వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి భర్త మృతి
posted on Jul 22, 2020 9:20AM
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె భర్త, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి నాగభూషణరావు మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఎమ్మెల్యే భర్త మరణంతో కుటుంబంతో పాటు పాతపట్నం నియోజకవర్గంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.
నాగభూషణరావు ఐఎఫ్ఎస్ అధికారిగా దేశంలో పలు కీలక బాధ్యతలు చేపట్టారు. గోవా ఫారెస్ట్ కంజర్వేటర్గా, డామన్ డయ్యూ టూరిజం డైరక్టర్ గా, పర్యావరణం, కాలుష్యం, అడవులు, ఇందనవనరుల శాఖలకు సంబంధించిన పలు విభాగాల్లో పని చేశారు. పలువురు కేంద్ర మంత్రుల వద్ద ఓఎస్డీగా కూడా విధులు నిర్వర్తించారు. పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ వద్ద ప్రిన్సిపల్ సెక్రటరీగా చేస్తూ స్వచ్చంద పదవీ విరమణ చేశారు.
ఎమ్మెల్యే రెడ్డి శాంతి భర్త నాగభూషణరావు మృతిపట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రెడ్డిశాంతికి, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.