ఎరువుల కొరత రానివ్వం.. కేంద్రమంత్రి హామి

తెలంగాణ రాష్ట్రానికి కావల్సిన ఎరువులను అందిస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సదానందగౌడ హామి ఇచ్చారు. ఈ మేరకు ఆయనను ఢిల్లీలో కలిసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వానికి ఈ వానాకాలానికి ఇచ్చిన మాటప్రకారం 10.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తప్పకుండా సరఫరా చేస్తాం.. దానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి చెప్పారని నిరంజన్ రెడ్డి మీడియాతో చెప్పారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖా మంత్రి సదానంద గౌడను  కలిసి తెలంగాణకు రావాల్సిన ఎరువులు వెంటనే విడుదల చేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని మంత్రి చెప్పారు. తెలంగాణలో పూర్తి అయిన ప్రాజెక్టుల కారణంగా ఆయకట్టు బాగా పెరిగిందన్న విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించామన్నారు. జులై నెలాఖరు నాటికి రావాల్సిన 1.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందజేస్తామని కేంద్రమంత్రి చెప్పారన్నారు. దేశాన్ని కరోనా  మహమ్మారి ఇబ్బంది పెడుతున్న తరుణంలో వ్యవసాయానికి కరోనా నిబంధనల నుండి మినహాయింపు ఇవ్వడం వల్లనే ఈ రోజు ఆహారధాన్యాలకు కొరత లేదన్నారు.

కోవర్టు ఎవడో కానీ.. ఎర్రి పప్పను చేశాడు

మూడు రాజధానుల బిల్లు పై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాయడం పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. "కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు కోవర్టు అని మళ్లీ స్పష్టమైంది. సొంత పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా చంద్రబాబుకి అనుకూలంగా రాజధాని బిల్లు ఆమోదించవద్దని గవర్నర్ గారికి లేఖ రాశారు. దీనితో పార్టీ అధిష్ఠానం ఆగ్రహానికి కూడా గురయ్యాడు. ఇంకా ఎన్నాళ్లు ఈ ముసుగు కన్నా?" అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అయితే, విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను పలువురు బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు రామ్ కుమార్ యార్లగడ్డ ట్విట్టర్ వేదికగా విజయసాయికి కౌంటర్ ఇచ్చారు. "మా పార్టీలో ఉన్న కోవర్టు ఎవడో కానీ నీకు తప్పుడు సమాచారం ఇచ్చి.. ఎర్రి పప్పను చేశాడు" అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఇవన్నీ తప్పుడు కథనాలు, కేంద్ర పార్టీ సమాధానమిదేనని ఆయన ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు.

విజయసాయిని కలిసినా న్యాయం జరగలేదు.. విషం తాగిన వైసీపీ నాయకురాలు!

వైసీపీ నాయకురాలు, మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జోని కుమారి ఆత్మహత్యాయత్నం చేశారు. సోమవారం ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమె.. మీడియాతో మాట్లాడుతుండగానే విషం తాగేశారు.  తన సమస్యలను పరిష్కరించాలంటూ విజయవాడలో ఆమె మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పెద్దలు తనను మోసం చేశారని ఆరోపించారు. పార్టీని సొంత కుటుంబంలా భావించానని.. అయినా పార్టీలో పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు తనను మోసం చేశారని అన్నారు. ఈ నెల 6వ తేదీన విజయసాయిరెడ్డిని కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్నా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో సీఎం జగన్ ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునే అవకాశం తనకు రాలేదని జోని కుమారి చెప్పారు.  ఇలా మీడియాకు వివరాలు వెల్లడిస్తూనే ఆమె విషం తీసుకున్నారు. వెంటనే ముందున్న టేబుల్ పై తల వాల్చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని.. ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

బే ఆఫ్ బెంగాల్ లో భూగోళ చీలిక.. ఉత్తరాంధ్రపై ప్రభావం

బంగాళ ఖాతం సముద్రగర్భంలో దాగిన భూమి పొర పగులు ఉత్తరాంధ్ర భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ ప్రాంతానికి ఇరువైపుల భూమి పొరలపై వత్తిడి పెరిగినప్పుడు ఈ చీలికరేఖలో వచ్చే చిన్న కదలిక కూడా పెను ప్రమాదానికి కారణం కానుందని పరిశోధనల ఫలితాలు హెచ్చరిస్తున్నాయి. వైజాగ్ తీరప్రాంతం నుంచి వంద కిలోమీటర్ల దూరంలో దాదాపు మూడువందల కిలోమీటర్ల పొడవున ఉన్న భారీ చీలికను పరిశోధకుల బృందం గుర్తించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, ఆయిల్,నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం (యుఒహెచ్) పరిశోధకుల బృందం చేసిన పరిశోధన ఫలితాలను ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారి జర్నల్ ఆఫ్ ఎర్త్ సిస్టమ్ సైన్స్ లో ప్రచురించారు. ఉత్తరాంధ్రలోని విశాఖ సముద్ర తీరప్రాంతానికి వంద కిలోమీటర్ల దూరంలో దాదాపు 300 కిలోమీటర్ల పొడవైన పగులు రేఖ ఉన్నట్లు కనుగొన్నారు. ఈ రేఖ దక్షిణాన ప్రాణహిత-గోదావరి, ఉత్తరాన నాగవాలి-వంషాధర  జోన్ మధ్య తూర్పు వైపున బస్తర్ క్రాటన్ సరిహద్దుగా ఉంది. ఈ ఫ్రాక్చర్ లైన్ కారణంగా సునామీ, భూకంపాలు వంటి ప్రకృతి వైపరిత్యాలు వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకుల అధ్యయనంలో స్పష్టమైంది.  దాదాపు కోటి అరవై లక్షల సంవత్సరాల క్రితం ఈ పగులు ప్రారంభమైందని, 68లక్షల సంవత్సరాల నుంచి మూడు లక్షల సంవత్సరాల క్రితం వరకు కదలికలు ఉండేవన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి కదలికలు లేకపోయినా.. భవిష్యత్ లో ప్రకృతివైపరిత్యాలకు ఈ ఫ్రాక్చర్ లైన్ కారణం కావచ్చు అని పరిశోధనల్లో స్పష్టమైంది.  ఈ ఫ్రాక్చర్ ఉన్న ప్రాంతానికి ఇరువైపుల భౌగోళికంగా ఒత్తిడి పెరిగితే సునామీ, భూకంపంలాంటి భౌగోళిక ప్రమాదాలు భారీస్థాయిలో రావచ్చని, వాటిని నివారించలేమని పరిశోధకులు పేర్కొన్నారు. విశాఖ, చుట్టు పక్కల ప్రాంతాలకు ఈ ముప్పు పొంచి ఉందని పరిశోధకులు తెలిపారు. హైదరాబాద్ యూనవర్సిటీ నుంచి ప్రొఫెసర్ కె.ఎస్. కృష్ణ,డాక్టర్ ఎం ఇస్మాయిల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీకి చెందిన డాక్టర్ కె. శ్రీనివాస్, ఆయిల్,నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి డాక్టర్ డి సాహా, పరిశోధనా బృందం పరిశోధనాంశాలను విశ్లేషించింది. ఇంత పెద్ద చీలిక ఏర్పడడానికి కారణాలు మాత్రం తెలియదు. అయితే లక్షలాది సంవత్సరాల క్రితం ఖండాంతర ఘర్షణ హిమాలయాల ఏర్పాటుకు దారితీసిందని పరిశోధకులు చెబుతారు. ఈ ఘర్షణ ప్రపంచ వాతావరణ పరిస్థితులలో పెద్ద మార్పులకు కారణమైంది. అలాంటి సమయంలోనే భూమి లోపలి పొరల్లో ఇలాంటి చీలికలు ఏర్పడి ఉండవచ్చు.

ఏపీ గవర్నర్ కు మహా చిక్కొచ్చి పడింది

'కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకి కోపం' అన్నట్లుగా ఉంది ప్రస్తుతం ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పరిస్థితి. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపింది. అయితే ఈ బిల్లులను ఆమోదించడం రాజ్యంగ విరుద్ధమని అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ఇప్పటికే గవర్నర్‌ కు లేఖలు రాశాయి. దీంతో గవర్నర్ కు పెద్ద చిక్కొచ్చి పడింది. బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలా అని తర్జన బర్జన పడుతున్నారు. ఆమోదిస్తే బీజేపీకి కోపం, ఆమోదించకపోతే వైసీపీకి కోపం అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ వర్గాలు, గవర్నర్ తీరుపై అసంతృప్తితో ఉన్నాయి. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ ను తొలగిస్తూ పంపిన ఆర్డినెన్స్‌ను, ఆమోదించవద్దని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాసిన లేఖను, గవర్నర్ ఖాతరు చేయకపోవడమే దానికి ప్రధాన కారణం. ఆ సందర్భంలోనే రాష్ట్ర బీజేపీ నాయత్వం, గవర్నర్‌ను మార్చాలని కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు కూడా ప్రచారం జరిగింది. పైగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నారని, తమ పార్టీ కార్యకర్తలపై వైసీపీ నేతల దాడుల గురించి ఫిర్యాదు చేసినా, స్పందించలేదన్న అసంతృప్తి బీజేపీ వర్గాల్లో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ, తమ మనోభావాల ప్రకారం గవర్నర్ వ్యవహరించడం లేదన్న అభిప్రాయం రాష్ట్ర బీజేపీ నాయకుల్లో వ్యక్తమవుతోంది.  ఇప్పుడు వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లుల విషయంలో కూడా గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే.. రాష్ట్ర బీజేపీ నాయత్వం గవర్నర్‌ను మార్చాలని కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చే అవకాశముంది. దీంతో ఈ బిల్లుల విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి నెలకొంది. ఆమోదించి జగన్ సర్కార్ కి సానుకూలంగా ఉన్నానన్న సంకేతాన్ని పంపి బీజేపీ ఆగ్రహానికి గురవుతారా?.. లేక నాకెందుకీ తలనొప్పని రాష్ట్రపతికి నివేదిస్తారా? లేక న్యాయసలహా కోరతారా? అన్నది ఉత్కంఠగా మారింది. నిపుణులు మాత్రం.. రాష్ట్రపతికి పంపించడమే మంచిదని చెబుతున్నారు. చూడాలి మరి గవర్నర్‌ ఏం చేస్తారో?

నీది పచ్చ స్వామి భక్తి.. కన్నా పై విరుచుకు పడ్డ విజయ్ సాయి రెడ్డి

వైసిపి ఎంపీ విజయ్ సాయి రెడ్డి ఎపి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ ను కొంత కాలంగా టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మూడు రాజధానుల బిల్లు పై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ కు కన్నా లేఖ రాయడం పై విజయసాయిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. "కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు కోవర్టు అని మళ్లీ స్పష్టమైంది. సొంత పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా చంద్రబాబుకి అనుకూలంగా రాజధాని బిల్లు ఆమోదించవద్దని గవర్నర్ గారికి లేఖ రాశారు. దీనితో పార్టీ అధిష్ఠానం ఆగ్రహానికి కూడా గురయ్యాడు. ఇంకా ఎన్నాళ్లు ఈ ముసుగు కన్నా?" తాజాగా తన ట్వీట్ లో అయన విమర్శించారు. అంతే కాకుండా "బాబుతో భౌతిక దూరం పాటించాలని రాష్ట్ర బీజేపీకి జాతీయ నాయకత్వం హెచ్చరించినా టీడీపీ లైన్ లోనే లేఖలు రాస్తున్నారు. కరోనా టైంలోనైనా సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే ఎలా కన్నా? బీజేపీ స్టేట్ ఇంచార్జి కూడా రాజధానులు రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం అన్నారుగా కన్నా. ఓహో ఇదంతా నీ పచ్చ స్వామి భక్తినా? " అంటూ ఎంపీ విజయ్ సాయి రెడ్డి కన్నా లక్ష్మి నారాయణ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. అయితే కొద్ది రోజుల క్రితం ఇలాగే విజయ్ సాయి రెడ్డి కన్నా పై తీవ్ర వ్యాఖ్యలు చేయగా అటు ఢిల్లీ నుండి ఇటు ఎపి లో ఉన్న బీజేపీ లీడర్ల వరకు అందరు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అయితే ఎంపీ విజయ్ సాయి రెడ్డి తాజా వ్యాఖ్యల పై బీజేపీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

గవర్నర్‌ తో నిమ్మగడ్డ భేటీ.. ఇంతలోనే మరో ట్విస్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ తో మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సోమవారం ఉదయం భేటీ అయ్యారు. తనను ఎస్‌ఈసీగా పునర్నియామకం చేయాలంటూ గవర్నర్‌కు నిమ్మగడ్డ వినతిపత్రం అందజేశారు.  తనను ఎస్ఈసీగా నియమించకపోవడంపై, ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా నిమ్మగడ్డ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించినా నిమ్మగడ్డను ఎందుకు నియమించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. ఈ సందర్భంగా నిమ్మగడ్డకు కీలక సూచనలు చేసింది. తీర్పును అమలు చేయాలని గవర్నర్‌ ను కలిసి వినతిపత్రం సమర్పించాలని సూచించింది. దీంతో ఈ రోజు ఉదయం గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ అయ్యారు. తనను ఎస్‌ఈసీగా మళ్లీ నియమించాలని వినతిపత్రం అందజేశారు. హైకోర్టు తీర్పు, తదితర అంశాలపై గవర్నర్‌ తో ఆయన దాదాపు గంట సేపు మాట్లాడారు. మరి నిమ్మగడ్డను తిరిగి ఎస్‌ఈసీగా నియమించడంపై గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇదిలా ఉంటే నిమ్మగడ్డ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. హైకోర్టులో దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‍పై  స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‍లో ఉండగా కోర్టు ధిక్కరణ పిటిషన్‍పై హైకోర్టు విచారణ జరపడం సరికాదని ప్రభుత్వం తెలిపింది. హైకోర్టు ఆదేశాలను అమలుచేస్తే సుప్రీంకోర్టులో తాము దాఖలు చేసిన పిటిషన్ నిరర్ధకం అవుతుందని ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇలాంటి సమయంలో కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు ముందుకెళ్లడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‍లో పేర్కొంది. మొత్తానికి ప్రభుత్వ తీరు చూస్తుంటే నిమ్మగడ్డ వ్యవహారానికి ఇప్పట్లో శుభం కార్డ్ వేసేలా లేదు.

ఫ్రీస్కూల్స్ గా అంగన్ వాడీ కేంద్రాలు

తెలంగాణ రాష్ట్రంలోని అంగన్ వాడీ కేంద్రాలను ఫ్రీస్కూల్స్ గా మార్చి ఆంగ్లమాధ్యమంలో బోధన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఆధునిక సౌకర్యాలు అంటుబాటులోకి తీసుకువచ్చి ఆన్ల్ లైన్ పాఠాల ద్వారా చిన్నారులు విద్యాబోధన అందించనున్నారు. పిల్లల మానసిక వికాసం పెంచేలా కథలు, పాటలు వీడియో ల ద్వారా వివరించేలా అంగన్ వాడీ టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో 149 ఐసిడిఎస్ ప్రాజెక్టు ల ద్వారా 35,700 అంగన్ వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇందులో 31,711 మెయిన్ సెంటర్స్ కాగా 3898 మినీ సెంటర్స్ ఉన్నాయి.మొదటిదశలో మెయిన్ సెంటర్స్ లో ఎంపిక చేసిన కొన్ని సెంటర్లను ఫ్రీస్కూల్స్ గా మార్చనున్నారు.  వీటిని తొమ్మిది గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్ విధానం ద్వారా పిల్లలకు పాఠాలు చెప్పాలని రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది.

