ఏప్రిల్ 25 వరకు టీటీ డీ అన్నప్రసాదం పంపిణీ

* పశుగ్రాసం, దాణా కూడా                       లాక్ డౌన్ నేపథ్యంలో అమలు చేస్తున్న అన్న ప్రసాదం, పశుగ్రాసం , దాణా పంపిణీని ఈ నెల 25వ తేదీ వరకు  కొనసాగిస్తామని టీటీడీ ప్రకటించింది. ఈ నెల 20వ తేదీ తరువాత కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ లో కొన్ని మినహాయింపులు కల్పించింది. దీనివల్ల రైతులు, కూలీల జీవనోపాధి పనులు చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. అందువల్ల అన్న ప్రసాదం , పశుగ్రాసం, దాణా పంపిణీని ఈ నెల 25వ తేదీ వరకే కొనసాగించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది.  లాక్డౌన్ వల్ల తిరుపతి, పరిసర ప్రాంతాల్లో భోజనానికి ఇబ్బంది పడుతున్న వలస కూలీలు, పేదల ఆకలి తీర్చడం కోసం టీటీడీ గత నెల 28వ తేదీ నుంచి అన్నప్రసాదం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.  పశువులు  కూడా మేత లేక ఇబ్బంది పడుతున్నందువల్ల ఏప్రిల్ 1వ తేదీ నుంచి గ్రాసం, దాణా, వీధి కుక్కలకు టీటీడీ ఆహారం అందిస్తోంది.

లాక్ డౌన్ రూల్స్ లోకేష్, దేవాన్ష్ లకు వర్తించవు

ఆయన ఏమి చేసినా సెన్సేషనే...కీలకమైన సమయం లో -పొరుగు రాష్ట్రం తెలంగాణాలో సేదతీరుతున్న నారా లోకేష్ చేస్తున్న సైక్లింగ్, అలాగే ఆయన కుమారుడు దేవాన్ష్ స్కెట్ బోర్డు మీద చేసిన విన్యాసాలు నెటిజెన్లకు ఇప్పుడు కావాల్సినంత స్టఫ్ అందిస్తున్నాయి. లాక్ దొళున్ నిబంధనలు ఉల్లంఘించి మరీ, ఆయన, ఆయన కుమారుడు- హైదరాబాద్ లోని తన ఇంటి రోడ్డుపై మాస్క్ లు లేకుండా లోకేష్ సైకిల్ తొక్కారు. లోకేష్ సైకిల్ తొక్కటమే కాకుండా తన తనయుడు నారా దేవాన్ష్  స్కేట్ బోర్డుపై హంగామా చేశారు. వీళ్లిద్దరి పక్కన ఉన్న సెక్యూరిటీ గార్డ్ మాత్రం మాస్క్ ధరించి ఉన్నాడు. కానీ వీళ్లు మాత్రం మాస్క్ లు లేకుండానే రహదారిపై సరదాగా తిరిగారు.దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉండటంతో బయటకు వస్తే ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించాలని సర్కారు ఆదేశించింది. కానీ బాధ్యత గల మాజీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇలా చేయటం ఏమిటంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఇండియన్ నేవీ నీ వదలని కరోనా

*ఐఎన్‌ఎస్‌ అంగ్రే నావల్‌ బేస్‌లో అలజడి  21 మంది నావికాదళ సిబ్బందికి కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలినట్టు, నేవీ అధికారులు వెల్లడించారు.  ఆ 21 మందినినగరంలోని ఐఎన్‌హెచ్‌ఎస్‌ అశ్వినీ నేవీ ఆస్పత్రికి తరలించి చికిత్స మొదలెట్టారు. ఐఎన్‌ఎస్‌ అంగ్రే నావల్‌ బేస్‌లో పనిచేసే సిబ్బందిలో ఒకరికి ఏప్రిల్‌ 7 న కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అతని ద్వారానే తాజాగా మిగతా వారికి కరోనా వ్యాప్తి జరిగినట్టు నేవీ ఉన్నతాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నేవీలో కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఐఎన్‌ఎస్‌ అంగ్రే నావెల్ బేస్ లో లాక్‌డౌన్‌ ప్రకటించారు. మిగతా సిబ్బందికి కరోనా వ్యాపించకుండా భారత నావికాదళం చర్యలు మొదలెట్టింది. బాధిత సెయిలర్లు ఎవరెవరితో కాంటాక్ట్‌లో ఉన్నది తేల్చే పనిలో అధికారులు ప్రస్తుతం బిజీ గా ఉన్నారు. భారత త్రివిధ దళాలలో ఇప్పటికే ఇండియన్‌ ఆర్మీలో 8 కరోనా కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే.

పేషేంట్ లకు జైల్ లో ప్రత్యేక వార్డ్!

తెలంగాణా రాష్ట్రంలో రక్తహీనత రోగులు, తీవ్ర ఇబ్బంది పడుతున్నారు! ఈ నేప‌థ్యంలో బ్ల‌డ్ సేక‌రించడానికి నారాయ‌ణ‌గూడ బ్ల‌డ్ బ్యాంక్ ప్ర‌త్యేక ఏర్పాట్ల‌ను చేసింది. శ‌నివారంనాడు నారాయణ గూడ సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ లో టీఎన్జీవో ల ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను నిర్వ‌హించారు. కోవిడ్ 19 వలన రాష్ట్రంలో బ్లడ్ నిల్వలు తగ్గిపోయాయి. దీనితో తలసేమియా, రక్తహీనత రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేప‌థ్యంలో కొంత మంది యువకులు రక్తదానం చేశారు.   యువకులు పెద్ద ఎత్తున రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారు అందులో భాగంగానే ఇవాళ నారాయణ గుడా ఐపీఎఎంలో టీఎన్జీవో ల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన‌ట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. ప్ర‌స్తుతం బ్లడ్ నిల్వవలు పెరుగుతున్నాయి ఇంకా ఎంతో మంది యువకులు రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారని మంత్రి తెలిపారు. టీఎన్జీవో లు ఎప్పుడు కూడా రక్త దానం చేయడానికి ముందు ఉంటారని మంత్రి ప్ర‌శంసించారు. డాక్టర్ ల పై దాడులు హేమమైన చర్య, డాక్టర్ లపై దాడులు చేస్తే కఠినంగా శిక్షలు ఉంటాయి మంత్రి ఈటెల ఈ సంద‌ర్భంగా మ‌రో సారి హెచ్చ‌రించారు. డాక్టర్లు నిరంతరం కష్టపడి పని చేస్తున్నారు, వారి పై పేషేంట్లు దాడి చేస్తే జైల్‌లో వున్న ప్ర‌త్యేక వార్డుకు త‌ర‌లిస్తామ‌ని మంత్రి హెచ్చ‌రించారు. పేషేంట్ లకు జైల్ లో ప్రత్యేక వార్డ్ పెట్టాం.వారికి కూడా శిక్ష అమ‌లులో వుంటుంద‌ని మంత్రి తెలిపారు.

రంజాన్ నెల‌ ఇంట్లోనే! సౌదీ గ్రాండ్‌ ముఫ్తీ అదే చెప్పారు!

వచ్చే వారం ప్రారంభం కానున్న రమదాన్ ఉపవాస దీక్షలు, అనంతర తారావీహ్‌ ప్రార్థనలు ఇంట్లోనే నిర్వహించుకోవాలని సౌదీ అరేబియా మతపెద్ద, గ్రాండ్‌ ముఫ్తీ షేక్‌ అబ్దులాజీజ్‌ అల్ షేక్ ప్ర‌పంచంలో వున్న ముస్లింల‌కు పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో మసీదులకు వెళ్లే పరిస్థితులు లేవని ముఫ్తీ గుర్తుచేశారు. ఇస్లాంను విశ్వసించేవారంతా ఈ నియమాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. రమదాన్ మాసంలో నిర్వహించే ఇఫ్తార్, తారావీహ్‌ కార్యక్రమాలను అందరూ ఇంట్లోనే నిర్వహించుకోవాలని సూచించారు. రమదాన్ పర్వదినంలో మ‌క్కా, మదీనాలోని ప్రముఖ మసీదులో ప్రతిరోజు ఏర్పాటు చేసే ఇఫ్తార్‌ను (ప్ర‌త్యేక ఇఫ్తార్ పార్టీల‌ను) సైతం రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. వైరస్‌ విజృంభణ నేపథ్యంలో మార్చి రెండో వారం నుంచే సౌదీ అరేబియా న‌మాజ్ విషయంలో మార్గదర్శకాలు జారీ చేసింది. మసీదుకు వెళ్లాల్సిన అవసరం లేదని సూచించింది. ప్ర‌పంచంలో వున్న ముస్లింలంద‌రూ ఇంట్లోనే న‌మాజ్, ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాలు చేసుకోవాల‌ని గ్రాండ్ ముఫ్తీ ఆదేశాలు జారీచేశారు. రంజాన్ సంద‌ర్భంగా ప్ర‌త్యేక ఉమ్రా యాత్ర‌ల‌ను కూడా సౌదీ ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. మే 31వ తేదీ వ‌ర‌కు అన్ని ఎయిర్ లైన్స్ ఆప‌రేష‌న్‌పై నిషేధం విధించింది.

ఆలుగడ్డలు తిని ఆకలి తీర్చుకుంటున్న బెంగాల్ యువకులు

* క్రీస్తురాజపురం లో పశ్చిమ బెంగాల్ యువకుల ఆవేదన లాక్ డౌన్ కారణంగా పనులు లేక పస్తులు ఉంటున్న వలస కార్మికుల అవస్థలు విజయవాడ లో ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. స్థానికులు పెట్టే ఆహారంతో కడుపు నింపుకుంటున్న కార్మికులు తమను ఆదుకునే వారి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం‌ లేదని ఆవేదన. వారి ఆందోళన కు మద్దతు పలికిన బిజెపి నేతలు మైనార్టీ మోర్చా జాతీయ కార్యదర్శి షేక్ బాజి, రాష్ట్ర మీడియా కన్వీనర్ వుల్లూరిగంగాధర్. షేక్ బాజీ మాట్లాడుతూ- మగ్గం పనుల కోసం పశ్చిమ‌బెంగాల్ నుంచి విజయవాడ కు వలస వచ్చిన 536మంది ఈ ప్రాంతంలో నివాసాలు ఉంటున్నారు, అప్పుడప్పుడు దాతలు ఇచ్చిన సాయంతో కడుపు నింపుకుంటున్నారు, లేని రోజు పచ్చి బంగాళ దుంపలు తింటున్నారు.. లేదా పస్తులు ఉంటున్నారని చెప్పారు. ఇక్కడ రేషన్ కార్డు లేకపోవడం తో వీరిని ఎవరూ పట్టించుకోవడం లేదని, వాలంటీర్ లు కూడా వీరి వివరాలను నమోదు‌ చేసుకోవడం లేదని, ప్రభుత్వం వాళ్ల బాధను అర్ధం చేసుకుని ఆహారం అందించాలని, ఇక్కడ సాధ్యం కాదంటే...‌వారి  సొంత రాష్ట్రానికి పంపే ఏర్పాటు చేయాలని బాజీ కోరారు.   గంగాధర్ మాట్లాడుతూ-ఊరు కాని ఊరు వచ్చి వీరంతా అవస్థలు పడుతున్నారని, ఇటీవలే ఈ ప్రాంతానికి సమీపంలో రెడ్ జోన్ ప్రకటించారని, ఇరుకు గదుల్లో నివాసం ఉండే వీరిలో ఎవరికైనా ఇబ్బంది వస్తే నష్టం భారీగా ఉంటుందని, వీరి ఆకలి తీర్చాల్సిన బాధ్యత అధికారుల పై ఉందని అన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టి కి తీసుకెళ్లామనే, స్పందించి బెంగాల్ యువకుల ఆకలి తీర్చేలా ఏర్పాటు చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వాలంటర్ వ్యవస్థను తక్షణమే ఇక్కడకు పంపి వీరికి తగు సాయం చేయాలని గంగాధర్ డిమాండ్ చేశారు.

గతంలో మీ పత్రిక తెలుగు కోసం గుండెలు బాదుకోలేదా?

మన భాషని, మన సంస్కృతిని మనం చిన్నబరుచుకుంటే ఎలా? ఇంగ్లిష్‌ నేర్పాలి, కానీ తెలుగుని అగౌరవపరిచే పద్ధతి మానుకోవాలి. మాతృభాషను రక్షించుకోవడం, ప్రచారం కల్పించుకోవడంలో కన్నడిగులు, మరాఠీలు, తమిళులు, హిందీ వాళ్లను చూసి నేర్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా గతంలో ‘మాతృభాషకు మంగళం’ అనే శీర్షికతో సాక్షి పత్రికలో క‌థ‌నాలు ప్ర‌చురించారు.  వైసీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగు మీడియం కావాలంటూ డిమాండ్‌ చేశారు. ఇప్ప‌డేమో ఇంగ్లిష్‌ మీడియం అంటూ  కపటనాటకాలు ఎందుకు?   ‘దేశ భాషలందు తెలుగు లెస్స. మాతృభాష మన ప్రాచీన సంపద. కాపాడుకుందాం. పెంపొందిద్దాం. తెలుగు భాష అభ్యున్నతికి ఇంగ్లిష్‌ వాడైన బ్రౌన్‌ ఎంతగానో కృషి చేశాడు. మన తెలుగు నాయకులు మాత్రం మాతృభాష అంతరించిపోయే విధంగా చేస్తున్నారు.   విద్యాహక్కు చట్టం ప్రకారం.. ప్రాథమిక విద్య బోధన మాతృభాషలోనే జరగాలి. 8వ తరగతి వరకు పిల్లలకు స్థానిక మాతృభాషలోనే బోధించాలని జాతీయ నూతన విద్యా విధానం కూడా చెబుతోంది. 1968, 1986 సంవత్సరాల్లో రూపొందించిన విధానాల్లోనూ ఇదే విషయం చెప్పారు. ఆంగ్ల మాధ్యమంతో పాటు సమాంతరంగా తెలుగు మాధ్యమం.. అంటే రెండూ ఉండాలని రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయల ఎమ్మెల్సీలు సూచించారు. ఇప్పటి వరకు తెలుగులో చదివిన విద్యార్థులను ఒకేసారి ఆంగ్ల మాధ్యమంలోకి మారిస్తే విద్యా ప్రమాణాలు పడిపోతాయని, పేద పిల్లలు బడి మానేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు భాషావేత్తలు, విద్యావేత్తలు, శాస్త్ర వేత్తలు సైతం మాధ్యమాన్ని పిల్లలే ఎంచుకునే అవకాశం ఉండాలని సూచించారు.

కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, క్లాస్ రూమ్ సిలబస్ కి సంబంధం ఉండటం లేదా?

* ఒక ప్రభుత్వ టీచర్ చేసిన విశ్లేషణ.. * తప్పకుండా ఆలోచించాల్సిన అంశాలు...  ప్రభుత్వ విద్యా వ్యవస్థ, ప్రైవేటు విద్యా వ్యవస్థ మధ్య పోటీలో..  ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎలా బలిపశువులు చేసి చూపుతున్నారో, వాళ్ళు అలా ఎందుకు బలికావాల్సి వస్తుందో వివరించే ప్రయత్నం నాది... కొంత హిస్టరీలో కి వెళ్దాం...  30 సంవత్సరాలకు పూర్వం అందరూ ప్రభుత్వ పాఠశాలలోనే విద్య అభ్యసించేవారు. డాక్టర్ కొడుకైనా, లాయర్ కొడుకైనా, ఇంజనీర్ కొడుకైన, టీచర్ కొడుకైనా, రాజకీయ నాయకుడి కొడుకైనా, రైతు కొడుకైనా, కూలి కొడుకైన ఎవరైనా ఒకే పాఠశాలలోనే చదవాల్సిందే. అప్పుడు పాఠశాలలన్నీ తెలుగు మీడియంలోనే ఉండేవి.. దాదాపు ప్రతి గ్రామంలోనూ పాఠశాలలు విద్యార్థులతో కిటకిటలాడేవి. అప్పుడు కూడా విద్యార్థులకు సరిపడే టీచర్లు కూడా ఉండేవారు కాదు. ఏ కొంత మంది విద్యార్థులకో ప్రత్యేక తర్ఫీదు లు ఉండేవి కాదు. కానీ విద్యార్థులు వారి యొక్క సామర్ధ్యాన్ని బట్టి ముందు తరగతులకు వెళ్తూ ఉండేవారు. తెలివైన విద్యార్థులు 5 నుండి 10 శాతం మంది  ఉన్నత తరగతులు చదువుతూ కాలేజీల్లోనూ.. యూనివర్సిటీల్లోని సీట్లు సంపాదిస్తూ  ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళేవారు. మిగతా 90 శాతం మంది విద్యార్థుల్లో ప్రాథమిక విద్యలో విద్యను ఆపేసిన వారు కొందరు, హైస్కూల్ స్థాయిలో  విద్యను ఆపేసిన వారు కొందరు, కాలేజీ స్థాయిలో కొందరు, రకరకాల వృత్తులో స్థిరపడిన వారు కొందరు ఉండేవారు. అలా ఉన్న 90 శాతం మందిలో ఏ ఒక్కరు కూడా ఆ పాఠశాల వలనే మాకు చదువు రాలేదు అని ఎవరూ అనుకోలేదు. మేము చదువు మీద సరైన శ్రద్ధ చూపలేదు అని మాత్రమే అనుకునేవారు. వారికి చదువు చెప్తున్న ఏ ఉపాధ్యాయుని కూడా నిందించే వారు కూడా కాదు.  తర్వాత వాస్తవం లోకి  వెళ్దాం... కాలంతో పాటు జనాభా కూడా పెరుగుతోంది. గ్రామాల్లోని విద్యార్థులకు కూడా చదువుకోవాలనే ఆసక్తి పెరిగింది. కానీ ప్రాథమిక విద్య తర్వాత హైస్కూల్ లో  జాయిన్ చేయడానికి  అందుబాటులో లేక చదువు మానేసిన వాళ్లు  కొందరు.  దీనికి కారణం ఉపాధ్యాయులా? ప్రభుత్వమా?  ఏదోలా దూరాన ఉన్న హై స్కూల్లో చేరి హైస్కూలు చదువు పూర్తి చేసిన తర్వాత జూనియర్ కాలేజీలో చేరుదామనుకుంటే రెండు, మూడు మండలాలకు కలిపి ఒక జూనియర్ కళాశాల దానిలో 100 నుంచి 200 సీట్లు ఉండేవి. మరి మిగతా విద్యార్థుల పరిస్థితి ఏంటి ?   ప్రభుత్వాలు వాళ్లకి ఎందుకు చదువుకునే అవకాశాలు కల్పించలేకపోయింది?అప్పుడే విద్యార్థులు అవసరాలకు అనుగుణంగా ప్రైవేట్ కళాశాలలు పుట్టుకొచ్చాయి. ప్రభుత్వం కూడా తన భారం తగ్గుతుంది కదా అని పర్మిషన్ లు కూడా ఇచ్చేసేది. కానీ  ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు రాని వాడు మాత్రమే ప్రైవేటు కళాశాలలో జాయిన్ అయ్యే వారు. కానీ ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు రాని వారి సంఖ్య పెరుగుతూ పోయింది. కానీ ప్రభుత్వ కళాశాలలు పెరగలేదు. వాటిల్లో సీట్ల సంఖ్య పెరగలేదు. ప్రైవేటు కళాశాలల సంఖ్య మాత్రం  వారికి అనుగుణంగా పెరుగుతూ పోయింది. అపార్ట్ మెంట్ లో నడుస్తున్నా.. విద్యా ప్రమాణాలు పాటించకున్నా.. ప్రభుత్వం తన మీద భారం లేదు కదా అనుకుంటూ పర్మిషన్ ఇచ్చుకుంటూ పోయింది. మరి ప్రాథమిక విద్య లో విద్యార్థులను ఆకర్షించడం ఎలా..?  వాళ్ల దగ్గర లేనిది మన దగ్గర ఏముంది? దానికి సమాధానమే ఇంగ్లీష్ మీడియం... ఇబ్బడిముబ్బడిగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రారంభమయ్యాయి... ఉన్నత తరగతి వ్యక్తులందరూ అటు వైపు ఆకర్షింపబడ్డారు. ప్రభుత్వం ప్రాథమిక విద్యని మాతృభాషలోనే బోధించాలని  రూల్ ఏమి పెట్టలేదు. అడిగిన వాళ్లందరికీ ఇంగ్లీష్ మీడియం పర్మిషన్ ఇచ్చేసింది. కానీ ఏ ఒక్క గవర్నమెంట్ స్కూల్లోనే ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియం పెట్టలేదు. ప్రభుత్వం మీద భారం లేకుండా ఎవరికి వారే కదా డబ్బులు ఖర్చు పెట్టుకొని ప్రైవేట్ గా చదివేస్తున్నారు. ప్రభుత్వానికి చాలా సంతోషించదగ్గ విషయమే కదా..! ప్రభుత్వ ఖర్చు లేకుండా ప్రజలు విద్యావంతులై పోతుంటే..!! అలా ఉన్నత, మధ్య తరగతి విద్యార్థులు ప్రైవేట్ స్కూల్ వైపు వెళ్ళిపో సాగారు.  అది సమాజంలో లో స్టేటస్ సింబల్ గా మారిపోయింది. ప్రభుత్వ పాఠశాల క్రమేపీ పేదల పాఠశాల గా మారిపోయింది. కష్టం చేసుకునే ప్రజల పిల్లలు.. ఇంటి దగ్గర కష్టపడుతూ స్కూల్ కి వచ్చి చదువుకునే పిల్లలు.. ఏ మాత్రము చదువుకు సహకరించని తల్లిదండ్రులున్న పిల్లలు... ప్రభుత్వ పాఠశాలలకు దిక్కయ్యారు. వాళ్లలో కూడా తెలివైనవారిని రెసిడెన్షియల్ పాఠశాలలు, నవోదయ పాఠశాలలు లాంటివి పరీక్షలు పెట్టి తీసుకెళ్లిపోయారు . ఇక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల మీద భారం వేసి నీవల్లే ప్రభుత్వ పాఠశాల నాశనమయ్యిందంటూ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ప్రజల మీద దురభిప్రాయం రుద్దింది.   ఆకులు చిదిమేసి, కొమ్మలు నరికేసి, చెట్టు మొదలు కి నీరు పోసినట్టు..ఇన్ని సంవత్సరాల తర్వాత మేము ఇంగ్లీష్ మీడియం పెడుతున్నాం అని.. తూతూమంత్రంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాయి... పెట్టినా.. అందుకు తగ్గట్టు వనరులు సమకూర్చ లేకపోయింది. ‌ప్రైవేటు పాఠశాల పక్కన, ప్రభుత్వ పాఠశాల చిన్న పోయేలా ప్రభుత్వం తయారుచేసింది. సరిపడినంత మంది ఉపాధ్యాయులు ఇవ్వలేకపోవడం. విద్యార్థులకు ఫర్నిచర్ తరగతి గదులు సరిపడా  లేకపోవడం. ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్లు, ట్రాన్స్ఫర్లు సరైన సమయంలో చేసి,  సరైన పద్ధతిలో పాఠశాలలను నడిపించలేక పోవటం.  ప్రైవేటు విద్యార్థులు సొంతంగా సిలబస్లో రూపొందించుకున్న వారిని అదుపు చేయలేక పోవడం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, క్లాస్ రూమ్ సిలబస్ కి సంబంధం లేకపోవడం.ఉదాహరణకు 5వ తరగతి పూర్తి చేసి నవోదయ రాస్తున్న విద్యార్థికి ఐదవ తరగతి సిలబస్ లో ఉన్న ప్రశ్నలు కాకుండా ఇతరత్రా జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువ ఉండటం వల్ల వాటిని పాఠశాలలో బోధించే ఏవిధంగా సిలబస్ లేకపోవడం.  ఇంటర్మీడియట్ రెండు సంవత్సరములు MPC గ్రూప్ గవర్నమెంట్ కాలేజీలో చదివి  లెక్కలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక్క లైను కూడా మిస్ అవ్వకుండా మొత్తం అవపోసణ చేసిన వాడికి ఐఐటీలో సీటు వస్తుందా?  ‌రాదు...  ఎందుకంటే ఆ సిలబస్లో లేని అంశాలు, అంతకు మించిన అంశాలను ఆ ఎక్జామ్ లో ప్రశ్నించడం వలన.  అంటే ప్రభుత్వం ఆ అంశాలను ఎందుకు సిలబస్ లో పొందుపరచ లేకపోయింది. లేదా ఇంటర్మీడియట్ సిలబస్ కు మించకుండా ఐఐటీ ఎగ్జామ్ ని ఎందుకు నిర్వహించలేక పోతుంది? అంటే గవర్నమెంట్ పాఠశాల పుస్తకాలు, గవర్నమెంట్ కాలేజీ చదువులు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు సరిపోవు.. అనే భావాన్ని ప్రజల్లో బాగా నాటింది... ఈ విధంగా ప్రభుత్వం తన విధానాలతో ప్రభుత్వ స్కూళ్ల విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ..  ఆ తప్పిదాన్ని ఉపాధ్యాయులు మీదికి నెట్టేస్తూ ప్రజల్లో ఆ భావాన్ని గట్టిగా నాటింది.నిజంగా ఇప్పుడు ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న రాష్ట్రంలో విద్యార్థులందరూ ప్రభుత్వ స్కూల్లో జాయిన్ అయితే వారి సంఖ్యకు తగ్గట్టు స్కూళ్లను ఏర్పాటు చేసి, ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమించగలదా...?  ఆ సామర్ధ్యం ప్రభుత్వం దగ్గర ఉంటే ప్రభుత్వ స్కూళ్లు ఎందుకు బలోపేతం కావు ..ఇక్కడ నేను చెప్ప వచ్చే ముఖ్యమైన విషయం ఏంటంటే .ఫలితాలు చూపిస్తూ మేము మీ కంటే మెరుగ్గా ఉన్నాం అని విర్రవీగే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, వాటిని సమర్థించే గొర్రె మంద లాంటి జనాలు ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకోవాలి. నీళ్లు ఉన్నచోట ఎవరైనా పంట పండిస్తారు. ఎడారిలో పండించండి .మీ ప్రవేట్ స్కూల్ కి వచ్చిన ప్రతి పిల్లాడు ప్రతి రోజు స్కూల్ కి వస్తాడు. వారిని స్కూల్ దాకా దింపే తల్లిదండ్రులు ఉంటారు.నువ్వు అడిగిన ప్రతి పుస్తకం కొంటాడు.నువ్వు ఎన్ని గంటలు రుద్దుతున్నా వింటారు. . వాళ్ల తల్లిదండ్రులు విద్యావంతులై ఉంటారు. ఇంటి దగ్గర మాత్రం వారి కోసం సమయం  కేటాయించగల గలవారై ఉంటారు.ఆ పిల్లలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తారు.మరి నా ప్రభుత్వ స్కూల్ కి వచ్చిన పిల్లాడు నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు, రోజువారి కూలీల పిల్లలు... అడిగిన పుస్తకం కూడా లేని పరిస్థితి.ఇంటి పని అంతా చేసుకొని సమయానికి స్కూలు రాని పరిస్థితి.పేదరికంలో ఉన్న వాళ్లు ఆరోగ్యం చెడిపోతే మధ్యలోనే నెలలపాటు పాఠశాల మాని వేసే పరిస్థితి. ఉదయాన్నే పనికిపోయే తల్లిదండ్రులు వాడు పాఠశాలకు వెళ్తున్నాడు లేదో కూడా పట్టించుకోని పరిస్థితి. పౌష్టికాహారం లేక బక్కచిక్కిన పిల్లలు. నువ్వు మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలను చేర్చుకోవు.మేము చేర్చుకుంటాం..మీరు పుస్తకం లేకపోతే బడీకి రానివ్వరు.మేము రానిస్తాం. మీరు పాఠశాలకు ఆలస్యమైతే ఒప్పుకోరు.మాకు వాడు పాఠశాలకు ఎప్పుడు వచ్చినా అదే పదివేలు.. మీరు మీ విద్యార్థులకు హోం వర్క్ చేయకపోతే వాళ్ల తల్లిదండ్రులను కూడా మందలిస్తారు.మా పిల్లల తల్లిదండ్రులు 90 శాతం నిరక్షరాస్యులు మీ పాఠశాలను శుభ్రం చేసే మనుషులు ఉంటారు. మాకు మా విద్యార్థులు మరియు మేమే ఆ పని చేస్తాం. మీరు చదువులో వెనుకబడిన విద్యార్థులకు పాఠశాల నుండి తీసివేసి పంపించేస్తారు. ఎందుకంటే వాడు ఉంటే మీ పాఠశాల పరువు తక్కువ కాబట్టి.మేము వెనుకబడిన విద్యార్థులకు పిలిచి మరీ పాఠశాలలో చేర్చుకుంటాం. మీ పాఠశాలలో క్రీడలు లాంటివి లేవు. అంతెందుకు గ్రౌండ్ లే లేవు. మా పాఠశాలలో తప్పనిసరిగా క్రీడలు ఆడించవలసిందే. మీ పాఠశాలలో తెలివైన విద్యార్థులను మీరే దాచుకుంటారు.  ఫీజు రాయితీలు అంటూ బయటికి పోనివ్వరు.  ఎందుకంటే వాడి పేరు చెప్పి ఇంకో వందమందిని ఆకర్షించాలిగా..మా పాఠశాలలో తెలివైనవారిని నవోదయ రెసిడెన్షియల్ స్కూల్స్ కి పంపించేస్తుంటాం...మీరు కొన్ని వందల పాఠశాలల  బ్రాంచ్ లు కలిపి అది మీ యొక్క పాఠశాల రిజల్ట్ గా చెప్పుకుంటారు... మాకు మా పాఠశాలలో వస్తేనే మా గొప్ప. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి...  అవన్నీ మీకు కూడా తెలుసు...వ్యవస్థలో లోపాలు సరిచేయకుండా ప్రభుత్వ ఉపాధ్యాయుడిదే లోపం అని  మాట్లాడుతున్న గా.. అందరూ ఈ అన్ని విషయాలు గమనించండి. అయినా మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ తోపులు కాలేదు. లక్షల మంది దగ్గర్నుంచి ఐఐటీ సీట్లంటూ లక్షలు.. గుంజేస్తుంటే ఏ వందమందికో సీట్లు వస్తున్నాయి...మరి మిగతా వాళ్ల సంగతేంటి..?   మా ప్రభుత్వ పాఠశాలలో పదికి పది పాయింట్లు వచ్చిన వారిని నీలాగ రాష్ట్రం అంతా కలిపి లెక్కేస్తే, టీవీల్లో ప్రకటనలు ఇస్తే నువ్వు ఒక పక్కకు కూడా రావు.. అది నీ లాంటి సౌకర్యాలు లేకుండా..   ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టు ఉంది ప్రైవేట్ పాఠశాలలు గోదారి బ్రిడ్జి మీద కారులో పోతున్నట్టు ఉంది.  అన్ని తెలుసుకోకుండా ఎవడికి వాడు ఈ రంగంలో లేకుండా ఒడ్డున కూర్చుని మామీద రాళ్లువేయడం సరికాదు.దయచేసి ప్రభుత్వ పెద్దలు ఈ లోపాలను సరి చేయండి.

భార‌త టాలెంట్ ను చాటుతున్న సైంటిస్ట్‌! డాక్ట‌ర్ సౌమ్యా స్వామినాథ‌న్!

కోవిద్‌-19 పేరు సూచించింది డాక్ట‌ర్ సౌమ్యానే! కోవిద్‌-19.. అంటే క‌రోనా వైర‌స్‌కు పెట్టిన కొత్త పేరు. ఇది వ్యాధి పేరు. ఈ పేరును ఫిక్స్ చేసింది ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌. అయితే ఆ వైర‌స్‌కు నామ‌క‌ర‌ణం చేసింది మాత్రం మ‌న భార‌తీయ డాక్ట‌రే. ఆ డాక్ట‌ర్ పేరు సౌమ్యా స్వామినాథ‌న్‌. డ‌బ్ల్యూహెచ్‌వోలో ఆమె చీఫ్ సైంటిస్ట్‌గా చేస్తున్నారు. సీఓ అంటే క‌రోనా, వీఐ అంటే వైర‌స్‌, డీ అంటే డిసీజ్‌, 19 అంటే 2019లో ఆ వ్యాధి పుట్టింద‌ని అర్థం. వ్యాధుల‌కు పేరు పెట్టాలంటే కొన్ని నిబంధ‌న‌లు ఉంటాయి. ఆ నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే క‌రోనా వైర‌స్‌కు కోవిద్‌-19 అని పేరు పెట్టిన‌ట్లు డాక్ట‌ర్ సౌమ్యా స్వామినాథ‌న్ తెలిపారు. వ్యాధికి పేరు పెట్టిన‌ప్పుడు ఆ వ్యాధి పేరు ఓ ప్రాంతాన్ని కానీ, న‌గ‌రాన్ని కానీ సూచించ‌కుండా ఉండాలి. వ్యాధి పేరు కూడా ప‌ల‌క‌డానికి ఈజీగా ఉండాలి. క‌న్ఫూజ‌న్ ఉండకూడ‌దు, కానీ లాజిక్ మిస్ కావొద్దు. భ‌విష్య‌త్తు త‌రాలు తెలుసుకునే ర‌కంగా వ్యాధి పేరు ఉండాలి. క‌రోనా వైర‌స్ వ‌ల్ల వ‌చ్చే మిగ‌తా వ్యాధుల‌కు కూడా పెరు పెట్టేంత సులువుగా ఉండాల‌ని డాక్ట‌ర్ సౌమ్యా స్వామినాథ‌న్ అన్నారు. హరిత‌విప్ల‌వ పితామ‌హుడు ఎంఎస్ స్వామినాథ‌న్ కూతురే డాక్ట‌ర్ సౌమ్యా స్వామినాథ‌న్‌. డాక్ట‌ర్‌ సౌమ్యా స్వామినాథన్‌ బాల్యమంతా మేధావుల సాంగత్యంలోనే గడిచింది. ఈమె తండ్రి ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త కావటంతో ఇంటికి నోబెల్‌ గ్రహీత సి.వి రామన్‌, మరో ప్రైజ్‌ విన్నర్‌ నోర్మన్‌ బోర్లాగ్‌ వచ్చిపోతూ ఉండేవారు. సౌమ్య మీద ఆ మహానుభావుల ప్రభావం చిన్నతనం నుంచే మొదలైంది. పుణేలో మెడిసిన్‌ పూర్తి చేసిన తర్వాత ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఎమ్‌డి చదివి, తర్వాతి శిక్షణ కోసం అమెరికా వెళ్లారామె. లాస్‌ ఏంజిల్స్‌లోని పిల్లల ఆస్పత్రిలో నియో నాటాలజీ, పీడియాట్రిక్‌ పల్మనాలజీలో ఫెలోషిప్ తో కూడిన శిక్షణ తీసుకున్నారు. 1992లో చెన్నైలోని ట్యుబర్‌క్యులోసిస్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో పరిశోధకురాలిగా చేరారు. అక్కడే దాదాపు 23 ఏళ్లపాటు పరిశోధనల్లో గడిపారు. అలా వైద్య రంగంలో ఆమె చేసిన కృషి ఫలితంగా, భారతీయ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ (రీసెర్జ్‌)లో సెక్రటరీగా, ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐ.సి.ఎం.ఆర్‌)కు డైరెక్టర్‌ జనరల్‌గా అత్యున్నత పదవులు అలంకరించారు. ఐ.సి.ఎం.ఆర్‌ వందేళ్ల చరిత్రలో ఆ స్థాయికి ఎదిగిన రెండో మహిళ సౌమ్యే! గత 30 ఏళ్లుగా వైద్య రంగంలో ఎనలేని పరిశోధనలతో, నిరంతర కృషితో అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్‌ఓ)లో రెండవ అత్యున్నత పదవిని అలంకరించిన తొలి భారతీయ మహిళగా డాక్ట‌ర్ సౌమ్య చరిత్ర సృష్టించారు. డాక్టర్‌ సౌమ్యా స్వామినాథన్ పిల్లల వ్యాధులతోపాటు, క్షయ, హెచ్‌ఐవిలో పోషకాహారం పాత్ర...ఇలా ఎన్నో పరిశోధనల్లో నూతన కోణాలను ఆవిష్కరించి పేరు తెచ్చుకున్నారు. డాక్టర్‌ సౌమ్యా స్వామినాథన్‌ చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ ట్యూబర్‌క్యులోసిస్ కు డైరెక్టర్‌గా ఉన్న సమయంలో, టిబి జీరో సిటీ ప్రాజెక్ట్‌ (క్షయ రహిత చెన్నై)లో భాగంగా క్షయను తేలికగాగుర్తించటం కోసం ‘మాలిక్యులర్‌ డయాగ్నొస్టిక్స్‌’ అనే కొత్త పద్ధతిని అవలంబించారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌కు డైరెక్టర్‌ జనరల్‌గా నియమితురాలైన డా.సౌమ్య, బాధ్యతలు చేపట్టిన వెంటనే చేసిన మొట్టమొదటి పని సర్రొగసీ బిల్లుకు ప్రత్యేక హోదా కల్పించటం. అంతకుముందు వరకూ అసిస్టెడ్‌ రిప్రొడక్టివ్‌ టెక్నాలజీలో భాగంగా కొనసాగిన సర్రొగసీ బిల్లును దాన్నుంచి వేరు చేసి అద్దె గర్భం ప్రక్రియ దుర్వినియోగం కాకుండా కాపాడారు. వైద్యులు వైద్య వృత్తి దగ్గరే ఆగిపోతే వారి సేవ ఒక పరిధి వరకే పరిమితమవుతుంది. అదే వైద్య పరిశోధనలతో అనారోగ్యాలకు పరిష్కారాలను కనిపెట్టగలిగితే, ఆ సేవ విశ్వవ్యాప్తమవుతుంది.

షుగ‌ర్ పరీక్ష చేసినట్లుగా ర్యాపిడ్ టెస్టు చేస్తారా? కేంద్రం చుర‌క‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం దక్షిణ కొరియా నుంచి కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు తెప్పించింది. ప్రత్యేక విమానంలో అవి వచ్చిన రెండు గంటల్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి అధికారులు టెస్ట్ చేసేశారు. నెగిటివ్ అని డిసైడ్ చేశారు. ఇది వివాదం అయింది. ముఖ్య‌మంత్రే కాదు అధికారులు కూడా టెస్ట్ చేయించుకుని చూసుకున్నారు. నెగెటివ్ అని సంతోష‌ప‌డ్డారు. అయితే ర్యాపిడ్ టెస్టుల మార్గదర్శకాలు మాత్రం వేరేగా ఉన్నాయి. ర్యాపిడ్ టెస్టులతో వెంటనే.. నెగెటివ్‌గా నిర్ధారించలేమని కేంద్రం తేల్చి చెబుతోంది. కరోనా ర్యాపిడ్ టెస్టుల ద్వారా…వైరస్ పాజిటివ్ లేదా నెగెటివ్ నిర్ధారించడం సాధ్యం కాదని.. అక్కడ పాజిటివ్ వచ్చిన వారి శాంపిళ్లను ఖచ్చితంగా ఐసీఎంఆర్ నిర్ధారించిన ల్యాబుల్లోనే టెస్టు చేసి.. ఖరారు చేయాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. అంతే కాదు.. ఇలా ఎవరికి పడితే.. వారికి టెస్టులు చేయకూడదని కేంద్రం చుర‌క‌లంటించింది. వైరస్ భిన్నమైనది. మనిషి శరీరంలోకి సోకినా లక్షణాలు బయటపడటం లేదు. ఒక్కొక్కరిలో నెల రోజుల తర్వాత లక్షణాలు బయటపడుతున్నాయి. టెస్టులు చేసినా.. మొదట్లో నెగెటివ్ అనే వస్తోంది. ఈ కారణంగా ఐసీఎంల్ ప్రత్యేకంగా కొన్ని నియమనిబంధనలు విధించింది. నిబంధ‌న‌లు ఫాలో అవ్వకుండా సింపుల్‌గా షుగ‌ర్ పరీక్ష చేసినట్లుగా.. ముఖ్యమంత్రికి టెస్ట్ చేసి.. నెగెటివ్ అని ప్రకటించ‌డంపై కంద్ర‌ప్ర‌భుత్వం స్పందించింది. కరోనా రాపిడ్ టెస్ట్ మార్గదర్శకాల రూపొందించి విడుద‌ల చేసింది.

వేదపారాయణం చేస్తున్న పురంధేశ్వరి!

ప్ర‌ముఖ సినీ న‌టుడు, దివంగ‌త‌ మాజీ ముఖ్య‌మంత్రి నందమూరి తారక రామారావు గారి తనయ శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి  తండ్రి నుండి రాజకీయ వారసత్వం మే కాకుండా కృషి, కార్యదీక్ష తో పాటు ఆధ్యాత్మిక వారసత్వం కూడా తీసుకుందా అనిపిస్తున్నది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం నాలుగు భాషల్లో అనర్గళంగా  మాట్లాడ గలిగే పురంధ్రీశ్వరి  సంస్కృతం నేర్చుకొని వేదపారాయణం కూడా చేస్తుందా అనిపిస్తుంది. ఆమె ప్రతిరోజూ ఇంట్లో దేవుని సన్నిధి లో దేవతారాధన, షోడశోపచారాలతో అర్చన, భిల్వాస్టుకం, ఆదిత్య హృదయం, త్రిశతి, ఖడ్గమాల పారాయణం చేయడం చూస్తుంటే  నిజమేననిపిస్తోంది.  వేదాలతోనే సమాజం చైతన్యవంతం కాగలుగుతుందని హిందూ ధ‌ర్మ‌శాస్త్రం చెబుతోంది. భారతీయ జీవన విధానాలు, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను చాటిచెప్పేవి, సమ సమాజ నిర్మాణానికి దిశా నిర్దేశం చేసేవి నాలుగు వేదాలే. కమలం వికసించిన తీరు ఎంతగా మనలో దివ్య అనుభూతి కలిగిస్తుందో అదే అనుభూతి సామ వేదం ద్వారా మనకు లభిస్తుందట‌.  లాక్‌డౌన్ స‌మ‌యంలో బ‌య‌టికి వెళ్ళ‌కుండా ఆధ్మాత్మిక‌త పెంచుకోవ‌డ‌మే కాదు ఇంట్లోని పిల్ల‌ల‌కు వాటి యొక్క ప్రాధాన్య‌త‌ను  బోధించి నేర్పించాల్సిన అవ‌స‌రం వుంది. అందుకు శ్రీమతి దగ్గుబాటి పురధరేశ్వరి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

తెనాలిలో ప్రయివేట్ వ్యక్తులకూ వాకీ టాకీలిచ్చిన ఎస్ ఐ

* ఎస్ పి కి  కాకపోతే డీజీపీకి చెప్పుకో తెనాలిలో 2 టౌన్ ఎస్సై మధు పవన్ ఓవర్ యాక్షన్  గుంటూరు జిల్లా తెనాలిలో 2 టౌన్ ఎస్సై మధు పవన్ ఓవర్ యాక్షన్ చేశారు. ప్రభుత్వం నియమించిన పోలీసు సిబ్బందితో పాటు తనకు కావాల్సిన ప్రయివేటు వ్యక్తులకు పోలీసు విధులు అప్పగించారు. ప్రయివేటు వ్యక్తులకు పోలీసు లాఠీతో పాటు వాకీటాకీలను కూడా అప్పగించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ అనుమతి ఉన్న వాహనాలను కూడా ఆ ప్రయివేట్ వ్యక్తులు అడ్డుకుంటున్నారు. ఐడీ కార్డులు చూపించినా వినకుండా దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. డీఎస్పీ ప్రోగ్రామ్‌కు వెళ్తున్న ఓ మీడియా ప్రతినిధిపై ఎస్సై దురుసుగా ప్రవర్తించడంతో పాటు అతడి అక్రిడేషన్ కార్డును విసిరిపడేశారు. ‘ఇదేంటి సార్..’ అని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో పాటు ‘ఎస్పీకి కాకపోతే డీజీపీకి చెప్పుకో’ అంటూ హెచ్చరించారు.  కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ నేపథ్యంలో పోలీసుల పాత్ర కీలకంగా మారింది. ప్రజలు అనవసరంగా రోడ్లపై తిరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులది. అయితే అదే సమయంలో అత్యవసర విభాగాల వారికి అనుమతి ఇవ్వాలని కూడా పోలీసులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి. అయితే అవేం పట్టించుకోకుండా అంతా తన ఇష్టం అన్నట్లు తెనాలి ఎస్సై ప్రవర్తన ఉందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

20 నుంచి ‘టోల్’తీసేస్తారేమో జాగ్రత్త బాబులూ....

