కరోనాతో ఒక్క రోజే 500 మరణాలు
దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకు వేగంగా విస్తరిస్తూ పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా అంతటా చుట్టేస్తోంది మహమ్మారి. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజు వారీ కరోనా కేసుల్లో .. గతంలో కంటే ఎక్కువ కేసులు వచ్చేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత సంవత్సరం చివరి త్రైమాసికంలో ఒక రోజులో 98 వేల కొత్త కరోనా కేసులు వచ్చిన తరువాత, తిరిగి ఐదు మాసాల తరువాత ఆ స్థాయిలో కొత్త కేసులు వచ్చాయి. శనివారం నాడు ఏకంగా 93,077 కేసులు వచ్చాయి. ఇదే సమయంలో నాలుగు నెలల తారువాత మరణాల సంఖ్య 500ను తాకింది. ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల కన్నా, ఇండియాలో ఇప్పుడు కరోనా కేసులు అధికంగా వస్తున్నాయి. యూఎస్ లో 70,024, బ్రెజిల్ లో 69,692 కేసులు రాగా, వాటికి మించిన కేసులు ఇండియాలో నమోదయ్యాయి.
ఇక వారం రోజుల సరాసరిని తీసుకున్నా మిగతా దేశాల కన్నా ఇండియా ముందుంది. ఈ నేపథ్యంలో కరోనా కేసుల విషయంలో ఇండియా తొలి స్థానానికి చేరుకుంటుందని, ఈలోగానే నియంత్రణా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆరోగ్య రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇండియాలో అక్టోబర్ లో వారం సరాసరిని మించిన కేసులు ఇప్పుడు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.మరో వారం, పది రోజుల వ్యవధిలోనే కొత్త కేసుల సంఖ్య ఆల్ టైమ్ రికార్డును దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. అన్ని రాష్ట్రాలూ జాగ్రాత్తగా ఉండి కరోనాను నియంత్రించే చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది.
గత సంవత్సరం సెప్టెంబర్ 19 తరువాత నిన్న అత్యధిక కేసులు వచ్చాయి. అంతకుముందు సెప్టెంబర్ 17న 98,795 కొత్త కేసులు రాగా, ఇప్పటివరకూ అదే రోజువారీ రికార్డు. మరణాల విషయానికి వస్తే, డిసెంబర్ 4న 514 మంది కరోనాతో మరణించగా, శనివారం 500 మంది కన్నుమూశారు. కొత్త కేసుల్లో సగానికి పైగా ఒక్క మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో శనివారం నాడు 49,447 కేసులు వచ్చాయి. మహారాష్ట్రతో పాటు హర్యానా, బెంగాల్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్ రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి.