తిరుపతి ఉప ఎన్నికలో జనసేన సింబల్.. బీజేపీలో టెన్షన్  

పవర్ స్టార్  పవన్ కల్యాణ్ అధ్యక్షుడిగా ఉన్న జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్. 2019 సార్వత్రిక ఎన్నిక్లలో గాజు గ్లాస్ సింబల్ తోనే జనసేన ప్రచారం చేసింది. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ అని జనాలు కూడా ఫిక్సయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో బీజేపీకి మద్దతు ఇస్తోంది జనసేన. రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభ పోటీలో ఉన్నారు. జనసేన నేతలు బీజేపీతో కలిసి జోరుగా ప్రచారం చేస్తున్నారు. రత్నప్రభ గెలుపు కోసం శనివారం జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు.  ఇంతవరకు బాగానే ఉన్నా ఆ రెండు పార్టీలకు తిరుపతిలో కొత్త సమస్య వచ్చి పడింది. జనసేన పోటీలో లేకున్నా గాజు గ్లాసు గుర్తు మాత్రం తిరుపతి ఉప ఎన్నికలో కనిపిస్తోంది. జనసేన ఎన్నికల గుర్తు అయిన గాజుగ్లాసును నవతరం పార్టీకి ఎన్నికల కమిషన్ కేటాయించింది. దీంతో జనసేన ఓట్లు క్రాస్ అవుతాయని బీజేపీ ఆందోళన చెందుతోంది. పవన్ ప్రచారానికి  రావడంతో బీజేపీలో కొత్త ఆశలు చిరుగించాయి. ఇంతలోనే ఆ పార్టీ గాజుగ్లాసు రూపంలో ఉపద్రవం వచ్చి పడింది.  జనసేన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా ఇంకా హోదా రాలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయడం లేదు. ఈ నేపథ్యంలో నవతరం పార్టీ అభ్యర్థి గోదా రమేష్ కుమార్‌కు కేటాయించారు. జనసేన అధ్యక్షుడు పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నందున తమ పార్టీ అభ్యర్ధికి గాజుగ్లాసు గుర్తు కేటాయించారని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం వివరణ ఇచ్చారు.  ఇప్పటికే జనసేనాని ఎంట్రీతో ఊపు వచ్చిందని అనుకుంటున్న బీజేపీకి ఈ వార్త షాకిచ్చింది. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజుగ్లాసును ఎన్నికల గుర్తుగా కేటాయించడంపై ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  

అజ్ఞాతవాసే కాదు.. అజ్ఞానవాసి.. అద్దె మైకు!

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో ఏపీలో రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నారు. ఎన్నికల ప్రచారంలో పరస్పర ఆరోపణలు, సవాళ్లు చేసుకుంటున్నారు. శనివార తిరుపతిలో ప్రచారం చేసిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. జగన్ ప్రభుత్వం, వైసీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీని రౌడీల పార్టీగా అభివర్ణించారు పవన్ కల్యాణ్.  పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటరిచ్చారు. పవన్ నాయుడు అంటూ వ్యాఖ్యలు చేశారు.  టీడీపీ, బీజేపీ ప్రాయోజిత కార్యక్రమాన్ని పవన్ రక్తి కట్టించాడని, తన కాల్షీట్ కు న్యాయం చేశాడని ఎద్దేవా చేశారు. పవన్‌కల్యాణ్‌ రాష్ట్రానికి అద్దెమైకులా తయారయ్యారని ఏపీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఉత్తరాది బీజేపీ దక్షిణాదికి అన్యాయం చేస్తోందని నాడు విమర్శించిన పవన్ కల్యాణ్... నేడు అదే బీజేపీకి మద్దతు ఇవ్వాలని అంటున్నారని మండిపడ్డారు. 2014లో కాంగ్రెస్ ను పారదోలాలని పిలుపునిచ్చావ్... 2019లో బీజేపీకి దక్షిణాది రాష్ట్రాలంటే చిన్న చూపు అన్నావ్... పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందన్నావ్.. ఇప్పుడేంటి రంకెలేస్తున్నావ్ అంటూ ఆపేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం, రథాల దగ్ధం కేసుల్లో బీజేపీ ప్రమేయం ఉందేమోననే అనుమానం తమకు ఉందని.. అందుకే సీబీఐ విచారణ కోరినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్ని నాని ఆరోపించారు. వన్‌కల్యాణ్‌ అజ్ఞాతవాసే కాదు.. అజ్ఞానవాసి అన్నారు నాని. వివేకా హత్య కేసుపై మాట్లాడుతున్న పవన్ కల్యాణ్ కు అసలు ఆ కేసు విచారణ ఏ దశలో ఉందో తెలుసా? అని ప్రశ్నించారు. సీబీఐ నేరుగా కేంద్ర హోంమంత్రి అధీనంలో పనిచేస్తుందన్న విషయం తెలియదా? అని అన్నారు. పవన్ అజ్ఞాతవాసే అనుకున్నాం, కానీ అజ్ఞానవాసి అని ఇప్పుడు తెలుస్తోంది అని విమర్శించారు.  

ఏపీ ఉద్యోగులకు జీతాల్లేవ్! 

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. నిధులు ఉద్యోగులకు లేక జీతాలు కూడా ఇవ్వలేలపోతోంది. ఒకటో తేదీనే వేతనాలు ఇవ్వాల్సి ఉండగా.. నాలుగు రోజులైనా ఇంకా ఇవ్వలేదు. ఏపీలో మొత్తం 4.5 లక్షల ఉద్యోగులకు వేతనాలు, 3.5 లక్షల పెన్షనర్లకు పెన్షన్లు అందలేదు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను గవర్నర్‌ ఆమోదించినా పద్దులకు నిధులు సర్దుబాటు కాలేదు. సరిపడా నిధులు లేకపోవడంతో ఆర్థికశాఖ నుంచి ఆర్బీఐకి బిల్లులు అందలేదు. దీంతో నిధుల లభ్యత బట్టే ఆర్థికశాఖ అధికారుల చెల్లింపులు జరపనుంది.  బ్యాంకులకు వరుస సెలవులతో ఆయా ఖాతాల్లో చెల్లింపులు నమోదు కాలేదు. ఈ పరిస్థితులన్నీ చక్కబడేకి ఇంకో రెండు నుంచి మూడ్రోజులు పడుతుందని తెలుస్తోంది. ఈ నెల 6 లేదా 7 తేదీల్లో జీతాలు చెల్లించే అవకాశం ఉందని సమాచారం. జీతాలు అందిన తర్వాత పెన్షన్లు వచ్చే అవకాశముందట. ఏపీలో ప్రస్తుతం... ఉద్యోగుల జీతాలా? సంక్షేమ పథకాలా? ఏది ముఖ్యం అని ప్రశ్నించుకుని, ప్రాధాన్యాలు నిర్ణయించుకోవాల్సి వస్తోంది. పథకాలు అమలు చేస్తే వేతనాలు ఇవ్వలేరు. జీతా లు ఇస్తే పథకాలు అమలు చేయలేరు. అందుకే...  జీతాల చెల్లింపుల కోసం ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. రెండింటికీ  ఒకేసారి నిధులు సర్దుబాటు చేయడం ఖజానాకు తలకు మించిన భారమవుతోంది.  ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. పింఛనుదారులకూ ఎదురుచూపులు తప్పడం లేదన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘‘ ప్రభుత్వ సొమ్మును పప్పుబెల్లాలుగా పంచిపెడుతున్నారు. ‘జీతాలు- ఉచితాలు’ ఏవి ముఖ్యమో ప్రజలు గమనించాలి. రాష్ట్రం ఆర్థికంగా కుప్పకూలే పరిస్థితి ఎంతో దూరంలో లేదు’’ అని రఘురామకృష్ణరాజు విమర్శించారు.    

బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌లో 22 మంది జవాన్ల మృతి 

దండకారణ్యం రక్తసిక్తమైంది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో శనివారం చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన జవాన్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 22 మంది జవాన్లు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. శనివారం  ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా  మరో 17 మంది జవాన్ల  మృతదేహాలను గుర్తించారు. ఎదురుకాల్పుల్లో 31 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో 16 మంది సీఆర్పీఎఫ్‌ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వీరికి బీజాపూర్‌, రాయ్‌పూర్‌ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.  ఎన్ కౌంటర్ ఘటనలో మొత్తం 21 మంది సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో ఏడుగురు సీఆర్పీఎఫ్‌కు చెందిన వారున్నారు.  గల్లంతైన వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరంగా కొనసాగుతోందని నక్సల్స్‌ వ్యతిరేక ఆపరేషన్స్‌ బృందం డీజీ అశోక్‌ జునేజా వెల్లడించారు. బీజాపూర్‌, సుకుమా జిల్లాల్లోని అడవుల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఘటన నేపథ్యంలో సీఆర్పీఎఫ్‌ డీజీ కులదీప్‌ సింగ్‌ ఆదివారం ఉదయం ఛత్తీస్‌గఢ్‌కు చేరుకున్నారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ప్రస్తుత పరిస్థితులపై ఆయన ఆరా తీస్తున్నారు.    చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ ఘటనపై ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. అమరులైన జవాన్లకు నివాళి అర్పించారు. అమిత్‌షా ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బఘెల్‌కు ఫోన్‌ చేసి పరిస్థితిపై ఆరా తీశారు. అంతేకాకుండా ఆ రాష్ట్రానికి వెళ్లి ఆపరేషన్‌కు సంబంధించిన పరిస్థితులను పర్యవేక్షించాలని సీఆర్పీఎఫ్‌ డీజీ కులదీప్‌ సింగ్‌ను ఆదేశించారు. ‘‘ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులతో పోరాడుతూ ప్రాణ త్యాగం చేసిన ధీశాలులైన భద్రతా సిబ్బందికి తల వంచి నమస్కరిస్తున్నాను. మీ ధైర్యసాహసాలను, త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరువబోదు. అమరులైన జవాన్ల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నా. శాంతి, అభివృద్ధిలకు ఆటంకం కలిగించే విరోధులతో మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.  

జగన్ సీఎం పోస్టు ఇంకా 6 నెలలే!

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక రాజకీయ కాక రేపుతోంది. అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. తిరుపతి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యపై.. ఆయన కుమార్తె సునితా రెడ్డి ప్రశ్నలకు సీఎం జగన్‌ సమాధానం చెప్పాలని చింతా మోహన్ డిమాండ్‌ చేశారు. జగన్‌ మీద కోపాన్ని ఆయన సోదరి షర్మిల తెలంగాణలో చూపిస్తున్నారని అన్నారు. ఆరు నెలల తర్వాత సీఎం జగన్‌ అధికారంలో ఉండరని తెలిపారు. ప్రలోభాలు లేకుంటే ఆంధ్రప్రదేశ్ లో  కాంగ్రెస్‌కు మళ్లీ ఆదరణ వస్తుందన్నారు చింతా మోహన్.  ధర్మయుద్ధంలో సీఎం జగన్‌ గెలవలేరని చింతా మోహన్‌ అన్నారు. కాంగ్రెస్‌కు పట్టిన గతే ఈసారి బీజేపీకి కూడా పడుతుందని జోస్యం చెప్పారు. అధిక ధరలు బీజేపీ  పతనానికి కారణమవుతుందని తెలిపారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ చేస్తున్న ప్రచారంతో బీజేపీకి  ప్రయోజనమేమీ ఉండదని, అదంతా వృథా ప్రయాస  అన్నారు చింతా మోహన్.   

భార్యకు బదులు భర్త ప్రమాణం.. కర్నూల్ జిల్లాలో విడ్డూరం 

పంచాయతీ ఎన్నికల్లో  మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని పాలకులు గొప్పగా చెప్పుకుంటారు.  పంచాయతీ ఎన్నికల్లో మహిళలు పోటీ చేసి గెలుస్తున్నారు .అయితే అధికారం మాత్రం వాళ్లకు ఉండదు. భార్యలకు బదులు పెత్తనం చేసేదంతా వాళ్ల భర్తలే. ఇది చాలా కాలంగా సాగుతోంది. తాజాగా కర్నూల్ జిల్లాలో మాత్రం మరి విడ్డూరం జరిగింది. అధికార పార్టీకి చెందిన నేత బరి తెగించాడు. భార్యకు బదులు  అతనే సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌ల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఫిబ్రవరిలో ఎన్నికలు ముగిసినా అధికారికంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.  కర్నూలు జిల్లావ్యాప్తంగా నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఈ విచిత్రం చోటుచేసుకొంది. కౌతాళం మండలం చూడి గ్రామ సర్పంచ్‌గా వైసీపీ మద్దతుదారు లక్ష్మి ఎన్నికయ్యారు. సర్పంచ్‌గా బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చేసరికి లక్ష్మి భర్త ఉప్పళప్ప ముందుకొచ్చారు. ఎన్నికయిన వార్డు సభ్యులతోపాటు ఉప్పళప్పతో చూడిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ హుశేనమ్మ ప్రమాణ స్వీకారం చేయించేశారు.  భార్య స్థానంలో భర్త ప్రమాణం చేయడంతో అందరూ అవాక్కయ్యారు. ఈ విషయాన్ని కౌతాళం ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎంపీడీవో సూర్యనారాయణ సంబంధిత పంచాయతీ కార్యదర్శికి మెమో జారీ చేశారు. ఆమె స్థానంలో ఆయనతో ఎందుకు ప్రమాణం చేయించారో వివరణ కోరారు.సర్పంచి లక్ష్మి అనారోగ్యంతో కార్యక్రమానికి గైర్హాజరవడంతో ఆమె భర్త ఉప్లప్పతో ప్రమాణ స్వీకారం చేయించినట్టు పంచాయతీ సెక్రెటరీ వివరణ ఇచ్చారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీడీఓ.. ఆమెతో ప్రమాణం చేయించాలని సూచించారు. దీనిపై ఎంపీడీవో మాట్లాడుతూ.. పొరపాటున జరిగిందని, గెలుపొందిన లక్ష్మితో తిరిగి ప్రమాణస్వీకారాన్ని చేయిస్తామని తెలిపారు. సర్పంచి లక్ష్మి ఆరోగ్యం కుదుటపడ్డాక అధికారుల ఆదేశాల మేరకు ప్రమాణస్వీకారం చేయిస్తామని అన్నారు.  

వాటర్ బాటిళ్లలో డ్రైవర్ల మూత్రం.. క్షమాపణలు కోరిన అమెజాన్

అమెజాన్ డ్రైవర్లు వాటర్ బాటిళ్లలో ముత్రం పోస్తున్నారు.. ఈ అంశం అమెరికాలో కలకలం రేపింది.  విస్కాన్సిన్ కు చెందిన డెమొక్రటిక్ ప్రతినిధి మార్క్ పోకన్ గత వారం అమెజాన్ పై ఈ ట్వీట్ చేశారు. పోకన్ ట్వీట్ పై స్పందించిన అమెజాన్ అలాంటిది ఏమి లేదని బుకాయించింది. వాటర్ బాటిళ్లలో ఎవరైనా మూత్రం పోస్తారంటూ అంటూ పోకన్ కు కౌంటరిచ్చింది. అయితే  కొన్ని వార్తా సంస్థలు..  అమెజాన్ ఉద్యోగులు వాటర్ బాటిళ్లలో మూత్రం చేస్తున్నారన్న విషయాన్ని ఆధారాలతో సహా బయటపెట్టాయి. దీంతో ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ దిగొచ్చింది క్షమాపణలు కోరింది. తమ ఉద్యోగులు వాటర్ బాటిళ్లలో మూత్రం పోయడం వాస్తవమేనని అంగీకరించింది. నిజానిజాలు తెలుసుకోకుండా అమెరికా చట్టసభ ప్రతినిధి వ్యాఖ్యలను తోసిపుచ్చామని తెలిపింది. ‘‘ఉద్యోగ సంఘాలు లేకుండా చేయడం, మీ ఉద్యోగులు వాటర్ బాటిళ్లలో మూత్రం పోయడం వంటివి ఉన్నంత కాలం.. ఉద్యోగులకు గంటకు 15 డాలర్లు ఇచ్చినా మీది గొప్ప సంస్థ అనిపించుకోదు’’ అంటూ గత వారం  డెమొక్రటిక్ ప్రతినిధి మార్క్ పోకన్ పోస్ట్ పెట్టారు. అలబామాలోని అతిపెద్ద అమెజాన్ సెక్షన్ లో ఉద్యోగ సంఘాల ఏర్పాటుకు అమెజాన్ వ్యతిరేకత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన ఈ ట్వీట్ చేశారు.అయితే పోకన్  ట్వీట్ కు అమెజాన్ వెంటనే రిప్లై ఇచ్చింది. ‘‘ఎవరైనా వాటర్ బాటిళ్లలో మూత్రం పోస్తారా? అలా చేస్తే మా సంస్థలో ఎవరూ ఉద్యోగం చేయరు’’ అంటూ బదులిచ్చింది.  ఆ ఘటనపై నిజానిజాలు వెలికి తీసేందుకు అమెరికాలోని   కొన్ని వార్తా సంస్థలు ప్రయత్నించగా సంచలన విషయాలు బయటపడ్డాయి. అమెజాన్ డ్రైవర్లు వాటర్ బాటిళ్లలో మూత్రం పోయడం నిజమేనని తేలింది. తమకు బాటిళ్లలో మూత్రం పోయడం తప్ప వేరే మార్గం దొరకలేదంటూ కొందరు డ్రైవర్లు మీడియా సంస్థలతో గోడు వెళ్లబోసుకున్నారు. అమెజాన్ లోని ఉన్నతాధికారులకూ ఈ విషయం తెలుసని ఆధారాలను బయటపెట్టారు. దీంతో అమెజాన్ దిగి వచ్చింది. మార్క్ పోకన్ కు క్షమాపణలు చెబుతూ ప్రకటన విడుదల చేసింది.  ‘‘మేం చేసిన ట్వీట్ తప్పు. మా సంస్థలో చాలా మంది డ్రైవర్లున్నారు. ఫుల్ ఫిల్ మెంట్ సెంటర్ల గురించి మాట్లాడుతున్నారనుకున్నాం. దానిపైనే వివరణ ఇచ్చాం. ఫుల్ ఫిల్ మెంట్ సెంటర్లలో ఎన్నో మరుగుదొడ్లు ఉన్నాయి. ఎవరైనా ఎప్పుడైనా వాటిని వినియోగించుకోవచ్చు’’ అని అమెజాన్ తెలిపింది. అయితే డ్రైవర్ల విషయంలో మాత్రం బాటిళ్లలో మూత్రం పోస్తున్న మాట నిజమేనని తెలిపింది. చాలా మంది డ్రైవర్లు గ్రామీణ ప్రాంతాలకు వెళుతుంటారని, ఆయా చోట్ల బాత్రూంలు టైంకు అందుబాటులో ఉండకపోవడం వల్లే బాటిళ్లలో మూత్రం పోస్తున్నారని వెల్లడించింది. కరోనా సమయంలో చాలా ఓపెన్ బాత్రూంలను మూసేశారని, అదీ డ్రైవర్లు బాటిళ్లలో మూత్రం చేయడానికి కారణమవుతోందని వెల్లడించింది.  అమెజాన్ వివరణకు పోకన్ అసహనం వ్యక్తం చేశారు. క్షమాపణలు తనకెందుకుని నిట్టూర్పు విడిచారు. ‘నేను మాట్లాడేది మీ ఉద్యోగుల గురించి’ అని అన్నారు. వారికి అమెజాన్ సరైన గౌరవం ఇవ్వట్లేదని మండిపడ్డారు. పని ప్రదేశాల్లో సరైన వసతులు కల్పించాలని, ప్రతి ఒక్కరినీ సమానంగా చూడాలని, సంఘాల ఏర్పాటుకు సహకరించాలని అమెజాన్ కు సూచించారు.

కరోనాతో ఒక్క రోజే 500 మరణాలు

దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజు రోజుకు వేగంగా విస్తరిస్తూ పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా అంతటా చుట్టేస్తోంది మహమ్మారి. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజు వారీ కరోనా కేసుల్లో .. గతంలో కంటే ఎక్కువ కేసులు వచ్చేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత సంవత్సరం చివరి త్రైమాసికంలో ఒక రోజులో 98 వేల కొత్త కరోనా కేసులు వచ్చిన తరువాత, తిరిగి ఐదు మాసాల తరువాత ఆ స్థాయిలో కొత్త కేసులు వచ్చాయి.  శనివారం నాడు ఏకంగా 93,077 కేసులు వచ్చాయి. ఇదే సమయంలో నాలుగు నెలల తారువాత మరణాల సంఖ్య 500ను తాకింది.  ప్రపంచ దేశాల్లో  అన్ని దేశాల కన్నా, ఇండియాలో  ఇప్పుడు కరోనా కేసులు అధికంగా వస్తున్నాయి. యూఎస్ లో 70,024, బ్రెజిల్ లో 69,692 కేసులు రాగా, వాటికి మించిన కేసులు ఇండియాలో నమోదయ్యాయి. ఇక వారం రోజుల సరాసరిని తీసుకున్నా మిగతా దేశాల కన్నా ఇండియా ముందుంది. ఈ నేపథ్యంలో కరోనా కేసుల విషయంలో ఇండియా తొలి స్థానానికి చేరుకుంటుందని, ఈలోగానే నియంత్రణా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆరోగ్య రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇండియాలో అక్టోబర్ లో వారం సరాసరిని మించిన కేసులు ఇప్పుడు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.మరో వారం, పది రోజుల వ్యవధిలోనే కొత్త కేసుల సంఖ్య ఆల్ టైమ్ రికార్డును దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. అన్ని రాష్ట్రాలూ జాగ్రాత్తగా ఉండి కరోనాను నియంత్రించే చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది.  గత సంవత్సరం సెప్టెంబర్ 19 తరువాత నిన్న అత్యధిక కేసులు వచ్చాయి. అంతకుముందు సెప్టెంబర్ 17న 98,795 కొత్త కేసులు రాగా, ఇప్పటివరకూ అదే రోజువారీ రికార్డు. మరణాల విషయానికి వస్తే, డిసెంబర్ 4న 514 మంది కరోనాతో మరణించగా, శనివారం 500 మంది కన్నుమూశారు. కొత్త కేసుల్లో సగానికి పైగా ఒక్క మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. మహారాష్ట్రలో శనివారం నాడు 49,447 కేసులు వచ్చాయి. మహారాష్ట్రతో పాటు హర్యానా, బెంగాల్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్ రాష్ట్రాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి.  

వైసీపీ గుండాల పార్టీ!  

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశ్వరూపం చూపించారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. వైసీపీ గుండాల పార్టీ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. 151 మంది ఎమ్మెల్యేల బలం ఉండొచ్చు కానీ.. సంపూర్ణమైన బలం కాదని... అందరూ ఓటు వేయలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు పవన్. ఏపీలో శాంతి భద్రతలు దారుణంగా ఉన్నాయని  విమర్శించారు. ప్రతి ఎమ్మెల్యే ఓ గుండాలా మాట్లాడుతున్నారు.. మీరు ఎమ్మెల్యేలా? గుండాలా.? 151 మంది ఎమ్మెల్యేలు గుండాగిరి చేస్తున్నారు.. చాలా ఆలోచించే రాజకీయాల్లోకి వచ్చా. తల తెగిపోవాలి తప్ప.. వెనకడుగు పడదు అని పవన్ చెప్పారు. అందరూ పన్నులు కడితే... ఖజానాకు వచ్చిన డబ్బును పంచుకుంటూ పోతున్నారని విమర్శించారు.   చదువుల తల్లికి నిలయమైన రాయలసీమను ఫ్యాక్షనిజానికి మారుపేరుగా మార్చారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాపోయారు.సరస్వతీ నిలయం లాంటి సీమను ఫ్యాక్షనిజానికి, రౌడీయిజానికి మారు పేరు చేశారు. సగటు భారతీయుడిగా రగిలిపోతున్నా. ఎట్రాసిటీ కేసులు పెడుతున్నారు.. బాంబులు వేస్తున్నారు. ఇది కొత్తతరం.. నవతరం.. ప్యాక్షన్ గుండాగాళ్లకు భయపడే వ్యక్తిని కాదు. మా జన సైనికులు అసలే కాదు. బీజేపీ నాయకులు అంతకన్నా కాదు. చొక్కాలు పట్టుకుని నడిరోడ్డుపైకి లాగుతాం. మర్యాదగా ఉండండి జనసేనాని  హెచ్చరించారు.   అన్నమయ్య, వేమారెడ్డి, కృష్ణదేవరాయలు నడయాడిన నేల రాయలసీమ అన్నారు పవన్. ఒక్కొక్కరూ ఒక్కో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలా పోరాడాలన్నారు.  ఆత్మగౌరవం లేని బతుకులు ఎందుకు? భయపడితే చచ్చిపోతాం.. మహాకవి శ్రీశ్రీ అన్నట్టు పోరాడితే పోయేదేమి లేదు.. బానిస సంకెళ్లు తప్ప అంటూ ఉద్వేగ ప్రసంగం చేశారు. సినిమాలలోకి వెళ్లానంటూ తనను విమర్శిస్తున్న వారిలా తనకు  సిమెంట్ ఫ్యాక్టరీలు, పేకాట క్లబ్బులు లేవని చెప్పారు. రాజకీయ నాయకులకు డబ్బులు ఎలా వస్తాయి? వైసీపీ ఎమ్మెల్యేలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఓటుకు రూ.2000 ఎక్కడి నుంచి వస్తున్నాయని పవన్ ప్రశ్నించారు.

వైసీపీ దుకాణం బంద్! 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పురుడు పోసుకుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వేరు వేరు కమిటీలను ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ.. తెలంగాణలో మాత్రం దుకాణం ఎత్తేసేలా ఉంది. తెలంగాణ వైసీపీ అధ్యక్షుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణలో వైసీపీని విస్తరించే ఆలోచన లేదని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో  పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు గట్టు ప్రకటించారు.  తాను త్వరలో జాతీయ పార్టీలో చేరబోతున్నానని చెప్పారు. తెలంగాణ వైసీపీలో కీలక నేతలుగా ఉన్న కొండా రాఘవరెడ్డి. పిట్టల రాంరెడ్డి ఇప్పటికే  వైఎస్ షర్మిల పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. జిల్లాల్లో ఉన్న వైసీపీ నేతలు కూడా ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారు. ముఖ్య నేతలంతా వెళ్లిపోవడంతో వైసీపీ  తెలంగాణ‌లో జెండా పీకేసేలా క‌నిపిస్తోంది.  తెలంగాణ రాష్ట్రంలో 2014 ఎన్నిక‌ల్లో ఖమ్మం ఎంపీ సీటుతో పాటు మూడు ఎమ్మెల్యే స్థానాల‌ను వైసీపీ గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు బీ టీమ్‌గా మారిపోయింది. ఏపీలో ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలోనే తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు వ్య‌తిరేకంగా ఏ ఒక్క కార్య‌క్ర‌మం కూడా చేయ‌లేదు. 2019లో ఏపీలో జ‌గ‌న్ అధికారంలోకొచ్చాక‌... తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో అత్యంత స‌న్నిహిత సంబంధాల‌ను కొన‌సాగించ‌డం మొద‌లుపెట్టారు. ఇక్క‌డ ఏమైనా పార్టీ త‌రుపున కార్య‌క్ర‌మాలు చేసినా అది గులాబీ బాస్‌కు అడ్డుగా ఉంటుంద‌న్న సాకుతో జ‌గ‌న్, పార్టీని పూర్తిగా నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలున్నాయి. తెలంగాణ‌లో  పార్టీ యాక్టివ్‌గా ఉండ‌ద‌ని, పార్టీ పేరుతో కార్య‌క్ర‌మాలు చేయ‌డం వృథా అని... ఎక్క‌డైనా అవ‌కాశాలు ఉంటే చూసుకొండంటూ గ‌త ఏడాదిగా తెలంగాణ వైసీపీ క్యాడ‌ర్‌కు ప్రభుత్వ సలహాదారు స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి, జ‌గ‌న్ చెప్పిన‌ట్లు స‌మాచారం. తెలంగాణ నుంచి జ‌గ‌న్‌ను క‌లిసేందుకు ఏపీకి వెళ్లిన ప్ర‌తి సారి తెలంగాణ నేత‌ల‌కు జ‌గ‌న్ అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని చెబుతున్నారు. ఇక లాభం లేద‌నుకున్న వైసీపీ నేతలు త‌మ‌కు న‌చ్చిన పార్టీలోకి వెళ్లిపోయారు. తెలంగాణ‌ వైసీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు గ‌ట్టు శ్రీకాంత్‌రెడ్డి మాత్రం జగన్‌వైపే చూస్తూ ఉండిపోయారు. ఇంతకాలం వేచిచూసిన ఆయన చివరకు వైసీపీకి రాజీనామా చేశారు. బరువెక్కిన గుండెతో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.   

తెలంగాణలో కరోనా మరణాలు ఎన్ని! దాస్తున్నవి ఎన్ని !

తెలంగాణలో రెండోదశ కొవిడ్‌ రోజురోజుకూ పంజా విసురుతోంది. తొలిదశ కంటే రెండోదశలో అతివేగంగా వ్యాప్తి చెందుతోంది.  అయితే కరోనా కేసులపై రాష్ట్ర వైద్యశాఖ విడుదల చేస్తున్న లెక్కలపై మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో భారీగా కేసులు వస్తున్నా... అధికారులు దాచిపెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. స్థానికంగా విడుదల చేస్తున్న రిపోర్టులలో ఎక్కువ కేసులు వస్తుండగా.. రాష్ట్ర స్థాయిలో ఇస్తున్నది మాత్రం తక్కువగా ఉంటోంది. శనివారం వెయి 38 కేసులు వచ్చినట్లు అధికారిక బులిటెన్ విడుదలైంది. అయితే అనధికారిక లెక్కల ప్రకారం 15 వందలకు పైగానే కరోనా కేసులు వచ్చాయంటున్నారు.  కరోనా మరణాలకు సంబంధించి తప్పుడు లెక్కలు ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. గాంధీ ఆసుపత్రిలో రోజురోజుకూ కరోనా మృతులు పెరిగిపోతున్నారు. గురువారం 17 మంది చనిపోగా శుక్రవారం 22 మంది కన్నుమూశారు. రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ మరణాలు నమోదవుతున్నాయని తెలుస్తోంది. మృతుల్లో అయిదేళ్ల బాలుడి నుంచి 29 ఏళ్ల యువకుడు, 90 ఏళ్ల వృద్ధుడి వరకు ఉన్నారు. గత ఏడాది కొవిడ్‌ ఉద్ధృతంగా ఉన్నప్పుడూ ఒక్క రోజులో ఇంతమంది చనిపోలేదని వైద్యులు అంటున్నారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న కొవిడ్‌ సమాచారంలో మృతుల సంఖ్య నాలుగుకు మించడం లేదు. ఇతరవ్యాధులు ఉండి మరణించిన వారిని ఈ లెక్కలో చూపడం లేదని తెలుస్తోంది.  ప్రస్తుతం కరోనాతో అస్వస్థతకు గురయ్యే వారి సంఖ్య తక్కువగానే ఉంటున్నా.. మరో అంశం మాత్రం కలవరం రేపుతోంది.  ఆసుపత్రుల్లో చేరికలు మొత్తంగా తక్కువే ఉన్నా.. చేరుతున్నవారిలో మాత్రం అత్యధికులు ఐసీయూలో చికిత్స పొందుతున్నవారే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన సమాచారం ప్రకారం.. ఒక్క గాంధీ ఆసుపత్రిలోనే 115  మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. మొత్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 255 మంది, ప్రైవేటులో 764 మంది ఐసీయూలో వెంటిలేటర్‌ చికిత్సల్లో ఉన్నారు. ఈ లెక్కన ఆసుపత్రుల్లో  వెయ్యి  మందికి పైగా వెంటిలేటర్‌ చికిత్సలు అవసరమైంది. తొలిదశతో పోల్చితే ఈ తరహాలో విషమ పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నవారు అధికంగానే ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పోల్చితే ప్రైవేటు ఆసుపత్రుల్లోని ఐసీయూల్లో పడకలు నిండిపోతున్నాయి. కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో 90 శాతానికి పైగా ఐసీయూ పడకల్లో రోగులు చికిత్స పొందుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వీరిలో 25-40 ఏళ్ల లోపు వారు కూడా దాదాపు 40 శాతానికి పైగానే ఉన్నట్లుగా వైద్యనిపుణులు చెబుతున్నారు. లక్షణాలు సోకినా 7-10 రోజుల పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, జలుబు, దగ్గు, జ్వరం పెరుగుతున్నా ఇంటి వద్దనే చికిత్స పొందడం వంటి కారణాలతో ఆరోగ్యం విషమిస్తుండగా, ఆ తర్వాత ఆసుపత్రులకు తీసుకొస్తున్నట్లుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒక్కసారి ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ తీవ్రరూపం దాల్చిన తర్వాత త్వరితగతిన వీరి ఆరోగ్యం విషమిస్తోంది. ఫలితంగా యుక్తవయస్కుల్లోనూ కొవిడ్‌ మృతులు పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కొవిడ్‌ సోకినా, లక్షణాలు కనిపిస్తున్నా చికిత్సకు జాప్యం చేసినవారిలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు కూడా ఉంటున్నారని, వీరు మరింత త్వరగా ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. ఐసీయూలో విషమ స్థితికి చేరుకున్నవారికి ఇతర అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయని, రక్తనాళాల్లో గడ్డ కట్టడం, గుండెపోటు, పక్షవాతం వంటివి ఎదురవడం, కంటి చూపు దెబ్బతినడం వంటివి కూడా ఉన్నట్లు వివరిస్తున్నారు. వైరస్‌ బాధితుల్లో ఎక్కువమందిలో పెద్దగా లక్షణాలు లేకపోయినా.. కొందరిలో మాత్రం తీవ్రంగా విరుచుకుపడడానికి కారణాలను అన్వేషించాల్సిన అవసరముందని, వైరస్‌ రూపుమార్చుకొని కొత్తరకం ఏదైనా వ్యాప్తి చెందుతుందేమోననే అంశంపై పరిశోధనలు జరగాలని నిపుణులు చెబుతున్నారు.

డ్రగ్స్ కేసులో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు వీళ్లే !

కర్ణాటక రాజధాని బెంగళూరులో  బయటపడిన  డ్రగ్ రాకెట్ తెలంగాణలో ప్రకంపణలు రేపుతోంది. తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు ఒక తెలుగు నటుడు ఉన్నట్లుగా జరుగుతున్న ప్రచారం రాజకీయ రచ్చగా మారింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ రియల్టర్ నుంచి బెంగళూరు ఎక్సైజ్ శాఖ అధికారులు స్టేట్ మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వరుస వివాదాల్లో చిక్కకున్న ఓ ఎమ్మెల్యే ఉన్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్ శివారు పరిధిలోని ఓ ఎమ్మెల్యేతో పాటు ఒక దక్షిణ తెలంగాణ, మరో ఇద్దరు ఉత్తర తెలంగాణ ఎమ్మెల్యేలు ఉన్నారని అంటున్నారు.  బెంగళూరు ఎక్సైజ్ శాఖ అధికారులు సేకరించిన సమాచారం మేరకు సినీ ప్రముఖులు ఇచ్చిన వింధులో వారు పాల్గొని డ్రగ్స్ తీసుకున్నట్లు సమాచారం. ఒక తెలంగాణ ఎమ్మెల్యే ఏకంగా నేరుగా కొకైన్ ను కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు డ్రగ్స్ కేసులో తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు నోటీసులు అందుకోనున్నారు. ఇప్పటికే పలువురు కన్నడ సినీ నిర్మాతలు, వ్యాపార వేత్తలకు విచారణకు రావాలని ఎక్సైజ్ శాఖ నోటీసులు పంపింది. తదుపరి విచారణకు హాజరు కావాలని నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చే అవకాశముంది. డ్రగ్స్ సరఫరా చేసిన ముగ్గురితో పాటు నైజీరియన్లు ఇచ్చిన సమాచారం మేరకు నోటీసులు జారీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.  బెంగళూరులో బయటపడిన డ్రగ్స్ రాకెట్ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు.. ఉద్యమకారుడినని చెప్పుకునే ఓ పెద్ద మనిషి డ్రగ్స్ రాకెట్‌లో ప్రధానంగా ఉన్నట్లుగా గుర్తించారు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే ఓ నటుడిని బెంగళూరు పోలీసులు పిలిచి ప్రశ్నించారు. అతని విచారణలో ఎమ్మెల్యేల పేర్లు బయటికి వచ్చాయని తెలుస్తోంది.  హైదరాబాద్‌లో ప్రధానంగా లింకులు కనిపిస్తుండటంతో బెంగళూరు పోలీసులు అరెస్టులకు కూడా సిద్ధమవుతున్నారు. పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నట్లుగా భావిస్తున్న ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తే.. రాజకీయంగా పెను సంచలనం కానుంది.  

రెండేళ్లయినా తేలని వివేకా కేసు! పెద్దల హస్తం ఉన్నట్టేనా?  

వైఎస్ వివేకానంద రెడ్డి... ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు... ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వయానా బాబాయ్.  వివేకా హత్య జరిగి రెండేళ్లు గడిచింది. అయినా ఇంతవరకు హత్య చేసిందెవరో తెలియలేదు. సీబీఐ విచారణ సాగుతున్నా కేసు కొలిక్కి రావడం లేదు. కీలకమైన ఈ కేసులో సీబీఐ దర్యాప్తు నత్తనడకన సాగుతుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన తండ్రి ఏపీ దివంగత సీఎంకు సోదరుడు.. ప్రస్తుత సీఎం జగన్‌కు స్వయానా బాబాయ్‌.. అయినా  న్యాయం జరగకపోతే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని.. వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. వైఎస్ వివేకానంద రెడ్డి గత సార్వత్రిక ఎన్నికలకు ముందు 2019  మార్చి 15న పులివెందులలోని తన సొంతింట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యపై అప్పట్లో ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేగింది. ఎన్నికల ముందు హత్య జరగడంతో.. టీడీపీ, వైఎస్సార్‌సీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వివేకానంద హత్యపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఐతే నాటి టీడీపీ ప్రభుత్వం మాత్రం సిట్ ఏర్పాటు చేసింది.  ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన జగన్.. తాను అధికారంలోకి వచ్చాక మాత్రం సీబీఐ అవసరం లేదన్నారు. కొత్త సిట్ ఏర్పాటు చేశారు. సిట్ అధికారులు పలువురు అనుమానితులతో పాటు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని కూడా విచారించింది. ఈ కేసుపై జగన్ ప్రభుత్వం 3 సార్లు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి విచారణ జరిపించింది. మొత్తం 1,300 మంది అనుమానితులను గుర్తించినా, అసలైన నిందితులు ఎవరేది మాత్రం తేల్చలేదు. గతంలో సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన జగన్  మాట మార్చడం.. సిట్ దర్యాప్తుపై నమ్మకం లేకపోవడంతో వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన సతీమణి సౌభాగ్యమ్మ, కూతురు సునీత హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే కేసును సీబీఐకి అప్పగించింది ఏపీ హైకోర్టు. అనంతరం రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు 2020 సెప్టెంబర్ లో పులివెందులలో ఉండి కీలక ఆధారాలను సేకరించారు.చెప్పుల వ్యాపారి మున్నాను విచారించారు.  ఆయన బ్యాంకు లాకర్ల భారీగా నగదును స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. తర్వాత ఏమైందో ఏమో కేసు విచారణ పడకేసింది. వివేకా హత్య జరిగిన రెండేళ్లు అయినా కేసులో నిందితులెవరో తేలలేదు.  వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై మొదటి నుంచి అనుమానాలే ఉన్నాయి. బాత్రూమ్‌లో ఉన్న డెడ్‌బాడీని పోలీసులు వచ్చే లోపే బెడ్‌రూమ్‌కి  తరలించడం అనుమానాస్పదంగా మారింది. వివేకా గుండెపోటుతో చనిపోయారని మొదట చెప్పారు. తర్వాత హత్యగా తేలింది. అయితే వివేకా మృతదేహాన్ని చూస్తే అది హత్య అని ఇట్టే తెలిసిపోతోంది... అయినా  హార్ట్ ఎటాక్‌గా అందరినీ ఎందుకు నమ్మించారన్నది మిస్టరీగా మారింది. పోలీసులు వచ్చి సాక్ష్యాలు సేకరించే వరకు మృతదేహాన్ని కదలించకూడదు. మరి బాత్రూమ్‌లో పడిఉన్న మృతదేహాన్ని బెడ్‌రూమ్‌లోకి ఎందుకు తీసుకెళ్లారు అన్నది అంతు చిక్కని ప్రశ్నే. బెడ్రూమ్‌లోకి తీసుకెళ్లిన తర్వాత రక్తపు మరకలను  తుడిచివేయడం, అక్కడి నుంచి ఆస్పత్రికి  తీసుకెళ్లడం అన్ని అనుమానాలకు తావిచ్చేవే.  హత్య జరిగిన రోజు ఉదయం 05.30కి పీఏ కృష్ణారెడ్డి వివేకానంద ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత 06.40కి అవినాశ్ పోలీసులకు ఫోన్ చేశాడు? వివేకానంద మరణవార్తను అవినాశ్‌కి ఎవరు చెప్పారు? పోలీసులు వచ్చే లోపే సాక్ష్యాలను ఎందుకు చెరిపివేశారు.? అన్నది అసలు ప్రశ్న.  'డ్రైవర్‌ని తొందరగా రమ్మన్నాను. కాబట్టి నన్ను చంపుతున్నాడు' అని రాసి ఉన్న లేఖ అక్కడ ఉందన్నారు.  ఈ లేఖ కూడా సాయంత్రం తెరపైకి వచ్చింది. ఉదయం నుంచి లేని లేఖ..సాయంత్రానికి ఎక్కడి నుంచి వచ్చిందన్నది తేలడం లేదు.  వివేకా హత్యకేసులో కొంత మంది అనుమానితుల పేర్లను సునీతా రెడ్డి మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అందులో సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు,  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు. అవినాష్ రెడ్డి తో పాటు అతడి కుటుంబ సభ్యులను అనుమానిస్తోంది వివేకా కుటుంబం. సీబీఐ మాత్రం వారిని పూర్తిస్థాయిలో విచారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జరిగిన వైఎస్ వివేకా రెండో వర్ధంతి కార్యక్రమానికి వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబ సభ్యులు దూరంగా ఉండటం కూడా చర్చనీయాంశంగా మారింది.  వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు కొందరు చేస్తున్నారు. తాజాగా 15 మంది అనుమానితుల జాబితాను దర్యాప్తు అధికారులకు అందజేసినట్టు సునీతా రెడ్డి వెల్లడించారు. ఆ అనుమానితుల్లో ఎంపీ అవినాశ్ రెడ్డి , భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఆదినారాయణరెడ్డిల పేర్లు ఉన్నాయి. ఈ జాబితాలో మొదటిపేరు వాచ్ మన్ రంగన్న.  ఆ తర్వాత పేరు ఎర్ర గంగిరెడ్డి.   వివేకా  హత్య జరిగిన తర్వాత ఘటన స్థలంలో మరకలు శుభ్రం చేయించింది గంగిరెడ్డేననే ఆరోపణలు ఉన్నాయి. పరమేశ్వర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలకు సంబంధించి అనేక సందేహాలున్నాయని వైఎస్ వివేకా  కూతురు చెబుతున్నారు.  తన తండ్రి హత్య కేసు విచారణ సరిగా జరగడం లేదని వివేకా కూతుకు సునీత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం ఇంకెంతకాలం వేచిచూడాలని నిలదీశారు. ఈ అన్యాయంపై పోరాటంలో తనకు అందరి సహకారం కావాలని కోరారు. ఈ హత్య గురించి వదిలేయమని తనకు చాలా మంది సలహా ఇచ్చారని.. నా మనసు మాత్రం న్యాయం కోసం పోరాడమని చెబుతోందని సునీత అంటున్నారు. హత్య కేసులో సాక్షులకు హాని జరుగుతుందేమోనని భయమేస్తోంది. నాన్న హత్య గురించి మాట్లాడేందుకు..వాస్తవం చెప్పేందుకు భయపడే పరిస్థితి నెలకొంది. నాన్న అందరితో ప్రేమగా మెలిగేవారు.. ఆయనకు శత్రువులెవరూ లేరు. ఆర్థిక పరమైన కారణాలతో హత్య జరిగి ఉంటుందని నేను అనుకోవడం లేదు. నాకు తెలిసినంత వరకు ఇది రాజకీయ హత్యే  అని సునీతారెడ్డి అన్నారు. అంటే వివేకా హత్య వెనక సంచలన విషయాలే ఉన్నాయని తెలుస్తోంది.  వివేకా హత్య జరిగి రెండేళ్లు అయినా కేసు ఇంకా ఎందుకు కొలిక్కి రావడం లేదు? కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఎవరైనా ఒత్తిడి తెస్తున్నారా? బాబాయ్ హత్య కేసును సీఎం జగన్ ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదు? ఈ ప్రశ్నలే ఇప్పుడు వైఎస్ వివేకా కుటుంబ సభ్యులు, అనుచరుల నుంచి వస్తున్నాయి. నిందితులను తేల్చకపోతే వైసీపీ సర్కార్ ను అనుమానించాల్సి వస్తుందని చెబుతున్నారు. వివేకా కేసులో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. సునీతా రెడ్డి చెబుతున్నట్లు ఆయనది రాజకీయ హత్యేనని భావించాల్సి వస్తుందని అంటున్నారు. హత్య వెనక కొందరు పెద్ద తలకాయల హస్తం ఉండటం వల్లే కేసు దర్యాప్తును నీరుగార్చుతున్నారని ఆరోపిస్తున్నారు.  

చెల్లెలి కన్నీరు అన్నకు కనిపించడం లేదా! 

తండ్రి వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం చేయాలంటూ డాక్టర్ సునీతారెడ్డి ఢిల్లీలో మొత్తుకుంటే. ఆమె ఆర్తనాదాలు సీఎం జగన్ కు వినిపించడం లేదంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. తన తండ్రిని చంపింది ఎవరో కనిపించిన ప్రతి ఒక్కరినీ అడుగుతోందని, ఆమె దీన పరిస్థితి జగన్ కు  అర్థం కావడంలేదా? ఆమె హిందీలో మాట్లాడింది, తెలుగులో మాట్లాడింది ఇంగ్లీషులో మాట్లాడింది. మా నాన్నను చంపింది ఎవరు అంటూ దీనంగా మాట్లాడిన తీరు చూస్తే కరడుగట్టిన కర్కశ హృదయాలు సైతం కరిగి నీరవ్వాల్సిందే. ఏం మీ హృదయాలు కరగడంలేదా జగన్ గారూ? నాకు తెలిసి సీఎం జగన్ కు కార్యక్రమాలు ఏవీ లేవు. తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న ఆయన  మీడియా సమావేశాన్ని చూడాలి. తెలంగాణలో రాజకీయ పార్టీ  అంటూ తిరుగుతున్న మీ సొంత చెల్లెలు షర్మిలతో మీకు సఖ్యత చెడిందని విన్నాను. మీ తల్లి గారితోనూ మీకు సరైన సంబంధాలు లేవని వింటున్నాను. కానీ నిన్న మీ మరో చెల్లెలు సునీతారెడ్డి ప్రెస్ మీట్ చూసిన తర్వాత కదిలిపోయాను.  రెండేళ్ల క్రితం పులివెందులలో జరిగిన రహస్యం అది. ఆ రహస్యం ఏంటి..? 2019 మార్చి 15న ఉదయం ఏం జరిగింది? అందరివాడు అనిపించుకున్నారు  మీ బాబాయి. ఆయన్ను చంపింది ఎవరో ఆ రహస్యాన్ని బయటికి  తీయండి  సార్. ఆ రహస్యం మీకు తెలుసని స్వయానా మీ చెల్లే అంటోంది. ఆ రహస్యం మీకు తెలుసని నాకూ కూడా తెలుసు. అందుకే మీరు సీబీఐ ఎంక్వైరీ కావాలన్నారు. పైగా మీరు ఆ రోజు దుర్మార్గమైన పని కూడా చేశారు. నాడు చంద్రబాబుపైనా ఈ వ్యవహారంలో ఆరోపణలు చేసే ప్రయత్నం చేయడం నిజం కాదా? ఆపై వెనక్కి తగ్గింది నిజం కాదా?   సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో రిట్ వేసింది మీరే ఆ తర్వాత సీబీఐ ఎంక్వైరీ వద్దన్నది కూడా మీరే. ఎందుకంటే ఆ చంపింది మీ బాబాయి ని చంపినా రహస్యం  సీబీఐకి తెలియొదనే  మీరు సీబీఐ విచారణ వద్దన్నారు. ఇప్పుడు ఈ రాజకోట రహస్యాన్ని బహిర్గతం చేయాల్సింది మీరే. అందరి చూపులు ఇప్పుడు మీపైనే ఉన్నాయి.  అసలు, నిన్న సునీతారెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే దమ్ము మీకు ఉందా? ఈ కేసులో సాక్షులను చంపేస్తున్నారు సార్... గతంలో పరిటాల రవి ఉదంతంలో సాక్షులను, ముద్దాయిలను ఎలా అంతమొందించారో ఇప్పుడూ అలాగే జరుగుతోంది సార్. ఈ కేసులో రహస్యం వెల్లడైతే ప్రభుత్వమే ఛిన్నాభిన్నమవుతుంది" అని వ్యాఖ్యానించారు.  

మేలో కేసీఆర్ కేబినెట్ ప్రక్షాళన! ఐదారుగురు మంత్రులు అవుట్ 

తెలంగాణ ప్రభుత్వంలో మార్పులు జరగనున్నాయా? కేబినెట్ ను కేసీఆర్ పునర్వ్యవస్థీకరించనున్నారా? అంటే టీఆర్ఎస్ వర్గాలు మాత్రం అవుననే అంటున్నాయి. తన మంత్రివర్గంలో కేసీఆర్ మార్పులు చేయబోతున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈసారి మాత్రం పక్కా అంటున్నారు గులాబీ లీడర్లు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ దూకుడుతో కారు పార్టీ కంగారు పడింది. అయితే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో మళ్లీ అధికార పార్టీలో జోష్ వచ్చింది. దీంతో కేబినెట్ లో మార్పులు చేసి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బలమైన టీమ్ తో వెళ్లాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారని అంటున్నారు.  ఏప్రిల్ 17న నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరుగుతుంది. మేలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనుంది.ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ నేతి విజయసాగర్, ఆకుల లలిత, కడియం శ్రీహరి, మహ్మద్ ఫరీదుద్దీన్, చీఫ్ విప్ బోడుకూడి వెంకటేశ్వర్లు కాల పరిమితి జూన్ మొదటి వారానికి ముగుస్తుంది. జూన్ 17కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పదవి కాలం ముగియనుంది. ఈ ఖాళీలను భర్తీ చేసిన వెంటనే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఖాయం అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఇందుకోసం ఇప్పటికే కేసీఆర్ కసరత్తు కూడా మొదలు పెట్టారని చెబుతున్నారు.  2018 డిసెంబర్ లో రెండో సారి అధికారం చేపట్టారు కేసీఆర్. అప్పుడు తన కేబినెట్ లో 11 మందికి చోటు కల్పించారు. 2019 సెప్టెంబర్‌లో జరిపిన విస్తరణలో... కేసీఆర్... ఆరుగురు మంత్రులను అదనంగా కేబినెట్‌లో చేర్చుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో ఖాళీలు లేవు. కొత్త వారిని తీసుకోవాలంటే కొందరిని తొలగించాల్సిందే. వేటు పడే మంత్రుల జాబితాలో మేడ్చల్ జిల్లాకు చెందిన మల్లారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మల్లారెడ్డి పనితీరు, ఆయన వస్తున్న భూదందా ఆరోపణలతో ఆయనను తప్పించడం ఖాయమంటున్నారు. మల్లారెడ్డి స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన, ఇటీవల జరిగిన నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలో రెండో సారి గెలుపొందిన పల్లా రాజేశ్వర్ రెడ్డిని తీసుకోవడం దాదాపుగా ఫైనల్ అయిందంటున్నారు. కేసీఆర్ కు పల్లా అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయనకు బెర్త్ ఖాయమని రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. కొన్ని నెలల క్రితం ఆరోపణలు ఎదుర్కొన్న కరీంనగర్ జిల్లాకు చెందిన గంగుల కమలాకర్ కు వేటు తప్పదంటున్నారు. ఆయన్ని తొలగిస్తే.. ప్రభుత్వ చీఫ్ విప్ గా ఉన్న దాస్యం వినయ్ భాస్కర్ కేబినెట్ లోకి వస్తారంటున్నారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగాల్సి ఉండటంతో.. వినయ్ భాస్కర్ కు ప్రమోషన్ ఖాయమని అంటున్నారు.  కరీంనగర్ జిల్లాకే చెందిన సీనియర్ మంత్రి ఈటల రాజేందర్ ను కూడా తప్పించవచ్చనే చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో సంచలన కామెంట్లు చేస్తూ అధినాయకత్వాన్ని ఇబ్బందుల్లో పడేస్తున్నారు రాజేందర్. దీంతో ఆయన్ను తప్పించాలని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం. ఈటలను తొలగిస్తే.. ఆయన స్థానంలో బీసీ వర్గానికి చెందిన వ్యక్తికే అవకాశం రానుంది. గ్రేటర్ కు చెందిన దానం నాగేందర్, నిజామాబాద్ జిల్లాకు చెందిన బాజిరెడ్డి గోవర్ధన్ పేర్లు వినిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాకే చెందిన మరో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు గండం ఉందంటున్నారు. కొప్పుల పనితీరుపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట. కొప్పులను తప్పిస్తే... ఖమ్మం జిల్లాకు చెందిన సండ్ర వెంకట వీరయ్యకు కేబినెట్ బెర్త్ దక్కవచ్చంటున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కూడా మంత్రి రేసులో ఉన్నారు. వీళ్లిద్దరు ప్రస్తుతం విప్ లుగా కొనసాగుతున్నారు. సండ్రను కాదనుకుంటే సుమన్, బాలరాజులో ఒకరికి మంత్రివర్గంలో చోటు ఉండే అవకాశం ఉంది.  హైదరాబాద్ స్థానంలో ఎమ్మెల్సీగా సంచలన విజయం సాధించిన పీవీ నరసింహరావు కూతురు సురభీ వాణిదేవీకి ప్రమోషన్ ఖాయమంటున్నారు. అయితే ఆమెను కేబినెట్ లోకి తీసుకుంటారా లేక మండలి చైర్మెన్ చేస్తారా అన్నది సస్పెన్స్ గా ఉందని తెలుస్తోంది. విధాన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పదవి కాలం జూన్ తో ముగియనుంది. ఆయనకు ఎమ్మెల్సీగా మరో అవకాశం ఇస్తే.. ఆయనే మండలి చైర్మెన్ గా ఉండే అవకాశం ఉంది. అప్పుడు వాణిదేవీని మండలి డిప్యూటీ చైర్మెన్ చేయవచ్చంటున్నారు. గుత్తాను కేబినెట్ లోకి తీసుకుని... సురభిని మండలి చైర్మెన్ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే గుత్తాను కేబినెట్ లోకి తీసుకుంటే.. జగదీశ్ రెడ్డి పదవికి ముప్పు రావొచ్చని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఖమ్మం మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి, జడ్జెర్ల ఎమ్మెల్సీ సీ లక్ష్మా రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ పేర్లు మంత్రివర్గ రేసులో వినిపిస్తున్నాయి.  కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆమె ఈమధ్యే నిజామాబాద్ స్థానిక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కవితను కేబినెట్ లోకి తీసుకుంటే మాత్రం... నిజామాబాద్ జిల్లాకు చెందిన వేముల ప్రశాంత్ రెడ్డికి ఉద్వాసం ఖాయమే. అయితే ప్రస్తుతం కేసీఆర్ కుటుంబం నుంచి కొడుకు కల్వకుంట్ల తారాక రామారావు , మేనల్లుడు టి.హరీశ్ రావు... కేబినెట్‌లో మంత్రులుగా సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు కవితకు కూడా ఛాన్స్ ఇస్తే... కుటుంబ పాలన అంటున్న కాంగ్రెస్ లాంటి ప్రతిపక్షాలు మరింతగా విమర్శల దాటిని పెంచే అవకాశం ఉంది. ఈ లెక్కన కవితను కేబినెట్ లోకి తీసుకోకపోవచ్చనే  అభిప్రాయం విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. 

అయ్య బాబోయ్.. గోల్డ్ స్మగ్లింగ్ ఇలాగా.. 

బంగారం తరలించడంలో స్మగ్లర్లు రోజురోజుకు కొత్త కొత్త విధానాలు ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఎవరికి అనుమానం రాకుడా ఉండేందుకు లోదుస్తులు, పురుషాంగాల్లో సైతం బంగారాన్ని దాచి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. కానీ గోల్డ్ స్మగ్లింగ్ పై నిత్యం కస్టమ్స్ అధికారులు దాడులు చేస్తున్నారు. స్మగ్లర్లు ఏ ఎత్తు వేసి దొంగ పోలీస్ ఆట ఆడిన.. ఆ ఆటను చిత్తు చేస్తున్నారు అధికారులు. వాళ్ళు ఎన్ని జిత్తులు వేసి జిమ్మిక్కులు చేసిన చివరికి అధికారుల చేతికి చిక్కుతున్నారు. తాజాగా లోదుస్తుల్లో బంగారాన్ని తరలిస్తున్న ఓ కిలాడీ లేడీ శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అధికారులకు పట్టుబడింది. షార్జా నుంచి వచ్చిన మహిళ వద్ద  548 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.  ఎయిర్‌ అరేబియా విమానం జీ–9458లో షార్జా నుంచి ఓ మహిళ శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంది. అయితే ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు చేపట్టిన కస్టమ్స్ అధికారులకు ఆ మహిళ ప్రవర్తనపై అనుమానం వచ్చింది. దీంతో ఆ మహిళను అదుపులోకి తీసుకుని క్షుణంగా తనిఖీ చేశారు.  దుస్తుల్లో దాచిన బంగారాన్ని అధికారుల బృందం ఆమెతోనే తీయించారు. మొత్తంగా ఆమె వద్ద నుంచి 48 గ్రాముల బరువు గల బంగారం స్వాధీనం చేసుకున్నామని దాని విలువ రూ.25.4 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  మరో ఘటనలో హైదరాబాద్ నుంచి విదేశాలకు కరెన్సీ తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని అధికారులు పట్టుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి షార్జా వెళ్లేందుకు వచ్చిన ఓ ప్రయాణికుడిని సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు తనిఖీ చేశారు. అతడి వద్ద నుంచి రూ. 8.4 లక్షల విలువ చేసే ఫారెన్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

పాలన లేదు.. అంతా మత ప్రచారమే! 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక హీట్ పెంచుతోంది. అన్ని పార్టీలు సవాల్ గా తీసుకోవడంతో ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి, రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభకు మద్దతుగా తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రచారం చేశారు. కపిలతీర్థంలో రోడ్ షో నిర్వహించిన రఘునందన్ రావు.. వైసీపీ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీయే ప్ర‌త్యామ్నాయ‌మ‌ని చెప్పారు.  రాజకీయ పోరాటం నుంచి టీడీపీ పక్కకు తప్పుకుందన్నారు.   తిరుప‌తి ఉప‌ ఎన్నికలో వైసీపీకి ఓట్లేసి గెలిపిస్తే పార్ల‌మెంటులో ఆ పార్టీ సంఖ్య పెరగ‌డం తప్ప రాష్ట్రంలో అభివృద్ధి ఉండదని రఘునందన్ రావు విమర్శించారు.  తిరుపతిలో అన్యమత ప్రచారాలతో పాటు అన్యమత ప్రార్థనా మందిరాలు లేకుండా చట్టం తీసుకొస్తామని చెప్పారు రఘునందన్ రావు. విగ్రహాలు ధ్వంసం చేసే వారిని గుర్తించ‌లేక‌పోవ‌డం ఏంట‌ని, టెక్నాల‌జీ ఇంత‌గా అభివృద్ధి చెందిన‌ప్ప‌టికీ నిందితుల‌ను గుర్తించ‌డంలో ఎందుకు విఫ‌ల‌మ‌వుతున్నార‌ని ప్ర‌శ్నించారు. వైసీపీ ప్ర‌భుత్వ పాల‌న అంశాన్ని ప‌ట్టించుకోకుండా మతప్రచారం చేసుకుంటోందని రఘునందన్ రావు ఆరోపించారు.హిందూ వ్యతిరక శక్తులకు తిరుపతి ఓటర్లు గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపిచ్చారు. 

ఫోన్ మాట్లాడుతూ.. ఒక్కరికే రెండు కరోనా టీకాలు.. 

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపధ్యంలో పలుచోట్ల వ్యాక్సినేషన్‌లో పొరపాట్లు. ఎఎన్ఎం చేసిన నిర్వాహకం.  ఒక మహిళకి రెండు సార్లు టీకాలు.మోడల్ పీహెచ్సీ‌లో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. కమలేష్ దేవి అనే మహిళ కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆసుపత్రికి వచ్చింది. అయితే ఆమెకు వ్యాక్సిన్ ఇచ్చిన నర్సు ఫోనులో మాట్లాడుతూ ఆమె భుజంపై ఒకేచోట రెండుసార్లు వ్యాక్సిన్ ఇచ్చింది.  ఈ విషయాన్ని ఆ మహిళ గుర్తు చేయగానే, ఆ నర్సు పొరపాటు జరిగిందని సర్ది చెప్పింది. అయితే విషయం తెలియగానే ఆ మహిళ కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు చేశారు. ఈ విషయంపై కమలేష్ దేవి మాట్లాడుతూ తనకు వ్యాక్సిన్ ఇచ్చిన నర్సు ఫోనులో ఎవరితోనే మాట్లాడుతూ తనకు వ్యాక్సిన్ ఇచ్చిందన్నారు. తాను అక్కడే కూర్చున్నప్పటికీ తనను వెళ్లాలని చెప్పకుండా మరోమారు తనకు టీకా ఇచ్చిందన్నారు. దీంతో తాను రెండుసార్లు టీకా ఎందుకు ఇచ్చారని ప్రశ్నించగా, ఆమె కోపంతో ఊగిపోతూ వ్యాక్సిన్ వేశాక ఇంకా ఇక్కడ ఎందుకు కూర్చున్నావని ఎదురు ప్రశ్న వేసిందన్నారు. 

ప్రధాన అర్చకుడిగా మళ్లీ రమణ దీక్షితులు! టీటీడీలో మరో  వివాదం 

తిరుమల పుణ్యక్షేత్రం వివాదాలను కేంద్ర బిందువుగా మారుతోంది. టీటీడీ తీసుకున్న తాజా నిర్ణయం రిటైర్డ్ అర్చకులు, ప్రస్తుత ప్రధాన అర్చకులకు మధ్య అగాధాన్ని  రాజేసింది. రిటైర్డ్ అర్చకులకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వయో పరిమితి పేరుతో రిటైర్డ్ అయిన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ  ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రిటైర్డ్ అయిన ప్రధాన అర్చకులతో పాటు అర్చకులు విధుల్లో చేరాలంటూ ఆదేశించింది. 38118/2018 హైకోర్టు తీర్పు మేరకు నిర్ణయం తీసుకున్నట్లు  తెలిపింది.  టీటీడీ ఆదేశాలతో ప్రధాన అర్చకుడి హోదాలో రమణదీక్షితులు తిరిగి శ్రీవారి ఆలయ ప్రవేశం చేయనున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న ఆలయ ప్రధాన అర్చకులు కొనసాగడంపై సందిగ్ధత నెలకొంది.  టీటీడీలో అర్చక వివాదం ఎప్పటి నుంచో ఉంది. 1933 వరకు మహంతుల పాలనలో కొనసాగిన శ్రీవారి ఆలయ వ్యవహారాలకు చెక్ పెడుతూ..., టీటీడీని నియమించింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. పాలన మాత్రమే టీటీడీ కొనసాగించినా.. సంవత్సరాల తరబడి రామానుజ చార్యులు నిర్ధేశించిన విధంగా మిరాశీ వ్యవస్ధకు చెందిన అర్చకులు స్వామి వారికి పూజ కైంకర్యాలు నిర్వహిస్తూ వస్తున్నారు. శ్రీవారి ఆలయంలో మిరాశీ వ్యవస్థనే రద్దు చేస్తూ 1987లోని అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో మిరాశీ వంశానికి చెందిన గొల్లపల్లి, పెద్దింటి, పైడిపల్లి, తిరుపతమ్మ కుటుంబాలు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. సుదీర్ఘ వాదోపవాదాలు విన్న అత్యున్నత న్యాయస్థానం 1997 తీర్పును వెల్లడించింది. మిరాశీ వ్యవస్థను రద్దు చేస్తూ... మిరాశీ వంశీకులను అర్చకులుగా నియమించాలని టీటీడీని ఆదేశించింది. ఆ తరువాత 2007లో మిరాశీ వంశీకులు అర్చక వారసత్వం ఒక కుటుంబ నుంచి ఒకరు పొందేలా అప్పటి ఏపీ గవర్నమెంటు జీఓను విడుదల చేసింది.  2013లో వయో పరిమితి అంశాన్ని మొట్టమొదటి సారి టీటీడీ అమలు చేసింది. టీటీడీ అనుబంధ అలయాలైన తిరుచానూరు, గోవింద రాజా స్వామి ఆలయాలలోని మిరాశీ అర్చకులను పదవీ విరమణ చేయించింది టీటీడీ. మొత్తం ముగ్గురు అర్చకులు అప్పుడు పదవి విరమణ పొందారు. మిరాశీ వంశీకులు మళ్ళీ హైకోర్టును ఆశ్రయించారు. అర్చకులకు 65 సంవత్సరాల వయో పరిమితి చెల్లదని.., వారి ఒంట్లో శక్తి ఉన్నంత వరకు సంభావం లేకుండా అర్చకులుగా కొనసాగించాలని కోర్టు టీటీడీకి ఆదేశాలు జారీ చేసింది. 2015వ సంవత్సరం అర్చకులకు రిటైర్మెంట్ అనే పదమే లేదని అప్పటి ఈఓ ఎం.జి గోపాల్ తెలిపారు.అయితే 65 సంవత్సరాలు పైబడిన అర్చకులు ప్రమాదవశాత్తు ప్రధాన ఆలయంలో స్వామి వారి ఉత్సవ మూర్తులను నేలపై పడేలా చేసిన సంఘటనల దృష్ట్యా టీటీడీ మరో మారు వయో పరిమితి అంశాన్ని బోర్డులో ప్రవేశ పెట్టింది. ప్రవేశ పెట్టడం, ఆమోదం పొందడం అంత శరవేగంగా అయిపోయాయి. దీనితో గొల్లపల్లి వంశానికి చెందిన రమణ దీక్షితులతో పాటు మరో మూడు కుటుంబాలకు సంబంధించిన ప్రధాన అర్చకులకు టీటీడీ రిటైర్మెంట్ ప్రకటించింది. ఖాళీ అయిన పోస్టులను అదే కుటుంబంకు చెందిన వారిని నియమించింది. టీటీడీ నిర్ణయంపై రమణ దీక్షితులు సుప్రీమ్ కోర్టుకు వెళ్లగా.. తిరుచానూరు, గోవింద రాజా స్వామి మిరాశీ అర్చకులు హైకోర్టుని ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానంలో విచారణలో ఉండగా... హైకోర్టు మిరాశీ అర్చకులపై స్పష్టమైన తీర్పును గత సంవత్సరం డిసెంబర్ 14 తేదీన ప్రకటించింది. మిరాశీ అర్చకులు ఉద్యోగులు కాదని, వారికి టీటీడీ సర్వీసులు వర్తించవని తేల్చి చెప్పింది ధర్మాసనం. వారిని అర్చకత్వానికి అనుమతించాలని ఆదేశించింది. అయితే ఈ విషయంలోనూ టీటీడీ కోర్టులో అప్పీల్ కు వెళ్ళింది. మిరాశీ అర్చకుల పదవి విరమణ అనే అంశాన్ని రాజకీయం చేస్తూ అప్పటి అధికార పార్టిపై తీవ్ర విమర్శలు చేస్తూ రమణదీక్షితులు పావులు కదిపారు. దీంతో రమణదీక్షితులపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ వంశపార్యంపర్య వృత్తిని అర్చకత్వాని కొనసాగించేలా చేయాలని కోరారు. అందుకు సానుకూలంగా స్పదించిన జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి రాగానే అర్చకుల సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు.  ఎన్నికల ఫలితాల ముందు కూడా జగన్ ను రమణ దీక్షితులు కలిశారు. సీఎం జగన్ తిరుమల పర్యటనకు వచ్చిన ప్రతిసారి రమణదీక్షితులు కలిసి తనకు న్యాయం చేయాలనీ కోరారు. అయితే రమణ దీక్షితులకు ఆగమ సలహాదారునిగా నియమించిన టీటీడీ ఆలయ గౌరవ ప్రధాన అర్చకునిగా హోదా కల్పిస్తూ 2019 నవంబర్ 6వ తేదీన ఉత్తర్వులిచ్చింది. నియమితులైన కొన్ని రోజులకే తనకు కచ్చితంగా ఆలయ ప్రధాన అర్చక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చాడు రమణ దీక్షితులు. ఇప్పుడు ప్రధాన అర్చకులుగా కొనసాగుతున్న వేణుగోపాల దీక్షితులు, కృష్ణ దీక్షితులు మరికొందరు ఆలయ అర్చకులు మార్చి మాసంలో సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఖాళీల భర్తీ కోసం అభ్యర్థించిన మిరాశీ అర్చకులు తమ మిరాశీ వంశానికి చెందిన వారికే అర్చకత్వం ఇవ్వాలని కోరగా.., పచ్చ జెండా ఊపుతూ.., టీటీడీ ఈవోకు ఆదేశాలు జారీ చేసారు సీఎం జగన్. దీన్ని గమనించిన మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి.., వైసీపీ నేతలతో చర్చలు కొసాగించారు. తనకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన నాయకులు పంచాయితిని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై టీటీడీ అధికారులతో చర్చించిన సీఎం.., రమణ దీక్షితులుకు ఆలయ ప్రధాన అర్చక పదవి ఇవ్వాలని సూచించారట. సీఎం ఉత్తర్వుల మేరకు వయోపరిమితి పేరుతో రిటైరైన అర్చకులను తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది.