గుడిసెలో ఆరుగురు చిన్నారులు సజీవ దహనం

ఆరుగురు చిన్నారులు.. పూరి గుడిసెలో ఆడుకుంటున్నారు. వాళ్ల తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో అందరూ ఇంట్లో కూర్చుని ఆడుకుంటున్నారు. వాళ్లంతా సరదాగా ఉండగానే జరగరాని ఘోరం జరిగింది. వాళ్లు ఉన్న గుడిసెకు నిప్పంటుకుంది. పూరి గుడిసె కావడంతో వేగంగా మంటలు విస్తరించాయి. నిమిషాల్లోనే గుడిసె మొత్తం తగలబడింది. అందులో ఆడుకుంటున్న ఆరుగురు చిన్నారులు కూడా ఆ మంటల్లో సజీవ దహనమయ్యారు. అత్యంత విషాదకరమైన ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది.  బీహార్‌లోని అరరియా ప్రాంతంలో పలసి పోలీస్ స్టేషన్ పరిధిలోని కబియా గ్రామంలో ఈ దారుణం జరిగింది. మంటల్లో చిక్కుకున్న పిల్లల కేకలు విన్న కొందరు యువకులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ.. మంటలు దట్టంగా అలుముకోవడంతో వాళ్లు కాపాడలేకపోయారు. ఇల్లు తగలబడిన విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అయితే.. అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది.ఫైర్ డిపార్ట్‌మెంట్ వాహనం వచ్చి మంటలను ఆర్పేసింది.  పోలీసులు చిన్నారుల మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించారు.   పూరి గుడిసె తగలబడిందన్న సంగతి తెలిసిన వెంటనే వందల సంఖ్యలో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. అయితే మంటలు ఎలా రేగాయన్న దానికి ప్రస్తుతానికి కారణం తెలియరాలేదు. ఆరుగురు అభంశుభం తెలియని చిన్నారులు మంటల్లో చిక్కుకుని చనిపోవడంతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ చిన్నారుల తల్లిదండ్రులను ఓదార్చడం అక్కడున్న వారి తరం కాలేదు. 

రాష్ట్రపతి కోవింద్‌ కు బైపాస్ సర్జరీ 

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ బైపాస్ సర్జరీ జరిగింది. ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఆయనకు ఈ చికిత్స నిర్వహించారు. ఛాతీలో అసౌకర్యంగా ఉండటంతో రాష్ట్రపతి కోవింద్‌ గత శుక్రవారం ఉదయం ఢిల్లీలోని ఆర్మీ (ఆర్ అండ్ ఆర్) ఆసుపత్రిలో హెల్త్ చెక్ అప్ చేయించుకున్నారు. ప్లాన్‌డ్ బైపాస్ ప్రొసీజర్ చేయించుకోవాలని వైద్యులు సూచించడంతో.. కోవింద్‌ను మార్చి 27న మధ్యాహ్నం ఎయిమ్స్‌కు తరలించారు. మంగళవారం ఎయిమ్స్ లోని ప్రత్యేక వైద్య బృందం  రాష్ట్రపతికి శస్త్ర చికిత్స నిర్వహించింది.    రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు జరిగిన బైపాస్ సర్జరీ విజయవంతమైందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ ద్వారా తెలిపారు. ఢిల్లీలోని అఖిల భారత వైద్య, విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్)లో ఆయనకు ఈ చికిత్స జరిగినట్లు తెలిపారు. ఈ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించిన వైద్యుల బృందాన్ని అభినందించారు. రాష్ట్రపతి కోవింద్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎయిమ్స్ డైరెక్టర్‌ను అడిగి తెలుసుకున్నానని తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని, క్షేమంగా ఉండాలని రాజ్ నాథ్ సింగ్ ఆకాంక్షించారు.    

అంత్యక్రియలు జరిగాక.. తిరిగొచ్చాడు..

ఓ వ్యక్తి  దొంగతనం కేసులో జైలు కి వెళ్ళాడు.. తాను జైలు నుండి తిరిగి వచ్చే సరికి.. ఆ వ్యక్తి చనిపోయాడని అనుకున్న తన కుటుంబసభ్యులు భారత సంప్రదాయం ప్రకారం.. అంత్యక్రియలు చేశారు. పిండం పెట్టారు. ఈ తంతు అంతా చేసిన మూడు నెలలకి ఆ వ్యక్తి తన కుటుంబ సభ్యుల ముందు ప్రత్యక్షమయ్యాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. తన పేరు సాబూ..  క్యాటరింగ్, బస్సు క్లినింగ్ వంటి పనులు చేస్తుండే వాడు.. అప్పుడప్పుడు చేతికి పని చెబుతూ చిన్న చిన్న దొంగతనాలు చేస్తుండేవాడు. దొంగతనాలకు అలవాటు పడిన సాబూ.. తాను పనిచేస్తున్న హోటల్ లో డబ్బు దొంగిలించాడు. ఆ నేరం కింద పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే సాబూ రాకపోవడంతో బంధులు వెతికారు. ఇంతలోనే స్థానిక పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. పోలీసులు ఆ మృతదేహం సాబూదేనన్న అనుమానంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ దేహం సాబూదేనని పొరపాటు పడిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. సీన్ కట్ చేస్తే మూడు నెలలు గడిచిపోయింది. సాబూను అంతా మరిచిపోయారు. ఒక బస్‌ డ్రైవర్‌కు సాబూ తటస్థపడ్డాడు. సాబూను గుర్తుపట్టిన డ్రైవర్‌ సమాచారాన్ని పోలీసులకు, కుటుంబ సభ్యులకూ తెలియజేశారు.దీంతో సాబూ బతికే ఉన్నాడని తెలుసుకుని.. అతని కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన కేరళ రాష్ట్రం పతనంతిట్ట జిల్లాలోని కుదస్సనాడులో జరిగింది. సాబూ కథ సుఖాంతం కావడంతో.. గత డిసెంబర్‌లో అంత్యక్రియలు జరిపిన మృతదేహం ఎవరిదో తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.  

జగన్ సేవ వర్సెస్ జనం సేవ

తిరుపతి ఉపఎన్నిక 'జగన్ సేవ వర్సెస్ జనం సేవ' అని అన్నారు జీవీఎల్. ఏది కావాలో జనం తేల్చుకోవాలని పిలుపిచ్చారు. జగన్‌కు వ్యక్తిగతంగా సేవలందించిన వ్యక్తికి ఎంపీ టికెట్ ఇస్తారా? వ్యక్తిగత సేవలు చేసిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించారు బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధిలో ప్రధాని మోదీ ముద్ర స్పష్టంగా కనిపిస్తోందన్నారు జీవీఎల్. తిరుపతి అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని వైసీపీకి సవాల్ విసిరారు. సోము వీర్రాజు గురించి విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ వైసీపీ భయాన్ని సూచిస్తోందన్నారు. బీజేపీ చేసిన అభివృద్ధిని, ప్రస్తుత పాలకుల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. తిరుపతిలో బీజేపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు జీవీఎల్. 

ఎర్రచందనం సరిపోక తలనీలాలా?

తిరుమల శ్రీవారి భక్తుల తలనీలాలు చైనాకు స్మగ్లింగ్ చేస్తున్నారన్న అంశం ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. టీటీడీ పెద్దల డైరెక్షన్ లోనే స్మగ్లింగ్ జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. అడుగడుగునా సీసీ కెమెరాలు, అత్యంత భద్రత ఉండే తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తలనీలాలను తీసుకెళ్లడం అసాధ్యమంటున్నారు. ఇంటిదొంగల సహకారంతోనే స్కాం జరుగుతుందని వెంకన్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  తిరుమల శ్రీవారి భక్తులు సమర్పించిన తలనీలాల స్మగ్లింగ్ పై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తీవ్రంగా స్పందించారు. తిరుపతి వెంకన్నకు  భక్తులు సమర్పించిన తలనీలాలు కూడా అమ్మకపోవడం సిగ్గుచేటన్నారు. స్వామివారి డబ్బులు దొంగిలించిన వారు బాగుపడినట్లు చరిత్రలో లేదన్నారు రఘురామ. ఇన్నిరోజులు ఎర్రచందనం, ఇప్పుడు తలనీలాలు  దొంగిలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  దేశంలో ఏ రాష్ట్రంలో కూడా బడ్జెట్‌ను ఆర్డినెన్స్ ద్వారా ప్రవేశపెట్టిన పరిస్థితి లేదని రఘురామకృష్ణంరాజు  అన్నారు. రానున్న కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉండనుందని.. దీనిపై సీఎం జగన్మోహన్‌రెడ్డి కనీసం మాటకూడా మాట్లాడడం లేదన్నారు. మరో రోమ్ చక్రవర్తిని ఎన్నుకున్నామన్న భావనలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని రఘురామ ఎద్దేవా చేశారు. రుణ ఆంధ్రప్రదేశ్ నుంచి దివాలా ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం మారే అవకాశాలు తొందరలో ఉన్నాయని నర్సాపురం ఎంపీ  హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల కోసం మద్యంపై ఆదాయాన్ని పెంచుకోవాల్సి వస్తుందన్నారు.  బీజేపీ-జనసేన పొత్తుపైనా రఘురామ కృష్ణం రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌ను సీఎంగా చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించడం చూస్తే, వైసీపీకి ప్రమాదమేమో అన్న అనుమానం కలుగుతుందని చెప్పారు. సీబీఐ అధికారులు తనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో ఎవరి ఒత్తిడి అయినా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేయమని త్వరలో లేఖ రాస్తానని ఎంపీ రఘురామకృష్ణంరాజు  చెప్పారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఇన్ని రోజులయినా సీబీఐ చేధించకపోవడం బాధాకరమని ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు.

బంజారాహిల్స్ లో లవర్ సూసైడ్.. 

ప్రేమించుకున్నారు. పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. చివరికి ఆ విషయం తెలిసిన పెద్దలు వాళ్ళని విడదీశారు.. అయినా అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళు.. ఆ తరుణంలో ఎలాగైనా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని తన ప్రియుడు, ఆ ప్రియురాలికి మంగమ్మ శపథం చేశాడు..కాలం గడుస్తూ వచ్చింది.. పెళ్లి మాట పక్కన పెట్టాడు ఆ ప్రియుడు.. కొంత కాలం తర్వాత  ఆ విషయం పై ప్రియుడిని నిలదీసింది.. ప్రియుడు పెళ్ళికి నిరాకరించాడు. ఆ విషయాన్నీ జీర్ణించుకోలేని ఆ అమ్మాయి హాస్టల్ ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.  సూర్యాపేటకు చెందిన ఐశ్వర్య (19) నగరంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 5లోని ఓ ప్రైవేటు హాస్టల్ లో ఉంటుంది. ఈ క్రమంలో మరెడ్డి అషేర్ (20) అనే యువకుడితో ఆమెకు  పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం ప్రేమ అనే గీత దాటి, వివాహం వరకు వెళ్లింది. గతంలో తమ పెద్దలకు తెలియకుండా వీరిద్దరూ ఓ గుడిలో వివాహం చేసుకున్నారు. పెళ్లి విషయం తెలుసుకున్న పెద్దలు.. వీరిని విడదీశారు. అయినప్పటికీ ఆ యువ జంట అప్పుడప్పుడూ కలుస్తుండేది. ఈ క్రమంలో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని ఐశ్వర్యను ప్రియుడు అషేర్‌ నమ్మిస్తూ వచ్చాడు. ఇలా కాలం పరుగులెత్తడంతో అషేర్‌ను ఐశ్వర్య నిలదీసింది. దీంతో ప్రియుడు మస్కా కొట్టాడు. దాంతో మనస్తాపం చెందిన యువతి తాను ఉంటున్నవసతి గృహంలో బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు ముందు ఐశ్వర్య కొన్ని సెల్ఫీ వీడియోలు తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ  ఘటన హైదరాబాద్‌ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. 

బోల్తా కొట్టిందిలే బీజేపీ పిట్ట!  

అనుకున్నదొక్కటి..  అయినది ఒక్కటి... బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా.. ఈ పాట ప్రస్తుతం తెలంగాణ బీజేపీకి అతికినట్లు సరిపోతోంది. నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఆ పార్టీ అనుకున్నది ఒకటి అయితే మరొకటి జరిగింది.  అంచనాలు, ఆశలు తారుమారై.. నాగార్జున సాగర్ లో  కమలం పార్టీనే చిక్కులో పడిపోయింది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో సంచలన విజయం, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలతో తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. అదే స్పీడ్ తో నాగార్జున సాగర్ లో జెండా పాతి... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని భావించింది. అందుకే సాగర్ ఎన్నికలో అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవరించింది బండి సంజయ్ టీమ్. టీఆర్ఎస్  అభ్యర్థిని ప్రకటిస్తే... ఆ తర్వాత ఆ పార్టీ అసంతృప్త నేతలను లాక్కుని వారిలో ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వాలని బీజేపీ భావించింది. టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలతోనూ బీజేపీ పెద్దలు చర్చలు జరిపారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం సీన్ మారిపోయింది. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలు ఉంటాయని అనుకుంటే.. కమలం పార్టీ నుంచే కారు పార్టీలోకి నేతలు జంప్ అవుతున్నారు.  నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఆశించి నిరాశకు గురైన కడారి అంజయ్య యాదవ్ టీఆర్ఎస్‌ గూటికి చేరారు.సాగర్ ఉప ఎన్నికల్లో కడారి బీజేపీ టికెట్ ఆశించగా... చివరి నిమిషంలో రవి నాయక్‌కు బీజేపీ టికెట్ ఇచ్చింది. దీంతో అంజయ్య తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదే అదనుగా టీఆర్ఎస్ నేతలు కడారితో టచ్ లోకి వచ్చారు. ఎమ్మెల్యేలు  పైలా శేఖర్ రెడ్డి, రవీంద్ర కుమార్ నాయక్, సైదిరెడ్డి చర్చలు జరిపారు. వారి చర్చలు సఫలం కావడంతో అంజయ్య టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఫామ్ హౌస్‌లో కడారి అంజయ్య యాదవ్ ను పార్టీలోకి ఆహ్వానించారు సీఎం కేసీఆర్. కడారి పార్టీ మారడటంతో నాగార్జున సాగర్ లో బీజేపీకి బిగ్ షాక్ తగిలినట్లైంది.  సీఎం కేసీఆర్ రాజకీయ ఎత్తుగడల వల్లే సాగర్ లో బీజేపీ ప్లాన్ చిత్తయిందని తెలుస్తోంది. తమ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలకు బీజేపీ గాలం వేస్తుందని ముందే గ్రహించిన కేసీఆర్.. వ్యూహాత్మకంగా పావులు కదిపారు. చివరి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. అంతేకాదు పార్టీలో టికెట్ ఆశిస్తున్న నేతలతో స్వయంగా మాట్లాడి వారికి అభయమిచ్చారు. ఎవరూ పార్టీ నుంచి వెళ్లిపోకుండా జాగ్రత్త పడ్డారు. అందుకే సోమవారం దివంగత నేత నోముల నర్సింహయ్య కుమారుడికే టీఆర్ఎస్ అవకాశం ఇచ్చింది. ముందే నేతలందరిని కేసీఆర్ సెట్ రైట్ చేయడంతో అధికార పార్టీలో అసమ్మతి అన్నదే లేకుండా పోయింది. అటు బీజేపీలో మాత్రం లుకలుకలకు బయటపడ్డాయి. బలమైన నేతగా ఉన్న అంజయ్య యాదవ్ కారు గూటికి చేరగా.. మరికొందరు నేతలు అదే బాటలో ఉన్నారని చెబుతున్నారు.  మరోవైపు రవినాయక్ అభ్యర్థిత్వంపై నాగార్జున సాగర్ బీజేపీలోనూ తీవ్ర అసమ్మతి నెలకొందని చెబుతున్నారు. బలమైన జానా రెడ్డి, తమ బలగాన్ని మొత్తం మోహరిస్తున్న టీఆర్ఎస్ ను రవి నాయక్ ఎలా ఎదుర్కొంటారని స్థానిక నేతలు ప్రశ్నిస్తున్నారట. దీంతో కొన్ని రోజుల వరకు జోష్ లో ఉన్న నాగార్జున సాగర్ బీజేపీ కేడర్ ప్రస్తుతం నిరాశలో మునిగిపోయిందని తెలుస్తోంది. 

జగన్‌కు ఇంకో ఎంపీ అవసరమా?

కేంద్రాన్ని నిలదీయలేని జగన్‌కు ఇంకో ఎంపీ అవసరమా? 28మంది ఎంపీలను ఉంచుకొని, ఏపీకి ఏమీ సాధించలేని వ్యక్తికి, మరో ఎంపీని గెలిపించమనే అర్హత లేదు. ఈ రెండేళ్లలో రాష్ట్రానికి ఏం సాధించారో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలి. రైల్వేజోన్, వెనుకబడిన జిల్లాలకు నిధులు, కేంద్రం నుంచి రావాల్సిన 24వేల కోట్లపై వైసీపీ ఎంపీలు, ముఖ్యమంత్రి ఎందుకు కేంద్రాన్ని నిలదీయరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి కిమిడి కళావెంకట్రావు ప్రశ్నించారు.  విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటిపై కేంద్రాన్ని నిలదీయలేని జగన్ ప్రభుత్వానికి మరో ఎంపీ అవసరమా? అని కళావెంకట్రావు నిలదీశారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రం రూపురేఖలే మారిపోతాయని చెప్పిన జగన్, ఇప్పుడెందుకు దాని ఊసెత్తడం లేదన్నారు. విశాఖ ఉక్కు, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం, రామాయపట్నం పోర్టులు ఏమయ్యాయో జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓట్లకోసం తమ ముందు కొచ్చే వైసీపీ నేతలను, ముఖ్యమంత్రిని ప్రజలంతా నిలదీయాలని పిలుపు ఇచ్చారు. కేసుల భయంతోనే ముఖ్యమంత్రి, కేంద్రం ముందు నోరెత్తడం లేదన్నారు కిమిడి కళావెంకట్రావు. 

అవినీతిలో ఏపీ నెంబర్ వన్! 

ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలో దేశంలో నెంబర్ వన్ స్టేట్. జగన్ రెడ్డి పాలనలో అప్పులు తీసుకోవడంలోనూ దేశంలో ఆంధ్రప్రదేశే టాప్. అప్పులు చేయడంలోనే కాదు అవినీతి, అక్రమాల్లోనూ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం నెంబర్ వన్ ప్లేస్ లో ఉందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. అవినీతి అక్రమాల్లో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి  జగన్మోహన్‌రెడ్డి ప్రథమ స్థానంలో నిలిపారని చెప్పారు.  22 మంది ఎంపీలను పెట్టుకుని 22 నెలల్లో రాష్ట్రానికి జగన్ ఏం చేశారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఏ మొహం పెట్టుకుని తిరుపతి ఉపఎన్నికలో ఓట్లు అడుతారు? అని  నిలదీశారు. పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీలు తమ గళాన్ని వినిపించ లేదన్నారు. వ్యక్తిగత విధ్వేషాలతో  తనపై తప్పుడు కేసులు బనాయించారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే వ్యక్తిని కాదని అచ్చెన్నాయుడు చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికలో తెలుగు దేశం పార్టీ విజయం ఖాయమన్నారు అచ్చెన్నాయుడు. 

బెల్ట్ షాపుల జోలికి వెళ్లొద్దు.. ఎక్సైజ్ శాఖకు ఎమ్మెల్యే వార్నింగ్

బెల్ట్ షాపులన్నీ మా కార్యకర్తలవే. వాటిని చూసీ చూడనట్టు వదిలేయండి. ఎక్సైజ్ సీఐ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి రావాలని హుకూం. బెల్టు షాపుల జోలికి ఎక్సైజ్ సిబ్బంది వెళ్లొద్దని ఒక తీర్మానం చేసి ముఖ్యమంత్రికి కూడా పంపుతాం. ఈ మాటలన్నీ అన్నది ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే. అది కూడా ఓ ఓపెన్ మీటింగ్‌లో. ఆ ఎమ్మెల్యే గారు చేసి కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.  బెల్ట్ షాపులను వదిలేయమంటూ కాంట్రవర్సీ కామెంట్లు చేసింది ఖమ్మం జిల్లా వైరా టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాములు నాయక్. మండలంలోని బెల్ట్ షాపులన్నీ టీఆర్ఎస్ కార్యకర్తలవేనని.. కాస్త చూసీ చూడనట్లు ఉండాలని అధికారులను ఉద్దేశించి ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు. ఎక్సైజ్ సీఐ క్యాంపు కార్యాలయానికి రావాలని ఆయన సూచించారు. ఒక తీర్మానం చేసి సీఎం కేసీఆర్‌కు కూడా పంపుతామని రాములు నాయక్ అన్నారు. ఇప్పుడీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎమ్మెల్యే మెసేజ్‌కి మందుబాబులంతా చప్పట్లు కొడుతుంటే.. మహిళలు మాత్రం మండిపడుతున్నారు.

అమ్మాయిలూ.. రాహుల్ తో జాగ్రత్త!

కేరళలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య టఫ్ ఫైట్ సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. వ్యక్తిగత దూషణలతో కాక పుట్టిస్తున్నారు. కాంగ్రెస్ యువరాజు, ఎంపీ రాహుల్ గాంధీపై కేరళకు చెందిన మాజీ స్వతంత్ర ఎంపీ జాయ్స్ జార్జ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీపీఎం అభ్యర్థి, మంత్రి ఎంఎం మణికి మద్దుతుగా నిర్వహించిన సభలో పాల్గొన్న ఆయన.. రాహుల్ గాంధీ పట్ల అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆయనకు ఇంకా పెళ్లి కాలేదని, ఆయన ముందు వంగకూడదని అన్నారు. ‘‘రాహుల్ గాంధీ ఎప్పుడూ అమ్మాయిల కాలేజీలకే వెళుతుంటారు. అక్కడికి పోయి వంగాల్సిందిగా అమ్మాయిలకు చెబుతుంటారు. అమ్మాయిలూ.. దయచేసి రాహుల్ ముందు వంగకండి. ఆయన ముందు అసలు నిలబడకండి. ఆయనకు ఇంకా పెళ్లి కాలేదు’’ అంటూ రాహుల్ ను ఉద్దేశించి.. ఇడుక్కీ మాజీ ఎంపీ కామెంట్ చేశారు. జార్జ్ మాటలకు పక్కనే ఉన్న మంత్రి ఎంఎం మణి నవ్వుతూ కనిపించారు. ఆ వీడియో కాస్తా వైరల్ కావడంతో జార్జ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. జార్జ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించింది. కేరళలో సీపీఎంకు ఓటమి భయం పట్టుకుందని విమర్శించింది.

ఏపీలో వాతలు, కోతలు తప్పవా ?

కరోనా భయం ఉన్నా దేశంలో ఆర్థిక, రాజకీయ కార్యకలాపాలు అన్నీ యథావిధిగా జరుగుతూనే ఉన్నాయి.కరోనా రక్షణ చర్యల నడుమ రెండు విడతలుగా సుమారు నెల రోజులకు పైగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. పొరుగు రాష్ట్రం తెలంగాణలోనూ శాసన సభ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్’ను ప్రవేశ పెట్టింది. సభ ఆమోదించింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఏపీ సహా అనేక రాష్ట్రాలలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.   \ఆంధ్ర ప్రదేశ్’లోనూ ఇతరత్ర్రా కార్యకలాపాలన్నీ,మామములుగానే సాగుతున్నాయి. స్కూల్స్, హాల్స్,మాల్స్, బార్స్ అన్నీ యథాతథంగా నడుస్తునాయి. కానీ,  అసెంబ్లీ సమావేశాలు అంటే మాత్రం ఆ ఒక్కటీ అడగొద్డంటోంది ముఖ్య మంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం. అంతే కాదు,వరసగా రెండవ సంవత్సరం కూడా ఆర్డినెన్సు రూట్లో, ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్’తో మమ అనిపించేసింది. అయితే, ఇందుకు కరోనా లేదా నిన్న మొన్నటిదాకా జరిగిన స్థానికసంస్థల ఎన్నికలు లేదా రేపు జరగబోయే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక, జడ్పీటీసీ, ఎమ్టీపీసీ ఎన్నికలు  కారణమా, అంటే, కాదనే సమాధానమే వస్తోంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరుగతున్న తెలంగాణలో బడ్జెట్ ఆగలేదు. ఒక్క  కాదు తెలంగాణ అనే కాదు, అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న రాష్ట్రాలతో సహా అన్ని రాష్ట్రల శాసనసభలు బడ్జెట్ సమావేశాలు నిర్వహించుకున్నాయి.   పోనీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్వాన్న స్థితికి, చేరింది కాబటి  ఉప ఎన్నికల ముందు బొక్కలు కనిపించకుండా దాచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందా అంటే, అదీ కాదని అంటున్నారు. ఎందుకంటే, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక సర్కార్ బొక్కలన్నింటినీ బయట పెట్టింది, వేయవలసిన అక్షింతలు వేసింది. అప్పు చేసి పప్పుకూడు కథలా రాష్ట్ర ఆర్థిక ఆర్థిక పరిస్థితి ఉందని కాగ్, పేర్కొంది.కాబట్టి, బడ్జెట్ పెట్టడం వలన కొత్తగా  బయటపడే బొక్కలు ఏమీలేవు. రాష్ట్ర ఖజానానే నిండుకుంది. సోషల్ వెల్ఫే హాస్టల్స్ విద్యార్ధులకు పాలు, గుడ్లు పెట్టే పరిస్థితి కూడా లేదు, ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. మరి అలాంటప్పుడు, జగన్ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ఎందుకు భయపడుతోంది? ఎందుకు ఓటాన్, అది కూడా ఆర్డినెన్సు రూట్’లో ఎందుకు తెచ్చింది? అంటే అందుకు ప్రభుత్వ అంతర్గత వర్గాలు రెండు ప్రధాన కారణాలు చెపుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థతి అద్వాన్నం కంటే అద్వాన్నంగా వుంది. రానున్న మూడు నెలల్లో, ఆదాయం కొంత పెరిగి, పరిస్థితి ఎంతో కొంత మెరుగు పడుతుందని, ప్రభుత్వం ఆశిస్తోంది. సో .. అందాకా ఓటాన్’తో నెట్టుకొచ్చి, అప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెడితే, ప్రభుత్వ అబోరు కాసింత అయినా దక్కుతుందని ప్రస్తుతానికి బడ్జెట్’ను దాటేసిందని, రాజకీయ వర్గాల్లో వినవస్తోంది. అదలా ఉంటే, కొంచెం ఆలస్యంగానే అయినా, జగన్ సర్కార్’కు ఈ స్థాయిలో సంక్షేమ పథకాలను అమలుచేస్తూ పోతే, అందినకాడికి  అప్పులు చేసినా,చివరకు ప్రభుత్వ అస్తులనే అమ్మినా, ఆర్థిక పరిస్థిని అదుపు చేయడం సాధ్యం కాదన్న వాస్తవం అర్థమైందని, అంటున్నారు. అందుకే ఇంటికో పథకం పేరిట  సంక్షేమ పథకాల సమీక్ష జరిపి కోతలు విధించే ఆలోచన ఉందని తెలుస్తోంది.అదే విధంగా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునేందుకు, పన్నులు, ఇతరత్రా వాతలు పెట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్దమైంది. అందుకే, తిరుపతి తర్వాత బడ్జెట్ ప్రవేశ పెడితే కోతలు, వాతలు యధేచ్చగా చేస్కోవచ్చిని జగన్ సర్కార్ ఆలోచిస్తోందని అంటున్నారు. అయితే, తిరుపతి దాటక ముందే బద్వేల్ ఉపఎన్నిక అనివార్యమైంది, ఈ పరిస్తితులలో ప్రభుత్వం ఏమి చేస్తుంది అనేది,ఆసక్తికరంగా మారింది. అయితే ఒకటి మాత్రం నిజం రానున్న రోజుల్లో, జగన్న పథకాలు, వైఎసార్ వరాలు ముందులా ఉండవు, అలగే వాతలు తప్పవు, అని ఆర్థిక శాఖ పద్దులనూ చూసేపెద్దలు.. చెపుతున్నారు.

పోలీసులకే ఝలక్..

దోచుకోవడం, దాచుకోవడం వాళ్ళ ఎయిమ్.. అందుకు ఎవరు అతీథులు కారు. వాళ్ళు ఫిక్స్ అయితే మన ప్యాకెట్ చిల్లు పడుతుంది. అప్పుడు మనల్ని ఆ ఈశ్వరుడు కూడా కాపాడలేడు. అదే వాళ్ళ సత్తా.. వాళ్ళు కామన్ మ్యాన్ ని దోచుకోగలరు. ఖద్దరు చొక్కాలను దోచుకోగలరు. అవసరమైతే ఖాకీ లను కూడా దోచుకోగలరు.. అందుకు వాళ్ళు ఎంచుకున్న సులువైన మార్గం హ్యాకింగ్. ఇప్పటి వరకు సాఫ్ట్ వేర్ ని , లోన్ కావాలనుకునే వాళ్ళను  టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు .. ఇప్పుడు ఏకంగా ఖాకీలపైనే కన్నేశారు .  ఖాకీల పేరుతో డబ్బులు దండుకుందాం అనుకున్నారు.. అందుకు వాళ్ళు వేసిన పథకమే పోలీసుల ఫేస్బుక్ హ్యాక్ చేయడం.  పోలీసుల పేస్ బుక్ హ్యాక్ చేసి ఆ అకౌంట్లో ఉన్న వాళ్ళకి గూగుల్  పే, ఫోన్ పే ల ద్వారా డబ్బులు పంపాలంటూ ఆ అకౌంట్ నుండి మెస్సేజెస్ పంపారు.  వరంగల్ జిల్లా దామెర పోలీస్ స్టేషన్‌కు చెందిన ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అవ్వడం సంచలనం సృష్టిస్తోంది. దామెర ఎస్సై భాస్కర్‌రెడ్డి ప్రకారం  ఏడాదిన్నర క్రితం దామెర పోలీసులు ఒక ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఇటీవల మరో అకౌంట్ క్రియేట్ చేసి.. పాత దాన్ని వినియోగించడం పూర్తిగా మానేశారు. దీన్ని క్యాచ్ చేసుకున్న సైబర్ నేరగాళ్లు.. ఆ అకౌంట్‌ను హ్యాక్ చేశారు. ఫోన్ పే, గూగుల్ పే నుంచి డబ్బులు పంపాలంటూ పలువురికి మెసేజులు పంపారు. ఈ విషయాన్ని ఎస్సై భాస్కర్ రెడ్డికి  చేరవేశారు కొందరు.. దీంతో అలర్ట్ అయినా పోలీసులు వెంటనే కమిషనరేట్‌లోని సైబర్‌ క్రైమ్ విభాగం పాత ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను బ్లాక్‌ చేయించారు. అయితే ఇప్పటివరకు వరకు సైబర్ నేరగాళ్ల వలలో ఎవరు పడలేదని ఎవరూ డబ్బులు పంపించకపోవడంతో హమ్మయ్య అనుకున్నారు పోలీసులు. మధ్యప్రదేశ్‌కు చెందిన ముఠా ఈ పని చేసినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

బొచ్చు స్కాం? శ్రీవారి తలనీలాల స్మగ్లింగ్!

తిరుమల క్షేత్రం. పరమ పావన నిలయం. కలియుగ దేవుడు శ్రీ వేంకటేశ్వరస్వామి నిలయం. నిత్యం వేలాదిగా భక్తులు. తల నీలాలతో మొక్కులు. కట్ చేస్తే.... అది మిజోరంలోని ఇండియా-చైనా బోర్డర్. పక్కా ఇన్ఫర్మేషన్‌తో అస్సోం రైఫిల్స్, కస్టమ్ డిపార్ట్‌మెంట్ కలిసి సరిహద్దులో కాపు కాశారు. ఒక్కో వాహనం చెక్ చేస్తున్నారు. కాసేపటికి వారు వెతుకుతున్న వెహికిల్స్ అక్కడికి వచ్చాయి. వాటిని ఆపారు భద్రతా సిబ్బంది. డాక్యుమెంట్స్ చూపించమన్నారు. ఆ డ్రైవర్ ఏవో కాగితాలు ఇచ్చాడు. అనుమానంతో ఆ వాహనాలు చెక్ చేశారు అస్సోం రైఫిల్స్ జవాన్లు. వాటి నిండా సంచులు. ఆ బ్యాగుల్లో తల వెంట్రుకలు. ఒక్కో సంచిలో 50కేజీల వెంట్రుకలు. అలా మొత్తం 120 బ్యాగుల తలనీలాలు. ఆ వెంట్రుకలు తిరుమల నుంచి చైనాకు అక్రమంగా తరలిస్తుండగా అస్సోం రిఫిల్స్, కస్టమ్ డిపార్ట్‌మెంట్ కలిసి పట్టుకున్నారు. రెండు వాహనాలను, తల వెంట్రుకల బ్యాగులను సీజ్ చేశారు.  ఎక్కడి తిరుమల, ఎక్కడి మిజోరం. ఇక్కడ భక్తులు శ్రీవారికి భక్తితో ఇచ్చిన తలనీలాలను.. దొంగచాటుగా చైనాకు తరలిస్తున్నారు కేటుగాళ్లు. గతంలో ఎప్పుడూ ఇలా జరిగింది లేదు. వెంట్రుకలను సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులే వాటిని చూసి అవాక్కయ్యారు. మిజోరాం బోర్డర్ మీదుగా చైనాకు వెంట్రుకలు అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్నారు. చైనాలో వాటిని శుద్ధి చేసి విదేశాలకు అమ్ముతుంటారు. ఆ జుట్టును విగ్గుల తయారీకి వాడుతుంటారు. వాటికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సరిహద్దుల్లో సీజ్ చేసిన 120 బ్యాగుల వెంట్రుకల విలువ సుమారు కోటి 80 లక్షలు ఉంటుందని అంటున్నారు. వాటి ఫైనల్ ప్రొడక్ట్ కాస్ట్.. అంతకు పదింతలే పలుకుతుంది. ఇక్కడ విషయం వెంట్రుకల గురించి కాదు.. తిరుమలలో శ్రీవారికి సమర్పించిన తలనీలాలు అన్ని రాష్ట్రాలు దాటి దేశ సరిహద్దుల వరకు ఎలా చేరిందనేది ఆసక్తికరం. తిరుమలలో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అడుగడుగునా సీసీకెమెరాలు, సెక్యూరిటీ తనిఖీలు ఉంటాయి. గుట్కా, మందు బాటిళ్ల లాంటి వాటినే సిబ్బంది కన్నుగప్పి తీసుకురాలేరు. అలాంటిది.. ఎలాంటి పత్రాలు లేకుండా అంత పెద్ద ఎత్తున తలనీలాలు ఎలా తరలించబడ్డాయి? 120 సంచుల వెంట్రుకలు తిరుమల కొండ దిగుతుంటే అధికారులు ఏం చేస్తున్నట్టు? వారికి తెలీకుండానే ఇదంతా జరుగుతోందా? లేక, అంతా వారి కనుసన్నల్లోనే నడుస్తోందా? పెద్దల నుంచి ఒత్తిడి ఉందా? ఆ పెద్దలు చెబితేనే అక్రమంగా తలనీలాలు తరలిపోయాయా? ఇలా అనేక ప్రశ్నలు. అంతకు మించి అనుమానాలు.   ఈ ఏడాది ఫిబ్రవరి 7న జరిగిందీ ఘటన. ఆ విషయం జాతీయ మీడియాలో ప్రముఖంగా వచ్చింది. ఏపీలో మాత్రం అంతా గప్‌చుప్. చాలా ఆలస్యంగా ఇప్పుడిప్పుడే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడ మరో ఆసక్తికర సంఘటనా చోటు చేసుకుంది. ఫిబ్రవరిలో టీటీడీ అధికారికంగా 143.9 టన్నుల వెంట్రుకలను వేలం వేసి.. 11.17 కోట్ల రాబడి సంపాదించింది. ఇది అధికారిక లెక్క. మరి, మిజోరాం ఘటనతో అనధికారికంగా పెద్ద ఎత్తున వెంట్రుకలు అక్రమంగా సరిహద్దులు దాటుతున్నాయనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు శ్రీవారి భక్తులు. తలనీలాలతో పెద్ద ఎత్తున స్కాంకు తెగబడుతున్నారని అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వెంట్రుకలను స్మగ్లర్ల సాయంతో దేశ సరిహద్దులు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరి, ఈ బొచ్చు స్కాం వెనుకున్న బడాబాబులు ఎవరు? ఇంత జరుగుతుంటే టీటీడీ ఏం చేస్తోంది? దీనిపై టీటీడీనే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇందులో నిజానిజాలు నిగ్గు తేలాల్సి ఉంది. అయితే, ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక తీరిగ్గా స్పందించింది టీటీడీ. మిజోరం సమీపంలోని మయన్మార్ సరిహద్దులో అస్సోం రైఫిల్స్ సీజ్ చేసిన 120 బ్యాగుల తలనీలాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని టీటీడీ ప్రకటించింది. శ్రీవారికి సమర్పించిన తలనీలాలను ఈ-ప్లాట్ ఫామ్ ద్వారా నిర్వహించే అంతర్జాతీయ టెండర్ల ద్వారా విక్రయిస్తున్నామని తెలిపింది. టెండర్‌లో ఎక్కువ మొత్తం కోట్ చేసిన బిడ్డర్‌కు తలనీలాలు అప్పగిస్తామని, కొనుగోలు చేసిన బిడ్డర్‌కు అంతర్జాతీయ ఎగుమతి అనుమతులు ఉన్నాయా... లేక దేశంలోనే ఏ ప్రాంతంలో విక్రయిస్తారనేది టీటీడీకి సంబంధించిన విషయం కాదన్నారు. తలనీలాల అక్రమ రవాణాకు పాల్పడిన సంస్థల పేర్లు అధికారికంగా తెలియజేస్తే వాటిని బ్లాక్ లిస్ట్‌లో పెడతామని స్పష్టం చేసింది టీటీడీ.

వాణీ దేవికి ప్రమోషన్ ?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కే. చంద్రశేఖర రావు, రాజకీయ వ్యూహ రచనలో మహా దిట్ట.ఇది ఆయన ప్రత్యర్ధులు కూడా అంగీకరించే నిజం. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఎవరూ ఉహించని విధంగా, చివరి క్షణంలో దివంగత ప్రధానమంత్రి పీవీ నరసింహ రావును తెరమీదకు తీసుకొచ్చారు. హైదరాబాద్,రంగారెడ్డి,మహాబూబ్’నగర్ పట్టభద్రుల నియోజక వర్గం నుంచి పీవీ కుమార్తె వాణీ దేవిని తెరాస అభ్యర్ధిగా దించి, పీవీ బొమ్మను బ్రహ్మాండగా ఉపయోగించుకున్నారు. పీవీ కుమార్తె వాణీదేవి పోటీ చేసిన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజక వర్గంలో మాత్రమే కాదు, అటు ఖమ్మం, వరంగల్, నల్గొండ నియోజక వర్గంలోనూ పీవీ సెంటిమెంట్ బానే వర్కౌట్ అయింది. పీవీకులం, ప్రాంతంతో పాటుగా మేథావి వర్గంలో ఆయనకున్న పలుకుబడిని కూడా, చక్కగా  సొమ్ము చేసుకున్నారు.ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఆయా వర్గాల్లో ప్రభుత్వం పట్ల గల వ్యతిరేకతను,పీవీ అస్త్రంతో పటాపంచలు చేయగలిగారు.అఫ్ కోర్స్, అదొక్కటే తెరాస గెలుపుకు కారణం కాక పోవచ్చును కానీ, అది (పీవీ అస్త్రం) ఒక రకంగా గేమ్ చేంజర్’గా పనిచేసింది అనేది మాత్రం నిజం. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు,కొత్తగా చిక్కిన సెంటిమెంట్ అస్త్రాన్ని మరింతగా ఉపయోగించుకోవాలనే అలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీగా ఎన్నికైన వాణీ దేవికి, మండలి చైర్మన్ పదవి ఇచ్చి, పీవీ పేరు’ ప్రతిష్టలు. ఇమేజ్’ను మరింత విస్తృత స్థాయిలో ఉపయోగించుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. వాణిదేవి హోదాను పెంచడం ద్వారా పీవీని మొత్తానికి మొత్తంగా తమ వాడిని చేసుకోవచ్చని, తద్వారా కాంగ్రెస్ పార్టీతో  మిగిలున్న కొద్దిపాటి బంధాన్ని లాగీయ  వచ్చని, కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నారని పార్టీ వర్గాల్లో వినవస్తోంది. ఓ వంక పీవీ శతజయంతి వేడుకలు నిర్వహిస్తూ, మరో వంక వాణీ దేవికి పదోన్నతి కలిపించడం ద్వారా, పీవీ కాంగ్రెస్ మూలాలను వెనక్కి నెట్టేయవచ్చనేది, ముఖ్యమంత్రి ఆలోచనగా చెపుతున్నారు. ఓ వంక పీవీని కాంగ్రెస్ నుంచి వేరుచేయడంతో పాటుగా, మరో వంకబీజేపీ వైపు మొగ్గు చూపుతున్న బ్రాహ్మణ మేథావులను, ఓటును తమ వైపు తిప్పుకునేందుకు పీవీ అస్త్రం ‘బ్రాహ్మణ’ అస్త్రంగానూ పని చేస్తుందని కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదలా ఉంటే ప్రస్తుత మండలి చైర్మన్, గుత్తాసుఖేందర్ రెడ్డికి కూడా ఆ పదవి మీద పెద్దగా ఆసక్తి లేదు. క్రియాశీల రాజకీయలలో ఉండేందుకే గుత్తా ఇష్ట పడతారు. రాజ్యాంగబద్ద  మండలి చైర్మన్ పదవిలో ఉంటూ కూడా ఆయన రాజకీయాలను వదులు కోలేదు.  సాధారణంగా స్పీకర్, ఛైర్మెన్ పదవులలో ఉన్నవారు రాజకీయాలకు దూరంగా ఉంటారు. అయితే గుత్తా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి, ఆయనకు మరో పదవి ఆఫర్ చేస్తే చైర్మన్ చైర్లోంచి ఎగిరి గంతెసేందుకు సిద్దంగా ఉన్నట్లు ఆయన చర్యలే సూచిస్తున్నాయి. సో, త్వరలోనే, వాణీదేవికి ప్రమోషన్ ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి ఆమె గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంలో స్వయంగా ఆయనే ఆమెకు మరింత ఉన్నత పదవులు ఇస్తామని కూడా అన్నారు.

తిరుపతిలో ఎవరి లెక్కేంటి?

గురుమూర్తికి ఐదులక్షల మెజారిటీ. ఇది అధికార పార్టీ చేస్తున్న హడావుడి. గతంలో ఏ ఎన్నికకూ లేనివిధంగా తిరుపతి బై పోల్‌ను వైసీపీ సవాల్‌గా తీసుకుంది. అందుకు కారణం, టీడీపీకి విజయావకాశాలు అధికంగా ఉండటమే అంటున్నారు. తెలుగుదేశానికి మిగతా చోట్ల ఓ లెక్క.. తిరుపతిలో మరోలెక్క. వెంకన్న సాక్షిగా ఈసారి తమ సత్తా ఎంతో చాటాలని ప్రతిపక్షం గట్టిగా ప్రయత్నిస్తోంది. అందుకే, ఫ్యాన్ పార్టీలో ఇంతటి కలవరం. 5లక్షల మెజార్టీ అంటూ మైండ్ గేమ్.  వైసీపీకి 5 లక్షల మెజార్టీ రావడానికి అది కడప ఉప ఎన్నిక కాదు.. తిరుపతి బై పోల్. ఇక్కడ వార్ వన్ సైడ్ కాబోదు. రేసులో మాజీ ఎంపీ పినబాక లక్ష్మి ఉన్నారు. చంద్రబాబు సొంత జిల్లా కూడా. ప్రజలతో సంబంధం లేని ఫిజియోథెరపిస్టు గురుమూర్తి అభ్యర్థిత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. మాజీ ఐఏఎస్ రత్నప్రభ.. జగన్ మనిషేనంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు. ఇక కాంగ్రెస్ కేండిడేట్ చింతా మోహన్‌ను ఓటర్లు ఎప్పుడో మర్చిపోయారు. ఇలా, అభ్యర్థుల పరంగా చూసుకుంటే.. పినబాక లక్ష్మినే బలమైన పోటీదారు. ఆమె స్వస్థలం గూడూరు నియోజకవర్గం పరిధిలోని కోట మండలం. పనబాక దంపతులకు నెల్లూరు, చిత్తూరు జిల్లాల రాజకీయ నేతలు, ప్రజలతో విస్తృత పరిచయాలున్నాయి. 2019 ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థుల కన్నా, పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పనబాక లక్ష్మికే ఎక్కువ ఓట్లు రావడం ఆమె పాపులారిటీకి నిదర్శనం. అందుకే గెలుపుపై టీడీపీలో అంత ధీమ. వైసీపీలో హైరానా. అధికారపార్టీ అరాచకాల వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పరాజయం పాలైంది. ఓటమితో పోయిన పరువును తిరిగి.. తిరుపతి ఉప ఎన్నికతో దక్కించుకోవాలని తెలుగుదేశం పార్టీ పట్టుదలగా ఉంది. ఎన్నికల పర్యవేక్షణ కోసం సమర్థులైన నాయకులను తిరుపతిలో మోహరిస్తోంది. ప్రతి నియోజకవర్గంలో పక్కజిల్లాలకు చెందిన అనుభవజ్ఞులైన నేతలను నియమిస్తున్నారు. వారికి క్షేత్రస్థాయిలో ఓటర్ల బాధ్యతలు అప్పగిస్తున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను, ప్రజావ్యతిరేక విధానాలను జనాల్లోకి తీసుకెళుతున్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రం ఎలా ఉండేది.. జగన్ వచ్చాక అభివృద్ధి ఎలా కుంటబడిందో ప్రజలకు వివరిస్తున్నారు.  అధికార పార్టీ బెదిరింపులకు చెక్ పెట్టేలా.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విసిరిన పాచికతో వైసీపీ ఉలిక్కిపడుతోంది. టీడీపీకి ఓటేస్తే ప్రభుత్వ ప్రయోజనాలు అందవంటూ.. వైసీపీ నేతలు కానీ, వాలంటీర్లు కానీ బెదిరిస్తే.. ఆ వీడియోలు, ఆడియో రికార్డులు, ఫోటోలు 7557557744 వాట్సాప్ నెంబర్‌కు పంపితే వారి అకౌంట్‌లో 10వేలు వేస్తామంటూ టీడీపీ ప్రకటించిన బంపర్ ఆఫర్ అధికార పార్టీలో ప్రకంపణలు సృష్టిస్తోంది. గత స్థానిక సంగ్రామంలో ఇలా పథకాల పేరుతో బెదిరించే బలవంతంగా ఓట్లు దండుకుంది అధికార పార్టీ. తాజాగా, టీడీపీ వాట్సాప్ ఆఫర్‌తో తిరుపతిలో వైసీపీ పప్పులు ఉడకని పరిస్థితి.  ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో.. ఓటర్లు కేవలం ప్రభుత్వ పథకాల ఆధారంగానే ఓట్లు వేయరు. అక్కడి వారిని తిరుమల చుట్టూ జరుగుతున్న రాజకీయాలూ ప్రభావితం చేస్తాయి. వెంకన్న సన్నిధిలో అన్యమత ప్రచారంపై ఇప్పటికే ఆగ్రహంగా ఉన్నారు తిరుపతి ప్రజలు. ఎస్వీబీసీ లాంటి పవిత్ర ఛానెల్‌ను పృథ్వీ లాంటి కమెడియన్‌ చేతిలో పెట్టి.. వెకిలి చేష్టలతో ఎస్వీబీసీ పరువు తీసిన పాపం ఈ ప్రభుత్వానిదే. ఏకంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీదనే అన్యమత ఆరోపణలు రావడం మరింత దారుణం. టీటీడీ పాలక మండలిలో పారిశ్రామిక వేత్తలకు పట్టం కట్టడం.. చిత్తూరు జిల్లాలో దళితులపై దాడులు జరగడం.. శ్రీసిటీలో కొత్త కంపెనీలు రాకపోవడం.. ఇలా అనేక అంశాలు తిరుపతి ఎంపీ ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయి. ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా.. అది అధికార వైసీపీకి వ్యతిరేకమే. ప్రతిపక్ష టీడీపీకి అనుకూలమే. అందుకే వైసీపీలో కలవరం పెరుగుతోంది. 5 లక్షల మెజార్టీ అంటూ మైండ్ గేమ్ ఆడుతోంది. అధికార పార్టీ ఇంత హంగామా చేస్తున్నా.. టీడీపీ మాత్రం గెలుపుపై ధీమాతో.. కామ్‌గా, కూల్‌గా తన పని తాను చేసుకు పోతోంది.

రాజధానిపై వైసీపీ డ్రామా!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉంది. రాజధాని పిటిషన్లపై హైకోర్టులో చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. రాజధానికి సంబంధించిన కేసులపై మే 3వ తేదీ నుంచి  హైకోర్టులో  విచారణ జరగనుంది. హైకోర్టు తీర్పు వచ్చే వరకు రాజధాని అంశంలో జగన్ రెడ్డి సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. ఈ విషయం తెలిసినా వైసీపీ మంత్రులు మాత్రం రాజధానిని తరలిస్తున్నామంటూ పోటాపోటీ ప్రకటనలు చేస్తున్నారు. వైసీపీ నేతల తీరుతో.. సీఎం జగన్ డైరెక్షన్ లో వైసీపీ నేతలు రాజధాని డ్రామా నడిపిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఏ క్షణంలోనైనా రాజధానిని విశాఖపట్నానికి తరలిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ  తాజాగా ప్రకటన చేశారు. అన్ని అవరోధాలను అధిగమిస్తామని కూడా చెప్పారు. బొత్స ప్రకటనలపై రచ్చ జరుగుతోంది. కోర్టులో ఉన్న రాజధాని అంశంపై ఎలా మాట్లాడతారని అమరావతి రైతులు, విపక్ష పార్టీలు ప్రశ్నిస్తున్నాయి.  ఇంకా విచారణ ప్రారంభించకముందే మంత్రి బొత్స సత్యానారాయణ ఏ క్షణమైనా రాజధానిని విశాఖకు తరలిస్తామని ప్రకటనలు చేయడమేంటని నిలదీస్తున్నారు.    రాజధాని కేసులపై ఏపీ హైకోర్టులో విచారణ మళ్లీ మే 3 నుంచి ప్రారంభమైనా..  మే 13 నుంచి జూన్ 13 వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ఉన్నాయి. ఈ వేసవి సెలవుల అనంతరం మళ్లీ విచారణ జరగాల్సి ఉంటుంది. కనీసం 2 నుంచి 3 నెలలు విచారణ జరుగుతుందని అంటున్నారు. ఇదంతా మంత్రి హోదాలో ఉన్న బొత్సకు కూడా తెలుసు. కాని ఆయన మాత్రం రాజధాని తరలింపుపై వరుసగా ప్రకటనలు చేస్తున్నారు. దీని వెనక పెద్ద కుట్ర ఉందనే చర్చ జరుగుతోంది. కర్నూల్ లో హైకోర్టు అంశంతో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో లబ్ది పొందాలని చూస్తున్నారని చెబుతున్నారు. అంతేకాదు అమరావతి పరిధిలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారి వ్యాపారాలు ఎక్కువగా ఉన్నాయి. రాజధాని తరలిపోతుందనే ప్రచారంతో.. వాళ్ల బిజినెస్ ను దెబ్బ తీయడమే వైసీపీ లక్ష్యమనే చర్చ జరుగుతోంది. అమరావతి కోసం రైతులు 16 నెలలుగా ఆందోళన చేస్తున్నారు. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందనే ఆశతో వాళ్లంతా ఉన్నారు. అయితే ఏ క్షణంలోనైనా రాజధానిని తరలిస్తామంటూ ప్రకటనలు చేసి.. అమరావతి రైతుల మనోస్థైర్యాన్ని తగ్గించేలా అధికార పార్టీ నేతలు ఎత్తులు వేస్తున్నారని అంటున్నారు. ఇలాంటి చీఫ్ ట్రిక్స్ తో తాము భయపడేది లేదని.. అమరావతి కోసం పోరాటం కొనసాగిస్తామని అమరావతి రైతులు తేల్చి చెబుతున్నారు. సర్కార్ ఎన్ని ఆంక్షలు, నిర్భందాలు పెట్టినా వెనక్కి తగ్గలేదని, ఇలాంటి ప్రకటనలతో కుంగిపోయే అవకాశమే లేదంటున్నారు.   

వాట్ ఎ ఐడియా గురు..  

ఎండకాలం వచ్చిందా.. తిప్పలు తప్పవు.. ఎండ నుండి ఉపశమనం పొందాలంటే బుర్రకు పదును పెట్టాల్సిందే.. ఎండ నుండి ఉపశమనం పొందడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం.. కానీ కొంత మందికి వచ్చిన ఐడియా కి అవ్వాక్కు అవ్వకుండా ఉండలేం. వారి ఐడియాను  చూస్తే మెచ్చుకోలేకుండా ఉండలేం.. ఒక్కక్కరి థాట్ ప్రాసెస్ ఒక్కోలా ఉంటుంది. కర్ణాటకు చెందిన ఓ వ్యక్తి  ఐడియా చూస్తే వాట్ హే ఐడియా గురు  అనాల్సిందే. తన ఐడియా చూసిన అందరూ తనకు హ్యాండ్స్ అప్ చెప్పాల్సిందే .. ఇంతకీ ఆ ఐడియా ఏంటని అనుకుంటున్నారా.. మీరే చదవండి తెలుస్తుంది..  కర్ణాటకు చెందిన ఇక వ్యక్తి శ్రీవారి దర్శనార్ధం తన సొంత కారులో తిరుమలకు చేరుకున్నాడు. అక్కడికి వచ్చిన జనం పార్కింగ్ లో ఉన్న తన కారుని చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు.. ఎండ భారీనుండి ఉపశమనం పొందడానికి  తన కారుకు మొత్తానికి పేడ, బంకమట్టి పట్టించారు.. ఎండ నుండి ఉపశమంకోసం ఇలా చేశారని డ్రైవర్ చెప్పాడు. నందకం కార్ల పార్కింగ్ దగ్గర నిల్చున్న ఈ కారుని భక్తులంతా ఆసక్తిగా తిలకిచ్చారు.   

జానారెడ్డి ఓటమే బీజేపీ లక్ష్యమా? 

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి, సీనియర్ నేత జానారెడ్డి పోటీ చేస్తుండగా.. అధికార టీఆర్ఎస్ నుంచి దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడు నోముల భగత్ బరిలో ఉన్నారు. అభ్యర్థి విషయంలో సుదీర్ఘ కసరత్తు చేసిన కేసీఆర్.. చివరికి నోముల వారసుడినే ఫైనల్ చేశారు. బీజేపీ మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. నాగార్జున సాగర్ లో తమ అభ్యర్థిగా డాక్టర్ పనుగోతు రవికుమార్‌ నాయక్ ను ఖరారు చేసింది. నాగార్జున సాగర్ జనరల్ నియోజకవర్గమైనా.. ఎస్టీని బరిలోకి దింపి పెద్ద సాహసమే చేసింది కమలదళం.  నాగార్జున సాగర్ లో బీజేపీ అభ్యర్థిగా రవి కుమార్ నాయక్ ఎంపికపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సాగర్ నియోజకవర్గంలో సామాజిక వర్గాల వారీగా చూస్తే.. లంబాడీల ఓట్లే ఎక్కువ. సాగర్ లో మొత్తం 2 లక్షల 17 వేల ఓటర్లుండగా.. లంబాడీ ఓటర్లే దాదాపు 41 వేలు ఉన్నారు. ఈ ఈక్వేషన్ ఆధారంగానే రవి కుమార్ నాయక్ కు బీజేపీ బరిలోకి దింపిందంటున్నారు. నియోజకవర్గంలో గిరిజనుల తర్వాత యాదవులే ఎక్కువ. టీఆర్ఎస్ నుంచి భగత్ యాదవ్ పోటీ చేస్తున్నారు. రెడ్లు దాదాపు 34 వేల వరకు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి జానారెడ్డి పోటీలో ఉన్నారు. అందుకే బీజేపీ ఎస్టీకి ఇచ్చి కొత్త ప్రయోగం చేసిందని చెబుతున్నారు.     నాగార్జున సాగర్ లో సర్వేలు నిర్వహించిన వివిధ సంస్థలు మాత్రం కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి రవి నాయక్ తో ఎవరికి నష్టమనే చర్చ జరుగుతోంది. స్థానిక రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం బీజేపీ ఎస్టీ అభ్యర్థిని దింపడం వల్లే కాంగ్రెస్ క్యాండిడేట్ జానారెడ్డికే నష్టమని చెబుతున్నారు. అందుకు గల లెక్కలు కూడా వివరిస్తున్నారు. గతంలో ఉన్న చలకుర్తి, ప్రస్తుత నాగార్జున సాగర్ నుంచి సెగ్మెంట్ నుంచి ఇప్పటివరకు ఏడు సార్లు గెలిచారు జానారెడ్డి. సాగర్ నియోజకవర్గంలో హాలియా, త్రిపురారం, నిడమనూర్, పెద్దవూర, అనుముల, తిరుమలగిరి సాగర్‌, గుర్రంపోడ్‌ మండలాలున్నాయి. త్రిపురారం, తిరుమలగిరి సాగర్ మండలాల్లో గిరిజనుల ఓట్లు మెజార్టీ. ఈ మండలాలకు చెందిన  గిరిజనుల మద్దతు ఉండటం వల్లే జానారెడ్డి ఏకపక్ష విజయాలు సాధించారని చెబుతారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని గిరిజన తండాల్లో జానారెడ్డికి పట్టు ఉందని అంటున్నారు.  గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉండే త్రిపురారం మండలం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. త్రిపురారం మండలంలో గిరిజనుల ఓటర్లు ఎక్కువ. అందుకే ఆ మండలంలో జానారెడ్డికి ప్రతి ఎన్నికల్లో మంచి లీడ్ వచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 7 వేల 5 వందల ఓట్లతో జానా రెడ్డి ఓడిపోయినా.. త్రిపురారం మండలంలో మాత్రమే ఆయనకే లీడ్ వచ్చింది. గిరిజనుల ఓట్ల వల్లే జానాకు అక్కడ లీడ్ వచ్చింది.  బీజేపీ నుంచి పోటీ చేస్తున్న రవి నాయక్... ఎక్కువగా ఎస్టీ ఓట్లను చీల్చే అవకాశం ఉంది. అదే జరిగితే జానారెడ్డికే నష్టమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు రవి నాయక్ సొంత మండలం కూడా త్రిపురారమే. సో.. జానారెడ్డికి పట్టున్న మండలం ఇదే కావడం, బీజేపీ అభ్యర్థి ఈ మండలం వ్యక్తే కావడం కూడా కాంగ్రెస్ కు మైనస్ గా మారే అవకాశం ఉంది. బీజేపీ నేతలు కూడా ఈ అంశాలను ఆధారంగా చేసుకునే రవి నాయక్ ను బరిలోకి దింపారంటున్నారు. సాగర్ టీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ సీటు. నోముల కుటుంబంపై సానుభూతి కూడా ఉంది. దీంతో భగత్ గెలిచినా బీజేపీకి పెద్ద ఇబ్బంది ఉండదు. సెంటిమెంట్ కలిసిరావడంతో తన సిట్టింగ్ సీటును అధికార పార్టీ గెలిచిందని కవర్ చేసుకోవచ్చు. అదే కాంగ్రెస్ గెలిస్తే బీజేపీకి చాలా నష్టం. సాగర్ లో జానా రెడ్డి గెలిస్తే.. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ పుంజుకుంటుంది. అది జరిగితే బీజేపీకి నష్టం. కాంగ్రెస్ బలహీనం అయితేనే తెలంగాణలో బీజేపీకి బలపడే అవకాశం ఉంటుంది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ ముందే చేతులెత్తేయడం వల్లే ప్రభుత్వ వ్యతిరేకత ఓటంతా బీజేపీకి పడి.. ఆ పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయి. అందుకే సాగర్ లో టీఆర్ఎస్ గెలిచినా ఫర్వాలేదు కాని... కాంగ్రెస్ గెలవొద్దనే ఎత్తుగడతో బీజేపీ తన అభ్యర్థిని ఎంపిక చేసిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.