టిపిసిసి పీఠం కోసం మళ్ళీ సందడి ప్రారంభమైంది...
posted on Nov 7, 2019 @ 3:39PM
నిన్న మొన్నటి వరకు స్తబ్దుగా మారిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ పీఠం కోసం మళ్లీ సందడి ప్రారంభమైంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత పీసీసీ చీఫ్ మార్పు కోసం అధిష్ఠానం ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం ఊపందుకుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా ఢిల్లీకి వెళ్లడంతో ఆ ప్రచారం మరింత ఉధృతమైంది. ఇక ఆయన సైతం రాజీనామాకి సిద్ధపడ్డారని రాజీనామా లేఖను అధిష్టానానికి ఇచ్చారని ప్రస్తుతం అది పెండింగ్ లో ఉందని ఢిల్లీ లోని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఉత్తమ్ పదవీ కాలం కూడా ముగియడం, ఆయన నేతృత్వంలో పార్టీ అపజయాలనే మూటగట్టుకోవడంతో కొత్త సారథిని నియమించేందుకు హైకమాండ్ డిసైడ్ అయిందనే లీకులు హస్తిన నుంచి మొదలయ్యాయి. అందుకోసం రాష్ట్ర నేతల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నట్లు గాంధీభవన్ లో గుసుగుసలు వినిపిస్తున్నాయి. ఇలా పెద్ద ఎత్తున ఊహా గానాలు ఊపందుకోవడంతో ఆశావహులు మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించారు. అధ్యక్ష స్థానాన్ని దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నారు.
గ్రూపులు కట్టి రాజకీయం నేర్పుతున్నారు, పార్టీ అధిష్ఠానానికి తమ ఆసక్తిని తెలపాలని హస్తిన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. టిపిసిసి మార్పులకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరగడంతో కొత్త అధ్యక్షుడు ఎవరనే చర్చ హస్తం పార్టీలో మొదలైంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్లు నిన్న మొన్నటి వరకు ప్రముఖంగా వినిపించాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాదంటే అదే జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇవ్వాలని కొందరు కోరుతున్నట్టు తెలుస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ వ్యతిరేక వర్గంలో రేవంత్ రెడ్డికి మంచి క్రేజ్ ఉందని యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఆయనకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని మరొక వర్గం చెబుతోంది. ఒక దశలో ఉత్తమ్ ను తప్పించి రేవంత్ కు టిపిసిసి పగ్గాలు అప్పగించేందుకు రెడీ అయినట్టు కూడా కాంగ్రెస్ లో ప్రచారం జరిగింది. అయితే హుజూర్ నగర్ ఉప ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ లు పార్టీలో పెద్ద దుమారమే రేపాయి. కాంగ్రెస్ లోని సీనియర్లంతా ఏకమయ్యి ఆయనకు వ్యతిరేకంగా ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు చేశారట. వ్యతిరేక వర్గమంతా సంతకాలు సేకరించి హైకమాండ్ కు పంపారట. దీంతో రేవంత్ రెడ్డి విషయంలో ఢిల్లీ పెద్దలు పునరాలోచనలో పడ్డారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయినా కొందరు రేవంత్ శ్రేయోభిలాషులు డిల్లీ పెద్దలను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక మరో వర్గం మాత్రం మొదటి నుంచి పార్టీలో పని చేసిన వివాద రహితులకు టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానానికి సూచనలు చేస్తున్నారట. ప్రస్తుతం రెడ్డి సామాజికవర్గం నేత పీసీసీ చీఫ్ గా ఉన్నందున ఈ దఫా రెడ్డి ఏతర సామాజిక వర్గానికి అవకాశమివ్వాలని కోరుతున్నారట.
అందులో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పీసీసీ పీఠం కోసం ఆయనకు పెద్దగా ఆసక్తి లేక పోయినప్పటికీ పార్టీలో కీలకంగా ఉన్న ఒక నేత శ్రీధర్ బాబుకు మద్దతు కూడగడుతున్నట్టు ఆయన కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక జానారెడ్డి, జీవన్ రెడ్డిలో ఎవరికిచ్చినా పార్టీలో పెద్దగా వ్యతిరేకత ఉండదని మరికొందరు సూచిస్తున్నారట. ఇదిలా వుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు సైతం తనకు అవకాశమివ్వాలని కోరుతున్నారట. వయసును సాకుగా చెప్పి కొందరు తనపై తప్పుడు నివేదికలు ఢిల్లీకి పంపుతున్నారని కానీ, గతంలో షీలా దీక్షిత్ కు మొన్నటి హర్యానా ఎన్నికల్లో కూడా ఒక అవకాశమిస్తే వారు పార్టీకి మెరుగైన ఫలితాలు తెచ్చిన విషయాన్ని వీ.హెచ్ గుర్తు చేస్తున్నారు. హస్తినలో ఆయన కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు చెప్పుకొంటున్నారు, ఇలా ఎవరికి వారు పార్టీ అధ్యక్ష పదవి కోసం సైలెంట్ గా పని చేసుకుంటుండగా తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెరమీదకు దూసుకొచ్చారు.
ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పే జగ్గారెడ్డి తాను కూడా పిసిసి రేసులో ఉన్నానని బహిరంగంగానే ప్రకటించారు. ఎప్పుడూ పెద్దగా రాష్ట్రం దాటని జగ్గారెడ్డి ఈ నెల పదిహేనున ఢిల్లీకి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. సోనియా, రాహుల్, అహ్మద్ పటేల్, కేసీ వేణు గోపాల్, కుంతియాను కలిసి పీసీసీ చీఫ్ పదవి తనకు ఇవ్వాలని ఆయన వారికి విన్నవించనున్నారు. తనకు అవకాశమిస్తే పార్టీని అధికారంలోకి తీసుకోవటానికి రాష్ట్రమంతా తిరుగుతానని సీఎం పదవి ఆశించకుండా అధ్యక్ష బాధ్యతలను నెరవేరుస్తానని జగ్గారెడ్డి చెప్తున్నారు. అంతేకాక ఆ పదవిపై కన్నేసిన వారు కూడా సీఎం పదవిని ఆశించొద్దనే కొత్త వాదనను తెరమీదకు తెచ్చారు. అయితే పదవి ఆశిస్తున్న జగ్గారెడ్డి సహా మరి కొందరు నేతలు మాత్రం మున్సిపల్ ఎన్నికల తరువాతే అధ్యక్ష మార్పు చేయాలని హైకమాండ్ కు సూచిస్తున్నారు. మరి కాంగ్రెస్ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.