఎం సీటు తమకే అని బీజేపీ భీష్మించింది. ఇన్ని రోజులుగా చర్చలు, విమర్శలూ కొనసాగుతున్నా రెండు పార్టీలూ ఒక్క మెట్టు కూడా దిగేందుకు ప్రయత్నించడం లేదు. మరోవైపు మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం తమకు ఇష్టం లేదు అంటున్నారు బీజేపీ నేతలు. బయటకు ఇంత రాద్ధాంతం జరుగుతునా ఇంకా తెర వెనుక మంతనాలు సాగుతూనే ఉన్నాయి.ఈ రాజకీయాలకు నేటి రాత్రితో తెర పడబోతోందే లేదో వేచి చూడాలి.

మద్యం నియంత్రణ పై మరో కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్...

  మద్యం నిషేధం పై జగన్ సర్కార్ తీవ్రంగా కృషి చేస్తోంది అనే చెప్పుకోవాలి. మద్యం నియంత్రణ విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బార్లను రాత్రి పది గంటల వరకే అనమతించాలని ఆదేశాలిచ్చింది. దశల వారిగా మద్య నిషేధం విషయంలో వెనక్కి తగ్గేది లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఏపీలో బార్ ల సంఖ్యను తగ్గించాలని సీఎం జగన్ నిర్ణయించారు. జనవరి ఒకటి నుంచి దీన్ని అమల్లోకి తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు.  తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో ఆదాయార్జన శాఖలపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతాల్లో మాత్రమే బారులు ఉండాలనీ, అనుమతిచ్చే ప్రదేశాల్లో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే బార్ లలో మద్యం విక్రయించేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం దిశా నిర్దేశం చేశారు. ఆ మేరకు విధి విధానాల ఖరారు చేయాలని ఆదేశించారు. దశల వారీగా మద్య నిషేధంపై వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. దీనికి తమ సర్కారు కట్టుబడి ఉందని జగన్ అధికారులకు స్పష్టం చేశారు.  మద్య నిషేధం దిశగా ఏపీ సర్కారు ఇప్పటికే పలు నిర్ణయాలను తీసుకుంది. మద్యం లైసెన్సులు పునరుద్ధరించక పోగా అమ్మకాల్ని ప్రభుత్వ గొడుగు కిందకు తీసుకొచ్చింది. మద్యం రేట్లు కూడా భారీగా పెంచింది. కొన్ని బ్రాండ్ లు మాత్రమే అమ్మాలని కూడా నిర్ణయించింది. మద్యం ధరలు విపరీతంగా పెంచటంపై ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తున్న జగన్ సర్కారు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.నిజంగానే మద్యం నిషేధం పై జగన్ సర్కార్ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తుందో లేదో వేచి చూడాలి.

ఒంగోలులో ఓ మహిళ పైశాచికానందం... హాలీవుడ్ మూవీని మించిన క్రైమ్ సీన్...

  సాధారణంగా అడల్డ్ సెక్స్ క్రైమ్ హాలీవుడ్ చిత్రాల్లోనే కనిపిస్తాయ్... విశృంకుల శృంగారం... అన్-నేచురల్ సెక్స్... లాంటి సీన్స్ హాలీవుడ్ క్రైమ్ మూవీస్ లో మాత్రమే చూడగలం... కానీ ఆంధ్రప్రదేశ్ ఒంగోలులో హాలీవుడ్ నే మించిన సెక్స్ క్రైమ్ బయటపడింది. ఓ వివాహిత తన విపరీతమైన శృంగార కోర్కెలను తీర్చుకోవడానికి చేసిన అకృత్యాలను చూసి పోలీసులే నివ్వెరపోయారు.   ప్రకాశం జిల్లా కొండపి మండలం జాళ్లపాలానికి చెందిన సుమలత అలియాస్ సాయితేజారెడ్డి... ఆర్ఎంపీ ఏడుకొండలతో సహజీవనం చేస్తోంది. సుమలత చూడ్డానికి అందంగా పదహారణాల అమ్మాయిలా కనిపించినా, ఆమె గొంతు మాత్రం మగరాయుడులా ఉంటుంది. గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకుని భర్తలను వదిలేసిన సుమలత... కొన్నేళ్లుగా ఆర్ఎంపీ ఏడుకొండలతో కలిసి ఒంగోలు మారుతీనగర్ లో ఉంటోంది. అయితే, ఈమెకు విపరీతమైన సెక్స్ కోర్కెలు ఉండటమే కాకుండా... అసహజ రీతిలో శృంగారం చేయడం వ్యసనంగా మారింది. దాంతో తన కోర్కెలను తీర్చుకోవడానికి అమాయక అమ్మాయిలకు వలేసి... వారికి మత్తు మందిచ్చి... సెక్స్ టాయ్స్ ను వాడుతూ పైశాచికానందం పొందేది. ఈమె వలకు చిక్కిన అమ్మాయిలపై సెక్స్ టాయ్స్ తో శృంగారం చేస్తూ నరకం చూపించేది. ముఖ్యంగా పెళ్లికాని పేద అమ్మాయి, కాలేజీ యువతులనే సుమలత టార్గెట్ గా పెట్టుకునేది. అయితే అమ్మాయిలను ట్రాప్ చేయడానికి సెల్ ఫోన్ సెంటర్ నిర్వాహకుడు వంశీ సాయం తీసుకునేది. అలా, ఒక అమ్మాయిని ట్రాప్ చేస్తే... మొదట సుమలత... ఆ తర్వాత, ఆమె భర్త ఏడుకొండలు, సెల్ ఫోన్ సెంటర్ నిర్వాహకుడు వంశీ అత్యాచారానికి పాల్పడేవారు. అయితే, బాధితులంతా తమ పరువు పోతుందని జరిగిన ఘోరం గురించి ఫిర్యాదు చేసేవారు కాదు. దాంతో, సుమలత అకృత్యాలు నిరాటంకంగా సాగాయి. అయితే, బాలిక ధైర్యంచేసి ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో సుమలత గుట్టు బయటపడింది. సుమలత తనను ఆటోలో తీసుకెళ్లిందని, ఆ తర్వాత తనకు మత్తు మందిచ్చి, సుమలతతోపాటు మరికొందరు అత్యాచారం చేశారని ఎస్పీకి కంప్లైంట్ చేయడంతో... పోలీసులు సుమలత ఇంటిపై దాడి చేశారు. పోలీసుల సోదాల్లో పదుల సంఖ్యలో సెక్స్ టాయ్స్... ప్రేమ లేఖలు... స్వాధీనం చేసుకున్నారు. మగరాయుడిలా కనిపించేందుకు సుమలత ధరించే దుస్తులు, లైంగిక చర్యకు ఉపయోగించే కృత్రిమ పరికరం, నడుముకు చుట్టుకునే బెల్టు వంటి వాటిని సీజ్‌ చేశారు. అయితే, పోలీసుల సోదాలు జరుగుతుండగానే, సుమలత భర్త ఏడుకొండలు ... బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక, సుమలతతోపాటు ఆమెకు సహకరించిన వంశీని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. అయితే, ఆడ పుట్టుక పుట్టి... కృత్రిమ పరికరాలతో మగాడిలా.... అసహజ లైంగిక కార్యకలాపాలకు పాల్పడటం పోలీసులనే నివ్వెరపోయేలా చేసింది. కట్టూబొట్టుతో  అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించే సుమలత... అమ్మాయిలపై అకృత్యాలకు తెగబడిందనే సంగతి తెలుసుకుని ఒంగోలు వాసులు విస్తుపోతున్నారు.

దేశవ్యాప్తంగా సెక్యూరిటీ అలర్ట్... అయోధ్య తీర్పుపై కేంద్రం అటెన్షన్...

  అత్యంత వివాదాస్పదమైన అయోధ్య తీర్పు త్వరలో వెలువడనుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో మత ఘర్షణలు, ఉద్రిక్తలు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపడుతోంది. తీర్పు ఎలాగున్నా ఏమీ మాట్లాడొద్దంటూ మంత్రులకు ప్రధాని మోడీ ఆదేశించారు. మరోవైపు, ఆరెస్సెస్, బీజేపీ నేతలు... ఎక్కడికక్కడ ముస్లింలను కలిసి సంయమనం పాటించాలని కోరుతున్నారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్ర హోంశాఖ... భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇక, ఉత్తరప్రదేశ్ లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. అలాగే, సోషల్ మీడియాలో వివాదాస్పద కామెంట్స్, వ్యాఖ్యానాలు చేయొద్దని ఆంక్షలు విధించారు. ఎవరైనా రెచ్చగొట్టేవిధంగా పోస్టులు చేసినా, వైరల్ చేసినా, లైకులు, షేర్లు చేసినా చర్యలు తీసుకోనున్నారు. సోషల్ మీడియాపై  ఓ కన్నేసిన కేంద్రం... ఎవరైనా రెచ్చగొట్టేవిధంగా పోస్టులు చేస్తే జాతీయ భద్రతా చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇక, వివాదాస్పద అయోధ్య స్థలం దగ్గర యూపీ పోలీసులు నాలుగంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే, మల్టిఫుల్ ప్లాన్స్ తో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఒక ప్లాన్ ఫెయిలైతే... క్షణాల్లో మరో ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి పరిస్థితిని కట్టడి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. వివాదాస్పద స్థలం దగ్గర 12వేల మంది పోలీసులను మోహరించగా, అదనంగా 4వేల పారామిలటరీ బలగాలను యూపీకి పంపింది కేంద్రం. వీళ్లే కాకుండా మరిన్ని దళాలను ఉత్తరప్రదేశ్ అంతటా మోహరించనున్నారు. ఇక, సుప్రీం తీర్పు నేపథ్యంలో... అప్రమత్తంగా ఉండాలంటూ అన్ని రాష్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సెక్యూరిటీ అలర్ట్ ఇచ్చింది. నవంబర్ 17లోగా సుప్రీంకోర్టు అయోధ్య తీర్పును వెలువరించనున్న నేపథ్యంలో యూపీ ప్రభుత్వం విస్తృత జాగ్రత్త చర్యలు చేపట్టింది. అయోధ్యలో సభలు, సమావేశాలు నిషేధించడంతోపాటు సమస్యాత్మక ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. సోషల్ మీడియా వేదికలను పోలీసులు తమ కంట్రోల్ లోకి తీసుకున్నారు. అలాగే, పోలీస్ యంత్రాంగాన్ని అలర్ట్ చేసేందుకు ఒక ప్రత్యేక యాప్ ను రూపొందించారు. ఇక, గ్రామాల్లో సైతం ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా 16మంది వాలంటీర్లను నియమించారు. ఇక, ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడి పెద్దఎత్తున అరెస్టులు చేయాల్సి వస్తే... జనాన్ని ఉంచడానికి ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలనే తాత్కాలిక జైళ్లుగా మార్చేందుకు వాటిని ఖాళీ చేయిస్తున్నారు.  

టీటీడీని ఏం చేయాలనుకుంటున్నారు? రమణదీక్షితులు రీఎంట్రీపై చంద్రబాబు ఫైర్

  తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులకు మళ్లీ టీటీడీలో ప్రవేశం కల్పించడంపై చంద్రబాబు మండిపడ్డారు. అసత్య ఆరోపణలతో టీటీడీ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించిన దీక్షితులును తిరిగి ఎలా విధుల్లోకి తీసుకుంటారని ప్రశ్నించారు. పింక్ డైమండ్ మాయమైందంటూ నానా యాగీ చేసిన రమణదీక్షితులపై పరువు నష్టం దావాను ఎలా ఉపసంహరించుకుంటారని నిలదీశారు. ఎన్నో ఆరోపణలున్న రమణదీక్షితులను టీటీడీ ఆగమశాస్త్ర సలహాదారుడిగా నియమించడం మంచిది కాదన్నారు చంద్రబాబు. అసలు జగన్ వైఖరిని చూస్తుంటే... త్వరలో దీక్షితులను టీటీడీ ప్రధాన అర్చుకుడిగా నియమించేలా ఉన్నారని నిప్పులు చెరిగారు. జగన్మోహన్ రెడ్డికి అసలు తన సొంత మతం గురించి చెప్పుకునే ధైర్యం లేదంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. వెంకన్నతో జగన్ ఆటలు ఆడుతున్నారన్న బాబు.... అది ఎంత కాలమో సాగదన్నారు. దేవుడితో ఆటలాడుకునేవారు అసలు బాగుపడరంటూ జగన్ పై నిప్పులు చెరిగారు. ఇంట్లో ఎవరైనా చనిపోతే హిందువులు ఏడాది వరకు ఆలయాలకు వెళ్లరని, కానీ జగన్ మాత్రం హిందూ విశ్వాసాలను తుంగలో తొక్కి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారని మండిపడ్డారు. సోనియాగాంధీ, అబ్దుల్ కలాం లాంటి అన్యమతస్థులు... వెంకటేశ్వరస్వామిపై విశ్వాసముందని అఫిడవిట్ ఇచ్చిన తర్వాతే శ్రీవారిని దర్శించుకున్నారని, కానీ జగన్ కు మాత్రం ఆ ధైర్యం లేదన్నారు. అసలు తాను క్రిస్టియన్ అని చెప్పుకునేందుకే జగన్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. టీటీడీ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించిన విజయసాయిరెడ్డి, రమణదీక్షితులపై పరువు నష్టం దావాను ఉపసంహరించుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన చంద్రబాబు.... తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జగన్ అసలు ఏం చేయాలనుకుంటున్నాడో తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు.