సచిన్ కి పాజిటివ్!

చట్టానికి ఎవరు అతిథులు కారు అన్నట్లు అని ఎలా అయితే చెప్పుకుంటామో. కరోనా కి కూడా ఎవరు అతిథులు కారు. అది బెంజులో తిరిగేవరైనా గంజి నీళ్లు తాగేవారైనా.. అందరూ కరోనా కాటు భారీన పడాల్సిందే. సంవత్సరం ప్రపంచాన్ని వణికించిన కరోనా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది.. ఈ ఇన్నింగ్ లో ముఖ్యంగా సెలబ్రెటీలు బాగా గురవుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నటులు ఆమీర్ ఖాన్, మాధవన్ కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. తాజాగా క్రికెట్  దిగ్గజం, మాస్టార్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కరోనా భారీన పడ్డాడు.  కరోనా పరీక్షలో సచిన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని సచిన్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ఎప్పటికప్పుడు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నాను. కరోనా లక్షణాలు స్వల్పంగా కనిపించడంతో తాజాగా మరోసారి పరీక్ష చేయించుకున్నా. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మా ఇంట్లో మిగిలిన అందరికీ నెగిటివ్ వచ్చింది. నేను ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాను. నాకు మద్దతుగా నిలుస్తున్న వైద్య సిబ్బందికి, దేశవ్యాప్తంగా ఉన్న నా శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. అందరూ జాగ్రత్తగా ఉండండ`ని సచిన్ ట్వీట్ చేశాడు.    ఇది ఇలా ఉండగా లింగం మాయ్యా కు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.. లింగం మాయ్యా అంటే ఎవరని అనుకుంటున్నారా అందేనండి శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి మామ పాత్రలో నటించిన బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ కరోనా బారిన పడ్డారు. షూటింగ్ సమయంలో నీరసంగా ఉండటంతో టెస్ట్ చేయించుకున్నాడు. దీంతో కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ ఉంది. డాక్టర్ల సలహా మేరకు హోమ్ క్వారంటైన్‌లో ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు.

సాగర్ బీజేపీలో తిరుగుబాటు? 

నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక బీజేపీలో తిరుగుబాటుకు కారణమవుతుందని తెలుస్తోంది. సాగర్ నామినేషన్ల ప్రక్రియలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించక ముందే ఆ పార్టీ నాయకురాలు కంకణాల నివేదిత శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నివేదిత రెడ్డి పోటీ చేశారు. నివేదిత భర్త శ్రీధర్ రెడ్డి నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. నాగార్జున సాగర్ టికెట్ కోసం ఆయన పోటీ పడుతున్నారు. నియోజకవర్గంలో వీళ్లు ప్రచారం కూడా చేస్తున్నారు.  పార్టీ తనకే టికెట్‌ ఖరారు చేస్తుందన్న నమ్మకంతో  నామినేషన్‌ దాఖలు చేసినట్లు నివేదితా రెడ్డి చెబుతున్నారు. అయితే అభ్యర్థి ఎంపికపై అధిష్ఠానం ఇంకా  ఏ నిర్ణయం తీసుకోక ముందే నివేదిత నామినేషన్‌ దాఖలు చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ పార్టీ ఆమెకు టికెట్‌ కేటాయించని పక్షంలో రెబల్‌గా బరిలో ఉంటుందా.? లేక ఉపసంహరించుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. నివేదిత నామినేషన్‌ దాఖలు చేసి ఓ రకంగా ఆ పార్టీని ఇరకాటంలో పడేసిందని అంటున్నారు.  నాగార్జున సాగర్ లో అభ్యర్థి ఎంపికపై బీజేపీ తర్జనభర్జన పడుతోంది. కాంగ్రెస్ నుంచి జానా రెడ్డి పోటీ చేస్తుండగా.. టీఆర్ఎస్ ఇంకా ఎవరిని ఖరారు చేయలేదు. అధికార పార్టీ నుంచి బీసీ వ్యక్తి అభ్యర్థిగా ఉంటారని తెలుస్తోంది. టీఆర్ఎస్ క్యాండిడేట్ ఖరారు అయ్యాకా... సామాజిక కోణంలో తమ అభ్యర్థిని ఎంపిక చేయాలని బీజేపీ భావిస్తోంది. సాగర్ లో యాదవులతో పాటు ఎస్టీలు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఈ రెండు వార్గాల నుంచే బీజేపీ అభ్యర్థి ఉండవచ్చని చెబుతున్నారు. కడారి అంజయ్య యాదవ్, రవి నాయక్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పార్టీ ఆలోచన ఇలా ఉంటే.. కంకణాల నివేదితా రెడ్డి నామినేషన్ వేయడం ఇప్పుడు బీజేపీలో కాక రేపుతోంది.  నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకు మొత్తం 20 మంది అభ్యర్థులు 23 నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, మిర్యాలగూడ ఆర్డీఓ రోహిత్‌ సింగ్‌ తెలిపారు.  ఈ నెల 27, 28, 29 తేదీలు సెలవు దినాలు కావడంతో నామినేషన్లకు అవకాశం ఉండదు. 30వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. 31న నామినేషన్ల పరిశీలన.. ఏప్రిల్ 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. ఏప్రిల్ 17న పోలింగ్‌ జరగనుండగా.. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితం ప్రకటించనున్నారు.  

వాట్సాప్ వీడియో కాల్ తో .. రూ.10 లక్షలు ఫసక్..

ఆయనకు 40 ఏళ్ళు. అయినా యావ  చావలేదు. సోషల్ మీడియా లో బాగా వాడుతారు. చివరకు ఆ సోషల్ మీడియానే కొంప ముంచింది. ఎలా అనుకుంటున్నారా. మోహపుస్తకం తెలుసు కదా అదేనండి .. పేస్‌బుక్‌లో ఓ యువతి పరిచయం అయింది. ఆ పరిచయం న్యూడ్ వీడియోస్ చేసుకునేంతగా మారింది. ఇంకేముందు ఆయనకు అడ్డు కావాలనిపించింది. చివరికి ఆ అమ్మాయి గడ్డి తినిపించింది. వాట్సాప్‌లో న్యూడ్ కాల్ చేయడంతో రూ.10 లక్షలకు ఫసక్.  నగరంలోని బేగంబజార్‌కు చెందిన 40 ఏళ్ల వ్యక్తికి ఓ యువతి ఫేస్ బుక్‌లో పరిచయమైంది. వాట్సాప్ లో వీడియో కాల్ చేస్తానంటూ ఫోన్ నెంబరు పుచుకుంది. వాట్సాప్ కాల్ చేసిన తర్వాత కరోనా సెకండ్ డోస్ లాగ కొంచం డోస్ పెంచి వీడియో కాల్ చేస్తానండి. ఇక మనోడి ఆవేశానికి అడ్డులు లేకుండా పోయాయి. జోళ్ళు కారుస్తూ అంగీకరించాడు. ఆ తర్వాత నువ్వు కూడా న్యూడ్ కావాలంటూ యువతీ కోరడంతో.. మేము వయసుకు వచ్చాము అనే సాంగ్ వేసుకుని బాత్రూం లోకి వెళ్లి న్యూడ్ అయ్యాడు. ఇక కంటే ఆ ఒక న్యూడ్ కాల్ ఆ వ్యక్తిని లూటీ చేసేలా చేసింది. తన న్యూడ్ కాల్‌ను రికార్డు చేసిన సదరు లేడీ యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేశానంటూ.. దీనిని డిలీట్ చేయాలంటే రూ.10 లక్షలు కావాలంటూ డిమాండ్ చేసింది. లేదంటే, ఫేస్ బుక్ లోని మీ స్నేహితులకు పంపిస్తానంటూ బెదిరించింది. ఆ యువతీ పథకం ప్రకారం కొందరు ఫ్రెండ్స్ కు పంపింది. దీంతో చేసేదేమీ లేక, రూ.10 లక్షలను సమర్పించుకున్నాడు. సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీసీఎస్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.   

ఏపీలో రివర్స్ పాలన.. కేసీఆర్ కామెంట్లతో రచ్చ 

ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు మొదటి నుంచి వివాదాస్పదమే అవుతున్నాయి. జగన్ సర్కార్ తీసుకున్న చాలా నిర్ణయాలను కోర్టులు రద్దు చేశాయి. మరికొన్ని పథకాలను ప్రభుత్వమే వెనక్కి తీసుకుంది. జగన్ సర్కార్ కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా రివర్స్  టెండరింగ్ విధానం తీసుకొచ్చింది. దీనిపైనా చాలా విమర్శలు  వచ్చాయి. దీంతో  ఆంధ్రప్రదేశ్ లో రివర్స్ పాలన సాగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. జగన్ రెడ్డిది రివర్స్ పాలనంటూ ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తుంటాయి. అయితే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఏపీ ప్రభుత్వంపై రివర్స్ వ్యాఖ్యలే చేశారు.  తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్...  ఏపీ పేరు ప్రస్తావించారు. గతంలో రాష్ట్ర విభజన సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోతుందని చాలామంది శాపాలు పెట్టారని, ఇప్పుడా శాపాలు వాళ్లకే రివర్స్ అయ్యాయని అన్నారు. ఇవాళ తెలంగాణలో ఎకరం భూమి రూ.30 లక్షలకు అమ్మి, ఏపీలో ఎకరం పదిహేను లక్షల రూపాయల చొప్పున కొంటున్నారని వివరించారు. గతంతో పోలిస్తే ఏపీలో అంతా రివర్స్ గా ఉందనే కామెంట్లు చేశారు కేసీఆర్.  ఏపీ సీఎం జగన్ కు తనకు అత్యంత సన్నిహితుడని కేసీఆర్ చెబుతుంటారు. అలాంటి కేసీఆర్.. జగన్ పాలనపై రివర్స్ కామెంట్లు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. కేసీఆర్ వ్యాఖ్యలను కోట్ చేస్తూ సీఎం జగన్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు  ఏపీ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ. "రావాలి కావాలి అని ఊదరగొట్టారు. వచ్చాక ఏంచేశారో, రాష్ట్రాన్ని ఏ స్థితికి తీసుకెళ్లారో" అంటూ వ్యాఖ్యానించారు. అక్కడ ఎకరం అమ్మి ఏపీలో రెండెకరాలు కొంటున్నారని మీ రివర్స్ పాలనపై పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభలో చెప్పిన మాటలు వినపడుతున్నాయా? అంటూ ప్రశ్నించారు. దేశం మొత్తం మనవైపు చూసేలా చేయడం అంటే ఇదేనా? అని జగన్ పై సెటైర్లు వేశారు దేవినేని ఉమ.

ఏపీ ఎస్ఈసీగా నీలం సాహ్నీ

ఆంధ్రప్రదేశ్ కొత్త ఎన్నికల కమిషనర్ ను ప్రభుత్వం నియమించింది. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  నీలం సాహ్నిని ఎస్‌ఈసీగా నియమిస్తూ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌కు ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. జగన్ సర్కార్ ప్రతిపాదనను గవర్నర్ ఆమోదించారు. దీంతో నీలం సాహ్నిని ఎస్‌ఈసీగా త్వరలో బాధ్యతలు చేపడుతారు. ప్రస్తుత ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఎస్‌ఈసీని నియమించేందుకు ప్రభుత్వం నీలం సాహ్ని, ప్రేమచంద్రారెడ్డి, శామ్యూల్ పేర్లను ప్రభుత్వం ప్రాతపాదించింది. చివరికి సాహ్నిని ఎంపిక చేశారు. ఆమె ఇటీవల ప్రభుత్వ ప్రధాన సెక్రటరీగా పదవీవిరమణ చేశారు. ఆ తర్వాత సీఎం జగన్‌ను ప్రధాన సలహాదారుగా నియమించారు. సాహ్ని రెండేళ్ల పాటు సలహాదారుగా ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పుడామే ఎస్ఈసీగా నియమితులు కావడంతో.. సీఎం సలహాదారు పదవికి నీలం సాహ్నీ రాజీనామా చేయనున్నారు.  1984వ ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సాహ్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మచిలీపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. అనంతరం టెక్కటి సబ్‌ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. తర్వాత నల్గొండ జాయింట్ కలెక్టర్‌గా, కలెక్టర్‌గా పనిచేశారు. మున్సిపల్ పరిపాలన విభాగం డిప్యూటి సెక్రటరీగా, స్త్రీ శిశు సంక్షేమశాఖ పీడీగా పనిచేశారు. నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ పనిచేశారు. కుటుంబశాఖలో పలు విభాగాల్లో పనిచేశారు. అంతేకాకుండా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. ఏపీఐడీసీ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశారు. ఆ తర్వాత స్త్రీ, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉద్యోగ విమరణ పొందారు.  

బీజేపీ ఓటమే పవన్ లక్ష్యమా?

బీజేపీ అంటే పవన్ కల్యాణ్ చాలా కోపంగా ఉన్నారా? ఆ పార్టీ ఓటమే ఆయన లక్ష్యమా? అంటే  జనసేన వ్యూహాలు, పవన్ కల్యాణ్ అడుగులు చూస్తున్న వారికి అలానే అనిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీ-జనసేన మిత్రపక్షాలుగా కొనసాగుతున్నాయి. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి పవన్ కల్యాణ్ మద్దతు తెలిపారు. అయితే తిరుపతిలో తామే పోటీ చేసి తీరుతామని గట్టిగా పట్టుబట్టిన పవన్ కల్యాణ్.. వెనక్కి తగ్గడంపై అనుమానాలు వచ్చాయి. ఇప్పుడు వాటికి అనుగుణంగా జనసేన వ్యూహాలు మారుతున్నట్లు కనిపిస్తోంది.  నల్గొండ జిల్లా  నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. జనసేన కూడా నాగార్జున సాగర్‌లో పోటీ చేస్తోందనే  ప్రచారం జరుగుతోంది.  ఈ ఉప ఎన్నికలో ఎస్టీ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని దింపాలని జనసేనాని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నిక ప్రక్రయ కోసం ప్రచార కమిటీని కూడా ఏర్పాటు చేసేందుకు సన్నాహకాలు చేస్తునట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.  బీజేపీ సాగర్ లో ఎస్టీ అభ్యర్థిని బరిలోకి దింపాలని డిసైడ్ అయిందని ప్రచారం జరుగుతోంది. రవి నాయక్ బీజేపీ క్యాండిడేట్ గా పోటీ చేస్తారని చెబుతున్నారు.అయితే బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన నాగార్జున సాగర్ లో పోటీ చేయడమే సంచలనం అయితే... బీజేపీ నుంచి పోటీ చేస్తారని భావిస్తున్న ఎస్టీ సామాజిక వర్గం నుంచే జనసేన అభ్యర్థి ఉంటారని తెలుస్తుండటం మరింత సంచలనంగా మారుతోంది.  నాగార్జున సాగర్ లో జనసేన పోటీ అంశం ఇప్పుడు  రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్ అవుతోంది. పవన్ కల్యాణ్ సాగర్ లో అభ్యర్థిని పోటీలో పెడితే బీజేపీకి నష్టమనే చర్చ జరుగుతోంది. దీంతో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ ఎత్తులు వేస్తున్నారని చెబుతున్నారు. అందుకే బీజేపీ నిలబెట్టాలనుకుంటున్న ఎస్టీ వర్గం నుంచే అభ్యర్థిని ఎంపిక చేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.  ఇటీవలే తెలంగాణ బీజేపీ నేతలపై ఘాటు ఆరోపణలు చేశారు పవన్ కల్యాణ్. గ్రేటర్‌లో సహకరించిన తమను బీజేపీ నేతలు పదేపదే అవమానిస్తున్నారని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో  పోటీ చేయాలని ముందు జనసేన భావించింది. అయితే బీజేపీ నేతల విజ్ఞప్తి మేరకు జనసేన పోటీ నుంచి తప్పుకుంది. గ్రేటర్‌లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం జనసేన కృషి చేసింది. తాము బీజేపీ గెలుపు కోసం కష్టపడినా.. తెలంగాణ బీజేపీ నేతలు తమను చులకన చేసి మాట్లాడారని జనసేన నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ, జనసేన మధ్య గ్యాప్ వచ్చింది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణీదేవికి పవన్ మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలోనే నాగార్జున సాగర్ లో తెలంగాణ బీజేపీకి జనసేన షాకివ్వబోతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు .

అమరావతి కేసులపై మళ్లీ మొదటి నుంచి విచారణ

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి కేసులపై హైకోర్టులో మళ్లీ మొదటి నుంచి విచారణ జరగనుంది. అమరావతి నుంచి రాజధాని తరలించకూడదని రైతులు, ఇతరులు వేసిన పిటిషన్‌పై మే 3 నుంచి హైకోర్టులో విచారణ ప్రారంభం కానుంది. రాజధాని పిటిషన్లపై ఏ విధంగా విచారణ చేపట్టాలనే అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటైంది. పిటిషనర్లు, ప్రభుత్వం తరఫు న్యాయవాదుల వాదనలపై ధర్మాసనం ఆన్‌లైన్‌ ద్వారా విచారణ జరిపింది. అనంతరం మే 3 నుంచి రోజువారీ విచారణ జరపాలని నిర్ణయం తీసుకుంది. మళ్లీ మొదటి నుంచి వాదనలు కొనసాగనున్నాయని ఈ సందర్భంగా సీనియర్‌ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. సీజే ఏకే గోస్వామి, జస్టిస్‌ బాగ్చీ, జస్టిస్‌ జయసూర్య ధర్మాసనం ఈ విచారణ చేపట్టనుంది.  అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టాలను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరిపింది. జస్టిస్‌ మహేశ్వరి బదిలీతో ఈ వ్యాజ్యాల పై విచారణ నిలిచిపోయింది. హైకోర్టు విడుదల చేసిన రోస్టర్‌లో శుక్రవారం త్రిసభ్య ధర్మాసనం విచారించింది. గతంలో ఈ కేసు సంబంధించి ఇటు రైతుల నుంచి అటు ప్రభుత్వం నుంచి దాదాపుగా వాదనలు పూర్తయ్యే దశలో అప్పటి చీఫ్ జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి బదిలి కావడంతో ఈ కేసులు విచారణ నిలిచిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ మొదటి వాదనలు జరగనుండటంత.. ఈ కేసు విచారణ రెండు, మూడు నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది. 

కేసీఆర్ సారూ ఉద్యోగాలేవి.. నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం 

నిరుద్యోగ యువకుడు ఆత్మాహత్యాయత్నం చేసిన ఘటన మహబూబా బాద్ జిల్లాలో కలకలం రేపుతోంది.ఆయన తీసుకున్న వీడియో, అందులో మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. గూడురు మండలం గుండెంగా గ్రామానికి చెందిన బోడ సునీల్ చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. 2016వ సంవత్సరంలో ఎస్సై పరీక్షలు రాసి క్వాలిఫై అయ్యాడు. కానిస్టేబుల్ పరీక్షలు కూడా రాసి క్వాలిఫై అయ్యాడు. కానీ తగినంత ఎత్తు లేడన్న కారణంతో అతడిని ఉద్యోగంలోకి తీసుకోలేదు. అప్పటి నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చి ఏడేళ్లు దాటినా నిరుద్యోగుల కోసం సర్కారు పనిచేసిన దాఖలాలు లేవని అతడు ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు అతడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. సూసైడ్ అటెంప్ట్ కు ముందు వీడియోలో తన బాధంతా చెప్పుకున్నాడు సునీల్. ‘తెలంగాణ వచ్చి ఏడేళ్లయినా నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదు. ఉద్యోగాల నోటిఫికేషన్లు లేవు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూనే కాలం గడిచిపోతోంది. రాజకీయ నాయకులు మాటలతో కాలం గడిపేస్తున్నారు. నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను పెంచడం, వారి పదవీ విరమణ కాలాన్ని కూడా పెంచడం వంటివి చేస్తున్నారు కానీ, నిరుద్యోగుల గురించి మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు‘ అంటూ సునీల్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనతోపాటు, నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక ఆత్మహత్యాయత్నం చేశాడు. వీడియో తీసి సోషల్ మీడియాలో కూడా అప్ లోడ్ చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమయిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు.  ‘ఏడేళ్లవుతోంది తెలంగాణ వచ్చి. ఇంత వరకు నోటిఫికేషన్లు లేవు. నేనేం చేతకాక చనిపోవాలని అనుకోవడం లేదు. ప్రభుత్వానికి నా డిమాండ్, నిరుద్యోగుల సమస్యలు తెలియాలన్న కారణంతోనే నేను ఆత్మహత్యాయత్నం చేస్తున్నా. కేసీఆర్ సర్కారుపై పోరాడాలి. ఫ్రెండ్స్.. నేను బతికొస్తే నిరుద్యోగుల కోసం మీతో కలిసి ఉద్యమం చేస్తా. నేను తిరిగి రాకుంటే, ఆసుపత్రిలోనే చనిపోతే నా తరపున నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించండి‘ అని సునీల్ తన వీడియోలో కోరాడు.

నిరుద్యోగ భృతి ఎప్పుడంటే.. 

తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో సీఎం కేసీఆర్ ప్రసంగం తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడింది.  చివరి రోజు సభలో సీఎం కేసీఆర్ ఆసక్తికర నిర్ణయాలు ప్రకటించారు. నిరుద్యోగులకు తీపి కబురు  చెప్పారు  కేసీఆర్. కరోనా వ్యాప్తి కారణంగా నిరుద్యోగ భృతి చెల్లించలేకపోయామని, త్వరలోనే నిరుద్యోగులను గుర్తించే ప్రక్రియకు శ్రీకారం చుడతామని అన్నారు. మిగతా రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి అమలు తీరును పరిశీలిస్తున్నామని, కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చాక నిరుద్యోగ భృతి అందజేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు కేసీఆర్.  తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఆర్టీసీ ఉద్యోగులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, బడ్జెట్ లో రూ.3 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వేతనాల పెంపు ఉంటుందని స్పష్టం చేశారు. త్వరలోనే రవాణా శాఖ మంత్రితో చర్చించి ప్రకటన చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించిన 3 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ అప్పులు పెరగలేదని, ఎఫ్ఆర్ బీఎం పరిధికి లోబడే అప్పులు ఉన్నాయని స్పష్టం చేశారు. 22.8 శాతం అప్పుతో దేశంలో తెలంగాణ 25వ స్థానంలో ఉందన్నారు. వ్యవసాయ రంగంలో 17.73 శాతం పురోగతి సాధించడం సంతోషంగా ఉందన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులపై వందల సంఖ్యలో కేసులు వేశారని, అయినప్పటికీ తాము ఆపలేదని అన్నారు. వ్యవసాయంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నమ్ముతూ కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని వివరించారు. పోడు భూములు సాగు చేసుకుంటున్నవారికీ రైతుబంధు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. త్వరలోనే పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. పంచాయతీ కార్యదర్శులకు రెగ్యులర్ కార్యదర్శులకు ఇచ్చే వేతనం ఇస్తామని చెప్పారు. తెలంగాణ వస్తే రియల్ ఎస్టేట్ విలువ పడిపోతుందని శాపాలు పెట్టారన్నారు కేసీఆర్. తెలంగాణలో భూముల ధరలు పెరిగాయని, ఏపీలో తగ్గాయని వివరించారు. ధరణి పోర్టల్ ద్వారా కోటిన్నర ఎకరాల భూమి రికార్డుల్లోకెక్కిందని కేసీఆర్ వెల్లడించారు. ఇకపై ఎట్టిపరిస్థితుల్లోనూ భూ రికార్డులు తారుమారు అయ్యే పరిస్థితే లేదన్నారు.

తిరుపతి బరిలో మాజీలు ...ముందు తరం నేతలు

తిరుపతి లోక్‌సభ స్థానానికి జరుగుతున్నఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా, మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ పోటీకి సిద్దమయ్యారు. చింతామోహన్ పేరును,ఏఐసీసీ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. వైసీపీ టీడీపీ,బీజేపీ ఇప్పటికే తమ అభ్యర్ధులను ప్రకటించాయి. వైసీపీ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఖాళీ అయిన తిరుపతి స్థానానికి ఏప్రిల్ 17 న పోలింగ్ జరుగుతుంది. కాగా, ఉపఎన్నిక బరి నుంచి ఇద్దరు కొత్తగా రాజకీయ అరంగేట్రం చేస్తుంటే, ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులు తమ తమ అదృష్టాన్ని మరో మారు పరిరక్షించుకునేందుకు సిద్దమయ్యారు.   వైసీపీ తరపున పోటీ చేస్తున్న డా.గురుమూర్తి, బీజేపీ తరపున పోటీ చేస్తున్నమాజీ ఐఏఎస్ ఆఫీసర్ రత్న ప్రభ, తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. మరో వంక టీడీపీ తరపున కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ తరపున మరో మాజీమంత్రి చింతా మోహన్ పోటీ పడుతున్నారు. చింతా మోహన్ గతంలో  ఇదే స్థానం నుంచి ఆరు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.  రెండు పర్యాయాలు కేంద్ర మంత్రి వర్గంలో కీలక శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, పనబాక లక్ష్మి 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. టీడీపీ టికెట్ పై పోటీ చేసి ఒడి పోయారు. ఇప్పుడు ఆమె మరో మారు, టీడీపీ తరపున పోటి చేస్తున్నారు.గతంలోనూ ఆమె నెల్లూరు నుంచి లోక్ సభకు మూడు పర్యాయాలు ఎన్నికయ్యారు. ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో రెండుసార్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలకు నిర్వహించారు.   ఇక తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న వైసీపీ అభ్యర్ధి డా.గురుమూర్తికి, అదే విధంగా బీజేపీ అభ్యర్ధి రత్నప్రభకు ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేక పోయినా, పొలిటికల్ కారిడార్స్’తోలో ఇద్దరికీ  సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. బీజేపీ అభ్యర్ధి, కర్ణాటక క్యాడర్ కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి రత్న ప్రభ గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వివిధ మంత్రిత్వ శాఖలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆ విధంగా ఎన్నికలలో పోటీ చేయడం కొత్తయినా  రాజకీయాలు పూర్తిగా కొత్త కాదు. అలాగే, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పొడుగునా ఆయనకు ఫిజియో సేవలు అందించిన డా. గురుమూర్తి కూడా రాజకీయ వాతావరణంలోనే పెరిగారు. ఇలా మాజీలు, ముందు తరం నేతలు పోటీ పడుతున్న తిరుపతి ఉప ఎన్నిక పోరుఅందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.కాగా,ఇంతవరకు టీడీపీ అభ్యర్ధి పనబాక లక్షి మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. మార్చి 29తో నామినేషన్ గడువు ముగుస్తుంది.  

సర్కారును ఉతికారేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

తెలంగాణ అసెంబ్లీలో వాడివేడి చర్చలు. పలు సమస్యలపై సభ్యుల ప్రశ్నలు. మంత్రుల సమాధానాలు. కట్ చేస్తే, తమకు సమయం ఇవ్వడం లేదంటూ సభ్యుల విమర్శలు. తాము మాట్లాడుతుంటే మధ్యలోనే మైక్ కట్ చేస్తున్నారంటూ ఆరోపణలు. విపక్షాలకు ఛాన్స్ లేకుండా పోతుంటే.. మరి హౌజ్‌లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నది ఎవరు? ఇంకెవరూ అధికార పక్ష నేతలే. సొంత ఎమ్మెల్యేలే సొంత సర్కారును ప్రశ్నలతో ప్రశ్నిస్తున్నారు. మా పనులు చేసిపెట్టరా? అంటూ నిగ్గదీసి అడిగేస్తున్నారు. ఎమ్మెల్యేల ప్రశ్నల బాణాలతో ప్రభుత్వం శల్య పరీక్ష ఎదుర్కొంటోంది. అసెంబ్లీలో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.  స్వపక్ష ఎమ్మెల్యేలు సమస్యలపై ఇంతలా ప్రశ్నలు అడగడానికి కారణం లేకపోలేదు. తమ గోడు చెప్పుకుందామంటే గులాబీ బాస్ అపాయింట్‌మెంట్ ఇవ్వరు. నియోజక వర్గ సమస్యలు ప్రస్తావిద్దామంటే ప్రగతి భవన్ గేట్ కూడా దాటనివ్వరు. సీఎం కేసీఆర్‌ను చూడగలిగింది ఏ పార్టీ కార్యవర్గ సమావేశంలోనో. అది కూడా అల్లంత దూరం నుంచే. ఇక కేసీఆర్‌ను కలవాలంటే కల్లే. ఆ ఛాన్స్ మంత్రులకే అంత ఈజీగా రాదు. ఇక ఎమ్మెల్యేలెంత. పదవీ కాలం ముగిసేలోగా.. కేసీఆర్‌ను ఒక్కసారి కూడా కలవని ఎమ్మెల్యేలు ఎందరో. ఇక ప్రజా సమస్యలు, నియోజకవర్గ కష్టాలు ఏకరువు పెట్టేది ఎప్పుడు? అందుకే, అలాంటి ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ సమావేశాలను వేదికగా చేసుకుంటున్నారు.  సభలో జీరో అవర్‌ మొత్తం అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రశ్నలతో నిండిపోయేది. ఒకరి తర్వాత ఒకరు. రోడ్లు లేవని, కరెంటు తీగలు తాకుతున్నాయని, విద్యా సమస్యలు, తాగు, సాగు నీటి కష్టాలు, డయాలసిస్ కేంద్రాలు కావాలంటూ ఇలా 2 రోజుల్లో 46 సమస్యలతో సర్కారును ఉక్కిరిబిక్కిరి చేశారు టీఆర్ఎస్ సభ్యులు. దీంతో.. షాక్ తిన్న ప్రభుత్వం.. ఇదేదో తేడాగా ఉందంటూ ఏకంగా జీరో అవర్ రద్దు చేసింది సర్కారు.  ఇదొక్కటి చాలదా ప్రభుత్వం ఎంతగా ఇబ్బంది పడుతోందో చెప్పడానికి. సభలో స్వపక్షమే విపక్షంగా మారి, ప్రజా సమస్యలపై ఓ రేంజ్‌లో ప్రశ్నలతో నిలదీస్తుంటో సమాధానాలు చెప్పలేక సర్కారు సతమతమవుతోంది. దేవరకద్ర నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో కరెంట్ తీగలు ఇండ్లపైనే ఉంటున్నాయని, అవి తాకి ప్రజలు షాక్ తగిలి చనిపోతున్నారంటూ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి అసెంబ్లీ ద‌ృష్టికి తీసుకొచ్చారు. కరెంట్ తీగలులాంటి చిన్న చిన్న సమస్యలు సైతం అసెంబ్లీ వరకూ వస్తున్నాయంటే ఏమనుకోవాలి?  సొంతూరికి రోడ్డేయించలేదని గ్రామ ప్రజలు తనను విమర్శిస్తున్నారంటూ కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సభలో బోరుమన్నారు. తన స్వగ్రామంలో రోడ్డు అద్వానంగా ఉందని.. ఎమ్మెల్యేగా ఉండి కూడా రోడ్డేయించలేదని గ్రామ ప్రజలు తిడుతున్నారంటూ జైపాల్ యాదవ్ అసెంబ్లీలో వాపోయారు.  ఇలా.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. అంత చిన్న ప్రాబ్లమ్స్‌ను సైతం సాల్వ్ చేయలేక పోవడం ఎంత దారుణం? అధికారమంతా సీఎం కేసీఆర్ చేతిలోనే ఉండటంతో ఎమ్మెల్యేలు డమ్మీలుగా మారారు. అధికారులు వారి మాటను లెక్క చేయడం లేదు. సమస్యలను సీఎంకి చెబుదామన్నా.. అధికారుల తీరుపై ఫిర్యాదు చేద్దామన్నా.. కేసీఆర్ అపాయింట్‌మెంట్ దొరకనే దొరకదు. దీంతో.. చేసేది లేక.. వేరే దారి లేక.. ఇలా అసెంబ్లీ సమావేశాలను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అందుకే, తెలంగాణ అసెంబ్లీలో స్వపక్షమే విపక్షం.

కడుపులో 59 అడుగుల పురుగు.. 

పురుగులు భూమి పైనే కాదు.. కడుపులోని ఉంటాయి.. వాటిని ఒక్కొక ప్రాంతంలో ఒక్కక పేరుతో పిలుస్తారు.. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే నట్టల పురుగులు అని. మరికొన్ని చోట్ల నులిపురుగులు అని పిలుస్తుంటారు. ఈ పురుగులు కడుపులో చేరి ఆకలి కానివ్వవు నిత్యం కడుపులో మంట.. కడుపు ఉబ్బరం పుడుతుంది. అలాంటిది  67 ఏళ్ళ వ్యక్తి కడుపులో ఓ వ్యక్తి కడుపులో 59 అడుగుల నులిపురుగు బయటకి తీశారు వైద్యులు.  యాంగ్‌ ఖాయ్‌ ప్రావిన్స్‌లో 67 ఏళ్ల ఆ వ్యక్తి తీవ్రమైన కడుపునొప్పి, కడుపు ఉబ్బరంతో బాదపటున్నాడు. ఆ నొప్పి భరించలేక  ఓ ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు ఆయనకు వివిధ పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్ ప్రకారం ఆ వ్యక్తి మలంలో  28 పరాన్నజీవుల గుడ్లు ఉన్నట్లు కనుగొన్నారు. అనంతరం ఆస్పత్రిలో ఆ వ్యక్తికి నులిపురుగులను బయటకు పంపే మందు ఇచ్చారు. తర్వాతి రోజు ఆయన కడుపులో నుంచి మన దేశంలో రేషన్ షాప్ ముందు నిలబడే లైన్ లా ఒక  భారీ నులిపురుగు  బయటకు వచ్చింది. పచ్చి మాంసాన్ని, సరిగా ఉడకని మాంసాన్ని తినడం వల్ల కడుపులో నులిపురుగులు ఏర్పడతాయని వైద్యులు తెలిపారు. ఈ వింత సంఘటన థాయ్‌లాండ్‌లో జరిగింది.  

సారీ చెప్పిన సీఎం 

ఆయనో ముఖ్యమంత్రి... దేశంలోనే అత్యంక కీలకమైన రాష్ట్రానికి అధిపతి.  అయినా హుందాగా వ్యవహరించారు. అగ్నిప్రమాద ఘటనపై మానవతా దృక్ఫథంలో స్పందించారు. ప్రభుత్వ పెద్దగా పెద్ద మనుసుతో  తప్పు జరిగిందని అంగీకరించారు. అంతేకాదు బాధిత కుటుంబాలను క్షమించమని కోరారు ముఖ్యమంత్రి.     ప్రమాద ఘటనపై విచారణ జరిపించి.. కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. బాధితుల కుటుంబాలకు క్షమాపణ చెప్పిన ఆ ముఖ్యమంత్రి మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే. ముంబైలోని ఓ కరోనా ఆసుపత్రిలో చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం అనంతరం ఘటనాస్థలాన్ని సందర్శించిన సీఎం.. మృతుల కుటుంబాలకు క్షమాపణలు తెలియజేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.   ‘‘గత ఏడాది కాలంగా కరోనా మహమ్మారిపై మనం పోరాటం సాగిస్తున్నాం. గతేడాది రాష్ట్రంలో వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభించిన సమయంలో బెడ్లు, వెంటిలేటర్ల కొరత ఏర్పడింది. దీంతో తాత్కాలిక ఆస్పత్రులను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రమాదం చోటుచేసుకున్న సన్‌రైజ్‌ ఆస్పత్రి కూడా అందులో ఒకటి. ఈ హాస్పిటల్‌ లైసెన్స్‌ గడువు మార్చి 31 వరకు ఉంది. దురదృష్టవశాత్తూ ఈ ఆస్పత్రి ఉన్న మాల్‌లో  అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో 10 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటిస్తున్నా. ప్రమాదానికి కారణమైన వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. బాధిత కుటుంబాలు నన్ను క్షమించమని కోరుతున్నా’’ అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే విచారం వ్యక్తం చేశారు.    ముంబైలోని భాండప్‌ ప్రాంతంలోని డ్రీమ్స్‌ మాల్‌లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత అగ్నిప్రమాదం సంభవించింది. మాల్‌లోని మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు.. మూడో అంతస్తులో ఉన్న ఆస్పత్రి వరకు వ్యాపించాయి. ఈ ఘటనలో 10 మంది మృతిచెందారు. అయితే తొలుత అగ్నిప్రమాదంలో రోగులెవరూ మరణించలేదని చెప్పిన ఆస్పత్రి యాజమాన్యం.. ఆ తర్వాత కొంతమంది రోగుల ఆచూకీ గల్లంతైనట్లు వెల్లడించింది. ఈ ఘటన ముంబైలో తీవ్ర కలకలం రేపింది. కనీస వసతులు లేని మాల్ లో కోవిడ్ హాస్పిటల్ నిర్వహించడంపై జనాలు పైరవుతున్నారు.    

ఆర్టీసీ బస్సులో 14 కిలోల బంగారం..

ఇటీవల నల్గొండ జిల్లా పంతంగి టోల్‌గేట్‌ దగ్గర 26 కిలోల బంగారం సీజ్. స్మగ్లర్లు కారులో తరలిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. అలాంటిదే మరో ఘటన. ఈ సారి స్టేట్ మారింది. ఏపీలో జరిగింది. విమానాలు, కారుల్లో తరలిస్తే తనిఖీలు ఎక్కువగా ఉంటాయని అనుకున్నారు కాబోలు.. ఏకంగా ఆర్టీసీ బస్సులో 14 కిలోల బంగారం తరలిస్తున్నారు. అయినా, పోలీసులకు చిక్కారు. అయితే, తాను స్మగ్లర్‌ని కాదని బంగారం షాపులో పని చేస్తున్నానని చెబుతున్నాడు ఆ గోల్డ్ ట్రాన్స్‌పోర్టర్.  ఏపీలో అక్రమ బంగారం రవాణా కలకలం రేపుతోంది. కర్నూలు జిల్లా పంచాలింగాల దగ్గర పోలీసులు తనిఖీలు చేస్తుండగా బంగారం పట్టుబడింది. ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 14.8 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. బస్సులో అప్పటి వరకూ తమ పక్కన కూర్చున్న ప్రయాణీకుడి దగ్గర అంత పెద్ద మొత్తంలో బంగారం ఉండటం చూసి తోటి ప్యాసింజర్లు అవాక్కయ్యారు. పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. తెలంగాణ నుంచి కర్నూలు వెళ్తున్న బస్సులో రాజు అనే ప్రయాణీకుడి బ్యాగులో ఈ బంగారం లభించింది. 14.9 కిలోల బరువున్న ఆ గోల్డ్ బిస్కెట్స్ విలువ.. సుమారు 6.86 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.  అనంతపురం జిల్లా తాడిపత్రిలోని రాయలసీమ బులియన కమ్ ట్రేడ్ ప్రైవేటు లిమిటెడ్ నగల దుకాణంలో తాను పని చేస్తున్నట్టు రాజు చెప్పాడు. యాజమాని రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని ఓ దుకాణం నుంచి బంగారం తరలిస్తున్నట్లు నిందితుడు పోలీసులకు వివరించాడు. అయితే, బంగారానికి సరియైన పత్రాలు కానీ, ఆధారాలు లేకపోవడంతో కేసు నమోదు చేసి ఆ గోల్డ్‌ను సీజ్ చేశారు పోలీసులు.  ఈ బంగారాన్ని నిజంగానే షాపు యజమాని అక్రమ మార్గంలో తరలిస్తున్నారా? లేక బంగారాన్ని తరలించే వ్యక్తి చోరీ చేసి తీసుకువస్తున్నాడా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులో బంగారం తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం ఉండడంతోనే నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. అయితే, పోలీసులకు సమాచారం ఇచ్చిన వ్యక్తి ఎవరు.. ఏవైనా లావాదేవీల్లో తేడా వచ్చి పట్టించే ప్రయత్నం చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు ఎస్ఈబి అధికారులు తనిఖీలతో ఇంత భారీ బంగారం బయటపడటం సంచలనంగా మారింది. దొరికిన బంగారంలో ఆభరణాలు లేవు. మొత్తం 14.8 కేజీలు గోల్డ్ బిస్కెట్లే కావడంతో అనుమానాలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ నుండి కడపకు ఈ బంగారపు బిస్కెట్లు తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు మాత్రం వ్యాపారం కోసమే తరలిస్తామని చెబుతున్నా.. అందుకు సరైన ఆధారాలు చూపించకపోవడంతో కర్నూలు తాలుకా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మతం పేరుతో కల్లోలం.. షర్మిల ఆగ్రహం 

తెలంగాణలో కొత్త పార్టీ పెడుతున్న వైఎస్ షర్మిల మరింత దూకుడు పెంచారు. ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు. అధికార టీఆర్ఎస్ పాలనపై ఆమె తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ దర్మపురి అర్వింద్ ను టార్గెట్ చేశారు షర్మిల. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల వైఎస్ఆర్ అభిమానుల‌తో జరిగిన సమావేశంలో ఆమె సంచలన కామెంట్లు చేశారు.  నిజామాబాద్ జిల్లాకు ప‌సుపు బోర్డు తెస్తాన‌ని ఎవ‌రో బాండ్ పేప‌రో ఇచ్చారంట‌... బాండ్ పేప‌ర్ ఇచ్చి రైతుల‌ను ద‌గా చేశారట  అంటూ అరవింద్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు షర్మిల.  ఇచ్చిన మాటకు క‌ట్టుబ‌డి ఉండ‌టం తెలియ‌దా? అని నిలదీశారు.  ప‌సుపు రైతుల క‌ష్టాలు చూస్తే బాధేస్తుందన్న షర్మిల..  ఎక్స్ టెన్ష‌న్ సెంట‌ర్ ఇస్తే ప‌సుపు రైతుల క‌ష్టాలు తీరుతాయా? అని ప్రశ్నించారు.  ప్ర‌తి గ‌డ‌ప‌కు పూసే ప‌సుపు పండించే రైతు క‌ష్టాలు క‌న‌ప‌డ‌టం లేదా? అని షర్మిల అన్నారు. బైంసాలో మత‌క‌ల్లోలాలు సృష్టించ‌డంపై ఉన్న ఆస‌క్తి రైతుల క‌ష్టాల‌పై ఉండ‌టం లేదా?’’ అని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మతం పేరుతో రాజకీయాలు చేయడం దారుణమన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు అన్యాయం చేశారని షర్మిల ఆరోపించారు. బైంసా అల్లర్లకు ఎవరు బాధ్యులు.. మీ రాజకీయాల కోసం సామాన్యులను ఇబ్బందుల పాలు చేస్తారా అని షర్మిల ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లా అభిమానుల సమావేశంలోనూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు షర్మిల. తెలంగాణ ఉద్య‌మాన్ని ముందుండి న‌డిపిన కోదండ‌రామ్ పుట్టిన గ‌డ్డ ఆదిలాబాద్ అంటూ ష‌ర్మిల తనదైన శైలిలో మాట్లాడారు. జల్ జమీన్ జంగల్ పేరుతో నిజాం కి చుక్కలు చూపిన కొమురం భీం పుట్టిన గడ్డ,  మంత్రి పదవికి రాజీనామ చేసిన కొండా లక్ష్మణ్ ది అదిలాబాద్ జిల్లా అన్నారు. జలియన్ వాలా బాగ్ తలపించే ఇంద్రవెల్లి ఘటన ఇంకా మనలను రగిలిస్తెనే ఉందన్నారు షర్మిల.  

బడ్జెట్ ఆర్డినెన్సుకు ఏపీ కాబినెట్ ఆమోదం

స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు కరోనా వ్యాక్సినేషన్‌, ఇతర కారణాల వలన రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహించని నేపధ్యంలో, తక్షణ వ్యయం కోసం మూడు నెలల కాలానికి, రూ.90వేల కోట్ల బడ్జెట్ ఆర్డినెన్సును ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కేబినెట్‌ శుక్రవారం ఆమోదించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  పరిశీలన అనంతరం, ఆర్థికశాఖ అధికారులు ఆన్‌లైన్‌ ద్వారా మంత్రుల ఆమోదం పొందారు. దీంతో ఆన్ లైన్ లోనే బడ్జెట్‌ ఆర్డినెన్స్‌కు ఆమోదముద్రపడింది. మే నెలాఖరు లేదా జూన్‌లో నిర్వహించే శాసనసభ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్‌ ను ప్రవేశ పెట్టనున్నారు.మార్చి 31తో 2020-21 ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో ప్రస్తుత వ్యయాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఈ  ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. కాగా, ఆర్డినెన్సు ద్వారా బడ్జెట్ తీసుకురావడం పట్ల తెలుగు దేశం పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వరసగా రెండు సంవత్సరాలు ఆర్డినెన్సు రూట్లో బడ్జెట్ తీసుకురావడం దుష్ట సంప్రదాయమని మాజీ ఆర్థిక మంత్రి, శాసన మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. గత సంవత్సరం కొవిడ్ కారణంగా,ఆర్డినెన్సు రూట్లో  బడ్జెట్ఆమోదించిన విష్యం తెలిసిందే.

మహా రాష్ట్రలో రాష్టపతి పాలన?

మహా రాష్ట్రలో వేగంగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, రాష్ట్ర పతి పాలన దిశగా అడుగులు వేస్తున్నాయా అంటే, అవుననే సమాధానమే వస్తోంది. నిజానికి, మూడు (కాంగ్రెస్, ఎన్సీపీ,శివ సేన) పార్టీల ‘మహా వికాస్‌ అగాఢీ’ ప్రభుత్వాన్ని,ఆది నుంచి అంతర్గత విబేధాలు వెంటాడుతూనే ఉన్నాయి. మంత్రివర్గం ఏర్పాటు సమయంలోనే మూడు పార్టీల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. శాఖల విషయంలో శిఖపట్లు తప్పలేదు. అయినా, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం రోజులు నెట్టుకొస్తోంది. మరోవంక రాజకీయ అనివార్యత దృష్ట్యా కాంగ్రెస్, ఎన్సీపీలు సయోధ్య నటిస్తున్నాయి. ఇవ్వన్నీ అందరికీ తెలిసిన సత్యాలే. కళ్ళ ముందు  కనిపిస్తున్న నిజాలే,  అయినా, అగాఢీ’ కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లిలా, ఎవరూ చూడడం లేదన్న భ్రమల్లో ఉంటూ వస్తోంది. అయితే అంతర్గత విబేధాలు ముదిరి పాకాన పడడంతో, మత్రివర్గంలోనే ముసలం పుట్టింది. ఇటీవలనే, సెక్స్, మర్డర్ కేసులో ఆరోపణలు ఎదుర్కున్న రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సంజయ్ రాథోడ్  మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ వివాదం పూర్తిగా సర్దుమణగక ముందే రాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై ముంబయి నగర మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ చేసిన సంచలన ఆరోపణలు, ‘మహా వికాస్‌ అగాఢీ’ ప్రభుత్వం మహా సంక్షోభంలో కూరుకు పోయింది. హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ నెలకు వంద కోట్ల ‘వసూల్’ ఫిక్స్ చేశారని  కమిషనర్ ఆరోపించడంతో మొదలైన వివాదం, ప్రభుత్వ ప్రతిష్టను మరింతగ దిగజార్చి వేసింది. చివరకు శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ కమిషనర్ చేసిన ఆరోపణ మహా మచ్చగా పేర్కొంది. ఇంతవరకు సంకీర్ణంలో తలెత్తిన సంక్షోభాలను, శరద్ పవార్  ఎదో విధంగా పరిష్కరిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు  తీవ్ర ఆరోపణలు ఎదుర్కుంటున్న హోం మంత్రి దేశ్ ముఖ్ సొంత పార్టీ మనిషి కావడంతో, పవార్ పరిస్థితి ‘శకునం చెప్పే బల్లి కుడితిలో పడింది’ అన్నట్లుగా మారింది. మరో వంక ముకేశ్‌ అంబానీ నివాసం సమీపంలో నిలిపిన పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో పోలీస్‌ ఉన్నతాధికారి సంబంధం ఉందన్న ఆరోపణలు, ఆయనపై సస్పెన్షన్ వేటు విషయంలోనూ సంకీర్ణ భాగస్వామ్య పార్టీలు ఎన్సీపీ, శివసేన మధ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ నేపధ్యంలో, మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలన్న డిమాండ్’ కు బలంగా వినిపిస్తోంది. తాజాగా, రిపబ్లికన్ పార్టీ నేత, కేంద్రమంత్రి రాందాస్‌ అఠవాలే కూడా అదే డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ను కలిసి విజ్ఞాపన పత్రం సమర్పించారు. ముకేశ్‌ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో పోలీస్‌ ఉన్నతాధికారి సంబంధం ఉండడం, నెలకు వంద కోట్ల రూపాయల వసూలు చేయాలని రాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ పోలీసులకు టార్గెట్‌ పెట్టడం వంటి విషయాలు చాలా తీవ్రమైనవని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో హోంమంత్రిపై దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇదే విషయంపై రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా తరపున రాష్ట్రపతిని కోరానని రాందాస్‌ అఠవాలే పేర్కొన్నారు. ఇక మహా రాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ  కూడా డిమాండ్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సారథ్యంలో బీజేపీ   ప్రతినిధివర్గం ఇప్పటికే మహారాష్ట్ర గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికిప్పుడు రాష్ట్రపతి పాలన విదిస్తుందా, లేక ఇంకొంత కాలం వేచి చూస్తుందా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటి కిప్పుడు మహా రాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తే, ఆ ప్రభావం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై పడుతుంది,మరో వంక మరి కొంత కాలం వేచి చూస్తే రోజు రోజుకు ముదిరి పాకాన పడుతున్న అగాఢీ’రగడ మరింతగా ముదిరి ప్రభుత్వం తనంతట తానే కూలిపోవచ్చని బీజీపీ పెద్దలు ఆలోచిస్తున్నారు. అయితే, చివరకు ఏమి జరుగుతుంది అనేది ప్రస్తుతానికి అయితే సస్పెన్సు గానే వుంది.  

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు అస్వస్థత

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ స్వల్ప అస్వస్థత. ఛాతీలో అసౌకర్యానికి గురవడంతో ఆయన దిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చేరారు. వెంటనే రామ్‌నాథ్‌కు వైద్య పరీక్షలు చేశారు డాక్టర్లు. రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆర్మీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన అబ్జర్వేషన్‌లో ఉన్నారు. రాష్ట్రపతి ఇటీవలే కరోనా టీకా వేయించుకున్నారు. దేశంలో రెండో దశ టీకా పంపిణీ ప్రారంభమైన తర్వాత మార్చి 3న దిల్లీ ఆర్మీ ఆసుపత్రిలో రామ్‌నాథ్‌ కోవింద్‌ వ్యాక్సిన్‌ తొలి డోసు వేయించుకున్నారు. వ్యాక్సిన్ వేసుకోడానికి, ప్రస్తుత అస్వస్థతకు ఎలాంటి సంబంధం లేదన్నారు వైద్యులు.

తుపాకీ ఫైర్.. జవాన్ సూసైడ్.. 

పరీక్షా తప్పదని విద్యార్ధి సూసైడ్ చేసుకుంటారు. తల్లిదండ్రులు తమ  ప్రేమను అంగీకరించలేదని ప్రేమ జంట ఆత్మహత్యలు చేసుకుంటారు. పెళ్ళాం పెట్టె బాధ భరించలేక భర్త , భర్త తిట్టాడని భార్య చనిపోవడం చూస్తుంటాం..లేదంటే కొందరు ఆర్థిక ఇబ్బందులతో చనిపోతారు. రైతు అప్పు తీరలేదని, గిట్టుబాటు రాలేదని  ఆత్మ హత్యలు చేసుకుంటారు.  తను ఒక జవాను. దేశ సేవకుడు. త్యాగానికి దాహం లాంటివాడు. డ్యూటీకి వచ్చి. తన ప్రాణాలు తానే తీసుకున్నాడు. దేశానికి రక్షణ కల్పించే జవాన్ యుద్ధంలో వీరమరణం పొందుతారు.. లేదంటే అకాల మరణం చెందుతారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ జవాన్ తన వద్ద ఉన్న ఏకే47తో గొంతులో కాల్చుకుని ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. తమిళ నాడు సేలం ఎన్నికల విధుల నిమిత్తం వంద మంది పారా మిలిటరీ, సీఐఎస్‌ఎఫ్‌ జవానులు అన్నదాన పట్టిలో బస చేస్తున్నారు.  ఈ క్రమంలో సీఐఎస్‌ఎఫ్‌ జవాన్ ఆశిష్ కుమార్ (30) గది నుంచి తుపాకీ పేలిన శబ్దం రావడంతో.. వెంటనే అక్కడున్న జవాన్లు వెళ్లి చూడగా.. ఆశిష్ కుమార్ ఏకే47తో గొంతులో ఫైర్ చేసుకుని  రక్తపు మడుగులో పడి ఉన్నాడు. జవాన్లు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆశిష్ కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నది. అయితే ఆశిష్ కుమార్ ఆత్మహత్యాయత్నానికి కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. కుటుంబ సమస్యలా..? లేక పని భారంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆశిష్ కుమార్ ఫ్లయింగ్ స్క్వాడ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు.