జనవరి నుంచి జూన్ వరకూ డీ.ఏ. బకాయిల చెల్లింపు ఉండదు
కరోనా పై పోరుకు కేంద్రం నిధులు సమకూర్చుకుంటోంది. ఏ అవకాశాన్ని వదులుకోకుండా నిధులను ఆదా చేస్తున్న కేంద్రం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ పెంపును నిలుపుదల చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జులై 2021 వరకు పెంచిన డీఏ పెంపు నిలుపుదల, అలాగే 2020 జనవరి 1 నుంచి 2021 జూన్ 30 వరకు డీఏ బకాయిల చెల్లింపు కూడా ఉండదు. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న డీఏ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
గత నెల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ను 17 శాతం నుంచి 21 శాతానికి పెంచుతూ తీసుకున్ననిర్ణయాన్ని కూడా కేంద్రం పునస్సమీక్షించింది. గత నెల పెంచిన 4 శాతం డీఏ పెంపును కూడా కేంద్రం నిలుపుదల చేసింది. ఇది 54 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు,65 లక్షల పెన్షనర్ల పై ప్రభావం చూపుతుంది. కేంద్రం నిర్ణయం ద్వారా 14595 కోట్లు ఆదా అవుతుంది. దేశంలో కరోనా పై పోరు కోసం ఖర్చులు,అదనపు నిధుల కేటాయింపులను కేంద్రం తగ్గిస్తోంది. ఇప్పటికే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని,కేంద్రమంత్రులు, ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత విధించారు. ఓపక్క నిధులు సమకూర్చుకుంటు మరో పక్క ప్రజా సంక్షేమానికి నిధులు ఖర్చు చేస్తున్న కేంద్రం, లాక్డౌన్ ప్యాకేజి నిధులను విడతల వారిగా విడుదల చేస్తోంది. 33 కోట్ల మందికి పైగా ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందుతోంది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజి కింద రూ. 31,235 కోట్లు, 20 కోట్ల మహిళా జన్ధన్ ఖాతాల్లోకి రూ. 10,025 కోట్లు నిధులు , 2.82 కోట్ల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పెన్షన్ కోసం రూ. 1,405 కోట్లు, పీఎం-కిసాన్ యోజన కింద 8 కోట్ల మంది రైతులకు రూ. 16,146 కోట్లు రూపాయలు, 68,775 కంపెనీల్లో పనిచేసే 10.6 లక్షల ఉద్యోగులకు ఈపీఎఫ్ వాటాగా రూ. 162 కోట్లు నిధులు ఉంది.