జడ్జి రామకృష్ణ సోదరుడిపై హత్యాయత్నం.. టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ

చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై కొందరు దుండగులు ఆదివారం దాడి చేశారు. ఈ ఘటనలో రామచంద్ర తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి పాల్పడింది వైసీపీ వాళ్లేనంటూ టీడీపీ ఆరోపిస్తోంది. అంతేకాదు, ఈ ఘటనపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది.    కొత్తకోటలో రామచంద్ర సరుకులు కొంటుండగా దుండగులు హత్యాయత్నం చేశారు. సూరపవారిపల్లెకు చెందిన కుమార్‌, ఆయన అనుచరులు కలసి తనపై దాడిచేసినట్లు రామచంద్ర తెలిపారు. కొత్తకోట బస్టాండులో పండ్లు కొనుగోలు చేస్తుండగా కర్ణాటక రిజిస్ర్టేషన్‌ కలిగిన కారులో వచ్చిన వారు తనపై దాడిచేశారన్నారు. కాగా, తీవ్రంగా గాయపడిన రామచంద్రను స్థానికులు చికిత్స నిమిత్తం బి.కొత్తకోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మదనపల్లె జిల్లా వైద్యశాలకు పంపారు.   మదనపల్లెలో చికిత్స పొందుతున్న రామచంద్రను టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు పరామర్శించారు.ఈ సందర్భంగా పార్టీ అగ్రనేత కళా వెంకట్రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్దేశపూరిత దాడులకు పాల్పడడం దుర్మార్గమని అన్నారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని మండిపడ్డారు. గత 16 నెలల కాలంలో 152కి పైగా దాడులు జరిగాయని ఆరోపించారు. జడ్జి కుటుంబ సభ్యులనే వేధిస్తుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని కళా వెంకట్రావు ప్రశ్నించారు.   కాగా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయులకు, తమ కుటుంబానికి మధ్య ఇటీవల జరుగుతున్న భూవివాదాలే ఈ దాడికి కారణమని జడ్జి రామకృష్ణ ఆరోపించారు. స్థానిక వైసీపీ నాయకులు తన తమ్ముడిపై హత్యాయత్నానికి పాల్పడ్డారని అన్నారు.   గతంలో జడ్జి రామకృష్ణను రోడ్డుపైకి రాకుండా తహసీల్దార్‌ నిషేధాజ్ఞలు విధించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఫిర్యాదు ఆధారంగా జడ్జి రామకృష్ణ తమ్ముడు రామచంద్రను బి.కొత్తకోట పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం కూడా తెలిసిందే. అయితే, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల ప్రకారమే తనను అధికార పార్టీ నేతలు, అధికారులు అనేక రకాలుగా హింసిస్తున్నారని ఆయన అప్పుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ భూ వివాదానికి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తుండగా కావాలనే ఈ కేసులో మహిళలను రప్పించి అక్రమంగా కేసులు బనాయించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని జడ్జి రామకృష్ణ ఆరోపించారు.    ఇప్పుడు ఏకంగా జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై హత్యాయత్నం జరగడం కలకలం రేపుతోంది. అధికార పార్టీ తప్పుల్ని ప్రశ్నిస్తే ఇలా అక్రమ కేసులు పెట్టడం, హత్యాయత్నం చేయడం వంటివి చేస్తారా అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కీలక పదవిలో ఉండి కుల రాజకీయాలా! విజయ.. ఛీయి

గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు.. మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు.. పసలేని వాడు ప్రాంతం ఊసెత్తుతాడు.. జనులంతా ఒక కుటుంబం.. జగమంతా ఒక నిలయం. కులాలపై కవి గుర్రం జాషువా ఎప్పుడో చెప్పిన మాటలివి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ నేతలకు ఇది అచ్చి గుద్దినట్లు సరిపోతోంది. విజ్ఞత లేనివాళ్లు..ఎటువంటి సంస్కారం లేని వాళ్లే కులం గురించి మాట్లాడుతుంటారు. ఆ కోవలో వచ్చేవారే  వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఉన్నత చదువున్నా సంస్కారం లేనివాడుగా వ్యవహరిస్తున్నాడు. విజయసాయి బాటలోనే ఇతర వైసీపీ నేతలు నోరు తెరిస్తే కులాల కుంపటి రాజేస్తున్నారు.  ఓ కులాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. కుల జడ్జీలు, కుల నాయకులు, కుల మీడియా అంటూ విద్వేష ప్రకటనలు చేస్తున్నారు. ఓ వర్గాన్ని రెచ్చగొడుతూ వైసీపీ రాజకీయం చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదేనా నేతలకున్న సంస్కారం.. మనం ముందుకు వెళుతున్నా లేక వెనక్కి వెళుతున్నామా అన్న ఆందోళన జనాల్లో వ్యక్తమవుతోంది.     కులాలు, మతాలను రాజకీయాలకు, సొంత ప్రయోజనాలకు ఆపాదించడం ఎంత మాత్రం సమంజసం కాదన్నది ఒక ప్రాథమిక సూత్రం. అయితే  వైసీపీ నేతలు ఆ విజ్ఞతను మర్చిపోయి ప్రవరిస్తున్నారు. ప్రపంచం మొత్తం కరోనాతో అల్లాడుతుంటే.. ఏపీలో  మాత్రం వైసీపీ నేతలు కులాల కుంపటి రాజేస్తున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా తన తీరు మార్చుకోవడం లేదు విజయసాయి రెడ్డి. ఒక వర్గం నేతలే టార్గెట్ గా ఆయన అభ్యంతరకర ప్రకటనలు చేస్తున్నారు.  తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొత్త నియమితులైన దగ్గుబాటి పురంధేశ్వరని టార్గెట్ చేశారు విజయసాయి రెడ్డి. ఆమె జాతీయ నాయకురాలో, జాతి నాయకురాలో పూర్తిగా స్పష్టమైందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని, ప్రభుత్వ పనితీరు అంశాలపై  ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలపై స్పందించిన విజయసాయి.. జాతి పేరుతో ప్రకటన చేయడం దుమారం రేపుతోంది.    రాజధాని అమరావతి విషయంలోనూ విజయసాయి రెడ్డి ఎప్పుడూ కుల ప్రస్తావనే తెస్తారు. కమ్మని రాజధాని అంటూ ఓ కులానికి అంటగట్టే ప్రయత్నం చేశారు. తన జాతి కోసమే చంద్రబాబు రాజధాని నిర్మిస్తున్నారనే నీచమైన కామెంట్లు చేశారు. ‘కమ్మని’ అంటూ విజయసాయి రెడ్డి పరోక్షంగా కులాన్ని ప్రస్తావించడాన్ని  చాలామంది తప్పుపట్టారు. గతంలోనూ చాలా సార్లు ఆయన విపక్ష నేతలపై కులం పేరుతో కామెంట్లు చేశారు. దేశంలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరైన చంద్రబాబుపై  కులం పేరుతోనే కామెంట్స్ చేస్తారు. అంతేకాదు చంద్రబాబు సమర్ధించేవారికి కూడా జాతి, కులం అంటగడుతూ ట్వీట్లు, ప్రకటనలు చేస్తుంటారు విజయసాయి రెడ్డి.    హైకోర్టు జడ్జీలతో పాటు సుప్రీంకోర్టు జడ్జీలపైనా  తీవ్రమైన ఆరోపణలు చేశారు విజయసాయి రెడ్డి. కులం, జాతీ పేరుతో  వివిధ రూపాల్లో జడ్జీలపై ఆరోపణలు చేశారు. పార్లమెంట్ లోనూ న్యాయ వ్యవస్థపై విమర్శలు చేశారు వైసీపీ ఎంపీలు. ఏపీ హైకోర్టు జడ్జీలను ఉద్దేశిస్తూ రాజ్యసభలో అభ్యంతరకర పదాలు వాడారు విజయసాయి రెడ్డి. ఏపీ హైకోర్టు జడ్జీలపై జాతి  పేరుతో విజయసాయి రెడ్డి గతంలో పలుసార్లు ట్వీట్లు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేతగా కీలక పదవిలో ఉన్న  విజయసాయి రెడ్డి.. అధికారంలో ఉన్న పార్టీలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి .. ప్రతి దానికి కులం అని మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి .. ప్రతి దానికి కులం అని మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జాతి పేరుతో చీప్ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.                 కరోనా ప్రభావంతో ఏపీలో స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు ఎలక్షన్ చీఫ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.  అయితే  ఏపీ ప్రభుత్వం ఈసీ నిర్ణయాన్ని తప్పుపట్టింది.  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తన కులానికి చెందిన చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విజయసాయి రెడ్డి  అరోపణలు చేశారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ” ఉల్లిపాయ” అంటూ వ్యాఖ్యలు చేశారు విజయసాయి రెడ్డి. అప్పుడు కాపు కులానికి సంబంధించిన చాలా మంది ఆ వ్యాఖ్య వెనక పాతకాలం నాటి ముతక సామెత ని ప్రస్తావించే ఒక దురుద్దేశం ఉందంటూ విజయసాయిరెడ్డి మీద మండిపడ్డారు.    విజయసాయిరెడ్డి కామెంట్స్ అత్యంత అభ్యంతరకరమని బీజేపీ నేతలు కౌంటరిచ్చారు. ఈ రకమైన కామెంట్స్ తో ఆ పార్టీ నాయకుల మనస్తత్వం  రాష్ట్ర ప్రజలకు మరోసారి తెలిసిందని చెబుతున్నారు. గుణం లేనివాడు కులం గొడుగు పడతాడన్న గుఱ్ఱం జాషువా గారి మాటలకు ఇది ప్రత్యక్ష నిదర్శనమంటున్నారు బీజేపీ నేతలు. పురేంధేశ్వరకి కీలక పదవి రావడాన్ని జీర్ణించుకోలేకే విజయసాయి రెడ్డి దిగజారే ప్రకటన చేస్తున్నారని  మండిపడుతున్నారు. పురందేశ్వరికి విజయసాయిరెడ్డి  బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలుగింటి ఆడపడుచుకి అధికారంలో వున్న జాతీయ పార్టీ జాతీయస్థాయిలో అత్యంత కీలకమైన బాధ్యతలు ఇస్తే అభినందించాల్సింది పోయి.. ఆమెకు జాతిని అంటగడుతూ కామెంట్స్ చేయడమేంటనీ ఏపీ ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది. రాజకీయంగా ఎన్ని వైరుధ్యాలున్నా.. తెలుగు జాతి ఆడపడుచు, జాతీయ పార్టీలో ఉన్నత స్థానం సంపాదిస్తే అభినందించాల్సింది పోయి..  ఇలా అమరావతికి, కులానికి లింక్ పెట్టి మాట్లాడటానికి సిగ్గు ఉండాలని ఏపీ ప్రజలు మండిపడుతున్నారు.    కుల, మతాల కతీతంగా పని చేస్తామని ప్రజా ప్రతినిధులు ప్రమాణం చేస్తారు. రాజ్యసభలోనూ రాజ్యాంగ స్పూర్తిని కాపాడుతానని విజయసాయి రెడ్డి ప్రమాణం చేశారు. అయితే రాజ్యాంగ ఆశయాలకు  విరుద్ధంగా విజయసాయి రెడ్డి వ్యవహరిస్తున్నారు. అతను ప్రమాణంలో చెప్పిందేమిటి.. ఇప్పుడు చేస్తున్నదేంటీని ప్రజలు నిలదీస్తున్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి.. కుల, తమ విధ్వేషాలు రేగేలా విద్వేష ప్రకటనలు చేస్తున్నా.. చర్య తీసుకునే అవకాశం లేదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మన దేశ రాజ్యాంగ స్పూర్తికి భంగం కలిగిస్తున్నా,, చూస్తూ భరించాల్సిందేనా అని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజ్యసభలో కూర్చుంటూ సిగ్గు లేకుండా కులాల గురించి మాట్లాడే విజయసాయికి .. రాజ్యసభలో కూర్చునే అర్హత లేదని స్పష్టం చేస్తున్నారు.    మరోవైపు కుట్ర పూరితంగానే వైసీపీ నేతలు కులాల కుంపట్లు రాజేస్తున్నారనే ఆరోపణలు చే వస్తున్నాయి. కొందరిని , ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తూ ప్రకటనలు చేస్తున్న వైసీపీ నేతలను సీఎం జగన్ ఎందుకు కంట్రోల్ చేయడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి. పార్టీ నేతలను వారించడం లేదంటే ఆయన అంగీకారంతోనే నేతలు మాట్లాడినట్లు భావించాల్సి వస్తుందని కొందరు చెబుతున్నారు.

జగన్ రెడ్డి ఎవడి ఇంట్లో ఉంటున్నారో చెప్పే దమ్మూ, ధైర్యం నీకు ఉందా.. సజ్జలకు బుద్దా స్ట్రాంగ్ కౌ?

ఏపీలో గతేడాది కృష్ణా నదికి వరదలు వచ్చినపుడు ప్రకాశం బ్యారేజ్ నుండి నీటిని కిందికి వదలకుండా చంద్రబాబు ఇంటిని ముంచేందుకు.. అలాగే అమరావతిని ముంపు ప్రాంతంగా ప్రపంచం మొత్తానికి చూపేందుకు జగన్ సర్కార్ ప్రయత్నిస్తోందని అప్పట్లో ప్రతిపక్షం ఆరోపించిన సంగతి తెల్సిందే. తాజాగా కృష్ణా నదికి మళ్ళీ వరద ఉధృతి పెరుగుతున్న నేపధ్యంలో తాజాగా బాబు నివాసం ఉంటున్న అద్దె ఇంటికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బాబును ఉద్దేశించి.. చట్టాన్ని గౌరవించాలని, ఉండవల్లిలో అక్రమంగా కట్టిన గెస్ట్‌హౌస్‌ను ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా "చంద్రబాబు గారూ కృష్ణానదికి వరద వస్తోంది. ఇకనైనా మీరు చట్టాన్ని గౌరవించి ఉండవల్లిలో అక్రమంగా కట్టిన గెస్ట్‌హౌస్‌ను ఖాళీ చేయండి. కోర్టుల ద్వారా మీరు రక్షణ పొందినా, ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని చూసినా, పైనుంచి వచ్చిన వరద మీ ఇంటిని ముంచివేయక మానదుకదా?" అంటూ ట్వీట్ చేసారు.   తాజాగా సజ్జల వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. "అయ్యా సజ్జల రెడ్డి.. చంద్రబాబు గారు అద్దె ఇంట్లో ఉంటున్నారు. జగన్ రెడ్డి ఎవడి ఇంట్లో ఉంటున్నారో చెప్పే దమ్మూ, ధైర్యం నీకు ఉందా? ముందు దొంగ సొమ్ముతో కట్టిన రాజ భవంతులు పేదలకు పంచి, ఆ తరువాత ఇతరులను విమర్శించండి" అని బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు. అంతేకాకుండా "అవినీతి బురదలో ఉన్న సజ్జల.. వరద గురించి మాట్లాడటం హాస్యాస్పదం. అవినీతి కట్టలతో కోటలు నిర్మించే వైఎస్ జగన్ మోచేతి నీళ్లు తాగే సజ్జల గారు చంద్రబాబు గారి అద్దె ఇంటి కోసం ఆందోళన చెందటం వింతగా ఉంది" అంటూ బుద్ధా వెంకన్న తన తాజా ట్వీట్ లో తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.

కేరళలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా.. ఒక్క వారంలోనే 40 వేల కొత్త కేసులు 

భారత్ లో మొట్టమొదటి కరోనా కేసు కేరళలోనే నమోదైన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తోలి రోజుల్లో పాజిటివ్ కేసులు అధికంగానే నమోదైనా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగా వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా కట్టడి చేసింది. అయితే తాజాగా కేరళలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే 40 వేల కొత్త పాజిటివ్ కేసులు వచ్చాయి. కేరళ లో ముఖ్యమైన పండగ ఓనమ్ సందర్భంగా నిబంధనలను సడలించడం తో పాటు దేవాలయాలను తెరవడం వంటి కారణాలు, మరో పక్క ప్రజలు కొవిడ్ నిబంధనలను పాటించకపోవడం కేసుల పెరుగుదలకు కారణమని ప్రభుత్వ వైద్య వర్గాలు తెలిపాయి.   దీంతో వచ్చే నెలలో కేరళలో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రి కేకే శైలజ తాజాగా హెచ్చరించారు. దేశవ్యాప్తంగా టెస్ట్ పాజిటివ్ రేటు సగటున 8 శాతం ఉండగా, కేరళలో మాత్రం 11.9 శాతంగా ఉందని ఆమె గుర్తు చేశారు. కరోనా వైరస్ వచ్చిన మొట్టమొదటి రోజు నుండి మరణాల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, తాము తీసుకున్న చర్యలతోనే రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య ఒక శాతం కన్నా తక్కువగా ఉందని ఆమె అన్నారు. అయితే రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉంటుందని ముందుగానే అంచనా వేశామని ఆమె తెలిపారు. కరోనా వైరస్ ను తక్కువగా అంచనా వేయకుండా రాష్ట్ర ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, జన సమ్మర్థం ఉన్న ప్రాంతాలకు వెళ్లవద్దని మంత్రి శైలజ సూచించారు. రాష్ట్రంలో ప్రతి చదరపు కిలోమీటర్ కు 860 మంది ప్రజలు నివాసం ఉంటున్నారని, అందులో కూడా 15 శాతం మంది 60 ఏళ్లకు పైబడిన వారు కావడంతోనే కేసుల సంఖ్య పెరుగుతోందని ఆమె అన్నారు. అంతేకాకుండా కొంతమంది బాధ్యత రాహిత్యంతో వ్యవహరిస్తున్నారని, దీనిపై ప్రజలు కనుక సహకరించకపోతే మరోసారి లాక్ డౌన్ విధిస్తామని ఆమె ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఐక్యతే అసలు టార్గెట్! మణిక్కమ్‌ మేజిక్ చేసేనా? 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్‌చార్జి మణిక్కమ్‌ ఠాగూర్‌ తన మార్క్ చూపిస్తున్నారు. హైదరాబాద్ వచ్చిన ఠాగూర్ రాష్ట్ర పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయి పోరాటాలు, ఉద్యమాలతో నిరంతరం జనం మధ్యనే ఉండాలంటూ దిశా నిర్దేశం చేశారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ లో అసలు సమస్య నేతల మధ్య విభేదాలే. వర్గపోరుతోనే పార్టీ తీవ్రంగా నష్టపోతోంది. అన్ని జిల్లాల్లోనూ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. మాణిక్కమ్ ఠాగూర్ కి ఇది ఇప్పుడు అసలు సమస్యగా మారింది.    మణిక్కమ్‌ ఠాగూర్ కు స్వాగతం చెప్పే క్రమంలోనూ శంషాబాద్ ఎయిర్ పోర్టు కాంగ్రెస్ వర్గ పోరు బయటపడింది. రాష్ట్ర నేతలు ఎవరికి వారే బల ప్రదర్శనకు దిగారు. తమ అనుచరులను భారీగా తీసుకొచ్చారు. దీంతో వచ్చిన కార్యకర్తలు తమ నాయకుడికి జై కొడుతూ హడావుడి చేశారు. ఇక ఠాగూర్ ను రిసీవ్ చేసుకునేందుకు నేతలు పోటీ పడటంతో ఎయిర్ పోర్టు దగ్గర స్వల్ప తొక్కిసలాట కూడా జరిగింది. కాంగ్రెస్ నేతల తీరుపై మాణిక్కమ్ ఠాగూర్ అసహనం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర పార్టీని ఆయన ఎలా గాడిలో పెడతారన్నది చర్చగా మారింది.   పార్టీ తనను తెలంగాణ ఇంచార్జ్ గా నియమించినప్పటి నుంచే మాణిక్కమ్ తన పని మెదలు పెట్టినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతూనే రాష్ట్ర నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడినట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో చేపట్టబోయే కార్యక్రమాలపైనా ముఖ్య నేతలతో చర్చించారట. త్వరలో జరగనున్న దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతో పాటు రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ఠాగూర్ సవాల్ గా తీసుకున్నారని గాంధీభవన్ వర్గాల సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల కోసం మాణిక్కమ్ వ్యూహరచన సిద్ధం చేశారని చెబుతున్నారు. అందుకే హైదరాబాద్ వచ్చిన వెంటనే ఆయన దుబ్బాక ఉప ఎన్నిక, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ, ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్ల ఎన్నికలపై నేతలతో చర్చించారు. ఎన్నికలు జరిగే జిల్లాల నేతలతో ప్రత్యేకంగా మాట్లాడారు. దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారానికి నేతలంతా వెళ్లాలని ఆదేశించారట మాణిక్కమ్. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి.. ఓడిపోయిన అభ్యర్థులతోనూ సమావేశమయ్యారు. ఏఐసీసీ తలపెట్టిన కార్యక్రమాల నిర్వహణ, పార్టీ సభ్యత్వ నమోదుపై చర్చించారు.     గాంధీభవన్‌లో టీపీసీసీ కోర్‌ కమిటీతో సమావేశమైన మాణిక్కమ్.. తన స్టాండ్ క్లియర్ గా చెప్పేశారట. అందరూ క్రమశిక్షణతో ఐకమత్యంగా పనిచేస్తేనే రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పారట. సోనియాగాంధీ త్యాగం వల్లనే తెలంగాణ ఏర్పాటైందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు ఠాగూర్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చి సోనియాకు బహుమతిగా ఇవ్వడమే మన లక్ష్యమని దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది. అయితే మాణిక్కమ్ ఠాగూర్ చర్యలతో కాంగ్రెస్ లో వర్గ పోరు ఎంతవరకు సమసి పోతుందో ఇప్పుడే చెప్పలేం. నేతలంతా విభేదాలు పక్కన పెట్టి పని చేస్తే తప్ప పార్టీకి రాష్ట్రంలో మంచి రోజులు రావని కాంగ్రెస్ కార్యకర్తలు ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. సో.. రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఏకతాటి పైకి తీసుకురావడంలో మణిక్కమ్ ఠాగూర్ ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి మరీ.

జవాన్లను బలితీసుకుంటున్న కరోనా

ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరిలో భయబ్రాంతులను సృష్టించి లక్షలాది మంది ప్రాణాలను హరిస్తున్న కరోనా కేంద్ర పోలీస్ బలగాలపై పంజా విసురుతుంది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని పోలీసు బలగాలైన సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, ఎస్ఎస్‌బీ, ఐటీబీపీ, ఎన్‌ఎస్‌జీ, సీఐఎస్ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్‌లోని  సిబ్బందికి కరోనా సోకింది. ఇప్పటికే దాదాపు 36 వేల మందికి ఈ మహమ్మారి బారిన పడగా వారిలో 128మంది మరణించారు. ఇంకా ఆరువేలకు పైగా పాజిటివ్ కేసులు ఉన్నాయి. అయితే ఈ వైరస్ బారినపడిన వారిలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దులలో విధులు నిర్వర్తించే  బీఎస్ఎఫ్ సిబ్బందే ఎక్కువగా ఉన్నారు. సీఆర్‌పీఎఫ్‌లో 10,602 మంది, సీఐఎస్ఎఫ్‌లో 6,466 మంది, ఎన్‌డీఆర్ఎఫ్‌లో 514 మంది, ఐటీబీపీలో 3,845 మంది, ఎస్ఎస్‌బీలో 3,684 మంది, ఎన్ఎస్‌జీలో 250 మందికి  కరోనా సోకింది. ఈ వైరస్ కారణంగా సీఆర్‌పీఎఫ్‌లో 52 మంది, బీఎస్ఎఫ్‌లో 29 మంది, సీఐఎస్ఎఫ్‌లో 28 మంది మరణించారు. కరోనా సోకిన వారందరికీ సైనిక వైద్యఆరోగ్య కేంద్రాల్లో చికిత్స అందిస్తున్నారు. కరోనా కట్టడికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని అయినా వందలాది మంది వైరస్ బారిన పడుతున్నారని అధికారులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

తిరుమలలో పెరుగుతున్న రద్దీ

నిన్న ఒక్కరోజే హుండీ కలెక్షన్ 2.34కోట్లు   కరోనా కారణంగా స్తంభించిపోయిన ప్రజాజీవనం మెల్లమెల్లగా కరోనాతో సహవాసానికి అలవాటు పడుతుంది. లాక్ డౌన్ లతో ఇంటికే పరిమితమైనా కరోనా మహ్మమారి విజృంభన ఏ మాత్రం తగ్గకపోవడంతో క్రమంక్రమంగా లాక్ డౌన్ ఎత్తివేస్తూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. నెలల తరబడి మూతపడిన ఆలయాలు తెరుచుకోవడంతో సందర్శకుల సంఖ్యనానాటికీ పెరుగుతుంది. కరోనా నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు.  దాంతో తిరుమల తిరుపతిలో భక్తుల సంఖ్యతో పాటు హుండీ ఆదాయంక్రమంగా పెరిగింది. ఆదివారం ఒకరోజే 12వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 2.34కోట్ల రూపాయలు వచ్చింది. ఇందులో భాగంగా తిరుమల తిరుపతిలో భక్తుల సంఖ్యతో పాటు హుండీ ఆదాయంక్రమంగా పెరిగింది. లాక్ డౌన్ తర్వాత ఫస్ట్ టైమ్ ఇంత ఆదాయం వచ్చినట్లుగా టిటిడి అధికారులు వెల్లడించారు. అక్టోబర్ నెలలో దర్శనం టికెట్లను ఆన్లైన్ లో విడుదల చేయగా, ఇప్పటికే అన్ని అయిపోయాయి.   లాక్ డౌన్ ఎత్తి వేసిన తర్వాత రవాణా సదుపాయాలు ఎక్కువగా లేకపోవడంతో భక్తుల సంఖ్య బాగా తగ్గింది. చాలావరకు సొంత వాహనాల్లో వచ్చేవారు మాత్రమే ఏడుకొండస్వామిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం భారీగా పడిపోయి 50లక్షలు మించలేదు. ప్రసుత్తం రవాణా సదుపాయాలు పెరగడంతో అక్టోబర్ లో స్వామివారి దర్శనం కోసం ఆన్ లైన్ లో టిక్కెట్లు తీసుకున్నవారి సంఖ్య పెరిగింది. తిరిగి పూర్వవైభవాన్ని సంతరించుకుంటుంది అన్న ఆశాభావాన్ని టిటిడి అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి వెల్లంపల్లికి కరోనా పాజిటివ్.. తిరుమలలో సీఎం వెంటే ఉన్న మంత్రి

ఏపీలో కరోనా వ్యాప్తి విఐపిలను కలవరానికి గురి చేస్తోంది. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కరోనా సోకింది. కొద్ది రోజుల క్రితం తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కరోనాకు చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. తాజాగా ఈ వైరస్ ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను కూడా తాకింది. రెండు రోజులుగా క‌రోనా ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగా క‌నిపించడంతో ఆయ‌న ప‌రీక్ష‌లు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయ‌న ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు.   ఇటీవ‌ల తిరుమ‌లలో జరిగిన బ్ర‌హ్మోత్స‌వాల సందర్భంగా మంత్రి వెల్లంపల్లి వారం రోజులు పాటు తిరుమ‌ల‌లోనే ఉన్నారు. అలాగే స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించే దగ్గర నుండి కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి పాల్గొన్న కార్యక్రమంతో పాటు.. చివరకు హైదరాబాద్ కు బయలుదేరేవరకు అయన సీఎం జగన్ తోనే వున్నారు. దీంతో సీఎం ఆరోగ్యం ప‌ట్ల పార్టీ శ్రేణుల్లో ఆందోళ‌న మొద‌లైంది. తాజాగా ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలడంతో సీఎం జగన్ ఆరోగ్యంపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

బాలు కోసం వెంకయ్య హోమం.. అందుకే ప్రకటన ఆలస్యం?

బహుభాషా గాయకుడు, గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం అందరినీ తీవ్ర విషాదంలో ముంచెత్తింది. తన గానంతో కోట్లాది మంది సంగీత ప్రియుల్ని వీనుల విందు చేసిన సంగీత యోధుడి మరణం యావత్‌ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఎస్పీ బాలు ఇక లేరన్న వార్తతో భారతీయ చిత్ర పరిశ్రమ నివ్వెరపోయింది. తెలుగు సినీ లోకమైతే ఎస్పీ బాలు మరణ వార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతోంది.    ఆగస్టు 5న ఎస్పీబీ తనకు కరోనా సోకినట్టు ప్రకటించారు. ఆ తర్వాత చికిత్స నిమిత్తం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. అప్పటినుంచి అక్కడే చికిత్స పొందుతున్న బాలు త్వరగా కోలుకోవాలని కోట్లాది మంది ఆయన అభిమానులు పూజలు చేశారు. సినీ తారలు బాలు క్షేమం కోసం ప్రత్యేక హోమాలు, వ్రతాలు చేశారు. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఎస్పీ బాలు కోలుకోవాలని ఎంతో తపించారు. ఆయన కోసం పూజలు చేశారు. ఇక బాలు ఆరోగ్యం క్షిణించదన్న వార్తతో వెంకయ్య నాయుడు తీవ్ర మనో వేదనకు గురయ్యారట. బాలు కోసం ఆయన శుక్రవారం రోజున ప్రత్యేక హోమం చేశారని తెలుస్తోంది. అందుకే బాలసుబ్రమణ్యం మరణవార్తను అధికారికంగా ప్రకటించడానికి ఎక్కువ సమయం తీసుకున్నారని తెలుస్తోంది. బాలసుబ్రమణ్యంను రక్షించడం ఇక కష్టమని డాక్టర్లు చెప్పినా.. వెంకయ్య నాయుడు హోమం చేస్తుండటంతో కొన్ని గంటల పాటు అందరూ వెయిట్ చేశారని తెలుస్తోంది. చివరకు రెండు గంటలు ఆలస్యంగా బాలు చనిపోయారన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారని చెబుతున్నారు. బాలు ఆరోగ్యం క్షేమం కోసం వెంకయ్య నాయుడు ప్రత్యేక హోమం చేశారంటే.. ఆయనపై వెంకయ్యకు ఎంతో అప్యాయత ఉందో అర్ధం చేసుకోవచ్చు.

టీడీపీలో చేరిన టీఆర్ఎస్ కీలక నేత!!

అధికార పార్టీలోకి వలసలు సహజం. అయితే, తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి కొందరు టీడీపీలోకి జంప్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల తెలంగాణ టీడీపీలో వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు పసుపు కండువాలు కప్పుకున్నారు. తాజాగా టీఆర్ఎస్ నేత సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి కారు దిగి సైకిలెక్కారు. శనివారం నాడు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ సమక్షంలో మురళీధర్ రెడ్డి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈయన ఎల్బీనగర్‌కు చెందిన నేత. ఈ నియోజకవర్గంపై మురళీకి మంచి పట్టు ఉందని తెలుస్తోంది. కాగా, మురళీతో పాటు టీఆర్ఎస్‌కు చెందిన సుమారు రెండు వందల మంది కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.   తెలంగాణలో టీడీపీ పని అయిపోయిందని పలువురు అభిప్రాయపడుతున్న వేళ.. టీడీపీలో వలసలు ఊపందుకోవడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశమనే చెప్పాలి. అదీగాక, జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎల్బీనగర్‌ కు చెందిన నేత పెద్దఎత్తున కార్యకర్తలతో కలిసి టీడీపీలో చేరడం.. అధికార పార్టీ టీఆర్ఎస్ కు గట్టిదెబ్బ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అమరావతికి పట్టిన పీడ విరగడైందట.. జీవీఎల్ పై నెటిజన్ల సెటైర్లు 

బీజేపీ అధిష్టానం కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన సంగతి తెలిసందే. ఈ కార్యవర్గంలో తెలుగు రాష్ట్రాలనుండి డీకే అరుణ, డాక్టర్ లక్ష్మణ్, ఎన్టీఆర్ పుత్రిక పురందేశ్వరి ఉన్నారు. అయితే ఇప్పటివరకు వివిధ పదవులలో ఉన్న రామ్ మాధవ్, మురళీధర్ రావులకు మంత్రి పదవులు ఇచ్చే ఉద్దేశంతో ప్రస్తుతానికి తప్పించినట్లుగా తెలుస్తోంది. అయితే తాజా లిస్ట్ లో జీవీఎల్ పేరు కనిపించకపోవడం తో సోషల్ మీడియాలో దీని పై అపుడే పెద్ద చర్చ నడుస్తోంది. బీజేపీ అధ్యక్షుడుగా కన్నా లక్ష్మినారాయణ ఉన్న సమయంలో ఇసుక పాలసీ నుండి.. అమరావతి వరకు అనేక విషయాల్లో జగన్ ప్రభుత్వం పై అయన ఇలా విమర్శలు చేయగానే అలా డీల్లీనుండి ప్రత్యక్షమై అబ్బే అలాంటిదేం లేదు.. జగన్ ప్రభుత్వం భేషుగ్గా పని చేస్తోంది.. అసలు తప్పంతా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుదే అంటూ విరుచుకుపడిన సీన్లు గుర్తుకు తెచ్చుకుని మరీ హమ్మయ్య అమరావతికి పట్టిన పీడా విరగడైందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అమరావతి విషయంలో అయన వ్యవహరించిన తీరుతో ఏపీ ప్రజలలో బీజేపీకి ఉన్న కాస్త సపోర్ట్ కూడా పోయి.. ఆ స్థానంలో ద్వేషం ఏర్పడేలా చేయడంలో అయన సక్సెస్ అయ్యారని కూడా సెటైర్లు పడుతున్నాయి. జీవీఎల్ తెలుగువారైనా యూపీ నుండి రాజ్యసభ సభ్యుడుగా ఉంటూ.. తాజాగా స్పైస్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమితులైన విషయం తెల్సిందే. దీంతో ఇప్పటి నుండి అయన ఏపీ పైన పెద్దగా మాట్లాడే అవకాశం ఉండకపోవచ్చని దీంతో ఏపీలో బీజేపీ కూడా కోలుకునే అవకాశం వస్తుందని సోషల్ మీడియాలో కొందరు ఆశావహుల అభిప్రాయం.

ఏపీలో మద్య నిషేధం అన్నారు.. ఆదాయం మాత్రం 21 శాతం పెరిగింది.. ఏడాదిలో ఏం సాధించారు?

