ప్రాణం తీసిన పకోడీ.. 

పకోడి 16 ఏళ్ళ బాలుడి ప్రాణం తీసింది. అదేంటి పకోడి ప్రాణం తీయడం ఏంటీ అనుకుంటున్నారా.. అది అంతే.. ఆలస్యం అయిందని ఒక మూర్ఖుడు ఆ బాలుడ్ని చ*పేశాడు. తండ్రికి పకోడి బండి ఉంది. బడికి సెలవులు ఉన్నపుడు శివ తండ్రికి సాయంగా బండి దగ్గరకు వెళ్తాడు. ఒక వ్యక్తి తాను మందు తాగుతూ మటన్ పకోడి తెమ్మని శివకు చెప్పాడు. అసలే మనది మందు బాబుల దేశం గిరాకీ ఎక్కువ ఉండడం వల్ల.. ఆ వ్యక్తి చెప్పిన టైం కి పకోడి తీస్కపోలేదు శివ. ఇక అంతే నేరుగా తన స్కార్పియోతో వచ్చి వాళ్ళ బతుకు బండిని డీ కొట్టాడు.. అంతటితో ఆగక ఇనుప రాడ్డుతో కొట్టాడు. చికిత్స పొందుతూ ఆ 16 ఏళ్ళ బాలుడు మృతిచెందాడు. కిర్లంపూడి మండలం వీరవరం గ్రామంలో శింగం ఏసుకు మాంసం పకోడి బండి ఉంది. కొడుకు శివ(16) తండ్రికి చేదోడు వాదోడుగా బండి వద్ద ఉంటాడు. సెలవురోజు అవ్వడంతో ఆ రోజు రాత్రి తండ్రి వద్ద ఉన్నాడు. వీరికి దగ్గర్లోనే  కొవ్వూరి వీరబాబు మద్యం తాగుతున్నాడు. తనకు పకోడి తీసుకురమ్మని శివతో వీరబాబు చెప్పాడు. ఎన్ని పనులున్నాయి పాపం శివకి కొంచం లేట్ అయింది. ఇక అంతే  వెంటనే తీసుకువెళ్లకపోవడంతో వీర బాబు లో ఉన్న రాక్షసుడు బయటికి వచ్చాడు. తన స్కార్పియో వాహనంలో వెళ్లాడు. తిరిగి వచ్చి నేరుగా పకోడి బండిని కారుతో ఢీకొట్టాడు. దాంతో శివ(16)కు తీవ్రంగా గాయాలయ్యాయి. అంతటితో  ఆగకుండా ఆ బాలుడిని వీరబాబు ఇనుప రాడ్డుతో కొట్టడంతో శివ కుప్పకూలిపడిపోయాడు.  దీంతో శివను కాకినాడ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. ఈ విషయం తెలియగానే గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమారు 60 మంది పోలీసులు గ్రామంలో మోహరించారు. కిర్లంపూడి, జగ్గంపేట, గండేపల్లి ఎస్‌ఐలు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మృతుని కుటుంబాన్ని పలువురు పరామర్శించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ అప్పలరాజు తెలిపారు. 

మద్యం మత్తులో వైసీపీ నేత అరాచకం..  మహిళపై దాడి.. 

ఎవరైనా పక్కవారిపైనా దాడులు చేయాలంటే కారణం వెతుకుంటారు. వీళ్ళు వీరంగం చేయాలంటే మాత్రం కారణాలు లేకుండానే కత్తి దుస్తరూ.. ప్రజలమీదికి చేతులెత్తుతారు. అక్కడ వల్లే పోలీస్ వల్లే చట్టం. ఏపీలో వైసీపీ నాయకులు కార్యకర్తలు చేయని గందరగోళం లేదు.. సృష్టించని బీభత్సము లేదు.. తాజాగా ఒక వైసీపీ కార్యకర్త మద్యం మత్తులో మహిళపై దాడికి చేశాడు. వారి చెప్పిందే వేదం. కాదని వాదిస్తే వాదం. వారికి నచ్చితే ఆకాశానికి ఎత్తుతారు. నచ్చకపోతే పాతాళానికి తొక్కుతారు. వాడు దాడి చేయాలనుకుంటే కారణాలు వెతుకోరు మనుషులను వెతుకుంటారు. అది మహిళలే మగాలైన సరే వారి పిడిగుడ్డులు, కత్తి వేటు పడాల్సిందే. ఏపీలో వాళ్ళు సృష్టించని బీభత్సము అంటూ లేదు. అది కాక ఇప్పుడు కొత్తగా కారణాలు లేకుండా మద్యం మత్తులో మహిళలపై దాడులు చేయడం వారికే చెల్లింది.  కర్నూలు  జిల్లాలోని జూపాడుబంగ్లా మండలం తరిగోపుల గ్రామంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో వైసీపీ కార్యకర్త వీరంగం సృష్టించాడు. పీకల్లోతు తాగిన మద్దిలేటి ఒక మహిళపై దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ మహిళను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు స్థానికులు.  ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. ఈ ఘటనతో వైసీపీ కార్యకర్త, నేతలపై స్థానికులు నిప్పులు చెరుగుతున్నారు. ఎలాంటి కారణం లేకుండా దాడికి దిగడమేంటి..? అంటూ కన్నెర్రజేస్తున్నారు. మద్దిలేటిని పోలీసులు కఠినంగా శిక్షించాలని, బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కరోనా భయంతో ఆదిలాబాద్ జిల్లాలో దారుణం

తెలంగాణలో కరోనా మహ్మమారి విస్తరిస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ భారీగానే కేసులు నమోదవుతున్నాయి. దీంతో గత మార్చిలో లాక్ డౌన్ విధించినప్పటి పరిస్థితులు మళ్లీ గ్రామాల్లో కనిపిస్తున్నాయి. కరోనా భయంతో వణికిపోతున్న జనాలు.. మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కరోనా సోకిందన్న కారణంతో ఓ యువతిని ఊళ్లోకి అడుగుపెట్టనీయకుండా గ్రామ పెద్దలు అడ్డుకున్నారు.  ఇంద్రవెల్లి మండలం తేజాపూర్ పంచాయతీ పరిధిలో ఈ దారుణ ఘటన జరిగిందీ.. సాలెగూడకు చెందిన మడావి సోన్‌దేవి గురుకులంలో ఉంటూ ఇంటర్ చదువుతోంది. గురుకులంలో కరోనా పరీక్షలు చేయగా బాలికకు  కరోనా వైరస్ సోకిందని నిర్ధారణ అయింది. దీంతో బాలిక హోం క్వారంటైన్ లో ఉండేందుకు సొంతూరుకు వచ్చింది. విషయం తెలిసిన గ్రామ పెద్దలు ఆమెను ఊరిలో అడుగుపెట్టనీయకుండా అడ్డుకున్నారు. దీంతో  చేసేది లేక ఊరి చివరన ఉన్న తమ పొలంలో ఆ బాలిత ఐసోలేషన్‌లో ఉంది. అక్కడ కరెంటు సౌకర్యం లేకపోవడంతో రాత్రుళ్లు చిమ్మ చీకట్లో భయంభయంగా గడుపుతోంది. విషయం తెలిసిన ఏటీడబ్ల్యూవో క్రాంతికుమార్, గురుకులం ఆర్‌సీవో గంగాధర్ నిన్న గ్రామానికి వచ్చి బాలికను పరామర్శించారు. పంచాయతీ పెద్దలను కలిసి ఆమెను గ్రామంలోకి అనుమతించాలని అధికారులు కోరారు. అయినా వారి ప్రయత్నాలు ఫలించలేదు.  ఆమె క్వారంటైన్ పూర్తయ్యేవరకు  ఊరిబయట ఉండకతప్పదని పెద్దలు తేల్చి చెప్పారు. దీంతో ఊరు చివరన ఉన్న పొలం దగ్గరే ఉంటోంది బాలిక. జిల్లాలోని చాలా గ్రామాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయంటున్నారు.

పేరు టీచర్.. వృత్తి మోసం 

అతను ఒక టీచర్.. కానీ పెద్ద చీటర్. అమాయకుల పాలిట ఘరానా దొంగ. మోసగాళ్లకు మోసగాడు. ప్లాట్స్ ఇప్పిస్తానంటూ జనాలకు పెద్ద కాటు వేశాడు. ఇలా చేయడం ఇది మొదటి సరి కాదు.. ఆయన వృత్తే మోసం చేయడంగా ఎంచుకున్నాడు. ఒకప్పుడు ఉపాధ్యాయులు ఊర్లోనూ, స్కూల్ లోనూ మంచి గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు కొంత మంది ఉపాధ్యాయులు ఆ వృత్తికే మచ్చ తెస్తున్నారు. ఒకప్పుడు ఉపాధ్యాయులు స్కూల్ లో పాఠాలు మాత్రమే చెప్పేవాళ్లు.. ఇప్పుడు అది తప్ప అని దందాలు చేస్తున్నారు. చిట్టీలు, రియల్ ఎస్టేట్, పైరెవీలు, ఇవే వారి ఆలోచన. విద్యార్థులు పాఠాలు అయినా మంచిపోతారు కానీ ఆ ఆలోచన మాత్రం మర్చిపోరు .  తాజాగా విశాఖ జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి మోసాలు చేశాడు. బలిసినోడిని కాదు బలహీనుడిని మోసం చేశాడు.  ప్రతి మనిషి ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని కల ఆ కలని ఈ ఉపాద్యాయుడు వలగా వాడుకున్నాడు.. అవసరమైన అమాయకులకు ఇళ్ల ప్లాట్లు ఇప్పిస్తానని చెప్పి లక్షల రూపాయలు మోసం చేశాడు. రమణబాబు అనే ప్రభుత్వ టీచర్ ఈ చీటింగ్‌కు చేశాడు. బాధితుల నుంచి రూ.19 లక్షలను అడ్వాన్స్ గా తీసుకుని చాటు మాటుగా తిరుగుతున్నారు. అటు ప్లాట్లు తీసుకోవాలనుకున్న కల తీరాక, రమణబాబు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు ఉపాధ్యాయుడుపై  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే రమణ బాబును అరెస్ట్ చేశారు. కాగా ఈ ఉపాధ్యాయుడు గతంలోనూ అదే తరహ మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆ ఘటనపై నర్సీపట్నం పీఎస్‌లో కేసు నమోదైనట్లు వెల్లడించారు.

సాగర్ లో బీజేపీ సంచలనం.. జనరల్ సీటులో ఎస్టీ అభ్యర్థి

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ పనుగోతు రవికుమార్‌ నాయక్ ను ఖరారు చేసింది. నాగార్జున సాగర్ జనరల్ నియోజకవర్గమైనా.. ఎస్టీని బరిలోకి దింపి పెద్ద సాహసమే చేసింది కమలదళం. నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు గిరిజనులే ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల 15 వేల మంది ఓటర్లు ఉండగా... అందులో దాదాపు 41 వేల మంది లంబాడీలే. తీవ్ర తర్జనభర్జనల తర్వాత రవి నాయక్ ను ఖరారు చేసినట్లు చెబుతున్నారు.  నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి సీనియర్ నేత జానారెడ్డి పోటీ చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే నోముల భగత్ ఎంపికయ్యారు. ఆయనకు సోమవారం తెలంగాణ భవన్ లో బీఫామ్ అందించారు కేసీఆర్. టిఆర్ఎస్ టికెట్ ఆశించిన నేతలకు స్వయంగా హామీ కూడా ఇచ్చారు. కాంగ్రెస్ రెడ్డికి ఇవ్వడం, టీఆర్ఎస్ బీసీకి ఇవ్వడంతో సామాజిక కోణంలో ఆలోచన చేసిన బీజేపీ.. నియోజకవర్గం ఎక్కువగా ఓటర్లున్న గిరిజనుల నుంచి రవి నాయక్ ను ఖరారు చేసిందని తెలుస్తోంది.  నాగార్జున సాగర్ బీజేపీ టికెట్ కోసం చాలా మంది ప్రయత్నించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కంకణాల నివేదితా రెడ్డితో ఇంద్రాసేనారెడ్డి, కడారి అంజయ్య యాదవ్, రవి నాయక్ పోటీ పడ్డారు. ఇంద్రాసేనా రెడ్డి, రవి నాయక్ గతంలో జానారెడ్డికి ప్రధాన అనచరులుగా ఉన్నారు. కంకణాల నివేదితా రెడ్డి శనివారం నామినేషన్ కూడా వేశారు. దీంతో ఆమెకే టికెట్ ఖరారైందనే ప్రచారం జరిగింది. కాని సామాజిక కోణంలో అనూహ్య నిర్ణయం తీసుకుంది బీజేపీ హైకమాండ్.   

అమ్మకు ఓటేస్తారా? కమ్మకు ఓటేస్తారా?

జగన్.. 'రెడ్డి నాయకుడు'. చంద్రబాబు.. 'కమ్మ లీడర్'. కేసీఆర్.. 'వెలమ దొర'. పవన్.. 'కాపు నేత'. ఇలా నేతలందరినీ కులం గాడిన కట్టడం నేటి కుసంస్కార రాజకీయం. ఈ క్యాస్ట్ పాలిటిక్స్‌లో అందరికంటే కంత్రీగా తేలింది జగన్మోహన్‌రెడ్డినే. మాటిమాటికి చంద్రబాబుకు కమ్మ కులాన్ని అంటగట్టి దిగజారుడు రాజకీయాలు చేయడంలో ఆయన ఎక్స్‌పర్ట్. ఆఖరికి.. ఎస్ఈసీ లాంటి రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు సైతం 'కమ్మ' కులాన్ని జోడించి.. చంద్రబాబుతో జత కలిపి.. చీప్ పాలి'ట్రిక్స్' ప్లే చేశారు ముఖ్యమంత్రి జగన్. అంతెందుకు.. కరోనా సమయంలో విజయవాడ రమేశ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరగ్గా.. ఆ హాస్పిటల్ యజమానికి సైతం కులం మకిలి అంటించిన ఘనత జగన్ సర్కారుదే.  ఈ కులం గొడవంతా ఇప్పుడు ఎందుకంటే.. టీడీపీ 40 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ తరం నేతలు, రాజకీయ విశ్లేషకులు ఓసారి గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ప్రభంజనంలా, ప్రళయంలా రాయకీయ తెరపైకి దూసుకొచ్చిన ఎన్టీవోడ్ని ఎదుర్కునేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆనాడే ఈ కుల గజ్జిని రాజకీయాలకు అంటించారని అంటున్నారు. అప్పటి వరకూ వెండితెర వేల్పులా వెలుగొందిన తారకరాముడు.. ఇందిరపై తిరుగుబాటుతో కాంగ్రెస్‌ను కూకటివేళ్లతో పెకిలించేందుకు.. తెలుగుదేశం పార్టీతో ప్రజల ముందుకొచ్చారు. ఖాకీ డ్రెస్సుతో రాజకీయ కదనరంగంలో దూకారు. అన్నాళ్లూ తెరపైన చూసిన అసమాన్యుడు.. బ్రదర్ అంటూ.. సోదరసోదరీమణులంటూ.. ప్రజల మధ్యకు సామాన్యుడిలా రావడంతో జనాలంతా పూనకం వచ్చినట్టు ఎన్టీఆర్ వెంట నడిచారు. భూమి ఈనిందా? సముద్రం పొంగిందా? అన్నట్టు.. ఇసుకేస్తే రాలనంతగా జనం ఎన్టీఆర్ కోసం తరలివచ్చేవారు.  ఆ జన ప్రభంజనం చూసి.. ఎన్నికల్లో తమ ఓటమి ఖాయమని డిసైడ్ అయిపోయారు కాంగ్రెస్ నేతలు. అందుకే, ఎన్టీఆర్‌ స్థాయిని ఎలాగైనా అడ్డుకోవాలని.. కుల కుతంత్రం రచించారు. అందరి వాడైన నందమూరి తారక రాముడిని కొందరి వాడిని చేసి చూపించే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్‌కు కమ్మ కులానికే పరిమితం చేసేలా కొత్త నినాదం సృష్టించారు. "అమ్మ కావాలా? కమ్మ కావాలా?".. "అమ్మకు ఓటేస్తారా? కమ్మకు ఓటేస్తారా?" అంటూ జనంలో కులాల వారీగా చీలిక తెచ్చే ఎత్తుగడ వేశారు. అమ్మ అంటే ఇందిరమ్మ. కమ్మ అంటే ఎన్టీఆర్. అనేది వారి నినాదం.  జన్మతహా కమ్మ కులంలో పుట్టినా.. ఎన్టీఆర్ ఏనాడూ కేవలం కమ్మలనే చేరదీయలేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో అన్ని కులాలను సమ ప్రాధాన్యత ఇచ్చారు. విద్యావంతులను, సంఘ సంస్కర్తలను పార్టీలోకి తీసుకున్నారు. యువకులకు పెద్ద పీట వేశారు. ఎక్కడా కులం, మతం అనే తారతమ్య బేధాలు చూపలేదు. అర్హత, చిత్తశుద్దే ప్రాతిపదికన అభ్యర్థులను నిలబెట్టారు. నేటి కేసీఆర్ లాంటి వారు సైతం ఆ కోటాలోనే అప్పట్లో టికెట్లు పొందారు. అప్పటి వరకూ కాంగ్రెస్‌లో కొన్ని కులాలదే ఆదిపత్యం కొనసాగగా.. టీడీపీ రాకతో అన్ని కులాలు రాజకీయ అందలమెక్కాయి. టీడీపీకి బీసీల పార్టీ అనే పేరు అందుకే వచ్చింది.  కులాల కంపులేని టీడీపీపై.. బలవంతంగా కమ్మ ముద్ర వేసే ప్రయత్నం అప్పుడూ జరిగింది, ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఆనాడు ఎన్టీఆర్ హయాంలో కాంగ్రెస్ నాయకులు "అమ్మకు ఓటేస్తారా? కమ్మకు ఓటేస్తారా?" అంటూ రాజకీయాల్లో కుల చిచ్చు పెడితే.. ఈనాడు చంద్రబాబుకు 'కమ్మ' కులాన్ని అంటగట్టి.. కుల గజ్జిని తారాస్థాయికి తీసుకెళుతున్నారు జగన్మోహన్‌రెడ్డి. బలవంతుడైన నాయకుడిని ఎదుర్కోలేక.. బలహీనులు చేసే కుటిల ప్రయత్నమే.. ఈ కుల రాజకీయం.

కేసీఆర్‌ను సమర్థించిన చంద్రబాబు

సీన్ రివర్స్. తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో రెండు ఎకరాలు కొనొచ్చు. గతంలో ఏపీలో ఒక ఎకరం అమ్మి.. తెలంగాణలో 3 ఎకరాలు కొనేవారు. తెలంగాణ వచ్చాక సీన్ రివర్స్ అయిందంటూ అసెంబ్లీలో ఘనంగా ప్రకటించారు సీఎం కేసీఆర్. అవును, సీఎం కేసీఆర్ చెప్పింది అక్షరాలా నిజమంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఏపీలో రాష్ట్రాభివృద్ధి రివర్స్ గేర్‌లో పయనిస్తోందన్నారు. ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో 3ఎకరాలు కొనే పరిస్థితులు రివర్స్ అయ్యాయన్న కేసీఆర్ మాటలు అందరూ గ్రహించాలన్నారు చంద్రబాబు.  ఇటు కేసీఆర్ స్టేట్‌మెంట్.. అటు చంద్రబాబు సమర్ధింపు.. ఇద్దరి మాటలూ వాస్తవిక పరిస్థితులకు అద్దం పడుతున్నాయని అంటున్నారు సామాజిక వేత్తలు. జగన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఏపీ తిరోగమనంలో పయనిస్తోంది. అభివృద్ధి అనే పదమే అడ్రస్ లేకుండా పోయింది. సంక్షేమ పథకాల గోలే కానీ.. కంపెనీల ఊసే లేదు. విన్దామన్నా.. చూద్దామన్నా.. కొత్త కంపెనీ జాడే లేదు.  చంద్రబాబు హయాంలో కియాలాంటి కంపెనీలెన్నో ఏపీకి క్యూ కట్టాయి. పట్టిసీమతో పొలాలకు నీళ్లు పారాయి. ఆంధ్రుల కలల రాజధానితో అమరావతి పేరు ప్రపంచస్థాయిలో మారుమోగింది. ఇలా.. అనేక అంశాలతో కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కొంగొత్తగా దూసుకుపోయింది. ఏపీలో భూములు బంగారంగా మారాయి. 2019లో ప్రభుత్వం మారడంతో అంతా తారుమారు. కంపెనీలు లేవు, ప్రాజెక్టులు లేవు. పథకాలే తప్ప అభివృద్ధి మాటే లేదు. అందుకే, భూముల ధరలు పాతాళానికి పడిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో భూములు.. అంగడి సరుకుగా మారిపోవడంతో విలువ దారుణంగా పతనమైంది. అందుకే, తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే.. ఏపీలో ఇప్పుడు రెండు ఎకరాలు కొనొచ్చంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు గుర్తు చేశారు. ఏపీలో రాష్ట్రాభివృద్ధి రివర్స్ గేర్‌లో పయనిస్తోందంటూ మండిపడ్డారు ప్రతిపక్ష నేత. 

తెలుగు జాతి కోసమే తెలుగు దేశం 

తెలుగు దేశం పార్టీ 40వ ఆవిర్బావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో టీడీపీ నేతలు, కార్యకర్తలు వేడుకలు జరిపారు. పార్టీ జెండాలను ఎగురవేసి స్వర్గీయ నందమూరి తారకరామారావును స్మరించుకున్నారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. తెలుగుజాతి ఉద్ధరణ కోసమే ఎన్టీఆర్‌ పార్టీ స్థాపించారని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఘనత ఎన్టీఆర్‌దేనని స్పష్టం చేశారు.  రైతు సంక్షేమం కోసం ఎన్టీఆర్‌ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని చంద్రబాబు చెప్పారు. పేదల పక్కా ఇళ్లకు 40 ఏళ్ల క్రితమే శ్రీకారం చుట్టిన పార్టీ టీడీపీ అన్నారు. 9 నెలల్లో ప్రజాదరణ పొంది అధికారంలోకి వచ్చిన ఘనత టీడీపీదేనని తెలిపారు. 40 ఏళ్లలో 21 ఏళ్లు టీడీపీనే అధికారంలో ఉందన్నారు. రాజకీయాలంటే సేవాభావం, పేదల సంక్షేమం అని ఎన్టీఆర్ సరికొత్త నిర్వచనం చెప్పారని చంద్రబాబు గుర్తుచేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. కరోనా తర్వాత ఆర్ధిక అసమానతలు బాగా పెరిగాయన్నారు టీడీపీ అధినేత.  హైదరాబాద్‌లో తాము శ్రీకారం చుట్టిన జినోమ్ వ్యాలీలోనే కోవిడ్ వ్యాక్సిన్ కనుగొన్నారని చంద్రబాబు చెప్పారు. టీడీపీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలనే వైఎస్, ఆ తర్వాత వచ్చిన సీఎంలు కొనసాగించారని తెలిపారు. ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో 3ఎకరాలు కొనే పరిస్థితులు రివర్స్ అయ్యాయన్న కేసీఆర్ మాటలు అందరూ గ్రహించాలని సూచించారు. ఏపీలో రాష్ట్రాభివృద్ధి రివర్స్ గేర్‌లో పయనిస్తోందన్నారు చంద్రబాబు. త్యాగాల కోసం పనిచేసే కుటుంబం లాంటి పార్టీ టీడీపీ అన్నారు. గత రెండేళ్లలో ప్రతి కుటుంబంపై రూ.2.50 లక్షల భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు బతకలేని విధంగా అన్ని ధరలు పెంచేశారని చంద్రబాబు మండిపడ్డారు.   

ఆ తప్పు చేయనంటున్న కేసీఆర్.. సాగర్‌లో దుబ్బాక టెన్షన్..

నాగార్జున సాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌కు దుబ్బాక ఫీవర్ పట్టుకుంది. అక్కడి మాదిరే ఇక్కడా ఫలితం తేడా వస్తుందేమోనని భయపడుతోంది. అందుకే, సాగర్‌లో గెలుపు కోసం దుబ్బాక దంగల్‌లో జరిగిన పొరబాట్లు రిపీట్ కాకుండా చూస్తోంది. అందులో భాగంగా దుబ్బాక ఓటమికి కారణాలేంటో పోస్టుమార్టం చేసి.. నాగార్జున సాగర్ నేతలకు వివరించారు గులాబీ బాస్. ఆ తప్పులు ఇక్కడ చేయొద్దంటూ.. తానూ అలా చేయనంటూ.. టీఆర్ఎస్ నాయకులకు హితోపదేశం చేశారు కేసీఆర్. దుబ్బాక ఓటమి కారు పార్టీని కలలో కూడా వెంటాడుతూనే ఉంటుంది. కీలక సమయంలో.. కీలకమైన నియోజకవర్గంలో.. కీలకమైన అభ్యర్థి చేతిలో ఓడిపోవడం అధికార పార్టీకి తీవ్ర అవమానకరం. దుబ్బాక సీఎం కేసీఆర్ సొంత జిల్లా. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, కేటీఆర్ నియోజక వర్గం సిరిసిల్ల, హరీశ్‌రావు ఇలాకా సిద్దిపేట.. ఈ మూడు ప్రాంతాలకు మధ్యలో ఉన్న దుబ్బాకలో ఓడిపోవడం మామూలు విషయం కాదు. అప్పటికే దుబ్బాక నుంచి నాలుగుసార్లు గెలిచింది టీఆర్ఎస్. సోలిపేట రామలింగారెడ్డి మృతితో ఆ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. కారు గుర్తుపై ఆయన భార్య పోటీల నిలిచారు. దండిగా సానుభూతి. ఫుల్లుగా పొలిటికల్ పవర్. గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారు గులాబీ బాస్. అందుకే ప్రచారానికి అటువైపు కూడా చూడలేదు. కనీసం కేటీఆర్ సైతం దుబ్బాకలో అడుగుపెట్టలేదు. మంత్రి హరీశ్‌రావుకే పూర్తి బాధ్యతలు అప్పజెప్పారు. అదే తాము చేసిన తప్పంటున్నారు సీఎం కేసీఆర్. దుబ్బాకలో బీజేపీ గెలుపుతో అధికార పార్టీ పరువంతా పోయింది. అప్పటి నుంచే బీజేపీ దూకుడు పెరిగింది. ఒక్క సీటు.. ఒకే ఒక్క సీటు కదాని లైట్ తీసుకుంటే.. అది గ్రేటర్ వరకూ వచ్చిందనేది గులాబీ బాస్ విశ్లేషణ. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. అలాంటిది.. దుబ్బాకలో బీజేపీ హోరాహోరీగా పోరాడుతున్నా.. ప్రచారానికి దుబ్బాక వైపు కన్నెత్తి కూడా చూడకపోవడమే తమ ఓటమికి కారణమని తేల్చేశారు కేసీఆర్. అక్కడ తాను కానీ, కేటీఆర్ కానీ ప్రచారానికి వెళ్లకపోవడం వల్లే ఓడిపోయామంటున్నారు కేసీఆర్. ఒక్క హరీశ్‌కే వదిలేయకుండా.. తామిద్దరం సైతం జోక్యం చేసుకొని ఉంటే.. దుబ్బాకలో ఫలితం మరోలా ఉండేదని అంచనా వేస్తున్నారు. అందుకే, దుబ్బాకలో చేసిన తప్పిదం నాగార్జున సాగర్‌లో రిపీట్ అవకుండా చూస్తామని చెప్పారు. సాగర్ ప్రచారానికి తనతో పాటు కేటీఆర్‌ కూడా వస్తారని నియోజక వర్గ నేతలకు అభయం ఇచ్చారు కేసీఆర్.  నోముల భగత్‌కు టీఆర్ఎస్ టికెట్ ఇవ్వడంపై అసంతృప్తితో ఉన్న నేతలను పిలిపించి మాట్లాడారు గులాబీ బాస్. అంతర్గత విభేదాలు పక్కనబెట్టి గెలుపు కోసం పనిచేయాలని నేతలకు సూచించారు. నాగార్జున సాగర్ టికెట్ ఆశించిన కోటిరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. మరోనేత చిన్నపరెడ్డికి ఎమ్మెల్సీ రెన్యువల్‌ చేస్తామని చెప్పారు. సర్వేలన్నీ టీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉన్నాయని.. ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలో నాయకులంతా సాగర్‌లో కష్టపడాలని దిశానిర్దేశం చేశారు కేసీఆర్.

హైదరాబాద్ లో మాస్క్ లేకుంటే 2 వేల ఫైన్ 

తెలంగాణలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. అన్ని జిల్లాల్లోనూ పంజా విసురుతోంది. గ్రేటర్  హైదరాబాద్ లో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. గత పది రోజుల్లోనే 15  వందల వరకు కొత్త కేసులు వచ్చాయి. కరోనా కేసులు పెరగడంతో అప్రమత్తమైన గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్... కీలక నిర్ణయం తీసుకుంది. మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే భారీగా ఫైన్ వేస్తోంది. అంతేకాదు షాపుల్లోకి మాస్కు లేనివారిని అనుమతి ఇస్తే.. షాపు ఓనర్లకు జరిమానా విధిస్తోంది. ఫతేనగర్‌లో మాస్క్‌ లేకుండా కస్టమర్స్‌ను షాపులోకి అనుమతించిన ఓ షాపు యజమానికి 2 వేల జరిమానా విధించారు జీహెచ్ఎంసీ అధికారులు.  రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. కేసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.  ఏప్రిల్‌ 30 వరకు ఆంక్షలు విధించింది. కొవిడ్‌ నిబంధనల అమలులో భాగంగా.. మాస్క్‌ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. బహిరంగ ప్రదేశాలు, పని ప్రాంతాలు, ప్రజా రవాణా వాహనాల్లో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మాస్క్‌ ధరించని వారిపై విపత్తు నిర్వహణ చట్టం-2005లోని 51 నుంచి 60 సెక్షన్లతో పాటు ఐపీసీ 188 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆ చట్టాల ప్రకారం రూ.1000 జరిమానాతో పాటు ఆరునెలల జైలు శిక్ష విధించే అధికారం ఉంది. హోలీ వేడుకలను బహిరంగంగా జరుపుకోవడాన్ని నిషేధించింది. షబ్‌-ఏ-బరాత్‌, ఉగాది, శ్రీరామనవమి, మహవీర్‌ జయంతి, గుడ్‌ ప్రైడే, రంజాన్‌  వేడుకలపైనా ఆంక్షలు విధించింది. 

ఒక సామాజిక వర్గమే జగన్ టార్గెట్! 

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై మొదటి నుంచి ఒక ఆరోపణ బలంగా వినిపిస్తోంది. ఒక సామాజిక వర్గాన్ని ఆపార్చీ టార్గెట్ గా చేసుకుందనే విమర్శలు ఉన్నాయి. అందుకు బలం చేకూరేలా చాలా సంఘటనలు జరిగాయి. ఒక సామాజిక వర్గానికి చెందిన వారిపైనే ఎక్కువ కేసులు నమోదు కావడం, వాళ్ల వ్యాపారాలను దెబ్బ తీసే ప్రయత్నాలు జరగడం వెలుగు చూశాయి. జగన్ సర్కార్ తీరుపై తెలుగు దేశం పార్టీ నేతలు తీవ్రంగానే స్పందిస్తున్నారు.  తాజాగా జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా  ఇలాంటి ఆరోపణలే చేశారు. ఒక సామాజికవర్గాన్ని టార్గెట్ చేసి వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయని మనోహర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఏపీని వైసీపీ ప్రభుత్వం అప్పుల్లో ముంచేసిందని మనోహర్ విమర్శించారు. అప్పుల్లో ఏపీని దేశంలోనే తొలి స్థానంలో నిలబెట్టారని అన్నారు. మద్యం, ఇసుక, సిమెంట్ ద్వారా వస్తున్న డబ్బంతా ఎక్కడకు వెళ్తోందని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో 96 శాతాన్ని గెలిచామని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారని... పోలీస్, వాలంటీర్ వ్యవస్థలను వాడుకోకుండా ఉంటే వైసీపీకి ఈ గెలుపు సాధ్యమయ్యేదా? అని నాదేండ్ల నిలదీశారు.  తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తుండటంపై కొందరు జన సైనికులు ఆవేదన చెందుతున్న మాట నిజమేనన్నారు మనోహర్. ఇతర పార్టీల అభ్యర్థుల కంటే తమ ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ మెరుగైన అభ్యర్థి అన్నారు. ఆమె విజయం కోసం జనసైనికులంతా పని చేయాలని పిలుపునిచ్చారు. కాబోయే సీఎం పవన్ కల్యాణ్ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పడం... జనసేనకు ఉన్న బలమని మనోహర్ అన్నారు. సంస్థాగతంగా జనసేన మరింత బలోపేతం కావాలని చెప్పారు.  

పవార్‌తో బీజేపీ మైండ్ గేమ్!

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రహస్య భేటీ అంటూ విస్తృత ప్రచారం. ఎన్సీపీ ఖండిస్తున్నా.. అమిత్ షా నర్మగర్భ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో చీలికంటూ కథనాలు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై శివసేన విసుర్లు. ఇలా మహారాష్ట్ర కేంద్రంగా గుజరాతీ-మరాఠీ రాజకీయ ఎత్తుగడలు రంజుగా సాగుతున్నాయి.  దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. శరద్ పవార్ నాయకత్వంలో ప్రతిపక్ష పార్టీలు ఢిల్లీపై దండయాత్రకు సిద్ధమవుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఆయా రాష్ట్రాల్లో కమల వ్యతిరేక పవనాలు జోరుగా వీస్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలో.. వ్యూహాత్మకంగా శరద్ పవార్ టార్గెట్‌గా బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందనే అనుమానాలు వినిపిస్తున్నాయి. అనారోగ్యంతో ఆదివారం ఆసుపత్రిలో చేరారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. పొత్తికడుపు నొప్పితో హాస్పిటల్‌లో చేరిన పవార్‌కు గాల్‌బ్లాడర్ సమస్య ఉన్నట్టు గుర్తించారు. బుధవారం ఆయనకు ఆపరేషన్ జరిగే అవకాశం ఉంది. శనివారం గుజరాత్‌లో అమిత్ ‌షా, శరద్ పవార్ సమావేశం జరిగిందంటూ వార్తలు రావడం అనుమానాలకు తావిస్తోంది.  నెలకు వంద కోట్ల వసూళ్లు టార్గెట్ పెట్టారంటూ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ చేసిన ఆరోపణలతో మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో అలజడి రేపాయి. ఈ ఆరోపణలపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రిటైర్డ్ జడ్జితో విచారణకు ఆదేశించారని స్వయంగా హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖే ప్రకటించారు. అటు హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై శివసేన తన అధికార పత్రిక ‘సామ్నా’లో కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఆయన అనుకోకుండా హోంమంత్రి అయ్యారు.. అయినా ముంబయి పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో వాజే కూర్చుని వసూళ్లకు తెరలేపిన విషయం హోంమంత్రికి తెలీకపోవడం ఏంటి’అని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ప్రశ్నించారు.  ఓవైపు మహారాష్ట్రలో శివసేన వర్సెస్ ఎన్సీపీ నడుస్తుండగా.. అదే సమయంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మధ్య శనివారం రహస్య భేటీ జరిగిందంటూ వార్తలు రావడం సంచలనంగా మారింది. భేటీకి సంబంధించి ఎటువంటి వివరాలూ బయటకు రాకున్నా.. మీటింగ్ జరిగిందంటూ అంతా ఫిక్స్ అయిపోయారు. ఈ అంశంపై  అమిత్‌ షాను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తమ మధ్య భేటీ జరిగిందని గానీ, జరగలేదని గానీ చెప్పలేదు కానీ.. ‘ప్రతి అంశం బయటకు చెప్పలేం’కదా అంటూ  సమాధానం ఇవ్వడంతో రాజకీయం మరింత రక్తి గట్టింది.   ఇదంతా బీజేపీ మైండ్ గేమ్ అనే విమర్శలు వస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ.. బీజేపీకి వ్యతిరేకంగా శరద్ పవార్ కీలక అడుగులు వేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకొస్తున్నారు. బెంగాల్‌లో మమత బెనర్జీ కమలనాథులకు చుక్కలు చూపిస్తున్నారు. బెంగాల్ మళ్లీ తృణమూల్ కైవసం చేసుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. కేరళ, తమిళనాడు, పుదిచ్చేరిలోనూ బీజేపీకి ఛాన్సెస్ లేవు. వీటితో పాటు మిగతా భావసారూప్య పార్టీలతో కలిసి.. ఎన్నికల తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే సన్నాహాల్లో ఉన్నారు శరద్ పవార్. శరద్ పవార్ కూటమిలో మమతా బెనర్జీనే కీలకం. పవార్ తప్పుకుంటే మమతా బెనర్జీనే పీఎం క్యాండిడేట్. ఇలాంటి సమయంలో పవార్, అమిత్ షా భేటీ అంటూ వార్తలు క్రియేట్ చేసి.. ప్రతిపక్ష కూటమిని మొదట్లోనే కన్ఫ్యూజ్ చేసేలా కుట్ర చేస్తున్నారనేది ఎన్సీపీ వాదన.  ఇలాంటి చీప్ ట్రిక్స్‌ను ప్రజలు నమ్మరని..  తమ పార్టీ ప్పటికీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుందని ఎన్సీపీ నేతలు చెబుతున్నారు. దమ్ముంటే భేటీ జరిగిందంటూ అమిత్ షా బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రూమర్స్‌ క్రియేట్ చేసి.. బీజేపీ చీప్ పాలిటిక్స్‌ చేస్తోందంటూ మండిపడుతున్నారు. ఇదంతా అమిత్ షా ఆడిస్తున్న రాజకీయ డ్రామా అంటూ కొట్టిపారేస్తున్నారు. అమిత్ షా, బీజేపీ చేస్తున్న పొలిటికల్ ఎత్తులు ఔట్ డేటెడ్ అంటున్నాయి రాజకీయ వర్గాలు. అమిత్ షా వ్యూహాలు ఇటీవలి కాలంలో పని చేయడం లేదని చెబుతున్నారు. పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ పప్పులు ఉడకలేదంటున్నారు. ఎన్నికల లబ్ది కోసమ చీఫ్ పాలిట్రిక్స్ చేయడం మానుకోవాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

నోముల భగత్ స్పెషాలిటీ ఏంటంటే!

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ టికెట్ కోసం చాలా మంది పోటీ పడ్డారు. గత ఎన్నికల్లోనూ టికెట్ ఆశించిన ఎంసీ కోటిరెడ్డితో పాటు స్థానిక నేతలు గురువయ్య యాదవ్, రంజిత్ యాదవ్, ఓయూ విద్యార్థి నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్లు తెరపైకి వచ్చాయి. పోటీ తీవ్రంగా ఉండటంతో సుదీర్ఘ కసరత్తు చేశారు కేసీఆర్. సర్వే సంస్థలతో పాటు నిఘా వర్గాల నుంచి సమాచారం సేకరించారు. నామినేషన్ల గడువుకు ఒకరోజు ముందు అభ్యర్థిని ఖరారు చేశారు గులాబీ బాస్.  నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే  నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ ను ఎంపిక చేశారు. తెలంగాణ భవన్ లో నోముల భగత్ కు సీఎం కేసీఆర్ బీఫామ్ అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి , ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ , ఎమ్మెల్సీ లు శేరి సుభాష్ రెడ్డి , పల్లా రాజేశ్వర్ రెడ్డి , తేరా చిన్నపరెడ్డి, నోముల లక్ష్మి ఉన్నారు . మంగళవారం నోముల భగత్ నామినేషన్ వేయనున్నారు. పార్టీ ప్రచారం కోసం రూ.28 లక్షల చెక్ ను కూడా పార్టీ అధినేత కేసీఆర్ భగత్ కు అందించారు. టీఆర్ఎస్ తరపున నాగార్జునసాగర్ టికెట్ ఆశించిన మంత్రి జగదీష్ రెడ్డి సన్నిహితుడు కోటిరెడ్డిని పార్టీ నేతలు బుజ్జగించినట్లు తెలుస్తోంది. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని  స్వయంగా సీఎం కేసీఆర్ ద్వారా హామీ ఇప్పించనున్నట్టు సమాచారం.  హైకోర్టు న్యాయవాదిగా ఉన్న నోముల భగత్ కొంత కాలంగా రాజకీయాల్లో యాక్టివ్ గానే ఉంటున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో తన తండ్రిగా తోడుగా ఉంటూ వచ్చారు. 1984లో జన్మించిన భగత్..బీటెక్ చేశారు. తర్వాత ఎంబీఏ చేశారు. సత్యం టెక్నాలజీస్ లిమిటెడ్ లో జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గా కొంత కాలం పని చేశారు.  విస్టా ఫార్మా స్యూటికల్స్ లిమిటెడ్‌లో మేనేజర్ గా  పని చేసిన అనుభవం కూడా భగత్ కు ఉంది. తన తండ్రి న్యాయవాది కావడంతో భగత్ కూడా అటువైపే దృష్టి సారించారు. L.L.B, L.L.M పూర్తి చేసి హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు.  నోముల ఎన్.ఎల్.  ఫౌండేషన్ చైర్మన్ గా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నోముల భగత్. పేద విద్యార్థలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న విద్యార్థులకు గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే ఆశావాదులకు ఉపాధి కల్పించడానికి కోచింగ్ క్లాసులు మరియు జాబ్ మేళాలు ఏర్పాటు చేశారు భగత్. అభ్యర్థి ఎంపిక కోసం కేసీఆర్ చేయించిన సర్వేల్లోనూ భగత్ పై సానుకూలత వ్యక్తమైందని తెలుస్తోంది. నోముల నర్సింహయ్యపై సాగర్ జనాల్లో ఉన్న సానుభూతి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. భగత్ కు టికెట్ ఇస్తే ఈజీగా గెలవొచ్చని సర్వే సంస్థలు, నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయంటున్నారు. ఇలా అన్ని అంశాలు పరిశీలించాకే భగత్ పేరును కేసీఆర్ ప్రకటించారని చెబుతున్నారు. 

ఎన్టీఆర్‌ రావాలి.. మరి, వస్తారా?

రావాలి.. రావాలి.. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి.. అభిమానుల నుంచి టీడీపీ సీనియర్ల వరకూ ఇదే డిమాండ్. తాజాగా.. జూనియర్ ఎన్టీఆర్‌ టీడీపీ బలోపేతం కోసం పని చేయాలంటూ పిలుపిచ్చారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా ఈ సీనియర్ మోస్ట్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో కొత్త నాయకత్వం రాబోతోంది. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు పలువురు టీడీపీ బలోపేతం కోసం పని చేయాలని చెప్పారు. త్వరలోనే తెలుగుదేశంలో పెనుమార్పులు చోటుచేసుకోబోతున్నాయని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు. ఆ మార్పు.. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీనేనా అని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.  టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం వేళ పార్టీ సీనియర్ నేత నోటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ పేరు రావడం యాధృచ్చికమో.. వ్యూహాత్మకమో.. తెలీదు కానీ.. తారక్ పొలిటికల్ ఎంట్రీపై ఎప్పటి నుంచో ఇష్యూ నడుస్తోంది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుకూ ఆ సెగ తగిలింది. బాబు కుప్పం పర్యటనలో టీడీపీ శ్రేణులు జూనియర్‌ను రాజకీయాల్లో దింపాలంటూ అధినేత సమక్షంలోనే పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అప్పటి నుంచి రామారావు రాకపై ఆసక్తి నెలకొంది. కట్ చేస్తే.. ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో నేరుగా ఎన్టీఆర్‌నే పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్నించారు జర్నలిస్టులు. ఇది సమయం కాదంటూ అప్పుడు మాట దాటేశారు జూనియర్.  ఆ తర్వాత తెల్లవారితే గురువారం ప్రీరిలీజ్ ఫంక్షన్‌లోనూ ఫ్యాన్స్ సీఎం సీఎం అంటూ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అభిమానుల సీఎం స్లోగన్స్‌పై సీరియస్ అయ్యారు జూనియర్. ఆగండి బ్రదర్.. అంటూ ఫ్యాన్స్‌ను అదుపు చేశారు ఎన్టీఆర్. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతుందగా.. తాజాగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్ నేత సైతం ఎన్టీఆర్ పార్టీ కోసం పని చేయాలంటూ పిలుపు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.  40ఏళ్ల ప్రస్తానంలో టీడీపీ ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. అయినా.. ఎప్పుడూ ప్రజల పక్షానే నిలిచింది. ఎన్టీఆర్ హయాంలో కాంగ్రెస్ పునాదులు కదిలించిన టీడీపీ.. ఆ తర్వాత చంద్రబాబు చేతిలో మరింత ఉన్నత శిఖరాలకు చేరింది. టీడీపీకి.. ఎన్టీఆర్ ఎలాగో.. చంద్రబాబూ అంతే. తెలుగుదేశం పార్టీకి నాయకత్వ లోటు ఎన్నడూ ఎదురుకాలేదు. ఇప్పటికిప్పుడు పార్టీకి జూనియర్ అవసరమూ లేదంటున్నారు సీనియర్లు. ప్రస్తుతం టీడీపీ ప్రాభవం తగ్గినా.. ఎన్టీఆర్ ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చి పెద్దగా సాధించేదేమీ ఉండకపోవచ్చు. చంద్రబాబు ఇంకో పదేళ్లయినా యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉండగలరు. ఆయన వారసులుగా లోకేవ్, బాలకృష్ణలు ఉండనే ఉన్నారు. మరోవైపు, జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలుగుతున్నారు. ఆయనకు వెండితెరపై మరింత మంచి భవిష్యత్ ఉంది. అర్జెంట్‌గా పొలిటికల్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరమేమీ లేదు. అంతలా సిట్చ్యూయేషన్ డిమాండ్ చేస్తే.. మరో పది, పాతికేళ్ల తర్వాత రాజకీయ ఆలోచన చేయొచ్చు. అప్పటి వరకూ జై తెలుగుదేశం.. జై చంద్రబాబు.

ఏ1,ఏ2లు త్వరలో జైలుకు! బీజేపీ ముఖ్యనేత సంచలనం

ఏ1, ఏ2లు త్వరలోనే జైలుకెళ్లబోతున్నారు.. ఇదీ  బీజేపీ ముఖ్య నేత కామెంట్. ఏ1,ఏ2 లంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికి తెలుసు. గతంలో వాళ్లిద్దరు జైలుకు వెళ్లి వచ్చినవారే. ఈడీ, సీబీఐ కేసుల్లో ఉండి... ప్రస్తుతం బెయిల్ పై ఉన్న ఆ ఇద్దరు నేతలు జైలుకు వెళ్లడం ఖాయమని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ముఖ్య నేత చెప్పడం కలకలం రేపుతోంది.  తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాక రేపుతోంది. వైసీపీ, బీజేపీ, టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్ సాగుతోంది.  బీజేపీ అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభ ఖరారు అయ్యాకా అధికార వైసీపీ, కమలం నేతల మధ్య  మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు పార్టీల ముఖ్యనేతలు ట్విట్టర్ ద్వారా ఆరోపణలు,సవాళ్లు చేసుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను సీఎంను చేస్తామన్న ఏపీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యలపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతల విజయసాయి రెడ్డి స్పందించారు. రెండు పార్టీలు డ్రామాలాడుతున్నాయని.. వారి డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారంటూ ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్ గా సోము వీర్రాజు కూడా ట్వీట్ చేశారు. త్వరలోనే జైలుకెళ్లబోతున్నారని ఎద్దేవా చేశారు. ”తిరుపతి ఉప ఎన్నికల ముందు మీరు వేస్తున్న డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు వస్తే చాలు మన వాడు సీఎం అయిపోతాడన్నట్లు నటిస్తున్నారు. ఎవరి పాత్రల్లో వారు జీవించండి...చెవిలో క్యాబేజీ పూలు పెట్టండి. జనం మాత్రం మళ్లీ వైసీపీనే దీవిస్తారు.” అటూ విజయసాయి రెడ్డి  ట్వీట్ చేశారు. ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకు  సోము వీర్రాజు గట్టిగానే కౌంటరిచ్చారు. “మా ఊసు ఎందుకులే విజయసాయి రెడ్డి గారూ..!!! కోర్టులకు చెవులో పువ్వులు పెడుతూ బయట మేకపోతు గాంభీర్యంతో తిరుగుతున్నా లోపల గోళ్లు కొరుక్కుంటున్నారంటగా అలీబాబా నలభై దొంగలంతా. తిరుపతి ప్రజలకి మేం ఏం ఇచ్చామో చెప్పి క్యాబేజి పువ్వులు మీకు పంపిస్తాం బెయిల్ రద్దవగానే కూరకి లోపల ఉపయోగపడతాయి.” అంటూ కౌంటర్ ట్వీట్ చేశారు. తిరుపతిలో జనసేన-బీజేపీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో పాల్గొన్న సోము వీర్రాజు... పవన్ కల్యాణ్ ను ఏపీ సీఎంగా చూడటమే తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా కూడా ఇదే మాట చెప్పారన్నారు. సోము వ్యాఖ్యలను విమర్శిస్తూ  విజయసాయి రెడ్డి ట్వీట్ చేసి పొలిటికల్ హీట్ పుట్టించారు.   

ఆసుపత్రిలో రోజా.. అభిమానుల్లో ఆందోళన

నగరి ఎమ్మెల్యే రోజా అనారోగ్యతంతో ఆసుపత్రిలో చేరారు. చెన్నై అడయార్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. ఉన్నట్టుండి సడెన్‌గా రోజా ఆసుపత్రిలో చేరడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రోజాకు ఏమైందని ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.  ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ జబర్దస్త్‌గా ఉండే రోజాకు అనారోగ్యం అనే న్యూస్ ఫ్యాన్స్‌ను కలవరపాటుకు గురి చేస్తోంది. రాజకీయంగా దూకుడు మీదుండే నగరి ఎమ్మెల్యేకు ఏ సమస్య వచ్చిందోనని అంతా ఆందోళన పడుతున్నారు.  రోజా ఆరోగ్య పరిస్థితిపై ఆమె భర్త ఆర్కే సెల్వమణి స్పందించారు. చెన్నై అడయార్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో రోజాకు ఫైబ్రాయిడ్ శస్త్రచికిత్స జరిగిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం రోజా ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఆదివారం రాత్రి ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్‌కి షిఫ్ట్ చేశారని.. 2-3 రోజుల్లో యథావిధిగా ఆహారాన్ని తీసుకుంటారని చెప్పారు. దయచేసి ఎవరూ హాస్పిటల్ దగ్గరకు రావద్దని సెల్వమణి విజ్ఞప్తి చేశారు. మరో రెండు వారాల పాటు రోజాకు పూర్తి విశ్రాంతి తీసుకుంటారని.. ఆమె ఆరోగ్యంపై ఆడియో టేప్ విడుదల చేశారు సెల్వమణి. గతేడాది కరోనా, జనవరిలో ఎన్నికల కారణంగా సర్జరీలు వాయిదా వేశారని సెల్వమణి తెలిపారు. ఎమ్మెల్యే రోజా రెండు, మూడు నెలలుగా బిజీ, బిజీగా ఉన్నారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు, మార్చిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఆ హడావిడి ముగియడంతో రోజా చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్సలు చేయించుకున్నారు. వైఎస్సార్‌‌సీపీ కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేయడంతో ఆడియో టేప్ రూపంలో ప్రకటన విడుదల చేశారు సెల్వమణి.

వాట్సాప్ చేస్తే 10వేలు.. వైసీపీకి టీడీపీ షాక్

7557557744 నెంబర్‌కు వీడియో, ఆడియో, ఫోటో.. వాట్సాప్ చేయండి. మీ అకౌంట్‌లో పదివేలు వేస్తాం. ఈ ఆఫర్ తిరుపతి లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు మాత్రమే. ఉప ఎన్నికల వేళ వైసీపీకి టీడీపీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. అధికార పార్టీకి ఓట్లు వేయకపోతే ప్రభుత్వ పథకాలు అందవంటూ బెదిరించే వారికి కౌంటర్‌గా వాట్సాప్ ఆఫర్ ప్రకటించింది.   వాలంటీర్లు గానీ, అధికార పార్టీ వాళ్లు కానీ బెదిరిస్తే... వెంటనే తమకు వాట్సాప్‌లో సమాచారం అందించాలని పిలుపిచ్చారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు. వైసీపీకి ఓటెయ్యకపోతే పథకాలు రావంటూ భయపెట్టే వాలంటీర్ల గుట్టురట్టు చేయాలన్నారు. అలా బెదిరించే కాల్ రికార్డు కానీ, ఫోటో కానీ, వీడియో కానీ.. 7557557744 అనే నెంబర్‌కు వాట్సాప్ చేస్తే సంబంధిత వ్యక్తుల అకౌంట్‌లో 10వేలు వేస్తామని చెప్పారు. తిరుపతి లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు ఇది వర్తిస్తుందన్నారు అచ్చెన్న.  రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా.. తిరుపతిలోనే టీడీపీకి ఎక్కువ శాతం ఓట్లు వచ్చాయని అచ్చెన్నాయుడు అన్నారు. అయితే, అధికార పార్టీ బెదిరింపులతో ఓటమి తప్పలేదన్నారు. పథకాలు పోతాయనే భయం అవసరం లేదని... ఆ డబ్బులు జగన్ రెడ్డి తాత డబ్బులో.. తండ్రి డబ్బులో కాదని.. అవి ప్రజల డబ్బులన్నారు. 10 పైసలు ఇచ్చి.. 90 పైసలు దోచుకుంటున్న జగన్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే.. తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ పక్షాన నిలవాలని విజ్ఞప్తి చేశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు. 

మంత్రి మాయం.. మల్లన్న కోసమేనా?

రెండు వేరు వేరు ఘటనలు. ఇద్దరు వేరు వేరు మనుషులు. ఆ ఇద్దరిలో ఒకరు తీన్మార్ మల్లన్న. ఇంకొకరు తెలంగాణకు చెందిన సీనియర్ మంత్రి. ఇక, ఆ రెండు ఘటనల్లో ఒకటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గెలుపు అంచుల వరకూ చేరుకోవడం. రెండో ఘటన.. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ఆ సీనియర్ మినిస్టర్ రెండు సార్లు మిస్సింగ్ అవటం. అవును, మీరు చదివింది నిజమే. మినిస్టర్ మిస్సింగ్. చుట్టూ మందిమార్బలం ఉన్నా.. ఎస్కార్ట్ వెహికిల్స్, గన్‌మెన్స్ ఉన్నా.. అందరి కళ్లూ గప్పారు. హుష్ కాకిలా.. గప్‌చుప్‌గా మాయమయ్యారు. ఇలా, రెండుసార్లు సదరు మంత్రివర్యులు మాయమయ్యారు. అది కూడా సరిగ్గా ఎమ్మెల్సీ ఎలక్షన్ టైమ్‌లో ఇలా జరగడం మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. మేటర్ సీఎం కేసీఆర్ దగ్గరికి చేరడంతో పొలిటికల్ అటెన్షన్ పెరిగింది.  పైపైన చూస్తే మల్లన్నకు ఆ మంత్రి మిస్సింగ్‌కు ఎలాంటి సంబంధం లేదు. కానీ, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఆయన ఈయన కోసమే మాయమయ్యారని అంటున్నారు. ఆ ఇద్దరూ బీసీ ఎజెండాతో రహస్య స్నేహితులుగా మారారని చెబుతున్నారు.  ఆ మంత్రి నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు ఇంట్లో నుంచి గాయబ్ అయ్యారట. ఓ రోజు ఉదయాన్నే.. సెక్యూరిటీ సిబ్బంది ఎవరూ నిద్ర లేవకముందే.. సొంతవాహనం, సొంత డ్రైవర్‌తో కలిసి బయటికి వెళ్లారు. నిద్ర లేచిన తర్వాత మంత్రి తన నివాసంలో లేరని గుర్తించిన భద్రతా సిబ్బంది.. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు అదే మంత్రి మరోసారి ఇలాగే బయటికి వెళ్లారు. ఇలా రెండుసార్లు ఆ మంత్రి మాయమైన విషయాన్ని ముఖ్యమంత్రికి నివేదించారు పోలీస్ ఉన్నతాధికారులు.  సెక్యూరిటీకి తెలీకుండా ఆ సీనియర్ మంత్రి ఎక్కడికి వెళ్లారు? ఎవరిని కలిశారు? అనేదానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. సరిగ్గా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ముందే ఆ మంత్రి రెండుసార్లు భద్రతా సిబ్బంది కన్నుగప్పి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ మంత్రి.. తీన్మార్ మల్లన్న కోసమే రెండుసార్లు గోడ దూకారని అంటున్నారు. కొంతకాలంగా సీఎం కేసీఆర్‌పై రెబెల్ వాయిస్ వినిపిస్తున్న సదరు మినిస్టర్.. అవసరమైతే కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకూ సిద్ధంగా ఉన్నారని టాక్. ఎమ్మెల్సీ సన్నాహక సమావేశానికి తనను పిలవకుండా అవమానించినందుకు ప్రతీకారంగా.. కేసీఆర్‌కు ఝలక్ ఇచ్చేలా తీన్మార్ మల్లన్నను గెలిపించేందుకు ఆ మంత్రి తెరవెనుక మంత్రాంగం నడిపినట్టు సమాచారం. వరంగల్ జిల్లాలో తనకున్న పరిచయాలను ఉపయోగించి.. మల్లన్నకు సపోర్ట్ చేసేలా.. మంత్రాంగం నెరిపారని అంటున్నారు. ఆ మంత్రిని ఇప్పటికే నిఘానేత్రం వెంటాడుతోందని.. ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని.. అందుకే, సెక్యూరిటీకి సైతం తెలీకుండా.. తెల్లవారుజామునే ఇంట్లో నుంచి మాయమయ్యారని చెబుతున్నారు. సదరు మినిస్టర్ మిస్సింగ్ ఎపిసోడ్.. మల్లన్న కోసమేనా? లేదా, కొత్త పార్టీ ఏర్పాట్ల కోసమా? అనేది తేల్చే పనిలో నిఘా వర్గాలు బిజీగా ఉన్నాయి. 

వైసీపీకి నోటా కంటే తక్కువ ఓట్లు!

తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి రాజేస్తోంది. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో ప్రచారం ఊపందుకుంది. రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన వైసీపీ.. తిరుపతిలో భారీ విజయానికి ప్లాన్ చేస్తోంది. అయితే తెలుగు దేశం నేతలు మాత్రం అధికారం ఉపయోగించి తిరుపతిలో అక్రమాలు చేసేందుకు వైసీపీ కుట్రలు చేస్తుందని ఆరోపిస్తోంది.  తిరుపతి ఉప ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరిపిస్తే...వైసీపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వస్తాయంటూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న బహిరంగ సవాల్ విసిరారు. టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో మాట్లాడిన బుద్దా.. వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేయగలిగేది ఒక్క టీడీపీ మాత్రమే అని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు, వాపును చూసి బలుపు అనుకుంటున్నారని మండిపడ్డారు. డబ్బు, అధికారం, పోలీస్ అనే మూడు రత్నాలతో ఎన్నికల్లో గెలిచారని ఆరోపించారు. వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నదన్నారు. 2024లో తప్పకుండా టీడీపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని బుద్దా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు.  తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ అభ్యర్థిగా సీఎం జగన్ వ్యక్తిగత ఫిజియో థెరపిస్ట్ గురుమూర్తి  పోటీ చేస్తుండగా.. టీడీపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి బరిలో ఉన్నారు. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభ పోటీ చేస్తున్నారు. తిరుపతి లోక్ సభ నుంచి గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ రావు 2 లక్షల 40 వేల మెజార్టీతె గెలిచారు.ఆయన అకాల మరణంతో ఉప ఎన్నిక జరుగుతోంది.