ఖద్దరో, ఖాకీనో తేల్చుకోండి.. ఏపీ పోలీసులకు తలంటిన హైకోర్టు
రాష్ట్రంలో పోలీసులు అవలంబిస్తున్న వైఖరిని హైకోర్టు మరోమారు తూర్పారబట్టింది. రాష్ట్రంలో అసలు ‘రూల్ ఆఫ్ లా’ అనేది ఉందా లేదా అని నిగ్గదీసి అడిగింది. పోలీసులు ప్రజా హక్కులను రక్షించేందుకే ఉన్నారు తప్ప, ‘పొలిటికల్ బాస్’ల కు అనుకూలంగా వ్యవహరించేందుకు కాదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బ్యూరోక్రాట్లు, పోలీసు అధికారులు రాజకీయాలు కావాలనుకుంటే యూనిఫారం వదిలేసి వెళ్లొచ్చని, యూనిఫారంలో ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా హక్కులు కాపాడాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది.
"అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి ఒక న్యాయవాది ఇంట్లోకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయనేమైనా కరడు గట్టిన నేరస్థుడా? అంత అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శించారు?’’ అని పోలీసులను కోర్టు నిలదీసింది. ఒక వేళ అయన నేరస్థుడైనా కూడా అలా ఇంట్లోకి జొరబడకూడదని స్పష్టం చేసింది. ఒక లాయర్ కే ఇటువంటి పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుడి హక్కుల పరిరక్షణ ఎలా ఉంటుందో మేము అర్థం చేసుకోగలమని తీవ్రంగా వ్యాఖ్యానించింది. అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, వారి హక్కులను కాపాడాలని హితవు పలికింది. "పోలీసు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే మేము కఠిన చర్యలు తీసేసుకుని. ఒకసారి అధికారులకు వ్యతిరేకంగా ఉత్తర్వులిస్తే ఆ తరువాత మీరే కష్టాల్లో పడతారు. అప్పుడు ఏ నేతా మిమ్మల్ని ఆదుకోవడానికి కూడా రారు’’ అని తీవ్ర హెచ్చరికలు జరీ చేసింది. .
ఇక అసలు విషయం లోకి వెళితే ఆదివారం అర్ధరాత్రి తన భర్త, న్యాయవాది సుభాష్ చంద్రబోస్ ను తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు, ఏలేశ్వరం పోలీసులు ఇంటి తలుపులు పగలగొట్టి దౌర్జన్యంగా, అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నారని, పేర్కొంటూ లాయర్ భార్య వెంకటప్రియదీప్తి హైకోర్టులో సోమవారం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన జస్టిస్ రాకేశ్కుమార్, జస్టిస్ కె.సురేశ్రెడ్డిలతో కూడిన ధర్మాసనం.. సుభాష్ చంద్రబోసును తమ ముందు హాజరు పరచాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని ఆదేశిస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి నిన్న హైకోర్టులో నేరుగా హాజరై కోర్టుకు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ పోలీసులు లాయర్ ఇంటికెళ్లిన సమయంలో చంద్రబోస్ అక్కడి నుండి పారిపోయారని, ప్రస్తుతం ఆయన పోలీసుల అదుపులో లేరని.. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారని, అంతే కాకుండా ఈ ఘటనపై దర్యాప్తు కోసం డీజీపీ నేతృత్వంలో ఒక కమిటీ కూడా ఏర్పాటైందని పేర్కొన్నారు.
ఈ కేసులో పిటిషనర్ తరఫు న్యాయవాది వీవీ సతీశ్ తన వాదనలు వినిపిస్తూ.. లాయర్ చంద్రబోసును పోలీసులు అర్ధరాత్రి తీసుకెళ్లారనే దానికి సాక్ష్యంగా ఉన్న వీడియో క్లిప్పింగ్ను పరిశీలించాలని అభ్యర్థించారు. దీని పై ధర్మాసనం స్పందిస్తూ పోలీసులే బలవంతంగా తీసుకెళ్లారని పిటిషనర్ చెబుతుంటే, ఆయన పారిపోయారని ఎలా చెబుతారని అక్కడే ఉన్న ఎస్పీని ప్రశ్నించింది. ఏదైనా రాజకీయ కారణాలతో మీరు ఇలా చెబుతున్నారా అని కోర్టు అనుమానం వ్యక్తంచేసింది. ఇదే సందర్భంలో బోస్కు ప్రాణహాని ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలపడంతో ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘‘కోర్టులో కేసు పెండింగ్లో ఉండగా ఏ పోలీసు అధికారీ అలాంటి సాహసం చేస్తారని మేమనుకోవడం లేదు. ఒకవేళ అలాంటిదేదైనా జరిగితే దాని పర్యవసానం ఎలా ఉంటుందో కూడా వారికి తెలుసు. అంతే కాకుండా ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా చక్కదిద్దాలో కూడా మాకు తెలుసు’’అని చాలా స్ట్రాంగ్ గా వ్యాఖ్యానించింది.
ఎస్పీ.. మీకు చాలా ఫ్యూచర్ ఉంది.. ఆలోచించుకోండి
ఇదే సందర్భంలో ఎస్పీని ఉద్దేశించి "మీరు డైరెక్ట్ ఎస్పీనా? లేక ప్రమోషన్పై ఎస్పీ అయ్యారా?" అని ధర్మాసనం ప్రశ్నించింది. తాను డైరెక్ట్ ఎస్పీ అని నయీమ్ అస్మి బదులిచ్చారు. "డైరెక్ట్ ఎస్పీ అయిన వారు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారన్న ఆశ ప్రజలకు ఉంటుంది. మీదైన తరహాలో మాత్రమే వ్యవహరించండి. అంతే కాకుండా మీకు మరెంతో కెరీర్ కూడా ఉంది. ప్రజా హక్కులు కాపాడి.ప్రజలకు జవాబుదారీగా ఉండాలి’’ అని సుతిమెత్తగా హితవు పలికింది.
ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని అటు డీజీపీని, ఇటు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని ఆదేశించింది. దీని పై తదుపరి విచారణను హై కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ లోగా లాయర్ బోస్ ను కనుగొంటే వెంటనే ఆయనను హైకోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది.