రియల్ బిచ్చగాడు..

అతడు కోటీశ్వరుడు. కానీ కూటికి చేతి చాస్తూ బిక్షాటన చేస్తున్నాడు. అతనికి ఉన్న అలవాటే అతన్నిబిచ్చగాడ్ని చేసింది. చివరికి గుడిమెట్ల దగ్గర బిచ్చమెత్తుకుంటున్నాడు. ఈ విషయం తెలిసిన అధికారులు రమేష్ యాదవ్ ని తన ఇంటికి తీసుకెళ్లారు.. రమేష్ ఇంటిని చూసిన అధికారులు ఆశ్యర్యపోయారు.   దీనబంధు పునరావాస యోజన పథకంలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మున్సిపల్ సిబ్బంది, జిల్లా అధికారులు ఫిబ్రవరి 24న ఒక ప్రత్యేక కార్యక్రమాన్నినిర్వహించారు.   సంయుక్తంగా అనాథ వ్యక్తులను ఆదుకునే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారికి పునరావాసం కల్పించే పనులను చేపట్టారు.ఈ కార్యక్రమానికి మొత్తం 109 మంది అనాథలను తీసుకువచ్చారు. వారికి  తగిన వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ నేపధ్యంలో అధికారులకు బిచ్చగానిగా మారిన రమేష్ అనే కోటీశ్వరుడు తారసపడ్డాడు.  రెండేళ్లుగా రమేష్ ఒక ఆలయం దగ్గర బిచ్చగానిగా కాలం గడుపుతున్నాడు. పెళ్లి కూడా చేసుకోలేదు. అధికారులకు రమేష్ ఇచ్చిన సమాచారం మేరకు వారు రమేష్ ఇంటికి వెళ్లారు. ఆ ఇంటిలోని హంగులను చూసిన వారు తెగ ఆశ్చర్యపోయారు. ఆ ఇంట్లో సకల సౌకర్యాలు ఉన్నాయి. అయితే రమేష్‌కు ఉన్న ఒక్క అలవాటు అతనిని బిచ్చగానిగా మార్చివేసింది. అతని మద్యం అలవాటే అతనిని ఈ దుస్థితికి తీసుకువచ్చింది. రమేష్ కు ఒక సొంత భవనం, ప్లాట్ ఉన్నాయి. వాటి విలువ కోట్ల రూపాయలలో ఉంటుంది. అయితే విపరీతంగా మద్యం తాగే అలవాటు కారణంగా అతను ఆలయం దగ్గర బిచ్చమెత్తుకుంటూ కాలం గడుపుతున్నాడు. రమేష్ పరిస్థితిని గమనించిన అధికారులు అతనికి కౌన్సెలింగ్ ఇప్పించారు. దీంతో రమేష్ ఆరోగ్యం మెరుగుపడింది. తిరిగి రమేష్ తన ఇంటికి చేరుకున్నాడు.

కమీషన్లు రావనే ఐటీఐఆర్ పై నిర్లక్ష్యం! 

తెలంగాణలో పట్టభద్రుల మండలి ఎన్నికల హీట్ పెరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య లేఖలు, సవాళ్ల యుద్ధం సాగుతోంది. ఐటీఐఆర్ కేంద్రంగా ఇరు పార్టీల నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా ఈ అంశంలోకి ఎంటరై.. రెండు  పార్టీలను కడిగి పారేశారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి.  ఐటీఐఆర్ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరిది దొంగాటేనని ఎద్దేవా చేశారు.   ఐటీఐఆర్‌కు కాంగ్రెస్ సర్కార్ అప్రూవల్ ఇచ్చిందని చెప్పారు రేవంత్ రెడ్డి. ఏడేళ్లయినా ఐటీఐఆర్‌పై టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం డీపీఆర్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రం ఐటీఐఆర్‌ను కోల్పోయిందని విమర్శించారు. టీఆర్ఎస్ అంటే టోటల్ రివర్స్ స్టాండ్ అన్నారు రేవంత్ రెడ్డి. ఐటీఐఆర్‌కు సమానమైన ప్యాకేజీ .. మంత్రి కేటీఆర్ ఇవ్వాలనడం దారుణమన్నారు.  కేటీఆర్ .. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.  కేటీఆర్ దగ్గర అసలు ప్రణాళికనే లేదు .. లెటర్ రాయడం ఏంటి .? అని ప్రశ్నించారు.  కమిషన్లు వచ్చేదుంటే ఐటీఐఆర్‌కు కూడా కేసీఆర్ డీపీఆర్ ఇచ్చేవారని తెలిపారు. కమిషన్లు వచ్చినందుకే కాళేశ్వరాన్ని డీపీఆర్ లేకుండానే నిర్మించాడని చెప్పారు. దేశంలో బీజేపీ గ్రాఫ్ వేగంగా పడిపోతుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. పట్టభద్రులంతా బీజేపీ, టీఆర్ఎస్ కు బుద్ది చెప్పాలని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 

కేజ్రీ జోరు బీజేపీ బేజారు

దేశ రాజధాని ఢిల్లీపై తిరుగులేని పట్టు సాధించిన, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్’ మంచి జోరు మీదున్నారు. గత వారం గుజరాత్’లో ఆరు మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో ఆప్ అనూహ్య విజయం సాధించింది.  అహ్మదాబాద్ సహా ఐదు కార్పొరేషన్లలో అడుగు పెట్టలేక పోయినా,ఇంకెక్కడా ఆయన పార్టీకి కనీసం డిపాజిట్లు అయినా రాకపోయినా, సూరత్’లో మాత్రం ‘చీపురు’ తిరగేశారు. ఫస్ట్ అటెంప్ట్’లోనే డిస్టింక్షన్’ సాధించారు. చీపురి  కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తుడిచేసింది. మొత్తం 120 సీట్లున్న కార్పొరేషన్’ బీజేపీ 93 సీట్లు, ఆప్ 27 సీట్లు గెలుచుకున్నాయి. హస్తం పార్టీ అడ్రస్ గల్లంతైంది. ఒక్క సీటు కూడా దక్కలేదు. అదలా ఉంటే, ఆ ఆనందం మత్తు నుంచి ఇంకా బయటకు రాక ముందే, ఢిల్లీలోని మూడు మున్సిపల్  కార్పొరేషన్ల పరిధిలోని ఐదు స్థానాలు జరిగిన ఉపఎన్నికల్లోనూ ఆప్’ విజయ ఢంకా మోగించింది. ఐదింట నాలుగు సీట్లలో  ‘ఆప్’ జైకేతనం ఎగరేసింది.మిగిలిన ఒక సీటును హస్తం పార్టీ ఎగరేసుకు పోయింది. బీజేపీకి ఢిల్లీ జనం మొండి చేయి చూపించారు. ఉన్న ఒక్క సీటు కూడా లాగేసుకున్నారు. మరో సంవత్సరంలో,2022లో ఢిల్లీలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగనున్నాయి.ప్రస్తుతం మూడు కార్పొరేషన్లలోను బీజేపీ అధికారంలో ఉంది, అయినా ఐదుకు ఐదు సీట్లలో కమలం పార్టీ కనుమరుగుకావడం ఆ పార్టీ ని కలవరానికి గురి చేస్తోంది. మరో వంక ముఖ్యమంత్రి అరివింద్ కేజ్రీవాల్ పార్టీ ఆనందడోలికల్లో తెలిపోతోంది. అయితే, ఉపఎన్నికలు జరిగిన ఐదు స్థానాల్లో ఒక్కటి మినహా మిగిలిన నాలుగు ఆప్ సిట్టింగ్ స్థానాలు. ఆ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేటర్లు, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్ల్యేలు కావడంతో, ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. కాబట్టి ఇది తమకు అంత పెద్ద ఎదురుదెబ్బ కాదని బీజేపీ, బుకాయించే ప్రయత్నం చేస్తోంది. అయితే,కేజ్రీవాల్ మాత్రం, వచ్చే సంవత్సరం ఏమి జరగబోతోందో ఈ ఫలితాలు సూచిస్తున్నాయని అన్నారు. నిజమే,  ఎన్నిక ఎంత చిన్నదే అయినా గెలుపు ఉత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కార్యకర్తల నైతిక బలాన్నిపెంచుతుంది. ఓటమి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది.అయితే సంవత్సరం తర్వాత జరిగే ఎన్నికల్లో ఏమి జరుగుతుంది అనేది పక్కన పెడితే, జాతీయ స్థాయిలో, బీజేపీ ప్రత్యన్మాయంగా ఎదిగేందుకు ‘ఆప్’ చేస్తున్న ప్రయత్నాలు సత్పలితాలు ఇస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ  ఖాళీ చేసిన స్థానాన్ని ‘ఆప్’ ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తోంది.ఇంతవరకు కొంత విజయం సాధించింది. ఈ నేపధ్యంలోనే కేజ్రీవాల్  ఇకముందు కూడా ఇతర రాష్ట్రాలలో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తామని, పార్టీని విస్తరిస్తామని ప్రకటించారు. అయితే, గతంలోనూ ‘ఆప్’పార్టీ  విస్తరణ ప్రయత్నాలు చేయకపోలేదు. వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే, కేజ్రీవాల్ డీ కొన్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ పోటీ చేశారు,అయితే ఒక్క పంజాబ్ మినహా ఎక్కడా సక్సెస్ కాలేదు ... ఈ సారి ఏమవుతుందో కాలమే నిర్ణయిస్తుంది.  

సాగర్ లో షాకింగ్ క్యాండిడేట్! జానారెడ్డి కోసం కేసీఆర్ స్కెచ్! 

తేరా చిన్నపరెడ్డి.. నోముల భగత్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, ఎంసీ కోటిరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి... ఇవి త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అధికార పార్టీ అభ్యర్థి రేసులో ఉన్న పేర్లు. వీరిలోనే ఎవరికో ఒకరికి టికెట్ వస్తుందని అంతా భావిస్తూ వస్తున్నారు. అయితే  రాజకీయ వ్యూహాల్లో  దిట్టగా పేరున్న  తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. నాగార్జున సాగర్ అభ్యర్థి విషయంలో ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ప్రతిపక్షాలు కూడా షాకయ్యేలా  అభ్యర్థిని ఖరారు చేసినట్లు సమాచారం  నాగార్జునసాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ నుంచి బీసీ అభ్యర్థిని పోటీలో పెట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్లు చెబుతున్నారు. సామాజిక వర్గాల వారీగానే కాకుండా నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పరిస్థితుల ఆధారంగా మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తియాదవ్ అల్లుడు కట్టబోయిన గురవయ్యయాదవ్‌ను రంగంలోకి దించబోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో  అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య యాదవ్ కొడుకు నోముల భగత్ బీసీ వర్గానికి చెందినవాడే. అయితే నాన్ లోకల్. నాగార్జున సాగర్ నియోజకవర్గ జనాల్లో లోకల్, నాన్‌లోకల్ ఇష్యూ తలెత్తిందని కేసీఆర్ దృష్టికి వచ్చిందంటున్నారు.అందుకే స్థానికుడైన గురవయ్య యాదవ్ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.  ఉపఎన్నిక టికెట్ కోసం టీఆర్ఎస్ నుంచి తీవ్ర పోటీ నెలకొంది. వరుస ఓటములతో డీలా పడిన పార్టీ కేడర్ లో జోష్ నింపాలంటే... సాగర్ లో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితిలో ఉంది టీఆర్ఎస్. అందుకే గతానికి భిన్నంగా అభ్యర్థి ఎంపికలో గులాబీ బాస్ సుదీర్ఘ కసరత్తు చేశారని తెలుస్తోంది. ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు బలమైన నేతను పోటీలోకి దించాలని భావించిన కేసీఆర్.. పలు సార్లు సర్వే చేయించారట. అన్ని సర్వేలతో పాటు నిఘా వర్గాలు కూడా  బీసీ అయితేనే గెలిచే అవకాశం ఉందని నివేదికలు ఇచ్చాయని సమాచారం. దీంతో కట్టబోయిన గురవయ్యయాదవ్ పేరును కేసీఆర్ దాదాపుగా ఫైనల్ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎవరూ ఊహించని విధంగా గురవయ్యయాదవ్ పేరు తెరపైకి రావడంతో రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. గురవయ్య యాదవ్ ది నిడమనూరు మండలం వెనిగండ్ల గ్రామం. మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తియాదవ్‌కు అల్లుడు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌కు తోడల్లుడు. కావలి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత బీద మస్తాన్ రావుకు వియ్యంకుడు. 2018 సంవత్సరం వరకు కుందూరు జానారెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. 2018లోనే టీఆర్ఎస్‌లో చేరారు. బీసీ సామాజికవర్గానికి చెందినవారు కావడంతో పాటు ఆర్థికంగా ఉండడంతో టీఆర్ఎస్ పార్టీ గురువయ్య యాదవ్ ను బరిలోకి దింపిందని భావిస్తున్నారు. మరోవైపు గురువయ్య యాదవ్  పేరు తెరపైకి రావడంతో మరో ప్రచారం కూడా జరుగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డిని గెలిపించేందుకే కేసీఆర్... కొత్త వ్యక్తికి టికెట్ ఇచ్చారని కూడా చర్చించుకుంటున్నారు. బీసీ వర్గానికి ఇవ్వాలనుకుంటే నోముల భగత లేదా విద్యార్థి నేత బాలరాజు యాదవ్ కు ఇవ్వవచ్చని... కావాలనే కొత్త వ్యక్తిని పోటీలో పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇక టీఆర్ఎస్ యాదవ వ్యక్తికి టికెట్ ఇస్తే బీజేపీ ఎవరిని బరిలోకి దింపుతుందన్నది ఆసక్తిగా మారింది. బీజేపీ టికెట్ రేసులో నివేదితా రెడ్డితో పాటు కడారి అంజయ్య యాదవ్ ఉన్నారు. 

మందు బాబులకు చేదు వార్త..

ఎన్నికలు వస్తే మందు బాబులకు పండగే పండగే..వారికి పార్టీలతో సంభందం లేదు. మందు బాటిల్ తోనే సంబంధం. ఛత్రపతి సినిమాలో కత్తికి బొచ్చుకు ఉన్న సంబంధం డైలాగ్ మాదిరి మందు బాబులకు మందు బాటిల్ కి ఉన్న సంబంధం. వారికీ పెగ్ వేయనిదే పొద్దుగడవడు. ఎన్నికల నేపధ్యంలో మందుబాబులకు  చేదు వార్త చెప్పిన సర్కార్. ఏప్రిల్ 6 వరకు మద్యం బంద్. మనిషికి రెండు ఫుల్ బాటిల్స్ మాత్రమే. దుకాణాలకు సర్కారు ఉత్తర్వులు. ఇక మందు బాబులకు తప్పని ఇక్కట్లు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలయ్యే దాకా రోజుకు ఒక్కొక్కరికి రెండు ఫుల్‌ బాటిళ్లు మాత్రమే ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. అంతకు మించి ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వచ్చే ఏప్రిల్‌ 6న అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటం తో ప్రస్తుతం ప్రధాన పార్టీలన్నీ తమ సభలకు, రోడ్‌షోలకు కార్యకర్తలతోపాటు సామాన్య ప్రజలను కూడా తరలించేందుకు చర్యలు తీసుకుంటు న్నాయి. అదే సమయంలో సభలకు, రోడ్‌షోలకు హాజరయ్యే కార్యకర్తలు, ప్రజలకు రూ. 300ల నుండి రూ.500ల వరకూ రోజువారీ భత్యంగా చెల్లిస్తుంటారు. ఇక మధ్యాహ్నం బిర్యానీ విందులు తప్పనిసరి. ఆ తర్వాత ఇళ్లకు తిరిగివెళ్లే ముందు టాస్మాక్‌ దుకాణా నికి వెళ్ళి మద్యం కొనుగోలు చేసుకెళుతుంటారు. ఈ పరిస్థితి వల్ల పీకలదాకా తాగిన మందుబాబులు గొడవలకు పాల్పడుతుంటారు.  ఈ ఎన్నికల్లో అలాంటి పరిస్థితులను నిరోధించాలని తమిళనాడు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆ మేరకు ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకూ ప్రభుత్వ మద్యం దుకాణాలలో ఒక వ్యక్తికి రెండు ఫుల్‌బాటిళ్ల కు మించి మద్యాన్ని విక్రయించకూడదంటూ పరిమితిని విధించింది. రెండు ఫుల్‌బాటిల్స్‌ లభించకపోతే నాలుగు ‘హాఫ్‌బాటిల్స్‌’ కొనుగోలు చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. హాఫ్‌బాటిల్స్‌ కొరతగా ఉంటే ఎనిమిది ‘క్వార్టర్‌’ బాటిళ్ల చొప్పున మద్యం కొనవచ్చని అన్నారు . రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలలో ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

జగన్ వేటగాడు..

వైసీపీ రౌడీల పార్టీ. జగన్‌ది వేటగాడి మనస్తత్వం. పావురాలకి ఆహారాన్ని వేస్తారు, అది పావురాల మీద ప్రేమతో కాదు, ఆ పావురాల మాంసం కోసం. ఇదే జగన్ తీరు అంటూ ఏపీ సీఎంను వేటగాడితో పోల్చారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. జగన్ అధికారంలోకి వస్తే అరాచక పాలన వస్తుందని ముందే చెప్పానని.. ఇప్పుడు అదే జరుగుతోందని గుర్తు చేశారు తులసీరెడ్డి.  పనిలో పనిగా మిగతా ప్రతిపక్షాలనూ ఏకిపారేశారు తులసీరెడ్డి. వైసీపీ, టీడీపీ, జనసేన.. ఈ మూడు పార్టీలు బీజేపీకి తోక పార్టీలన్నారు. ఆంధ్రలో కుస్తీ.. హస్తినలో దోస్తీ.. అంటూ కమలనాథులపై కస్సుమన్నారు. బీజేపీ చంకలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారన్నారు. జనం లేని పార్టీ జనసేన అంటూ విమర్శించారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీకి బినామీలు అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం అందరి పార్టీ అన్నారు తులసిరెడ్డి.

భర్త ఎఫైర్.. భార్య అటాక్..

వాళ్ళిద్దరిది ప్రేమవివాహం. పెళ్ళై 12 సంవత్సరాలు అవుతుంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మరోయువతితో అక్రమ సంబంధం స్టార్ట్ చేశాడు. ఆ విషయం తెలుసుకున్న భార్య భర్తను పలకరిస్తే అదేం లేదని బుకాయిస్తూ, భార్యకు సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇక అంటే భార్య . ఓ రోజు కాపుకాసి భర్తను, అతనితో అక్రమ సంబంధం పెట్టుకున్న అమ్మాయితో కలిసి ఉండడం చూసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇంకేముంది బందువులకు కబురు పెట్టి  ఆ తర్వాత ఇద్దరికి బడితపూజ చేసింది. ఈ ఘటన కొత్తగూడెం, గాజులరాజాం బస్తీలో వెలుగులోకి వచ్చింది. కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న రాజు 12 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.  అయితే కొన్ని నెలలుగా రాజు.. మరో యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. భర్తపై అనుమానం రావడంతో భార్య నిలదీసింది. అదేంలేదంటూ తప్పించుకున్నాడు. దీంతో భర్తపై ఆమె నిఘా పెట్టింది. వేరే యువతి ఇంటికి భర్త వెళ్లిన తర్వాత బయట గెడ పెట్టి.. బంధువులకు ఫోన్ చేసింది. వారిముందే భర్తతోపాటు ఆ యువతిని చితకబాదింది. ఈలోగా సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి వారిని స్టేషన్‌కు తరలించారు.

తూ ..తూ మంత్రంగా బడ్జెట్ సమావేశాలు ?

మార్చి నెల వచ్చేసింది. కానీ ఇంకా తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు అనే విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. సహజంగా మార్చి మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సంవత్సరం ఎమ్మెల్సీ ఎన్నికలు అడ్డురావడంతో ఎన్నికలు ముగిసిన తర్వాత.. మార్చి మూడవ వారంలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు కొద్ది రోజుల క్రితం ప్రకటించాయి. అయితే ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం, నాగార్జున సాగర్ ఉపఎన్నిక  నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే  బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు, ఎలా,ఎన్ని రోజులు అనే విషయంలో స్పష్టత వస్తుందని తెలుస్తోంది.   కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 15 వ తేదీలోగా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తే.. మార్చి మూడవ వారం మొదట్లో క్లుప్తంగా రెండు రోజులు సభను సమావేశపరిచే అవకాశం ఉందని తెలుస్తోంది. మొదటి రోజు గవర్నర్ ప్రసంగం, రెండవ రోజు బడ్జెట్ ప్రవేశ పెట్టి సాగర్ ఉపఎన్నిక ముగిసే వరకు సభను వాయిదా వేయాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే ఇప్పుడు  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలుతో పాటు నాగార్జున సాగర్ నోటిఫికేషన్ రాకపోవడంతో.. మార్చి చివరి వారంలో ఒకే సారి ఓ వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించి, ఏప్రిల్ 1 న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యేలోగా బడ్జెట్ కథకు ముగింపు చెప్పాలని ప్రభుత్వం తలపోస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో కనీసం పది పనిదినాలు ఉండేలా 15 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం  ఆనవాయితీగా వస్తోంది. బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ పై చర్చ ఆమోదంతో పాటు, గవర్నర్ ప్రసంగం, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై చర్చ ఉంటుంది. ప్రభుత్వ సమాధానం, ప్రశ్నోత్తరాలు, స్వల్ప వ్యవధి చర్చ, ఇలా వివిధ నిబధనల పరిధిలో.. అనేక ప్రజాసమస్యలు చర్చకు వస్తాయి. కానీ ఈ సారి గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ పై చర్చకు కూడా అంతగా అవకాశం ఉండక పోవచ్చని తెలుస్తోంది. గత సెప్టెంబర్ లో జరిగిన వర్షాకాల సమావేశాల్లో కొందరు సభ్యులు, సిబ్బందికి కొవిడ్ సోకడంతో అర్ధాంతరంగా వాయిదా వేశారు. వర్షాకాల సమావేశాల్లో  రెవెన్యూ బిల్లు సహా కొన్ని కీలక బిల్లులు అయితే ఆమోదం పొందాయి.  కానీ ప్రజా సమస్యలు అంతగా చర్చకు రాలేదు. ఆ తర్వాత అక్టోబర్ 13, 14 తేదీలలో రెండు రోజులపాటు జరిగిన ప్రత్యేక సమావేశాల్లో కేవలం హై కోర్టు ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టసవరణ బిల్లు, యాసంగి పంటలు, ధాన్యం  కొనుగోలు విధానం మాత్రమే చర్చకు వచ్చాయి.   రాష్ట్రం ఎదుర్కుంటున్న సమస్యలు ముఖ్యంగా..  రోజు రోజుకు దిగజారుతున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న అప్పులు, తరుగుతున్న ఆదాయం, ఆందోళనకు గురి చేస్తున్న శాంతి భద్రతల పరిస్థితిపై చర్చ జరగాల్సి ఉందని విపక్షాలు భావిస్తున్నాయి. నిరుద్యోగం, కేంద్ర ప్రభుత్వం నుంచి అందవలసిన సహాయం అందకపోవడం ఇలా రాష్ట్రాన్ని వేధిస్తున్న వివిధ అంశాలపై చర్చించేందుకు బడ్జెట్  సమావేశాలు కొంత ఎక్కువ కాలం నిర్వహించ వలసి ఉందని  ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి.  అయితే ప్రభుత్వం మాత్రం ఎదో విధంగా బడ్జెట్ పద్దు ‘మమ’ అని పించుకుంటే చాలనే ఉద్దేశంతో ఉన్నట్లు, అధికార వర్గాల సమాచారం బట్టి తెలుస్తోంది.  

నలుగురు మంత్రుల మాఫియా

ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం వాడివేడీగా సాగుతోంది. అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే  బాలకృష్ణ.. తన సొంత నియోజకవర్గం హిందూపురంలో  మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు బాలయ్య. రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, ఏపీలో నలుగురు మంత్రుల మాఫియా నడుస్తోందని మండిపడ్డారు. ఒకరు చంద్రబాబును తిట్టడానికి... మరొకరు లిక్కర్ మాఫియా నడపడానికే ఉన్నారన్నారు బాలకృష్ణ. అన్నింటినీ ప్రైవేటు పరం చేసి వ్యవస్థలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఐఏఎస్, ఐపీఎస్‌లు గత ప్రభుత్వంలో గౌరవంగా ఉండే వారనీ.. ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్‌ల పరిస్థితి మారిపోయిందని బాలయ్య వ్యాఖ్యానించారు. ఏపీలో ప్రస్తుతం ఇసుక.. మద్యం మాఫియా రాజ్యమేలుతున్నాయని బాలకృష్ణ విమర్శించారు. రాష్ట్రంలో యువత భవిష్యత్తు అంధకారం అయిందన్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారని చెప్పారు. గతంలో మట్కా.. అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేశామని, ఇప్పుడు ఇవన్నీ రాజ్యమేలుతున్నాయని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర ధరలు సామాన్యులకు అందుబాటులో లేవన్నారు. హిందూపురంలో ఎవ్వరు భయపడొద్దని, రెండేళ్లలో ఏమి అభివృద్ధి చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లామన్నారు. హిందూపురంను గత ప్రభుత్వం టీడీపీ హయాంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు. జవాబు దారి తనం ఉన్న పార్టీకి ప్రజలు ఓటు వేయాలని బాలయ్య పిలుపు ఇచ్చారు.  

ఆ ఇద్దరు ఆర్థిక ఉగ్రవాదులు..

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. కాగ్ నివేదిక ప్రకారం అప్పుల్లో ఏపీ దేశంలోనే టాప్. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇంత దారుణంగా మారడానికి ఆర్థిక ఉగ్రవాదులే కారణమన్నారు ఏపీ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలు ఉగ్రవాదుల కంటే ప్రమాదకరమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి నెల జీతాలు 15వ తేదీన ఇచ్చారంటే రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకోవచ్చుని అన్నారు. ఐదేళ్ళల్లో టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పుల కంటే పది నెలల కాలంలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రెడ్డింపు అయ్యాయన్నారు. అభివృద్ధి కోసం అప్పులు చేయటంలో అర్థముంది.. కానీ పప్పు, బెల్లం పంచటానికి అప్పులు చేయటం చేతకాని తనమని కుటుంబరావు మండిపడ్డారు.  ఏపీ ఆర్థిక పరిస్థితిపై సామాన్య ప్రజలు సైతం ఆలోచించుకోవాలని కోరారు కుటుంబరావు. సంక్షేమ పథకాలు ఇస్తునే.. పన్నుల వసూలు చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారని అన్నారు. ఆస్తిపన్నులు, లిక్కర్, పెట్రోల్, డీజిల్‌పై ఏపీ ప్రభుత్వం ఎక్కువ టాక్స్ వసూలు చేస్తోందని విమర్శించారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చే పది వేలు పెట్రోల్ డీజిల్‌కే సరిపోవటంలేదని విమర్శించారు.  అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ టాప్! ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ఛాన్స్  ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు అన్నపూర్ణ రాష్ట్రం. స్వర్ణాంధ్రప్రదేశ్ ఏపీ ప్రజల నినాదం. కాని ఇప్పుడు సీన్ మారిపోయింది. జగన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. అప్పు చేస్తేనే కాని రోజు గడవని పరిస్థితిలోకి వెళ్లిపోయింది. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలన్నా అప్పు  చేయాల్సిన దుస్థితిలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇదేదో ఊరికే చెప్పడం కాదు.. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్  విడుదల చేసిన గణాంకాలే చెబుతున్నాయి. రాష్ట్రాలు తీసుకున్న రుణాల శాతంలో ప్రస్తుతం దేశంలోనే ఏపీలో టాప్ లో ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో పది నెలల లెక్కలను విడుదల చేసిన కాగ్.. జనవరి నెలాఖరు వరకు ఏపీ రూ. 73,912.91 కోట్లను అప్పుల రూపంలో సమకూర్చుకున్నట్టు తెలిపింది. బహిరంగ మార్కెట్ నుంచి అప్పులు తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. ఏప్రిల్ 2020 నుంచి డిసెంబరు వరకు రూ.44,250 కోట్లను.. ఏపీ ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి రుణంగా సేకరించింది. ఇందుకోసం స్పెషల్ డ్రాయింగ్ సౌకర్యం, చేబదుళ్లు, ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ఉపయోగించుకుంది. అంతేకాదు రాష్ట్రం తీసుకున్న అప్పులలో 42% కంటే ఎక్కువ గత రుణంపై వడ్డీని తిరిగి చెల్లించటానికి వెళుతుంది.  గత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ రాబడి పెరిగినా.. రుణాలు కూడా భారీ స్థాయిలో పెరిగాయి. 2010-20 ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలఖారు వరకు రెవెన్యూ రాబడి రూ. 85,987.04 కోట్లుగా ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.88,238.70 కోట్ల రాబడి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు నాటికి రూ.46,503.21 కోట్ల రుణం ఉంటే ఇప్పుడది ఏకంగా రూ. 73,912.91 కోట్లకు చేరింది. ఈ ఏడాది అప్పు అంచనాతో పోలిస్తే ఇది 153 శాతం అధికం. రాష్ట్రంలో ఖర్చు చేస్తున్న ప్రతి 100 రూపాయల్లో రూ. 45 అప్పుగానే సమకూర్చుకున్నట్టు కాగ్  విడుదల చేసిన గణాంకాలను బట్టి తెలుస్తోంది.  2020-21 ఆర్థిక సంవత్సరంలో  జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తన బడ్జెట్లో అంచనా వేసిన దానికంటే 142% ఎక్కువ అప్పు తీసుకుంది. 2020 డిసెంబర్‌లో కాగ్ ఇచ్చిన నివేదిక ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్ర ఆర్థిక లోటు రూ .68,536 కోట్లు. 40,190 కోట్ల రూపాయల లోటుతో రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది.  ద్రవ్య లోటు పెరుగుదల అధిక వడ్డీ చెల్లింపులను సూచిస్తుంది. వడ్డీ చెల్లింపులు అభివృద్ధి కాని ఖర్చులుగా పరిగణించబడతాయి. ఇవి పన్ను చెల్లింపుదారుపై భారాన్ని కలిగిస్తాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 13,406 కోట్ల రూపాయలను వడ్డీ చెల్లింపులు చేసింది.  జగన్ రెడ్డి సర్కార్ సంక్షేమ పథకాలను కొనసాగిస్తోంది. ఈ పథకాలను అందించడానికి పన్నులు పెంచుతోంది. అది చాలక ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తోంది. రాష్ట్ర ఆదాయానికి రూ .9,000 కోట్లకు పైగా పన్నుల రూపేనా వస్తోంది.  రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపై పరోక్ష పన్నుల భారం ఎక్కువగా ఉంటుంది. పన్నుల ద్వారా వచ్చే రాబడి గత సంవత్సరంతో  పోలిస్తే 176% పెరిగింది. వడ్డీ చెల్లింపులు పెరిగితే రాష్ట్రానికి మరింత భారమవుతుంది. వడ్డీని తిరిగి చెల్లించడం కోసం మరింతగా రుణాలు తీసుకోవాల్సి వస్తుంది. దీని ప్రభావం  ఉత్పాదక పెట్టుబడిపై పడనుంది. ఇదే జరిగితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని ఎకనమిస్టులు చెబుతున్నారు.  ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఆదాయ లోటు మరియు ద్రవ్య లోటు బడ్జెట్ అంచనాల కంటే ఎక్కువగా ఉండటం చాలా డేంజర్ అంటున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ లోటు రూ .18,434 కోట్లుగా అంచనా వేయబడింది, అయితే ఇది 2020 డిసెంబర్ నాటికి రూ 49,809 కోట్లకు పైగా దాటింది. రాష్ట్ర వ్యయం మొత్తం ఖర్చులో సగం అప్పులకే వెళుతున్నాయి. ఇది ఆమోదయోగ్యం కాదంటున్నారు ఆర్థికవేత్తలు.  అప్పుల ఉచ్చుకు ఇది స్పష్టమైన సూచన అని హెచ్చరిస్తున్నారు. ఆర్థిక చిక్కులను అర్థం చేసుకోకుండా  జగన్ మోహన్ రెడ్డి తన ఎన్నికల మ్యానిఫెస్టోను అమలు చేయడమే ఆర్థిక సంక్షోభానికి కారణమని ఏపీ మాజీ సీఎస్ ఐవై కృష్ణారావు చెప్పారు. ఇది భయంకరమైన పరిస్థితి అని.. ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కూలిపోతుందో చెప్పలేమన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇంత దారుణంగా మారడానికి ఆర్థిక ఉగ్రవాదులే కారణమన్నారు ఏపీ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలు ఉగ్రవాదుల కంటే ప్రమాదకరమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రచారానికి దావూద్...

ఎన్నికల ప్రచారంలో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, ఆలైఖైదా నేత బిన్ లాడెన్. వారి ఫోటోలే ప్రచారానికి కరెక్ట్. టీఆర్ఎస్ కు బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ఇచ్చిన ఉచిత సలహా ఇది. అధికార పార్టీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీ లాంటి గొప్ప నేత ఫోటోను వాడుకోవడంపై బండి మండిపడ్డారు. టీఆర్ఎస్ కు పీవీ ఫోటో కాకుండా, దావూద్, బిన్ లాడెన్ ఫోటోలు పెట్టుకుంటే ప్రజలు గుర్తిస్తారని సెటైర్లు వేశారు. గులాబీ పార్టీ నేతలు పీవీ ఫోటోను ప్రచారానికి వాడుకుంటున్నా.. కాంగ్రెస్ నేతలు స్పందించకపోవడం ఏంటని సంజయ్ ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు ఒక్కటే అని.. పరస్పరం కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు.  ఇక సమస్యలపై కేసీఆర్ ను అభ్యర్థించడం ఉండదు.. ఇక నుంచీ అన్నీ వార్నింగ్‌లే.. ఇదీ సీఎం కేసీఆర్ కు బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ఇచ్చిన వార్నింగ్. లక్షల కోట్లు దోచుకున్నందుకు కేసీఆర్‌కు జైలు జీవితం తప్పదని, ఆయన పతనం ఆరంభమైందని హెచ్చరించారు. పనిలో పనిగా కేటీఆర్ నూ నిలదీశారు బండి. ఐటీఐఆర్‌ ప్రాజెక్టుపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తప్పుబడుతూ కాగ్‌ నివేదిక ఇచ్చిన మాట వాస్తవమా? కాదా? దీనిపై మంత్రి కేటీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు బండి సంజయ్.   

ప్రధాని మోడీకి ఎలక్షన్ కమిషన్  షాక్

దేశంలోని ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో ప్రస్తుతం ఉన్న ప్రధాని మోదీ ఫొటోలపై కేంద్ర ఎన్నికల కమిషన్ సంచలన ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఆ ఐదు రాష్ట్రాల్లోని పెట్రోల్ పంపుల్లో మోదీ ఉన్న హోర్డింగులను 72 గంటల్లోగా తొలగించాలని ఈసీ ఆదేశించింది. దేశ ప్రధానమంత్రి ఫోటోలతో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేస్తూ పెట్రోల్ పంపుల్లో హోర్డింగులు పెట్టడం ఎన్నికల నిబంధనల ఉల్లంఘనగా ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఇది ఇలా ఉండగా కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఫొటోలు, పోస్టర్లు, వీడియోలను పెట్రోల్ పంపుల్లో ప్రదర్శిస్తున్నారని.. దీనిపై ఆదేశాలు జారీ చేయాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో పెట్రోల్ పంపులతోపాటు వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రచారంలో ప్రధాని మోదీ చిత్రాలు, పోస్టర్లు, వీడియోలను 72 గంటల్లోగా తొలగించాలని తాజాగా ఈసీ ఆదేశాలు జారీ చేసింది

బాలికలపై పోలీసుల వికృత చేష్టలు.. 

విచారణ పేరుతో పోలీసుల వికృత పనులు. బాలికల హాస్టల్లోకి ప్రవేశించి వారితో నగ్నంగా నృత్యం చేయించి దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆ బాలికలతో అమానుషంగా ప్రవర్తించారు. ఓ కేసు విచారణ పేరుతో  పోలీసులు బాలికల హాస్టల్‌లోకి  ప్రవేశించారు. వారి డ్యూటీ మరిచి బాలికలతో బలవంతంగా బట్టలు విప్పించి.. వారితో నగ్నంగా నృత్యం చేయించారు. దీనికి సంబంధించి ఓ వీడి యో ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతోంది. ఈ ఘటన మహారాష్ట్రలోని జల్గావ్‌లో జరిగింది. పోలీసుల దుర్మార్గం పై  మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. విచారణ కోసం నలుగురు సభ్యులతో అత్యున్నత స్థాయి కమిటీని నియమిస్తున్నట్లు బుధవారం అసెంబ్లీలో హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ప్రకటించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటన చాలా తీవ్రమైనదని, ప్రభుత్వం అంత సీరియస్ లేదని అంతకుముందు అసెంబ్లీలో బీజేపీ నేత సుధీర్‌ అసెంబ్లీలో ఆరోపించారు.

విశాఖలో మైండ్ గేమ్.. ఓటర్లు ఎటు వైపు?

విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ పరాజయం ఖాయంగా కనిపిస్తోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలో అధికార పార్టీ వైఖరిపై ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. జీవీఎమ్సీ ఎలక్షన్స్ లో ఫ్యాన్ పార్టీ కి గట్టి బుద్ధి చెప్పేందుకు ఓటర్లు సిద్ధమయ్యారు. కార్మికుల పక్షాన విశాఖ ఉక్కు హక్కు కోసం పోరాడుతున్న టీడీపీకి ప్రజా మద్దతు రోజురోజుకీ భారీగా పెరుగుతోంది. అధికార పార్టీపై ప్రజలో ఉన్న ఆగ్రహాన్ని గుర్తించిన వైసీపీ ఇంఛార్జ్ విజయసాయిరెడ్డిలో కంగారు పెరిగింది. అందుకే, జనాలను కన్ఫ్యూజ్ చేసేందుకు గంటా ఎపిసోడ్ ను మరోసారి తెరమీదకు తీసుకొచ్చారని అంటున్నారు.  విశాఖ ప్రజలపై సామ, ధాన, భేద, దండోపాయాలు ప్రయోగిస్తున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఎన్నికలకు ముందు నుంచే టీడీపీ టార్గెట్ గా అభివ్రుద్ధి పేరుతో అరాచకాలు మొదలుపెట్టారని అంటున్నారు. గీతం వర్సిటీ నిర్మాణాలను కూలగొట్టారు. భీమిలి రోడ్డులో గంటా అనుచరుడు బొడ్టేటి కాశీ విశ్వనాథం నిర్వహిస్తున్న గోకార్టింగ్‌ను నాలుగు నెలల క్రితం షెడ్లతో సహా కూల్చివేశారు. ఆ టార్చర్ తట్టుకోలేక కాశీ విశ్వనాథం విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీ కండువ కప్పేసుకుని ఊపిరి పీల్చుకున్నారు. గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడిని దారికి తెచ్చుకున్నాక.. ఇక గంటాపై ఫోకస్ పెట్టారు విజయసాయిరెడ్డి. ఆయన త్వరలోనే వైసీపీలో చేరుతున్నారని, సీఎం జగన్ ముందు కొన్ని కండీషన్స్ పెట్టారంటూ బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఇక అంతే గంటా పార్టీ మారుతున్నారంటూ ప్రచారం మొదలైపోయింది. టీడీపీ శ్రేణుల్లో అయోమయం. విజయసాయికి కావలసిందీ ఇదే. జరుగుతున్న నష్టాన్ని వెంటనే గుర్తించిన గంటా.. తాను వైసీపీలో చేరడం లేదంటూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. జగన్ ముందు తాను పెట్టిన కండీషన్స్ ఏంటో చెప్పాలంటూ విజయసాయిని డిమాండ్ చేశారు. గంటా కామెంట్లకు మళ్లీ విజయసాయి నుంచి కౌంటర్ వచ్చింది. ఇలా జీవీఎమ్సీ ఎన్నికలకు ముందు ఇద్దరి నేతల మధ్య డైలాగ్ వార్ తో విశాఖ ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు, గంటా టీడీపీలో ఉంటున్నారా? వైసీపీలో చోరుతున్నారా? అంటూ డైలమాలో పడ్డారు. ఇప్పటికే టీడీపీకి ఓటు వేయాలని ఫిక్స్ అయిన ఓటర్లంతా గంటా ఎపిసోడ్ తో వారిలో గందరగోళం నెలకొంది. ఇదంతా విజయసాయిరెడ్డి ఆడుతున్న మైండ్ గేమ్ అంటున్నారు టీడీపీ నేతలు.  గంటా తీరు సైతం ఈ గందరగోళానికి ప్రధాన కారణం. రెండేళ్లుగా మౌనంగా ఉంటూ, టీడీపీకి దూరంగా ఉంటూ.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణతో ఒక్కసారిగా ప్రజాక్షేత్రంలో మళ్లీ యాక్టివ్ అయ్యారు గంటా శ్రీనివాసరావు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి విశాఖ ఉక్కు ఉద్యమానికి ఊపు తెచ్చారు. టీడీపీ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు కోసం పెద్ద ఎత్తున పోరాటం జరుగుతోంది. టీడీపీ నేత గంటా అందులో ముందున్నారు. ఇదంతా అధికార పార్టీలో కలవరానికి కారణమైంది. వైజాగ్ లో టీడీపీ జోరు పెరగడం.. పసుపు జెండా నీడనే ఉక్కు ఉద్యమం ఎగిసిపడుతుండటంతో.. జీవీఎమ్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే, గంటా పేరుతో మైండ్ గేమ్ ఆడుతూ టీడీపీ కేడర్ ను కకావికలం చేసే ప్రయత్నం విజయసాయిరెడ్డి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాజధాని పేరుతో కొంతకాలంగా అధికార పార్టీ చేస్తున్న ఆగడాలతో విశాఖ ప్రశాంతత చెదిరిందనే విమర్శ వినిపిస్తోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలో వైసీపీ పెద్దల హస్తం ఉందనే ఆరోపణ ఆ పార్టీకి మరింత డ్యామేజ్ చేస్తోంది. అందుకే, జీవీఎమ్సీ ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే జగన్ దగ్గర విజయసాయిరెడ్డి ఇమేజ్ దారుణంగా పడిపోతోంది. ఇప్పటికే ప్రజా వ్యతిరేకతపై జగన్ కు నివేదికలు అందాయని.. విజయసాయిరెడ్డి వైఫల్యంపై జగన్ రెడ్డి సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. అందుకే, విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్న విజయసాయి.. ఎన్నికలకు ముందు చివరి ప్రయత్నంగా గంటా పార్టీ మారుతున్నారంటూ మైండ్ గేమ్ తో పొలిటికల్ గేమ్ ఆడుతున్నారని అంటున్నారు. మరి, చైతన్యవంతులైన విశాఖ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఎలాంటి తీర్పు చెబుతారో...

పెరిగిన పాజిటివ్ స్పీడ్.. రెండు రాష్ట్రాలు భయం భయం  

మనదేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు కొద్దిరోజుల క్రితం వరకు తగ్గినటుల్గా కనిపించినా తాజాగా మళ్ళీ పెరుగుతున్నాయి. మొన్నటివరకు పది పన్నెండు వేల మధ్య నమోదు కాగా.. గడచిన 24 గంటలలో కొత్తగా 17,407 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,56,923కు చేరింది. మరోపక్క నిన్న 14,031 మంది కరోనా నుండి కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 1,08,26,075 కు చేరింది. అదే సమయంలో నిన్న కొత్తగా 89 మంది కరోనా కారణంగా కన్ను మూశారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,57,435 కు చేరింది. ప్రస్తుతం 1,73,413 మంది వివిధ ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో ఉంది చికిత్స తీసుకుంటున్నారు.  ఇది ఇలా ఉండగా తాజాగా నమోదవుతున్న పాజిటివ్ కేసులలో 60 నుంచి 70 శాతం కేసులు మహారాష్ట్ర, కేరళ నుండి నమోదవుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో 9,855 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. కేరళలో 2,700 కరోనా కేసులు నమోదయ్యాయి.. దీంతో మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికే లాక్‌డౌన్ విధించారు. మరోపక్క మహారాష్ట్ర రాజధాని ముంబైని కరోనా ఉధృతి నేపథ్యంలో మాస్క్ పెట్టుకో ని వారిపై చర్యలు తీసుకోనున్నట్లు ముంబై పోలీసు కమిషనర్ పరమవీర్ సింగ్ హెచ్చరించారు. నగరంలోని ప్రత్యేక జోన్‌లలో కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే వెయ్యి రూపాయల వరకూ జరిమానా విధించనున్నట్లు అయన తెలిపారు. మహారాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం 3,60,500 మంది హోంక్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. అంతేకాకుండా బ్రెజిల్ నుంచి వచ్చే మహారాష్ట్రవాసులు ఏడు రోజుల పాటు కంపల్సరీ హోం క్వారంటైన్‌ లో ఉండాలని అధికారులు ఆదేశాలు స్పష్టం చేశారు.  

టీడీపీతో జనసేన పొత్తు.. ఏపీలో బీజేపీకి బిగ్ షాక్!  

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. పార్టీ గుర్తులతో జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రధాన పార్టీల సత్తా ఏంటోమున్సిపల్ వార్ లో  తేలిపోనుంది. అందుకే అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉంది. కాని మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం పొత్తు పూర్తిస్ఠాయిలో ఉన్నట్లుగా కనిపించడం లేదు. కొన్ని పట్టణాల్లో బీజేపీకి షాకిచ్చింది జనసేన. తెలుగు దేశం పార్టీతో కలిసి పోటీ చేస్తోంది. బీజేపీలో పోటీలో ఉన్నా.. ఆ పార్టీని కాదని.. ఒకప్పటి తమ మిత్రపక్షం టీడీపీతో జట్టు కట్టారు జన సైనికులు.  పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో  బీజేపీని కాదని.. టీడీపీతో పొత్తు పెట్టుకుంది జనసేన. జంగారెడ్డిగూడెంలో మొత్తం 29 వార్డులున్నాయి. ఇందులో 24 వార్డుల్లో టీడీపీ, 5 వార్డుల్లో జనసేన పోటీచేస్తున్నాయి. ఇరు పార్టీల నేతలు కలిసి కట్టుగా ప్రచారం చేస్తున్నారు. తమ అభ్యర్థులకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తుతో జంగారెడ్డి గూడెం ఎన్నిక  రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామని ఇరు పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇంకొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. వైసీపీ నేతలు బలవంతంగా తమవారిని పోటీ నుంచి తప్పించారని ఆరోపిస్తున్న టీడీపీ నేతలు.. ఆ వార్డుల్లో జనసేనకు సపోర్ట్ చేస్తున్నారు. ఓపెన్ గానే ప్రచారం చేస్తూ జనసేన పార్టీ గుర్తుకు ఓట్లు వేయమని కోరుతున్నారు. టీడీపీ అభ్యర్థులు పోటీ లేని వార్డుల్లో జనసేన అభ్యర్థులకు మద్దతుగా ఉంటామని దెందులూరు  టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రకటించారు.  వైసీపీని ఓడించేందుకు ఎవరితోనైనా కలిసి పోతామంటున్నారు స్థానిక టీడీపీ నేతలు. 

నడిరోడ్డుపై అధికార పార్టీ ఎమ్మెల్యే వీరంగం 

అతనో అధికార పార్టీ ఎమ్మెల్యే. ఇంకేం రెచ్చిపోయాడు.. నడి రోడ్డుపై వీరంగం వేశాడు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ..  రోడ్డుపై తన అనుచరులతో కలిసి ధర్నాకు దిగాడు. రోడ్డుపై ధర్నా చేయడంతో ట్రాఫిక్ జామై.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నా సదరు నేత పట్టించుకోలేదు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్  ఎస్ఐతో గొడవపెట్టుకున్నారు. అంతేకాదు ఆయన మొబైల్ ఫోన్ లాక్కొని విసిరికొట్టారు. ఎస్ఐని  నోటికి వచ్చినట్లు తిట్టారు. ఈ ఘటనను వీడియో తీసేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ ఎస్ఐ ఫోన్ లాక్కొన్ని..విసిరికొట్టారు అధికార పార్టీ ఎమ్మెల్యే.  హైదరాబాద్‌ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. దూలపల్లి నుంచి కొంపల్లి వైపు ఓ వాహనం రాంగ్ రూట్‌లో వచ్చింది. అక్కడే ఉన్న ఎస్ఐ అడ్డుకున్నాడు. డ్రైవర్‌ను కిందకు దింపి అడిగితే.. తాను మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మనిషినని, నన్నే అడ్డుకుంటావా? అని మండిపడ్డారు. నువ్వు ఎవరైతే నాకేంటి.. ట్రాఫిక్ రూల్స్ పాటించాలి కదా.? అని ఎస్ఐ స్పష్టం చేశాడు. ఐతే ఆ వ్యక్తి.. ఎమ్మెల్యేకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో  కొన్ని నిమిషాల్లోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఘటనా స్థలానికి వెళ్లారు.  రోడ్డుపై విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ దగ్గరకు వెళ్లి గొడవపడ్డారు ఎమ్మెల్యే. అతడు నా అనుచరుడు అని చెప్పినా.. వినవా..? అంటూ మండిపడ్డారు. ఎస్ఐ పట్ల దుర్భాషలాడారు. నోటికి వచ్చినట్లు తిట్టారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ ఎస్ఐ, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే అని కూడా చూడకుండా.. ఇలా ప్రవర్తిస్తారా? అని ట్రాఫిక్ ఎస్ఐ తీరుపై మైనంపల్లి మండిపడ్డారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో.. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువురికీ సర్దిచెప్పారు. అనంతరం ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.  ఈ ఘటనపై ట్రాఫిక్ ఎస్ఐ.. పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన విధులకు ఆటంకం కలిగించడమే గాకుండా.. నోటికొచ్చినట్లు తిట్టారని, ఫోన్ పగులకొట్టారని పేర్కొన్నారు. తన డ్యూటీ తాను చేయడం కూడా తప్పా..? అని ఆయన వాపోయారు. ఈ వ్యవహారంపై విపక్షాలు మండిపడుతున్నారు. టీఆర్ఎస్ నేతలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని, ట్రాఫిక్ ఎస్ఐపై ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరు సరికాదని విమర్శలు గుప్పిస్తున్నారు. ఎమ్మెల్యే మైనంపల్లిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

20 ఏళ్ళ జైలు జీవితం తర్వాత నిర్దోషి..

తప్పులు అందరు చేస్తారు. కొందరు తప్పులు చేసి తప్పించుకుంటారు. మరికొందరు దొరికిపోతారు. అదే చేయనని నేరానికి శిక్ష పడితే. కుటుంబం దిక్కులేనిది అవుతుంది. పిల్లను దిక్కులేని వాళ్ళు అవుతారు..అయినా.. ఇలాంటివి సినిమాల్లో కదా జరిగేది అనుకుంటున్నారా.. అలా అనుకుంటే పొరపాటే. అతడు 20 సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు. అర్థ ఆయుష్షు ఉన్నపుడు అయ్యాడు. అతను బతికి ఉన్నాడు అనే విషయం తన కుటుంబం కూడా మరిచిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌ గ్రామానికి చెందిన విష్ణు తివారీ 23 సంవత్సరాల వయసులో ఓ రేప్ కేసులో అరెస్ట్ అయ్యాడు. 20  ఏళ్ళు జైలు లో ఉన్నాడు. 43 వ ఏట జైలు నుండి విడుదల అయ్యాడు. మూడేళ్లు జైల్లో మగ్గిన తర్వాత.. కోర్టు దోషిగా తేల్చి 10 ఏళ్లు జైలు శిక్ష వేసింది. ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం కింద జీవిత ఖైదు విధించింది. అతడు హైకోర్టుకు వెళ్లాడు. అక్కడ కేసు సా..గుతూ వచ్చింది. అంతలోనే ఏళ్లు గడిచిపోయాయి. చివరికి ఈ జనవరిలో అతడు నిర్దోషి అని కోర్టు తీర్పు చెప్పింది. దీంతో.. అతడు బుధవారం జైలు నుంచి విడుదలయ్యాడు. చేయని నేరానికి 20 ఏళ్లు జైల్లో సగం జీవితం గడిపాడు.  ప్రస్తుత వయసు 43 ఏళ్లు. విడుదల అవుతున్న క్షణంలో అతడి కళ్లలో నైరాశ్యం, దేహంలో నీరసం. జైలు నుంచి తీసుకెళ్లేందుకు కూడా ఎవరూ రాలేదు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు బయటికొచ్చి నేనేం చేయగలను. జైల్లోనే నా ఒళ్లు హూనమైపోయింది. నా కుటుంబం కూడా నాశనమైపోయింది. ఓ సోదరుడు మినహా.. నాకంటూ ఎవరూ లేకుండా పోయారు. నా జీవితం జైల్లో వంట గదికే పరిమితమైపోయింది. ఈ రోజు విడుదలయ్యే నాటికి నా చేతిలో రూ. 600 మాత్రమే ఉంది’’ అంటూ వాపోయాడు. ఎక్కడో జరిగిన తప్పునకు సగం జీవితంతో పాటు.. కుటుంబాన్ని కోల్పోయి.. ఒంటరిగా మిగిలిపోయాడు విష్ణు తివారీ.

అమరావతికి మరో అన్యాయం.. రైల్వేకు రాం రాం..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అడుగడుగునా అన్యాయం. చంద్రబాబు హయాంలో అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణం ప్రారంభమైన అమరావతి.. నేడు పాడు బడిన రాజధానిగా కునారిల్లుతోంది. అమరావతి వెలుగు పూర్తిగా మసక బారింది. 400 రోజులకు పైగా రైతులు దీక్ష చేస్తున్నా.. పట్టించుకునే నాథుడే లేడు. వారి గోడు వినేందుకు, ఆంధ్రుల కలల రాజధానికి పూర్తి చేసేందుకు పూనుకునే నాయకుడే కానరావడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమరావతికి అడుగడుగునా అన్యాయం చేస్తున్నాయి. సీఎం జగన్ రాజధానిని మూడు ముక్కలు చేసి, మూడు ముక్కలాట ఆడుకుంటుంటే.. అడ్డుకోవాల్సిన కేంద్రం సైతం చేష్టలుడిగి చూస్తూ.. చేతులెత్తేస్తోంది. తాజాగా, అమరావతికి ఇచ్చిన మరో హామీని తుంగలో తొక్కింది. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధానికి రైల్వే లైను ఇస్తామని ప్రకటించింది. ఆ హామీపై ఇప్పుడు తూచ్ అంటోంది కేంద్రం. ఇంతకంటే అన్యాయం ఇంకేముంటుందని వాపోతున్నారు రాజధాని ప్రజలు.  ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు, కృష్ణా జిల్లా పెద్దాపురం నుంచి నంబూరు వరకూ, అమరావతి నుంచి పెదకూరపాడు వరకు, సత్తెనపల్లి నుంచి నరసరావు పేట వరకూ సింగిల్ లైన్లకు గతంలో కేంద్రం హామీ ఇచ్చింది. తాజాగా, ఆ రైల్వే లైను నిర్మాణం నుంచి వెనక్కి తగ్గింది కేంద్రం. అందుకు కారణం జగన్ సర్కారే అనేది కేంద్ర ప్రభుత్వ మాట. అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్లు విషయంలో ఏపీ ప్రభుత్వం ఆసక్తిగా లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఖర్చును పంచుకునేందుకు రాష్ట్రం ముందుకు రాకుంటే తామేమీ చేయలేమని చెప్పింది. జగన్ రెడ్డి సర్కారు కాస్త చొరవ తీసుకుంటే అమరావతికి రైల్వే లైను తప్పక వచ్చేది. సంక్షేమ పథకాల పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్న సర్కారు.. అమరావతి రైలు కోసం కాసిన్ని డబ్బులు విదిల్చినా చాలు. చుక్ చుక్ బండి ఏపీ రాజధాని నుండి దూసుకుపోతుంది. అలా చేయడానికి ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. కాసులు ఇచ్చేందుకు కనికరించడం లేదు. ఫలితం.. అమరావతికి రైల్వే స్టేషన్ ఇక తీరని కల. ఆ పాపం.. అక్షరాలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే అని రాజధాని ప్రజలు ఆరోపిస్తున్నారు.