దళిత యువకుడికి శిరోముండనం.. ఘోరం, అమానుషం: రఘురామకృష్ణంరాజు
posted on Jul 22, 2020 @ 10:32AM
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్లో దళిత యువకుడికి శిరోముండనం ఘటనపై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. దీనిని అమానుష, ఘోరమైన ఘటనగా అభివర్ణించారు. ఈ ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎంను కోరుతున్నానని ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు.
కాగా, సీతానగరం పోలీస్ స్టేషన్ లో దళిత యువకుడు వరప్రసాద్ ని పోలీసులు కొట్టి మీసాలు, జుట్టు కత్తిరించారు. ఇసుక లారీలు అడ్డుకున్నందుకే తనపై ఇలా దాడి చేశారని బాధితుడు తెలిపాడు. ఇసుక లారీలను ఆపిన సమయంలో ముని కూడలి వద్ద వైసీపీ నాయకుడు కవల కృష్ణమూర్తి కారుతో వచ్చి ఢీ కొట్టినట్లు బాధితుడు పేర్కొన్నాడు. దీనిపై ప్రశ్నించినందుకు తిరిగి తనపైనే వైసీపీ నాయకుడి అనుచరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడని బాధితుడు వాపోయాడు. దీంతో పోలీసులు తనపై కేసు నమోదు చేశారని, అనంతరం సీతానగరం పోలీస్ స్టేషన్కు తరలించి తీవ్రంగా కొట్టి శిరోముండనం చేశారని పేర్కొన్నాడు.
మరోవైపు, ఈ కేసులో ట్రైనీ ఎస్సై ఫిరోజ్ షాను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు. ఎస్సై, వైసీపీ నేత కవల కృష్ణమూర్తితో పాటుగా ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ సత్యనారాయణరావు తెలిపారు.