గుంటూరు కలెక్టర్‍, ఎస్పీపై ఇంటిలిజెన్స్ నివేదిక‌!

గుంటూరు జిల్లా కలెక్టరు, ఇంఛార్జి ఎస్పీ, మునిసిపల్‍ కమీషన్‍, డిహెచ్‍ఎంవో ప్రచార అర్భాటానికే ప్రాదాన్యత ఇస్తున్నారు త‌ప్ప గ్రౌండ్ లెవెల్‌లో కరోనా బారిన పడ్డ వారిని గుర్తించటంలో ఘోరంగా విఫలమయ్యారు. గుంటూరు నగర పోలీసు విభాగంలో అడిషనల్‍ ఎస్పీ స్థాయి నుండి క్రింది స్థాయి వరకు అధికారులు, ఉద్యోగులు సక్రమంగా పని చేస్తున్నప్పటికీ.. కరోనా బాధితుల వివరాలను సేకరించటంలో హోం శాఖేతర అధికారులు సకాలంలో స్పందించలేకపోవటంతో.. తాజా పరిస్థితికి కారణమయ్యారని ఇంటిలిజెన్స్ ప్ర‌భుత్వానికి నివేదిక ఇచ్చింద‌ట‌. గుంటూరు జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. జిల్లా కలెక్టర్‍ శామ్యూల్‍ ఆనంద్‍ కుమార్‍, గుంటూరు అర్బన్‍ ఎస్పీ రామకృష్ణలు నిర్లక్ష్య వైఖరి వల్లే జిల్లాలో ఇలాంటి ప‌రిస్థితి నెల‌కొంద‌ని ఇంటిలిజెన్స్ ప్ర‌భుత్వానికి తెలిపింద‌ట‌. వారిద్దరూ సకాలంలో స్పందించకపోవటమే తాజా పరిస్థితికి కారణమని.. ఇంటిలిజెన్స్ విభాగం నివేదిక ద్వారా సిఎంకు తెలియజేయటంతో.. వారిద్దరినీ బాధ్యతల నుండి తప్పిస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. రాజకీయ అధికార వర్గాల సిఫార్సులకు తలొగ్గే మనస్తత్వం ఉన్న శామ్యూల్‍ ఎప్పుడో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పటికీ తీసుకోవటం లేదని.. గుంటూరులో కరోనా బాధితుల వివరాలు సేకరించటంలో.. పోలీసు వ్యవస్థను పని చేయించటంలో.. అర్బన్‍ విభాగం ఇంఛార్జి ఎస్పీ రామకృష్ణ, మెతకవైఖరి అవలంబించారని.. ఆయనను కూడా బాధ్యతల నుండి తప్పించే అవకాశాలున్నాయట‌. గుంటూరు మునిసిపల్‍ కమీషనర్‍ అనురాధతో పాటు జిల్లా మెడికల్‍ అధికారి కూడా కరోనా వ్యాథి బాధితులను గుర్తించటంలో.. నిర్లక్ష్య వైఖరి అవలంబించారని, వారిద్దరిని కూడా తప్పించాలని బోర్డు అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ సమయంలో వారిని బదిలీచేస్తే. కొత్త సమస్యలు ఎదురు కావచ్చునని వారి స్థానంలో నియమితులైన వారికి పరిస్థితులు అవగాహన చేసుకోవాలంటే.. 10 రోజులు సమయం పడుతుందని.. తాజా పరిస్థితులు చల్లబడ్డాక తప్పిస్తే.. మంచిదని సిఎంవో అధికారులు కూడా భావిస్తున్నట్లు తెలిసింది.

క్వారంటైన్ ఫుడ్ టెండ‌ర్‌ల‌లో గోల్‌మాల్‌?

సంద‌ట్లో స‌డేమియాలు త‌మ నైజం బ‌య‌ట‌పెడుతున్నారు. శ‌వాల మీద చిల్ల‌ర ఎరుకుంటున్నారు. క్వారంటైన్‍ కేంద్రాలలో ఉన్న వారికి భోజన, ఫలహారాలు అందజేసే విషయంలో కాంట్రాక్టర్లతో లాలూచి పడి అందినంత దండుకుంటున్నార‌ని ఉన్నతాధికారులకు ఆదారాలతో ఫిర్యాదులు అందుతున్నాయి. కొంతమంది ఉద్యోగులు, అధికారులు బాగానే క్వారంటైన్‌ భోజ‌నాల్లో బాగానే వెనకేసుకుంటున్నార‌ట‌. చచ్చినాడి పెళ్లికి వచ్చినంత కట్నం అనుకూంటూ వెనుకేసుకుంటున్నార‌ట‌. క్వారంటైన్‍లో ఉంటున్న కరోనా వ్యాధి అనుమానితులకు ప్ర‌భుత్వం త‌ర‌ఫునే ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి ఉదయం నుండి రాత్రి వరకు అన్ని వసతులు క‌ల్పిస్తున్నారు. కొంతమందికి సరఫరా చేస్తున్న భోజనాలు, ఫలహారాల విషయంలో నాణ్యత ఉండటం లేదని.. వాటిని ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని వివిధ జిల్లాల కలెక్టర్ల దృష్టికి ఫిర్యాదులు అందుతున్నాయి. క్వారంటైన్‍ కేంద్రాలలో ఉన్నవారికి మెనూ ప్రకారం ఉదయం 6.30గం.లకు రాగిజావ, 7.00గం.లకు టీ లేదా కాఫీ 7.30గం.ల నుండి 8.00గం.ల వరకు రెండు రకాల టిఫిన్లు, 11.00గం.లకు ఫ్రూట్‍ సలాడ్‍ ఇవ్వాలి. మధ్యాహ్నం 12.00 గంటలకు రెండు శాఖాహార కూరలతో భోజనం పెట్టాలి. సాయంత్రం 4 గంటలకు టీతో పాటు స్నాక్స్ ఇవ్వాలి. రాత్రి 7 గంటలకు రెండు రకాల కూరలతో భోజనం పెట్టాలి. అలాగే గదులలో 20 లీటర్ల నీళ్ల బాటిళ్లు ఇతరత్రా సమకూర్చాలి. వీటన్నింటిని సమకూర్చేందుకు కాంట్రాక్టర్లను పిలవాల్సిన అదికారులు, స్థానిక వ్యాపారులతో కుమ్మక్కై జేబులు నింపుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో ఉన్న అన్ని క్వారంటైన్‍ కేంద్రాలలో.. పైన పేర్కొన్న మెనూ ప్రకారం కరోనా అనుమానితులకు సరఫరా చేయాల్సి ఉంటుంది. పారిశుద్య నిర్వహణ, విపత్తుల విషయంలో ప్రభుత్వ పరంగా సహకారం కోసం జిల్లా ముఖ్య అధికారులు ఎప్పటి కప్పుడు హోటళ్ల యజమానులను పిలిచి సమావేశం నిర్వహించి వారి సహకారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం క్వారంటైన్లలో ఉంటున్న వారికి పెద్ద మొత్తంలో ఆహారం సరఫరా చేసేందుకు అన్ని జిల్లాలలో హోటళ్ల అసోసియేషన్‍ ఉన్నప్పటికీ.. వారితో సంప్రదించకుండా.. ఇతర వ్యాపారులతో ఈ ఆహార పదార్ధాలను అధికారులు సరఫరా చేయించ‌డం వివాదాస్ప‌దం అయింది. ఈ వ్య‌వ‌హారంపై హోటళ్ల యజమానులు ఆధారాలతో జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు ఫిర్యాదు చేశారు. ఓపెన్ టెండ‌ర్ల ద్వారానే క్వారంటైన్ ఫుడ్ ఆర్డ‌ర్స్‌ ఫైన‌ల్ చేశారు. టెండర్లలో ఎక్కడా అక్రమాలు జరగలేదని కలెక్టర్లు, జాయింట్‍ కలెక్టర్లు ఈ పక్రియను దగ్గరుండి పరీక్షించారని, ఇందుకు సంబందించిన వివరాలున్న ఫైళ్లు కలెక్టర్‍ దగ్గరే ఉన్నాయని ఎవరికైనా అనుమానాలు ఉంటే… తెలుసుకోవచ్చని… కార్వంటైన్లు నిర్వహిస్తున్న అధికారులు చెబుతున్నారు.

వంశీ రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్నారా?

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‍ మ‌ళ్ళీ వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారారు. ఆయ‌న రాజకీయాలకు గుడ్‍బై చెప్పబోతున్నారంటూ అనుచ‌రులు చెబుతున్నారు. ఎందుకంటే వంశీ ఆశించిన‌ట్లు జ‌గ‌న్ ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌. అంతే కాదు అస‌లు ప్రాధాన్య‌తే ఇవ్వ‌డం లేద‌ని అనుచ‌రులు చెప్పుకుంటున్నారు. నిజంగానే ముఖ్య‌మంత్రి జగన్‍ వంశీని ప‌ట్టించుకోవ‌డం లేదా? వంశీ ఎందుకు అసంతృప్తితో వున్నారు. గన్నవరం నియోజకవర్గంలో ఇంఛార్జి తానే అని.. వంశీకి ముఖ్యమంత్రి ఎలాంటి ప్రాదాన్యత ఇవ్వరని వంశీ కి వ్యతిరేకంగా పోటీ చేసి ఓడిపోయినా యార్లగడ్డ వెంకటరావు పదే పదే ప్రకటించినా.. ముఖ్యమంత్రి జగన్‍ వారించకపోవటంతో… ఆవేదన చెందిన వంశీ క్రీయాశీలక రాజకీయాలకు గుడ్‍బై చెబుతున్నార‌నే ప్ర‌చారం కృష్ణాజిల్లాలో జోరందుకుంది. అయితే ఈ ప్రచారం వెనుక ఏదో మతలబు ఉంటుందని.. ఈ వయసులోనే ఆయన ఎందుకు గుడ్‍బై చెబుతారని టిడిపి నేతలు అంటున్నారు. అసలు వంశీ రాజకీయాలకు నిజంగా గుడ్‍బై చెబుతారా..? పథకం ప్రకారం ఆ విషయాలను లీకులు చేసి ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో అని చూస్తున్నారా.. ఈ విషయంలో మీడియా వల్లభనేనిని సంప్ర‌దిస్తే అలాంటిది ఏమీలేదు అని చెప్పార‌ట‌. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా రెండు సార్లు విజయం సాధించిన వల్లభనేని ఆ తరువాత చంద్రబాబుతో తెగ‌తెంపులు చేసుకుని ముఖ్య‌మంత్రి జగన్‍ను పలు దఫాలు కలిసి ఆయన పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ ఫిరాయింపు చట్టం భయంతో.. టిడిపి ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. చంద్రబాబుపై విమర్శలు చేస్తూ.. జగన్‍ను పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబు, లోకేష్‍లపై విమర్శలు చేసి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.ఆయన పలు మీడియా వారికి ఇచ్చిన ఇంటర్యూలలో తెలుగుదేశం నాయకులతో పాటు చంద్రబాబు, లోకేష్‍లపై చేసిన ఆరోపణలు, విమర్శలు సంచలనం సృష్టించాయి. మీడియా ఇంట‌ర్వ్యూలో హాట్ కామెంట్స్ చేస్తూ వంశీ త‌న వ్యక్తిగత ప్రతిష్టను మంటగలుపుకున్నారు. కొంత కాలం టీవీ ఇంట‌ర్వ్యూలో ఓ వెలుగు వెలిగినా ప్ర‌స్తుతం చ‌ప్ప‌బ‌డ్డారు. అయితే వంశీ రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్నారంటూ జిల్లాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ‘కమ్మ వాళ్లు ఏం చేస్తారని జ‌గ‌న్ అనుకుంటాడు. కమ్మోళ్లు ఇట్టా తిప్పితే చాలు అయిపోతాడు’ అంటూ ఇటీవ‌ల రాయపాటి సాంబశివరావు చేసిన వ్యాఖ్య‌లకు తాజాగా ఎమ్మెల్యే వంశీ రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవాల‌నుకోవ‌డానికి ఏమైనా లింక్ వుందా అంటూ ఆంధ్ర‌రాజ‌కీయాల్లో చ‌ర్చ మొద‌లైంది.

ఐసిఎంఆర్ కొనుగోళ్లపై ఏమి మాట్లాడతారు కన్నా గారూ...

* బీ జె పి రాష్ట్ర అధ్యక్షుడికి డెప్యూటీ సి ఎం సూటి ప్రశ్న  * పర్చేజ్ ఆర్డర్ నిబంధనలు ఓ సారి సరిగ్గా చదవాలని కన్నాకు చురకేసిన ఆళ్ళ నాని  రాపిడ్ టెస్ట్ ల కిట్స్ విషయంలో ఎలాంటి అవినీతి జరగలేదని,  లక్ష రాపిడ్ టెస్ట్ కిట్స్ ఒకేసారి తెప్పించుకున్న రాష్ట్రం మనదేనని, చంద్రబాబుతో కుమ్మక్కై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై కన్నాలక్ష్మీనారాయణ ఆరోపణలు చేయడం దారుణమని ఉపముఖ్యమంత్రి,వైద్య,ఆరోగ్యశాఖమంత్రి ఆళ్లనాని విమర్శించారు. "కన్నాగారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను.....ప్రధానిగారికి సైతం కరోనా విషయంలో ఏ చర్యలు తీసుకోవాలో నేనే నేర్పుతున్నాను అని చంద్రబాబు నిస్సిగ్గుగా మాట్లాడుతుంటే ...ప్రధాని గురించి అలా మాట్లాడకూడదు...ప్రధాని గౌరవానికి భంగం వాటిల్లేలా ప్రవర్తించకూడదని ఏనాడైనా చెప్పే ధైర్యం చేశారా...చంద్రబాబు కోసం బిజేపి గౌరవాన్ని కూడా పణంగా పెట్టారు.730 రూపాయలకు రాపిడ్ టెస్ట్ కిట్స్ కొన్నామని ,అందులో చాలా అవినీతి జరిగిందని ఆరోపణలు చేసిన కన్నాలక్ష్మీనారాయణ వాటిని నిరూపించగలరా," అని ఆళ్ళ నాని ప్రశ్నించారు.  మేం 730 రూపాయలకు కిట్స్ కు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కేంద్రం తన ఆధ్వర్యంలో నడిచే ఐసిఎంఆర్ సంస్ధ ద్వారా ఐదు లక్షల కిట్స్ కు సంబంధించి 795 రూపాయలకు ఆర్డర్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా కూడా తెలుసుకోవాలని సూచించారు. అందులో అవినీతి,అవకతవకలు జరిగాయని మేం మాట్లాడటం లేదు. కేంద్రప్రభుత్వమే 795 రూపాయలకు కిట్స్ కొనే ప్రయత్నం చేస్తుంటే.... చెప్పినదానికంటే కూడా మేం 65 రూపాయల తక్కువకే కిట్స్ కొనుగోలు చేశాం.మీరు మాత్రం మాది అవినీతి అంటారు.మరి కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఐసిఎంఆర్ 795 రూపాయలకు కొనే ప్రయత్నాన్ని మీరు ఏమంటారో చెపుతారా అంటూ ఆళ్ళ నాని, కన్నా లక్షీనారాయణ ను నిలదీశారు.  " లక్షకిట్స్ కు సంబంధించి దక్షణకొరియానుంచి ఆర్డర్ ఇచ్చి తెప్పించినమాట వాస్తవం.730 రూపాయలకు ఆర్డర్ ఇచ్చిఉన్నామో ఆ ఆర్డర్ ఇచ్చిన అగ్రిమెంట్ లో మేం క్లియర్ గా ఏం చెప్పామంటే 730 రూపాయలకు ఆర్డర్ ఇచ్చినాసరే ఏ రాష్ర్టానికైనా ఈ ధర కంటే తక్కువధరకు సరఫరా చేస్తే ఆ రేటుకే మాకు ఇవ్వాలనే స్పష్టమైన ఒప్పందాన్ని ఆ సంస్ధతో చేసుకున్నాం. ఏ రాష్ట్రమైనా,  ఇలాంటి క్లాజ్ పెట్టిందా,"  అని ఆళ్ళ నాని ,  కన్నాలక్ష్మీనారాయణ ను ప్రశ్నించారు. చత్తీస్ ఘడ్ 337 రూపాయలకు కిట్స్ తీసుకుందని చెబుతున్నారో,ఆ ఆర్డర్ తీసుకోకముందే 337 రూపాయలకే కాదు 300 రూపాయలకు ఏ రాష్ట్రానికి ఇచ్చినా కూడా ఆ ధరకే కిట్స్ ఇవ్వాలన్న నిబంధన పర్చేజ్ ఆర్డర్ లో పెట్టామని ప్రజలకు తెలియచేస్తున్నామన్నారు.

అక్షయ తృతీయ ఆన్‌లైన్ సేల్స్!

అక్షయ తృతీయ నాడు బంగారం ఎలా కొనుగోలు చేయాలని మ‌ద‌న‌ప‌డుతున్నారా? మీకెలాంటి ఇబ్బంది లేదు. లాక్ డౌన్ నేప‌థ్యంలో ప్ర‌ముఖ జ్యువెల్ల‌ర్స్ నిర్వాహ‌కులు ఆన్‌లైన్‌లో బుకింగ్ ప్రారంభించారు. కొనుగోలుదారుల కోసం తమ సేవలను ఏప్రిల్ 21వ తేదీ నుండి ఆన్ లైన్ ద్వారా అందిస్తున్నట్లు కళ్యాణ్ జ్యువెల్లర్స్ తెలిపింది. 2 గ్రాముల నుండి ఎంతమొత్తమైనా కొనుగోలు చేయవచ్చునని తెలిపింది. ప్రముఖ బంగారం విక్రయదారులు తనిష్క్, కళ్యాణ్ జ్యువెల్లర్స్.. అక్షయ తృతీయ సేల్స్ ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. టాటా గ్రూప్‌కు చెందిన తనిష్క్ ఏప్రిల్ 18వ తేదీ నుండి ఏప్రిల్ 27వ తేదీ వరకు కస్టమర్లకు ఆన్‌లైన్ సేల్స్ అందుబాటులో ఉంచింది. సంస్థ అధికారిక వెబ్ సైట్ ద్వారా నచ్చిన నగలను కొనుగోలు చేయవచ్చు. ఇందుకు తనిష్క్ సిబ్బంది వీడియో కాల్, ఆన్ లైన్ చాటింగ్ ద్వారా కస్టమర్లకు డిజైన్లు అందుబాటులో ఉంచుతారు. ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసిన వారికి లాక్ డౌన్ ఎత్తివేసిన అనంతరం సాధారణ పరిస్థితులు నెలకొన్నాక బంగారాన్ని ఇంటి వద్దకు డెలివరీ చేస్తారు. అలా కాదంటే కస్టమర్లు దగ్గరలోని తమ దుకాణం వద్ద తాము కొనుగోలు చేసిన వస్తువును పొందవచ్చునని కూడా ఆప్షన్ ఇచ్చింది. తమ వినియోగదారుల్లో చాలామంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారని, వారి కోసం ఆన్ లైన్ సేవలు అందిస్తున్నట్లు తెలిపింది. కస్టమర్ బంగారం కొనుగోలు చేసిన తర్వాత గోల్డ్ ఓనర్‌షిప్ సర్టిఫికేట్ పేరుతో కొనుగోలు సర్టిఫికేట్ ఇస్తామని, దానిని కస్టమర్లు కోరుకున్న పద్ధతిలో అక్షయ తృతీయ రోజున వారికి అందిస్తార‌ట‌. లాక్ డౌన్ ముగిసిన తర్వాత ధృవీకరణ పత్రంతో తాము కొనుగోలు చేసిన ఆభరణాన్ని పొందవచ్చు. లాక్ డౌన్ నేపథ్యంలో మొదటిసారి ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నామని, తద్వారా అక్షయ తృతీయ రోజు బంగారాన్ని కొనుగోలు చేయాలనే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామన్నారు.

