పశుపతి నాధుడిని దర్శించుకుని, అటు నుంచి అటే వెళ్లిపోండి...
నేపాల్ లో పశుపతి నాధుడిని దర్శించుకుని, అటు నుంచి భారత దేశానికి చేరుకోవాలనే విదేశీయులకు ప్రస్తుతానికి నో ఎంట్రీ. దేశంలో రోజురోజుకు కరోనా నిర్ధారిత కేసుల సంఖ్య పెరుగుతుండడంతో కేంద్రం హోంమంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాల సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్టులను మూసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దేశ సరిహద్దుల్లో మొత్తం 37 ఇమ్మిగ్రేషన్ చెక్పోస్టులు ఉండగా వాటిలో 19 చెక్పోస్టులు శనివారం అర్ధరాత్రి వరకు పనిచేయనున్నాయి. అర్ధరాత్రి తర్వాత ఇండియా-బంగ్లాదేశ్, ఇండియా-నేపాల్, ఇండియా-భూటాన్, ఇండియా-మయన్మార్ సరిహద్దుల్లోని చెక్పోస్టులు మూతపడనున్నాయి.
అలాగే, నేపాల్, భూటాన్ దేశాల నుంచి విదేశీయులు దేశంలోకి రాకుండా అడ్డుకోవాలని హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇటలీ, ఇరాన్, చైనా, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, కొరియా దేశాల్లో పర్యటించి దేశానికి వచ్చే వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించాలని ఆదేశించింది.
సాధారణం గా నేపాల్, భూటాన్ లలో హిందూ, బౌద్ధ ఆలయాలు, ఆరామాలను దర్శించుకుని అటు నుంచి భారత్ కు రావటం విదేశీ పర్యాటకులకు అలవాటు. అయితే, కరోనా దెబ్బకు ప్రస్తుతం వారి ఎంట్రీ మీద తాత్కాలిక నిషేధం విధించింది భారత హోమ్ మంత్రిత్వ శాఖ.