లాక్‌డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి టోల్ వసూలు నిలిపివేసిన నేషనల్ హై వేస్ అధారిటీ ఆఫ్ ఇండియా ( ఎం హెచ్ ఏ ఐ ),  20 నుంచి మళ్లీ వసూలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థిస్తూ, కేంద్రానికి లేఖ రాసింది. అయితే, ఆదుకోవాల్సిన సమయంలో ఇది సరికాదని,  రవాణా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గత నెల రోజులుగా ఆగిన టోల్ వసూళ్లు మళ్లీ మొదలుకానున్నాయి. ఈ నెల 20 నుంచి టోల్ రుసుమును వసూలు చేసేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) రంగం సిద్ధం చేస్తోంది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు గత నెల 24న కేంద్రం లాక్‌డౌన్ ప్రకటించింది. అయితే, అంతర్ రాష్ట్రాల పరిధిలో నిత్యావసర సరుకులు మోసుకెళ్లే ట్రక్కులు, ఇతర సరుకు రవాణా వాహనాలపై భారం తగ్గించేందుకు కేంద్రం టోలు వసూలును నిలిపివేసింది. గత నెల 25 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. తాజాగా, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఎన్‌హెచ్ఏఐకి లేఖ రాస్తూ ఏప్రిల్ 20 నుంచి టోలు వసూలు మొదలుపెట్టాలని సూచించింది. కేంద్రం సూచనపై రవాణా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా రవాణా రంగం పూర్తిగా కుదేలైందని, ఎన్నో ఇబ్బందులు తట్టుకుని నిత్యావసర సరుకుల రవాణా కొనసాగిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ నిర్ణయం సరికాదని అఖిల భారత మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) ఆవేదన వ్యక్తం చేసింది.

5 కిలోల బియ్యం, కేజి పప్పు పరిస్థితి ఏంటి?

మొదటి లాక్ డౌన్ పీరియడ్ మార్చి 22 నుండి ఏప్రిల్ 15 వరకు   రాష్ట్ర ఆర్థిక సాయం 1500 రూ. 12 కిలోల బియ్యం. మొదటి విడ‌త‌లో ఇచ్చిన రేషన్ లో కేంద్రం, రాష్ట్రం కలిపి ఇచ్చే వాటా 17 కిలోల బియ్యం మరియు కేజీ పప్పు. కేవలం 12కిలోల బియ్యం మాత్రమే లబ్ధి దారులకు అందాయి మరి మిగతా 5కిలోల బియ్యం, కేజి పప్పు పరిస్థితి ఏంటి? ఇవి ఎవరూ ఇవ్వాలీ  కేంద్రమా, రాష్ట్రమా? ఎప్పుడు ఇస్తారు? మరి రెండవ విడ‌త‌ లాక్ డౌన్ ఏప్రిల్ 16 నుండి మే 1 వరకు ప్ర‌క‌టించారు. మ‌ళ్లీ లాక్‌డౌన్ సంద‌ర్భంగా ఆర్థిక సాయం 1500 రూ, 12 కిలోల బియ్యం రాష్ట్రం ఇస్తుందా లేదా? అర్హులైన అందరినీ ఆహార భద్రత కిందికి ఎందుకు తీసుకురావ‌డం లేదు?  2013 లో PDS ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో  70%,పట్టణ ప్రాంతాల్లో 50% ప్రజలకు రేషన్ కార్డులు మంజూరు చేశారు. అనగా 100 మందిలో 67 మందికి తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేశారు. 2011 సం. లో దేశ జనాభా 121 కోట్లు,ఇప్పుడు 2020 సం. లో దేశ జనాభా 137 కోట్లు. ఇంచుమించు 16 కోట్ల జనాభా పెరిగింది.దాదాపు 80 కోట్ల జనాభాకు ఆహార భద్రత కార్డులు ఇవ్వడం జరిగింది.  ప్రతి 10 సం. ఒక సారి సెన్సెక్స్ జరుగుతుంది.అంటే 2021 సం. లో జరగాలి.కరోన విపత్తు నేపథ్యంలో పెరిగిన జనాభా దృష్ట్యా ఇప్పుడు వారందరికీ ఆహార భద్రత కార్డులు ఇవ్వాలి. దేశ వ్యాప్తంగా 9 నుంచి 10 కోట్ల జనాభాకు రేషన్ కార్డులు కొత్తవి  ఇవ్వాలి. ఈ లెక్క‌న చూస్తే తెలంగాణలో దాదాపు 20 లక్షల రేషన్ కార్డులు కొత్తవి ఇవ్వాలి. ప్ర‌స్తుతం తెలంగాణలో కొత్త  రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు 16 నుంచి 18 ల‌క్ష‌ల మంది ఉన్నారు.  

ఆ వైర‌స్‌ కంటే దేవుడే గొప్ప! అన్న బిష‌ప్ కరోనాతో మృతి!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా దెబ్బ‌కు రెండు మిలియన్ల మంది ఆస్పత్రి పాలయ్యారు. మరో లక్ష మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్‌కు కులం, మతం, రంగు, దేశం, ప్రాంతం అంటూ తేడా ఏం లేదు. దీనికి అందరూ ఒక్కటే. అందర్నీ సమానంగా చూస్తోంది ఈ మహమ్మారి.  కరోనాను చూసి ఎవరూ భయపడొద్దని.. దేవుడి కంటే కరోనా గొప్పేం కాదు అంటూ మార్చి 22న ఇవాలజలికల్ చర్చ్.. వ్యవస్థాపకుడైన బిషప్ గెరాల్ట్‌ గ్లెన్‌.. సామూహిక ప్రార్ధనలు నిర్వహించాడు. ఆ ప్రార్ధనల్లో ఈ వైర‌స్‌పై ప్ర‌త్య‌క ప్ర‌సంగం చేశారు. కరోనాను చూసి ఎవరూ భయపడొద్దు. దేవుడి కంటే కరోనా గొప్పేం కాదు అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఈ వైరస్‌ కంటే కూడా దేవుడే గొప్ప అని నమ్ముతానంటూ చర్చ్‌కు వచ్చిన వారి ముందు ప్రసగించాడు. అయితే ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆయన అస్వస్థతకు గురయ్యాడు. చివరకు ఆ వైరస్‌ సోకి ప్రాణాలు కోల్పోయాడు. అమెరికా వర్జీనియాలోని న్యూ డెలివరెన్స్‌ ఇవాలజలికల్ చర్చ్.. వ్యవస్థాపకుడైన బిషప్ గెరాల్ట్‌ గ్లెన్‌.. కరోనా సోకడంతో మరణించాడు. ఏప్రిల్ 4న ఆ పాస్టర్‌తో పాటు ఆయన భార్యకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయన కూతురు వెల్లడించింది. ఆ తర్వాత ఇద్దర్నీ ఆస్పత్రిలో చేర్చారు. అయితే తాజాగా.. ఆ బిషప్ చికిత్స పొందుతూ కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయాడు. పాస్టర్ గ్లెన్‌ మరణించిన నేపథ్యంలో.. ఆయన చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియోను చర్చ్‌ యూట్యూబ్‌ చానల్‌ నుంచి తొలగించింది.

జ్వరం, గొంతు నొప్పి మందులను ఏమైనా కొన్నారా?

ఇటీవల జ్వరం, గొంతు నొప్పి నివారణకు మెడికల్ షాపుల నుండి మందులు కొనుగోలు చేసిన వారి వివరాలను తెలుసుకోవాడానికి  డ్రగ్ ఇన్ స్పెక్టర్ల సహకారంతో ఆయా మున్సిపాలిటీలలోని ఫార్మసి అసోసియేషన్ సభ్యులతో ప్రత్యేకంగా సమీక్షించాలని తెలంగాణా ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. జ్వరం, గొంతు నొప్పి మందులను కొనుగోలు చేసిన వారి వివరాలను తప్పనిసరిగా అందజేయాలని ఆదేశిస్తూ ప్ర‌భుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సొంత వైద్యం మరింత ప్రమాదక‌ర‌మని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఇటీవ‌ల జ్వరం, గొంతు నొప్పి నివారణకు మెడికల్ షాపుల నుండి మందులు కొనుగోలు చేసిన వారు వెంట‌నే స్వ‌చ్ఛందంగా ముందుకు రావాల‌ని, అలా చేస్తే పెద్ద ప్ర‌మాదాన్ని నివారించ‌డానికి వీలౌతుంద‌ని మంత్రి తెలిపారు. పారాసిట‌మాల్‌తో జ్వ‌రం త‌గ్గిన‌ట్లు క‌నిపించిన‌ప్ప‌ట్టికీ ఒక వేళ క‌రోనా వైర‌స్ అలాంటి వారికి ఉన్న‌ట్లైతే వారితో ద్వారా జ‌బ్బు చాలా మందికి విస్త‌రిస్తోంది క‌నుక వెంట‌నే మెడిక‌ల్ షాపుల ద్వారా మందులు కొన్న‌వారు స్థానిక ప్ర‌భుత్వ మెడిక‌ల్ అధికారుల‌కు, లేదా ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌ను సంప్ర‌దించాలి.  రోజు రోజుకీ తెలంగాణాలో హైద‌రాబాద్‌తో స‌హా జిల్లాల్లో పాజిటివ్ సంఖ్య పెరుగుత‌న్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లు స‌హ‌క‌రించి క‌రోనా ప్ర‌మాదాన్ని నియంత్రించ‌డానికి ప్ర‌భుత్వంతో క‌లిసిరావాల‌ని కేటిఆర్ పిలుపునిచ్చారు. లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉన్నందున ఎక్కడ ఉన్న ప్రజలు అక్కడే ఉండాలని, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతిలేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు మ‌రో సారి తెలిపారు. మార్చి నుండి లాక్ డౌన్ విధించినందున వలస కార్మికులు తమ రాష్ట్రాలు, జిల్లాలకు వెళ్లేందుకు తొందరపడుతున్నప్పటికీ, రోడ్లపైకి ఎవరిని అనుమతించరాదని తెలిపారు.  ఒకవేళ వలస కార్మికులు రోడ్లపైకి వస్తే ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ వ్రుధా అవుతాయని పేర్కొన్నారు.

కంటైన్మెంట్ నిబంధనలు అతిక్రమిస్తే వెంట‌నే కేసు నమోదు!

తెలంగాణాలో 260 కంటైన్మెంట్ జోన్ లు! హైద‌రాబాద్‌లో 146 జోన్లు ఏర్పాటు చేశారు. కోవిడ్-19ను అరికట్టుటకు కంటైన్మెంట్ జోన్స్ నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖామంత్రి కే తారక రామారావు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 260 కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాటిలో జిహెచ్ఎంసి పరిధిలోనే 146 జోన్లు ఉన్నట్లు తెలిపారు. ఇతర జిల్లాల్లోని 43 మున్సిపాలిటీలలో మిగిలిన 114 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. కంటైన్మెంట్ జోన్లలో వున్న ప్రజలను ఇండ్లకే పరిమితం చేశారు.  మున్సిపల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్ల స్థానికంగా ప‌ర్య‌వేక్షిస్తున్నారు.  పాలు, కూరగాయలు, నిత్యావసరాలు, మెడిసిన్స్ ను  ఇండ్ల వద్దకే సరఫరా చేస్తున్నారు. తదనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వం నియమించిన వాలెంటీర్లు, సిబ్బందిచే మాత్రమే నిత్యవసరాలను డోర్ డెలవరీ చేయించాలని మంత్రి కేటీఆర్ అధికారుల‌కు ఆదేశించారు. వాలెంటీర్లు, సిబ్బందికి ప్రత్యేక దుస్తులు అందజేయాలని నిర్ణ‌యించారు.  కంటైన్మెంట్ జోన్లలోకి దాతలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని కేటీఆర్ అధికారుల‌ను హెచ్చ‌రించారు.  కంటైన్మెంట్ జోన్ లోని కుటుంబాల సెల్ నెంబర్లతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి, అవసరాలను తెలుసుకుంటున్నారు. కంటైన్మెంట్ నిబంధనలు అతిక్రమించిన వ్యక్తులపై కేసులు నమోదు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కంటైన్మెంట్ జోన్లను తొలగించనున్నట్లు తెలిపారు. ప్రజల సహకారం పైనే కంటైన్మెంట్ జోన్ల తొలగింపు ఆధారపడి ఉంటుందని తెలిపారు.  కొత్త కేసులు నమోదు కాకుండా కంటైన్మెంట్ నిబంధనలపై అవగాహన కల్పించి, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.  శానిటేషన్, స్ప్రేయింగ్, ఫీవర్ సర్వేలను తగు జాగ్రత్త లతో  నిర్వహించాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. శానిటేషన్, స్ప్రేయింగ్ సిబ్బంది తప్పనిసరిగా రక్షణ పరికరాలు ధరించేవిధంగా మానిటరింగ్ చేయాలని తెలిపారు. సోడియం హైఫో క్లోరైట్ ద్రావనం నిల్వలను ముందస్తుగా తెప్పించుకోవాలని తెలిపారు. శానిటేషన్ తో పాటు మురుగునీటి వ్యవస్థలను మానిటరింగ్ చేయాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. కంటైన్మెంట్ నిబంధనల అమలులో వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు, వాటర్ వర్క్స్ /ప్రజారోగ్య విభాగాలతో సమన్వయం చేసుకోవాలని మంత్రి కేటిఆర్ తెలిపారు. కంటైన్మెంట్ జోన్లను మానిటరింగ్ చేసేందుకు చేపట్టాల్సిన 12 ప్రధాన అంశాల గురించి అధికారులకు మంత్రి కె.టి.ఆర్ వివరించారు. 1) సరైన విధంగా బారీకేడింగ్ చేయాలి., 2) సంబంధిత శాఖల సిబ్బందిని నియమించాలి. 3) ఫీవర్ సర్వే కై పారమెడికల్ సిబ్బందిని నియమించాలి. 4) శానిటేషన్, స్ప్రేయింగ్ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలి. 5) నిత్యవసర వస్తువులను ఇంటింటికి అందించుటకై ఏర్పాట్లు చేయాలి. 6) పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా కంటైన్మెంట్ నిబంధనలు పాటించాలని కోరుతూ, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల గురించి ప్రచారం చేయాలి. 7) ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేయాలి. 8) ప్రతిరోజు మెడికల్ టీమ్, అధికారులు ప్రతి ఇంటిని సందర్శించాలి. 9) సీనియర్ అధికారులు కంటైన్మెంట్ ఏరియాని తనిఖీ చేయాలి. 10) కంటైన్మెంట్ జోెన్లలోని ప్రజలను ఇంటికే పరిమితం చేయాలి, వారి కదలికలను నియంత్రించాలి. 11) అత్యవసర వైద్య సేవలకై  అంబులెెన్స్ ను సిద్దంగా ఉంచాలి. 12)  బియ్యాన్ని పంపిణీ చేయాలి.