no funds for parishads in telangana

పైన పటారం లోన లొటారంలా మారిన తెలంగాణ పరిషత్ ల పరిస్థితి...

  పైన పటారం లోన లొటారంలా వుంది తెలంగాణాలో కొత్త జిల్లాల పరిస్థితి పరిపాలనా సౌలభ్యం పేరిట ఇబ్బడిముబ్బడిగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఉన్న పది జిల్లాలను ముప్పై మూడు జిల్లాలుగా విభజించింది. పలు జిల్లాల్లో కొత్త కలెక్టరేట్ల నిర్మాణం కొనసాగుతోంది కొన్ని చోట్ల కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రసుతానికైతే అరకొర భవనాలతో చాలీ చాలని వసతులతో ఆయా జిల్లాల కార్యాలయాలు పని చేస్తున్నాయి. ఇదంతా ఒకెత్తయితే కొత్తగా ఏర్పాటైన జిల్లా పరిషత్, మండల పరిషత్ ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కార్యాలయాల భవనాలు, ఫర్నీచర్, సిబ్బంది సర్దుబాటు వంటి అంశాల్లో గందరగోళం కొనసాగుతూనే ఉంది. దీనికి తోడు కనీసం చాయ్ నీళ్ళకు పైసా లేని దుస్థితి నెలకొన్నది. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరిగి మూడేళ్ళు పూర్తయింది. కొత్త జిల్లా పరిషత్ లు కొత్త మండల పరిషత్తులు ఏర్పాటు జరిగి నెలలు దాటింది, నాలుగు నెలల క్రితం ఆయా జడ్పిలు మండలాల పరిధిలో ఎన్నికలు జరిగాయి. గెలిచిన ప్రజా ప్రతినిధులు కూడా బాధ్యతలు చేపట్టారు కానీ, గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించే మండల జిల్లా పరిషత్ లకు మాత్రం ఇంత వరకూ నిధుల కేటాయింపు జరగలేదు. కొత్తగా ఏర్పాటైన జడ్పీలు నిధులు లేక విలవిలలాడుతుంటే కొత్త మండలాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని అక్కడి నేతలు వాపోతున్నారు. పరిషత్ ల విభజన సమయంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా యంత్రాంగం పాత జడ్పీ నుంచి కొత్త జిల్లా పరిషత్ లకు ఉద్యోగులను, ఫర్నీచర్ ను సిబ్బందిని కేటాయించారు. కొత్త మండలాల ఏర్పాటు సందర్భంగా కూడా ఇదే విధానం పాటించారు. అయితే కొన్ని మండలాల్లో సిబ్బంది మినహా ఇంకేమీ సర్దుబాటు చేయలేదట, కొత్త పరిషత్తులు ఏర్పాటు సమయంలో పాత జడ్పీ కార్యాలయంలో విధులు నిర్వర్తించిన ఉద్యోగులను ప్రభుత్వం ఆయా జిల్లాలకు బదిలీ చేసింది. బదిలీపై వెళ్లిన ఉద్యోగులకు ఇప్పటికీ పాత జడ్పీల నుంచే నెల నెలా జీతాలు చెల్లిస్తున్నారు. ఇక డైరెక్ట్ గా నియామకమైన అధికారులకు, సిబ్బందికి జీతాలకు కూడా దిక్కులేని పరిస్థితి ఏర్పడిందట. మండలాల పరిస్థితి కూడా ఇదే మాదిరిగా ఉందని స్థానికుల కథనం. ఉదాహరణకు ఆదిలాబాద్ జడ్పీ ఖాతాలో ప్రస్తుతం మూడు కోట్ల యాభై లక్షల రూపాయల వరకు నిధులు అందుబాటులో ఉన్నాయి. ఈ నిధులు మండలాల ప్రాతిపదికన కొత్తగా ఏర్పాటైన నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కేటాయించాల్సి ఉంది. ఏ జిల్లాలో మండలాల సంఖ్య ఎక్కువగా ఉంటుందో ఆ జిల్లాకు అధిక నిధులు కేటాయించాలి. ఈ లెక్కన ఒక్కో జిల్లాకు ఎనభై ఏడు లక్షల నుంచి తొంభై లక్షల రూపాయల వరకు వస్తాయి. ప్రస్తుతమున్న నిధులు ఆయా జిల్లాలకు పంచాలంటే అందుకు చెక్ పవర్ ను ఉపయోగించాలి. డ్రా చేసిన నిధులను ఇతర జిల్లాలకు అప్పగించాలి కాని, ఆ పని ఇప్పటికీ జరగడం లేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే తప్ప పైసా కేటాయించలేని దుస్థితి నెలకొన్నది. దీంతో కొత్త జిల్లా పరిషత్తులు ఉత్సవ విగ్రహాల తీరుగా మారుతున్నాయి, నిధుల విషయమై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు చేపట్టక పోవడంతో ప్రజా ప్రతినిధులు, అధికారులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. కార్యాలయాల నిర్వహణకే పైసలు లేనప్పుడు ఇక తాము అభివృద్ధి పనులెలా చేపట్టగలమని వారు ప్రశ్నిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం జరిగిన జిల్లా పరిషత్ ల సమావేశంలో పలువురు ప్రజా ప్రతినిధులు ఈ అంశాన్ని ప్రస్తావించారు. రూపాయ్ లేని కొత్త జిల్లా పరిషత్ లు మండల పరిషత్తులు ఎందుకు అని ప్రతి రోజూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వేరే గత్యంతరం లేక కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు సొంత వనరులతో ఫర్నీచర్ సమకూర్చుకున్నారు. మరికొన్నిచోట్ల ప్రజా ప్రతినిధుల ఒత్తిడితో అధికారులు అప్పులు చేసి ఫర్నీచర్ కొన్నారు. ఇక రోజువారీ నిర్వహణ భారంగా మారడంతో కార్యాలయాలకు వెళ్లాలంటేనే ప్రజాప్రతినిధులు అధికారులు జంకుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలనే ఆయా నేతలు, అధికారులు కోరుతున్నారు, గులాబీ పార్టీ పెద్దలు దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Congress new TPCC chief

టిపిసిసి పీఠం కోసం మళ్ళీ సందడి ప్రారంభమైంది...

  నిన్న మొన్నటి వరకు స్తబ్దుగా మారిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ పీఠం కోసం మళ్లీ సందడి ప్రారంభమైంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత పీసీసీ చీఫ్ మార్పు కోసం అధిష్ఠానం ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం ఊపందుకుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా ఢిల్లీకి వెళ్లడంతో ఆ ప్రచారం మరింత ఉధృతమైంది. ఇక ఆయన సైతం రాజీనామాకి సిద్ధపడ్డారని రాజీనామా లేఖను అధిష్టానానికి ఇచ్చారని ప్రస్తుతం అది పెండింగ్ లో ఉందని ఢిల్లీ లోని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఉత్తమ్ పదవీ కాలం కూడా ముగియడం, ఆయన నేతృత్వంలో పార్టీ అపజయాలనే మూటగట్టుకోవడంతో కొత్త సారథిని నియమించేందుకు హైకమాండ్ డిసైడ్ అయిందనే లీకులు హస్తిన నుంచి మొదలయ్యాయి. అందుకోసం రాష్ట్ర నేతల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నట్లు గాంధీభవన్ లో గుసుగుసలు వినిపిస్తున్నాయి. ఇలా పెద్ద ఎత్తున ఊహా గానాలు ఊపందుకోవడంతో ఆశావహులు మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించారు. అధ్యక్ష స్థానాన్ని దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నారు. గ్రూపులు కట్టి రాజకీయం నేర్పుతున్నారు, పార్టీ అధిష్ఠానానికి తమ ఆసక్తిని తెలపాలని హస్తిన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. టిపిసిసి మార్పులకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరగడంతో కొత్త అధ్యక్షుడు ఎవరనే చర్చ హస్తం పార్టీలో మొదలైంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్లు నిన్న మొన్నటి వరకు ప్రముఖంగా వినిపించాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాదంటే అదే జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇవ్వాలని కొందరు కోరుతున్నట్టు తెలుస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ వ్యతిరేక వర్గంలో రేవంత్ రెడ్డికి మంచి క్రేజ్ ఉందని యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఆయనకు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని మరొక వర్గం చెబుతోంది. ఒక దశలో ఉత్తమ్ ను తప్పించి రేవంత్ కు టిపిసిసి పగ్గాలు అప్పగించేందుకు రెడీ అయినట్టు కూడా కాంగ్రెస్ లో ప్రచారం జరిగింది. అయితే హుజూర్ నగర్ ఉప ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ లు పార్టీలో పెద్ద దుమారమే రేపాయి. కాంగ్రెస్ లోని సీనియర్లంతా ఏకమయ్యి ఆయనకు వ్యతిరేకంగా ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు చేశారట. వ్యతిరేక వర్గమంతా సంతకాలు సేకరించి హైకమాండ్ కు పంపారట. దీంతో రేవంత్ రెడ్డి విషయంలో ఢిల్లీ పెద్దలు పునరాలోచనలో పడ్డారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయినా కొందరు రేవంత్ శ్రేయోభిలాషులు డిల్లీ పెద్దలను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక మరో వర్గం మాత్రం మొదటి నుంచి పార్టీలో పని చేసిన వివాద రహితులకు టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానానికి సూచనలు చేస్తున్నారట. ప్రస్తుతం రెడ్డి సామాజికవర్గం నేత పీసీసీ చీఫ్ గా ఉన్నందున ఈ దఫా రెడ్డి ఏతర సామాజిక వర్గానికి అవకాశమివ్వాలని కోరుతున్నారట. అందులో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పీసీసీ పీఠం కోసం ఆయనకు పెద్దగా ఆసక్తి లేక పోయినప్పటికీ పార్టీలో కీలకంగా ఉన్న ఒక నేత శ్రీధర్ బాబుకు మద్దతు కూడగడుతున్నట్టు ఆయన కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక జానారెడ్డి, జీవన్ రెడ్డిలో ఎవరికిచ్చినా పార్టీలో పెద్దగా వ్యతిరేకత ఉండదని మరికొందరు సూచిస్తున్నారట. ఇదిలా వుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు సైతం తనకు అవకాశమివ్వాలని కోరుతున్నారట. వయసును సాకుగా చెప్పి కొందరు తనపై తప్పుడు నివేదికలు ఢిల్లీకి పంపుతున్నారని కానీ, గతంలో షీలా దీక్షిత్ కు మొన్నటి హర్యానా ఎన్నికల్లో కూడా ఒక అవకాశమిస్తే వారు పార్టీకి మెరుగైన ఫలితాలు తెచ్చిన విషయాన్ని వీ.హెచ్ గుర్తు చేస్తున్నారు. హస్తినలో ఆయన కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు చెప్పుకొంటున్నారు, ఇలా ఎవరికి వారు పార్టీ అధ్యక్ష పదవి కోసం సైలెంట్ గా పని చేసుకుంటుండగా తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెరమీదకు దూసుకొచ్చారు. ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పే జగ్గారెడ్డి తాను కూడా పిసిసి రేసులో ఉన్నానని బహిరంగంగానే ప్రకటించారు. ఎప్పుడూ పెద్దగా రాష్ట్రం దాటని జగ్గారెడ్డి ఈ నెల పదిహేనున ఢిల్లీకి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. సోనియా, రాహుల్, అహ్మద్ పటేల్, కేసీ వేణు గోపాల్, కుంతియాను కలిసి పీసీసీ చీఫ్ పదవి తనకు ఇవ్వాలని ఆయన వారికి విన్నవించనున్నారు. తనకు అవకాశమిస్తే పార్టీని అధికారంలోకి తీసుకోవటానికి రాష్ట్రమంతా తిరుగుతానని సీఎం పదవి ఆశించకుండా అధ్యక్ష బాధ్యతలను నెరవేరుస్తానని జగ్గారెడ్డి చెప్తున్నారు. అంతేకాక ఆ పదవిపై కన్నేసిన వారు కూడా సీఎం పదవిని ఆశించొద్దనే కొత్త వాదనను తెరమీదకు తెచ్చారు. అయితే పదవి ఆశిస్తున్న జగ్గారెడ్డి సహా మరి కొందరు నేతలు మాత్రం మున్సిపల్ ఎన్నికల తరువాతే అధ్యక్ష మార్పు చేయాలని హైకమాండ్ కు సూచిస్తున్నారు. మరి కాంగ్రెస్ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

india banned onion exports now asia has eye watering prices

తరగడానికే కాదు, కోనడానికి కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి ధరలు.....

కొనుగోలుదార్లకు అమ్మకందారులకు ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర రాక మార్కెట్ లో రైతు కన్నీరు పెట్టుకొంటున్నాడు. అటు కొనుగోలుదారులు మాత్రం కిలో ఉల్లికి యాభై నుంచి డెబ్బై రూపాయల పెట్టలేక అష్టకష్టాలూ పడుతున్నాడు. ఈ పరిస్థితి ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. ఇలా దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉల్లి ధరలు ప్రజల్నీ ఉలికిపాటుకు గురి చేస్తున్నాయి. రెండు నెలలుగా యాభై నుంచి డెబ్బై రూపాయల వరకు అమ్మిన కిలో ఉల్లి రెండు రోజులుగా కొన్ని చోట్ల 100 చేరింది. సరుకు లభ్యత ఆగస్ట్ వరకు ఎక్కువగానే ఉన్నా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పడిపోవడంతో ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. దేశీయంగా ఉల్లి ఉత్పత్తి 30 నుంచి 40 శాతం మేర తగ్గడంతో ధరలు బాగా పెరిగిపోయాయి. ఈ నెల చివరి వారానికి గానీ డిసెంబర్ మొదటి వారానికి గానీ పరిస్థితి అదుపులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం అవుతోంది. మెజారిటీ ఉల్లి పంట వాటా మహారాష్ట్ర నుంచి వస్తుంటే మిగిలిన సరుకు ఇతర రాష్ట్రాల నుంచి వస్తోంది. సాధారణంగా ప్రతి నెలా మార్కెట్ లోకి పది లక్షల నుంచి పదమూడు లక్షల టన్నుల వరకు సరుకు వస్తూంటుంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మాత్రం దాదాపు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల టన్నుల వరకు పడిపోయింది. దీంతో ఉల్లి ధర కిలో యాభై నుంచి వంద రూపాయల వరకూ పెరిగింది. కేంద్ర వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం జనవరిలో హోల్ సేల్ మార్కెట్ లో క్వింటాలుకి వెయ్యి, మూడు వందల డెబ్బై ఐదు పలికిన ఉల్లి ధర అక్టోబర్ నాటికి 3,433 కు చేరి నూట నలభై తొమ్మిది శాతం పెరిగిందని మార్కెట్ వర్గాల అంచనా వేస్తున్నాయి. ఈ ధరలను అదుపు చేయడానికి ఈజిప్ట్, నెదర్లాండ్స్ దేశాల నుంచి 2,500 మెట్రిక్ టన్నుల సరుకు దిగుమతి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. స్టాక్ ని త్వరగా తీసుకురావాలన్న ఉద్దేశంతో కస్టమ్స్ అనుమతులు తనిఖీల్లో మినహాయింపు నిచ్చింది. మరో 3000 మెట్రిక్ టన్నుల ఉల్లిని తీసుకు వస్తూ 100 కంటెయినర్లూ సముద్ర మార్గంలో ఉన్నాయి. ఆఫ్ఘనిస్థాన్, టర్కీ, ఇరాన్ ల నుంచి కూడా సరుకు వచ్చేలా ఆయా దేశాల రాయబారులను కోరింది. పాకిస్థాన్ కల్పించే అడ్డంకుల కారణంగా ఆఫ్ఘనిస్థాన్ నుంచి సరుకు రాకపోయినా మిగతా దేశాల నుంచి సాధ్యమైనంత త్వరగా వస్తుందని అంచనా వేస్తోంది. ప్రతి నెలా దాదాపు లక్షా యాభైవేల లక్షల టన్నుల మేర జరిగే ఉల్లి ఎగుమతుల్ని రెండు నెలలుగా నిషేధించినందున ఆ మేరకు సరుకు లభ్యత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది ప్రభుత్వం.మరి ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి సామాన్యుడికి ధరలు అందుబాటులో ఉంటాయో లేదో.

TSRTC strike: High Court adjourns hearing till

అధికారులను మందలించిన హైకోర్ట్.......

ఆర్టీసీ సమ్మె పై చర్చ రోజుకో కీలక మలుపు తిరిగుతోంది.ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ విధించిన డెడ్ లైన్ ముగియడం, డెడ్ లైన్ లోపు ఎక్కువ సంఖ్యలో కార్మికులు విధులకు హాజరు కాకపోవడం తమ డిమాండ్ల సాధనకు జేఏసీ పట్టుబడుతుండటంతో హై కోర్టు విచారణలో పలు విషయాలు పై చర్చించేందుకు సిద్ధమైయ్యారు. విచారణలో ఉద్దేశ పూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే కోర్టు ధిక్కరణ కిందకి వస్తుందని ఆర్టీసీ సమ్మెపై విచారణ సందర్భంగా అధికారులను హెచ్చరించింది హైకోర్ట్. ఆర్ధిక శాఖ సమర్పించిన రెండు నివేదికలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఐఏఎస్ అధికారులు అసమగ్ర నివేదికలు ఇవ్వడంపై ధర్మాసనం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంది. ఆర్టీసీ సమ్మెపై ఇవాళ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ విచారణకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషి, ఎండి సునీల్ శర్మ, ఆర్థికశాఖ అధికారులు స్వయంగా హాజరయ్యారు. రికార్డు పరిశీలించాకే నివేదిక ఇస్తున్నట్టుగా కోర్టుకు తెలిపింది ఆర్థికశాఖ. అయితే మొదటి నివేదిక పరిశీలించకుండానే ఇచ్చారా అని హై కోర్టు ప్రశ్నించింది. దీనిపై ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు స్వయంగా వివరణ ఇచ్చారు. సమయాభావం వల్ల రికార్డుల ఆధారంగా నివేదిక రూపొందించామని ఆయన వెల్లడించారు. మన్నించాలని హైకోర్టుని వేడుకున్నారు. అయితే క్షమాపణ కోరడం సమాధానం కాదని వాస్తవాలు చెప్పాలని ఆదేశించింది హైకోర్ట్.

High Court Serious On RTC MD Sunil Sharma

అసలు మీరేం అధికారులు? ఇవేం లెక్కలు?.. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఫైర్!!

  ఆర్టీసీ సమ్మె పిటిషన్‌పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఎటూ తేలకుండానే విచారణ ఈ నెల 11కు వాయిదా పడింది. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్ శర్మ, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణరావు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు సమర్పించిన నివేదికలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐఏఎస్ స్థాయి అధికారులు ఇంత దారుణంగా నివేదిక ఇవ్వడం తన సర్వీస్‌లోనే చూడలేదని చీఫ్ జస్టిస్ అసహనం వ్యక్తం చేశారు. 15 ఏళ్ల జడ్జి చరిత్రలో ఇంతగా అబద్ధాలు చెప్పే అధికారులను ఎక్కడా చూడలేదని చీఫ్ జస్టిస్ విరుచుకుపడ్డారు. ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ.. చెబుతున్న అంకెలు వేర్వేరుగా ఉన్నాయని.. తాము వేటిని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును తప్పుదోవ పట్టించేందుకు చాలా తెలివిగా గజిబిజి లెక్కలు.. పదాలు వాడారని హైకోర్టు పేర్కొంది. మంత్రికి సునీల్ శర్మ తప్పుడు లెక్కలు ఇచ్చారని... ఆయనకు తప్పుడు లెక్కలు ఇస్తే ప్రభుత్వాన్ని చీట్ చేసినట్లేనని హైకోర్టు పేర్కొంది. కేబినెట్‌కి సైతం అధికారులు తప్పుడు లెక్కలు ఇచ్చారని.. సీఎంకి సైతం తప్పుడు లెక్కలతో స్టేట్‌మెంట్ ఇప్పించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తమను తప్పుదోవ పట్టించిన ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీని మంత్రి ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదంటూ మండిపడింది.  జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, ఆర్థిక శాఖలు... ఒక్కొక్కరు ఒక్కో పాట పడుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా చెబుతున్నారని.. హైకోర్టుతో వ్యవహరించే తీరు ఇదేనా అని అధికారులను హైకోర్టు తీవ్ర స్థాయిలో మందలించింది. తాము సమస్యను పరిష్కరించాలని చూస్తుంటే.. ప్రభుత్వం, ఆర్టీసీ మాత్రం స్వచ్ఛందంగా ముందుకు రావడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పూర్తిగా లోపించిందని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. 5 నిమిషాలు తన స్ధానంలో ఉండి చూడాలని.. మీ నివిదేకలు, మీరు చెప్పే మాటలు అసలు నమ్మే విధంగా ఉన్నాయా? అంటూ అధికారులపై చీఫ్ జస్టిస్ మండిపడ్డారు. ప్రభుత్వం, కార్మికసంఘాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సమస్య తాత్కాలిక పరిష్కారం కోసం ప్రభుత్వం 47 కోట్లు ఇవ్వలేదా? అని ప్రశ్నించింది. రూ.47 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం ఎందుకు ఇబ్బంది పెడుతోందని హైకోర్టు ప్రశ్నించింది. అధికారుల తప్పుడు నివేదికల కారణంగా విచారణ మళ్లీ వాయిదా పడింది. మరి అధికారులు ఇకనైన సరైన నివేదికలు ఇస్తారో.. లేక ఇలానే తప్పుడు లెక్కలు చూపించి హైకోర్టు చేత చివాట్లు తింటారో చూడాలి. ఏది ఏమైనా.. ప్రజలు ఇంతలా ఇబ్బంది పడుతుంటే.. ఐఏఎస్ స్థాయి అధికారులు తప్పుడు లెక్కలు చూపిస్తూ కాలయాపన చేయడం దురదృష్టకరం. మరి హైకోర్టు ఈ సమస్యకు 11 వ తేదీన అయినా పరిష్కారం చూపుతుందేమో చూడాలి.

telangana farmers protest against revenue officers

విజయారెడ్డి  హత్యతో పలుచోట్ల వెలుగులోకి వస్తున్న తహసీల్దార్ల నిర్లక్ష్యాలు...

  విజయారెడ్డి హత్యోదంతం తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాలు హాట్ టాపిక్ గా మారిపోయాయి. రిజిస్ట్రేషన్లు పట్టాదారు పాస్ పుస్తకాల జారీ కోసం రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారని బాధితులు వినూత్న నిరసనలకు దిగుతున్నారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ రెవెన్యూ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతున్నారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో కుర్వపల్లి కోట మండల రెవెన్యూ కార్యాలయంలో ఒక వ్యక్తి ధర్నాకు దిగారు. ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. మట్లివారిపల్లె మాజీ సర్పంచ్ రైతు రుద్ర బాలకృష్ణారెడ్డి తన భూమిని రికార్డుల్లోకి ఎక్కించడం లేదంటూ ధర్నాకు దిగారు. ఆరు నెలల నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు స్పందించడం లేదని ఆరోపించాడు. తహసీల్దార్ కార్యాలయంలో పడుకొని వినూత్న నిరసనకు దిగారు. తహసీల్దార్ తనకు ఉన్న భూమిని ఆన్ లైన్ లో తొలగించారని కనుక్కొని నమోదు చేయమంటే ఆరు నెలలుగా వేధిస్తున్నారని రైతు బాలకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సమస్య పరిష్కరించండి అంటే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని రైతు ఆరోపిస్తున్నాడు.  ఇటు చిత్తూరు జిల్లాలోని మరో బాధిత రైతు రెవెన్యూ ఆఫీస్ లోని వినూత్న నిరసనకు దిగాడు. కృష్ణానాయక్ అనే రైతు తాను కొన్న పొలానికి పట్టాదారు పాస్ పుస్తకాన్ని మంజూరు చేయడంలో తహసీల్దార్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని రైతు ఆరోపిస్తున్నాడు. కొన్న పొలంలో సాగు చేసుకుందామనుకున్న వీలు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ తన కుటుంబ సభ్యులతో కలిసి సామూహిక ఆత్మహత్యకు పాల్పడతామంటూ మెడకు ఉరితాళ్లు వేసుకొని ఆందోళన నిర్వహించారు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యనే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటు శ్రీకాకుళం జిల్లా నర్సంపేట రెవెన్యూ మండలం సత్యం రూళ్ల గ్రామం కూడా ఒక రైతు పెట్రోల్ బాటిల్ తో నిరసన వ్యక్తం చేశాడు. 2017 లో తాను కొంత భూమిని కొన్నానని దానికి పాస్ బుక్కు కూడా వచ్చిందని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం పాస్ బుక్ లో ఉన్న వివరాలకు ఆన్ లైన్ లో ఉన్న వివరాలకు అసలు పొంతనే కుదరకపోవటంతో తనకు రైతు భరోసా అందట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సరిచేయమని తహసీల్దార్ ని అడిగితే అసలు తనకు భూమి లేదని చెప్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అందుకే విసుగు చెంది గ్రామంలో జరిగిన రైతు భరోసా సభలో పంచాయతీ కార్యదర్శి సుమలతపై పెట్రోల్ చల్లి నిరసన తెలిపానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీనిపై ప్రభుత్వం ఇప్పటికైన తగిన చర్యలు తీసుకోకపోతే తీవ్ర నష్టాన్ని ఎదురుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

High Court to hear various petitions on TSRTC strike

సమ్మె పట్ల  నిన్న పిటీషన్ పై  హైకోర్ట్ లో కొనసాగుతున్న విచారణ...

  నేడు హైకోర్ట్ లో జరుగుతున్న పిటీషన్ పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కె జోషి హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు నేరుగా హాజరై వివరణ ఇస్తున్నారు. ప్రభుత్వం ఆర్టీసీ ఎండీ జీహెచ్ఎంసీ దాఖలు చేసిన అఫిడవిట్లపై వాదనలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ విధించిన డెడ్ లైన్ ముగియడం, డెడ్ లైన్ లోపు ఎక్కువ సంఖ్యలో కార్మికులు విధులకు హాజరు కాకపోవడం తమ డిమాండ్ల సాధనకు జేఏసీ పట్టుబడుతుండటంతో హై కోర్టు విచారణలో ఏమి తేలనుంది అనే దానిపై ఉత్కంఠం నెలకొంది. ప్రస్తుతం హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. మొత్తం మూడు అంశాలపైన ఇవాళ విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా ఆర్టీసీ సమ్మెతో పాటు ఇటు నిన్న ప్రభుత్వం నుండి దాఖలు చేసిన అఫిడవిట్ ల పైన దీంతో పాటుగా ప్రైవేటీకరణకు సంబంధించిన మూడు అంశాలపైన ప్రస్తుతం ఇవాళ విచారణ కొనసాగుతుంది.   ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఆర్టీసీకి సంబంధించిన ఎండీ జీహెచ్ఎంసీ కమిషనర్ వీళ్ళందరూ కూడా హైకోర్టుకు వచ్చారు.  నిన్న అఫిడవిట్ దాఖలు చేసిన అంశాలపైన ఏవైనా అభ్యంతరాలు ఉన్నాయా అన్న దానికి సంబంధించి కార్మికుల తరపున న్యాయవాదులు ప్రస్తుతం మాట్లాడుతున్నట్లు సమాచారం. మరొకవైపు చీఫ్ సెక్రెటరీ కూడా ప్రస్తుతం హైకోర్టులో ఉన్నారు. నిన్న అఫిడవిట్ లో ఆర్టీసీకి ఎంత వరకు బకాయిలున్నాయి. ఎంత వరకు చెల్లించారు అనే దానికి సంబంధించి వేరువేరుగా అఫిడవిట్ లను దాఖలు చేయటం జరిగింది.ఇటు జీహెచఎంసీతో పాటు ఆర్థిక శాఖ ఈ రెండు అఫిడవిట్ లను కూడా వేర్వేరుగా దాఖలు చేసింది. అలాగే ఆర్టీసీ కూడా ఇలాంటి ప్రభుత్వం నుండి ఎంత వరకు ఆదాయం రావాల్సి ఉంది అన్న దానికి సంబంధించి కూడా అఫిడవిట్ లో పేర్కొనటం జరిగింది. హై కోర్టు పూర్తి స్థాయిలో ఈ అఫిడవిట్ ను దాఖలు చేయాలని జారీ చేసిన ఆదేశాల మేరకు ఆ అఫిడవిట్ ను నిన్న ఇవ్వడం జరిగింది. ఈ రోజు దానికి సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటికి సంబంధించిన అంశాలపైనా ప్రస్తుతము వాదనలు కొనసాగుతున్నాయి. ఈ వాదనల తర్వాత హై కోర్టు ఏం చేయబోతుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉన్న పరిస్థితి ఉంది.

Addanki tdp mla gottipati ravikumar to join ysrcp

వైసీపీలోకి గొట్టిపాటి..! బాబు పిలిచి మాట్లాడినా...?

  గొట్టిపాటి రవికుమార్... అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే... 2004లో కాంగ్రెస్ నుంచి... 2014లో వైసీపీ నుంచి... 2019లో టీడీపీ నుంచి... మొత్తంగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి... ఒకప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి రవికుమార్... అప్పటి రాజకీయ పరిస్థితులు, వ్యాపార ఆర్ధిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశంలో చేరారు. అనంతరం 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేసి... మూడోసారి అద్దంకి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, ఏ కారణాలతోనైతే ఆనాడు టీడీపీలో చేరారో... ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రావడంతో... మళ్లీ అదే పరిస్థితులు గొట్టిపాటికి ఎదురవుతున్నాయట. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నప్పటికీ, స్థానిక రాజకీయ పరిస్థితులు మాత్రం అనుకూలంగా లేకపోవడంతో... మళ్లీ వైసీపీ గూటికి చేరాలని భావిస్తున్నారట. వైసీపీ నేతలతో ఇప్పటికే చర్చలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. అయితే, గొట్టిపాటి రవికుమార్ ఆలోచనను తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు పిలిచి మాట్లాడారు. అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చాక... నియోజకవర్గంలో ఎదురవుతోన్న కష్టాలు... వ్యాపారపరంగా కలుగుతున్న ఇబ్బందులు... మరోవైపు కేసులు... ఇలా తన ఇక్కట్లపై గొట్టిపాటి ఏకరువు పెట్టారట. ముఖ్యంగా తనకున్న గ్రానైట్ వ్యాపారంపై విజిలెన్స్ దాడులు చేయిస్తున్నారని, దాంతో బల్లికురవ, చీమకుర్తిలో బిజినెస్ నిలిచిపోయిందని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట. అయితే, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తాను, పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పిన చంద్రబాబు.... పార్టీ మారాలన్న ఆలోచనను మానుకోవాలని సూచించారట.  చంద్రబాబు బుజ్జగించినా, అండగా ఉంటామని భరోసా కల్పించినా, గొట్టిపాటి మాత్రం పార్టీ మారాలనే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకు, వ్యాపారపరంగా ఇబ్బందులు ఒకటైతే... మరోవైపు జగన్ తో సన్నిహిత సంబంధాలు ఉండటం కూడా కారణమంటున్నారు. ఇప్పటికే తన అనుచరులతో గొట్టిపాటి మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. మొత్తానికి గొట్టిపాటి పార్టీ మారడం ఖాయమే అయినా... అది ఎప్పుడు ఎలా అనేది మాత్రం తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

tdp leader nara lokesh slams ap cm ys jagan

జగన్ ఇంటి కిటికీలు, బోల్టులకు 73లక్షలా? ఎంత మోసమంటూ నారా లోకేష్ ఎద్దేవా

  ప్రజాధనాన్ని సొంత పనులకు వాడుకోవడంలో ఎవరూ తక్కువ కాదని నిరూపించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గతంలో చంద్రబాబుపై ఇలాంటి ఆరోపణలే చేసిన జగన్... తాను అధికారంలోకి వచ్చాక, అదే పని చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయ మరమ్మతులు కోసం 73లక్షల రూపాయలు మంజూరు చేయడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. అది కూడా కేవలం కిటికీలు, తలుపులు కోసం దగ్గరదగ్గర కోటి  రూపాయలు కేటాయించడాన్ని జాతీయ మీడియా తప్పుబడుతోంది. కిటికీలు, తలుపులు కోసం ఏకంగా 73లక్షలు మంజూరు చేస్తారా? అంటూ విస్తృతంగా కథనాలు ప్రసారం చేస్తున్నారు. దాంతో, జగన్ క్యాంప్ హౌస్ మరమ్మతు వ్యవహారం అటు జాతీయ మీడియాలోనూ... ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. జగన్ క్యాంపు కార్యాలయం కిటికీలు, తలుపులకు 73లక్షల రూపాయలు కేటాయిస్తూ జీవో ఇవ్వడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఓ రేంజ్ లో సెటైర్లు వేశారు. డబ్బుల్లేవు... డబ్బుల్లేవు అంటూ నిత్యం డైలాగులు చెబుతున్న జగన్మోహన్ రెడ్డి... తన ఇంటి కిటికీలు, బోల్టులకు మాత్రం లక్షల లక్షల రూపాయలు మంజూరు చేసుకుంటున్నారని మండిపడ్డారు. అన్ బిలీవబుల్... మైండ్ పోతోంది... జగన్ ఇంటి కిటికీలకు 73లక్షలా? అంటూ లోకేష్ విస్మయం వ్యక్తంచేశారు. కిటికీలకు బోల్టులకు లక్షల లక్షలు తగలబెడుతూ... పైకి మాత్రం నెలకు రూపాయి మాత్రమే జీతం తీసుకుంటున్నానంటూ సీఎం జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఖజానా నుంచి 73లక్షల రూపాయలను తన సొంత ఇంటి కోసం ఖర్చుపెట్టడం మోసం కాదా అంటూ ప్రశ్నించారు. అయితే, అప్పుడు టీడీపీ... ఇప్పుడు వైసీపీ... అప్పుడు చంద్రబాబు... ఇప్పుడు జగన్... ఇద్దరూ కూడా ప్రజాధనాన్ని సొంత అవసరాల కోసం మరమరాల్లాగా ఖర్చుపెట్టడంలో ఎవరూ తక్కువ కాదని... అంటున్నారు.

Tahsildar Vijaya Reddy Murder Case Accused Died

హత్యకు ముందు సురేష్.. ఎమ్మార్వో భర్తతో ఏం మాట్లాడాడు? కారులో వచ్చింది ఎవరు?

  అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి తన ఆఫీస్ లోనే అగ్నికి ఆహుతి అయిన సంగతి తెలిసిందే. అయితే ఆమెను హత్య చేసిన నిందితుడు సురేష్ కూడా ఈరోజు మృతి చెందాడు. తహసీల్దార్ విజయారెడ్డి పై పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటనలో అతడు కూడా తీవ్ర గాయాలపాలయ్యాడు. సురేష్ 65 శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చేరగా చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించి అతడు మృతి చెందాడు. ముఖం, ఛాతీ కాలిపోవటంతో అతడు చికిత్సకు స్పందించలేదని సమాచారం. కాగా, ఓ భూమికి సంబంధించి పట్టా ఇవ్వలేదనే ఆగ్రహంతోనే తాను ఎమ్మార్వోను సజీవ దహనం చేసినట్లు సురేష్ వాంగ్మూలం ఇచ్చాడు. అయితే తహసీల్దార్ విజయారెడ్డి హత్య వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే పాత్ర ఉందని.. ఇద్దరు స్థానికులు ఫోన్ మాట్లాడుకున్న ఆడియో లీక్ అయింది. మరోవైపు విజయారెడ్డి భర్త కూడా ఈ హత్య వెనుక రాజకీయ నాయకులు ఉన్నారని, సురేష్ వెనుక ఎవ్వరో ఉన్నారని.. సీబీఐ దర్యాప్తు చేసి నిజానిజాలు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు అధికార పార్టీ నేతలు, విపక్ష నేతలు.. తహసీల్దార్ మృతికి మీరు కారణం అంటే మీరు కారణం అంటూ విమర్శలు చేసుకుంటున్నారు. విజయారెడ్డి హత్య రాజకీయ రంగు పులుముకోవడంతో.. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. విజయారెడ్డిపై దాడికి ముందు ఆమె ఇంటి వద్ద సురేష్ రెక్కి నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనకు రెండు రోజుల ముందు విజయారెడ్డి ఇంటి దగ్గర ఆమె భర్తతో కూడా సురేష్ మాట్లాడినట్లుగా పోలీసులు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, విజయారెడ్డి హత్య తర్వాత తహసీల్దార్ కార్యాలయం నుంచి బయటికొచ్చిన సురేష్.. కారులో ఉన్నవారితో మాట్లాడినట్లు గుర్తించారు. సురేష్‌తో కారులో కూర్చోని మాట్లాండింది ఎవరో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కారులో ఉన్నవారు ఎవరో తెలిస్తే.. ఈ హత్య వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయో లేదో తెలిసే అవకాశం ఉంది.

Three TDP MLAs ready to join YCP

వంశీ బాటలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు... బాబు టార్గెట్ గా జగన్ నయా వ్యూహం

  ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా... ప్రత్యర్ధులను బలహీనపర్చాలనుకోవడం... ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ఎంపీలను, బలమైన నేతలను లాక్కుని.... ఆ పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనుకోవడం... రాజకీయాల్లో కామన్. పైకి నీతి నిజాయితీ విలువలు అంటూ ప్రజలను మభ్యపెట్టాలని చూసినా, ఏదోరకంగా అదే దారి ఎంచుకోక తప్పదు. ఎందుకంటే, పార్టీ ఫిరాయింపులు పెద్దపెద్ద మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి.... అటుతిరిగి ఇటుతిరిగి చివరికి అక్కడికే రావాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా... 23మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు లాక్కోవడంతో... పార్టీ ఫిరాయింపులపై అలుపెరగని పోరాటం చేశారు. పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటేసేవరకు అసెంబ్లీకి రానంటూ శపథంచేసి... చివరికి ముఖ్యమంత్రి హోదాలోనే అడుగుపెట్టారు. అయితే, చంద్రబాబులాగా తాను పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించనని, ఒకవేళ ఎవరైనా పార్టీలోకి వస్తానంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాల్సిందేనని, అలా కాకుండా ఎవరైనా పార్టీ మారితే అనర్హత వేటేయాలని అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ కు సూచించారు. అలా, జగన్ చేసిన ప్రకటనే ఇప్పుడు గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అడ్డంకిగా మారాయి. జగన్ స్టేట్ మెంట్ ప్రకారం వల్లభనేని వంశీ వైసీపీలో చేరాలంటే ముందుగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. అయితే, ఇక్కడే  వైసీపీ కొత్త గేమ్ ప్లాన్ ను అమలు చేయబోతోందనే మాట వినిపిస్తోంది. వల్లభనేని వంశీ టీడీపీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చంద్రబాబుకి వాట్సప్ లేఖ రాసినా, స్పీకర్ కి మాత్రం రిజైన్ లెటర్ పంపలేదు. అయితే, త్వరలోనే వంశీ... తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్ లో చంద్రబాబుకు పంపనున్నారని తెలుస్తోంది. అలా వంశీ రిజైన్ లెటర్ ను టీడీపీ ద్వారానే స్పీకర్ కు పంపేలా చేసి... ఆ నెపాన్ని చంద్రబాబుపైనే నెట్టాలన్నది వైసీపీ వ్యూహంగా చెబుతున్నారు. ఇక, వంశీ కథ ఇలా సాగుతుండగానే, మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు గోడ దూకడానికి సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్ర నుంచి ఒకరు(మాజీ మంత్రి).... కోస్తాంధ్ర నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార వైసీపీతో టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ముగ్గురూ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారన్న సమాచారంతో చంద్రబాబు ఇప్పటికే పిలిపించుకుని మాట్లాడారని అంటున్నారు. అయితే, మొత్తం ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించడం ద్వారా చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలన్నదే వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది.

Election Results 2019: Amit Shah Addresses BJP Workers

కేసీఆర్ మాటంటే కార్మికులకు లెక్క లేదా? అమిత్-షాకి టీబీజేపీ ఏం రిపోర్ట్ ఇచ్చింది?

  తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ పట్టు సడలించడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నిసార్లు డెడ్ లైన్లు పెట్టినా బెదిరింపులకు దిగినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మరోసారి తేల్చిచెప్పారు. మంగళవారం అర్ధరాత్రిలోపు బేషరతుగా విధుల్లో చేరాలంటూ కేసీఆర్ ఇచ్చిన ఆఖరి డెడ్-లైన్ ను ఆర్టీసీ కార్మికులు లైట్ తీస్కున్నారు. కేసీఆర్ డెడ్‌లైన్‌ను 99.99శాతం కార్మికులు లెక్కే చేయలేదు. మొత్తం 49వేల కార్మికుల్లో కేవలం 350మంది మాత్రమే రీ-జాయిన్ అయ్యారు. వాళ్లలోనూ సగం మంది మళ్లీ డుమ్మాకొట్టారు. కేసీఆర్‌ బెదిరింపులకు, డెడ్‌లైన్లకు బెదిరేది లేదని, ఇలాంటి డెడ్‌లైన్లను చాలా చూశామంటోన్న ఆర్టీసీ కార్మికులు... తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం దిగొచ్చేవరకు వెనక్కితగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. డెడ్ లైన్ సంగతి పక్కనబెడితే, ట్యాంక్ బండ్ పై తొమ్మిదిన నిర్వహించే మిలియన్ మార్చ్ కు ఆయా పార్టీల మద్దతును ఆర్టీసీ జేఏసీ కూడగడుతోంది. ముందుగా బీజేపీ నేతలను కలిసి ఆర్టీసీ కార్మికులు మద్దతు కోరారు. అయితే, ఆర్టీసీ కార్మికుల పోరాటానికి మరోసారి సంపూర్ణ మద్దతు ప్రకటించిన టీబీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్... ఆర్టీసీ సమ్మెను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందన్న లక్ష్మణ్... ఇప్పటికైనా హైకోర్టు ఆదేశాల మేరకు కార్మికులతో చర్చలు జరపాలని కేసీఆర్ కు సూచించారు.  అయితే, ఇప్పటికే 5వేల100 రూట్ల ప్రైవేటీకరణకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం.. మరో 5వేల మార్గాలను ప్రైవేటుకు అప్పగించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు, తెలంగాణను ఆర్టీసీ రహిత రాష్ట్రంగా మార్చబోతున్నామన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై కార్మికులు ఆందోళన చెందుతున్నారు. అయితే, తాజా పరిణామాలపై... హైకోర్టు ఎలా స్పందిస్తుందోనని ఇరువర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Driver of slain Tahsildar Vijaya Reddy succumbs to burn injuries

విజయారెడ్డి మర్డర్ వెనుక పొలిటికల్ పవర్... మాట విననందుకే దారుణంగా చంపేశారా?

  తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్దార్ విజయారెడ్డి హత్యపై రాజకీయ దుమారం రేగుతోంది. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి.... కాంగ్రెస్ లీడర్ మల్‌రెడ్డి రంగారెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇద్దరూ ఒకరిపై మరొకరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. విజయారెడ్డి హత్య వెనుక నీ హస్తముందంటే.... నీ హస్తముందంటూ మంచిరెడ్డి అండ్ మల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తహశీల్దార్ విజయారెడ్డి హత్య వెనుక ముమ్మాటికీ టీఆర్ఎస్ ‌ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హస్తముందంటోన్న కాంగ్రెస్‌ లీడర్ మల్‌రెడ్డి రంగారెడ్డి.... విజయారెడ్డిని ఎమ్మెల్యే మంచిరెడ్డి ఎన్నోసార్లు బెదిరించారని, మాట వినకపోవడంతోనే, తన అనుచరుడు ద్వారా తహశీల్దారుని హత్య చేయించారని ఆరోపించారు. మంచిరెడ్డి భూకబ్జాలను తాను తహశీల్దార్ విజయారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, తనపై ఎమ్మెల్యే ఒత్తిడి ఉందంటూ చెప్పిందన్నారు. కబ్జా భూమిని సీజ్ చేయొద్దంటూ ఎమ్మెల్యే మంచిరెడ్డి బెదిరించినట్లు విజయారెడ్డి చెప్పిందన్న మల్‌రెడ్డి.... ఆమె ధైర్యవంతురాలు కాబట్టే.... ఆ భూమిని సీజ్ చేసి.... గవర్నమెంట్ ల్యాండ్ అంటూ బోర్డు పెట్టించిందని, అందుకే తన అనుచరుడు సురేష్‌ ద్వారా విజయారెడ్డిని హత్య చేయించాడని ఆరోపించారు. అయితే, కాంగ్రెస్‌ నేత మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపణలను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఖండించారు. రాజకీయ లబ్ధి కోసమే తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై మూడుసార్లు ఓడిపోయిన ప్రస్టేషన్ తో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అసలు అబ్దుల్లాపూర్‌మెట్‌ ప్రాంతంలో భూకబ్జాలు చేసింది మల్‌‌రెడ్డి సోదరులు, బంధువులే అన్నారు. తహశీల్దార్ విజయారెడ్డిని చంపిన సురేష్‌ కుటుంబ సభ‌్యుల భూములను మల్‌రెడ్డి బంధువులే కొనుగోలు చేశారంటూ ఆధారాలను మీడియాకి రిలీజ్ చేశారు. ఇదిలాఉంటే, విజయారెడ్డి హత్య వెనుక రాజకీయ శక్తుల ప్రమే‍యం ఉండొచ్చని ఆమె భర్త సుభాష్ రెడ్డి అనుమానిస్తున్నారు. నిందితుడు సురేష్‌ వెనుక రాజకీయ శక్తి ఉందని, అదెవరో తేలాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Requesting an Appeal

ప్రాణభయంతో హడలిపోతున్న రెవెన్యూ ఉద్యోగులు....భూపరిపాలన నుంచి తప్పించాలని విజ్ఞప్తి

  తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యతో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగులు ప్రాణభయంతో హడలిపోతున్నారు. ప్రతి చోటా భూవివాదాలు ఉండటంతో ముందుముందు ఇలాంటి ఘటనలు మరిన్ని పునరావృతం అవుతాయేమోనని భయపడుతున్నారు. విజయారెడ్డి హత్యపై ఒకపక్క ఆందోళనలు, నిరసనలు చేపడుతోన్న రెవెన్యూ యంత్రాంగం.... ఈ ఘటన నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరముందంటూ అభిప్రాయపడింది. ముఖ్యంగా అత్యంత వివాదాస్పదంగాను, ప్రాణసంకటంగాను మారిన భూపరిపాలన విభాగం నుంచి తమను తప్పించాలని రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ జేఏసీ అయితే, ఇప్పట్నుంచే స్వచ్ఛందంగా భూపరిపాలన నుంచి తప్పుకుంటున్నామని, భూరికార్డులకు సంబంధించిన ఫైళ్లను తాము పరిశీలించబోమని ప్రకటించారు. ఉద్యోగం కంటే తమకు ప్రాణమే ముఖ్యమంటోన్న రెవెన్యూ యంత్రాంగం... భూపరిపాలన అస్తవ్యస్తంగా ఉందని, ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రైతుల కష్టాలు తీరవని.... అదే సమయంలో రెవెన్యూ ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవనీ అభిప్రాయపడింది. భూ సమస్యలు పరిష్కారం కావాలంటే... ప్రధానంగా ఐదు అంశాలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని సూచించింది. సమగ్ర భూసర్వే.... భూచట్టాలపై సమీక్ష-సమగ్ర రెవెన్యూ కోడ్‌ రూపకల్పన.... టైటిల్ గ్యారంటీ చట్టం.... భూవివాదాల పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునల్‌... భూరికార్డుల సవరణలో ప్రజల భాగస్వామ్యం... ఇలా ఐదు అంశాలతో చర్యలు చేపడితేనే... భూవివాదాలకు ఫుల్‌ స్టాప్ పడుతుందని రెవెన్యూ జేఏసీ అభిప్రాయపడింది. రెవెన్యూశాఖకు ఒకప్పుడు రెవెన్యూ వసూలుతోపాటు భూపరిపాలనే కీలకంగా ఉండేదని, కానీ ఇప్పుడు భూపరిపాలన కంటే ...మిగతా పనులు ఎక్కువై-పోయాయని రెవెన్యూ యంత్రాంగం అంటోంది. ప్రోటోకాల్‌ నుంచి సంక్షేమ పథకాల వరకు అన్నీ రెవెన్యూ ఉద్యోగులే చేయాల్సి వస్తోందని, దాంతో కీలకమైన భూపరిపాలనకు సమయం కేటాయించలేని పరిస్థితి నెలకొందని, అందువల్లే సమస్యలు వస్తున్నాయని వాపోతున్నారు. లోభభూయిష్టమైన విధానాలు కూడా రెవెన్యూ ఉద్యోగులకు చెడ్డపేరు తీసుకొస్తున్నాయని అంటున్నారు. అసలు భూపరిపాలన నుంచి తమను తప్పిస్తే... ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంటున్నారు. అయితే, భూవివాదాలు పెరిగిపోవడానికి కారణాలను కూడా రెవెన్యూ జేఏసీ ప్రస్తావించింది.... భూమి హక్కుల నిరూపణకు రికార్డులే సాక్ష్యం కాకపోవడం... ఏ భూమి రికార్డునైనా, ఎప్పుడైనా సవరించే అవకాశం ఉండటం... భూరికార్డుల్లోని వివరాలకు భరోసా లేకపోవడం... భూమి హద్దులు తెలిపే చిత్రపటాలు లేకపోవడం... భూములకు సరిహద్దు రాళ్లు లేకపోవడం.... ఏ భూసమస్యను ఎంతకాలంలో పరిష్కరించాలో స్పష్టత లేకపోవడం.... చట్టాల్లో గందరగోళం... లెక్కకు మించిన నియమాలు, ఉత్తర్వులు... 40ఏళ్లకు ఒకసారి భూసర్వే జరగాల్సి ఉండగా, 80ఏళ్లయినా జరగని సర్వే.... అసంపూర్తిగా సీలింగ్, టెనెన్సీ, ఇనాం భూచట్టాల అమలు... వాస్తవ పరిస్థితిని అద్దంపట్టని భూరికార్డులు.... చట్టాలు, రూల్స్‌‌పై అవగాహన లేకపోవడం... జమాబందీ, ఆజమాయిషీ నిలిచిపోవడం.... ఇలా అనేక సమస్యలతో సివిల్ కోర్టుల్లో 66శాతం కేసులు భూతగాదాలే ఉంటున్నాయని రెవెన్యూ జేఏసీ అంటోంది. ప్రభుత్వం ఇప్పటికైనా భూపరిపాలనపై దృష్టిపెట్టకపోతే మున్ముందు మరిన్ని సమస్యలు తప్పవని రెవెన్యూ జేఏసీ హెచ్చరిస్తోంది.  

ఒక్క పైసా బాకీ లేమంటూ అఫిడవిట్లు... ఆర్టీసీపై అటోఇటో తేల్చేయనున్న కేసీఆర్... 

  తప్పుడు లెక్కలతో న్యాయస్థానాన్నే తప్పుదోవ పట్టిస్తారా అంటూ ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ‎‌తోపాటు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ అండ్ జీహెచ్ఎంసీ కమిషనర్లను హైకోర్టు ఏకిపారేయడంతో... వాళ్లంతా సమగ్ర సమాచారంతో అఫిడవిట్లు దాఖలు చేశారు. ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ లెక్కలకు.... మీరు చెబుతున్న మాటలకు పొంతన లేదంటూ హైకోర్టు తీవ్ర స్థాయిలో విరుచుకుపడటంతో.... ఆర్టీసీ ఇన్‌ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ మరోసారి కౌంటర్ దాఖలు చేశారు. ముఖ్యంగా ఆర్టీసీ స్థితిగతులు, బకాయిలపై క్లారిటీ ఇచ్చారు. సునీల్ శర్మ రిపోర్ట్ ప్రకారం ఒక్క ముక్కలో చెప్పాలంటే.... ఆర్టీసీకి ప్రభుత్వం ఒక్క నయా పైసా కూడా బాకీ లేదంటూ తేల్చిచెప్పారు. ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన దాని కంటే 867 కోట్లు ఎక్కువే వచ్చాయంటూ సునీల్ శర్మ... హైకోర్టుకు నివేదించారు. వేర్వేరు పద్దుల కింద ఆర్టీసీకి ప్రభుత్వం నిధులు ఇచ్చిందన్నారు. రుణ పద్దు కింద విడుదలైన నిధులను, వడ్డీని ప్రభుత్వం ఎన్నడూ అడగలేదని నివేదించారు. ఆర్టీసీకి జీహెచ్‌ఎంసీ ఇవ్వాలని చెప్పిన 14వందల 42కోట్లను... చట్టప్రకారం రీఎంబర్స్‌మెంట్ కోరడమే తప్ప... డిమాండ్ చేయలేమని సునీల్ శర్మ తెలిపారు.  హైకోర్టు ఆదేశాల మేరకు ఫైనాన్స్, మున్సిపల్ అండ్ జీహెచ్ఎంసీ కూడా అఫిడవిట్లు దాఖలు చేశాయి. ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బాకీ లేదని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు హైకోర్టుకు తెలిపారు. ఆర్టీసీకి 3వేల 6కోట్లు చెల్లించాల్సి ఉండగా.... అంతకంటే ఎక్కువగా ప్రభుత్వం 3వేల 903 కోట్లు ఇచ్చిందని తెలిపారు. మోటారు వాహనాల పన్ను కింద ...ఆర్టీసీయే ప్రభుత్వానికి 540కోట్లు చెల్లించాల్సి ఉందని ఆర్థికశాఖ అఫిడవిట్లో పేర్కొన్నారు. వివిధ పద్దుల కింద ఆర్టీసీకి నిధులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందన్న రామకృష్ణారావు... రుణ పద్దు కింద ఇచ్చినవి విరాళమేనని స్పష్టం చేశారు. అలాగే, జీహెచ్‌ఎంసీ ఆర్ధిక పరిస్థితిని బట్టే... ఆర్టీసీకి సాయం చేస్తుందన్న GHMC కమిషనర్... చట్టప్రకారమైతే ఆర్టీసీకి నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదని తన అఫిడవిట్‌లో తెలిపారు. జీహెచ్‌ఎంసీకి మిగులు బడ్జెట్‌ ఉన్నప్పుడు ఇచ్చామని, కానీ ఇప్పుడు లోటు బడ్జెట్‌లో ఉందని, దాంతో ఆర్టీసీకి నిధులిచ్చే పరిస్థితి లేదన్నారు. మరోవైపు, ఆర్టీసీ సమ్మె, కోర్టు విచారణ, ప్రైవేట్ ఆపరేటర్లకు అనుమతులపై దాదాపు 8గంటలపాటు కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. ప్రైవేట్ ఆపరేటర్లకు స్టేజ్ క్యారియర్లుగా అనుమతి ఇచ్చేందుకు న్యాయపరమైన చిక్కుల్లేకుండా విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల్లోని పద్ధతులను అధ్యయనం చేయాలని సూచించారు. ఇదిలాఉంటే, హైకోర్టు విచారణ తర్వాత ఆర్టీసీపై సీఎం కేసీఆర్ అత్యంత కీలక నిర్ణయం తీసుకోనున్నారని ప్రభుత్వ వర్గాలు లీకులిచ్చాయి. అయితే, ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో సర్కారు తీరును ఎండగడుతూ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తోన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం... మరి ఈసారి ఎలా రియాక్టవుతుందోనన్న ఉత్కంఠ ఇరువర్గాల్లో కొనసాగుతోంది. 

కార్యకర్తల ప్రశ్నల వర్షం.. చంద్రబాబు తీరు ఇప్పుడైనా మారుతుందా?

  కడుపు చించుకుంటే కాళ్ల మీద పడ్డట్టు అంటారు. అలాగే ఉంది ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాల వారీగా సమీక్షలు ప్రారంభించారు. ఒక్కొక్క జిల్లాలో మూడు రోజుల పాటు విస్తృత స్థాయి సమావేశం, నియోజకవర్గాల వారీగా సమీక్షలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధితులను పరామర్శించడం, నియోజక వర్గాల ఇన్ చార్జిలతో కలిసి భోజనం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఇటీవల మూడు రోజుల పాటు విజయవాడలో కృష్ణా జిల్లాకు చెందిన పదహారు నియోజక వర్గాల సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అనేక విషయాలు పార్టీ పెద్దల దృష్టికొచ్చాయి. కొన్ని నియోజక వర్గాల్లో బహునాయకత్వ ఉండడం ఎమ్మెల్యేకి, క్యాడర్ కి మధ్య దూరం పెరగడం, వాటిని చంద్రబాబు పట్టించుకోకపోవటం, ద్వితీయ శ్రేణి నేతలకు సైతం సరైన గౌరవం ప్రాధాన్యత లభించకపోవడం వంటి అంశాలు ఎన్నికల్లో నష్టం చేశాయని తేలింది. ఈ విషయాలను ఆయా నియోజక వర్గాల నేతలు స్వయంగా చంద్రబాబుకి నివేదించడం గమనార్హం. ఇదిలా ఉంటే విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, పార్టీ నేత నాగుల్ మీరా వర్గాల మధ్య చంద్రబాబు సమక్షంలోనే వివాదం జరిగింది. ఒకరిపై మరొకరు దూషణలకు దిగారు. నాగుల్ మీరా తమకు మద్దతు ఇవ్వలేదని జలీల్ ఖాన్ వర్గీయులు ఆరోపించారు. జలీల్ ఖాన్ తమను కలుపుకు వెళ్లలేదని ఏకపక్ష ధోరణితో వ్యవహరించారని నాగుల్ మీర వర్గీయులు ప్రత్యారోపణలు చేశారు. ఈ పరిణామంతో విసిగిపోయిన చంద్రబాబు ఇటువంటి వివాదాలు ఎవరికీ మంచిది కాదని ఎవరికైనా పార్టీ సుప్రీం అని అందరూ విధేయులుగా ఉండాలని ఆ రెండు వర్గాల వారికి స్పష్టం చేశారు. ఇటువంటి నియోజకవర్గాల్లో వివాదాలను సర్దుబాటు చేసేందుకు సీనియర్ నేతలను పంపుతామని హామీ ఇచ్చారు. పరిష్కారం కాకపోతే నేరుగా తానే జోక్యం చేసుకుంటానని కూడా వివరించారు. గన్నవరం నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే వంశీ మోహన్ ఈ సమీక్షకు హాజరు కాలేదు కానీ స్థానిక కార్యకర్తలు నేతలు మాత్రం పెద్ద ఎత్తున హాజరయ్యారు. అక్రమంగా బనాయించిన కేసు విషయంలో భయపడ్డం మంచిది కాదని వంశీకి తాను సూచించానని మరోసారి మీ ద్వారా ఆయనకి ఈ విజ్ఞప్తి చేస్తున్నానని కార్యకర్తలతో అధినేత చంద్రబాబు చెప్పారు. ఎవరున్నా లేకున్నా తమ పార్టీకి అండగా ఉంటామని ఈ సందర్భంగా గన్నవరం తెలుగు తమ్ముళ్లు బాబుకి భరోసా ఇచ్చారు. మరికొన్ని నియోజక వర్గాల్లో కూడా ఇటువంటి సమీక్ష జరిగింది. అయితే కొందరు ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం అధికారంలో ఉన్న ఐదేళ్లలో మిమ్మల్ని కలవలేకపోయాం అని, మీరు పార్టీని వదిలేసి అధికారులతో బిజీ బిజీగా గడిపారని, విడిపోయిన రాష్ట్రం అంటూ చాలా కష్టపడ్డారని, దీంతో సరైన ప్రాధాన్యం లేక పార్టీ శ్రేణులు ఎన్నికల సమయంలో యాక్టివ్ గా పనిచెయ్యలేదని నేరుగా చంద్రబాబుతోనే చెప్పారు. మిమ్మల్ని కలిసేందుకు ఎన్నిసార్లు వచ్చినా అపాయింట్ మెంట్ దొరకలేదని కొందరు చెప్పిన తీరు చూసి చంద్రబాబు కూడా చలించిపోయారు. ముఖ్యమంత్రి సహాయనిధి కోసం వచ్చినా కూడా తమకు నిరాదరణ ఎదురయిందని మరికొందరు పార్టీ అధినేత ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతల మనోభావాలు విన్న చంద్రబాబు వారికొక విషయం స్పష్టం చేశారు. ఇక ముందు పరిస్థితి గతంలో మాదిరిగా ఉండదని పార్టీ కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఇది తన మాటగా నమ్మాలని వివరించారు. కృష్ణజిల్లాలో నాలుగైదు నియోజకవర్గాల్లో పార్టీకి ట్రీట్మెంట్ తానే చేస్తానని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మైలవరం నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టినప్పటికీ అక్కడ టిడిపి పరాజయం పాలవడానికి గల కారణాలపై చంద్రబాబు లోతుగా ఆరా తీశారు. ఒక్కసారి జగన్ కు చాన్సిద్దాం అనే భావన, కొన్నివర్గాలు టిడిపికి దూరం కావడమే ఓటమికి కారణాలని తేల్చారు. ఆయా నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుల పనితీరు ఉందంటూ చంద్రబాబు కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. విజయవాడ లోక్ సభ స్థానం పరిధి లోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఓటమి చెందినా, ఎంపీ అభ్యర్ధి కేశినేని నానికి మెజారిటీ రావడం ఆయన గెలుపొందడం కూడా కొంతమంది కార్యకర్తలు ప్రస్తావించారు. టాటా ట్రస్టు ద్వారా కేశినేని నాని చేపట్టిన కార్యక్రమాలు నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం వివాదాలకు అతీతంగా వ్యవహరించడం వ్యక్తిగతంగా ఆయనకున్న ఇమేజ్ తో పాటు లోక్ సభలో ప్రధాని మోదీని నేరుగా నిలదీసిన తీరు కూడా ఆయన విజయానికి కారణమయ్యాయి అని ఈ సందర్భంగా మరికొందరు నేతలు విశ్లేషించారు. ఇలా ప్రతి నియోజక వర్గం లోని ప్లస్సులూ మైనస్సులూ చంద్రబాబు టిడిపి ముఖ్యనేతలంతా విశ్లేషిస్తున్నారు. తద్వారా వచ్చే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు పదును పెడుతున్నారు.

కాసుల కోసం ప్రసాదంలో సైనైడ్ పెట్టి ప్రాణాలు తీసిన దుండగుడు...

  అతని పేరు సింహాద్రి అలియాస్ శివ. చదివింది పదో తరగతి. గతంలో అపార్ట్ మెంట్ వాచ్ మెన్ గా పని చేశాడు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అడుగు పెట్టి దెబ్బతిన్నాడు. ఆపై అడ్డదారిలో డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. కాసుల కోసం ప్రాణాలు తీశాడు. అలా ఒకరూ ఇద్దరు కాదు ఇరవై నెలల్లో పది మందిని చంపాడు. అది కూడా సైనైడ్ కలిపిన ప్రసాదమిచ్చి చంపాడు. ఆ సీరియల్ కిల్లర్ బారిన పడి స్వామీజీ నుంచి సామాన్య గృహిణి వరకూ ప్రాణాలు కోల్పోయారు. శివతో పాటు అతనికి సలహాలిచ్చి సహకరించిన మరొకరిని పశ్చిమగోదావరి పోలీసులు అరెస్ట్ చేశారు.  ఏలూరు వెంకటాపురం పంచాయతీ లోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన వెల్లంకి సింహాద్రి వాచ్ మ్యాన్ నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారి అవతారమెత్తి బాగా నష్టపోయాడు. ఆ తరువాత వ్యక్తుల బలహీనతలూ, నమ్మకాలను సొమ్ము చేసుకునే పనిలో పడ్డాడు. రైస్ పుల్లింగ్ కాయిన్, రంగురాళ్లు, గుప్త నిధులు, బంగారం రెట్టింపయ్యే మార్గమంటూ బాగా డబ్బున్న వారిపైన, అప్పుల నుంచి బయటపడాలనుకునే వారిపైనా కన్నేశాడు. ఈ క్రమంలో విజయవాడకు చెందిన షేక్ అమనుల్లా అలియాస్ బాబుతో స్నేహం చేశాడు.  మోటార్ వాహనాల విడిభాగాలకు నికెల్ కోటింగ్ వేసే శంకర్ వద్ద సైనైడ్ ఉంది. అదే సైనైడ్ ను ఆయుర్వేద మందులు, ప్రసాదంలో కలిపి హత్యలకు తెర తీశారు. భక్తి పేరిట కొందరికి రైస్ పుల్లింగ్ కాయిన్ కొని పెడతామని ఇంకొందరికీ, గుప్తనిధుల ఉన్నచోటు చూపిస్తామని కొందరికి, బంగారం తెస్తే రెట్టింపు చేస్తామని కొందరికి శివ ముఠా వల వేసింది. సొంత బంధువులనే తొలిగా బలి తీసుకుంది, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పేపర్ మిల్ వద్ద ఉంటున్న కొత్తపల్లి రాఘవమ్మ దగ్గరకు చుట్టపు చూపుగా శివ వెళ్లాడు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న రాఘవమ్మను ఆయుర్వేదంతో బాగు చేస్తానని నమ్మించాడు. ఆమెకిచ్చే మందులో సైనెడ్ కలిపి చంపేశాడు, ఆమె ఇంట్లోంచి లక్ష రూపాయలకు పైగా నగదుతో ఉడాయించాడు. ఇదే జిల్లా బొమ్మూరులో ఉంటున్న వరుసకు వదినయ్యే సామంత కుర్తీ నాగమణిని కూడా ఇలాగే హత్య చేసి ఐదు లక్షల డబ్బులు నగలుతో పరారయ్యాడు. గుప్త నిధుల జాడ చూపుతానని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి మరికొందరిని హతమార్చాడు. చివరకు అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద మందు అంటూ ఒక స్వామీజీని కూడా సైనైడ్ తో చంపేశాడు. ఏలూరు కేబిడిటి హై స్కూల్ లో వ్యాయామ ఉపాధ్యాయునిగా పని చేస్తున్న కాటి నాగరాజు రైస్ పుల్లింగ్ కాయిన్ కోసం తెలిసిన వారినల్లా సంప్రదించాడు. శివ గురించి తెలుసుకున్న నాగరాజు ఆయన్ను కలిశాడు. ఇదే అదునుగా తీసుకున్న శివ ఆ కాయిన్ ఇస్తానని గత నెల 16 వ తేదీన తన వద్దకు పిలిపించుకున్నాడు. అతడు చెప్పినట్టు నాగరాజు రెండు లక్షల రూపాయల నగదు, నాలుగున్నర కాసుల బంగారు నగలు పట్టుకొని ఇంటి నుంచి వెళ్లాడు.  ఏలూరు సమీపంలోని వట్లూరు మినీ బైపాస్ రోడ్డులో శివను కలుసుకున్నాడు. నాగరాజుకు ప్రసాదం అంటూ సైనేడ్ పెట్టాడు. ఆ ప్రసాదం తిన్న నాగరాజు మృతి చెందాడు. అతని వద్ద నుంచి నగదు, బంగారు ఆభరణాలు శివ అపహరించుకుపోయాడు. అయితే నాగరాజు మృతి చెందిన తీరుపై బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగరాజు కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు బలమైన ఆధారాలు సేకరించారు. వారిలో ఒకే ఒక్క వ్యక్తి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉండడం పోలీసులు గమనించారు. అతని కాల్ డేటా పరిశీలించగా గతంలో మృతి చెందిన అనేక మంది ఫోన్ నెంబర్ లు ఆ కాల్ లిస్ట్ లో కనిపించాయి. మృతుల బంధువులు ఇచ్చిన సమాచారంతో హంతకుడు శివను ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు.

సీబీఐ కోర్టు తీర్పు తెచ్చిన తిప్పలు.. తలలు పట్టుకుంటున్న వైసీపీ నేతలు!!

  చెప్పులోని రాయి, చెవిలోని జోరీగ, ఇంటిలోని పోరు ఇంతింతగాదయా అనే నానుడిని తలపించేలా ఉందట ఇటీవల సీబీఐ కోర్టులో ముఖ్యమంత్రి జగన్ కు ఎదురైన చుక్కెదురు పరిణామం పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చ. అధికారంలోకి వచ్చిన వెంటనే లక్షలాది మందికి గ్రామ వాలంటీర్ లుగా పోస్టులు, గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు, నవరత్నాల పథకాల అమలుతో వడివడిగా అడుగులు వేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఒక్క సారిగా బ్రేక్ పడినట్లయింది. నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణంలో పోలవరం నిర్మాణ బాధ్యతల నుంచి నవయుగ ఇంజనీరింగ్ కాంట్రాక్టు సంస్థను వైదొలగాలని ఇచ్చిన ప్రీ క్లోజర్ నోటీసుపై హై కోర్టు ముందస్తు స్టే ఇవ్వడం ఆ తర్వాత తొలగించిన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. వెనువెంటనే మేఘా ఇంజనీరింగ్ కూడా పనులు ప్రారంభించింది, జల విద్యుత్ ప్రాజెక్టు, హెడ్ వర్క్స్ లో మిగిలి పోయిన పనులను 4987 కోట్ల రూపాయలకు టెండర్లు పిలవగా ఇందులో 12.6 శాతం తక్కువకు మెగా ఇంజనీరింగ్ టెండర్లు దక్కించుకోవడంతో సుమారు 625 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా అయిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. మరోవైపు వైయస్సార్ రైతు భరోసా వైయస్సార్ వాహన మిత్ర పెన్షన్ ల వయస్సు పెంపు, ఆరోగ్యశ్రీ, వైయస్సార్ కంటివెలుగు వంటి పథకాలను అమలు చేస్తున్నామని అర్హులైన వారికి పారదర్శకంగా ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా లబ్ధిని అందిస్తున్నామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి జగన్ మినహాయింపు ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టి వేయడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కసారిగా కంగుతిన్నారు. నిజానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన పాదయాత్రకు బయలుదేరే ముందు కూడా సీబీఐ కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. అప్పుడు కూడా కోర్టు ఆయన అభ్యర్థనను తిరస్కరించింది, పాద యాత్ర చేస్తూ కూడా జగన్ ప్రతి గురువారం మధ్యాహ్నం బయలుదేరి హైదరాబాద్ వెళ్లి శుక్రవారం కోర్టుకు హాజరై అదే రోజు సాయంత్రానికి పాద యాత్ర జరిగే ప్రాంతానికి చేరుకొని మరుసటి రోజు యాత్ర ప్రారంభించారు. పాద యాత్ర ఇలా సాగింది, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉండడంతో అనేక బరువు బాధ్యతలుంటాయని సమీక్షా సమావేశాలతో పాటు పాలనా యంత్రాంగానికి దిశా నిర్దేశం అవసరం అవుతుందని హైదరాబాద్ కు రావాలంటే సుమారు 60 లక్షల రూపాయలు ఖర్చవుతుందని జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ తన పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు వస్తే అరవై లక్షలు ఖర్చవుతుందని చెప్పడం అతిశయోక్తి అని సిబిఐ తన అఫిడవిట్ లో పేర్కొంది. కాగా సీబీఐ తన అఫిడవిట్ లో పేర్కొన్న విషయాలు ప్రజాబాహుళ్యంలోకి విస్తృతంగా వెళ్ళాయి. జగన్ ఎంపీగా ఉన్న సమయంలోనే సాక్షులను ప్రభావితం చేశారని ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నందున ఇంకా ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ పేర్కొంది. ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లడం రాజకీయంగా ఇబ్బందికరమైన పరిణామం అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. ఇప్పటికే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు మరింత బలమిచ్చినట్టు అవుతుందని వారు అస్త్రాలుగా మల్చుకునేందుకు కూడా ఆస్కారం ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్నారు. మొత్తం మీద సిబిఐ కోర్టులో జగన్ కు ఎదురైన చుక్కెదురు పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన అంశంగా అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. తమకు ప్రజలిచ్చిన తీర్పులకు తమ ప్రభుత్వం వేగానికి ఈ తాజా పరిణామం స్పీడ్ బ్రేకర్ లాంటిదని దీన్ని ఎలాగైనా దాటుకుని ముందుకెళ్తామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి సడెన్ బ్రేక్ కారణంగా నెమ్మదించిన జగన్ సర్కార్ జోరందుకునేదెప్పుడో అదెలాగో చూడాలి.