వంశీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా?
posted on Apr 21, 2020 @ 10:05AM
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ మళ్ళీ వార్తల్లో హాట్ టాపిక్గా మారారు. ఆయన రాజకీయాలకు గుడ్బై చెప్పబోతున్నారంటూ అనుచరులు చెబుతున్నారు. ఎందుకంటే వంశీ ఆశించినట్లు జగన్ పట్టించుకోవడం లేదట. అంతే కాదు అసలు ప్రాధాన్యతే ఇవ్వడం లేదని అనుచరులు చెప్పుకుంటున్నారు. నిజంగానే ముఖ్యమంత్రి జగన్ వంశీని పట్టించుకోవడం లేదా? వంశీ ఎందుకు అసంతృప్తితో వున్నారు.
గన్నవరం నియోజకవర్గంలో ఇంఛార్జి తానే అని.. వంశీకి ముఖ్యమంత్రి ఎలాంటి ప్రాదాన్యత ఇవ్వరని వంశీ కి వ్యతిరేకంగా పోటీ చేసి ఓడిపోయినా యార్లగడ్డ వెంకటరావు పదే పదే ప్రకటించినా.. ముఖ్యమంత్రి జగన్ వారించకపోవటంతో… ఆవేదన చెందిన వంశీ క్రీయాశీలక రాజకీయాలకు గుడ్బై చెబుతున్నారనే ప్రచారం కృష్ణాజిల్లాలో జోరందుకుంది.
అయితే ఈ ప్రచారం వెనుక ఏదో మతలబు ఉంటుందని.. ఈ వయసులోనే ఆయన ఎందుకు గుడ్బై చెబుతారని టిడిపి నేతలు అంటున్నారు. అసలు వంశీ రాజకీయాలకు నిజంగా గుడ్బై చెబుతారా..? పథకం ప్రకారం ఆ విషయాలను లీకులు చేసి ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో అని చూస్తున్నారా.. ఈ విషయంలో మీడియా వల్లభనేనిని సంప్రదిస్తే అలాంటిది ఏమీలేదు అని చెప్పారట.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా రెండు సార్లు విజయం సాధించిన వల్లభనేని ఆ తరువాత చంద్రబాబుతో తెగతెంపులు చేసుకుని ముఖ్యమంత్రి జగన్ను పలు దఫాలు కలిసి ఆయన పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ ఫిరాయింపు చట్టం భయంతో.. టిడిపి ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. చంద్రబాబుపై విమర్శలు చేస్తూ.. జగన్ను పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబు, లోకేష్లపై విమర్శలు చేసి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.ఆయన పలు మీడియా వారికి ఇచ్చిన ఇంటర్యూలలో తెలుగుదేశం నాయకులతో పాటు చంద్రబాబు, లోకేష్లపై చేసిన ఆరోపణలు, విమర్శలు సంచలనం సృష్టించాయి. మీడియా ఇంటర్వ్యూలో హాట్ కామెంట్స్ చేస్తూ వంశీ తన వ్యక్తిగత ప్రతిష్టను మంటగలుపుకున్నారు. కొంత కాలం టీవీ ఇంటర్వ్యూలో ఓ వెలుగు వెలిగినా ప్రస్తుతం చప్పబడ్డారు. అయితే వంశీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారంటూ జిల్లాలో ప్రచారం జరుగుతోంది.
‘కమ్మ వాళ్లు ఏం చేస్తారని జగన్ అనుకుంటాడు. కమ్మోళ్లు ఇట్టా తిప్పితే చాలు అయిపోతాడు’ అంటూ ఇటీవల రాయపాటి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలకు తాజాగా ఎమ్మెల్యే వంశీ రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకోవడానికి ఏమైనా లింక్ వుందా అంటూ ఆంధ్రరాజకీయాల్లో చర్చ మొదలైంది.