24 గంటలు.. 43 లక్షల టీకాలు..
దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ప్రజలతో పాటు ప్రభుత్వాలను కూడా పెరుగెట్టిస్తోంది. ఈ తరుణంలో వైరస్ను చెక్ పెట్టే వ్యాక్సినేషన్ ప్రక్రియను స్పీడ్ పెంచింది కేంద్రం. 24 గంటల వ్యవధిలో 43 లక్షల మందికి పైగా టీకాలు అందించింది. దేశంలో టీకా పంపిణీ ప్రారంభమైన తర్వాత ఒక రోజులో ఇంత భారీ స్థాయిలో వ్యాక్సిన్లు వేయడం ఇదే తొలిసారి.
ఏప్రిల్ 5న మొత్తం 43,00,966 మంది టీకా తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో తొలి డోసు తీసుకున్నవారు 39 లక్షల మంది కాగా.. రెండో డోసు తీసుకున్నవారు 4 లక్షల మంది ఉన్నారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకాలు తీసుకున్నవారి సంఖ్య 8.3 కోట్లు దాటినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ ఉదయం 7 గంటల సమయానికి దేశంలో మొత్తంగా 8,31,10,926 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. మహారాష్ట్రలో 81 లక్షలు, గుజరాత్లో 76లక్షలు, ఉత్తర్ ప్రదేశ్లో 71 లక్షలు, పశ్చిమ బెంగాల్లో 65 లక్షల మందికి పైగా టీకా తీసుకున్నారు.
8 రాష్ట్రాల్లోనే 80 శాతం కేసులు వస్తుండగా.. మరోవైపు దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా మరో 96,982 మంది వైరస్ బారిన పడ్డారు. అయితే కొత్త కేసుల్లో 80 శాతం మహారాష్ట్రలో 47,288, ఛత్తీస్గఢ్లో 7,302, కర్ణాటకలో 5,279 కొత్త కేసులు బయటపడ్డాయి. ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, దిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్లోనూ నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
దేశంలో కొత్త కేసులు పెరుగుతుండటంతో క్రియాశీల కేసుల సంఖ్య 7 లక్షలు దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,88,223 యాక్టివ్ కేసులుండగా, క్రియాశీల రేటు 6.21 శాతంగా ఉంది. అయితే వీటిలో 57.42శాతం కేసులు కేవలం మహారాష్ట్రలోనే ఉండటం గమనార్హం. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 4.51 లక్షల క్రియాశీల కేసులున్నాయి. 13 రాష్ట్రాల్లో వైరస్ అదుపులోనే ఉండటం ఊరటనిస్తోంది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనాతో ఒక్క మరణం కూడా సంభవించలేదని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఒడిశా, అస్సాం, పుదుచ్చేరి, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, లక్షద్వీప్, మిజోరం, అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ప్రదేశ్, లద్దాఖ్, నాగాలాండ్, దాద్రానగర్ హవేలీ-డయ్యూడామన్లో సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు కరోనా మరణాలు లేవన్న సమాచారం ఊరట కలిగించిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.