మందుబాబులు మద్యం తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని మరీ ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇస్తూ ఉంటారు. మన దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలే ఆయా ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరులు. అయితే ఏపీ అధికార పార్టీ మాత్రం తమ ప్రభుత్వానికి ఆదాయం కన్నా ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని చెప్పింది. దశలవారీగా మద్య నిషేధం చేస్తామని, ఐదేళ్లలో రాష్ట్రంలో పూర్తిగా మద్య నిషేధం చేస్తామని చెప్పుకొచ్చింది. కానీ, ప్రభుత్వం చెప్పిన దానికి జరుగుతున్న దానికి పొంతన లేదు. మద్యం మీద ప్రభుత్వం ఆదాయం ఏమాత్రం తగ్గలేదు. ఇక, ప్రజలు ఆనారోగ్యం పాలు కావడం కాదు, ఏకంగా ప్రాణాలే కోల్పోతున్నారు.   దశలవారీగా మద్య నిషేధం చేస్తామని చెప్పిన వైసీపీ.. అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని బెల్ట్ షాపులన్నీ మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఆ తర్వాత, ఏటా మద్యం షాపులను సంఖ్యను తగ్గించుకుంటూ వస్తామంటూ 2019 అక్టోబర్ 1 న కొత్త మద్యం విధానాన్ని తీసుకువచ్చింది. అందులో భాగంగా 4,380  మద్యం షాపులలో 33 శాతం తగ్గించారు. ప్రస్తుతం ఏపీలో 2934 షాపులు మాత్రమే ఉన్నాయి. మద్యం అమ్మకాలకు అనుమతించే సమయం కూడా తగ్గించారు. పర్మిట్ రూమ్‌లకు అనుమతి నిరాకరించారు. కానీ, మద్యంపై ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం విషయంలో మాత్రం మార్పు కనిపించడం లేదు. దీంతో రాష్ట్రంలో మద్యం నియంత్రణ లక్ష్యం నీరుగారుతుందా అన్న సందేహం వస్తోంది.   2019 ఆగస్టులో మద్యం ద్వారా ఏపీ ప్రభుత్వానికి రూ.1747.29 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఆగస్టులో ఆదాయం రూ.1635.07 కోట్లుగా ఉంది. అంటే, 6.42 శాతమే తగ్గింది. ఇక గత ఏడాది సెప్టెంబర్ ‌తో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్‌ లో ఇప్పటికే 21.27 శాతం ఎక్కువ ఆదాయం వచ్చింది. 2019 సెప్టెంబర్ కు గానూ రూ.1205.39 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌ లో మొదటి 24 రోజుల్లోనే రూ.1461.8 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ లెక్కలను గమనిస్తుంటే మద్యం దుకాణాలు తగ్గినా, మద్యం ద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో లోటు లేదని అర్థమవుతోంది. భారీగా పెంచిన ధరల కారణంగానే ప్రభుత్వ ఆదాయానికి లోటు లేకుండా పోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.   మద్యం ధరలు పెంచి మద్యం ప్రియులను దానికి దూరం చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ముఖ్యంగా లాక్‌డౌన్‌ సమయంలో మద్యం దుకాణాలు మూతపడి, తెరిచిన తర్వాత.. లిక్కర్‌ పై మొత్తం 75 శాతం పన్నులను పెంచింది. మద్యం అందుబాటు ధరలో లేకపోవడంతో శానిటైజర్లు తాగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో తీవ్ర విమర్శలు రావడంతో మద్యం ధరలను స్వల్పంగా తగ్గించింది. అలాగే ప్రభుత్వం వింత వింత పేర్లున్న బ్రాండ్లను తీసుకురావడంతో.. నాసిరకం మద్యాన్ని ఎక్కువ ధరలకు అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలతో, జీవితాలతో ఆటలాడుతున్నారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. మరోవైపు, పొరుగు రాష్ట్రాల నుండి భారీగా అక్రమ మద్య రవాణా జరుగుతోంది. దీనికితోడు నాటుసారా తయారీ, అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి.   ఆదాయం కన్నా ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని.. ఏటా 20 శాతం చొప్పున మద్యం దుకాణాలు తగ్గించి, ఐదేళ్ల నాటికి కేవలం స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం అందుబాటులో ఉండే విధంగా చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఈ ఏడాది కాలంలో జరిగిన పరిణామాలు చూస్తుంటే మద్య నిషేధం సాధ్యమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రేట్ల పెంపుతో ప్రభుత్వ ఆదాయానికి ఏ లోటు లేదు.. కానీ, ఎందరో శానిటైజర్లు, నాటుసారా తాగి ప్రాణాలకే ముప్పు తెచ్చుకుంటున్నారు. ఇలాగే వింత బ్రాండ్లు తెచ్చి, రేట్లు పెంచి.. కేవలం స్టార్ హోటళ్లకే మద్యం పరిమితం చేస్తే.. శానిటైజర్ మరణాలు, అక్రమ మద్య రవాణా, నాటుసారా తయారీ పెరిగే అవకాశముంది. కేవలం రేట్లు పెంచితే చాలు మద్యం ప్రియులు మందుకు దూరమవుతారన్న ఆలోచనను ప్రభుత్వం పక్కన పెట్టి.. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మద్య నిషేధం కోసం వేరే మార్గాలను అన్వేషించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జేపీ నడ్డా కొత్త టీమ్‌లో డీకే అరుణ, పురందేశ్వరి

బీజేపీ జాతీయ కార్యవర్గంలో మార్పులు చేర్పులు జరిగాయి. నూతన కార్యవర్గాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. కొన్ని కీలక పదవుల నుంచి కొందర్ని తప్పించి, కొత్త వారికి చోటు కల్పించారు. ముఖ్యంగా రాష్ట్రాల్లో నాయకత్వాన్ని అభివృద్ధి చేసే దిశగా నియామకాలు చేపట్టారు.    నూతన కార్యవర్గంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలకు కూడా సముచిత స్థానం లభించింది. తెలంగాణ నాయకురాలు డీకే అరుణకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి లభించింది. పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా డాక్టర్ రమణ్ సింగ్, ముకుల్ రాయ్, వసుంధరా రాజే, డీకే అరుణతో పాటు మొత్తం 12 మందిని నియమించారు. తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ డాక్టర్ లక్ష్మణ్ ను ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా నియమించారు. ఆంధ్రప్రదేశ్ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఏపీకి చెందిన సత్యకుమార్ కు జాతీయ కార్యదర్శి పదవి అప్పగించారు. అయితే, తెలుగునేతలు రామ్ మాధవ్, మురళీధర్ రావులను ప్రధాన కార్యదర్శుల బాధ్యతల నుంచి తప్పించారు.

కరోనా పై తప్పుడు సంకేతాలతో భారత్ కు ముప్పు.. ఐసీఎంఆర్ ను హెచ్చరించిన లాన్సెట్

భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. అయితే దేశంలో మరణాల రేటు తక్కువగా ఉందని.. అలాగే ఇంకేముంది.. ఇదిగో వ్యాక్సిన్ అంటూ కొద్దీ రోజుల క్రితం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) హడావిడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ అనుసరిస్తోన్న విధానాలను విమర్శిస్తూ ప్రముఖ అంతర్జాతీయ మెడికల్ జర్నల్ లాన్సెట్ కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా ఉద్ధృతి దేశంలో అత్యధికంగా ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం, అలాగే ఐసీఎంఆర్ ఏమీ కాదులే అన్న ధోరణితో వ్యవహరిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఐసీఎంఆర్ శాస్త్రీయ ఆధారాల నుంచి పక్కకు పోతోందని లాన్సెట్ మెడికల్ జర్నల్ తన సంపాదకీయంలో పేర్కొంది. ఐసీఎంఆర్ తాజా ధోరణులతో ప్రజలకు కూడా తప్పుడు సంకేతాలు అందుతాయని.. దీంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఈ చర్యలు నిరోధిస్తాయని తన సంపాదకీయంలో తెలిపింది. ఇటువంటి చర్యల వల్ల భారత్‌లో మరింత సంక్షోభం ఏర్పడుతుందని పేర్కొంది.   కరోనా వ్యాప్తి తీవ్రత పట్ల భారత సర్కారు చాలా పాజిటివ్ ధోరణితో ఉందని.. ఇంతటి కరోనా సంక్షోభం సమయంలో వాస్తవాలను దాచవద్దని కోరింది. ప్రజలకు అసలు నిజాలు చెప్పకపోతే పెద్ద ప్రమాదమని ఈ సందర్భంగా హెచ్చరించింది. కరోనా ముప్పును కప్పిపెడుతూ పూర్తి ఆశావాదాన్ని ప్రోత్సహిస్తూ చేస్తోన్న ఒత్తిడి కారణంగా భారత్‌లో శాస్త్రీయ సంస్థలు కూడా ఆ దిశగా ప్రభావితమవుతున్నాయని లాన్సెట్ పేర్కొంది. ఇదే సందర్భంలో భారత్‌ నుంచి కరోనాకు వ్యాక్సిన్ ను ఈ ఏడాది ఆగస్టు 15లోగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని కొన్ని నెలల క్రితం ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ చేసిన ప్రకటనను కూడా లాన్సెట్‌ తప్పుబట్టింది. అంతేకాదు. ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ మరణాల రేటు భారత్‌లో ఉందని ప్రభుత్వం వాదించడాన్ని కూడా తప్పుబడుతూ.. అసలు భారత్ చెబుతోన్న ఈ సంఖ్యలు పోల్చదగినవా? కాదా.. అనే విషయం తెలుసుకోవడం కూడా కష్టంగా ఉందని తెలిపింది. భారతదేశంలోని రాజకీయ నాయకులు శాస్త్రీయ ఆధారాలను, నిపుణుల సలహాలపై దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికింది.

అధికార పార్టీలో అసమ్మతి.. బీజేపీలోకి జంపింగ్స్.. కారుకు కష్టమేనా! 

సిద్ధిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడకముందే నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు రోజుకో రంగు పులుముకుంటున్నాయి. సోలిపేట రామలింగారెడ్డి మరణం తర్వాత సానుభూతి పవనాల కంటే అసంతృప్తే ఎక్కువగా కనిపిస్తుండడంతో కారు పార్టీకి తలనొప్పిగా మారింది. రామలింగారెడ్డి కుటుంబంపై సానుభూతి చూపాల్సిన టీఆర్ఎస్ నేతలు అసమ్మతి సెగ లేపుతున్నారు. నియోజకవర్గంలోని నాయకులు వేర్వేరు సమావేశాలు ఏర్పాటు చేసి తమ అసమ్మతిని వ్యక్తపరుస్తున్నారు. కొందరైతే ఏకంగా రామలింగారెడ్డి కుటుంబానికి టిక్కెట్ ఇవ్వద్దని తీర్మానాలు చేస్తూ హైకమాండ్ కు పంపిస్తున్నారు.   చేగుంట మండలంలో అధికార పార్టీకి భారీ షాక్ తగిలింది. మండలానికి చెందిన పలువురు టీఆర్ఎస్ ఎంపీటీసీలు, సర్పంచులు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, మండల నాయకులు, వందలాది మంది కార్యకర్తలు బీజేపీలో చేరిపోయారు. రెండు రోజుల క్రితం అసమ్మతి సమావేశం నిర్వహించిన ఈ నేతలు.. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పని చేసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి వెంట నలుగురు వ్యక్తులు ఉండి దుబ్బాక రాజకీయానికి, టీఆర్ఎస్ పార్టీకి మచ్చ తెచ్చారని ఆరోపించారు. రాబోయే ఉపఎన్నికల్లో ఆ కుటుంబానికి టిక్కెట్ ఇస్తే మళ్లీ తమను అణగతొక్కుతారని చెప్పారు. కేసీఆర్‌ గ్రామాలుగా పిలవబడే 12 ఊర్ల నాయకత్వం కూడా సోలిపేట కుటుంబానికి టికెట్‌ ఇవ్వొద్దని డిమాండ్‌ చేస్తున్నది. గతంలో తాము సిద్దిపేట నియోజకవర్గంలో ఉండి, నియోజకవర్గాల పునర్విభజనలో దుబ్బాక మండలంతో కలిసి వివక్షకు గురవుతున్నామని వారంతా ఆవేదన చెందుతున్నారు.   సోలిపేట కుటుంబానికి టికెట్ ఇవ్వడంపై పార్టీలోని ఇతర సీనియర్ నేతలకు ఇష్టం లేదు. వారు కూడా తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు.  దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహంతో ఉన్నారు. గ్రామాల్లో తిరుగుతూ తనతో వచ్చే టీఆర్‌ఎస్‌ శ్రేణులను సమీకరిస్తున్నారు. తనకు టికెట్ ఇవ్వాలని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై శ్రీనివాస్ రెడ్డి ఒత్తిడి పెంచుతున్నట్లు చెబుతున్నారు. టికెట్ ఇవ్వకపోతే తన దారి తాను చూసుకుంటానని శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. పార్టీ మరో సీనియర్‌ నాయకుడు మామిడి మెహన్‌రెడ్డి కూడా మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ సోలిపేట కుటుంబానికి టికెట్టు వద్దనే నినాదంతో పనిచేస్తున్నారు. పార్టీలో మొదటి నుంచి పనిచేసిన నిజమైన కార్యకర్తకు టికెట్ ఇస్తే తాము కలిసికట్టుగా గెలిపించుకుంటామని, అదే కుటుంబానికి ఇస్తే పార్టీ కార్యకర్తలకు అవకాశాలు ఎప్పుడు వస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఈ ఇద్దరు నేతలకు బీజేపీ కూడా వల వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రామలింగారెడ్డి కుటుంబానికి టికెట్ ఇస్తే.. శ్రీనివాస్ రెడ్డి, మెహన్ రెడ్డిలు అధికార పార్టీ గెలుపు కోసం ప్రయత్నాలు చేయకపోవచ్చని టీఆర్ఎస్ లోనే చర్చ జరుగుతోంది.    మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికలో ఘన విజయం సాధిస్తామని చెబుతున్న టీఆర్ఎస్ ముఖ్య నేతలకు... నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆందోళన కల్గిస్తున్నాయి. రోజు రోజుకు అసమ్మతి పెరిగిపోతుండటంతో అధికార పార్టీలో అలజడి కనిపిస్తోంది. ఉప ఎన్నికల బాధ్యతలు చూస్తున్న మంత్రి హరీష్ రావుకు ఇది తలనొప్పిగా మారిందంటున్నారు. అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నా.. వారు వినడం  లేదని తెలుస్తోంది. చేగుంట మండల నేతల రాజీనామాతో మరింత అప్రత్తమైన హరీష్.. ఇతర మండలాల్లోని అసమ్మతి నేతలతో స్వయంగా మాట్లాడి కూల్ చేస్తున్నారని చెబుతున్నారు. మొత్తానికి సీఎం కేసీఆర్ సొంత జిల్లా, తన సొంతూరు పక్క నియోజకవర్గమైన దుబ్బాకలో నెలకొన్న అసమ్మతి టీఆర్ఎస్ ను పరేషాన్ చేస్తుందని తెలంగాణ భవన్ లో ప్రచారం జరుగుతోంది.

రెండు మూడు రోజుల్లో వాళ్ళు నాపై దాడి చేస్తారు.. రఘురామరాజు సెన్సేషనల్ కామెంట్స్ 

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు కు వైసిపికి మధ్య వ్యవహారం ఉప్పు నిప్పులా ఉన్న సంగతి తెల్సిందే. తాజాగా పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో రఘురామరాజుకు.. తోటి వైసిపి ఎంపీలకు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రఘురామరాజు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కార్యాలయంపై దాడికి కార్యాచరణ రూపొందిందని.. మరో రెండు, మూడు రోజుల్లో దాడి కూడా జరగనుందని ఆయన అన్నారు. ఈ దాడి ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. తనపై దాడి చేస్తే ఆవేశపడి ఒక మాట అనే అవకాశం ఉందనే ఆలోచనల్లో వైసిపి వాళ్లు ఉన్నారన్నారు. తనను తోలు తీస్తా అన్నారని, ఊళ్లోకి రా.. పిచ్చికుక్కను కొట్టినట్టు కొట్టేస్తామని కొందరు తనను హెచ్చరించిన విషయాలను ఈ సందర్భంగా అయన గుర్తు చేశారు. కేవలం ఒక ఎంపీ అన్న వ్యాఖ్యలను తాను ప్రస్తావిస్తే.. దానికి ఏకంగా ఒక జాతిని సంఘటితం చేసి.. వాళ్ల జాతిని అవమానించినట్టు చిత్రీకరించారన్నారు. తాను అన్న మాటలకు రుజువులు ఉన్నాయని, అయితే తన వెనక జరుగుతున్న కుట్ర గురించి అందరికి తెలియాలనే ఈ విషయాలు తెలుపుతున్నానన్నారు. తనపై దాడి వార్తలు వారి ఆధ్వర్యంలోని ఒక ఛానెల్, అలాగే పేపర్‌లలో వస్తాయని ఆయన తెలిపారు. ఎన్నో దళిత సంఘాలు తనకు ఫోన్ చేసి మద్దతుగా ఉంటున్నారని అయన చెప్పారు. దీనిపై దళిత హిందూ నాయకులు తనతో మాట్లాడారని, వారి హక్కుల కోసం పోరాడటంతోనే తనకు మద్దతుగా నిలిచారన్నారు. కొంతమంది దళిత క్రిస్టియన్లు హిందువుల ముసుగులో రిజర్వేషన్లు కొట్టేస్తున్నారని... ఈ విషయాన్ని తాను పలు మార్లు ప్రస్తావించానన్నారు. అందుకే హిందూ దళిత నాయకులు తన వెంట నిలిచారన్నారు. అయితే ఈ వివాదం ఎటు దారి తీస్తుందో చూడాలి.

'అవనీర్' మీటర్ల కొను 'గోల్‌మాల్'పై.. విజిలెన్స్ నివేదికకు విలువేదీ?

విద్యుత్ మీటర్ల కొనుగోలులో 41 కోట్లు వృధా ఆ 12 మంది నుంచి రికవరీ చేయమని ఇంధన కార్యదర్శి ఆదేశం ‘షో’కాజులతో  మీనమేషాలు లెక్కబెడుతున్న ఎస్పీడీసీఎల్ సీఎండీ టీడీపీ హయాం నాటి అవినీతిపై చర్యలేవీ?   తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడ  అవినీతి జరిగిందోనని వైసీపీ సర్కారు భూతద్దంతో అన్వేషిస్తోంది. ఆ లెక్కల కోసం తాపత్రయపడుతోంది. సీఐడి నోటీసులిస్తోంది. కానీ టీడీపీ జమానాలోనే 41 కోట్ల రూపాయలు, ఖరీదైన విద్యుత్ మీటర్ల కొనుగోలుపై గోల్‌మాల్ జరిగిందని, స్వయంగా ఇంధన శాఖ, విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. అయితే వైసీపీ సర్కారు ఆ నివేదికను అమలు చేయడం చేతకాక, చేతులెత్తేసింది. పైగా ఎవరినయితే దోషులుగా తేల్చి.. వారిపై క్రిమినల్ కేసులు పెట్టి, వారి నుంచి అంత సొమ్మునూ రికవరీ చేయాలని సిఫార్సు చేసిందో..  దానిని అమలుచేయకుండా, వారికి సంజాయిషీ నోటీసులిచ్చి కాలయాపన చేస్తోంది. ఫలితంగా.. ఎస్పీడీసీఎల్ సీఎండీ వ్యవహార శైలి, సహజంగానే అనేక అనుమానాలకు తావిస్తోంది. చివరకు ఆదేశాల్చిన ఇంధన శాఖ కార్యదర్శి, విజిలెన్స్ ఆదేశం- నివేదికకూ, పూచికపుల్ల పాటి విలువ కూడా లేకుండా పోయింది. ఇదీ ఏపీ ఎస్పీడీసీఎల్ వైచిత్రి.   ఎలాంటి ఆధారాలు లేని అమరావతి భూములలో.. లొసుగుల కోసం తెగ చెమటోడ్చి పనిచేస్తున్న జగన్మోహన్‌రెడ్డి సర్కారు.. 41 కోట్ల రూపాయల  విద్యుత్ మీటర్ల కోట్ల కొనుగోలు వ్యవహారంలో, అన్ని ఆధారాలతో స్వయంగా ప్రభుత్వ అధికారులే నివేదిక ఇచ్చినా.. ఇప్పటివరకూ దానిపై చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కబెడుతున్న వైనం విస్మయపరుస్తోంది. దీనికి సంబంధించి 12 మంది అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకుని, రెవిన్యూ రికవరీ యాక్టు ప్రకారం ఆ సొమ్మును వారి నుంచే రికవరీ చేయాలని స్వయంగా ఇంధనశాఖ కార్యదర్శి, విజిలెన్స్ ఇచ్చిన నివేదికను అమలు చేయకుండా, బుట్టదాఖలు చేస్తున్నారు. అంటే ప్రభుత్వం మారినప్పటికీ,  ఈ వ్యవహారంలో ఎంతమంది పెద్దల పలుకుబడి- ప్రభావం ఇంకా ఎంత బలంగా పనిచేస్తోందో స్పష్టమవుతోంది.   నాటి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన కథ ఇది. అంటే 30-11-2005లో అన్నమాట. అవనీర్ పవర్ టెక్నాలజీ కంపెనీ నుంచి విద్యుత్ మీటర్లను భారీ సంఖ్యలో, అప్పటి టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది.  ఎస్పీడీసీఎల్ చైర్మన్-ఎండీగా గోపాల్‌రెడ్డి ఉన్నారు. ఆ మేరకు అవనీర్ కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.  అయితే, సదరు కంపెనీ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్ మీటర్లలో, చాలావరకూ నాసిరకం-నాణ్యత లేనివే ఎక్కువ ఉన్నాయని, పైగా కంపెనీ గ్యారంటీ ఇచ్చిన గడవులోగానే మొత్తం సొమ్ము కంపెనీకి చెల్లించడంతో, ప్రభుత్వానికి 41 కోట్ల 46 లక్షల నష్టం వచ్చిందని విజిలెన్స్ అధికారులు తన నివేదికలో పేర్కొన్నారు. ఆ ప్రకారంగా అప్పట్లో ఈ వ్యవహారంలో బాధ్యులుగా ఉన్న సీఎండీ కె.రంగనాధ్, చైర్మన్‌గా ఉన్న పి.గోపాల్‌రెడ్డితోపాటు, వివిధ స్థాయిలో ఉన్న కె.పి. ఆనంద్, దామోదర్‌రావు, కె.ప్రకాష్, ఏ.చిన్నయ్య, టి.హన్మంత ప్రసాద్, ఆర్. శ్రీనివాసులు, వై.లక్ష్మీనరసయ్య, మిక్కిలి విజయకుమార్, బి.సుబ్రమణ్యం, ఏ.వేణుగోపాల్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి, వారి నుంచి ప్రభుత్వం నష్టపోయిన 41 కోట్ల 46 లక్షల రూపాయలను ఏపి రెవిన్యూ రికవరీ యాక్టు 1864 ప్రకారం వారి నుంచి వసూలు చేయాలని, ఇంధనశాఖ కార్యదర్శి 11-9-2020న ఎస్పీడీసీఎల్ సీఎండీ-చైర్మన్‌కు ఆదేశాలు జారీ చేశారు.   సహజంగా కొనుగోలు చేసిన కంపెనీ తమ వస్తువులపై, మూడు నుంచి- ఐదేళ్ల వరకూ గ్యారంటీ ఇస్తుంది. ఆ ప్రకారంగానే విద్యుత్ శాఖ వారికి పేమెంట్లు ఇస్తుంటుంది. ఒకేసారి సొమ్ము చెల్లిస్తే, ఇక కంపెనీ తన బాధ్యత నుంచి తప్పించుకుంటుందన్న ముందుచూపుతోనే, పేమెంట్లు విడతల వారీగా చెల్లిస్తారు. కానీ, సదరు అవనీర్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా, ఒకేసారి బిల్లు చెల్లించేయడంపై శాంతికిరణ్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. కాగా శాంతికిరణ్ అనే వ్యక్తి, గత టీడీపీ ప్రభుత్వంలో  విద్యుత్ మీటర్ల కోనుగోలులో అవినీతి జరిగిందని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి, ఆ వ్యవహారంలో 41 కోట్ల 46 లక్షల రూపాయలు ప్రభుత్వం నష్టపోయిందని నివేదిక ఇచ్చారు. దానితో సదరు మాజీ అధికారులంతా, ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, కోర్టు దానిని తిరస్కరించింది. కాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మందిలో కొందరు పదవీ విమరణ చేయగా, మరికొందరు చనిపోయారు. ప్రస్తుతం సీజీఎమ్ హనుమత్ ప్రసాద్, పే ఆఫీసర్ లక్ష్మీనరసయ్య, జీఎం విజయ్‌కుమార్ మాత్రం ఇంకా సర్వీసులో కొనసాగుతున్నారు. అంటే.. శాంతికిరణ్ అనే వ్యక్తి, ఒకవేళ హైకోర్టును ఆశ్రయించకపోతే, ఈ 41 కోట్ల వ్యవహారం విజయవంతంగా సమాధి అయిపోయేదని స్పష్టమవుతోంది. మరి కోర్టుదాకా వెళ్లి, విజిలెన్స్ -ఇంధన కార్యదర్శి ఆదేశాలిచ్చిన ఈ వ్యవహారంపై మామూలుగా అయితే.. చర్యలు పంచకల్యాణి గుర్రంలా, శరవేగంగా ఉండాలి. ఇంధన శాఖ కార్యదర్శి అంటే సీఎండీ-చైర్మన్‌కు బాస్. అంటే కార్యదర్శి ఆదేశం, శిలాశాసనమన్నమాట. పైగా విజిలెన్స్ కూడా నివేదిక  ఇచ్చింది. మరి ఎస్పీడీసీఎల్ సీఎండీ ఇప్పటిదాకా వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు?  క్రిమినల్‌కేసులు ఎందుకు నమోదు చేయడం లేదు? వారి నుంచి ఆ 41 కోట్ల రూపాయలు ఎందుకు రికవరీ చేయడం లేదన్న ప్రశ్నలు, మెదడున్న ఎవరికయినా రావడం సహజం. మామూలు పామరులకే ఇన్ని సందేహాలు వచ్చినప్పుడు, పాలకులకు ఇప్పటిదాకా రాకపోవడమే విడ్డూరం. విస్మయకరం కూడా.   సదరు అవనీర్ కంపెనీ సరఫరా చేసిన విద్యుత్ మీటర్లకు సంబంధించి.. పర్చేజ్ ఆర్డర్ నెంబర్ 16/2003-2004 డేటెడ్ 24-5-2003న, అవనీర్ సరఫరా చేసిన ఎనర్జీ మీటర్లలో 92.80 శాతం  పనికిరాకుండా పోయాయని, విజిలెన్స్ తన నివేదికలో పేర్కొంది. పి.ఓ నెంబర్ 72/2004-2005 డేటెడ్  3-6-2004న సరఫరా చేసిన వాటిలో,  71.75శాతం మీటర్లు పనికిరాకుండా పోయాయని వెల్లడించింది. పి.ఓ నెంబర్ 317/2004-2005 డేటెడ్  1-1-2005న సరఫరా చేసిన వాటిలో, 72.25 శాతం మీటర్లు పనికిరాకుండా/నాణ్యత లేవని  తేలిందని విజిలెన్స్ తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది.   మరి ఇంత విస్పష్టంగా విజిలెన్స్ నిర్ధారించి, నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఎస్పీడీసీఎల్ సీఎండి హరనాధరావు బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుని, సొమ్ము రికవరీ చేయకుండా తాత్సారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంధన శాఖ కార్యదర్శి ఆదేశాలకు భిన్నంగా.. వారికి  షోకాజులిచ్చి, వివరణ కోరడంపై మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. అంటే బాధ్యులకు మరింత గడువు ఇచ్చినట్లేనన్న వ్యాఖ్యలు విద్యుత్ శాఖ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీనిపై ఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాధరావును ‘సూర్య’ వివరణ కోరింది. దానికి ఆయన.. వారికి షోకాజు నోటీసులిచ్చామని, దానిని చూసిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘ఏకంగా వారిపై చర్యలు తీసుకుంటే రేపు కోర్టుకు వెళితే ఇబ్బందవుతుంది. ఇప్పటి పరిస్థితి మీరు చూస్తున్నారు కదా. అందుకే ప్రొసీజరు ఫాలో అవుతున్నాం’ అని వ్యాఖ్యానించారు.   కాగా, కడపకు చెందిన ఓ ఎలక్ట్రికల్ కంపెనీ యజమాని.. ఈ మొత్తం వ్యవహారంలో చక్రం తిప్పుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన ఆశీస్సులతోనే ఇప్పటి అధికారి అత్యున్నత హోదా సాధించారని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కొందరు, సదరు కడప కంపెనీ యజమాని ద్వారా లాబీయింగ్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజం ‘జగన్నాధుడి’కి ఎరుక!  అవినీతిని సహించేది లేదని ఇప్పటికి కొన్ని డజన్ల సార్లు చెప్పిన సీఎం జగన్మోహన్‌రెడ్డి, కరెంట్ మీటర్ల కొనుగోలులో.. 41 కోట్ల మేర గోల్‌మాల్ జరిగినా ఇంకా మౌనవ్రతం పాటించడమే ఆశ్చర్యం.   ఆయనది కడప. ఆయనకో పెద్ద ఎలక్ట్రికల్ కంపెనీ ఉంది. సర్కారుకు పరికరాలు కొనుగోలు చేయడంలో దానికదే సాటి. ఆర్డర్లు పట్టేయడంలో ఆరితేరింది. ఇప్పుడు పాలకులకూ ఆ కంపెనీ చాలా దగ్గర. అలాంటి కంపెనీపై సర్కారు, కోట్ల రూపాయల పెనాల్టీ విధించింది. కానీ, దయగల ప్రభువులు.. దానిని రద్దు చేసి, సదరు కంపెనీనిని కరుణించారు. -మార్తి సుబ్రహ్మణ్యం

కోర్టు చివాట్లు పెట్టినా మారన తీరు.. కరోనాపై బోగస్ లెక్కలు! 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా టెస్టులు ,కేసులు, మరణాల లెక్కలపై  మొదటి నుంచి అనుమానాలున్నాయి. ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతుందనే ఆరోపణలున్నాయి. కరోనా కేసుల్లో తప్పుడు లెక్కలపై గతంలో హైకోర్టులోనూ విచారణ జరిగింది. సరైన నివేదికలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అయినా సర్కార్ తీరు మారలేదని, అవే తప్పులు చేస్తున్నారని, కరోనా టెస్టులు, కేసులు, మరణాల విషయంలో బోగస్ లెక్కలే చూపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కరోనా అంశంలో కేంద్రానికి ఇచ్చే లెక్కలు వేరేలా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చె బులిటెన్లలో మరోలా వివరాలు ఉంటున్నాయి. తాజాగా ఆగస్టు  నెలకు సంబంధించి కరోనా కేసులపై కేంద్ర ఆరోగ్య శాఖకు రాష్ట్ర వైద్య శాఖ పంపిన నివేదికలో తప్పుడు లెక్కల బండారం బహిర్గతం అయింది .   తెలంగాణలో ఆగస్టు నెలలో 8 లక్షల 79 వేల 479 మందికి కరోనా టెస్టులు చేసినట్టు కేంద్రానికి రాష్ట్ర హెల్త్​ డిపార్ట్​మెంట్ నివేదిక ఇచ్చింది. రాష్ట్ర పంపిన వివరాల ఆధారంగా కేంద్ర హెల్త్​ మినిస్టర్​ పార్లమెంట్‌‌‌‌లోనే ఈ వివరాలను వెల్లడించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ  బులెటిన్‌‌‌‌లో మాత్రం.. ఆగస్టులో 9 లక్షల 65 వేల 253 టెస్టులు చేసినట్టు చెప్తోంది. కేంద్రానికి ఇచ్చిన లెక్కకు, బులెటిన్‌‌‌‌లో చెప్పిన లెక్కకు 85 వేల 774 టెస్టుల తేడా ఉంది. అంటే తక్కువ టెస్టులు చేసి ఎక్కువగా చూపిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇలా అసలు లెక్కలు బయటపడతాయనే ఉద్దేశంతోనే జిల్లాల వారీగా టెస్టులు, డెత్స్​ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.   తెలంగాణలో ప్రస్తుతం రోజు 2 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. జిల్లాల్లోనూ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. వందల కొద్దీ కరోనా కేసులు నమోదవుతున్నా కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ అరకొరగానే టెస్టులు చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో ఆగస్టులో 4,270 టెస్టులు, వికారాబాద్ జిల్లాలో 5,268 టెస్టులు మాత్రమే చేసినట్లు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలోనే ఉంది. మొత్తం 33 జిల్లాలకుగాను 27 జిల్లాల్లో రోజూ వెయ్యి కంటే తక్కువే టెస్టులు చేసినట్టు కేంద్రం వెల్లడించిన నివేదికతో వెల్లడైంది. స్టేట్‌‌‌‌ బులెటిన్‌‌‌‌లో రోజూ రాష్ట్రవ్యాప్తంగా 50 వేల నుంచి 60 వేల టెస్టులు చేస్తున్నట్టు చూపిస్తున్నారు. అయితే ఏ జిల్లాలో ఎన్ని చేశారో చెప్పడం లేదు. దీంతో అన్ని టెస్టులు చేస్తున్నారా, చేయకుండానే చేసినట్టుగా చూపిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.    టెస్టుల సంఖ్యే కాదు.. కరోనా కేసులు, మరణాల్లో కూడా ప్రభుత్వం తప్పుడు లెక్కలే చెబుతుందని క్షేత్రస్థాయిలో పనిచేసే డాక్టర్లు, జిల్లాల మెడికల్ ఆఫీసర్లే చెప్తున్నారు. రోజూ నమోదవుతున్న కేసులు, డెత్స్​లో సగం కూడా బయటపెట్టడం లేదని అంటున్నారు. అసలు లెక్కలు బయటపడకుండా ఉండేందుకే జిల్లాల్లో బులెటిన్లు  ఇవ్వొద్దని ఆదేశించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.    మరోవైపు కరోనా టెస్టుల విషయంలో ఐసీఎంఆర్ సూచనలను రాష్ట్ర సర్కారు‌‌‌‌ పాటించడం లేదు. కరోనా లక్షణాలున్నవాళ్లకు యాంటీ జెన్ టెస్టులో నెగెటివ్ వస్తే.. ఆర్టీపీసీఆర్ టెస్ట్‌‌‌‌ చేయడం లేదు. యాంటీ జెన్‌‌‌‌ టెస్టులో ఫాల్స్‌‌‌‌ నెగెటివ్‌‌‌‌ వచ్చే అవకాశాలు 40 శాతం దాకా ఉందని ఐసీఎంఆర్ మొదట్నుంచీ చెప్తూనే ఉంది. లక్షణాలుండి యాంటీజెన్​లో నెగెటివ్ వస్తే.. ఆర్టీపీసీఆర్ చేయించాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో యాంటీ జెన్ టెస్టులు చేసి వదిలేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ చేయాలని కోరినా పట్టించుకోవడం లేదని బాధితులు చెప్తున్నారు. రాష్ట్రంలో రోజూ 6 వేలదాకా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేసే కెపాసిటీ ఉన్నా.. అందులో సగం కూడా చేయడం లేదని హెల్త్​ డిపార్ట్​మెంట్​ వర్గాలు చెప్తున్నాయి.   కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై గతంలో చాలా సార్లు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా అంశంలో ప్రభుత్వం తప్పుడు లెక్కలు సమర్పిస్తోందని అభిప్రాయపడింది. కేసులు, మరణాలు చాలా తక్కువగా రిపోర్టు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేసింది. కరోనా వైరస్ కట్టడిలో ప్రభుత్వం నిర్లిప్తత, ప్రైవేట్ ఆస్పత్రులు కట్టడి విషయంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరి వంటి అంశాలపై దాఖలైన పిటిషన్లపై విచారించిన హైకోర్టు.. ప్రభుత్వంపై ఘాటైన కామెంట్లు చేసింది, కరోనా కేసులు, మరణాలను తక్కువగా చూపుతున్నారని అభిప్రాయపడింది. సమగ్ర నివేదిక అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రజారోగ్య రంగాన్ని అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టిందో కూడా సమగ్ర నివేదిక ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనాకి ముందు ఎంత నిధులు కేటాయించారు, కరోనా తర్వాత ఎంత కేటాయించారనే అంశాలను తెలియజేయాలని కోరింది.