కరోనా నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే అనుమతి
posted on Sep 5, 2020 @ 10:12AM
మీడియా పాయింట్ లేదు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే వారికి కరోనా నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరిగా ఉండాలి. కరోనా మహ్మమారి వ్యాప్తి కారణంగా ఈ మేరకు సరికొత్త నిబంధనలను వెల్లడించారు. ఈనెల 7వ తేదీ, సోమవారం నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశల నియమ నిబంధనలను శాసన సభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వివరించారు.
కరోనా నేపథ్యంలో జరుగున్న అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అధికారులు, సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధులు, మంత్రుల పీఎస్లు, పీఏలు తప్పనిసరిగా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ మేరకు కోవిడ్ 19 వైరస్ నిర్ధారణ పరీక్షలను అసెంబ్లీ ఆవరణలో నిర్వహిస్తున్నారు. కొవిడ్ పాజిటివ్ తేలితే అసెంబ్లీ ప్రాంగణంలోకి రావద్దని స్పీకర్ సూచించారు. మాస్కు ఉంటేనే సభలోకి అనుమతిస్తారు. ప్రభుత్వం తరుపున శాసన సభ్యులు, మండలి సభ్యులకు ఆక్సి మీటర్, శానిటైజేర్, మాస్క్ లు ఉన్న కిట్ ఇస్తున్నారు. అసెంబ్లీలోకి వెళ్లే ప్రతి ఎంట్రెన్స్ వద్ద టెంపరేచర్, ఆక్సిజన్ లేవల్ చెక్ చేస్తారు. శరీర ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉండి, జలుబు, దగ్గు వంటి లక్షణాలు లేనివారినే అనుమతి ఉంటుంది.
20రోజుల పాటు
అసెంబ్లీ సమావేశాలు 20రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. అయితే విజిటర్స్ కు అనుమతి లేదు. సభలో సభ్యుల సిట్టింగ్ లోనూ మార్పులు చేశారు. మీడియా పాయింట్ రద్దు చేశారు. ప్రతి పక్షం ఏది మాట్లాడాలన్నా సభలోనే మాట్లాడాలని కోరారు.