నడిరోడ్డుపై అధికార పార్టీ ఎమ్మెల్యే వీరంగం
posted on Mar 4, 2021 @ 10:29AM
అతనో అధికార పార్టీ ఎమ్మెల్యే. ఇంకేం రెచ్చిపోయాడు.. నడి రోడ్డుపై వీరంగం వేశాడు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ.. రోడ్డుపై తన అనుచరులతో కలిసి ధర్నాకు దిగాడు. రోడ్డుపై ధర్నా చేయడంతో ట్రాఫిక్ జామై.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నా సదరు నేత పట్టించుకోలేదు. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ ఎస్ఐతో గొడవపెట్టుకున్నారు. అంతేకాదు ఆయన మొబైల్ ఫోన్ లాక్కొని విసిరికొట్టారు. ఎస్ఐని నోటికి వచ్చినట్లు తిట్టారు. ఈ ఘటనను వీడియో తీసేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ ఎస్ఐ ఫోన్ లాక్కొన్ని..విసిరికొట్టారు అధికార పార్టీ ఎమ్మెల్యే.
హైదరాబాద్ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. దూలపల్లి నుంచి కొంపల్లి వైపు ఓ వాహనం రాంగ్ రూట్లో వచ్చింది. అక్కడే ఉన్న ఎస్ఐ అడ్డుకున్నాడు. డ్రైవర్ను కిందకు దింపి అడిగితే.. తాను మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మనిషినని, నన్నే అడ్డుకుంటావా? అని మండిపడ్డారు. నువ్వు ఎవరైతే నాకేంటి.. ట్రాఫిక్ రూల్స్ పాటించాలి కదా.? అని ఎస్ఐ స్పష్టం చేశాడు. ఐతే ఆ వ్యక్తి.. ఎమ్మెల్యేకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో కొన్ని నిమిషాల్లోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఘటనా స్థలానికి వెళ్లారు.
రోడ్డుపై విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ దగ్గరకు వెళ్లి గొడవపడ్డారు ఎమ్మెల్యే. అతడు నా అనుచరుడు అని చెప్పినా.. వినవా..? అంటూ మండిపడ్డారు. ఎస్ఐ పట్ల దుర్భాషలాడారు. నోటికి వచ్చినట్లు తిట్టారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ ఎస్ఐ, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే అని కూడా చూడకుండా.. ఇలా ప్రవర్తిస్తారా? అని ట్రాఫిక్ ఎస్ఐ తీరుపై మైనంపల్లి మండిపడ్డారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో.. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువురికీ సర్దిచెప్పారు. అనంతరం ట్రాఫిక్ను క్లియర్ చేశారు.
ఈ ఘటనపై ట్రాఫిక్ ఎస్ఐ.. పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన విధులకు ఆటంకం కలిగించడమే గాకుండా.. నోటికొచ్చినట్లు తిట్టారని, ఫోన్ పగులకొట్టారని పేర్కొన్నారు. తన డ్యూటీ తాను చేయడం కూడా తప్పా..? అని ఆయన వాపోయారు. ఈ వ్యవహారంపై విపక్షాలు మండిపడుతున్నారు. టీఆర్ఎస్ నేతలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని, ట్రాఫిక్ ఎస్ఐపై ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరు సరికాదని విమర్శలు గుప్పిస్తున్నారు. ఎమ్మెల్యే మైనంపల్లిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.