చైనా అండతో రెచ్చిపోయి కాల్పులు జరిపిన నేపాల్..

భారత్ తో ఎంతో సఖ్యతతో ఉండే మన పొరుగు దేశం నేపాల్ ఈ మధ్య చైనా ప్రోద్బలంతో రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. ఆ దేశ ప్రధాని కెపి శర్మ ఓలి భారత్ ను కవ్వించే విధంగా చేస్తున్న కామెంట్స్ తో అక్కడి అధికార పార్టీలో కూడా విభేదాలు తలెత్తాయి. తాజాగా నేపాల్ ప్రధాని ఓలి రాముడి అయోధ్య యూపీలోని డి కాదని అది నేపాల్ లో ఉందని చేసిన కామెంట్ తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నేపాల్ మరో దుశ్చర్యకు పాల్పడింది. బీహార్‌లోని కిషన్ గంజ్ సరిహద్దుల్లో ఆదివారం నాడు భారత నేపాల్ సరిహద్దులలో పశువులను కాస్తూ వెళ్లిన జీతేంద్ర కుమార్ సింగ్‌తో పాటు మరో ఇద్దరు స్నేహితులపై నేపాల్ పోలీసులు కాల్పులు జరిపారు. భారత నేపాల్ సరిహద్దుల్లోని ఫతేపూర్‌లోని తెహ్రగచ్‌లో ఈ కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. నేపాల్ పోలీసులు జరిపిన ఈ కాల్పుల్లో జీతేంద్ర సింగ్ గాయపడడంతో అతనిని హాస్పిటల్ కు తరలించినట్లు కిషన్ గంజ్ డీఎస్పీ అన్వర్ జావెద్ తెలిపారు. ఐతే కాల్పుల నుంచి మిగిలిన ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారని అయన తెలిపారు. ఈ ఘటన తో స్థానికల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే ఈ ఘటనపై తాము విచారణ చేపట్టామని అలాగే నేపాల్ అధికారవర్గాలతో చర్చలు జరుపుతున్నామని కిషన్ గంజ్ డీఎస్పీ తెలిపారు.

కరోనాతో టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు మృతి

తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధాన అర్చకులుగా రెండు దశాబ్దాల పాటు పనిచేసిన మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు మృతి చెందారు. గత కొద్దీ రోజుల క్రితం దీక్షితులు కరోనా బారిన పడ్డారు. తిరుపతిలోని సిమ్స్ ఆసుపత్రి లో చేరారు. అయితే పరిస్థితి విషమించి ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆయన గత రెండుదశాబ్దాలుగా టీటీడీలో సేవలందించారు. ఇటీవల టీటీడీలో పనిచేస్తున్న వారిలో దాదాపు 150 మందికి కరోనా సోకింది. వారిలో 18 మంది అర్చకులు కూడా ఉన్నారు. కరోనా బారిన పడిన శ్రీనివాసమూర్తి దీక్షితులు నాలుగు రోజుల కిందట చికిత్స కోసం సిమ్స్ లో చేరారు. ఆలయ సంప్రదాయ పద్ధతిలో శ్రీనివాస మూర్తి దీక్షితుల తుది అంతిమ సంస్కారాలు చేయనున్నారు. కరోనా వైరస్ కారణంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులకి ఆయన పార్థివదేహాన్ని అప్పగించే అవకాశం లేదు.

టీటీడీ మాజీ చైర్మన్‌ దేవినేని సీతారామయ్య మృతి

టీటీడీ మాజీ చైర్మన్‌, ప్రముఖ ఆడిటింగ్ సంస్థ బ్రహ్మయ్య అండ్ కో సీనియర్ భాగస్వామి, విజ్ఞాన జ్యోతి వ్యవస్థాపకులు దేవినేని సీతారామ‌య్య (90) మృతి చెందారు. కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సీతారామయ్య సొంతగ్రామం కృష్టాజిల్లాలోని తెన్నేరు. గుంటూరులో సీఏ పూర్తి చేసిన ఆయన1986-89లో  టీటీడీ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆర్‌బీఐ ప్రాంతీయ బోర్డు డైరెక్టర్‌గా సేవలందించారు. విజ్ఞాన జ్యోతి సంస్థ వ్యవస్థాపకుడు, కోశాధికారిగా దేవినేని సీతారామయ్య పనిచేశారు. ఆయనకు ఇద్దరు పిల్లలు. కొడుకు అమెరికాలో డాక్టర్. కుమార్తె హైదరాబాద్ లో ఉంటారు. సీతారామయ్య మృతిపట్ల తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, ఎంపీలు నామా నాగేశ్వరరావు, సుజనాచౌదరి, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీత విచారం వ్యక్తం చేశారు.  సీతారామయ్య ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ‌స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలియజేశారు.

తెలంగాణలో 45 వేలు క్రాస్ చేసిన కరోనా కేసులు.. ఒక చిన్న ఊరట

తెలంగాణలో కొత్తగా నిన్న 1,296 పాజిటివ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 45వేలు దాటాయి. ఐతే నిన్న నమోదైన కేసులలో జీహెచ్ఎంసీలో 557 , వరంగల్ అర్బన్ 117, రంగారెడ్డిలో 111 కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనా తో ఆరుగురు మృత్యు వాత పడ్డారు. దీంతో కరోనా సోకి రాష్ట్ర్రం లో మొత్తం 415 మంది చనిపోయారు. ఆదివారం ఒక్క రోజు 1831 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకూ కరోనా మహమ్మారి నుండి కోలుకుని 32,438 మంది డిశ్చార్జ్ అయ్యారు. నిన్నటి రికార్డుల ప్రకారం కొత్తగా వచ్చిన కేసుల కంటే కోలుకుని ఇంటికి చేరిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రస్తుతానికి ఇది ఒకటే చిన్న ఊరట అని వైద్యులు తెలియ చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,224 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

ఈ-ఆఫీస్ ప్రారంభించిన సీఎస్

పరిపాలన పాదర్శకంగా ఉండేలా ఈ-ఆఫీస్ విధానాన్ని ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు శుక్రవారం బిఆర్కె భవన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆరు శాఖల్లో ఈ ఆఫీస్ విధానాన్ని ప్రారంభించారు. సాధారణ పరిపాలనా శాఖ, వాణిజ్య శాఖ, ప్రధాన కమీషనర్, భూ పరిపాలన, అబ్కారి, మద్యనిషేధ శాఖల్లో ఈ ఆఫీస్ విధానం అందుబాటులోకి వచ్చింది. ఇతర శాఖలు కూడా ఈ ఆఫీస్ విధానంలోకి మారాలని సిఎస్ సూచించారు. ఈ కొత్త విధానం ద్వారా పేపర్ లెస్ ఆఫీస్ తో పాటు పనుల్లో పారదర్శకత సాధ్యమవుతుందని ఆయన అన్నారు. దాదాపు 1600మంది ఉద్యోగులు పనిచేస్తారు. ఎలక్ట్రానిక్ పద్ధతి ద్వారా త్వరగా ఫైళ్లు పరిష్కరించడానికి వీలవుతుందన్నారు. ప్రతి ఫిర్యాదు ఆన్ రికార్డులో అందుబాటులో ఉంటాయని, అధికారుల పనితీరు మరింత సులభం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఆ రెండు బిల్లులను పక్కన పెట్టండి.. గవర్నర్ కు కన్నా లేఖ

ఎలాగైనా మూడు రాజధానుల బిల్లు, సిఆర్డీఏ సవరణ బిల్లులను ఆమోదింపజేసుకోవాలని ఏపీ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తున్న సంగతి తెల్సిందే. దీని కోసం ఆ బిల్లులను గవర్నర్ ఆమోదం కోసం పంపిన విషయం తెలిసిందే. అయితే ఈ బిల్లులు రాజ్యాంగ వ్యతిరేకమని ఎపి విభజన బిల్లుకు కూడా వ్యతిరేకమని ప్రతి పక్షాలు మొత్తుకుంటున్నాయి. తాజాగా ఎపి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఒక లేఖ రాసారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలు ఆమోదించడం లేదని, ప్రభుత్వం పంపిన రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ సవరణ బిల్లులను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆమోదించవద్దని అయన కోరారు. దీనికి కారణాలను వివరిస్తూ.. ఒక పక్క సీఆర్డీయే చట్టం రద్దు బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే, మరో పక్క రాజధాని వికేంద్రీకరణ బిల్లు ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఉందని వివరించారు. ఈ బిల్లులపై ఇటు ప్రజల, అటు రైతుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని అయన గవర్నర్ ను కోరారు. ఈ సందర్బంగా రాజధాని ప్రాంత ప్రజల శాంతియుత నిరసనలను కూడా పరిశీలించాలని అయన ఆ లేఖలో తెలిపారు. ఇపుడు కన్నా రాసిన ఈ లేఖతో ఏపీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే రాష్ట్ర గవర్నర్ ను కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం నియమించడంతో అయన బీజేపీ మాట కాదనే అవకాశం ఉండదు. దీంతో అమరావతి పై బీజేపీ ఆడుతున్న డబుల్ గేమ్ లో ఈ లేఖ ఒక భాగమా లేక ఈ విషయం పై ఆ పార్టీ సీరియస్ గానే ఉందా అనే సంగతి త్వరలోనే తేలుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.

సహాజీవన్ రెడ్డి గారికి నిబంధనలు వర్తించవా?

భారత్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకి కేసులు పెరుగుతుండటంతో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు మాస్కులు పెట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు సూచిస్తున్నాయి. అయితే ఏపీలో మాత్రం సాక్షాత్తూ ముఖ్యమంత్రే నిబంధనలకు గాలికి వదిలేయడంపై టీడీపీ నేత నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించిన లోకేష్.. జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. "వైఎస్ జగన్ గారి పాలనలో సామాన్యులకు మాత్రమే రూల్స్ వర్తిస్తాయా? ప్రజలంతా ఖచ్చితంగా మాస్కు పెట్టుకోవాలి లేకపోతే చర్యలు తప్పవు అంటూ జిఓ తెచ్చిన వారు ఆ నిబంధన పాటించరా? యుశ్రారైకాపా నాయకులు కరోనా కి అతీతులా?" అని లోకేష్ ప్రశ్నించారు. "సహాజీవన్ రెడ్డి గారికి నిబంధనలు వర్తించవా? మాస్కు పెట్టుకోకుండా స్వైర విహారం చేస్తున్న జగన్ రెడ్డి గారు ప్రజలకు ఎం సమాధానం చెబుతారు?" అని లోకేష్ నిలదీశారు.

ఏపీలో ఒక్క రోజే 3963 పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. తాజాగా ఒక్క రోజే 3963 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 44,609 కి చేరింది. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుండి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసులలో సింగిల్ డే హయ్యెస్ట్ రికార్డ్. ఈ రోజు వచ్చిన పాజిటివ్ కేసులలో 993 కేసులు ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే నమోదయ్యాయి. దీని తరువాత స్థానంలో 550 కేసులతో కర్నూల్, 407 కేసులతో పశ్చిమ గోదావరి, 343 కేసులతో చిత్తూరు జిల్లాలు ఉన్నాయి. నిన్న ఒక రోజులోనే 52 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం 22,260 మంది వివిధ హాస్పిటల్స్, క్వారంటైన్ సెంటర్లలో చికిత్స తీసుకుంటున్నారు. అంతేకాక ఇప్పటివరకు 21,763 మందికరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.