2 లక్షల మందికి రెండుపూట్ల‌ భోజనం!

తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఆకలితో ఉండకూడదన్న ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు 300 అన్నపూర్ణ సెంటర్ల ద్వారా దాదాపు 2 లక్షల మందికి ప్రతి రోజు ఉదయం సాయంత్రం భోజనాన్ని అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ అర్వింద్ కుమార్ , జి.హెచ్.యం.సి కమీషనర్ శ్రీ లోకేష్ కుమార్ తో కలసి టోలిచౌకి లోని అన్నపూర్ణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ జి.హెచ్.యం.సి, 9 మున్సిపల్ కార్పొరేషన్లలలో 300 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా భోజనాన్ని అందిస్తున్నమని మరో 50 కేంద్రాలను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఉదయం 10.30 నుండి గంటన్నర పాటు , సాయంత్రం 5 గంటలకు మరోకసారి భోజనాన్ని అందించేలా వేళలు మార్చామని అన్నారు. ప్రతి రోజు దాదాపు 2 లక్షల మందికి భోజనం అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. అవసరమైతే ఇంకా ఎక్కువ సెంటర్లు పెంచటానికి సిద్దంగా ఉన్నామన్నారు. ప్రతి సర్కిల్ లో ఒక ప్రత్యేక వాహాన్నాన్ని సిద్ధంగా రేడిమేడ్ కుకుడ్ పుడ్ ను అవసరం ఉన్న చోటకు వెంటనే అందిచేలా చర్యలు తీసకున్నమ్నారు. ఎక్కడైన భోజనం అవసరం ఉంటే జి.హెచ్.యం.సి కాల్ సెంటర్ నెం.21111111 కాల్ చేయాలని కోరారు. జి.హెచ్.యం.సి ఆప్ ద్వారా కూడా ఆహారాన్ని కోరవచ్చు అన్నారు.  అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి భోజనం అందించే విషయమై మున్సిపల్ ముఖ్యకార్యదర్శి శ్రీ అర్వింద్ కుమార్ , జి.హెచ్.యం.సి కమీషనర్ లోకేష్ కుమార్ లతో ప్రతి రోజు సమీక్షిస్తున్నామని తెలిపారు.  భోజనం విషయమై ప్రభుత్వానికి తగు సహకారం అందించాలని అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని సి.యస్ కోరారు. ఎక్కడైన సమస్య ఉంటే వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని అన్నారు. అన్నపూర్ణ క్యాంటిన్ ద్వారా భోజనం అందిస్తున్న తీరు పట్ల సంతృప్తి వ్వక్తం చేశారు.

హెలికాప్టర్ మనీ సాధ్యం కాదు! కిషన్ రెడ్డి

తెలంగాణ సీఎం కేసీఆర్ కోరినట్టు హెలికాప్టర్ మనీ అమలు చేయడం సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏదో ఓ రాష్ట్రం కోరితే ఇచ్చేది కాదని... అన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలు కలిసితీసుకోవలసిన నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం వుంది హెల్త్ ఎమర్జెన్సీ మాత్రమే. ఆర్థిక ఎమర్జెన్సీ కాదు. ఆ విష‌యం సీఎం కేసీఆర్ గుర్తుంచుకోవాల‌ని కిషన్ రెడ్డి అన్నారు.  జన సాంద్రత ఎక్కువ ఉన్న దేశాల్లోనే అధిక మరణాలు సంభవిస్తున్నాయి. మనదేశంలో జనసాంద్రత ఎక్కువ కనుక మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ రాష్ట్రాల వారు తమ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలను రాష్ట్రాల్లోకి అనుమతించే పరిస్థితుల్లో లేరు. కాబ‌ట్టి ఏయే రాష్ట్రంలో ఉన్న ప్రజలు అక్కడే ఉండి సామాజిక దూరం పాటించాల‌ని కిష‌న్‌రెడ్డి  సూచించారు. మర్కజ్ సంఘటన వల్లే దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయని అన్నారు. ముంబైలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. మూడవ విడత లాక్ డౌన్ పొడిగింపు మే 3న ఆ తర్వాతే నిర్ణయం ఉంటుందని వెల్లడించారు.

ముస్లిం మ‌హిళాగా ఎమ్మెల్యే ర‌జ‌నీ! రంజాన్ సందేశం కోసం కొత్త గెట‌ప్‌!

చిల‌క‌లూరి పేట వైసీపీ ఎమ్మెల్యే ర‌జ‌నీ ప్ర‌చారం విష‌యంలో ఏ మాత్రం త‌గ్గ‌ర‌ట‌! సోష‌ల్ మీడియాలో ల‌క్ష‌ల రూపాయ‌లు ఇట్టే ఖ‌ర్చు పెట్టేస్తున్నారు మేడం. వీడియో సందేశాలు ఇవ్వ‌డం, ఫొటో స్టిల్స్ విష‌యంలో సినిమా వారికి ఏమాత్రం త‌గ్గ‌కుండా యాక్ట‌ర్‌ల‌తో పోటీ ప‌డుతూ ఎమ్మెల్యే ర‌జ‌నీ షూటింగ్‌ల‌లో బిజీగా వుంటున్నార‌ట‌.  చిల‌క‌లూరి పేట వైసీపీ ఎమ్మెల్యే ర‌జ‌నీ నియోజకవర్గంలో యాక్టివ్‌గా ఉంటారు. అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల విషయంలో స్పెషల్ ఫోకస్ పెడుతుంటారు. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో అప్ర‌మ‌త్త పెంచ‌డానికి త‌న దైన స్టైల్‌లో ఆమె వీడియో తీసి ప్ర‌చారం విస్తృతంగా చేస్తున్నారు.  శ‌నివారం నుండి రంజాన్ నెల ప్రారంభం అవుతుంది. రంజాన్‌ను దృష్టిలో పెట్టుకొని ముస్లింల‌ను ఉద్దేశించి ఆమె ప్ర‌త్యేక సందేశం ఇచ్చారు. క‌రోనా నేప‌థ్యంలో ఇంటి నుంచి ఎవ‌రూ బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని ఈ సంద‌ర్భంగా విజ్ఞ‌ప్తి చేశారు. అంతే కాదు మ‌సీదుల‌కు వెళ్ళ‌వ‌ద్ద‌ని, ఇఫ్తార్ స‌మ‌యంలో గుంపులుగా కూర్చొని తిన‌వ‌ద్దంటూ ముస్లింల‌ను ఎమ్మెల్యే ర‌జ‌నీ కోరారు.  ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క‌రోనా నియంత్ర‌ణ‌కు విశేష‌కృషి చేస్తున్నార‌ని ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అలాగే త‌న నియోజ‌క‌వ‌ర్గ ముస్లింల‌కు రంజాన్ శుభాకాంక్ష‌లు తెలిపారు. అయితే రంజాన్ శుభాకాంక్ష‌లు తెల‌ప‌డానికి ఆమె ప్ర‌త్యేక వీడియో, ఫొటో షూట్ చేశారు. సినిమా న‌టుల్ని త‌ల‌పించేలా షూటింగ్‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టి వీడియోలో క‌నిపించారు. సందేశం ఇచ్చేట‌ప్పుడు టీవీ యాంక‌ర్‌లా న‌టించారు. టీవీలో వార్త‌లు చ‌దివిన‌ట్లు క‌రోనా సందేశం, రంజాన్ సందేశాన్ని నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు వినిపించారు.  ఆ త‌రువాత ఫొటో షూట్‌లో ముస్లిం మ‌హిళ‌లా గెట‌ప్‌లో  క‌నిపించారు. చేతిలో ఓ పుస్త‌‌కం ప‌ట్టుకొని ఫొటో స్టిల్ ఇచ్చారు. ఈ వీడియో, ఫొటోల‌ను త‌న అనుచ‌రుల‌తో సోష‌ల్ మీడియాలో విసృత ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే మేడం ప్ర‌చారం విష‌యంలో ఎక్క‌డా త‌గ్గ‌ర‌ని స్థానికంగా జ‌నం అనుకుంటున్నారు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి నుంచి ఇప్ప‌ట్టి వ‌ర‌కు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం కోసం 10 ల‌క్ష‌ల రూపాయ‌ల కంటే ఎక్కువే ఖ‌ర్చు పెట్టారు ర‌జ‌నీ మేడం.

చర్మంపై దద్దుర్లు ఉన్నా కరోనా సోకినట్లే!

ఇప్ప‌ట్టి వ‌ర‌కు కరోనా లక్షణాల్లో జ్వరం, పొడి దగ్గు, అలసట, శ్లేష్మ దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పి, చలి, వికారం, ముక్కులో ఇబ్బంది, ముక్కు నుంచి నీరు కారడం, విరేచనాలు వంటివి ఉండగా.. తాజాగా మరో లక్షణాన్ని గుర్తించారు డాక్టర్లు. చర్మంపై దద్దుర్లు ఉన్నా కరోనా సోకినట్లేనని చెబుతున్నారు.   ఇటాలియన్‌ స్టడీ ప్రకారం.. కరోనా వైరస్ సోకిన ప్రతి ఐదు మందిలో ఒకరికి చర్మ సంబంధ వ్యాధులు ఉన్నట్లు తేలింది. కరోనా బాధితులకు చర్మం మీద ఎర్రటి దద్దుర్లు వస్తున్నాయని ఆ స్టడీ తెలిపింది. దీనికి సంబంధించి ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉందని డాక్టర్లు అంటున్నారు. ఒకవేళ దద్దుర్లు ఉండి జ్వరం, దగ్గు, నొప్పులు లేకుంటే వారు వైరల్ టెస్ట్‌ చేయించుకుంటే సరిపోతుందని డాక్టర్ మాయా వేదమూర్తి అన్నారు. ఈ వైరస్ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని అపోలో ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్ చెప్పారు.  'ఇటలీలోని కరోనా బాధితుల్లో 20శాతం మందికి దద్దుర్లు ఉన్నాయి. అలాగే ఫిన్‌లాండ్‌, స్పెయిన్‌, అమెరికా, కెనడాలోని డాక్టర్లు సైతం కరోనా బాధితుల్లో ఎర్రటి పాచెస్‌, దురదలు ఉన్నట్లు వెల్లడించారు. ఈ విషయంపై ఇక్కడి కరోనా బాధితుల్లో  పరిశోధనలు జరుగుతున్నాయి.  భారత్‌లో ఇలాంటి కేసులు ఇప్పటివరకు పెద్దగా నమోదుకాలేదు. ఇలాంటి దద్దుర్లు ఎక్కువగా కాలిపైనా, బ్రొటనవేలిపైనా.. ఒక్కొక్కసారి చేతులపైనా వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

సర్పంచ్‌లతో ప్రధాని మోదీ ముచ్చ‌ట!

పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్న సర్పంచ్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా గ్రామస్వరాజ్ పోర్టల్ మొబైల్ ఆప్‌ను ప్రధాని అవిష్కరించారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రజల్లో అవగాహన బాధ్యత గ్రామ పంచాయితీలదేని ఆయనీ సందర్భంగా చెప్పారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలకు ఆహార సదుపాయాలు అందించాలని కోరారు.  కరోనా వైరస్ మనకు ఎన్నో పాఠాలు నేర్పిందని, మనం వెళ్లే దారిలో అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయని గుర్తు చేశారు. ఈ సంక్షోభ సమయంలోనే ఆత్మవిశ్వాసంతో ఉండాలని సూచించారు. పేదలకు ఆహార సదుపాయాలు అందించాలని పిలుపునిచ్చారు. కరోనా నివారణకు స్వీయ నియంత్రణే ముఖ్యమని అన్నారు. ప్రజలు బయటికి రాకుండా కరోనాను కట్టడి చేయాలని చెప్పారు.  మెరుగైన పనితీరు కలిగిన గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రధాని చెప్పారు. గ్రామాలలో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. రహదారులు, విద్యుత్ సౌకర్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. గ్రామాల అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధులు మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు.  లక్షకు పైగా పంచాయతీలు బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానం అయ్యాయని గుర్తు చేశారు. పల్లెల్లో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపరుచుకోవాలని తెలిపారు. అటు ప్రధానితో పలువురు సర్పంచ్‌లు తమ అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకున్నారు.

కరోనా వ్యాక్సిన్ తయారీ రేసులో హైద‌రాబాద్‌!

ప్రపంచ దేశాలను కకావికలం చేస్తున్న కరోనా వైరస్‌కు కట్టడి చేసే వ్యాక్సిన్ రూపకల్పనకు విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి.  చైనా, అమెరికా, ఇజ్రాయెల్, క్యూబా, భార‌‌త‌ శాస్త్రవేత్తలు అహర్నిశలు వ్యాక్సిన్ త‌యారీకి శ్ర‌మిస్తున్నారు. క‌రోనా కట్టడికి వ్యాక్సిన్ కనుగొనే రేసులో భారత్ నుంచి ఆరు ఔషధ సంస్థలు బరిలో ఉన్నాయి. వీటిలో హైదరాబాద్ నుంచే మూడు ఉండటం విశేషం. భారత్ నుంచి కరోనా టీకాల (వ్యాక్సిన్‌) తయారీకి ప్రయత్నిస్తున్న ఆరు ఔషధ సంస్థల్లో మూడు తెలంగాణవే కావడం రాష్ట్రానికి గర్వకారణమని కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రపంచంలో మూడో వంతు వ్యాక్సిన్లు హైదరాబాద్‌లోని ఔషధ సంస్థలే ఉత్పత్తి చేస్తున్నాయని తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారికి విరుగుడు టీకా తయారీలో.. భారత్‌ బయోటెక్‌, ఇండియన్‌ ఇమ్యూలాజికల్స్‌, బయోలాజికల్‌ ఇ, జిడస్ కాడిలా, మైన్‌వాక్స్‌, సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ ఆరు భారతీయ సంస్థలు బరిలో ఉన్నాయని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ట్వీట్ చేశారు.  అమితాబ్‌ కాంత్‌ ప్రస్తావించిన ఈ 6 సంస్థల్లో భారత్‌ బయోటెక్‌, బయోలాజికల్‌ ఇ, ఇండియన్‌ ఇమ్యూలాజికల్స్.. హైదరాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్నాయంటూ కేటీఆర్ రీట్వీట్ చేశారు. ‘భారత్ ఇప్పటికే టీకాల తయారీలో ప్రపంచ స్థాయి కేంద్రంగా (గ్లోబల్ వ్యాక్సిన్ హబ్) ఉంది. భారత్ అతి తక్కువ ధరలకే టీకాను అందుబాటులోకి తీసుకురావాలి, ప్రపంచం నుంచి కరోనాను తరిమికొట్టాలి’ అని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఆకాంక్షించారు.

చిరంజీవిగారు... మా సంసారంలో నిప్పులు పోయవద్దు! పీవీపీ ట్వీట్

ఇంట్లోని మ‌హిళ‌ల‌తో ఇంటి ప‌నులు చేయించ‌కండి అంటూ ‘అర్జున్ రెడ్డి’ డైరెక్ట‌ర్ సందీప్ వంగా మ‌గ‌వారికి ‘బీ ద రియ‌ల్ మేన్‌’ అనే ఛాలెంజ్‌కు స్పంద‌న బాగా వ‌స్తుంది.  ఈ ఛాలెంజ్ ను సెలబ్రిటీలందరూ స్వీకరిస్తూ.. ఇంటిపనులు చేస్తున్న వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.  యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇచ్చిన ఈ ఛాలెంజ్‌ను మెగాస్టార్ చిరంజీవి వావ్.. అనే రేంజ్‌లో చేసి చూపించారు. ఈ వీడియోలో చిరు దోశ వేసిన తీరు ఔరా అనిపించేలా ఉంది. ఇప్పుడిదే వీడియోపై నిర్మాత పీవీపీ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఇలా చేసి మా సంసారంలో నిప్పులు పోయవద్దు అంటూ పీవీపీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.  ‘‘చిరంజీవి గారు, ఏదో ఇంట్లో అంట్లు తోమగలము, గచ్చు కడగగలము కానీ మీరిలా స్టార్ చెఫ్ లా నలభీమ పాకము వండుతుంటే, మా ఆవిడ మెగాస్టారే చేయగలేనిది, మీకేమిటి అంటున్నారు.. మా సంసారంలో నిప్పులు పోయొద్దు రియల్ లైఫ్ మెగాస్టార్‌గారు.. అంటూ పీవీపీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇంట్లోని పనులు చేస్తున్న వీడియోని పోస్ట్ చేసిన చిరంజీవి ఈ ఛాలెంజ్‌కు కేటీఆర్, రజినీకాంత్, మణిరత్నం వంటి దిగ్గజాలను నామినేట్ చేశారు.  'బీ ద రియ‌ల్ మేన్‌' కు టాలీవుడ్ నటుల స్పందన ఇంట్లోని మ‌హిళ‌ల‌తో ఇంటి ప‌నులు చేయించ‌కండి అంటూ మొదలైన ఈ ఆన్ లైన్ చాలెంజ్ లో రాజమౌళి, ఎన్టీఆర్, చిరంజీవి, వెంకటేశ్, కొరటాల శివ తదితరులు పాల్గొన్నారు. మరికొందరు సినీ స్టార్స్, రాజకీయ నాయకులకు దాన్ని పాస్ చేశారు.

అమెరికాలో పెరిగిపోతున్న‌ నిరుద్యోగం! 3.5 కోట్ల ఉద్యోగాలకు ముప్పు?

ప్ర‌స్తుతం అమెరికాలో వేలాదిగా కంపెనీలు మూతపడుతుండడంతో.. లక్షలాది మంది నిరుద్యోగులుగా మారుతున్నారు. ఇప్పటికే 2 కోట్ల మందికి పైగా నిరుద్యోగుల జాబితాలో తమ పేరు నమోదు చేసుకోగా.. తాజాగా మరో 44 లక్షల మంది నిరుద్యోగ భృతి కోసం పేరు నమోదు చేసుకున్నారు. కరోనా విలయం మొదలైన తర్వాత ఇప్పటివరకు సుమారు 2.60 కోట్ల మంది నిరుద్యోగులుగా మారారు. కరోనా వైరస్ కారణంగా అమెరికాలో అన్ని సంస్థలు తీవ్రంగా నష్టపోతున్నాయి. దీంతో అక్కడ 3.5కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ప్రధానంగా హెచ్‌1బీ వీసాపై తాత్కాలికంగా అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కంపెనీలు ఆర్థికంగా కుంగిపోతుండటంతో తమ ఉద్యోగాలు ఉంటాయా? లేదా? అన్న సందేహం భారతీయుల్లో నెలకొంది.

విశాఖ స్థలాలకు ఆ దేవుడే దిక్కు! 100 కోట్లు స్వాహా!

విశాఖపట్నంలో ‘పులివెందుల బృందం’ రెచ్చిపోతోంది. మర్రిపాలెంలో ఓ భూమిపై క‌న్ను ప‌డింది. అంతే యాజ‌మానిని క‌లిసి బేరం పెట్టారు. ఈ భూమి విషయంలో లొసుగులు ఉన్నాయి. వివాదం లేకుండా చేయాలంటే 10 కోట్లు ఇవ్వాలంటూ బేరం పెట్టారు. రూపాయి కూడా ఇవ్వబోమని, అంతా పక్కాగా ఉందని య‌జ‌మాని చెప్పాడు. వంద కోట్ల భూమి ఇది. ఈ ప్రభుత్వం మాది. మీ భూమి కేటాయింపును రద్దు చేయిస్తాం’ అని హెచ్చరించార‌ట‌. అంతే అనుకున్నంత ప‌ని చేశారు. భూ కేటాయింపును రద్దు చేసి, వెంట‌నే ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ రెవెన్యూ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నంలోని మర్రిపాలెంలో జాతీయ రహదారిని ఆనుకొని సర్వే నంబరు 81/3 కొంత స్థలం ఉంది. అందులో కొంత భూమిని ప్రభుత్వం అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ కింద స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత కొంతకాలానికి భూ యజమానులకు ఒక వెసులుబాటు ఇచ్చింది. కావాలనుకుంటే మార్కెట్‌ ధర చెల్లించి భూమి తీసుకోవచ్చునని తెలిపింది. దీంతో ఆ భూమి యజమానులు జోస్యుల సత్యనారాయణదాసు, మరో 14 మంది వారసులు కలిసి భూమిని వెనక్కి ఇస్తే సొమ్ము చెల్లిస్తామని దరఖాస్తు చేసుకున్నారు. ఈ వ్యవహారాన్ని నడపడానికి ఓ వ్యక్తికి వారు జీపీఏ ఇచ్చారు. అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగిన తరువాత 2009లో ఈ కుటుంబానికి 17,135 చదరపు మీటర్ల స్థలాన్ని వెనక్కి ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆ భూమిని వారి నుంచి కాట్రగడ్డ లలితేశ్‌ అనేవ్యక్తి కొనుగోలు చేశారు. లలితేశ్‌. సామాన్యుడేం కాదు. లలితేశ్ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. అమెరికాలో గూగుల్‌ కంపెనీలో కీలకంగా పనిచేసేవారు. ఆయన ప్రధానికి సాంకేతిక సలహాదారుగా కూడా వ్యవహరిస్తున్నారు. కరోనా వైరస్‌ సోకిన వారిపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్రం రూపొందించిన ‘ఆరోగ్య సేతు’ యాప్‌ రూపకల్పనలోనూ లలితేశ్‌ కీలక పాత్ర పోషించారు. క‌డ‌ప బ్యాచ్ డిమాండ్‌ చేసిన మొత్తం ఇవ్వనందుకే రూ.100 కోట్ల విలువైన భూమిని వెనక్కిలాక్కున్నారు. పారిశ్రామికవేత్తలను డబ్బుల కోసం బ్లాక్‌ మెయిల్‌ చేస్తే.. విశాఖపట్నానికి పెట్టుబడిదారులు ఎలా వస్తారు. ప్రధాని సలహదారుడి కె దిక్కు లేదు ఈ రాష్ట్రంలో. పులివెందుల ముఠా విశాఖలో ఆడిన ఆటకు 100 కోట్లు స్వాహా అయ్యాయి. విశాఖ వాసుల్లారా ఇక మీ స్థలాలకు ఆ దేవుడే దిక్కు. ఇక నుంచి లెజెండ్ సినిమా మాదిరే మీ బతుకు.

ప్లాస్మా ట్రీట్మెంట్ కోసం ఏపీ కి ఇంకా అనుమతి రాలేదు

ప్లాస్మా ట్రీట్మెంట్ కోసం ఇంకా అనుమతులు రాలేదని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రం లోని 181 క్లస్టర్లు 103 మండలాల్లో ఉన్నాయనీ, అందులో 56 రెడ్, 47 ఆరెంజ్, 573 మండలాలు గ్రీన్ జోన్ లో ఉన్నాయని చెప్పారు. అత్యధిక కేసులు నాలుగు జిల్లాలో ఉన్నాయని, టెస్టింగ్ కెపాసిటీ గణనీయంగా పెంచామని, ఈరోజు వరకు 48 వేల కోవిడ్ పరీక్షలు నిర్వహించామని, ప్రస్తుతం 9 ల్యాబ్స్ పని చేస్తున్నాయని జవహర్ రెడ్డి పేర్కొన్నారు. 225 ట్రూ నాట్ మిషన్ లు 49 ల్యాబ్స్ ఉన్నాయని, మొత్తం రోజుకు 6980 యాంటీ జెన్ టెస్ట్ లు చేసే సామర్ధ్యం ఉందని పేర్కొన్నారు.  ప్రతి పది లక్షల మందికి 961 పరీక్షలు చేస్తున్నామన్నారు.కర్నూల్ ఆసుపత్రిని కూడా కొవిడ్ ఆసుపత్రిగా మారుస్తున్నారు.  " పేషంట్ మేనేజ్మెంట్ కు ప్రత్యేక అప్లికేషన్ పెట్టాం. ప్రతి హాస్పిటల్ నుండి కంట్రోల్ రూం కి వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశాం. టెలి మేడిసిన్ లో ఇప్పటికి 306 మంది డాక్టర్ లు వాలెంట్రీగా సేవ చేస్తున్నారు . 4,000 పైగా కన్సల్టేషన్ లు జరిపాం. కొత్తగా సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చాం. పిపిఈ లు 3 లక్షల పైగా ఉన్నాయి. 1.4 లక్షల N95 మాస్కులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి వ్యక్తికి మూడు మాస్కుల పంపిణీ చేస్తున్నాం. ఆక్సిజన్ సప్లై పైన దృష్టి పెట్టాం .... ఆక్సిజన్ సప్లై లైన్ లు కొత్తగా వేస్తున్నాం," అని ఆయన వివరించారు. ర్యాపిడ్ కిట్స్ పై నిన్న సాయంత్రం ఐ సి ఎం ఆర్ నుండి పెర్మిషన్ వచ్చిందని, ర్యాపిడ్ టెస్ట్ లో.పాజిటివ్ వస్తే ఆర్సీపీటీఆర్ ద్వారా ఫైనల్ నిర్ధారణ చేస్తున్నామని చెప్పారు. " ర్యాపిడ్ టెస్ట్ కేవలం కమ్యూనిటీ టెస్టింగ్ కోసమే..పూర్తిగా ర్యాపిడ్ కిట్స్ పైనే డిపెండ్ అయ్యి లేము..కరోనా 14 లేదా.. 28 రోజులా అనేది ఇంకా స్పష్టత రాలేదు..కొన్ని కేసులు 14 నుండి 28 రోజుల మధ్యలో కూడా బయటపడుతున్నాయి," అని కూడా జవహర్ రెడ్డి చెప్పారు.

ఫేస్ బుక్ ను జయించిన మోడీ 'ఆరోగ్యసేతు' యాప్

ఏ యాప్ అయినా పాప్యులర్ కావాలంటే ఇండియాలో గుర్తింపు పొందాలి. 130 కోట్ల జనాభా ఉన్న భారత్ లో పాప్యులర్ అయితేనే ఏ యాప్ అయినా టాప్ లెవెల్ కు వెళ్తుంది. ఫేస్ బుక్, వాట్సాప్ తదితర యాప్ లన్నీ ఇండియాలో పాప్యులర్ అయినవే. అయితే, ఈ యాప్ లు అన్నింటినీ భారతీయ యాప్ 'ఆరోగ్యసేతు' అధిగమించింది. ఫేస్ బుక్ యాప్ కు 5 కోట్ల మంది యూజర్లు యాడ్ కావడానికి 19 రోజుల సమయం పట్టింది. అలాంటిది కేవలం 13 రోజుల్లోనే ఆరోగ్యసేతు యాప్ 5 కోట్ల మంది యూజర్లను సొంతం చేసుకుంది. తద్వారా అతి తక్కువ రోజుల్లో 5 కోట్ల మంది యూజర్లను సొంతం చేసుకున్న యాప్ గా ప్రపంచ రికార్డును సృష్టించింది. ఈ నెల 14వ తేదీన ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రస్తంగిస్తూ... ప్రతి ఒక్కరూ ఆరోగ్యసేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా నేపథ్యంలో యాప్ లో ఇచ్చే సూచనల మేరకు అందరూ నడుచుకోవాలని చెప్పారు. దీంతో, అతి తక్కువ సమయంలోనే 5 కోట్ల మంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు.

జనవరి నుంచి జూన్ వరకూ డీ.ఏ. బకాయిల చెల్లింపు ఉండదు

కరోనా పై పోరుకు కేంద్రం నిధులు సమకూర్చుకుంటోంది. ఏ అవకాశాన్ని వదులుకోకుండా నిధులను ఆదా చేస్తున్న కేంద్రం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ పెంపును నిలుపుదల చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జులై 2021 వరకు పెంచిన డీఏ పెంపు నిలుపుదల, అలాగే 2020 జనవరి 1 నుంచి 2021 జూన్ 30 వరకు డీఏ బకాయిల చెల్లింపు కూడా ఉండదు. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న డీఏ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.  గత నెల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ను 17 శాతం నుంచి 21 శాతానికి పెంచుతూ తీసుకున్ననిర్ణయాన్ని కూడా కేంద్రం పునస్సమీక్షించింది. గత నెల పెంచిన 4 శాతం డీఏ పెంపును కూడా కేంద్రం నిలుపుదల చేసింది. ఇది 54 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు,65 లక్షల పెన్షనర్ల పై ప్రభావం చూపుతుంది. కేంద్రం నిర్ణయం ద్వారా 14595 కోట్లు ఆదా అవుతుంది. దేశంలో కరోనా పై పోరు కోసం ఖర్చులు,అదనపు నిధుల కేటాయింపులను కేంద్రం తగ్గిస్తోంది. ఇప్పటికే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని,కేంద్రమంత్రులు, ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత విధించారు. ఓపక్క నిధులు సమకూర్చుకుంటు మరో పక్క ప్రజా సంక్షేమానికి నిధులు ఖర్చు చేస్తున్న కేంద్రం, లాక్‌డౌన్ ప్యాకేజి నిధులను విడతల వారిగా విడుదల చేస్తోంది. 33 కోట్ల మందికి పైగా ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందుతోంది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజి కింద రూ. 31,235 కోట్లు, 20 కోట్ల మహిళా జన్‌ధన్ ఖాతాల్లోకి రూ. 10,025 కోట్లు నిధులు , 2.82 కోట్ల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పెన్షన్ కోసం రూ. 1,405 కోట్లు, పీఎం-కిసాన్ యోజన కింద 8 కోట్ల మంది రైతులకు రూ. 16,146 కోట్లు రూపాయలు, 68,775 కంపెనీల్లో పనిచేసే 10.6 లక్షల ఉద్యోగులకు ఈపీఎఫ్ వాటాగా రూ. 162 కోట్లు నిధులు ఉంది.

పుస్తకాలు, స్టేషనరీ షాపులు, ఎలక్ట్రికల్‌ దుకాణాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు

లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ కాలంలో దేశ ప్రజలకు స్వల్ప ఊరటనిచ్చింది. లాక్‌డౌన్‌ ఆంక్షల నుంచి దేశంలోని అర్బన్‌ ప్రాంతాల్లోని నాన్‌ హాట్‌స్పాట్ ప్రాంతాల్లో పలు మినహాయింపులు ఇచ్చింది. మొబైల్‌ రిచార్జ్‌, సిమెంట్‌, పుస్తకాల షాపులు వంటి వాటికి కేంద్రం లాక్‌డౌన్‌ నుంచి వెసులుబాటు కల్పించింది. హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ఎలాంటి మినహాయింపులు లేవుని తెలిపింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ గురువారం మీడియా సమవేశం ద్వారా వివరాలను వెల్లడించారు. గ్రామీణ ఆర్ఠిక వ్యవస్థను గాడిలో పడేసేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. దేశంలో వైద్య సిబ్బందికి పూర్తి భద్రతను కల్పిస్తామన్నారు. అలాగే దేశ వ్యాప్తంగా నోడల్‌ అధికారులను నియమిస్తామని తెలిపారు. వీటికే మినహాయింపులు..పుస్తకాలు, స్టేషనరీ షాపులు, నిర్మాణ రంగానికి సంబంధించిన మెటిరీయల్‌ షాపులు, మొబైల్‌ రిచార్జ్‌ షాపులు, ఆటా కంపెనీలు, రోడ్ల నిర్మాణాలపై ఆంక్షలు ఎత్తివేత, ఫ్యాన్లు విక్రయించే ఎలక్ట్రికల్‌ దుకాణాలు, సిమెంట్‌ విక్రయాలకు అనుమతి, పిండి మిల్లులకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు ప్రకటించింది.

త్రైమాసిక ఫీజు మాత్రమే వసూలు చేయాలి

స్కూళ్లకి, కాలేజీలకు ఏపీ ప్రభుత్వ ఆదేశాలు ప్రైవేట్ స్కూల్స్, జూనియర్ కాలేజీలకు ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. స్కూల్స్ అడ్మిషన్స్ సమయంలో కేవలం ఒక త్రైమాసిక ఫీజు మాత్రమే తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. గత ఏడాది ఫిక్స్ చేసిన ఫీజుల ఆధారంగానే మొదటి త్రైమాసిక ఫీజుల వసూలు చేయాలని తెలిపింది. ప్రస్తుతం కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా ప్రజలు పలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల వినతి మేరకు స్కూళ్లు, కాలేజీల ఫీజులను చెల్లించేందుకు ఇన్‌స్టాల్మెంట్స్ సదుపాయం కల్పించాలని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. మొదటి త్రైమాసిక ఫీజు రెండు విడతలగా కట్టించుకోవలని సూచన చేసింది. అలాగే రెండు విడతలకు కనీసం 45 రోజుల వ్యవధి ఇవ్వాలని ఏపీ పాఠశాల విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ ఆదేశాలు జారీ చేశాయి.

మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌ ను ప్రారంభించిన రాజ్ నాథ్ సింగ్ 

దేశంలోనే మొట్టమొదటి మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌ను హైదరాబాద్‌ ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఈ ల్యాబ్‌ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, సంతోష్‌ గంగ్వార్‌, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ డీఆర్‌డీవో అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా పరీక్షలతో పాటు వైరస్‌ కల్చర్‌, వ్యాక్సిన్‌ తయారీకోసం ఈ ల్యాబ్‌ను ఉపయోగించనున్నారు. ఐ క్లీన్‌, ఐ సేఫ్‌ సంస్థల సహకారంతో బయో సేఫ్టీ లెవెల్‌-3 ల్యాబ్‌ను డీఆర్‌డీవో తయారు చేసింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని రెండు భారీ కంటైనర్లలో 15 రోజుల్లోనే దీన్ని రూపొందించారు. ఇప్పటి వరకు అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే మొబైల్‌ వైరాలజీ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. భారత్‌లో ఇలాంటి ల్యాబ్‌ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ...కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు గచ్చిబౌలిలో 20 రోజుల్లోనే 1500 పడకలతో టిమ్స్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేంద్రం మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని తెలిపారు. కొవిడ్‌-19 చికిత్స కోసం రాష్ట్రంలో 8 ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

జ‌గ‌న్ బాధితుల‌కు షా ఆశ్ర‌యం!

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మీద చాడీలు విన‌డానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా బాగా ఇష్ట‌ప‌డ‌తార‌ట‌. ఉన్న‌తాధికారులు ఎవ‌రైనా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ బాధితులుంటే వారికి ఉన్న‌త ప‌ద‌వులు ద‌క్క‌డం ఖ‌యం. అయితే అమిత్ షాకు జ‌‌గ‌న్ బాధితుడ‌నే న‌మ్మ‌కం కుద‌రాలి అంతే.  ఈ లెక్క‌లోనే జాస్తి కృష్ణకిషోర్ కూడా వ‌స్తారు. జగన్ వద్దన్న జాస్తి కృష్ణకిషోర్ కు కేంద్రం ఆయ‌న్ను ఆదాయపు పన్ను శాఖ ఛీఫ్ కమిషనర్ పదవి నుంచి ప్రిన్సిపల్ ఛీఫ్ కమిషనర్ గా నియమిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అస‌లు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మీద కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఎందుకు ఇరిటేష‌న్ వుంది. దానికి పెద్ద కార‌ణం వుంద‌ని గ‌తంలోనూ వార్త‌లొచ్చాయి. అమిత్‌షా ఇగోను జ‌గ‌న్ హ‌ర్ట్ చేశార‌ట‌. అది ఎలా అంటే... అప్ప‌ట్లో సీబీఐలో ఉన్న‌తాధికారులు ప‌ర‌స్ప‌రం కేసులు పెట్టుకొని బ‌జార్న ప‌డ్డారు.  ఆ పంచాయితీలో మ‌నీష్ కుమార్ సిన్హా అనే ఐపీఎస్ అధికారి కేంద్ర బిందువుగా మారి కోర్టుకు ఓ కీల‌క లేఖ స‌మ‌ర్పించారు. ఆ తరువాత సుప్రీం ఉత్త‌ర్వుల‌తో అమిత్‌షా త‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన ఆస్తానా ను ప‌క్క‌న పెట్టాల్సి వ‌చ్చింద‌ట‌. కార‌ణం ఏమంటే మ‌నీష్ కుమార్ సిన్హా. అందుకే ఆ అధికారి అంటే అమిత్ షాకు ఇప్ప‌ట్టికీ అయిష్టమే కాదు కోపం.   ఆ అధికారి కేంద్రం నుంచి ఏపీ స‌ర్వీసుకు తిరిగి రాగానే జ‌గ‌న్ ఏకంగా ఇంట‌లిజెన్స్ ఛీఫ్ ప‌ద‌వినిచ్చారు. అదీ అమిత్‌షాకు న‌చ్చ‌లేద‌ట‌. అధికారి మీద వున్నకోపం ఇప్ప‌డు జ‌గ‌న్ మీద  ఇలా ఎఫెక్ట్ చూపుతుంది. ఓ ద‌శ‌లో జ‌గ‌న్‌కు అమిత్‌షా ఈ కార‌ణంతోనే  అపాయింట్మెంట్ కూడా ఇవ్వ‌లేద‌ట‌. అందుకే జ‌గ‌న్ కోరుకున్న డిప్యూటీష‌న్లేమీ ముందుకు క‌ద‌ల‌డం లేదు. పైగా జ‌గ‌న్ లూప్ లైన్‌లో పెట్టిన అధికారుల‌కు అమిత్‌షా భ‌రోసా ద‌క్కుతుంది. మంచి పోస్టులు కూడా ద‌క్కుతున్నా‌యి. జ‌గ‌న్‌కు అస‌లు అర్థం కాని కేర‌క్ట‌ర్ ఏమైనా ఉందీ అంటే అది అమిత్‌షా! అమిత్‌షా ఎప్పుడూ ఓ క‌న్నేసి ఉంటే కేర‌క్ట‌ర్ ఎవ‌రంటే జ‌గ‌న్‌. తెలంగాణ  ఐపిఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర, ఐఏఎస్ శ్రీలక్ష్మి.. వీరిద్దరినీ ఆంధ్రప్రదేశ్‌కు డెప్యుటేషన్‌పై తీసుకురావాలని, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం చాలాకాలం నుంచీ ప్రయత్నిస్తోంది. స్టీఫెన్ రవీంద్రను నిఘా దళపతి చేయాలన్నది జగన్మోహన్‌రెడ్డి కోరిక. గతంలో ఆయనకు రాష్ట్రంలో పనిచేసిన అనుభవం ఉండటం, ముక్కుసూటి అధికారి కావడమే దానికి కారణం.దానికోసం జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాకు చెవినిల్లుకట్టుకుని చెబుతూనే ఉన్నారు. అయినప్పటికీ అవి అమిత్‌షాకు వినిపించడం లేదు.     జగన్ అక్రమ ఆస్తుల కేసులో అరెస్టయి జైలుశిక్ష కూడా అనుభవించిన శ్రీలక్ష్మి  మాత్రం పట్టువదలని విక్రమార్కిణి మాదిరిగా,  ఢిల్లీలో ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. ఆమె హైదరాబాద్‌లో కంటే ఢిల్లీ ఏపీభవన్, తెలంగాణభవన్‌లోనే దర్శనమిస్తుంటారు. ఆమెను ఎలాగైనా ఏపీకి తీసుకురావాలని ఎంపి విజయసాయిరెడ్డి చేయని ప్రయత్నమంటూ లేదు. ఆమెను వెంటపెట్టుకుని హోంమంత్రి, పీఎంఓ కార్యాలయాలకు తీసుకువెళ్లిన ఫొటోలు మీడియాలో కూడా వచ్చాయి. కానీ డిఓపీటీ మాత్రం, వారిద్దరినీ ఏపీకి పంపించేందుకు ఇప్పటివరకూ సుముఖత చూపలేదు.  వారిని ఏపీకి పంపించేందుకు తెలంగాణ సర్కారు సిద్ధంగానే ఉన్నప్పటికీ, కేంద్రం మాత్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం లేదు. జగన్మోహన్‌రెడ్డితో కావలసిన కార్యాలు సాగిస్తున్నప్పటికీ, మోదీ సర్కారు ఈ విషయంలో మాత్రం ‘ఆ ఒక్కటీ తప్ప’ అని మెలికపెడుతోంది. దాదాపు ఏడాది నుంచి ఢిల్లీకి వచ్చినప్పుడల్లా స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మితోపాటు కొత్తగా.. కర్నాటకు చెందిన మరో అధికారి శ్రీవత్సను తీసుకురావాలని కోరుతున్న జగన్మోహన్‌రెడ్డికి, ఢిల్లీలో ఎందుకో వర్కవుట్ కావడం లేదు. కాగల కార్యం నెరవేర్చే గంధర్వుడు ఉన్నా ఎందుకో జగన్మోహన్‌రెడ్డి కోరిక మాత్రం కోరికగానే ఉండిపోయింది. కర్నాటక క్యాడర్‌కు చెందిన శ్రీవత్సను తీసుకువచ్చి, ఆయనకు టీటీడీ ఈఓ పదవి ఇవ్వాలన్న జగనన్న కోరిక కూడా నరేంద్ర భయ్యా నెరవేర్చడం లేదు.

జగన్ ఏపీకా? లేక తాడేపల్లికి ముఖ్యమంత్రా?

నాలుగు పదుల వయసున్న జగన్ నాలుగు అడుగులు కూడా కదల్లేని స్థితిలో ఉన్నారా? అంటూ తెలుగుదేశం పార్టీ విమ‌ర్శ‌లు చేస్తోంది. కరోనా నివారణకు కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో 7 పదుల  వయసున్న ముఖ్యమంత్రులే  స్వయంగా రంగం లోకి దిగి కరోనా నియంత్రణ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటే, నాలుగు పదుల వయసున్న జగన్ మోహన్ రెడ్డి నాలుగు అడుగులు కదల్లేని స్థితి లో ఉన్నారా?   జగన్  ఇంటి నుంచి ఎందుకు బయటకు రావటం లేదు.  ఆయన రాష్ట్ర నికి ముఖ్యమంత్రా లేక తాడేపల్లి కి ముఖ్యమంత్రా? ప్రజలకు ముఖ్యమంత్రా? ప్యాలెస్ కి ముఖ్యమంత్రా?   ఇంట్లో దొంగలు పడితే..ఇంటి ఓనర్ ఇళయరాజా సంగీతం వింటూ పడుకున్నట్లు, రాష్ట్రంలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుంటే జగన్ మాత్రం ఏమీ పట్ట నట్లు ఇంట్లో కూర్చున్నారు.  ముఖ్యమంత్రి కరోనాకి భయపడితే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో లేకపోతే ముఖ్యమంత్రి పదవి ఎందుకు? జగన్మోహన్ రెడ్డికి పబ్జీ గేమ్ పై ఉన్న ఆసక్తి ప్రజల ప్రాణాలపై లేకపోవడం బాధాకరం.  కరోనా నివారణలో వైసీపీ  పని తీరును చూసి జనం తిరగబడతారేమోనని  బయటకు రాలేకపోతున్నారా?  ఇప్పటికే తుగ్లక్ చర్యలకు దాదాపు  55 సార్లు న్యాయస్థానాలు మెట్టికాయలు వేసినందుకు  ప్రజలకు ముఖాన్ని చూపించలేకపోతున్నారా? పేరాసిట్మాల్, బ్లీ చింగ్ పౌడర్ తో పోయేదానికి తనంత మహిమాన్వితుడు బయటకు రావడం దేనికి అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు కరోనాపై ప్రజలను నిత్యం చైతన్యపరుస్తుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎన్నికల కోసం రాజ్యాంగ ఉల్లంఘనలకు వెనకాడం లేదు. కోర్టులు ఆక్షేపిస్తున్నా అదే తోవలో ప్రయాణించాలని చూడటం జగన్ మూర్ఖత్వానికి  నిదర్శనం. కరోనా విపత్తు సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప, పశ్చిమబెంగాల్  ముఖ్యమంత్రి మమత బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి వంటి వారు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ  ప్రజలకు ధైర్యాన్ని నింపుతున్నారు. బాధితులు, వలస కార్మికులు, రైతులు ఇతర వర్గాలవారి కష్టసుఖాలను నేరుగా తెలుసుకుంటూ ప్రభుత్వ యంత్రాగాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.   ఇంతటి ఘోరకలి సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి చలించకపోవడం తన అసమర్ధతను బయట పెడుతుంది.  కరోనా కట్టడి చర్యలను గాలికొదిలేసి రాజకీయ, సామాజిక ప్రత్యర్థులను  హింసించడం ఘోరం.  ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కళ్లు తెరవాలి. స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉన్నా ఒకటే... జగన్ తాడేపల్లిలో తల దాచుకున్నా ఒక్కటే. ప్రజలకు భరోసా నింపాల్సిన జగన్మోహన్ రెడ్డి ఇంటికే పరిమితం అయ్యారు. కాని చంద్రబాబు ప్రతి రోజూ కరోనా నియంత్రణకు పాటించాల్సిన జాగ్రత్తలను మేధావులు, డాక్టర్లతో చర్చించి ప్రజలకు ధైర్యాన్ని నింపుతున్నారు. దేశ, విదేశాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు కేంద్రం, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో  చర్చిస్తున్నారు.  సూచనలు, సలహాలు ఎప్పటికప్పుడు లేఖలు, సామాజిక మాధ్యమాల ద్వారా తెలియ జేస్తూనే ఉన్నారు. కానీ వైకాపా నాయకులు దాన్ని రాజకీయానికి వాడుకోవడం సిగ్గుచేటు.  చంద్రబాబు ప్రజల బాగోగుల కోసం పరితపిస్తుంటే జగన్ మాత్రం ఎన్నికల కోసం రాజ్యాంగ ఉల్లాంఘనలు, కోర్ట్ ధికారానికి దిగటం దౌర్భాగ్యం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు 14 రోజులు క్వారంటైంలో ఉండాలి. అలాంటి నిబంధనలు విజయసాయిరెడ్డి, మంత్రులకు పట్టవా? అంటూ కళా వెంకట్రావ్ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

సూర్యాపేటలో అష్టాచెమ్మ ఆడింది! 31 మందికి అంటించింది..

లాక్‌డౌన్ ప్రభావంతో అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. బోర్ కొట్టడంతో చాలా మంది సంప్రదాయ ఆటలైన అష్టాచెమ్మ, వైకుంఠపాళీ, పులి-మేక, వామనగుండ్లు(ఒనగండ్లు), చెస్‌, క్యారమ్స్‌ లాంటి ఆటలతో కాలాన్ని గడిపేస్తున్నారు. ఓ మహిళ కూడా బోర్ కొట్టడంతో అష్టాచెమ్మ ఆడదామని పక్కింటికి వెళ్లింది. అలా కొన్ని ఇళ్లు తిరిగిందామె. అయితే ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన ఓ వ్యక్తి ద్వారా అప్పటికే ఆమెకు కరోనా సోకింది. అలా.. ఆమె వల్ల పక్కింటి వాళ్లకు.. మొత్తం 31 మందికి కరోనా వ్యాప్తి చెందింది. ఈ ఘటన తెలంగాణలోని సూర్యాపేటలో చోటుచేసుకుంది. దీంతో అధికారులు అందర్నీ క్వారంటైన్ చేశారు. ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. బుధ‌వారం సూర్యాపేటలో తాజాగా మరో మూడు కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో సూర్యాపేట జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 83కు చేరుకుంది.