తెలంగాణాలో లాక్ డౌన్ మరింత కఠినం: డీజీపీ

ఈ నెల 21వ తేదీ నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తామని డీజీపీ మహేందర్‌ రెడ్డి స్పష్టం చేశారు. పోలీసు ఉన్నతాధికారులతో పకడ్బందీ లాక్‌డౌన్‌ అమలుపై చర్చించి.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం తీసుకున్న నిర్ణయాలను 21 నుంచి పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. రోడ్లపైకి అనవసరంగా వచ్చే వాహనదారుల నియంత్రణపై నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. అత్యవసర సరుకుల సరఫరాకు కొందరికి పాసులు ఇచ్చాం. అవసరం లేకున్నా ఆ వాహనదారులు పాసులతో రోడ్లపైకి వస్తున్నారు. పాసులు కలిగిన వ్యక్తి తిరగాల్సిన ప్రదేశాలను గుర్తించాం. వాహనదారులకు ఇచ్చిన పాసులపై సమీక్ష చేయాలని నిర్ణయించాం. ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారుల పాసులను రద్దు చేస్తామని స్పష్టం చేశారు.  పాసు కలిగిన వ్యక్తి ఏ సమయానికి ఏ మార్గంలో వెళ్లాలనే విషయం గుర్తిస్తామన్నారు. కొత్త పాసులు ఇచ్చే వరకు పాత పాసులు కొనసాగుతాయి. నిత్యవసరాల కొనుగోలుకు 3 కిలోమీటర్ల లోపు మాత్రమే వెళ్లాలి. వాహనదారులు రెసిడెన్స్‌ ప్రూఫ్‌తోనే బయటకు రావాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు పాసులు ఇస్తామన్నారు. కలర్‌ కోడ్‌ ప్రకారం సంస్థలు ఉద్యోగులకు పాసులు ఇవ్వాలని పోలీసులకు సూచించారు.  లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంతో రాష్ర్ట వ్యాప్తంగా 1.21 లక్షల వాహనాలు సీజ్ చేశామన్నారు. లాక్ డౌన్ పూర్తయ్యాక ఆ వాహనాలను కోర్టులో డిపాజిట్ చేస్తామన్నారు. కోర్టు ద్వారానే వాహనాలు తీసుకోవాలి. సాధారణ జబ్బుల చికిత్సకు సమీప ఆస్పత్రులకు వెళ్లాలి. తీవ్ర ఆరోగ్య సమస్య ఉండి దూరం వెళ్తే రిఫరెన్స్ పత్రాలు వెంట తీసుకురావాలి. ఆస్పత్రులకు వెళ్లే వారు కూడా రెసిడెన్స్ ప్రూఫ్స్ తీసుకురావాలని డీజీపీ సూచించారు. రేషన్ దుకాణాలు, బ్యాంకుల వద్ద భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. ఆహార పంపిణీ చేసేవారు భౌతిక దూరం పాటించే బాధ్యత తీసుకోవాలని.  ఇళ్లల్లోనూ భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడంపై చర్చించామన్నారు.

జూమ్ యాప్ పెళ్లిళ్లకు చట్టబద్ధత!

పెళ్లికాని ప్రసాద్ లకు కరోనా షాకిచ్చింది. పెళ్లిచేసుకుందామని అంతా రెడీ అయ్యాక కరోనా వైరస్ వచ్చి ఆపేసింది. ఒకటో, రెండో కాదు.. వందలాది పెళ్లిళ్లకు కరోనా దెబ్బ తగిలింది. ఏప్రిల్‌లో జరగాల్సిన వివాహాలన్నీ వాయిదాపడ్డాయి. క‌రోనా దెబ్బ‌తో ఈఏడాది చాలా పెళ్లిళ్ళు ఆగిపోయాయి. మ‌రో వైపు 'పెళ్లిళ్ల విషయంలో ఇప్పుడు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. జూమ్‌ వీడియో కాల్ యాప్ ద్వారా పెళ్లి చేసుకోవచ్చు' అని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో తెలిపారు. న్యూయార్క్‌ వాసులు వీడియో కాల్స్‌ ద్వారా పెళ్లిళ్లు చేసుకునేందుకు వీలుగా ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్ జారీ చేస్తున్నానని తెలిపారు. ఇటువంటి పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పెళ్లికాని ప్రసాద్ ల‌కు ఇది శుభ‌వార్తే మ‌రి. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలు విదేశాల్లో, మన దేశంలోనే వేర్వేరు ప్రాంతాలు, నగరాల్లో చిక్కుకుపోయారు. వారి సొంత ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి లేకపోవటంతో మరికొన్ని పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. మే 4న విజయవాడలో వివాహం జరగాల్సిన పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ఇద్దరూ అమెరికాలోనే చిక్కుకుపోయారు. వారు ఇప్పట్లో భారత్‌కు వచ్చే పరిస్థితి లేదు. దీంతో పెళ్లి నిరవధికంగా వాయిదా వేశారు పెద్దలు.  అలాగే పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయి విశాఖపట్నంలో, అమ్మాయి హైదరాబాద్‌లో చిక్కుకుపోయారు. ఈ నెల 14న పెళ్లి జరగాల్సి ఉంది. ఈ వివాహమూ వాయిదా పడింది. లాక్ డౌన్ కారణంగా ఎవరూ ఎక్కడినించి ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి.  లాక్ డౌన్ ఎత్తేస్తారని భావించినా కరోనా వైరస్ కేసులు పెరిగిపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.  నెల రోజుల కిందటే ఏర్పాట్ల కోసం అడ్వాన్సులు ఇచ్చేశారు. కరోనా నేపథ్యంలో వివాహాన్ని వాయిదా వేశారు. కొందరు ముందుగానే శుభలేఖలు పంచేశారు. ప్రస్తుతం పెళ్లి వాయిదా పడిందని ఫోన్లలో సమాచారమిస్తున్నారు.  కల్యాణ మండపాలు, హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లు, కేటరింగ్‌, డెకరేషన్‌, లైటింగ్‌, బ్యాండ్‌, మ్యారేజ్‌ ఈవెంట్‌ నిర్వాహకులకు అడ్వాన్సులు చెల్లించేశారు. మళ్లీ తాము అనుకున్న తేదీలకు అవి కుదురుతాయో లేదోనన్న ఆందోళన ఉంది. ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేసేందుకు ఆయా ప్రభుత్వాలు లాక్‌డౌన్ అమలు చేస్తున్నాయి. దీంతో ఒక్క నిత్యావసర సేవలు మినహా మిగిలిన సేవలన్నీ పూర్తిగా ఆగిపోయాయి. అదేసమయంలో ముందుగా కుదుర్చుకున్న వివాహాది శుభకార్యాలన్నీ వాయిదాపడుతున్నాయి. అయితే, కొందరు మాత్రం వీడియో కాల్స్ ద్వారా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వివాహాలు వాయిదా పడకుండా ఉండేందుకు న్యూయార్క్ ప్రభుత్వం తాజాగా ఈ విషయంపై సానుకూలంగా ఆదేశాలు జారీచేసింది. వీడియో కాల్స్‌ ద్వారా పెళ్లి చేసుకుంటే సామాజికదూరం పాటిస్తూనే, వివాహం కూడా జరుపుకునే అవకాశం ఉండడంతో వాటికి అనుమతి ఇచ్చింది. దీంతో పెళ్లికి సిద్ధమైన యువత గవర్నర్‌ చేసిన ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, జూమ్ యాప్ ద్వారా ఒక్కటయ్యే జంటలు శోభనాలను ఏ విధంగా జరుపుకోవాలన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇదే అంశంపై నెటిజన్లు కూడా తమకు తోచిన రీతిలో సెటైర్లు వేస్తున్నారు.

పేదలు, వలస కూలీలు దుర్భ‌రంగా బ్ర‌తుకీడుస్తున్నారు!

కరోనా వైరస్ నివారణకు చేపట్టిన లాక్డౌన్ కారణంగా అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వలన రైతులు , పేద ప్రజలు , వలస కూలీలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్యలు తీరాలంటే సీఎం కేసీఆర్ వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు.  గత మూడు రోజులుగా రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు పంటలు తీవ్రంగా నష్టపోయాయి. పిడుగుపాటుకు అనేకమంది రైతులు మృత్యువాత పడ్డారు. వారందరిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో రైతుల సమస్యలు, అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై చర్చించకపోవడం దురదృష్టకరం అన్నారు. దేశం మొత్తం లాక్డౌన్ తో ఇంటికే పరిమితం అయ్యారు. పేద ప్రజలు , రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు ఉన్నారు. వారిపై చర్చించకుండా మహిళలు డ్వాక్రా రుణాలు చెల్లించాలి, ప్రాపర్టీ టాక్స్ కట్టాలి అని ప్రభుత్వం ప్రకటించడం హేయమైన చర్య, ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  రాష్ట్ర  ప్రభుత్వం లాక్డౌన్ కాలంలో పెన్షనర్లకి కోత విధించకుడదు , ఇతరులపై ఆదరపడకుండా అత్మ గౌరవంతో బ్రతుకుతున్న వారికి కోత వింధించడం వల్ల వారికి కొత్త సమస్యలు వస్తాయన్నారు. కరోనపై పోరాటంలో ముందు వరుసలో ఉన్న పంచాయితీ రాజ్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి ప్రోత్సహం అందించకపోవడం విచారకరం అన్నారు. పరిశ్యుద్ధ పనులు చేసి ప్రతి పల్లెను, గ్రామాన్ని శుభ్రంగా  ఉంచుతున్నారు. వారికోసం ఎంత చేసినా తక్కువే అన్నారు. కానీ అలాంటివారికి ప్రభుత్వం ఏమి చేయకపోవడం నిరుత్సాహపరిచింది అన్నారు.  రాష్ట్రంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులకు సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం అందించవచ్చు అని కేంద్ర ప్రభుత్వం నిబంధనలు ప్రకటించింది. దానికి అనుగుణంగా లేబర్ కమిషన్ బోర్డు ప్రతి భవన నిర్మాణ కార్మికునికి 1500 రూపాయలు అందించేలా తీర్మానం చేసి పంపిన సీఎం కేసీఆర్ ఆ తీర్మానం పై స్పందించకపోవడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికులు భవన నిర్మాణ రంగంలో కార్మికులుగా ఉన్నారని వారందరు లాక్డౌన్ లో ఎలాంటి పని లేకుండా ఇంటిపట్టున ఉంటున్నారని అన్నారు. బోర్డు నిర్ణయం ప్రకారం కార్మికులందరికి 1500 వందల రూపాయలు అందించేలా తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరారు.  గ్రామాల్లో సేవలందిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్స్ ని విధుల్లోకి తీసుకునే విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయం తీసుకోక పోవడం విడ్డురం అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బండి సంజయ్ కోరారు.  ఈ కష్టకాలన్ని ఎదుర్కోవడానికి రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఎంపీ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.

క‌రోనాకు 45 రోజుల బాలుడు బ‌లి!

తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్‌తో అత్యంత పిన్న వయస్కుడు మరణించాడు. కేవలం 45 రోజుల చిన్నారి కోవిడ్-19తో మరణించాడు. ఈ బాలుడి మృతితో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 21కి పెరిగింది. నారాయణపేట జిల్లాకు చెందిన బాలుడు మృత్యువాతపడినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఈ బాలుడికి కరోనా సోకినట్లు నీలోఫర్ ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. నారాయణపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ బాలుడు జన్మించాడు. ఇటీవల అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు నిలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు.  ఆ చిన్నారికి కరోనా ఎలా సోకిందనేది ప్రశ్నార్థకంగా మారింది. చిన్నారికి కరోనా పాజిటివ్‌ రావడానికి గల కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు. కరోనా పాజిటివ్‌ సోకిన చిన్నారికి సంబంధించిన 18 మంది కుటుంబసభ్యులు, బంధువులు, ఓ వైద్యుడిని ఐసొలేషన్‌కు తరలించారు. వారి నమూనాలను పరీక్షల నిమిత్తం పంపించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 93 మంది చిన్నారులు క‌రోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ చిన్నారుల పాలిట శాపంగా మారుతోంది. 53 మంది చిన్నారులు గాంధీ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. వైరస్ సోకిన ఈ చిన్నారులంతా 12 ఏళ్ల లోపువారే. వారిలో మహబూబ్నగర్ జిల్లాకు చెందిన 23 రోజుల పసికందుతో పాటు మూడేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. గాంధీ ఆస్పత్రిలోని ఆరో అంతస్తులో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.  హైదరాబాద్, మహబూబ్‌న‌గర్, నిజామాబాద్, ఖమ్మం ప్రాంతాలకు చెందిన చిన్నారులకు వైరస్ సోకింది. ఆంధ్రప్రదేశ్ లోనూ 40 మంది చిన్నారులు కరోనా బారినపడ్డారు. ఎక్కువ మంది దిల్లీలోని మర్కజ్ కు హాజరైనవారి కుటుంబసభ్యులేనని తేలింది.

ట్వీట‌ర్ వేదిక‌గా క‌న్నా, విజ‌య‌సాయిల మాట‌ల తూటాలు!

ఏపీలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారుతోంది. ఈ నేప‌థ్యంలో అస‌లు స‌మ‌స్య‌ల నుంచి నుంచి ప‌క్క‌కు త‌ప్పించేలా వైసిపి, బిజెపి బిజెపి మ‌ధ్య ట్విట్టర్ లో వార్ న‌డుస్తోందని టిడిపి ఆరోపిస్తోంది. కన్నా టీడీపీకి అమ్ముడుపోయారన్న విజయసాయి అంటున్నారు.  ఆయన పాపం పండిందన్న బీజేపీ చెబుతోంది. బీజేపీ వైసీపి మ‌ధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కన్నా లక్ష్మీనారాయణ కరోనా కిట్లపై చేసిన ట్వీట్‌తో ఈ హీట్ మ‌రింత పెరిగింది. ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.  కరోనా కిట్ల అంశాన్ని ప్రస్తావిస్తూ  కిట్లలో కూడా కమీషన్ కొట్టారా.. 'మన పక్కరాష్ట్రం ఛత్తీస్ గఢ్ కరోనా కిట్లను దక్షిణకొరియా నుండి కేవలం రూ. 337+GSTకి కొన్నారు. మరి మీరు అదే దక్షిణ కొరియా నుండి తెప్పించిన లక్ష కిట్లు ఎంతకు తెచ్చారంటూ క‌న్నా లక్ష్మీనారాయణ చేసిన ఈ వ్యాఖ్యలతోనే రాజకీయంగా దుమారం రేగింది.  నా ప‌ట్ల నువ్వు చేసిన నిరాధార‌మైన ఆరోప‌ణ‌ల‌పై కాణిపాకంలో స‌త్య‌ప్ర‌మాణానికి నేను సిద్ధం, నువ్వు మాట మీద నిల‌బ‌డే మ‌నిషివి ఐతే వ‌చ్చి ప్ర‌మాణం చెయ్యి.  నీ వ్యాఖ్య‌ల‌కు ప‌రువు న‌ష్టం దావాకు సిద్ధంగా ఉండు. కిట్ల రేటుపై నేను ప్ర‌శ్నించ‌డం వ‌ల్లే వాటి రేటు బ‌య‌ట‌కు తెలిసి త‌క్కువ ధ‌ర‌కు ఇవ్వ‌డం నిజం కాదా? అంటూ క‌న్నాలక్ష్మీనారాయ‌ణ ట్వీట్ చేస్తూ విజ‌య‌సాయిరెడ్డిపై విరుచుకు ప‌డ్డారు. దేశ‌వ్యాప్తంగా మోదీ గారి ఇమేజి పెరిగినా రాష్ట్రంలో ఆ పార్టీ ఎద‌గ‌క పోవ‌డానికి బాబుకు అమ్ముడు పోయిన క‌న్నా లాంటి వారే కార‌ణం. బాబు ప్యాకేజి ఆఫ‌ర్ ఎలాగుంటుందంటే రాజ‌కీయంగా అవ‌సాన ద‌శ‌లో ఉన్న వారినీ లేపి కూర్చోపెడుతుంది. మొద‌టి నుంచి బిజెపిలో ఉన్న వారు క‌న్నా లాంటి జంబూకాల‌ను వ‌దిలించుకోవాలంటూ విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యల్ని బీజేపీ కూడా గట్టిగా తిప్పికొట్టింది. ఈసారి పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కాకుండా.. పార్టీ అధికారిక ట్విట్టర్‌ ద్వారా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాస్త క‌ళ్ళ జోడు తుడుచుకుని పెట్టుకుని చూడండి ఇది ఏపీ బిజెపి. క‌రోనా వ‌చ్చి రాష్ట్రం ఇప్ప‌డు క్వారంటేయిన్లో ఉంటే త‌ము చేసిన ప‌నుల‌కు 2012లోనే మీరు క్వారంటేయిన్లో ఉన్నారు. ఈ కిందివి మీ డిగ్రీలు కాదు త‌మ‌రి నేర ఘ‌న‌త‌లు. పైత్యంతో ఉన్న కొద్ది ప‌రువునూ తీసుకోకండి సూట్ కేసు రెడ్డి... అంటూ ఏపి బిజెపి  నేత‌లు ట్వీట్ చేశారు.  క‌న్నా లక్ష్మీనారాయణ రూ. 20 కోట్ల రూపాయలకు చంద్రబాబుకు అమ్ముడుపోయారని.. టీడీపీ మాజీ నేత, ఎంపీ సుజనా చౌదరి ద్వారా డీల్ జరిగిందని విమర్శించారు. సుజనా చౌదరి మధ్యవర్తిత్వం నిర్వహించి చంద్రబాబు, కన్నాను కలిపారని.. అందుకే చంద్రబాబు తరహాలోనే క‌న్నా క‌న్నా లక్ష్మీనారాయణ కూడా ఆరోపణలు చేస్తున్నారని విజ‌య‌సాయి రెడ్డి ఆరోపించారు. మ‌ళ్లీ అడుగుతున్నా... క‌న్నా! మీరు సుజ‌నాకు అమ్ముడు పోయారా? లేదా? టీజేపి (టీడీపీ జాకాల్స్ పార్టీ) వారు కాకుండా బీజీపీ వారు నా మీద విమ‌ర్శ‌లు చేస్తే స‌మాధానం ఇస్తానంటూ ట్వ‌ట‌ర్‌లో విజ‌య‌సాయి రెడ్డి స్పందించారు.  ఈ మధ్య మాటల యుద్ధం లాక్‌డౌన్‌లో వున్న ఏపీ జ‌నాల‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇస్తోంద‌ట‌. మరికొద్ది రోజుల పాటూ ఇలాగే కొనసాగి రాజ‌కీయ నేత‌ల‌కు సంబంధించిన అస‌లు విష‌యాలు అన్నీ బ‌య‌టికి వ‌స్తే బాగుంటుంద‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ లోపు రంగులు తొలగించాలి

*పంచాయితీ కార్యాలయాలకు వై సి పి రంగులపై హైకోర్టు ఆదేశం *రంగుల తొలగింపునకు 3 వారాల గడువు ఇచ్చిన హై కోర్ట్  మొత్తానికి ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. పంచాయతీ కార్యాలయాలకు రంగుల విషయం లో హైకోర్టు చెప్పినట్టే చేస్తానని మాట ఇచ్చింది.  స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ లోపు రంగుల తొలగింపు పూర్తి చేయాలని ఈ రోజు హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.  వాస్తవానికి జనవరి 27 వ తేదీనే, జగన్ సర్కార్‌కు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. పంచాయితీ కార్యాలయాలకు వైసీపీ రంగులపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వానివని, వాటికి పార్టీ రంగులు ఉండకూదని హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది.  పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున ఇప్పుడున్న వైసీపీ రంగులను తొలగించాలని సూచించింది. గుంటూరు జిల్లాలో పంచాయతీ కార్యాలయానికి వైసీపీ రంగు వేశారంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వానికి చెందినవని.. ప్రభుత్వ ఆస్తులపై ఎలాంటి పార్టీ రంగులూ ఉండకూడదని ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ వ్యవహారంలో బాధ్యత తీసుకోవాలని, కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు జనవరి 27 వ తేదీనే ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత, రెండు వాయిదాలు తీసుకుంది. ఈ రోజు ఫైనల్ గా హై కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

బీజేపీపై వైసీపీ ఎదురుదాడి వ్యూహం.. వారిని లక్ష్యంగా చేసుకుని... 

ఏపీలో కరోనా వైరస్ కిట్ల వ్యవహారం బీజేపీ వర్సెస్ వైసీపీగా మారిపోయింది. కరోనా వైరస్ టెస్టింగ్ కు వాడే కొరియా ర్యాపిడ్ కిట్ల కొనుగోళ్లలో భారీగా డబ్బు చేతులు మారిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఎదురుదాడి వ్యూహాన్ని ఎంచుకున్నారు. అదీ బీజేపీలో టీడీపీ నుంచి వచ్చిన నేతలను లక్ష్యంగా చేసుకుని. దీంతో కరోనా వైరస్ టెస్టింగ్ కిట్ల వ్యవహారం కాస్తా వాస్తవాలని దాటి ఫక్తు రాజకీయ కోణంలోకి మారిపోయింది. కొరియా కిట్ల ధరల్లో వ్యత్యాసం ఉందంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన ఆరోపణలు వైసీపీకి మింగుడు పడలేదు. వీటిపై వివరణ ఇచ్చేందుకు ప్రభుత్వంలోని ముఖ్య నేతలంతా రంగంలోకి దిగాల్సిన పరిస్ధితి. అయితే కొరియా కిట్లను అడ్డుపెట్టుకుని తమను టార్గెట్ చేస్తున్న బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ విషయంలో ఎలా స్పందించాలా అని ఆలోచించిన వైసీపీ చివరకు విభజించు పాలించు సిద్ధాంతాన్నే ఎంచుకుంది.  ఎలాగో బీజేపీలో ఎప్పటి నుంచో ఉన్న నేతలకూ, టీడీపీ నుంచి వచ్చిన నేతలకూ మధ్య అభిప్రాయ భేదాలున్నాయి. వీటినే టార్గెట్ చేసుకుని ఎదురుదాడి మొదలుపెట్టాలని భావించిన వైసీపీ వ్యూహాత్మకంగా విజయసాయిరెడ్డితో విమర్శలు చేయించడం మొదలుపెట్టింది. ఏపీ బీజేపీ నేతలు ప్రశ్నిస్తే తాను సమాధానం చెబుతాను కానీ టీజేపీ నేతలు అంటే టీడీపీ నుంచి వచ్చిన బీజేపీ నేతలు ప్రశ్నిస్తే తాను సమాధానం చెప్పబోనంటూ విజయసాయిరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే కాషాయ పార్టీలో విభేధాలను వాడుకోవాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో విజయసాయి ట్రాప్ లో పడకూడదని భావిస్తున్న కన్నా లక్ష్మీనారాయణ అవినీతి కేసుల వ్యవహారాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆ విధంగా చూసినా బీజేపీ నేతలను విజయవంతంగా దారి మళ్లించామని వైసీపీ సంబరపడుతోంది.

కరోనా వేళ స్ధానిక ఎన్నికల ప్రయత్నాలా? జగన్ సర్కారుపై జనాగ్రహం...

ఏపీలో ఓవైపు కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఎన్నడూ లేని విధంగా ఇవాళ ఒక్కరోజే 75 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 700 దాటిపోయింది. అయితే ప్రభుత్వం మాత్రం లక్ష కొరియా కిట్లు తెప్పించి, భారీగా పరీక్షలు నిర్వహించినట్లు చూపించి లాక్ డౌన్ ఎత్తేయగానే స్ధానిక ఎన్నికలకు రంగం సిద్దం చేస్తోంది. దీంతో ఇప్పుడు జగన్ సర్కారు వైఖరిపై జనంలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. కరోనా వైరస్ ప్రభావం ఆరంభమైన కొత్తలోనే ఒకట్రెండు కేసులు మాత్రమ నమోదయ్యాయని, దీనిపై స్ధానిక ఎన్నికలు వాయిదా వేస్తారా అంటూ ప్రశ్నించిన సీఎం జగన్... తాజాగా స్ధానిక ఎన్నికల కోసం కసరత్తు చేస్తున్నారన్న వార్తలు జనంలో ఆందోళన నింపుతున్నాయి. ఏపీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా అధికారులు కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో బిజీగా ఉన్నారు. పోలీసులు లాక్ డౌన్ అమల్లో బిజీగా కనిపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మరో రెండు వారాల్లో లాక్ డౌన్ ఎత్తేయగానే స్ధానిక ఎన్నికల వ్యూహాలకు తెరదీయాలని ప్రభుత్వం భావించడం వెనుక మర్మమేంటో కూడా అర్ధం కాని పరిస్ధితి. కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా ఆగిపోయే వరకూ విద్యాసంస్దలు, మాల్స్, దేవాలయాలను సైతం తెరిచి పరిస్ధితి కనిపించడం లేదు. అలాంటిది ఎన్నికల నిర్వహణకు ఎలా సిద్దమవుతారని మేథావులు, సాధారణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంటే రాష్ట్రంలో ప్రజల పరిస్ధితి ఏమైనా పర్వాలేదు కానీ నాకు మాత్రం ఎన్నికల నిర్వహణే ముఖ్యమన్న సంకేతాలను సీఎం జగన్ పంపుతున్నారా అన్న వాదన వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చూసినా మే 3 తర్వాత లాక్ డౌన్ పూర్తిగా సడలించే పరిస్దితి లేదు. తెలంగాణ వంటి రాష్ట్రాలు ఇప్పటికే మే 7వ తేదీ వరకూ లాక్ డౌన్ తప్పనిసరిగా ఉంటుందని స్పష్టం చేశాయి. ఏపీతో పాటు స్ధానిక ఎన్నికలు వాయిదా పడిన రాష్ట్రాలు సైతం ఎన్నికల గురించి ఆలోచించే పరిస్ధితే లేదు. అలాంటిది ఏపీలో మాత్రం జగన్ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు పరిస్ధితులను ఎలా అనుకూలంగా మార్చుకుందామా అని ఆలోచించడం దారుణమనే వాదన వినిపిస్తోంది. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి ఒక వేళ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైతే వైరస్ వ్యాప్తి పెరిగి ఒక్కసారిగా రాష్ట్ర్రమంతా పాకితే అప్పుడు పరిస్ధితిని అదుపు చేయడం ఎవరికీ వీలు కాదు. ఓసారి పరిస్ధితి చేదాటి పోయే అప్పుడు కేంద్రం కూడా చెసేదీమీ లేదు.

అసోం రాష్ట్రాన్ని అయోమయంలో పడేసిన కరోనా

అదేదో సినిమాలో అప్పాలన్నీ కప్పలవు గాక. కప్పలన్నీ అప్పాలవుగాక అని మాంత్రికుడు మ్యాజిక్ చేసినట్టు, కరోనా కూడా అసోం రాష్ట్రం లో మ్యాజిక్ చేసింది. ఆ రాష్ట్రంలో పాజిటివ్ లుగా తేలిన చాలా కేసుల్లో, చికిత్స మొదలెట్టిన తర్వాత ఆ లక్షణాలే కనపడకుండా పోయిన విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మిమంత బిష్వా శర్మనే స్వయంగా వెల్లడించారు.  కరోనా మహమ్మారి మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తోంది. తాము కరోనా బారిన పడ్డామన్న విషయాన్ని కూడా తెలియనివ్వకుండా నిలువెత్తు మనిషిని ప్రమాదంలోకి నెట్టేస్తోంది. టక్కుటమారి కరోనా ఊహించిన దానికంటే ప్రమాదకరమేనని వెల్లడవుతోంది. అసోంలో పాజిటివ్‌గా తేలిన 82 శాతం మందికి కరోనా లక్షణాలు కనపడలేదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మిమంత బిష్వా శర్మ ప్రకటించారు. 'ఈ వైరస్‌ నిశ్శబ్దంగా తన పనిచేసుకుపోతోంది. చికిత్స చేస్తోన్న సమయంలోనూ చాలా మందికి కరోనా లక్షణాలు కనపడలేదు' అని శర్మ వెల్లడించారు. అసోంలో 34 మంది కరోనా బారినపడ్డారు. 12 మంది కోలుకున్నారు. కరోనాతో బాధపడుతున్న వారి వయసు 18 నుంచి 71 కి మధ్య ఉంది. వారిలో 50 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న వారే అధికంగా ఉన్నారు. ఇప్పటివరకు 4,400 మందికి పరీక్షలు చేశారు. సగటున పది లక్షల మందిలో 120 మందికి పరీక్షలు చేసిన రాష్ట్రంగా అసోం నిలిచింది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే అసోంలో పరీక్షలు నిర్వహించిన వారి సంఖ్య చాలా అధికం. ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ కంటే అసోంలో అధికంగా టెస్టులు చేశారు. ఢిల్లీ, కేరళలో కంటే అసోంలో తక్కువగా చేశారు. అసోంలో గోవాల్పరా, గోలఘాట్, నల్బరీ, ధుబ్రి, మోరిగావ్ జిల్లాలను హాట్‌స్పాట్‌లుగా ప్రకటించారు.

'కన్నా' ను వెనకేసుకొచ్చిన సీఎం రమేశ్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ అమ్ముడుబోయి మాట్లాడుతున్నారంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ నేత సీఎం రమేశ్ స్పందిస్తూ విజయసాయిరెడ్డికి కౌంటర్‌ ఇచ్చారు.'కరోనా టెస్టింగ్ కిట్స్ కొనుగోలులో అవినీతి జరిగింది అని ప్రజలు, మీడియా మొత్తం కోడై కూస్తోంటే బాధ్యత గల బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీ నారాయణ గారు ప్రజల పక్షాన ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి.. అంతేగానీ ఇలా అర్థం పర్థం లేని ఆరోపణలు చేసి బురద చల్లడం సమంజసం కాదు' అని విమర్శించారు. 'విజయసాయిరెడ్డి గారు తమరు అధికారంలో ఉన్నారని... ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉందని గుర్తించండి. మీరెన్ని విమర్శలు చేసినా ప్రజా ప్రయోజనం విషయంలో వారి పక్షాన బీజేపీ ఏపీ పోరాడుతూనే ఉంటుంది.. ప్రశ్నిస్తూనే ఉంటుంది. కన్నా గారి మీద మీ విమర్శలను ఖండిస్తున్నాను' అని ట్వీట్లు చేశారు.

గంటకు 3 చొప్పున, ఏపీ లో ఒక్క రోజులో 75 పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. 24 గంటల్లో ఏపీలో అమాంతం 75 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఏపీ సర్కారు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు మొత్తం 722 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వివరించింది. వారిలో 92 మంది డిశ్చార్జ్ అయ్యారని, 20 మంది మరణించారని పేర్కొంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 610గా తెలిపింది.  ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో అత్యధికంగా 174 కేసులు నమోదు కాగా, వారిలో 168 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఐదుగురు మృతి చెందగా, ఒకరు కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో అత్యధికంగా 149 కేసులు నమోదయ్యాయని ఏపీ సర్కారు చెప్పింది. గుంటూరులో 130 మంది ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటుండగా, 15 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. నలుగురు ప్రాణాలు కోల్పోయారు.   ఈ రెండు జిల్లాల తర్వాత అత్యధికంగా కృష్ణా జిల్లాలో 80 మందికి కరోనా సోకగా, 60 మందికి చికిత్స అందుతోంది.. 14 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరులో 67 కేసులు నమోదు కాగా, 65 మందికి చికిత్స అందుతోంది. ఒకరు డిశ్చార్జ్‌ కాగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.  చిత్తూరులో 24 గంటల్లో 25 మందికి కరోనా నిర్ధారణ కావడంతో ఆ జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 53కి చేరింది. ప్రకాశం జిల్లాలో 44 మందికి కరోనా నిర్ధారణ అయింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

నిమ్మగడ్డ కేసులో ఫైనల్ హియరింగ్ 28 న...

నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో ఈ రోజు హై కోర్టు లో గంట సేపు వాదనలు, ప్రతి వాదనలు జరిగాయి.   అడిషనల్ కౌంటర్ దాఖలు చేస్తామన్న అడ్వకేట్ జనరల్. ఈ నెల 24 లోగా అడిషనల్ కౌంటర్ దాఖలు చెయ్యాలని హైకోర్ట్ ఆదేశించింది.  ప్రతిగా కౌంటర్ దాఖలు చెయ్యటానికి పిటిషనర్లకు 27 వరకు గడువు ఇస్తూ,  ఫైనల్ హియరింగ్ 28 న ఉంటుందని హై కోర్ట్ స్పష్టం చేసింది.   తేదీల విషయంలో ప్రభుత్వానికి , పిటిషనర్ల కు ఎటువంటి మినహాయింపులు ఉండవని కూడా పేర్కొంది.  ఎన్నికల కమిషనర్ పదవి కాలం కుదించడంతో బాటు మాజీ న్యాయమూర్తిని నియమించటానికి చేసిన చట్ట సవరణ ఇప్పుడు ఐ ఏ ఎస్ సర్కిల్స్ మధ్య పెద్ద అంతరానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో, ప్రస్తుతం, రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసే అడిషనల్ పిటీషన్ ప్రాధాన్యం సంతరించుకోనుంది. రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ జారీ చేసిన 617, 618 జీవోలే చీఫ్ సెక్రెటరీ నీలం సాహ్నీకి, పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గోపాల కృష్ణ ద్వివేదీకి మధ్య గ్యాప్ పెరగటానికి కారణంగా తెలుస్తోంది.  కొత్తగా రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు. అనంతరం జరిగిన పరిణామాలతో మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆర్డినెన్సు చట్టబద్ధతను ఆయన ప్రశ్నించారు. ఈ అంశానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడం అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అవుతారు. అయితే ఎన్నికల సంఘానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోటీసుకు వెళ్ల కుండా నేరుగా పంచాయితీరాజ్ శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేసినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తరపున పంచాయితీరాజ్ శాఖ కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదీ నే జీవోలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టులో అడిషనల్ కౌంటర్ దాఖలు చేయాల్సిన అవసరం ఏర్పడిన విషయం తెలిసిందే.